Sunday 26 April 2015

హే రాజన్!నాకు బాదరాయణ ప్రగ్గడ గుర్తు కొచ్చెన్?

నేనొకప్పుడు బ్లాగుల్లోని ఒక చర్చావేదిక దగ్గిర అరిభీకరంగా వాదించి కూడా స్మశానంలో మేకు దిగ్గొట్టిన చందంగా నలభై దాటిన వాడెవడూ యెదటి వాడు యెంత హేతుబధ్ధంగా వాదించినా తను చిన్నప్పట్నించీ యేళ్ళ తరబడి యేర్పరచుకున్న అభిప్రాయాల నుంచి బయటికి రాడనే తత్వం బోధపడి మధ్య మధ్యలో శ్యామలీయం మాస్టారు ఇచ్చిన ఉచిత బోడి సలహాలు కూడా పనిచేసి నా బ్లాగులో పోష్టులకి మాత్రమే పరిమితమయిన ఇప్పుడు అక్కడక్కడా శ్యామలీయం మాస్టారు నా పధ్ధతిలో గిల్లికజాలకు దిగుతుంటే కొంచెం సరదాగానూ కొంచెం వింతగానూ అనిపిస్తున్నది?

భండారు వారి వార్తావ్యాఖ్య బ్లాగులో కొత్త తరం పెద్దా చిన్నా లేకుండా పెద్దవాళ్ళని "అరే ఒరే" అని పిలవడం గురించి ఓ పోష్టు వేశారు.పిలిచే వాళ్ళకీ పిలిపించుకునే వాళ్ళకీ చనువుంటే తప్పు లేదనీ కొన్న్ ప్రాంతాల్లో పెద్దవాళ్ళని కూడా యేకవచనంలో పిలవడం ఉందనే శ్రీకాంత్ చారి గారి వాదన కరెక్టే అయినా ఉదాహరణగా "హే రాజా" అని ఇచ్చేసరికి శ్యామలీయం మాస్టారు అసలు "హే రాజన్" అని ఉండాలంటూ మీరన్నది ఒక సంస్కృత పదానికీ తెలుగు పదానికీ సంకరం చేసిన మాట అదెట్లా కుదురుతుందనటంతో కొంచెం వాదన జరిగింది,నాకు మాత్రం ఈ "హే రాజన్" అనే మాటతో బాదరాయణ ప్రగ్గడ గుర్తుకొచ్చి ఇంకా యెవరికయినా గుర్తుకొచ్చాడా అని కామెంటు వేస్తే ఇంకొక మిత్రులు మరికొంచెం హుషారుగా కామెంటు వేశారు.దాంతో నాకు మరింత పిచ్చెక్కిపోయి యూట్యూబు గాలిస్తే కట్టింగులు లేని మొత్తం సినిమా పుణ్యాత్ములు యెవరో అప్లోడు చేసారు - దొరికింది!


ముందుగా ఈ సినిమాకి సంబంధించిన సరదా విశేషాలు కొన్ని చెప్పాలి!అన్ని సినిమాల్లోనూ భయపెట్టే రాజనాల ఇందులో సీయస్సార్ గారితో చేసిన అల్లరి యే కమెడియన్ జంటకీ తీసిపోదు.యంటీవోడు కృష్ణుడి వేషంలో కన్నా మిస్సమ్మలోకన్నా మిగతా అన్ని సినిమాల్లోకన్నా పిచ్చ స్మార్టుగా ఉంటాడు?!జగదేక వీరుడు అని పేరు పెట్టారు గదాని హీరోయిజం అదరగొట్టేటట్టు ఉండదు?తండ్రి దగ్గిర "పిలిచారా నాన్నగారూ" అని చేతులు కట్టుకు నిలబడి తన తింగరి కోరికల్ని తండ్రి ఛదామడా తిట్టేస్తుంటే కొంచెం బిక్కమొగమేసుకుని నెమ్మిదిగానే మాట్లాడే బుద్దూ లాగానూ ఆకాశం నుంచి బామ్మలా మారి దిగివచ్చిన ఆదిశక్తి కాళ్లదగ్గ్గిర భెషజాలేమీ లేకుండా కూర్చుని ఆవిడ యేం చెప్తే అది "నువ్వు యేల్తో జెప్తే నేను కాల్తో జేస్తా" నన్నట్టు ఉండే జంగ్లీ లాగానూ ఉంటుంది!రేలంగోడి రెండు చింతలూ సినిమాలో ఆడు కమెడియన్ గాబట్టి నవ్వొచ్చేలా వున్నా సీరియస్సుగా ఆలోచిస్తే యేకాలంలోనైనా మొగాడికి ఉండేవి గూడా ఆ రెండు చింతలే - తనకు తనుగా ఇష్టపడి చేసుకున్న అనుకూలవతి అయిన పెళ్ళాం మరియూ తన బతుకు చుక్కాని తన కంట్రొల్లోనే ఉండే కింగు లాంటి బతుకు తనకి దక్కేనా అని!

సినిమాలో దేవకన్యలు నలుగురూ దిక్పాలకుల కూతుళ్ళుగా చూపిస్తారు,మరయితే మనకి అష్టదిక్పాలకులు ఉన్నారుగా యెనిమిదిమంది దేవకన్యల్ని తగిలిస్తే పోయేదిగా హీరోకి(అధికస్య అధికం ధనం?) నలుగురితోనే యెందుకు సరిపెట్టేశారో అని కూడా ఒకసారి డౌటు వచ్చింది నాకు:-) అయితే మళ్ళీ నాకే సినిమాలో ఉన్న దేవకన్యల్ని దుస్తులు యెత్తుకొచ్చి వశం చేసుకోవడం అనే మెలిక చూడగానే చిన్నప్పుడు చందమామలోనో బొమ్మరిల్లులోనో బాలమిత్రలోనో చదివిన ఒక చైనా జానపద కధ గుర్తు కొచ్చేసరికి ఆ డౌటు తీరిపోయింది!అప్పట్లో చందమామ ఒక్కటే కాకుండా మిగతా రెండు కూడా పోటాపోటీ గానె ఉండేవి పిల్లల కోసం వచ్చే మాగజైన్లలో!అందులో ఒక పల్లెటూళ్ళో బలాదూరుగా తిరిగే హీరోకి ఒక చెరువు గట్టు దగ్గిర ఒక వింత దృశ్యం కనబడుతుంది,చూస్తుండగానే నాలుగు అందమైన పక్షులు యెక్కణ్ణించో యెగురుకుంటూ వచ్చి మనం చొక్కాలు విప్పినట్టు తొడుగుల్ని విప్పుకుని అందులోంచి అమ్మాయిల్లాగా బయటపడి ఇక్కడి కధలో లాగే జలకాలాటలు ఆడి మళ్ళీ ఆ తొడుగుల్ని తొడుక్కుని పక్షులుగా మారిపోవడం చూస్తాడు.దాంతో మర్మమంతా ఆ తొడుగుల్లో ఉందని అర్ధమై మరోసారి వచ్చినప్పుడు ఆ పక్షి తొడుగుల్ని కాజేస్తాడు.వాళ్ళు విధిలేక వాణ్ణి పెళ్ళి చేసుకుంటారు!తర్వాత కధ యెలా పూర్తయిందో నాకు గుర్తు లేదు గానీ అది పాతాళ భైరవికీ దీనికీ గూడా పనికొచ్చినట్టుంది!

అయితే అక్కడ హీరో పల్లెటూరివాడు గనక యెబ్బెట్టుగా లేదు గానీ బుధ్ధిమంతుడయిన ఒక రాజుగారబ్బాయి ఆడపిల్లల బట్టలు కొట్టుకొచ్చెయ్యడం లాంటి యెధవయిడియా వేస్తే జనం మెచ్చరు గాబట్టి మామ్మగారి పురమాయింపు అనే కొసరు కల్పన చేరింది.పింగళి గారి అనేకానేక కొసరు కల్పనలతో అతి చిన్న కధ కాస్తా మూడుగంటల సేపు చూసినా బోరుకొట్టనివ్వని గానాబజానాలతో హుషారు గొల్పే రంగేళీరవ్వలమొలకై కూర్చుంది!

అసలు సినిమాలెందుకు చూడాలి?సినిమాలు లేనికాలంలో జనాలు బతకలేదా?జన్మలో ఒక్క సినిమా గూడా చూడని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు గదా!మనం మాత్రం చూడకపోతే యేం?మెస్సేజిలు ఇవ్వడానికయితే టెలిగ్రాం ఇస్తే సరిపోతుందిగా మూడుగంటలు కుర్చీలో కూలేసి సినిమా యెందుకు చూపించడం అన్న పెద్దాయన మాట కరెక్టేనా?ఇట్టాంటి సందేహాలన్నీ యమా సీరియస్సుగా యెవరికయినా వొస్తే ఆ మనిషి మహా ప్రమాదకారి అని గ్రహించండి,అతనితో ఆచితూచి ముందూ వెనకా చూసుకుని వ్యవహరించండి!అర్ధరాత్రి పూట ఆ మనిషిని కలవాల్సొస్తే ఓ నలుగుర్ని తోడు తీసుక్కుని వెళ్ళేటంత గట్టి జాగ్రత్తలు తీస్కుంటే ఇంకా మంచిది?

లేకపోతే యేంటండి!ఓ రెండు మూడు గంటలు అట్లా బయటికెళ్ళి మళ్ళీ ఇట్లా కొంపకి జేరే పనికి తెగబారెడు చర్చలు అవసరమా చెప్పండి?ఈ గందరగోళంతోనే కొందరు తిండిపోతులు మంచి సినిమా విందుభోజనంలా ఉండాలనీ,కొందరు ఉషారెక్కువైనోళ్ళు మంచి సినిమా గంతులేయించాలనీ,యెర్ర మేధావిత్వం యెక్కువైనోళ్ళు మంచి సినిమాలో సామాజిక స్పృహ ఖచ్చితంగా వుండితీరాలనీ వూదరగొడుతూ అసలే టిక్కెట్ల ధర దగ్గిర్నుంచీ ఇంటర్వెల్లో పాప్కార్న్ ఖర్చులన్నీ లెక్కేసుకుని ధియేటరు కెళ్ళడానికి ధైర్యం చాలని పిరికి మేళాల్ని మరింత హడలగొట్టి సినిమా పరిశ్రమని మట్టానికి మునిగేట్టు చేస్తున్నారు గానీ నా లెక్కలో మాత్రం సినిమా హాల్లో మనం చూసిన కంటెంటు అక్కడే మర్చిపోయేట్టు గాకుండా హాలు బయట కూడా అప్పుడప్పుడూ కనబడుతూ ఉండాలి - అది జోకయితే ఆ సినిమా గుర్తొచ్చి నవ్వొస్తుంది,అది బుర్రలో లైటు వెలిగే రకం సినిమా అయితే చూసినందుకు డబల్ ధమాకా అన్నమాట!

అయ్ బాబోయ్ మాంచి వూపులో బల్లేగా వాగేశాను గానీ నన్ను బద్నాం జెయ్యాలనుకునే వోళ్ళు ఈ రీజనింగు జాగర్తగా కూడబలుక్కుని సదివి మీనింగు బోదపర్చుకుంటే నా బతుకు బస్టాండే గందా బాబులూ?!యెందుకంటారా చక్రపాణి బాబాయి గారు మెస్సేజిలు వొద్దన్నాడు గనక అది లేదు బాగానే ఉంది ఓకే!మరి హాల్లో చూసింది బయట గూడా కనపడాలన్నది ఇరవయ్యొకటో సెంచరీలో గొట్టాం ప్యాంటులేసుకుని తిరిగే మనకి జరీ బుటేదారీ అంగరఖాలు తొడుక్కుని హీరో దేవకన్యల్ని పెళ్ళాడాలనుకునే సంగతులు యెక్కడ కనబదతాయోయ్ హరిబాబూ చెప్పవయ్యా చెప్పు అని నిలదీస్తే గుడ్లు తేలెయ్యాల్సిందే గందా?

మామ్మూలుగా అయితే అంతే గానండి నా లక్కు బాగుండి మా ఆంధ్రా యూనివర్శిటీలో ఒక సరదా సీను నడిచింది సారూ - ఈ సినిమా లేకపోతే ఆ సీను అట్టా నవ్వించేది గాదు మరి!జాయినయిన మొదట్లో హాస్టలు రూములు దొరక్క డిగ్రీలో నాకు క్లాస్ మేటయ్యి ఇక్కడ సీనియర్ అయిన ఫ్రెండు రూములో సెటిలయ్యాను నేను.మిగతా వాళ్ళంతా హాస్టలు మొత్తానికి ఒకటే అయిన కామను హాలులో నేలమీద దుప్పట్లతో కాలం గడిపేస్తున్నారు.నా రూమ్మేటు స్టూడెంటు యూనియన్ పాలిటిక్సులో మాంచి జమాజెట్టీలా వెలిగిపోతున్నాడు!అతన్ని చూడ్డానికి ఒకతను వచ్చేవాడు,అతని సబ్జెక్టు గుర్తులేదు గానీ అన్ని బ్రాంచీల్లోనూ అతనికి ఫ్యాన్సు వుండేవాళ్ళు.చూట్టానికి అస్సలు బాగుండకపోయినా అంతమంది ఫ్యాన్సు వుండటానికి కారణం యెంత డ్రై టాపిక్కునయినా జోకులా మార్చగలిగిన చాతుర్యం!ఒకసారి మా గ్రూపు సీనియర్లకీ జూనియర్లకీ క్రికెట్టు పోటీ జరుగుతుంటే తనూ వచ్చాడు.మా సీనియర్లని ఉషారు చెయ్యటానికి సీనియర్ అమ్మాయిలు బ్యాటింగు కెళ్తున్న ఒక సీనియర్ అబ్బాయిని,"నువ్వే మా అశాజ్యోతివి" అనంగానే "ఆశాజ్యోతి అంటే ఫర్వాలెదు గానీ జీవనజ్యోతి అని మాత్రం అనకండి బావుండదు" అని రిటార్టు ఇచ్చేసరికి మొగుడు జీవన జ్యోతి అవుతాడు గదానే అర్ధం వెలిగి అమ్మాయిల కందరికీ బుగ్గలెర్రబడిపోయి మళ్ళీ నోరిప్పితే ఒట్టు కాస్సేపటి దాకా:-)

అసలు జోకు ఇది కాదు అతని స్పాంటేనియిటీ యే రేంజిలో ఉంటుందో శాంపిలు చెప్పాను, అసలు జోకు కూడా మా సీనియర్ అమ్మాయిల మీదే పేలింది!యానివర్సరీ ఫంక్షనులో "ఇండియన్ బ్రైడ్స్" అనే టాపిక్ తీసుకుని మొదట ఒక్కొక్క అమ్మాయి ఇండియాలో ఒక్కో ప్రాంతపు పెళ్ళికూతురు అలంకరణలో వచ్చి ఆఖర్లో అందరూ వరసగా నిలబడ్డారు.వెంఠనే కుర్చీలోంచి అమాంతం లేచి నిలబడి అచ్చు యెంటీవోడి మాదిరిగానే చేతులు బార్లా జాపి "ఓ దివ్యరమణులారా!నేటికి కనికరించినారా?" అని రాగయుక్తంగా మైకు లేకపోయినా మా అసెంబ్లీ హాల్లో చివరి వరసక్కూడా వినపడేలా పెద్ద గొంతుతో యెత్తుకునేసరికి కింద వున్న మేము ఘొల్లున నవ్వడంతో పాటూ అక్కడ స్టేజిమీద సిగ్గుపడాల్సిన పెళ్ళికూతుళ్ళు గూడా పెట్రోమాక్సు లైట్ల లెవెల్లో నవ్వేశారు - అయ్యా అదండీ ఇవ్వాళ్టి రోజుల్లో జగదేకవీరుని కధ రెలెవెన్సీ!

జనం సినిమా కని వెళ్ళినోళ్ళు సినిమా చూసి సరిపెట్టుకోకుండా పాప్కార్న్ యెందుకు నముల్తారు?దానికి చాలా తింగరి లాజిక్కులు చెప్పుకోవొచ్చు గానండి నా లెక్క ప్రకారం యేదో పోటుగాడి మల్లే అంతదూరం పోయి డాబుగా డ్రస్సు జమాయించి పోయి సుఖమైన సీటులో కూర్చోంగానే పాతకాలం రాజుల మాదిరి మేజువాణీ డ్యాన్సులు చూస్తూ ఉన్నట్టు ఫీలయిపోయి నేను సకల కళా పల్లవుణ్ణి,ఒక్కసారి బుధ్ధిగా సినిమా చూడ్డమనే ఒక్క పనేం ఖర్మ యెన్నిపన్లయినా చెయ్యగలను అని బోల్డు కాంఫిడెన్సు బలిసిపోతాదనుకుంటాను!నేను సినిమా హాల్లో లేకపోయినా నా ముందున్న  కంపుస్కూటరు మహత్యం వల్ల నాకూ ఆ రోగం అబ్బి బుధ్ధిగా సినిమా చూడనివ్వకుండా మళ్ళీ "నలుగురు దేవకన్యలే యెందుకు?నలుగురు దేవకన్యలే యెందుకు?" అనే కొశ్చెను మైండులో రీసౌండ్ ఇస్తా వుంది?అది మరీ పెరిగి పెరిగి దీన్నిట్టాగే వొదిలేస్తే ఒక్కసారి రెండుపన్లు చెయ్యడం కాడు రెంటికీ కలిపి ఒక్కసారే గుక్కపట్టి యాడవాల్సి వొచ్చేలా ఉందని పాజు నొక్కి థింకటం మొదలు పెట్టా?

థింకగా థింకగా  తట్టిన రీజను బాగానే ఉందనిపించింది - అదేమిటంటే ప్రతి మగాడికీ తన భార్యలో నాలుగు లక్షణాలు ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది,అటాంటి నాలుగు లక్షణాల్లో ఒక్కొక్కదాన్నీ ఒక్కొక్క దేవకన్యలో ఇరికించారు ఆ నాగిరెడ్డీ చక్రపాణీ పింగళీ అనే అమేధావి త్రయం!నేనే విడివిడిగా అనలైజు చేస్తా పైన సినిమా చూస్తా ఉండారేమో గందా మిమ్మల్ని మీరే ఆలోచించుకోండని ఆట్టే కష్టపెట్టకుండా!మొదట ఇంద్రుడి కూతురు దేన్ని సూచిస్తుండి - పవర్ని!ఆడంగులు నలుగురు ఒకచోట జేరితే మొదట వాళ్ళ మధ్యన రగిలే కామను సబ్జెక్తు "మా ఆయన ఇట్లా","మా ఆయన అట్లా" అనే టాపిక్కు!అదే నలుగురు మగంగులు కలిస్తే వీలున్నంత వరకూ "మా ఆవిడ ఇట్లా","మా ఆవిడ అట్లా" అనే టాపిక్కుని అవాయిడ్ చెయ్యాలని విశ్వప్రయత్నం చేస్తారు?తప్పనిసరయి వచ్చిందంటే మాత్రం "అబ్బో మా అవిడ చాలా పవరు గల మనిషి,యే మాత్రం తేడా వచ్చినా అంతే,ఇరగదీస్తుంది(అందుకే నేను బుధ్ధిగా ఉంటా?)" అనే రేంజిలో ఉంటయ్ కబుర్లు,అవునా కాదా చెప్పండి?!

వరుణ దేవుడి కూతురు అంటే వర్ష ధారాపాతం - యే త్రిషా కృష్ణనో నిత్యా మీననో భోరున యేడుస్తుంటే మగాడి కేమనిపిస్తుంది?గాఠ్ఠిగా కావిలించుకుని ఓదార్చి బోల్డు హీరోయిజం చూపించెయ్యాలనిపిస్తుంది!ఓదార్చడానికీ కావిలించుకోవటానికీ సంబంధం యేంటంటారా - మగబుధ్ధండీ మగబుధ్ధి - ఒక చెయ్యి చాలుగా చెంపల మీద చారికల్ని తుడవటానికి మరో చెయ్యి ఖాళీగా ఉంటుందిగదా నచ్చిన చోట అట్లా అట్లా నిమురుతూ మనమూ కాస్త కిట్టించుకోవొచ్చు:-) కాబట్టి అప్పుడప్పుడూ అట్లా మనం ఓదార్చటానిక్ వీలుగా అందంగా యేడుస్తూ ఉండాలి!అవతల్నించి ఆవిడ పాటికావిడ మన్ని బుట్టలో వెయ్యడానికి ప్లాను ప్రకారం చేసినా పర్లేదు, మనకి గిట్టుబాటయితే చాలు!

నాగదేవుడి కూతురు - కాటేస్తే కాలకూట విషం తలదాకా యెక్కించగలిగి పగబడితే జీవితకాలం వేధించగలిగిన మెలికలు తిరిగే మెహబూబా!కొందరు ఆడవాళ్ళ ప్రేమ కూడా పగలాగే ఉంటుంది?కొందరు ఆడవాళ్ళ పగ కూడా ప్రేమలాగే ఉంటుంది!ప్రతిదీ తనకు నచ్చినట్లుగానే ఉండాలంటారు,అన్నీ అమర్చిపెట్టి ఈ అమరికలోనే ఉదిగి పొమ్మంటారు,అప్పుడే నువ్వు నాకు నచ్చుతావంటారు.హెయిర్ స్టైల్ నుంచి బూట్ల వరకూ వాళ్ళు సెలక్టు చేసిన వాటికే మనమూ వోటు వేయాలంటారు.కుదరదన్నామో బుసబుసల హుంకారాల నుంచీ కంచానికీ మంచానికీ దూరం చేసే వరకూ యెంత క్రూరమైన శిక్షల కైనా వెనుకాడరు!ఒక వైపు నుంచే చూస్తేనో పురుషాహంకారం జాస్తిగానో ఉంటే తప్ప అన్నీ అంత పధ్ధతిగా అమర్చిపెడుతుంటే హాయిగా అనుభవించడానికి గొడవెందుకు పెదతాడు బుధ్ధిమంతుడైన మగాడు?

ఇక అగ్నిదేవుడి కూతురంటే పొగల సెగల భుగభుగల భయద సౌందర్యం!ఇదేంట్రా బాబూ పోయి పోయి కోపిష్టి తనాన్ని కూడా కోరుకుంటామా,యెందుకు నాయనా మొహం వాచేలా చివాట్లు తినడానికా అని నన్ను ఈసడించుకోబోయే ముందు ఒక్కసారి సత్యం కాస్తా మేటాస్ అయ్యి వూచలు లెక్కబెడుతున్న ఒకనాటి ఉద్యానవనాన్ని గుర్తుకు తెచ్చుకోండి!ఆ రోజుల్లో ఆయన శ్రీమతి గనక ఈయన గారు చెయ్యబోయే తప్పుడు పని ముందే తెలుసుకుని "యేందిరా నాబట్టా ఈ పాడుపని?గాచ్చారం గాండు మారి నువ్వుగాని అర్ధాంతరంగా చిప్పకూడు తినేకాడి కెళ్తే నేను గాడిదల్ని కాయాల్నా?" అని నిగ్గదీసి ఉంటే యెట్టా ఉండేది - ఇప్పటికీ జిగ్గు భగేలు మంటా ఉండేవోడు పాపం!ఆడపెత్తనం బోడిపెత్తనం అని విసుక్కుంటారు గానీ దేవుళ్ళనే తీసుకోండి వైకుంఠవాసి భక్తులు యెంత గింజుకున్నా వెంటనే పరిగెత్తకుండా ఆవిడగారు పర్మిషన్ ఇవ్వందే వీసమెత్తు వరం కూడా ఇవ్వకుండా జాగర్తగా ఉండి యెంత క్షేమంగా ఉన్నాడు,ఇంకో ఆయన కైలాస వాసి పిలిచిందే తడవు పక్కనే ఉన్నా ఉమాదేవికి ఒక్క ముక్క చెప్పకుండా ఝామ్మని వరాలిచ్చేసి యెన్నిసార్లు ఇరుక్కుపోయాడో చూడండి!ఆ భస్మాసురుడి దగ్గిరా గజాసురుడి దగ్గిరా అన్ని అవస్థలు పడుతుంటే మళ్ళీ ఆవిడగారే తమ్ముడుగార్ని బతిమాలుకుంటే ఆయన గూడా వెయ్యగూడని వేషాలన్నీ వేసి రక్షించి తీసుకురావాల్సొచ్చింది?

హమ్మయ్య!రీజనింగు బాగానే కుదిరింది గానీ "Judge not others,Judge yourself" అన్నట్టు జనాలు కూడా వాళ్ళ మాట చెబితే గానీ ఓకేనా జోకేనా అనేది తెలియదు.జనం ముందు నిలబడి యేం చెప్పినా నేను పోటుగాణ్ణి నేను యేం చెబితే అది కిక్కురుమనకుండా ఫాలో అయిపోండి అంటే సాగదు గదా!మతిలేని మాటా శృతిలేని పాటా అన్నారు అప్పటి సినిమాలు ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటంతగా బాగుండటానికి కారణం కేవలం వాళ్ళకున్న కామన్ సెన్సు మాత్రమే అంటే మీరు నమ్మగలరా? ఆ సినిమాలు తీసిన వాళ్ళు రెండు కొమ్ములూ నాలుగు భుజాలూ లాంటివేమీ లేకుండా చాలా మామూలు తెలివైనవాళ్ళు గాబట్టి ఆ సినిమాల్లో గూడా మనకా తెలివే కనిపించి ముచ్చటగా అనిపించేది,పక్కోడి గురించయినా మరి దేని గురించయినా సరిగ్గా ట్వీటడమే తెలియని కామగోపాల వర్మల నుంచి అట్లాంటి తెలివైన సినిమాల్ని యెట్లా ఆశించగలం?

ఈ సినిమాలో అచ్చం కచ్చేరీ చేసినట్టుగా కనిపించి వినిపించే శివశంకరీ...శివానందలహరి పాట ఎంత పెద్ద విజయమో సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ పాట వెనుక ఎందరు హేమాహేమీలు శ్రమపడ్డారు. పాట రచయత పింగళి నాగేంద్రరావు, స్వరకర్త పెండ్యాల, గాత్రం అందించిన ఘంటసాల, దర్శకుడు కె.వి.రెడ్డిల సమష్టి కృషి ఫలితమే శివశంకరీ పాట. ఇందరు ప్రతిభావంతులు ఈ పాటకు చిత్రిక పడితే నటరత్న నందమూరి తారకరామారావు వెండితెరపై తన నటనతో జీవంపోశాడు. దర్శకుడు కె.వి.రెడ్డి అప్పటికే సినిమాలో అన్ని పాటల రికార్డింగ్‌, చిత్రీకరణ‌ పూర్తి చేశాడు. కథకు కీలకమైన సన్నివేశానికి సంబధించిన పాట మాత్రమే మిగిలి ఉంది. కథానాయకుడు తన గానంతో గండశిలను కరిగించే సన్నివేశంలో వచ్చే పాట అది. సన్నివేశాన్ని సంగీత దర్శకుడు పెండ్యాలకు కె.వి.రెడ్డి వివరిస్తూ ‘మనం ఇప్పుడు చేయాల్సిన పాట సినిమాకు గుండెకాయ లాంటిది. సంగీతంలో తాన్‌సేన్‌, ఓంకారనాథ్‌ ఠాగూర్‌ వంటి ఎందరో ప్రయోగాలు చేశారు. అంతెందుకు. నారద, తుంబురుల మధ్య వివాదం వచ్చినప్పుడు హనుమంతుడు పాడితే శిలలు కరిగాయట. అంతటి ఎఫెక్ట్‌ మన పాటకు తీసుకురావాలి. "జగదల ప్రతాప్‌" సినిమా మన కథకు ప్రేరణ. ఒకసారి ఆ సినిమా చూసి రండి’ అన్నారు. పెండ్యాల చిన్నగా నవ్వి ‘ట్యూన్‌ మనం సొంతంగానే చేద్దాం’ అన్నారు. పింగళి వారు వెంటనే కలం పట్టి ‘శివశంకరీ శివానందలహరి’ అని రాసిచ్చారు. దానికి పెండ్యాల కూర్చిన దర్బార్‌ రాగం చివరకు ఓకే అయింది. మరుసటి రోజు పెండ్యాల పూర్తి పాట రాసిచ్చాడు. పెండ్యాల వారు పాడి వినిపించారు. పాట పూర్తయ్యే సరికి సరిగ్గా 13 నిమిషాలు పట్టింది. ఆరున్నర నిమిషాలకు పాట కుదించమని దర్శకుడు సూచించడంతో పెండ్యాల ఆ పాటను ఆరున్నర నిమిషాలకు కుదించి ఘంటసాల వెంకటేశ్వరరావుకు వినిపించాడు. ఆయన ఆనందానికి అవధులు లేవు. ఈ పాట నేను తప్పనిసరిగా పాడతాను. ఎన్ని రిహార్సల్స్‌ అయినా సరే అంటూ 15 రోజుల పాటు ఘంటసాల రిహార్సల్స్‌కు హాజరయ్యారు. అనంతరం పాట రికార్డింగ్‌ కూడా పూర్తయింది. ఇదంతా ఒక ఎత్తు అయితే పాటకు అనుగుణంగా ఎన్టీఆర్‌ చక్కటి హావభావాలు ప్రదర్శించవలసి ఉండడంతో ఆయన కూడా నాలుగు రోజుల పాటు రిహార్సల్స్‌ చేసాడు. పాట చిత్రీకరణ సెట్స్‌ మీదకు వచ్చింది. ఎన్టీఆర్‌ పాటకు అనుగుణంగా చక్కని పెదాల కదలికతో యూనిట్‌ మొత్తాన్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. వెండితెరపై ఆ పాటకు, ఎన్టీఆర్‌ అభినయ కౌశలానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం 1961లో విడుదలైంది. ఈ పాట తెలుగు ప్రేక్షకులమీద చూపిన ప్రభావానికి ఒక ఉదాహరణ.డెబ్భయ్యవ దశకంలో రేపు (సి.నరసింహారావు) అనే పేరుతో ఒక మనోవైజ్ఞానిక పత్రిక వచ్చేది.అందులో ఒక పాఠకుడు శివశంకరీ పాట వింటుంటే కలిగే అనుభూతులు వివరించాడు.అతనికి నిజంగానే దేవకన్యలు ఉన్నట్టు,సినీమా,సంగీతంతో సహా జరుగుతున్నట్టు,తను ఎన్నికష్టాలు పడైనా వారిని కలవాలని అనుభూతి చెందేవాడట.



అసలు విజయా బ్యానర్ తెర మీద అలా అలా కనపడుతూ ఉండగానే ఒక రకమైన మూడ్ వచ్చేస్తుంది!బ్యానర్ మొదట్లో చీకటిగా మొదలై క్రమంగా వెలుగు పరుచుకుంటూ క్రియాసిధ్ధి స్సత్వే భవతు అనేది పూర్తిగా కనపడినాక ఆర్చి లోపల రెపరెపలాడే హనుమద్ధ్వజం అలా కాసేపు కదిలి వెంటనే మాయమైపోతుంటేనే గొప్ప సినిమా చూడబోతున్నామన్న ఫీలింగు వచ్చేస్తుంది,అదో మ్యాజిక్!

మంచి సినిమాలు తియ్యడానికి కనీసపు కామన్ సెన్సు చాలని యెంతమందికి తెలుసు!

Friday 24 April 2015

మద్రాసు నుంచి హైదరాబాదు మీదుగా అమరావతికి చేరుకున్నారు మనవాళ్ళు!ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తారు వీళ్ళు?

    క్రీ.పూ 1వ శతాబ్దిలో ఉత్తర దక్షిణ భారతాలను రెంటినీ యేకం చేసి పరిపాలించిన మౌర్యసామ్రాజ్యం కాలవశాన బలహీన పడగా స్వతంత్రించి రాజ్యాలను యేర్పరచుకున్న వారిలో "యేకరాట్" అనే బిరుదునామం కలిగిన శ్రీముఖుడి ద్వారా స్థాపించబడిన శాతవాహన సామ్రాజ్యంలో ఇప్పటి నవ్యాంధ్ర తెలంగాణా రాష్ట్రాలకు చెందిన ప్రాంతాలను హృదయస్థానంలో వుంచుకుని అమరావతి ఒక రాజధానిగా తొలి తెలుగు సామ్రాజ్యం అవతరించింది!

     సుదీర్ఘకాలం పాటు పరాధీనతని అనుభవించిన తర్వాత ఆంగ్లేయుల నుంచి స్వతంత్రం ప్రకటించుకున్న తొలి దశాబ్దిలో తెలుగు వాళ్ళంతా ఒక రాష్ట్రంగా "ఆంధ్రప్రదేశ్" యేర్పడినా గ్రూపులు కట్టడం, ముఠా రాజకీయాలలో పైచేయి కోసం పైస్థాయిలో జరిపే పైరవీల ద్వారా పదవుల్ని సంపాదించటం,ప్రజాబలం లేనంతకాలం అలా వచ్చిన పదవులు యెక్కువకాలం నిలవకపోవటం మళ్ళీ మళ్ళీ కళ్ళముందు కనబడుతున్నా సరే ఒకడి బదులు మరొకడు స్థానాలు మారడమే తప్ప అసలు సూక్ష్మాన్ని గ్రహించకపోవటం,ప్రజలతో సంబంధం లేని అధికారం సజావుగా సాగటం కోసం తన ప్రాంతాన్ని మాత్రమే జాగ్రత్తగా చూసుకోవడం లాంటి రాజకీయాలతో కాంగ్రెసు పార్టీ ప్రాంతాల మధ్య అసమానతల్ని పెంచగా స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో కాంగ్రెసుకి గట్టిపోటీ ఇచ్చి అప్పటి మేధావుల్లో మరో ప్రపంచాన్ని సృష్తిస్తారని నమ్మకం కలిగించిన కమ్యునిష్టులు పల్లెటూళ్ళలోని అమాయక జనం పోలేరమ్మలకీ గంగానమ్మలకీ చేసినట్టు ప్రభలు కట్టి వూరేగించి గౌరవించినా తమ బలం పెంచుకోకుండా బూర్జువా పార్టీలకి పక్కతాళం వేస్తూ సైధ్ధాంతిక వ్యభిచారం చేస్తూ కాలం గడపటంతో తెలంగాణా ప్రాంతపు మేధావులు కలిసి వుండటం వల్లే నష్టపోయామని భావించి ప్రత్యేక రాష్ట్రం కోసం వుద్యమించి సాధించగా విడిపోయిన రెండు భాగాల్లో మాతృరాష్ట్రానికి క్రీ.శ2015లో అమరావతి రాజధానిగా అమిరింది!

    తొలి శాతవాహనుల్లో శ్రీముఖ శాతకర్ణి రాజ్యాన్ని స్థాపించి నిలబెట్టినా 1వ శాతకర్ణి మహా బలంతో పరాక్రమించి అన్నివైపులకీ వ్యాపించి "దక్షిణాపధపతి" అనే గొప్ప బిరుదు సంపాదించాడు.ఖారవేలుణ్ణి జయించి మగధ వరకూ వ్యాపించాడు!తూర్పున నర్మద వరకూ వ్యాపించి శకుల నుంచీ గ్రీకుల నుంచీ జరుగుతున్న దండయాత్రల్ని నిరోధించి దేశాన్ని శాంతియుతంగా నిలబెట్టాడు.రెండు అశ్వమేధాలూ ఒక రాజసూయం చేసిన ఘనుడు!

    మలి శాతవాహనుల్లో తన పూర్వీకులు పోగొట్టుకున్న భూభాగాల్ని శకుల నించి మళ్ళీ సాధించి నిలబెట్టిన క్రీ.శ 1వ శతాబ్ది నాటి గౌతమీపుత్ర శాతకర్ణి ప్రముఖుడు. బౌధ్ధులకి చెప్పుకోదగిన రీతిలో దానాలు చేసినా తను బ్రాహ్మణుడు కావటం వల్లనో యేమో "యేక బ్రాహ్మణ" అనే బిరుదును సాధించాడు!

    రాజు దైవాంశ సంభూతుడనే మూఢనమ్మకాలు లేకుండా ధర్మశాస్త్రాల కనుగుణంగా సామాజిక సాంప్రదాయాలకు విలువనిచ్చి కడుచక్కని పరిపాలన సాగించారు శాతవాహన ప్రభువులు.రాజుకు సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి ఉండేది,రాజ్యం పెద్దది కావడంతో భాగాలుగా విభజించి ప్రాంతాలకు "రాజ","మహాబోజ","మహారధి" నామాలతో అధిపతుల్ని నియమించారు.సమాజం లోని ప్రజానీకం నాలుగు తరగతులుగా వర్గీకరించబడి ఉంది - పైన చెప్పుకున్న అదిపతులు పైస్థాయిలోని ప్రభు వర్గం,దానికి కింది అంతరువుగా అమాత్యులూ మహామాత్రులూ వంటి ఉద్యోగశ్రేణులూ తమ వ్యాపారకౌశలంతో రాజ్యపు సంపద పెంచే ప్రజ్ఞ వుండి సమాజంలో మంచి పరపతి గల్గిన వణిక్ప్రముఖులూ,మూడవ అంతరువులో ఇప్పటి మధ్యతరగతి కుటుంబాలతో పోల్చదగిన వైద్యులూ కవిగాయక శిఖామణులూ రైతులూ కుమ్మర్లూ కమ్మర్లూ,అన్నిటికన్నా కింది అంతరువుల్లో ప్రధాన వృత్తులకి అనుబంధమైన వృత్తి పనివాళ్ళయిన వడ్రంగులూ జాలర్లూ వంటివాళ్ళు వుండేవాళ్ళు!స్త్రీలు విద్యావంతులు కావడమే కాకుండా యెలాంటి అభ్యంతరమూ యెదుర్కొనకుండా మతసంబంధమైన కార్యక్రమాలకి అధ్యక్షత వహించగలిగేవాళ్ళు,చిన్నవాళ్లయిన కొడుకుల కోసం రాజ్యాన్ని రక్షించి యుధ్ధాలు చేసి అశ్వమేధాలు చేసిన రాణులూ ఉన్నారు?ప్రభువులే తమని తాము "గౌతమీపుత్ర","వాసిష్ఠీపుత్ర","కౌశికీపుత్ర" అనే పేర్లని గౌరవసూచకంగా భావించారు గదా!

    వ్యవసాయం,వ్యాపారం రెంటినీ సమానంగా సంరక్షించడంతో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లిన కాలమది!వ్యాపారస్థులకీ అన్ని రకాల వృత్తుల వారికీ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంఘాలు వుండి - అవి మొత్తం ఆ వర్గానికి చెందినవారి ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉండేవి.ఇక్కడి తీరప్రాంతానికి చెందిన సుపార, కళ్యాణి వంటి ప్రముఖమైన రేవుపట్నాల ద్వారా అరేబియా,ఈజిప్టు,రోము వంటి ప్రాంతాలతో ఖండాంతర వ్యాపారం కూడా జరిగింది. పైఠాన్,నాసిక్ లాంటి మహారాష్ట్ర నగరాలు ఈ కాలంలో పెరిగినవే!ఆ రకంగా ఇవ్వాళ ప్రపంచాన్ని శాసిస్తున్న అమరికా వలె భౌతిక జీవనంలో అత్యున్నత స్థితిని అనుంభవించారు మన పూర్వీకులు.

   ఇక ఆధ్యాత్మికంగా చూస్తే స్వయంగా బ్రాహ్మణులైనా సర్వధర్మసమభావనతో ఇతర మతాల్ని కూడా ఆదరించారు - దాదాపుగా వీరి రాజ్యంలోని అందమైన గుహాలయాలన్నీ బౌధ్ధుల చైత్యాలూ విహారాలూ స్థూపాలతో నిండిపోయాయి!అసలైన అధ్భుతమూ సహిష్ణుతకి పరాకాష్ఠగా చెప్పుకోవలసిన విషయం శకులూ గ్రీకులూ కుషానుల వంటి విదేశీయుల్ని కూడా హిందూమతంలోకీ బౌధ్ధమతంలోకీ ఆహ్వానించి కలిపేసుకోవటం ఆనాడే జరిగిందంటే ఇవ్వాళ ఘర్ వాపసీ అనే చిన్న విషయానికే కొందరు హడిలి చస్తూ కొందరు గొడవలు చేస్తూ అఘోరిస్తున్నారంటే ఆనాటి మనవాళ్ళని చూసి మనం పొంగిపోకుండా ఉండలేము గదా!

    ఒకప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు ఉదయంలో విన్నవాళ్లకి శాలివాహన శకం పేరుతో సంవత్సరం చెప్పడం గుర్తుండే ఉండాలి - దాని ప్రారంభకులు శాతవాహనులే!ఇవ్వాళ క్రీ.శ అనేది యెందుకు విశ్వవ్యాప్తమైన కాలమానంగా గుర్తించబడుతున్నది?యెక్కడికి వెళ్ళినా తమ సంస్కృతి గొప్పది కావటం వల్లనే తాము గొప్పవాళ్ళమైనామనే అహంకారంతో తమవైన వాటిని అక్కడి స్థానికుల మీద రుద్దెయ్యటం వల్ల జరిగింది!మన ప్రభుత్వం అధికారికంగా ఆకాశవాణిలో వినిపించే ఆ రెండు కాలమానాల్లో శక సంవత్సరం మొత్తం భారతదేశానికి సంబంధించినదయితే శాలివాహన శకం మనం ఉన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినది.మనం కూడా నిజాయితీతో కూడిన వ్యాపారంతో సరిపెట్టుకోకుండా ఇంగ్లీషు వాళ్ళలాగే దుర్మార్గంగా వ్యాపించి ఉంటే ఇవ్వాళ ప్రపంచ మంతటా క్రీ.శ బదులుగా శాలివాహన శకం ప్రకారం సంవత్సరాల్ని చెబుతూ ఉండేవాళ్ళేమో?!ఇవ్వాళ ప్రపంచం సంగతి దేముడెరుగు మనవాళ్ళకి చెప్పడానికయినా బలవంతంగా రుద్దాల్సిందేనేమో!?ప్రాదేశికంగా ఉత్తర దక్షిణ భారతాలను కలుపుతూ ఉన్న భూమిని పరిపాలించటం వల్లనూ మౌర్యులకి చాలాకాలం పాటు విధేయులుగా వుండినందువల్లనూ ఆర్య సంస్కృతి దక్షిణానికి విస్తరించటానికీ ఆ రకంగా మొత్తం దేశమంతా సాంస్కృతికంగా యేకత్వాన్ని సాధించటానికీ శాతవాహనులే కారణమైనారు!

    రక్తం పంచుకుపుట్టిన వాళ్ళు కూడా విడిపోయేటప్పుడు ఒకరు ఇంకొకర్ని నువ్వు నాకు ఇంత ద్రోహం చేశావు గనకనే నేను విడిపోయేవరకూ వచ్చానని లేని తప్పుల్ని కూడా వెదికి తిట్టడం,ఇంతకాలం కలిసున్నామనే మొహమాటం కూడా లేకుండా మరీ ఇంత దుర్మార్గంగా తిడుతున్నారేమిటని కష్టపెట్టుకోవడం,విడిపోయాక యెవరింట్లో శుభకార్యం జరిగినా పాత గొడవలు మర్చిపోయి అందరూ కలిసిపోవడం అప్పుడూ ఇప్పుడూ అక్కడా ఇక్కడా జరగడం చూస్తూనే ఉన్నాం గనుక యెక్కువకాలం అవతలివారు ఉద్యమకాలపు విద్వేషభావాన్ని కొనసాగించకుండా సామరస్యానికి దిగివస్తారని ఆశిద్దాం. విడిపోయే వరకూ గతం  పట్ల వుండే వ్యామోహంతోనో భవిష్యత్తు పట్ల అయోమయంతోనో ఇవతలి వైపున కూడా విభజనని కొందరు వ్యతిరేకించినా విడిపోయిన ఈ కొద్ది కాలంలోనే ఒక్కసారి కళ్ళు నులుముకుని చూస్తే నవ్యాంధ్ర భవిష్యత్తు నవనవోన్మేషంగానే కనబడుతున్నది!

    ముందునుంచీ అనుకునే చేశారో అనుకోకుండా జరిగిందో మళ్ళీ రాజధానికి అమరావతి పేరుని తగిలించడంతో ఒక్కసారిగా పాతరోజుల నాటి సంగతులు గుర్తుకొచ్చి మనస్సులో మళ్ళీ అలనాటి వైభవం సాధించాలనే ఉత్సాహం వురకలేస్తున్నది!సాధించగలమా అనే సందేహం యేమాత్రం అక్కర్లేదు - ఆనాడు సాధించినది ఈనాడు యెందుకు సాధించలేము?ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రపంచ దేశాలన్నీ కలయదిరిగి వెళ్ళిన ప్రతిచోటా సాధికారికమయిన వాగ్దానాలు తీసుకున్నాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యాపార సంస్థలన్నీ యెప్పుడెప్పుడు ఆంధ్రలో పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్ని విస్తరించుదామా అని యెదురు చూస్తున్నాయి.రాజధానిని కూడా ఆదాయమార్గంగా మార్చడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధ్భుతమైన ప్రజ్ఞని చూపించాడు.అంతమంది రైతులు స్వచ్చందంగా తమ భూముల్ని ప్రభుత్వానికి అప్పగించడం చరిత్రలో ఇదే మొదటిసారి!అది చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని అసంఖ్యాక జనం నమ్మి చేసిన ప్రమాదకరమన పని,తను ప్రజల్ని మోసం గనక చేస్తే మాత్రం అదే స్థాయిలో అపకీర్తి ఖాయం!బయటి నుంచి వచ్చిన స్వామి అగ్నివేశ్,బృందా కారత్ లాంటి వాళ్ళు ఇక్కడి వాళ్ళని తలాతోకా లేని మాటల్తో రెచ్చగొట్టాలని చూసినా పూచికపుల్ల విలువ కూడా ఇవ్వకుండా మన రైతులు తమ పరిణితిని ప్రదర్శించారు!

    రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడు మొదట అడవుల్ని కొట్టి బాగుచేస్తామని వాగి అభాసుపాలయి అతని కంటె ఘనుడు అన్నట్టు శివరామకృష్ణన్ అనేవాణ్ణి పంపిస్తే అదేదో అష్టావధానంలో నిషిధ్ధాక్షరి వ్యవహారం లాగ అక్కడ వద్దు ఇక్కడ వద్దు అని చెత్త పోగేసి దొనకొండ,వినుకొండ,అనకొండ అని లిష్టు చదివి యేమీ తేల్చకుండానే అంతా తేల్చేసినట్టు పోజులు కొట్టి ఇప్పుడు తను చెప్పని చోట కడుతున్నారని యేడుపొచ్చి మల్లెలూ జొన్నలూ పేరిగే చోటును పట్టుకుని "రైస్ బౌలుని క్యాపిటల్ చెయ్యటం యేమిటి?" అని అఘోరిస్తే ఆ ముక్క పట్టుకుని ప్రజలకి తిన్నగా వోటు వెయ్యడం నేర్పిస్తే పొయ్యేదానికి  ప్రజా ప్రతినిధుల మీద లోక్ అదాలత్ అనేదాన్ని కాపలా పెట్టి అదీ చాలకపోతే మరో కాపలా పెట్టే రకం గందరగోళపు ఉద్యమంతొ కొంచెం పాప్యులారిటీ తెచ్చుకున్న అన్నా హజారే గారు కూడా ఆవేశం తెచ్చుకుని గర్జనలు చేస్తున్నాడు,యేమిటో వీళ్ళ బాధ?!

    రాష్త్ర శాసనసభకి విలువ ఇవ్వకుండా ఆర్టికిల్ 3 ద్వారా కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే విడగొట్టటం,అదీ ఒక ప్రాంతం నాయకుల మీద మరో ప్రాంతం నాయకులు వారికన్నా వేగంగా అభివృధ్ధి చెందడమే నేరమన్నట్టు అనరాని మాటలు అంటుంటే వాటికి జవాబు చెప్పుకోవడానికి చట్టసభలలో యెక్కడా అవకాశం కూడా ఇవ్వకపోవటం,ఆఖరికి మాతృ రాష్ట్రాన్ని కనీస మర్యాద కూడా ఇవ్వకుండా పదే పదే అవశేషంగా అభివర్ణించటం,మిగిలిన ముక్కనన్నా అట్లా ఉంచకుండా సీమవాసులు అడక్కపోయినా రాయల తెలంగాణా పేరుతో ఆ ప్రాంతాన్ని కూడా అప్పనంగా తెలంగాణాకే దఖలు పర్చాలని ప్రయత్నించటం,రాజధాని కట్టుకోవటానికి నికరమైన నిధులూ లోటు బడ్జెట్టును యెదుర్కోవడానికి తగ్గ యేర్పాట్లు యేవీ అధికారికంగా బిల్లులో ఉంచకపోవడం చూస్తుంటే ఈ రాష్త్ర విభజనలో తెలంగాణా అనే కొత్త రాష్ట్రాన్ని యేర్పరచడంతో పాటు ఈ మిగిలిన ఆంధ్ర ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలనే దుర్మార్గపు వ్యూహం కూడా వున్నదని నాకు అనుమానం!చెప్పుకుంటే జనం మెచ్చుకునే గొప్ప సంగతి కాదు గనక ఆ కుట్రలో పాల్గొన్నవాళ్ళు యెవరూ బయటికి చెప్పరు గనక నిర్ధారణగా చెప్పలేము గానీ అరిభీకరంగా చెలరేగిపోతున్న ఉద్యమవీరులు కూడా తెలంగాణా నడిబొడ్దునే ధరావతులు పోగొట్టుకుంటున్న కాలం నుంచీ మొదలు పెట్టి ఇస్తానని చెప్పి తొమ్మిదిన్నరేళ్ళు సాగదీసి తెలంగాణా వాళ్లనీ యేడిపించిన కాలంలో జరిగిన సంఘటనలనన్నిట్నీ కలిపి విభజన బిల్లు పార్లమెంటులో చట్టంగా రూపుదాల్చేవరకూ తేదీల వారీగా వ్యక్తుల ప్రకటనల్నీ పత్రికల వాళ్ళు కూపీలు లాగిన రహస్య సమావేశాల వివరాల్నీ అమరిస్తే చాలా తేలికగా తెలుసుకోవచ్చు గుండుగుత్తంగా తెలంగాణాకి లాభం చేకూర్చే ఉద్దేశంతో కావాలనే ఆంధ్రా రాయలసీమ ప్రాంతాల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని,యెందుకో మన మీద అంత పగ!

    మొదటినుంచీ కలిసుండటానికే ఇష్టపడుతూ రాయల తెలంగాణాని కూడా వ్యతిరేకించిన సీమ సోదరులు ఈ రాష్ట్రం మరోసారి ముక్కలవుతే చూద్దామని అనుకున్న వాళ్లని పూర్తిగా నిరాశపర్చేశారు.నవ్విన నాపచేను పండదా అన్నట్టు అన్ని పగల్నీ దాటుకుని ఆఖరికి ఆంధ్రోళ్ళు మిడిమేలపు సెంటిమెంట్లని వొదుల్చుకుని వెనకపీకుడు లేకుండా ముందుకే పరుగులు పెట్టగలిగే శుభకాలంలోకి అడుగుపెట్టారు!తొలిదశ రాజధాని పూర్తయితే చాలు ప్రభుత్వం పూర్తిగా సొంత రాష్ట్రం నుంచే నడుస్తుంది - కొత్తగా వ్యాపార పారిశ్రామిక వేత్తలతో కుదుర్చుకున్న అంగీకార పత్రాలు వాస్తవరూపం దాల్చటం అనే ముఖ్యమైన వ్యవహారాలు పొరుగు రాష్ట్రంలో యెందుకు జరగాలి?వాళ్ళిక్కడ పరిశ్రమలూ వ్యాపార సంస్థలూ స్థాపించి మనుషుల్ని తమ సొంత దేశం నుంచి తెచ్చుకోరు గాబట్టి ఇక్కడి వాళ్లకి ఉపాధి ఖాయం!పైగా శిక్షణ అంటూ ఒకటి ఉంటుంది గాబట్టి అది గట్టిగా జరిగితే మనవాళ్ళు ఇక్కడి నుంచి యెక్కడి కయినా వెళ్ళగలరు.వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోయినా అక్కడికీ ఇక్కడికీ తిరుగుతూ కులాసాగా గడిపినా ఆమేరకు సంపద పెరుగుతుంది!మరో శాతవాహన యుగం మొదలవుతుంది!


వీళ్ళు ఇంకెక్కడికీ వెళ్లరు - ప్రపంచమే వీళ్ల దగ్గిర కొస్తుంది!

Tuesday 14 April 2015

బ్రాహ్మణుణ్ణి సంస్కరించాలనే క్రైస్తవుల లక్ష్యం నుంచే బ్రాహ్మణ వాదం పుట్టింది?

     వసుధైక కుటుంబం అనే భావన కొందరు ఆశావాదుల్ని ఒకప్పుడు కొంచెం గట్టిగా సంకల్పిస్తే చాలు నిజమైపోతుందనే విధంగా ఎంతగానో మురిపించింది! ఇక యేదో ఒకనాటికి నిజం కాబోయే హెచ్చుతగ్గులు లేని ఒక సుఖసుందర భవిష్యదుజ్వల మానవజీవితం గురించి కలల్లో విహరింపజేసింది!ఇప్పటికీ కొందరికి ఆ భావన అధ్భుతంగానే అనిపిస్తుంది కాబోలు, కానీ కొందరు ప్రాక్టికాలిటీ యెక్కువగా వున్నవాళ్ళకి చాలాకాలం క్రితమే ఆ ఆశ నెరవేరడం అసంభవమని తెలిసి పోయింది!

     ఈ భూమి మీద మానవ సమూహమంతా ఒకే చోట చిక్కురొక్కురుగా పెనవేసుకుని బతకగలదా?వుండలేదు, యెందుకంటే ఈ భూమి మీద అన్ని ప్రాంతాలూ ఒక్కలాగా లేవు, జనావాసాలకి పనికిరాని యెడారులూ,పర్వతశ్రేణులూ,అగాధమయిన జలరాశులూ చాలా తక్కువగా వున్న మానవ నివాస యోగ్యమయిన భూమిని వేరు చేస్తున్నాయి.ఇది కేవలం భౌగోళికమయిన యెడబాటే కదా అనుకుంటే అంతకన్నా తెలివితక్కువ మరొకటి ఉండదు!

      తినే ఆహారం, కట్టే బట్టా, ఉండే ఇల్లూ అన్నీ తామున్న ప్రాంతంలో క్షేమంగా బతకడానికి అనువుగా వుండి తీరాలి,అక్కడి ఋతువుల మార్పుల కనుగుణంగా తమ అలవాట్లని తప్పనిసరిగా మార్చుకుంటూ ఉండాలి,ఆ జీవన విధానాని కవసరమయిన జ్ఞానాన్ని తమ తరవాతి తరం వారికి అందించాలి,లేదంటే ప్రతి తరం రెడ్డొచ్చె మొదలాడు అన్న చందాన అనాది కాలం నాటి అజ్ఞానపు దశలోనే వుండిపోతుంది!

     ఒక తరం నుంచి మరొక తరం వైపుకి ప్రవహించే జ్ఞానవాహిని యెందుకంత విలువైనదో తెలుసుకోవాలంటే పునరపి జనం పునరపి మరణం అన్నట్టు మళ్ళీ మళ్ళీ జరుగుతున్న సన్నీవేశాల్ని అతి దగ్గిర్నుంచి చూసి వాటిల్లో కనిపించే యేకత్వాన్ని చూడాలి!మనం పుట్టినప్పుడు చేతుల్లో ఇమిడిన మనల్ని చూసి మన తలిదండ్రులు యెంత అబ్బుర పడ్డారో మనల్ని యెంత బాధ్యతా యుతంగా పెంచి పెళ్ళి చేసి ఇంటివాళ్ళని చేసినట్టుగానే ఇవ్వాళ మన చేతుల్లో ఇమిడిన మన పిల్లల్ని చూసి అబ్బురపడుతున్నప్పుడు మనం కూడా అంత గొప్పగా తయారు చెయ్యాలంటే వాళ్ళు మనల్ని యెట్లా పెంచారో తెలుసుకోవాలి గదా?ఇవ్వాళ మనకొచ్చిన సమస్య చిన్నదే అయినా యెవ్వరితోనూ ఆలోచించకుండా ఉంటే భవిత భయంకరంగా కనబడి అర్ధంతరంగా జీవనప్రయాణం ముగించెయ్యాలన్నంత నిరాశ కలుగుతుంది,కానీ మనలాగే ఇదివరకే ఇలాంటి సమస్యనే ఎదుర్కుని దాన్ని తెలివిగా పరిష్కరించుకున్న అనుభవం ఇప్పుడు మనని అలాంటి తెలివితక్కువ పనులు చెయ్యకుండా కాపాడుతుంది - ఇందుకోసమే సాహిత్యం ఆవిర్భవించింది?!

     ప్రతి సమాజంలోనూ ప్రతి మనిషికి రెండు ముఖాలుంటాయి - లౌకిక ముఖం,ఆధ్యాత్మిక ముఖం!ఈ రెండూ పరస్పరాశ్రితాలు అంటే ఒక మనిషి తన ఆధ్యాత్మీక విషయాల్లో దేనిపట్ల మొగ్గు చూపుతాడో ఆ అంశం అతని లౌకిక విషయాల్లోనూ ప్రతిఫలిస్తుంది,అట్లాగే లౌకిక విషయాల్లో అతని అనుభవాలూ,భయాలూ,సంతోషాలూ అతని ఆధ్యాత్మికతని ప్రభావితం చేస్తాయి! అయితే విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు యేది యెక్కువగా రెండోదాన్ని ప్రభావితం చేస్తుందో తెలుసుకోవచ్చా?

     ఒక మనిషి తన ఇంటి గడప దాటి బజారులోకి అడుగుపెట్టేవరకు ఒంటరిగా వున్నప్పటి ఆలోచనలూ,జ్ఞాపకాలూ,ఆదర్శాలూ,అవహేళనలూ,నిరాశలూ,నిస్పృహలూ అతని ఆధ్యాత్మిక ముఖాన్ని తయారు చేస్తాయి!అయితే ఒకసారి గడప దాటి బయటి కొచ్చాక అతని సామాజిక స్థానం అతని లౌకిక ముఖాన్ని ప్రదర్శించేటందుకు రంగస్థలంగా పని చేస్తుంది!యెవరితో యేవిధంగా మాట్లాడాలి,యెవరిని స్నేహితులుగా తీసుకోవాలి,యెవరితో శతృత్వం ప్రకటించాలి అనేవన్నీ ఈ లౌకిక ముఖంతో చేస్తుంటాడు మనిషి,కానీ ఈ లౌకిక ముఖం ఆలోచనకి తావివ్వదు - అప్పటికప్పుడు యెదురయిన సన్నివేశంలో తప్పనిసరిగా యేదో ఒక విధంగా ప్రతిస్పందించాల్సి వచ్చినప్పుడు ఆలోచించటం కుదరదు గదా!సమయానికి తగు మాట తట్టినట్టయితే ఫరవాలేదు గానీ ఒక్కోసారి పూర్తిగా అతని సంస్కారానికి విరుధ్ధంగా ప్రవర్తించి ఇరుకున కూడా పడవచ్చు - అవునా?ఆ సంస్కారం అతను ఇంటిలో ఒంటరిగా ఉన్నప్పటి అతని ఆలోచనల సారం కాబట్టి మనిషి ప్రవర్తనని యెక్కువగా ఆధ్యాత్మిక ముఖమే శాసిస్తుందనేది అనుభవం మీద ప్రతి మనిషికీ తెలిసే విషయమే!

     అందువల్లనే రాజ్యం చతుర్విధ ఉపాయాలతో కూడా చెయ్యలేని పనిని పురోహిత వర్గంతో చేయిస్తుంది!రాజశాసనాన్ని తేలికగా ధిక్కరించగలిగిన వాడు కూడా దైవశాసనాన్ని ధిక్కరించటానికి భయపడతాడు?సామాజికులలో ధర్మం పాదుకొనాలంటే రాజు బలంగా వుండి తీరాలి,ప్రజలు క్రమశిక్షణ కలిగి ఉండాలి!ప్రాచీన కాలంలోనే అన్ని కాలాలలోని ప్రజలకూ పనికివచ్చే విషయాలకి సంబంధించిన అన్ని చింతనల్లోనూ ప్రముఖ స్థానంలో ఉన్న  భారత డేశపు మేధావులు రాజ్యాన్నీ సమాజాన్నీ బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్రులనే విధంగా విభజన చేస్తే ప్లాటో,అరిస్టాటిల్ లాంటి పాశ్చాత్య మేధావులు హేతువు, ధీరత్వము, ఇఛ్ఛ అనే మూడు ఉపాంగాలని రాజ్యానికి ఉండాల్సిన ముఖ్య లక్షణాలుగా వూహించారు!విభజనలు అన్ని చోట్లా ఉన్నాయంటే అది సౌలభ్యం కోసం చేసినవని అర్ధమవుతున్నది గదా,అయినా ఇక్కడివాళ్లే క్రూరంగా ఇవన్నీ చేసినట్టు ఆరోపిస్తున్న వాళ్ళు బహుశా కూపస్థ మండూకాల్లాగ ఉండిపోయి అవన్నీ చదవ లేదనుకుంటాను?!

      మనుషులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రేండు సమయాల్లో వెళతారు - విహారానికీ వ్యాపారానికీ?దేనికోసం వెళ్ళినా మనిషి అనుకోకుండా చేసే మొట్టమొదటి పని తన ప్రాంతపు జీవన విధానంతో కొత్త ప్రాంతపు జీవన విధానాన్ని పోల్చుకోవడం!అట్లా పోల్చుకున్నప్పుడు వాళ్ళకన్నా మెరుగ్గా తమలో యేదయినా వుంటే గర్వంగా ఉంటుంది,తమకన్నా వాళ్ళలో యేవైనా మెరుగైనవి ఉంటే నేర్చుకోవాలనిపిస్తుంది!అట్లా నేర్చుకుంటూ నేర్పుతూ వుండే ఆదాన ప్రదానాలే మనుషుల్ని కలుపుతాయి,ఈ ఆదాన ప్రదానాల్లో భారతీయులు యేనాడూ వెనకబడి లేరు?!ఇతర్లకి కళ్ళు బైర్లు గమ్మే స్థాయిలో మహానౌకల నిర్మాణం చేసి ప్రపంచంలోని అన్ని విపణి వీధుల్ని కలియదిరిగిన వాళ్ళకి ఆదాన ప్రదానాల గురించి తెలియదనుకోవటం మూర్ఖత్వంతో కూడిన అజ్ఞానం నుంచి పుట్టే మొండితనం మాత్రమే?!

      ఆది యందు వాక్యము పుట్టెను - అంటుంది బైబిలు సూక్తి?విశ్వాండం భళ్ళున బద్దలైతే పుట్టిన ఓంకారం అనే బీజాక్షరమే తొలి శబ్దం అంటుంది వేదం!అట్లా చెప్పిన వాళ్ళు ఇద్దరిలో యెవరూ ఆ కాలానికి వెళ్ళి చూడలేదు,వారికా అవకాశమూ లేదు,కేవలం నేను ఇక్కడి ఇప్పటికి యెక్కణ్ణించి యెట్లా వచ్చాను అనే ప్రశ్నకి వీలున్నంతవరకూ తర్కబధ్ధంగా తమకి తోచిన జవాబు చెప్పుకుని సంతృప్తి పడిపోవడమే వారు చేసిందల్లా?!మన సంకల్పంతో సంబంధం లేకుండా పుట్టుకొచ్చిన మనకి ఈ విశాల విశ్వంలో మనకన్నా యెంతో కాలం ముందే పుట్టుకొచ్చి మన కంటికి కనిపించే ప్రతిదాన్ని గురించీ సాధికారికంగా తెలుసుకోగలగటం అసంభవం!మనిషి జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి,వుండి తీరాలి?ఒక మనిషి సమస్తాన్నీ తెలుసుకోలేడు,నా నేర్చిన యంత అని యెంతో కొంత అందరికీ చెప్తే అందులోంచి యెంత అర్ధమయితే అంత ఇతర్లు మరికొంతమందికి చెప్పగా ఆ తరం మొత్తానికి పోగుపడే జ్ఞానాన్ని తర్వాతి తరానికి అందించటం మాత్రమే చెయ్యగలడు!?

      ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు తొలిసారి ఈ భూమి నుంచి వెళ్ళిన వాళ్ళు సింధు ప్రాంతం వారు కావటం వల్లనో యేమో ఆ ప్రాంతపు పేరునే అందరికీ తగిలించి పలుకుబడి కోసం రూపం మార్చి హిందువులు అని పిలిచారు.తొలినాళ్లలో భరతుడి పేరున భరతఖండం అని కొన్ని చోట్లా ఆర్యావర్తం అని కొన్నిచోట్లా వ్యవహరించబడిన ఉదాహరణలు ఉన్నాయి కాని ఆఖరికి మాత్రం హిందూ దేశం అనేది స్థిరపడిపోయింది!యేడు ఖండాలుగా సాగరంతో విడదియ్యబడిన ప్రతి భూభాగంలోనూ అనేక దేశాలూ సంస్కృతులూ ఉండగా శీతనగం విడదియ్యటం వల్ల ఆసియా ఖండంలోని ఈ ఒక్క భూభాగమే ఉపఖండం అని చెప్పదగినంతగా అనేక జాతులతో విభిన్న సంస్కృతులతో కూడి వున్నప్పటికీ అందరూ బతికి బతికించే మనస్తత్వంతో వుండటం వల్ల ఆ పేరును గొప్పగానే నిలబెట్టుకుంది!

    ఇతర్ల కన్నా యెక్కువగా చేరిన సంపద మొదట బంధువుల్లో ఈర్ష్యని పెంచుతుంది, ప్రచారం యెక్కువైతే దొంగల్ని ఆకర్షిస్తుంది - భరత ఖండం పరిస్థితీ అదే!తొలిదెబ్బ క్రీ.శ 1024లో గజిని మొహమ్మద్ సోమనాధ దేవాలయాన్ని ధ్వంసం చెయ్యడంతో పడింది,మలిదెబ్బ క్రీ.శ 1399లో కుంటి తైమూర్ డిల్లీని పడగొట్టడంతో పడింది,ఆఖరి దెబ్బ తండ్రి వైపునుంచి తైమూరు వారసత్వాన్నీ తల్లి వైపునుంచి చెంఘిజ్ ఖాన్ వారసత్వాన్నీ అందుకున్న బాబరు క్రీ,శ 1525లో కేవలం 12,000 మంది సైనికులతో వచ్చి తన ముందరివాళ్ళు చేసినట్టు సుందరమైన నగరాల్ని ధ్వంసం చేసి అపారమైన ధనరాశుల్ని కొల్లగొట్టి స్వస్థలానికి తరలించుకుపోవడానికి బదులు ఇక్కడే ఉండాలనుకుని మొగలాయి పాలనకి ఆరంభం చుట్టడంతో పడింది!ఆ తర్వాత క్రీ,శ 1612లో జహంగీరు కాలంలో సూరత్ దగ్గిర గిడ్డంగులు కట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి అనుమతి పొందటంతో ఈ దేశంలో అడుగుపెట్టి జాలితో గుడారంలో తల మాత్రమే పెట్టుకోనిస్తే యజమానినే బయటికి నెట్టిన ఒంటె లాగా క్రమంగా విస్తరించి క్రీ,శ 1947 వరకూ ఈ దేశాన్ని పీల్చి పిప్పి చెయ్యగా ప్రపంచంలోని యే జాతీ అనుభవించనంత సుదీర్ఘ కాలపు పరాధీనతని ఈ దేశప్రజలు అనుభవించి కూడా తమదైన వారసత్వంలో విలువైన వాటిని వేటినీ పోగొట్టుకోకుండా తమకి ద్రోహం చెసిన వారిని కూడా క్షమించి మిత్రభావాన్ని చూపిస్తూ నిలబడి ఉన్నారు?!

   ఈ అనంత కాలగమనంలో యెన్నో నాగరికతలు పుట్టాయి,పెరిగాయి,వైభవాన్ని చూశాయి,పతనానికి గురయ్యాయి,అంతరించి పోయాయి - ఇవ్వాళ వాటి గురించి చరిత్ర విధ్యార్ధులు చదువుకునే కధలే మిగిలాయి!చాలా తక్కువ కాలపు ప్రతికూలతలకే మేసపొటేమియా,ఈజిప్ట్,గ్రీసు నాగరికతలు ఇవ్వాళ కధావశిష్టమయినా సుమారొక 800 యేళ్ళ పాటు ఇంతటి పరాధీనతని అనుభవించిన తర్వాత కూడా సాంప్రదాయికమైన జీవన విధానం అవిఛ్చిన్నంగా కొనసాగుతూ వుండటం యెంత అద్భుతం?!ఈ దేశపు నదుల్లో పారే నీటికీ ఈ దేశపు శ్రమణులు నదీతీరాల్లో యెలుగెత్తి ధ్వనించిన ఓంకారానికీ ఈ దేశపు వనితలు వూడ్చి కళ్ళాపి జల్లిన నేలకీ ఈ దేశపు నైష్ఠికులు వ్రేల్చిన హోమాగ్నికీ ఈ దేశపు కర్షకులకు జీవనమైన నభస్సుకీ మనం సదా కృతజ్ఞులమై ఉండాలి - అవి బలంగా ఉండటం వల్లనే ఆ అద్భుతం జరిగింది!

      ఔరంగజేబు తప్ప మొఘల్ పాదుషాలు యెవ్వరూ ప్రజల రోజువారీ జీవన విధానాన్ని మూర్ఖంగా శాసించకపోవచ్చు - బాబరు,అక్బరు లాంటివాళ్ళు తిరుగుబాట్లు లేకుండా ఉంటేనే పరిపాలన సజావుగా జరుగుతుంది కాబట్టి ఉదారంగా పరిపాలించి ఉండవచ్చు!ఔరంగజేబుకు బదులు దారా షికో అధికారంలోకి వచ్చి ఉంటే యెలా ఉండేదో?కానీ ఆ కాలంలో ధ్వంసమైన హైందవ ధార్మిక క్షేత్రాల్ని కలిపి లెక్కించి మొత్తం మీద చూస్తే అంత దూరం నుంచి వచ్చి ఇక్కడి చరిత్రకి వారు నూతనంగా చేర్చినదేమిటి అని అంచనా వేస్తే అంత కష్టపడి వారిక్కడికి రాకపోయినా ఈ దేశపు సంస్కృతీ వైభవానికి యే లోటూ వుండేది కాదనిపిస్తుంది.

      కొన్ని వందల మంది తత్వవేత్తలు కొన్ని శతాబ్దాలు శ్రమించి నిర్మించిన భవంతిని కూడా ఒక గాడిద గంటలో కూల్చివెయ్యగలదన్న సామెత ప్రకారం అంత సుదీర్ఘకాలం పాటు  విదేశీయుల నుంచి దాడిని తట్టుకున్న ఈ దేశానికి అదేమి చిత్రమో స్వాతంత్ర్యానంతరం స్వదేశీయుల నుంచే కష్టాలు మొదలయినాయి!యే జాతి అయినా ఒకనాడు ప్రపంచ స్థాయిలోనే అప్రతిహతమైన వైభవాన్ని చూసి కాలవశాన దాన్ని పోగొట్టుకుని అంత సుదీర్ఘకాలం పాటు పరాధీనతని అనుభవించి తిరిగి స్వాతంత్ర్యాన్ని పొందితే తల్లి వొడిని వొదిలి కొంతకాలం గడిపి తిరిగి తల్లిని చేరినప్పటి లేగదూడ వలె తన పూర్వ వైభవాన్ని వీలయినంత తందరగా తిరిగి పొందడానికి ఉరకలు వేస్తుంది - కానీ ఇక్కడలా జరగలేదు?

    ఒపెన్ హీమర్ అనే ఆటం బాంబు తయారు చేసిన శాస్త్రజ్ఞుడు దాని ప్రయోగ సందర్భంలో తనకు కల్గిన అనుభూతిని "కాలోస్మిన్ లోకక్షయకృత్" శ్లోకంతో అనుసంధానించి వ్యాఖ్యానించిన సంస్కృతాన్ని మృతబాష అనీ దాన్ని పట్టుకు వేళ్ళాడ్డం వల్లనే మనం కాలంతో పాటు పరిగెత్తలేక వెనకబడి పోయామనీ ఇంగ్లీషులో మాట్లాడ్డం వల్లనే మిగతావాళ్ళు అంత ముందుకెళ్ళిపోయారనీ బానిస మాటలు మాట్లాడుతూ,కులభేదాలు అన్ని చోట్లా ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు దాచేసుకుని గౌరవనీయులుగా వేషాలు కడుతుంటే లోనారసి చూసి తెలుసుకోకుండా  దుష్టత్వం అంతా ఇక్కడే పోగుపడిపోయినట్టు విదేశీయుల కన్నా యెక్కువగా స్వదేశాన్ని అల్లరి పెట్టుకునే వికారపు సంస్కారం గొప్ప లౌకికాదర్శం అని భ్రమించే దివాంధాలు కొత్తగా పుట్టుకొచ్చారు?

     కార్యకారణ సంబంధం ప్రకారం ఆలోచిస్తే ఈ దుస్థితికి ప్రాచీనుల పాపమూ కొంత ఉంది,కొన్ని తప్పులు చేశారు!పరలోకం గురించి యెక్కువగా కలలు కని ఇహలోకం గురించి నిర్లక్ష్యం చేశారు.ప్రజలకి పధనిర్దేశం చెయ్యాల్సిన పరమయోగులు గుహల యందు జొచ్చి యేకాంతవాసానికి మళ్ళారు.ఒకనాడు ఉత్సాహంతో ప్రపంచమంతా చౌకళించిన వారు కాస్తా నిరాశా నిస్పృహల పొగలు కమ్మి వివేకాన్ని నశింపజేసుకుని సముద్రయానాన్ని నిషేధించుకున్నారు.పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు సోమరితనం వల్ల కలిగే దుష్ఫలితాల్లో ఒకటయిన పరస్పర హననం మొదలైంది?తొలినాళ్ళలో సమర్ధులైతే శూద్రులు కూడా రాజోచిత గౌరవాల్ని పొందటానికి తోడ్పడిన ఆదర్శవంతమైన కులవ్యవస్థ కందెన వెయ్యని ఇరుసులా బిగిసిపోయి స్వభావంలోని క్షాత్రం వల్ల రావలసిన క్షత్రియత్వమూ జ్ఞానం వల్ల రావలసిన బ్రాహ్మణ్యమూ గుణంతో పనిలేకుండా జన్మకి అంటుగట్టబడినాయి?స్వాభిమానంతో గౌరవంగా బతకడానికి అర్హత వున్నా శూద్రుడు దాసత్వానికే పరిమితం కావాలనడం నిజంగా అన్యాయమే!కానీ యెప్పటికప్పుదు ప్రాబడిన వస్త్రాల్ని విడిచినంత తేలిగ్గా గతంలోని తప్పుల్ని సవరించుకుని రెట్టించిన బలంతో పైకెగసిన గొప్ప ఆత్మవిమర్శనా పూరితమైన ప్రాతిగామి లక్షణం ఈ దేశప్రజల కున్నదని చరిత్రలో చాలాసార్లు నిరూపణ అయింది,తప్పకుండా మళ్ళీ మళ్ళీ నిరూపణ అవుతుంది!?

      హిందూత్వం అనేది ఒక జీవన విధానం!అసలుకి బయటి నుంచి తొంగి చూసిన వాళ్ళు ముందుగానే ఈ దేశానికి హిందూ దేశం అని పేరు పెట్టేసుకుని వచ్చి ఇక్కడి జీవన విధానంలోని సంక్లిష్ఠత అర్ధం కాక ప్రతి మనిషికీ కొత్తచోట కనిపించిన ప్రతిదాన్నీ తమ సొంతవాటితో పోల్చుకోవడం సహజం గనక హిందూ మతం అని పేరు పెట్టేశారు గానీ ప్రాచీనులు తాము పాటిస్తున్న దాన్ని సనాతన ధర్మం అని చెప్పుకున్నారు.నేను ఒక బ్లాగులో మొదటిసారి ఈ మాట చెప్పినప్పుడు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు.ఇప్పుడు చాలామంది సహ బ్లాగర్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, సంతోషం!అయినా ఇక్కడ మరోసారి వివరంగా చెప్తాను.ప్రపంచంలో ఉన్న చిన్నా చితకా మతాల నుంచీ అతి పెద్ద సంఖ్యలో భక్త సముదాయం గల మతాల వరకూ ఒక ప్రధాన దైవమూర్తి,ఒక పవిత్ర గ్రంధం,ఒక ప్రవక్త అనే మూడు అంశాలు ఖచ్చితంగా వుంటాయి!పుట్టుక,పెళ్ళి,చావు అనే మూడు అత్యంత ముఖ్యమైన సందర్భాలలో ఆచరించాల్సిన కర్మకాండలు తప్పనిసరిగా పాటించాల్సిన విధంగా శాసించబడి వుంటాయి!సామాజిక సంతులనం కోసం అవసరం గనక లౌకిక విషయాలయిన రెండవ శ్రేణి విషయాలు హిందువుల జీవన విధానంలోనూ వ్యవస్థీకరించబడి వున్నా మొదటి శ్రేణి విషయాలలో మాత్రం పూర్తి విభిన్నత వుంది ఈ దేశపు జీవన విధానంలో! దేవుడు లేదన్నా ఫరవాలేదు గానీ ధర్మాన్ని మాత్రం అతిక్రమించకూడదనే హెచ్చరికా,దేవుళ్ళు స్వయంగా మానవావతారం దాల్చి భూమికి దిగివచ్చినా ధర్మ తత్వ నిరూపణకే ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి వుదాహరణలుగా కనబడతాయి పరిశీలించి చూస్తే!బయటివాళ్ళకి అర్ధం కాకపోవడంలో విచిత్రం యేమీ లేదు గానీ ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళు కూడా యెందుకు అర్ధం చేసుకోలేకపోతున్నారు?

     ఈ దేశపు సామాజిక వాతవరణంలో ప్రతికూలతలు యెన్ని ఉన్నా ఇప్పుడు ఆకాశమెత్తు యెదిగి కనబడుతున్న వటవృక్షం కూడా మొలకగా వుండి భూమిని చీల్చుకుని వచ్చే తొలిదశలో సున్నితంగా వున్నట్టు యెందరో సంస్కర్తలు లోపలివారుగా వుంటూనే సహనంతో సాటివారికి గురుత్వం వహించి వైద్యుడు శస్త్రచికిత్స చేసినంత లాఘవంగా లోపాల్ని సరిదిద్ది హిందూధర్మాన్ని తలయెత్తుకు నిలబడేలా చేశారు గానీ పెరియార్ లాంటివాళ్ళు మాత్రం సిగ్గుతో తలదించుకునేలా చేశారు!"తమిళనాడులోని మొత్తం జనాభాలో బ్రాహ్మణులు 2.75శాతం ఉన్నారు,క్రిస్టియన్లు 4శాతం ఉన్నారు,ముస్లిములు 5శాతం ఉన్నారు,మళయాళీలు 8శాతం ఉన్నారు,కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు సుమారుగా 5శాతం వరకూ ఉన్నారనుకుందాం - మనం గనక వీటినన్నిట్నీ కలిపినట్లయితే తమిళనాడు  రాష్ట్ర జనాభాలో తమిళులు కానివారు 25శాతం మాత్రమే వుండినారని తెలుస్తుంది,అయినప్పటికీ ఉద్యోగాలలో 75శాతం ఈ తమిళేతరులే ఉన్నత స్థానాలలో ఉన్నారు" అనే రకంగా మాట్లాడి తమిళులలో ప్రాంతీయాభిమానాన్ని పెంచి వారి గౌరవాన్ని అపారంగా పొందాడు.ఇవ్వాళ సమాచారాన్ని హక్కుగా చేశారు గానీ ఈ అమాయకపు జనాభా లెక్కల సమాచారం యెంతపని చేసిందో చూడండి?చాలా తెలివిగా పెరియార్ బ్రాహ్మణేతర, దళితేతర,మతేతర అగ్రవర్ణాలలోని ఆర్ధికంగా వెనకబడిన వారిని బుట్టలో వేయ్యడానికి మైనార్టీ బ్రాహ్మణులు మెజార్టీ మీద పెత్తనం చేస్తున్నారు అనేది చెప్పడానికి తొలిసారిగా హిందూ సనాతన ధర్మానికి బ్రాహ్మణ మతం అనే పేరు పెట్టాడు!తను యెవరిని ఆకర్షించాలనుకున్నాడో ఆ వర్గం తప్ప మిగిలిన వర్గాల లోని ప్రజల పట్ల అతనికి ఉన్న చిన్నచూపు చూస్తే ఇట్లాంటివాణ్ణీ సజ్జనుడు అని అనగలమా అని సందేహం వస్తుంది?అంబేత్కర్ "ప్రతి సమాజంలోనూ గ్రూపులు ఉంటాయి,కానీ ఆయా గ్రూపుల మధ్య సంబంధాలు అన్నిచోట్లా ఒక్కలా ఉండవు.ఒక అసమాజంలో కొన్ని చోత్ల విభేదించి కొన్ని చోట్ల సహకరించుకోవచ్చు.కానీ ఈ దేశంలో మాత్రం అవి శాశ్వత ద్వేషంతో ఉన్నాయి" అనే సూత్రీకరణ చేసి అప్పటిదాకా తమ మీద జరిగిన దుర్మార్గాల్ని అనుభవించిన వాడు గనక మెజారిటీ దురహంకారులకి అడ్డుకట్ట వెయ్యకపోతే అప్పటికి కింద వున్న కులాలు యెప్పటికీ పైకి రాలేవని మైనార్టీ డిక్లరేషన్ ద్వారా 54.68 శాతం ఉన్న హిందువులకి 40 శాతం,28.5 శాతం ఉన్న ముస్లిములకి 32 శాతం,1.16 శాతం ఉన్న క్రిస్టియన్లకి 3 శాతం వరకూ,1.49 శాతం ఉన్న శిఖ్ఖులకి 4 శాతం ప్రాతినిధ్యాన్ని ప్రతిపాదించినప్పుడు హిందువుల కన్నా బ్రాహ్మణుల కన్నా గట్టిగా వ్యతిరేకించాడు,"యే నిర్వచనం ప్రకారమయినా సరే జనాభా పరంగా గానీ మతపరంగా గానీ మైనార్టీగా వున్నవాళ్ళు అధికారాన్ని చేపట్టినట్లయితే అది ఆ సమాజానికి చడునే తీసుకొస్తుంది.యే రూపంలో నైనా సంఖ్యలో తక్కువగా వున్నవాళ్ళు సంఖ్యల్లో యెక్కువగా ఉన్నవాళ్ళ మీద పెత్తనం చెయ్యడాన్ని నేను యెట్టి పరిస్థితుల్లోనూ సహించను" అనే వాదనతో?అసలు విషయం,"సాయిబులు వాళ్ళ వాటా అంటూ కొంత తీసుకుపోతే దళితులు వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుపోతే ఓ శూద్రుడా!ఓ తమిళుడా,నీకేమి మిగులుతుందయ్యా?" అని పెద్దాయన భావం?పళ్ళెంలో ఉన్నదంతా తనకి నచ్చినవాడికే కావాలి,తనకి నచ్చని వాడు అడుక్కు తిన్నా నీలిగి చచ్చినా ఆయనకి జాలి పుట్టదన్న మాట!తను యేమి మాట్లాడినా జనం యెదురు చెప్పని స్థానంలో ఉన్న ధీమా వల్లనో యేమో కనీసం ఉదాశీనంగా నన్నా ఉండకుండా "ఉండటానికి ఈ దేశజనాభాలో కేవలం 6శాతమే ఉన్నా,కూలీనాలీ లాంటి కష్టపు పనులేమీ చెయ్యకపోయినా,అడుక్కుతినే స్థితిలో వున్నా కూడా మన చూపులు తగలకుండా వాళ్ళ ఆడవాళ్ళకి ముసుగులు కప్పేసుకున్నా ఈ దేశంలో గొప్పగానే బతికేస్తున్నారులే?!" అని వంకర మాటలు మాట్లాడినా అతను గౌరవనీయుడే అయ్యాడు గానీ ఇలాంటి మాటలేవీ మాట్లాడని సంస్కారులైన హిందువులు మాత్రం ఈ దేశంలో పుట్టిన వాళ్ళంతా రాముని బిడ్డలేనని సాదరంగా అన్నా జనాలకి విపరీతార్ధాలే తోస్తున్నాయి,యెందుకనో?

     హిందూమతంలో ఉన్న క్రూరత్వానికి గాయపడ్డామని చెప్తూ దానిమీద పోరాటానికే తమ జీవితాన్ని అంకితం చేశామని చెప్పుకునేవాళ్ళు తామే ఇతర్ల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నప్పుడు కనీసం ఆత్మ పరిశీలన కూడా చేసుకోకపోవడం యెంత విచిత్రం?ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రాంతంలో తను హందూమతం ద్వారా అణిచివేయబడ్డాననీ అందుకే నేను హిందువుగా వుండదల్చుకోలేదని చెప్పుకునే కంచె ఐలయ్య గారు ఉత్తర దేశంలో అదే విధమైన పరిస్థితులలో కూడా సొంత వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న లోహియానీ,గాంధీని బనియాల సంస్కృతి అంటూ అవహేళన చేస్తూ కాష్మీరీ బ్రాహ్మణుడైన నెహ్రూని మాత్రం అంబేద్కరుని అర్ధం చేసుకోవడానికి పనికొచ్చాడనే చెత్తాతి చెత్త వాదనతో నెత్తికెత్తుకుంటున్న సన్నివేశంలో తను ద్వేషించే బ్రాహ్మణత్వాన్ని ధిక్కరిస్తున్నట్టా అనుకరిస్తున్నట్టా అనేది స్పష్టంగా అర్ధమవుతూనే ఉన్నది గదా!అంబేద్కరుని అర్ధం చేసుకోవడానికి అంబేద్కరు పుస్తకాలు చదివితే చాలు గదా నెహ్రూని పొగడాల్సిన అవసరమేమిటి?

      మొట్టమొదట ఈ దేశంలో మత ప్రచారానికి వచ్చిన క్రైస్తవులు బ్రాహ్మణులతో స్నేహశీలంగా వుంటూ వారి సాయంతో యెదగడానికి ప్రయత్నించారనే చరిత్ర ఐలయ్య గారి బుర్రకి యెక్కదు కాబోలు!వాళ్ళు మొట్టమొదట వ్యతిరేకించిన జంతుబలుల లాంటి క్రూరమైన ఆచారాలు పప్పూ నెయ్యీ తినే శాకాహారులైన బ్రాహ్మణులవి కావనీ తమ వెనకటి తరం వాళ్ళవేననీ సామాజిక శాస్త్రవేత్త అయిన ఐలయ్య గారికి తెలియకుండానే ఇవ్వాళ క్రైస్తవంలో పునీతమవుతున్నారా?పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్టుగా పోయి పోయి తమ పూర్వీకులని అనాగరికులని తిట్టిన వాళ్లలో చేరాడు పాపం ఇప్పటికీ తన తాతకి గుడి ఉందని మురుసుకునే ఒకటిన్నర హిందువు!ఒకప్పుడు గురజాడ లాంటి బ్రాహ్మణులే ఇంగ్లీషువాళ్ళని ఇంగ్లీషు భాషనీ పరిధికి మించి మెచ్చుకున్నారు,అప్పటికే సామాజికంగా పై స్థాయిలో ఉన్న వెసులుబాటుతో మొదట ఇంగ్లీషు నేర్చుకుని మొదట వాళ్ళ దగ్గిర ఉద్యోగాలు చేస్తూ పైకొచ్చి ఆధునికతని సంతరించుకున్నారు!ఇవ్వాళ కంచె ఐలయ్య గారి విపరీత వాదనలలో కూడా అప్పటి బ్రాహ్మణులు యేమి చేసి పైకొచ్చారో మనమూ అదే చేసి పైకొద్దామనే ఇమిటేషను తప్ప ఒరిజినాలిటీ లేదు?ఒకే ట్రిక్కు రెండు సార్లు పని చెయ్యదు - అప్పటికీ ఇప్పటికీ కాలం చాలా మారింది, ఇవ్వాళ దళితులు పైకి రావడానికి కొత్తగా ఆలోచించాల్సిందే?!

      అప్పటి పెరియార్ లాగే ఇప్పటి ఐలయ్య కూడా ముస్లిములని కించపరుస్తూనే ఉన్నాడు!ముస్లిములలో మేధావులు తక్కువగా వున్నారంటాడు,ఇస్లాముని సంస్కరించదగిన అనాగరిక మతంగానూ ముస్లిములని క్రైస్తవుల దగ్గిర పాఠాలు నేర్చుకోదగిన వారుగానూ అభివర్ణిస్తాడు - క్రైస్తవమే గొప్ప మతం అంటాడు!బ్రాహ్మణ దేవుళ్ళ కన్నా తనకులపు దేవుళ్ళు గొప్పవాళ్లని గర్వంగా చెప్పుకునే ఐలయ్య ఒకనాడు కొత్తగా ఇంగ్లీషు చదివి పాశ్చాత్య జాతీయవాదం నుంచి స్పూర్తి పొంది ముస్లిములకి వ్యతిరేకంగా విశాల హిందూ ఐక్యత గురించి కలలు గన్న అప్పటి అతివాదహిందూబ్రాహ్మణుల వలెనే మతవ్యాప్తి కోసం క్రైస్తవులు చూపించే ఉదారవాదపు ముఖాన్ని మాత్రమే చూసి బొక్కబోర్లా పడిపోయి తన కులవారసత్వాన్ని ప్రొటెస్టెంటు క్రైస్తవులకి తాకట్టు పెట్టేసుకున్నాడు?!క్రైస్తవులు ప్రపంచమంతటా వున్నారు గాబట్టి వాళ్ళలో కలిస్తే తొందరగా ప్రపంచమంతటా తెలుస్తామనీ ఇంగ్లీషు భాష ప్రపంచమంతటా వ్యాపించి వుంది గనక ఇంగ్లీషు వస్తే చాలు ప్రపంచంలో యెక్కడయినా నెగ్గుకు రావచ్చుననే తరహా మూఢనమ్మకాలతో తను ఆప్యాయంగా చూసుకోవాల్సిన వారసత్వాన్నే వొదులుకుంటూ యెంత పొరపాటు చేస్తున్నాడో యెప్పటికి తెలుసుకోగలుగుతాడో - పాపం!

     ఒకప్పుడు బ్రాహ్మణుల్ని క్రైస్తవీకరించి వ్యాపించుదామని ప్రయత్నించి ఆ యెత్తు బెడిసికొట్టడంతో రూటు మార్చి మొదట్లో జంతుబలులతో పూనకాలతో అనాగరికంగా వుంటున్నారని చిన్నచూపు చూసిన కింది కులాల వాళ్ళకి ఒకప్పుడు తాము స్నేహంగా ఉన్న  బ్రాహ్మణుల్ని శత్రువులుగా చూపించడం మొదలు పెట్టారనేది క్రైస్తవం ఈ దేశంలో యెట్లా యేదిగిందనేది చారిత్రక దృష్టితో పరిశీలించిన వారెవరికయినా చాలా తేలికగా బోధపడే వాస్తవం. ముస్లిముల విషయంలో కూడా ఐలయ్య అభిప్రాయాలు పూర్తిగా తప్పు.ముస్లిములు ప్రపంచ రాజకీయ రంగస్థలం మీద అధిపత్యం కోసం ఆమేరికా కనపడుతూనే ఆడుతున్న జగన్నాటకానికి బలవుతూ అపార్ధాలకి గురవుతున్నారు!నిజానికి మలాలాకి శాంతి బహుమతి నివ్వడం లాంటి చిన్న చిన్న ట్రిక్కులతో ప్రపంచమంతటి దృష్టిలో క్రైస్తవులు చప్పట్లు కొట్టించుకున్నారు గానీ ముస్లిముల మతవిశ్వాసాల మీద దాడి చేస్తూ చాపకిందనీరు లాగా అమెరికా యూరప్  దేశాలు నడుపుతున్న దివాళాకోరు రాజకీయ విధానాల వల్లనే ముస్లిములు విధిలేని పరిస్థితుల్లోనే ఉగ్రవాదానికి తెగబడుతున్నారని యెంతమంది తెలుసుకోగలుగుతున్నారు?జైపూర్ లిటరరీ ఫెస్టివల్లో బౌధ్ధంపై కంచె ఐలయ్య రాసిన పుస్తకం గురించి వ్యాఖ్యానిస్తూ, "ఏ మతమైనా ఒకటే!ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే యే పధ్ధతి అనుసరిస్తే యేమిటి?మతాలన్నీ అసమానతలకి నిలయాలే." అని వ్యాఖ్యానించి అన్ని మతాలూ సమానత్వం పునాదులపై నిర్మించబడాలని సూచించిన ముస్లిం మేధావి జావేద్ అఖ్తర్ ఐలయ్య కన్నా వాస్తవికంగా ఆలోచించగలుగుతున్న గొప్ప ఆదర్శవంతుడైన భారతీయుడు!

       హిందువుల్ని దుర్మార్గులుగా చిత్రించాలనుకుని హిందూ మతంలోని చెడుకి బలయినట్టుగా తనకి తనే ముద్ర కొట్టుకుని అదే నోటితో బనియాలనీ ముస్లిముల్నీ చిన్నచూపు చూస్తున్నా ఇతని పట్ల యేమాత్రమూ వ్యతిరేకత రాకపోవడం ఇతడి అదృష్టమూ ఇలాంటి పనులేవీ చెయ్యక పోయినా హిందువులు మతోన్మాదులుగా కనబడటం హిందువుల దురదృష్టమూ కావచ్చునా?

   ఒకనాడు హిట్లర్ అవతరించడానికి కారణమైన ప్రొటెస్టెంటు క్రైస్తవానికి మళ్ళీ గాలికొట్టి వూపిరులూదుతున్నారు?తప్పనిసరై తమ ఆస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం దానిమీద పోరాడుతున్న ముస్లిముల్ని అపార్ధం చేసుకుంటున్నారు!హిందువులు ఈ మాయలో పడరాదు.ముస్లిముల్ని ద్వేషించ కూడదు.యేది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమైనదో అదే సుందరమూ అవుతుంది!


సత్యం శివం సుందరం

Monday 6 April 2015

హిందూ పురాణాల అశాస్త్రీయత సంగతి సరే గానీ మీరు పాటిస్తున్న మార్క్సిజం శాస్త్రీయమైనదేనా?ఎర్ర మేధావు లందరికీ ఇదే నా సవాల్!

చాలాకాలం క్రితం నేను ఒక ప్రాజెక్టుకు అవసరం కావడంతో లైబ్రరీలలో పుస్తకాల వర్గీకరణ గురించి వివరంగా చదివాను.సామాన్య విషయం:1 నుంచి 100 వరకూ,తత్వశాస్త్రం:101 నుంచి 200 వరకూ,చరిత్ర:201 నుంచి 300 వరకూ - ఇట్లా విభాగాలుగా విడగొట్టి ప్రతి పుస్తకానికి ఒక్కో విభాగంలో నంబరు వుండేటట్టు చూస్తారు.ఆ తర్వాత రచయిత పేరును చూస్తారు.పుస్తకం టైటిలు కూడా పరిగణిస్తారు. వీటినన్నిట్నీ కలుపుతూ ఉండేలాగ ప్రతి పుస్తకానికీ ఇండెక్స్ కార్డ్ ఒకటి తయారు చేస్తారు. టైటిలు కార్డు,ఆథరు కార్డు,సబ్జెక్టు కార్డు - ఇట్లా యెన్ని ఉన్నా లైబ్రేరియనుకి మట్టుకు అవన్నీ ఒక పుస్తకం గురించేనని తేలిగ్గా అర్ధమవుతుంది!

కానీ "మార్కిజం" అనేదాన్ని నిక్కచ్చిగా యేదోఒక క్యాటగిరీకి సర్దాలంటే మాత్రం యెంతటి మేధావికయినా ఒక పట్టాన సాధ్యపడి ఛావదు?యెందుకంటే తత్వశాస్త్రం,చరిత్ర,ఆర్ధిక శాస్త్రం,జంతుశాస్త్రం,వృక్షశాస్త్రం ఒకటేమిటి తనకి దొరికిన పుస్తకమల్లా చదివేసి అర్ధమయినంత మటుకూ ఒక్కచోటే పూరీల పిండిలా కుదించి జీడిపాకంలా సాగదీసి గుడ్డుసొనలా గిలకొట్టి తేనీటి కషాయంలా వడకట్టి వండిన బ్రహ్మ పదార్ధమది!మామూలుగా ప్రతి శాస్త్రానికీ కొన్ని నియమాలు ఉంటాయి,ఫలానా విషయం యే శాస్త్రం సహాయంతో అర్ధం చేసుకోవచ్చుననేది తేలికగానే తెలుస్తుంది.కానీ మార్క్సు గారు చెప్పిన యే ఒక్క మాటా యే ఒక్క శాస్త్రానికీ కట్టుబడదు,రెండు నుంచీ అసంఖ్యాకంగా వున్న శాస్త్రాల్ని ఒకే గుక్కన ఆపోసన పట్టగలిగిన బహుముఖప్రజ్ఞాశాలురికి మాత్రమే అందులోని బేసిక్సు అర్ధమౌతాయి.మిగతా అన్ని శాస్త్రీయ విభాగాలలోనూ యేదయినా ఒక విషయాన్ని అర్ధం చేసుకోవాలంటే దాన్ని సులభతరం చేసి చెప్తారు,కానీ మార్క్సు గారి పధ్ధతే వేరు!నీ ముక్కేదిరా అంటే పుర్రచేతిని తల చుట్టువార తిప్పి ముచ్చినగుంట మీదుగా కుడీవైపుకి చాపి అందీ అందకుండా అటుపక్క నున్న ముక్కు దూలాన్ని పట్టుకు చూపించడం మార్క్సుగారి అనుయాయులకి మహా ఇష్టం!

ఉదాహరణకి చరిత్ర గురించి ఈయన గారి సూత్రీకరణ చూడండి,ఉత్పత్తి శక్తులు చరిత్ర గమనాన్ని శాసిస్తాయని రూఢిగా చెప్పేసి గత చరిత్రలో విషయాలన్నిట్నీ ఆ సూత్రీకరణ ప్రకారమే వ్యాఖ్యానించి అద్భుతమైన వాదనా పటిమతో వాదించి ఒప్పించేశాడు,కానీ తను యెక్కడయితే తన సూత్రీకరణలకి ఉదాహరణగా పారిశ్రామికంగా బలమైన అమెరికా లాంటి దేశాల్లో ముందుగా కమ్యునిష్టు తరహా విప్లవం వస్తుందని చెప్పాడో అక్కడ రాలేదు సరిగదా అవి ఇంకా గట్టిగా పెట్టుబడిదారీ విధానానికే కట్టుబడి వున్నాయి?మార్క్సీయ తరహా విప్లవం వచ్చిన సమాజాలని పరిశీలించి చూస్తే తను బల్లగుద్ది చెప్పిన పారిశ్రామిక విధానం రీత్యా వేనకబడినవీ వ్యవసాయ ప్రధానమైన ఆర్ధిక పునాది వున్నవీ!ఇంతకీ చరిత్రకి ఒక దిశ ఉన్నదా?లేదు,యెందుకంటే కొన్నివేల అసంవత్సరాల వెనకటి నుంచి ఇప్పటి వరకూ చరిత్ర గమనం హఠాత్తుగా జరిగే నాటకీయ పరిణామాల వల్ల గానీ ఒక ప్రభావశీలమైన వ్యక్తి యొక్క చొరవ వల్ల గానీ అంతకు ముందు తరం వాళ్ళు వూహించను కూడా వూహించలేని మలుపును తీసుకోవడం ప్రతి చరిత్ర విద్యార్ధికి ప్రతిరోజూ తెలుస్తూనే ఉంటున్నది గదా!ఒక ప్రాంతం యొక్క చరిత్రని మార్క్సు చెప్పిన పధ్ధతిలో అయినా సరే యెంత సూక్ష్మంగా అధ్యయనం చేసి అయినా గానీ ఆ ప్రాంతంలో ఒక అయిదేళ్ళ తర్వాత చరిత్ర యే మలుపు తీసుకుంటుందో యేవరూ చెప్పలేక పోతున్నారు,అవునా కాదా?

మన దేశపు వేదాంతంలో ముఖ్యంగా భారతాంతర్గతమైన భగవద్గీతలో ఉన్న "సత్తు","అసత్తు","చిత్తు" అనే మూడు ముక్కల మాదిరి వినపడే "థీసిస్","యాంటీ థీసిస్" మరియూ "సింథీసిస్" అనే వాటి చుట్టూ తిరిగే హెగెలియన్ భావవాదాన్ని తీసుకుని దాన్ని తిరగేసి రూపం మార్చేశానని గొప్పలు చెప్పుకుని మన వాళ్ళు నిరీశ్వర సాంఖ్యంలోని పురుషుణ్ణి కాస్తా "పరమ పురుషు" డనేసి ఈశ్వర సాంఖ్యంగా మార్చినట్టు ఆ హెగెలు గారు చెప్పిన భావవాదంలోని అతీత శక్తి స్థానంలో హేతువాదపు ఉత్పాదక శక్తిని ఇరికించి "గతితార్కిక చారిత్రక భౌతికవాదం" అనే ధియరీని ప్రచారంలోకి తెచ్చాడు.ఇంతా చేసి సిధ్ధాంతపు అంతిమ లక్ష్యమైన "వర్గరహిత సమాజం" దగ్గిర కొచ్చేసరికి హేతువుకి యేమాత్రం అందని విషయాలతో పూర్తిగా కల్పనామయ వర్ణనలతో నింపేసి మరోసారి సిధ్ధాంతాన్ని భౌతికవాదం నుంచి భావవాదం వైపుకి తిప్పేశాడు,యెడంచెయ్యి తీసి పుర్రచెయ్యి పెట్టినట్టు యెందుకొచ్చిన తిప్పలు చెప్పండి?

ఇంతకీ చరిత్ర తొలిదశలొని ఆటవిక వేటకారి జీవనవిధానాన్ని అసలు లోపాలు లేని అత్యుత్తమ జీవిత లక్ష్యమైన వర్గరహిత సమాజపు వాస్తవిక వుదాహరణగా కీర్తించిన వాడు తన గతితార్కిక భౌతికవాదం ప్రకారమే దానిలోని యాంటీథీసిస్ వల్లనే మాయమైపోయిందనే విషయం మాత్రం యెందుకు పట్టించుకోలేదు?వోల్గా నుంచి గంగకు జరిగిన మజిలీల మలుపుల్లో పసిపిల్లల్ని బండల కేసి బాది చంపిన "నిశ","దివ" అనే స్రీమూర్తుల్ని గురించి చెప్పకుండా దాచెయ్యటం అబధ్ధాలు చెప్పటం కాదా!అది తెలిశాక గూడా రాహుల్ సాంకృత్స్యాయన్ లాంటి వాళ్లకి గూడా మార్క్స్ చెప్పిన ఆదిమ సమాజపు ఔన్నత్యం అబధ్ధమనే లైటు వెలగలేదంటే అర్ధమేమిటి?నిజంగానే అప్పటి ఆదిమ సమాజం యే వర్గాలూ లేని అంతటి ఆదర్శప్రాయమైనదా,లేక తను దోషిగా నిలబెడదామనుకున్న పెట్టుబడ్డిదారీ విధానానికి భిన్నంగా ఉండటం వల్ల పులుముడు పాండిత్యంతో మనముందు గొప్పగా నిలబెడుతున్నాడా అనే అనుమానం కూడా రాకుండా నమ్మిన మీరు మంత్రాల్నీ దేవతల్నీ నమ్ముతున్నారని అవహేళన చెస్తున్న మాకంటే యేవిధంగా తెలివనవాళ్ళు?!

హేతువు నుంచి నమ్మకానికి 360 డిగ్రీలు తిరిగేశాక గూడా మాది గొప్ప శాస్త్రీయమైన సిధ్ధాంతమ అని డప్పు కొట్టుకుంటున్నారు ఈ పుచ్చొంకాయలకి మన సిధ్ధాంతం గురించి యేమి తెలుస్తుందిలే అనే మొండిధైర్యంతో!ఇక్కడ మన దేశంలో యెడ్వినా ప్రియుడు ఆర్టికిల్ 370 గురించి వొ గిస్తే గిస్తే గిస్ జాయెగా అని చెప్పినట్టుగానే "State withers away once a society enters into class less society" అని అన్నాట్ట!మరి చైనాలో కమ్యునిజం యేర్పడిన ఇంతకాలం తర్వాత కూడా రాజ్యం దూదిపింజలా యెగిరిపోలేదేమి?అది నిజమైన కమ్యునిజం కాకనా?కమ్యునిజం మార్క్సుగారు చెప్పినట్టు వినకనా?ఒక సమాజం వర్గరహితసమాజం లోకి అడుగు పెట్టిందని యెట్లా గుర్తు పట్టాలో దాని లక్షణాలు వివరించలేదు,ఆ సమాజం వర్గరహితసమాజం లోకి ఇంకా వెళ్ళని మిగిలిన సమాజాలతో యెట్లాంటి సంబంధాల్ని కలిగివుండాలో సలహాలు ఇవ్వలేదు,ఆ అసమాజం వర్గరహితసమాజంలో ప్రవేశించాక మనుషుల ప్రవర్తన యెట్లా మారుతుందనే విషయాల గురించి కనీసం వూహలయినా చెయ్యలేదు - అయినా అది శాస్త్రీయమైనదే అంటున్నారు,అది తప్ప మిగిలినవన్నీ అశాస్త్రీయ మనేస్తున్నారు!మానవుడు వస్తుగతవాది అని క్యాపీటలిష్టు ఎకానమీకి మూలస్తంభమైన ఆడం స్మిత్ గారు చెప్పిన ముక్కని తుచ తపకుండా వొప్పుకుని తన సిధ్ధాంతాన్ని మొదలు పెట్టాడు గదా వర్గరహితసమాజం లోకి వెళ్ళగానే ఈ వస్తుగతవాది అయిన మానవుడు హఠాత్తుగా ఆదర్శవాది అయితే గదా రాజ్యం అంతమై పోయేది?యే రకమైన శాస్త్రీయమైన విశ్లేషణతో అప్పటిదాకా వస్తుగతవాదిగా ఉన్న మానవుడు వర్గరహితసమాజంలోకి అడుగుపెట్టగానే ఆదర్శవాదిగా మారిపోతాడని అంచనా వేశాడు కార్ల్ మార్క్స్?అతను చూపించిన యే సాక్ష్యాలతో మీరు దాన్ని ఇంతవరకూ నమ్మారు,ఇప్పటికీ నమ్ముతున్నారు,నమ్మి అందరికీ చెప్తున్నారు!

వర్గరహితసమాజంలోకి వెళ్ళే ఒక సమాజం గురించి మళ్ళీ యక్షప్రశ్నలు బోలెడు వున్నాయి!రష్యన్ సమాజం కొంతకాలం కమ్యునిష్టు పార్టీ ఆధిపత్యాన్ని చూసింది,వర్గరహితసమాజంలోకి వెళ్లలేదు,చైనా సమాజం ఇంకా కమ్యునిష్టు పార్టీ ఆధిపత్యంలోనే వుంది,ఇంకా వర్గరహితసమాజంలోకి వెళ్ళలేదు,భారత సమాజం కొంచెం రుచి చూట్టమే తప్ప పూర్తిగా మింగలేదు,అమెరికన్ సమాజం అసలు యేనాటికీ కనీసం ముట్టుకోను గూడా ముట్టుకోదని "కామ్రేడ్స్" అనే ఒక్క మాట వాడినందుకు చార్లీ చాప్లినుకి వాళ్ళు తినిపించిన టెంకిజెల్ల తోనే అర్ధం చేసుకోవచ్చు,అమెరికా ఖండంలో ఉండి దాని ఆధిపత్యానికి భిన్నంగా ఉండాలనే లక్ష్యంతో కావచ్చు చెదురు మదురుగా కొన్ని ముక్కలు కొంతకాలం కమ్యునిజాన్ని కావిలించుకోవటం కాలం మరికొంత గడిచాక చీ కొట్టి వొదిలెయ్యటం లాంటి దాగుడుమూతలు ఆడుతున్నాయే తప్ప శాశ్వతంగా కమ్యునిజానికి అంకితమైన భూభాగం ప్రపంచంలో అంగుళం మేర కూడా లేదు - మరి భూమి మీద ఉన్న ప్రతి మనిషీ మార్క్సిష్టు తరహా కమ్యునిజాన్ని ఒప్పుకుంటే గానీ వర్గరహితసమాజం అనేది ఉనికిలోకి రాదా?అదే నిజమయితే మాత్రం ఇవ్వాళ కమ్యునిష్టు పార్టీల వల్ల వర్గరహితసమాజం యేర్పడుతుందని నమ్మేవాళ్ళు పిచ్చిపుల్లయ్యల కింద లెఖ్ఖ,అవునా కాదా!

దోషారోపణకి కాకుండా అసలు మార్క్సు యేమి చెప్పాడో నాకు అర్ధమైనంతగా చెబుతాను ముందు.మానవ చరిత్రని కొన్ని దశలుగా విడగొట్టాడు:ఆదిమ సమాజం,బానిస సమాజం,ఫ్యూడల్ సమాజం,పెట్టుబడిదారీ సమాజం అనేవి చారిత్రకంగా ప్రతి ప్రాంతంలోనూ కొన్ని తేడాలతో కనిపించడం వాస్తవమే! పెట్టుబడి దారీ సమాజంలో అసంఖ్యాకంగా ఉన్న శ్రామికులు కేవలం తమ శ్రమకి మాత్రమే హక్కుదార్లు కాగా సంఖ్యలో తక్కువగా ఉన్న పెట్టుబడిదార్లు ఉత్పత్తివనరుల్ని గుప్పిట్లో పెట్తుకుని శ్రామికుల మొత్తం శ్రమ వల్ల తయారయిన  వస్తుసేవలకి హక్కుదార్లై  వాట్ని అమ్మగా వచ్చే లాభాన్ని తాము మాత్రమే అనుభవిస్తున్నారనీ అది శ్రామికుల శ్రమని దోచుకోవటమేననీ విశ్లేషించాడు!ఒక సమాజాన్ని అర్ధం చేసుకోవాలంటే ఆ సమాజపు ఉత్పత్తి సాధనం యేమిటి అనేది అర్ధం చేసుకోవాలని చెప్పి పైన ఉటంకించిన ఉటంకించిన చరిత్రలోని దశల్ని కూడా దాని ప్రకారమే వ్యాఖ్యానించాడు:ఆదిమ సమాజంలో ఆహారం కోసం వేట,బానిస సమాజంలో తక్కువ ఖర్చుతో అత్యద్భుత నిర్మాణాల కోసం బానిసలు,ఫ్యూడల్ సమాజంలో రాజ్యానికి అవసరమైన వ్యవసాయం - వ్యాపారం సజావుగా సాగడాని కవసరమైన భూమి,పెట్టుబడిదారీ సమాజంలో పెట్టుబడి - సాంకేతికత ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయని వివరించాడు!

ఇతని సిధ్ధాంతాన్ని క్రమానుగతంగా పరిశీలిస్తే పెట్టుబడిదారీ విధానం తొలిదశలో మానవాభ్యుదయానికీ బానిసత్వపు శృంఖలాల్ని పగలగొట్టే స్వేచ్చా సౌభ్రాతృత్వపు సాంస్కృతిక భావాల వ్యాప్తికి దోహద పడిన పురోగామి లక్షణాన్ని గట్టి సాక్ష్యాలు ఉండటం వల్ల గుర్తించడమూ, అప్పుడు తను చూస్తున్న భీభత్సాల్ని భూతద్దంలోంచి చూసి వాట్ని పెట్టుబడిదారీ సమాజపు వైరుధ్యాలుగా తీర్మానించటమూ,తను కనుక్కున్న కన్నంలో దొంగలాంటి అదనపు విలువ అనేదాన్ని గురించి ప్రపంచ ఆర్ధిక రంగాన్ని విపరీతంగా ప్రభావిత చెయ్యగల అత్యద్భుతమైన ఆవిష్కరణగా అతిగా వూహించుకోవడమూ, ఆ వైరుధ్యాలు మరింత పెరిగిపోయి ఈ పెట్టుబడిదారీ సమాజం తన వైరుధ్యాలని పరిష్కరించుకోలేని మొండితనంతో అంతమైపోయి తర్వాతదీ మానవాళి చరిత్రకి ఆఖరుదీ అయిన వర్గరహిత సమాజంలోకి ప్రవేశిస్తుంది అనే భవిష్యపురాణం చెప్పడమూ అని అర్ధమౌతుంది?!అప్పుడు నెలకొని ఉన్న అన్ని లోపాలకీ పెట్టుబడిదారీ విధానాన్ని పూర్తిగా దోషిగా నిలబెట్టేసి తాను దీనికి భిన్నంగా వుండే ఒక వర్గరహితసమాజం అనే స్వర్గతుల్యమైన ప్రపంచంలోకి మానవాళిని నడిపించబోయే కొత్త దేవుడిగా ఆవిర్భవించాలనే కీర్తికాంక్షతో ఉన్నాడనేటందుకు అతను చేసిన సూత్రీకరణల లోనే చాలా సాక్ష్యాలు ఉన్నాయి!తను మోడల్ థెయరీగా స్వీకరించిన హెగెలియన్ పధ్ధతిలో ఆలోచనలు చరిత్ర ముందుకు కదలడానికి ప్రచోదక శక్తి అని ఉంటే దాన్ని పూర్తిగా తిరస్కరించేసి మనుషుల ఆలోచనల్ని కూడా భౌతిక శక్తులే ప్రభావితం చేస్తాయి అనడం ఖచ్చితంగా భావాలకూ సంస్కృతికీ మనిషి మనస్సు మీద వున్న ప్రభావాన్ని గుర్తించని మొండితనమే అసలు కారణ మనేది నిస్సందేహంగా తెలుస్తూనే ఉన్నది గదా!యెందుకంటే ఒకే విధమయిన నైతికపరమైన పరీక్షా సన్నివేశంలో విరుధ్ధ సంస్కారాలు గలవాళ్ళు వేర్వేరుగా ప్రవర్తించడం మనం చూస్తూనే ఉన్నాం,అయినా భౌతిక ప్రపంచంలో తన కార్యాచరణ వల్ల వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకోవటానికి మెదడు అనే అవయవం ఉపయోగపడినా అందులోకి వెళ్ళే సారం అక్కడ నిర్ణయాలు జరగడంలో అతని సాంస్కృతిక అవగాహనయే కదా అతన్ని సమస్యల్ని పరిష్కరించుకునే తదుపరి కార్యాచరణ వైపుకి నడిపించేది?

నిజంగా ఆదిమకాలపు జీవన విధానం మార్క్సు మానవాళి అంతిమలక్ష్యంగా కొనియాడిన వర్గరహితసమాజం అంత అత్యున్నత ఆదర్శాలతో కూడి ఉన్నదేనా?అదనపు విలువని సంగ్రహించినందుకే పెట్టుబడిదారీ విధానాన్ని దుర్మార్గం అని చెలరేగిపోయిన హేతుబధ్ధమైన  కారుణ్యవాది తన తిండి తను తిని బతికే ఒక జంతువుని కత్తులతో బల్లాలతో గుంపుగా వెంటాడి వేధించి చంపి తినడాన్ని దుర్మార్గంగా యెందుకు గ్రహించలేక పోయాడు?ఇవ్వాళ తమ పార్టీ చిహ్నంగా ఉన్న కొడవలిని ఉత్పత్తి సాధనంగా మాత్రమే చూస్తూ పిడికిళ్ళలో బిగించి ఆకాశానికి చూపిస్తూ యెత్తిన కొడవళ్లతో చిందులు వేస్తూ మురుసుకుంటున్నారే గానీ అది మొక్కల్ని పరపరా కోస్తూ చంపుతున్న దుర్మార్గమైన హత్యాసాధనం అని యెందుకు గుర్తించలేక పోతున్నారు!

ఒక వ్యాపారం/పరిశ్రమ లో పెట్టుబడి పెట్టి మిల్లుల్ని కట్టి కొన్ని వందల మందికి జీతభత్యాలు ఇస్తూ లాభాలు ఆర్జించడానికి అవసరమైనంత డబ్బు ఒకే ఒక్క  వక్తి దగ్గిర చేరడానికి ఖచ్చితంగా దోపిడీయే కారణమని తీర్మానించేసి "నరజాతి చరిత్ర అసమస్తం పరపీడన పరాయణత్వం" అనే వాదన యెంత అసబబో తెలియాలంటే ఆదిమ సమాజం నుంచి ఇప్పటి వరకూ ఉన్న ఆధునిక సమాజంలో డబ్బు కున్న ప్రాముఖ్యత యేమిటో అది యెప్పుడు పుట్టి యెన్ని రూపాలు మార్చుకుందో తెలియాలి!ఇవ్వాళ దేశాల మధ్యన సరిహద్దు రేఖలు ఉన్నాయి,ఆ రేఖల్ని వాటి సార్వభౌమాధికారం చెల్లుబడి అయ్యే పరిధులుగా గుర్తించారు,అవునా!ఆయా దేశాల సరిహద్దుల లోపల పూర్తి భిన్నమయిన సంస్కృతులతో అలరారే జాతులు ప్రాంతాల వారీగా విడివిడిగా ఉన్నా వారిని కలిపి ఉంచే అంశం యేమిటనుకుంటున్నారు?తొక్కలో జాతీయతలూ కాదు, వుత్తుత్తి వారసత్వాలూ కాదు - రూప్యము అనబడే సాంకేతిక పదంతో ఉన్న కరెన్సీ ఆ దేశంలో యెక్కడికెళ్ళినా చెల్లడమే ఒక ప్రాంతం ఆ దేశానికి చెందినదా కాదా అనేది చెప్తుంది!ఒక దేశపౌరుడు మరొక దేశానికి వెళ్ళి స్వేచ్చగా తిరగాలంటే తన దగ్గిరున్న తమ దేశపు కరెన్సీని ఆ దేశపు కరెన్సీ లోకి మార్చుకోవాలి,కదా!

మార్క్సుగారు అమాయకమైనదీ ప్రపంచ మానవాళి భవిష్యత్తుకు దారి చూపేదీ అంటున్న ఆదిమ సమాజం కూడా డబ్బు లేకుండా బతకలేదు.అందరూ కలిసి సామూహికంగా వేటాడినా యెవడో ఒకడు ప్లానింగు దగ్గిర్నుంచీ ఇంప్లిమెంటేషను వరకూ నాయకుడిగా వుండి మిగతా వాళ్ళని తన ప్లాను కనుకూలంగా నడిపించకుండా అది నిక్కచ్చిగా ఫలితమివ్వదు.అట్లా ప్రత్యేక పాత్ర నిర్వర్తించినందుకు చంపిన జంతువుకి సంబంధించిన గుర్తుల్ని వీరతాళ్ళుగా తీసుకోవడం జరుగుతుంది.ఇటీవలి కాలంలోని షికారీలు తాము చంపిన పులుల గోళ్ళని మెడలో వేసుకునే గొలుసుల్లో అలంకరించుకునే వాళ్ళనేది పాతకాలం జమిందార్ల ఫోటోల్ని చూసిన వాళ్ళకి తెలుస్తుంది.మామూలు సందర్భాల్లో అది వీరతాడు మాత్రమే అయినా దాన్ని తను అపురూపంగా చూసుకుంటాడు గనక కొన్ని సందర్భాల్లో దాన్ని పణంగా పెట్టి మరొక దాన్ని సాధించితే అది హఠాత్తుగా అతని సంపద అయిపోవడం లేదా?మరో ఉదాహరణని తీసుకుంటే డబ్బు యొక్క అసలు స్వరూపమేమిటో తెలుస్తుంది!సుబ్బారావు దగ్గిర ఆవు వుంది,రంగారావు దగ్గిర మేక ఉంది,సుబ్బారావుకి మేకా రంగారావుకి ఆవూ అవసరమనుకోండి వాళ్ళిద్దరూ యేమి చేస్తారు?మామూలుగా ఆ రెంటినీ మార్చుకుంటే సరిపోతుంది,అది న్యాయమే నని కూడా మనకి తోస్తుంది!కానీ ఆవుపాలు మేకపాల కన్నా రుచిగా ఉంటాయి,గోమయం క్రిమిసంహారిణిగా పని చేస్తుంది,వ్యవసాయం లాంటి ఇతర పన్లలో కూడా మేకపెంటికల కన్నా యెక్కువ పనికొస్తుంది - సుబ్బారావు ఇవన్నీ లెక్క వెయ్యక పోతేనే ఒక ఆవుతో ఒక మేకని మార్చడం న్యాయం అని అతను అనుకోగలడు.అతను గనక రంగారావుకి తను ఇచ్చిన ఒక ఆవుకి బదులుగా రంగారావు తనకి నాలుగు మేకల్ని ఇవ్వాలని అడిగితే?మారకంలో 1:1 కాకుండా మరో రకం నిష్పత్తి రంగప్రవేశం చేస్తుంది!మరో ఇద్దరి దగ్గిర మేక - గొర్రె అనే జంటని మారకం చెయ్యడానికి మరో నిష్పత్తి అవసరమౌతుంది.ఒక ప్రాంతంలో చెలామణిలో ఉన్న అన్నిరకాల మారకపు నిష్పత్తుల యొక్క సాధారణీకరించబడిన రూపమే ఆ ప్రాంతంలో రూప్యముగా చెలామణీ అవుతుంది,అవునా కాదా!అలాంటి నిష్పత్తిని అందరి మధ్యనా శాసించడానికే రాజ్యం అవసరమవుతున్నది,రిజర్వుబ్యాంకు లాంటి సంస్థ యొక్క ఉనికి రాజ్యానికి మూలస్తంభంగా నిలబడుతున్నది!వేటలో తన చొరవకి గుర్తుగా యెక్కువ వీరతాళ్ళు పొందటం తప్పు కానప్పుడు, తను యెక్కువ పశువుల్ని మచ్చిక చేసుకుని పోషించి యెక్కువ ద్రవ్యాన్ని పోగు చేసుకోవటం తప్పు కానప్పుడు పెట్టుబడిదారు ఒక్కడే నేరస్తుడు యెట్లా అవుతాడని మార్క్సు అంత గట్టిగా నొక్కి వక్కాణించాడు?

పెట్టుబడికీ శ్రమకీ కనీసం 50:50 భాగస్వామ్యం కూడా ఇవ్వకుండా పెట్టుబడి అనేది ఇదివరకటి దోపిడీ నుంచి వచ్చిన కాలకూట విషంగా తీర్మానించేశాక దాని కొనసాగింపు అయిన |అదనపు విలువ->సాయుధపోరాటం->శ్రామిక వర్గ నియంతృత్వం->వర్గరహిత సమాజం| అనే వంకర టింకర గొలుసుకట్టులో తను అత్యద్భుతంగా పేల్తుందనుకున్న అదనపు విలువ అనే ఆటంబాంబు అనుకున్నంతగా పెట్టుబడిదారుల్ని భయపెట్టకుండా తుస్సుఢాంతుస్సు అయిపోయింది పాపం?కొద్దికాలంలోనే పెట్టుబడిదార్లు అదనపు విలువ అనేది పులి కాదనీ కనీసం పిల్లి కూడా కాదనీ కేవలం చిట్టెలుక మాత్రమేనని గుర్తించేశారు!ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగానే ఉంచాలనుకున్న స్మిత్తుగారి మోడల్ ఎకానమీ యొక్క పునాదుల్ని కదిలించకుండా ప్రపంచాన్ని మార్చగలనని మార్క్సుగారు యెట్లా కలగన్నాడో అని నాకు ఒక రకమైన నవ్వులాంటిజాలి తెగ ఉబికి వస్తున్నది,యెందుకంటే ప్రతి లక్ష్యానికీ అనుబంధంగా బలమైన ఎకనమిక్ ఫ్రేంవర్క్ చాలా అవసరం అని అంత గట్టిగా బల్లగుద్ది వాదించిన పెద్దమనిషి అందరికీ శకునాలు చెప్పే బల్లి తను కుడితిలో పడటాన్ని కనుక్కోలేనట్టు వర్గరహితసమాజాన్ని సాధించటానికి అవసరమైన ఎకనమిక్ ఫ్రేంవర్క్ యెందుకు ప్రతిపాదించలేదు?

అసలు చాణక్యుడి నుంచి ఆడం స్మిత్ వరకూ ఆర్ధిక నిపుణులు తమ గ్రంధాల్లో చేసిందేమిటి?రాజుకీ ప్రభుత్వానికీ యే రకమైన వస్తువుల మీద యెలాంటి పన్నులు వెయ్యాలి,యే విధమైన ఆర్ధిక కార్యకలాపాల్ని ప్రోత్సహంచాలి,యే విధమైన ఉత్పత్తి కార్యక్రమాల్ని అసలు కొనసాగనివ్వకుండా చూడాలి అని సలహాలు ఇవ్వడానికే వాళ్ళు ఆ పుస్తకాలు రాశారు,అవునా కాదా?మరి దానికి భిన్నంగా ఈ ప్రపంచాన్ని మార్చాలనే తాత్విక భూమికతో కదలాలని అనుకున్నప్పుడు అంతకన్నా విస్తృత ప్రాతిపదికతో ఆలోచించి వాళ్ళు వొదిలేసిన వాట్ని కూడా పట్టించుకోవాలి గదా!కార్ల్ మార్క్సు అనే ఈ అఖండప్రజ్ఞాధురీణుడు పెట్టుబడి నుంచి లాభం వరకూ ఉన్న కార్యకలాపాలకి అటూ ఇటూ ఉన్న ముఖ్యమైన రెండు విషయాల్ని తెలియక పట్టించుకోలేదా కావాలని వొదిలేశాడా?

ఆ రెండూ యేమిటో తెలియాలంటే ఒక హరికధ చెప్తాను శ్రమ తెలియకుండా వినండి!ఒకానొక రోజు పొద్దున మీకు యేమయీఅ సరే ఈరోజు ద్రాక్సహపళ్ళు తినాలనై అనిపించిందనుకోండి,యేమి చేస్తారు?మీ తోటలొనే పండీతే గొడవే లేదు,లాగించేస్తారు!ఆ తోట పొరుగూరిలో ఉంటే?ఆ తోట మీది కాకపోతే?అంత దూరం వెళ్ళడానికి బధ్ధకం అనిపిస్తే?అయినా సరే తినాలనిపిస్తే?మీకు బదులుగా యెవరయినా వెళ్ళి తీసుకు రావడానికి యెవరయినా సిధ్ధపడితే ఆనందంగా అతనికి పళ్ళ ఖరీదు ఇచ్చి పంపిస్తారు,అవునా?అతను మీకు ఉచితంగా ఈ పని చెయ్యడానికి ఒప్పుకోకపోతే దారి ఖర్చులూ తిండి ఖర్చులూ ఇస్తారు,కదా!తోట నుంచి పళ్ళు కొనడానికి 100రు.లు మాత్రమే ఖర్చయితే దారి ఖర్చులూ తిండ్ ఖర్చులూ 20రు.ల తోనే సరిపోతే మొత్తం 150రు.లు ఇచ్చారనుకోండి,అతనికి 30రు.లు లాభం,అతను కాస్త తెలివైన వాడు అయి వుండి మీకోసం వెళ్తున్నట్టు చెప్పకుండా మీ పక్కింటతనికి ద్రాక్షపళ్ళ గురించి తనే ఆశపెట్టి మరో 150రు.లు తీసుకుంటే అప్పుడేమి జరుగుతుంది?అతనికి 80రు.లు అదనంగా వస్తుంది!ఒకరికి చెప్పకుండా మరొకరి దగ్గిర తీసుకోవడం అనేది సరదాగా చెప్పాను గానీ అట్లా కాకుండా అతను ఒక బండిని కొని దానితో మీలాంటి వాళ్ళకి ద్రాక్షపళ్ళు అందిస్తుంటే ప్రతిసారీ బండి కొనక్కర్లేదు గాబట్టి లాభంతో పాటు అనుకోకుండానే మార్క్సుగారు కన్నంలో దొంగ అని భయానకంగా వర్ణించి చెప్పిన అదనపు విలువ అతనికి సహజంగానే దక్కుతుంది,అవునా కాదా?పెట్టుబడిదారు యెక్కడ యెపుడు పెట్టుబడి పెడుతున్నాడు?ఇక్కడ ఒక సౌకర్యాన్ని నేను నా కస్టమర్లకి అందివ్వడం ద్వారా నాకు లాభం వస్తుంది అనే నమ్మకం లేకుండా యే పెట్టుబడిదారుతో అయినా కార్ల్ మార్క్సు గారు పెట్టుబడి పెట్టించగలడా?ఆ నమ్మకం యేర్పడిన తర్వాతనే గదా పెట్టుబడి పెట్టటం అనే దశ మొదలయ్యేది,అతనికి ఆ పని చెయ్యగలననే నమ్మకం ఉంటే కొంతమంది మనుషులు అవసరమై అతను పిలిస్తేనే గదా ఆ మనుషులు శ్రామికుల రూపంలో రంగప్రవేశం చేస్తున్నది,వాళ్ళంతట వాళ్ళే అతనితో నువ్వు నాకు ఇంత ఇవ్వు నేను నీకు ఇంత పని చేస్తాను అని ఒప్పందం చేసుకునే వొస్తున్నారు గదా!ఆ శ్రామికులు అనబడే స్థానంలో ఉన్న వ్యక్తులు తాము సొంతంగా యెదగదల్చుకున్నా ఇదివరకు తమకి యజమానిగా ఉన్న వ్యక్తి యే విధంగా వ్యాపారాన్ని మొదలు పెట్టాడో ఆదారిలోనే వెళ్తున్నారు గదా - ఇందులో మార్క్సు గారికి అన్యాయం యెట్లా కనిపించింది?అది నిజంగా అన్యాయమైతే దానికి బిన్నంగా వుండే మరో రకమైన వ్యాపార పధ్ధతిని దేన్నైనా అతను ప్రతిపాదించాడా?పెట్టుబడిదారు వైపుకి వెళ్ళే లాభం ఒక్కదాన్నే ప్రముఖంగా యెత్తి చూపించి ఇంత భీబత్సం చేస్తున్న మేధావులు పెట్టుబడిదారు నంచి కస్టమరు వైపుకి సౌకర్యం అనేది ఒకటి వెళ్తుందని యెందుకు గుర్తించటంలేదు?అవచి తిప్పయ్య శెట్టి చేసినా అంబానీ చేసినా కస్టమరుకి ఒక సౌకర్యాన్ని కలిగించి తను కొంత లాభం తీసుకోవడమే గదా, కస్టమరుని మోసం చెయ్యనంత వరకూ దాన్ని దోపిడీ అని యెట్లా అనగలరు మీరు?

బాత్ సోషలిష్టు పార్టీలో చేరి సమసమానత్వాన్ని గురించిన గొప్ప ఆదర్శవంతమైన కలలతో రాజకీయ ప్రయాణం మొదలు పెట్టి కల్లుపాకల దగ్గిర నుంచుని తాగివూగే తాగుబోతులకి తన జాత్యహంకారపు సిధ్ధాంతాన్ని అప్రతిహతమైన వాగ్వైభవంతో నూరిపోసి ఆఖరికి కాన్సెంట్రేషను క్యాంపులతో క్రూరత్వానికి గుర్తుగా మిగిలిపోయిన హిట్లరు మాదిరిగానే అమాయకమైన శ్రామికుల ముందు వర్గరహితసమాజం అనే సువర్లోకం గురించి వర్ణించి చెప్పి ఇంకా నీచంగా పెట్టుబడిదార్ల దగ్గిర చేరిన అదనపువిలువను కొల్లగొట్టగా సమకూడే అపరిమితమైన సంపదని ఆశ చూపించి రెచ్చగొట్టి ఇప్పటికి సాకారమై కనుపట్టిన రెండు చోట్లా రక్తపాతానికీ నియంతృత్వానికీ తెరతీయడం తప్ప విశ్వ మానవాళి సౌభాగ్యానికి యేమాత్రమూ ఒక నికరమైన వాగ్దానాన్ని ఇవ్వలేని విధంగా అభాసుపాలయినాక గూడా మేమెందుకు మిమ్మల్ని నమ్మాలి?

తను వర్ణించిన అన్ని చారిత్రక దశల లోనూ వ్యాపారం అనేది ఒకే రకమైన అమ్మకం - కొనుగోలు నియమాలతో నడుస్తుండటం అనేది తను యెందుకు గమనించలేదు?ఆదిమ సమాజంలో యెముకలూ ఈకలూ కూడా వ్యాపారపరంగా విలువైనవే గదా!మార్క్సు చూసిన ఆదిమ సమాజాలలో లేకపోవచ్చు గానీ సింధులోయ నాగరికత నాటి హస్తకళా వైభవాన్ని చూపించే ఆటబొమ్మల్నిసుదూర ప్రాంతాలలో కూడా అమ్మి వ్యాపారపరంగా సఫలురు కావడమే వారి ప్రత్యేకత కాదా?యే ఒక్క అమ్మకం - కొనుగోలు వ్యవహారంలోనూ ఇద్దరూ 50:50 శాతంగా సమాన లాభం పొందటం యెట్టి పరిస్థితుల్లోనూ జరగదు గాక అజరగదు?! ఒకచోట అమ్మకందారు 51 శాతం కొడితే మరొకచోట కొనుగోలుదారు 65 శాతం కొట్టవచ్చు, అప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఈ వ్యాపార సంబంధాలు మార్పు లేకుండా కొనసాగడాన్ని యేవిధంగా అర్ధం చేసుకున్నాడు కార్ల్ మార్క్స్?డబ్బు అనేది మనుషుల మధ్య నుంచి అదృశ్యం కానంత వరకూ అమ్మకం - కొనుగోలు ద్వందాలు మనుషుల మధ్యన ఉన్నంతవరకూ మార్క్సు చెప్పగా మీరు నమ్ముతున్న వర్గరహితసమాజం యేర్పడదు గాక యేర్పడదు అని నేను నినద భీషణ శంకము దేవదత్తమే అన్నంత ఖండితంగా చెప్తున్నాను,కాదనగలరా?

ప్రపంచ కమ్యునిష్టులారా సావధానులై వినండి - నేను మిమ్మల్ని మీకు సరిగ్గా తెలియని హిందూ పురాణాల గురించి అడగట్లేదు మీరు ప్రతిరోజూ అధ్యయనం చేస్తున్న మీ సిధ్ధాంతం గురించి అడుగుతున్నాను!మీరు పాటిస్తున్న సిధ్ధాంతం శాస్త్రీయమైనదేనా?అందులో మూఢ నమ్మకాలు యేమీ లేవా?అది తప్పు అయ్యేందుకు ఆస్కారమే లేదా?ఇక్కడ బ్లాగుల్లో పిన్నికీ అత్తకీ తేడా తెలియని పైత్యకారి ప్రవీణ్ మాత్రమే కాదు రాముడు శూర్పణఖని చూసి చొల్లు కార్చుకున్నాడని వాగిన స్వైరిణి ముప్పాళ రంగనాయకమ్మ వరకూ మీలో యెవరు చెప్పగలిగినా సరే - బస్తీ మే సవాల్?!జవాబు చెప్పడానికి సిధ్ధపడితే పోయేదేం లేదు మీ(మా) అజ్ఞానం తప్ప!

మీ(మా)కోసం ఒక మంచి కొటేషను:
"కమ్యునిష్టులు,భాషా దురహంకారులు,మతోన్మాదులు - అలాంటి వారిని విచారణ లేకుండా జైళ్ళలో వేయాల్సిందే,లేదంటే దేశం సర్వనాశనం అవుతుంది."
-లీ క్వాన్ యూ

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...