Monday 23 February 2015

ప్రత్యేక హోదా దక్కకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలిక ఈ రెండు పార్టీల్ని కూడా తిరస్కరించాల్సిందే?!

     ఒక పార్టీ నిన్నటి వరకూ  తనే పోరాడి సాధించానని చెప్తూ కూడా తను అధికారంలో వున్న ఇవ్వాళ దాన్ని చట్టపరంగా అన్ని హంగులతో ఇవ్వడానికి వెనుకాడుతున్నది?మరో పార్టీ ఆ పార్టీకి మిత్రపక్షంగా వుంటూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా వుండి కూడా నత్తిగా మాట్లాడుతున్నది!యేమిటి వీళ్ళ ధీమా?!

     యెంతసేపూ కాంగ్రెసు సరిగ్గా విభజించలేదు,కాంగ్రెసు బిల్లులో పెట్టలేదు అని కాంగ్రెసు మీద పడి యేడవటమే తప్ప అంత దిక్కుమాలిన విభజనకి తెలిసి తెలిసీ తనూ సహకరించింది గదా - విభజన ఈ రకంగా జరగడంలో తన బాధ్యత కూడా వుంది గదా?!

     నిక్కచ్చిగా విభజన బిల్లు నెగ్గినప్పటి బలాబలాల లెక్క తీస్తే ఈ విభజన ఇలాగే జరగడానికి భాజపా ప్రమేయమే యెక్కువ - కాదా?!అడ్వాణీ లాంటి సీనియర్ రాజకీయ నాయకుడు ఈ రకమయిన తప్పుల తడక బిల్లుతో విభజిస్తే కాంగ్రెసుకి తప్ప అందరికీ అప్పటికే భాజపా గెలుపు ఖాయం అని తేలిపోవదంతో రేపటి రోజున అధికారంలోకి వచ్చే మన మెడకే చుట్టుకుంటుంది, ఇప్పుడు వ్యతిరేకించుదాం అనుకుని అప్పుడు తనని కలిసిన ఆంధ్రా పొలిటీషియన్లకి అదే మాట చెప్పిన వార్త అబధ్ధమా?ఇంత తప్పుల తడక బిల్లు తను సహకరించకుండా నెగ్గే అవకాశం వుందా?యెవరి చెవుల్లో పువ్వులు పెట్టాలని కుట్ర అంతా కాంగ్రెసు మీదకి తోసేస్తున్నది బాజపా!

     ఇది ఖచ్చితంగా దక్షిణాదిలో ఒక పెద్ద రాష్ట్రంగా కొరకరాని కొయ్యలా వున్న పాత ఆంధ్రప్రదేశ్ అనే రాజకీయ సాంస్కృతిక పరమయిన అన్ని అంశాల్లో బలమయిన తెలుగు రాష్ట్రాన్ని రెండు ముష్టి చిప్పలుగా మార్చి తమ స్వాభిమానం దెబ్బ తినే పరిస్థితుల్లో కూడా గట్టిగా పోరాడటానికి బలమూ ధీమా లేకుండా అడుక్కు తినటానికి అలవాటు చెయ్యటం అనే వ్యూహం తప్ప మరొకటి కాదు?!యెప్పటి నుంచో ఈ దేశంలో ఉత్తరాది లాబీ ఒకటి అనధికారికంగా కేంద్రంలో ప్రభుత్వం యేర్పాటు చెయ్యగలగడానికి ఉత్తరాదిలో పట్టు సాధించడమే కీలకం అనే పధ్ధతిని చెలామణీ చేస్తున్నది!దానికి దక్షిణాదిలో వున్న ఒకే ఒక ప్రతిస్పర్ధి ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే ననేది ఈ దేశపు పార్లమెంటరీ యెన్నికల వ్యూహాల గురించి యే కొంచెం పరిజ్ఞానం వున్నవారి కయినా అర్ధ మవుతుంది!

   దక్షిణాదిలో యెంత బలమయిన పునాది వున్నా సరే ఒక పార్టీ కేంద్రంలో యెందుకు అధికారం పొందలేకపోతున్నది?రాజకీయ నిర్ణయాలలో కానీ సామాజిక విషయాలలో కానీ ఆధ్యాత్మిక రంగంలో కానీ వుత్తరాది వారి మాటే దేశమంతటా యెందుకు చెల్లుబాటు కాగలుగుతున్నది?ఇదంతా నిజంగా అనుకోకుండానే యే వ్యూహమూ లేకుండానే జరుగుతున్నదా?

     కేసీఆర్ మొదటి నుంచీ కాంగ్రెసునే అంటకాగి ఒక్కనాడు కూడా భాజపాతో అనుకూలంగా వుండలేదు?మేము చిన్న రాష్ట్ర్రాలకి అనుకూలం, ఇప్పటికే మూడు రాష్ట్రాల్ని విగొట్టాం అని అన్నిసార్లు టముకేసుకున్నా ముడ్డికి తుడిచేశారు పై స్థాయిలో వున్న కేసీఆర్ దగ్గిర్నుంచి కింది స్థాయి వరకూ వున్న తెలంగాణా వుద్యమకారులు, అయినా భాజపా యెలాంటి షరతులూ లేకుండా తెలంగాణా డిమాండుకి పచ్చజెండా వూపేసింది!ఈ అతిపెద్ద రాష్ట్రం రెండు చిన్న ముక్కలయితే ప్రతిదానికీ కేంద్రం మీద ఆధారపడుతూ వుండటం వల్ల ఇక్కడ స్థానికంగా బలమున్నవేరే పార్టీ అధికారంలో వున్నా సరే కేంద్రం మీద వొత్తిడి పెట్టలేని స్థితిలో వుండటం తమకీ అవసరమే గాబట్టి ఆ రెండు పార్టీలూ విభజనకి ఒకరికొకరు సహకరించుకోవడం వల్లనే ఈ విభజన ఇలా తగలడిందనేది సుస్పష్టం!

    సుష్మా స్వారాజ్ ఆప్యాయంగా కేసీఆర్ దగ్గిరకెళ్ళి "ఈ చిన్నమ్మని కూడా గుర్తుంచుకోండి" అని బతిమిలాడుకోవటం ఆ పార్టీ ఆంధ్రా వైపు వుందో తెలంగాణా వైపు వుందో తెలియడం లేదా?నిన్నటి దాకా ఆంధ్రోళ్ళని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వుద్యమ స్పూర్తిగా గొప్పగా చేప్పుకుని కేవలం భూభాగాన్నే కాకుండా మనసుల్ని కూడా చీల్చిన కేసీఆర్ ఇవ్వాళ ఒక పోరంబోకు క్షమాపణతో తన పన్నేండేళ్ళ అప్రతిహతమయిన దూషణా పర్వపు పాప సముచ్చయాన్ని కడిగేసుకోగలననుకుంటున్నాడు!? యెంత ధైర్యం వీళ్ళకి? ఆంధ్రా వాళ్ళ అతి మంచితనం మీద యెంత నమ్మకం వుంది వీళ్ళలో! ఆంధ్రోళ్ళు దొంగలు,వాళ్ళు మన భూముల్ని ఆక్రమించారు,మన నీళ్లని దోచుకున్నారు అని వాగిందంతా వుద్యమంలో వాగినవీ పట్టించుకోదగినవీ కాదంటే అవి అబధ్ధాలు అని తెలియడం లేదా? వినేవాడు వెర్రివెధవయితే పంది పురాణం చెప్తుంది!ఆంధ్రావాళ్ళు అమాయకంగా వుండటం వల్లనే వీళ్ళ దుర్మార్గం అంత న్యాయపూరితమయిన వుద్యమంగా చెలామణీ అయింది?! ఇవ్వాళ తెలంగాణాలో అధికారం తనదే గదా - యే ఆంధ్రావాడు తెలంగాణాకి యెంత అన్యాయం చేశాడో సాక్ష్యాలతో సహా బయటపెడితే కాదనగలిగినవాడు యెవడయినా వున్నాడా?ఇవ్వాళ అంతా అయిపోయాక కేసీఆర్ తెలంగాణా యెదగటానికి ఆంధ్రా వాళ్ళ తోడ్పాటు కావాలి,యెవ్వర్నీ పొమ్మనేది లేదు అని తెగేసి చెప్తుంటే మిగతా వుద్యమ నాయకులు కూడా మాట్లాడటం లేదేమిటి!

     ఆంధ్రా వాళ్ళు మాత్రం కామమ్మ మొగుడంటే కామోసని వొప్పుకునే పాతకాలం వాజెమ్మాల్లా విని యే మాత్రం వ్యతిరేకించకుండా వొప్పుకుని నిజమే నిజమే మేం ద్రోహులమే అని పశ్చాత్తాపం కురిపించేశారు - గట్టిగా మీ ప్రాంతానికి మేము ద్రోహం చెయ్యడ మేంటి అని నిలబడి మాట్లాడలేని దద్దమ్మలు ప్రజా ప్రతినిధులు కావడం వల్ల గదా ఇవ్వాళ రాజధాని లేకుండా పెంచిన ఆదాయంలో చిల్లికాణీ వాటా కూడా లేకుండా లోటు బడ్జెట్ రాష్ట్రాన్ని మన మొహం మీదకి విసిరెయ్య్గలిగారు వాళ్ళు ?

     ఈ అబధ్ధీకుల వుద్యమాన్ని సమర్ధించి చూస్తూ చూస్తూ చరిత్రలో ఆంధ్రావాళ్లని తెలంగాణా వెనుకబాటుకు కారణమైన ద్రోహులుగా నిలబెట్టే కిరాతకానికి తమ వంతు సాయం తామూ చెసినట్టే గదా ఈ పార్టీలన్నీ!తప్పు చెయ్యని వాణ్ణి తప్పు చెప్పడం పంచ మహా పాతకాల్లో కల్లా నికృష్టం - అది అంత ధైర్యంగా యెట్లా చెయ్యగలిగారు వీళ్ళు?

     కాబట్టి రాష్ట్రంలో కొంచెం చదవడం రాయడం తెలిసిన ప్రతివాడు ఇవ్వాళ్టి నుంచీ నోటా పధ్ధతిని వుపయోగించుకుని అయినా సరే ఇకముందు జరగబోయే యే స్థాయి యెన్నికలోనూ ఈ రెండు పార్టీల్లో దేనికీ వోటు వెయ్యకుండా ఒక నిశ్చయం చేసుకోవాలి - తప్పదు?!

1 comment:

  1. హరిబాబు గారు,

    మీ ఆవేదన ప్రతి వాడి మనసులో వున్నదే. దానిని మీరు చక్కగా మీదైన శైలిలో చెప్పగలిగారు. కానీ కాంగ్రెస్స్,బిజెపి, తెలుగుదేశం,వైఎస్స్ ఆర్ పార్టీలన్నింటినీ బహిష్కరిస్తే మనకు మిగిలిన సరైన ప్రత్యామ్నాయం ఏమిటి? ఇప్పటికైతే కనిపించడంలేదు.

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...