Sunday 31 May 2015

మోదీ కా మోళీ!బాబూ కా డాబూ!చందూ కా దందా?మేరా కు క్యా హోగయా కాలియా?!

     అమ్మమ్మ మోదీ,యెంత బులబులాగ్గా మోసం చేస్తున్నావు?కాంగ్రెస్సోళ్లని మించిపోయావుగా!కాంగ్రెస్సోళ్ళు అవినీతి గబ్బులో కూరుకుపోయి ఊపిరి సలపక వొదిలేసిన మంచి స్కీము లన్నిటికీ మాంచి జబర్దస్తు కొత్త పేర్లు తగిలించి వదలటం తప్ప సొంతంగా చేసిన గట్టి పని యేమిటో చెప్పు కొంచెం?ఇమేజి బిల్డింగ్ పేరుతో పదాల గారడీతో విదేశాల్లో స్పీచులు దంచి డప్పు కొట్టుకోవటం తప్పిస్తే మేక్ ఇన్ ఇండియా పేరుతో నువ్వు చేసిన హడావిడికి యెంత ఫలితం దక్కిందో లెక్కలు చెబుతావా కాస్త! అయినా మనోళ్లకి మంచి ట్రైనింగిచ్చి ప్రపంచ మార్కెట్లోకి వదిల్తే అక్కడి నుంచి తెచ్చే లాభం యెక్కువా,వాళ్లని ఇక్క దింపి అన్నీ అమర్చిపెట్టి లాభమంతా వాళ్ళు తీసుకుపోగా మనకి మిగిలే ఆడుగూబొడుగూ పన్నులు యెక్కువా?కామన్ సెన్సు లేనోళ్ళు యేం చెప్పినా వింటారనా, వాళ్లకింద యెంతమందిని మనవాళ్లని ఉద్యోగులుగా కూర్చోబెతావు,యెన్ని దశాబ్దాలకి వీళ్ళు పైకొస్తారు - యేంటీ స్వాభిమానం లేని జాతర?ఆ చాటున దేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళూ నువ్వేదో ఒకప్పుడు ముఖ్యమంత్రిగా  గుజరాతుని పైకి తీసుకొచ్చావని నమ్మకంతో ఆ సమర్ధతని దేశం రంజిలో చూపిస్తే మేము కూడా బాగుపడతామని నమ్మి నీకు గుద్దిపారేస్తే గుజరాతు ప్రధానమంత్రి అనుకునేలా కడుపు నిండిన గుజరాతుకే ఇంకా పెడుతున్నావుగా!పనులు చేయించుకోవటానికీ వెంట తిప్పుకోవటానికీ దేశంలో మనుషులే కరువయ్యారా గుజరాతోళ్ళు తప్ప?అప్పుడు రాష్ట్రావతరణ రోజున ఆంధ్రోళ్ళకి యెంత గొప్ప బైస్కోపు చూపించావు,ఇప్పుడు రాజధాని భూమి పూజకీ నువ్వే వస్తావంట కదా!అప్పుడు నువ్వు పులిమిన కలరు పాలిపోయిందని మరోసారి కొత్త కొత్త రంగులు పులిమి వెళ్తావా నాయనా?తల్లిని చంపి పిల్లని పుట్టించిందని కాంగ్రెసుని యెంత తిట్టావు,మీకు నేనున్నానన్నావు,అడిగిన సాయమల్లా చేస్తానన్నావు,అన్నీ గాలి కబుర్ల కింద తేల్చేసావు - యెందుకింకా నాటకాలు? ప్రత్యేక హోదా ఇవ్వకుండా యే ముఖం పెట్టుకుని వస్తావు భయ్యా!నిధులు కూడా పదివేల కోట్లడిగితే ఎనిమిదివేల కోట్లు ముష్టి విదిల్చినట్టు విదిల్చావు నీకు మేము ఆనందంగా స్వాగత సత్కారాలు చెప్తామని యెలా అనుకున్నావు!నీకు మాన మర్యాదలు ఉంటే వచ్చే ముందు ప్రత్యేక హోదా సంగతి తేల్చి చెప్పు!అది ఇవ్వడం కుదరకపోతే నికరంగా రాష్ట్రానికి యెంత మేలు చెయ్యగలవో సభలో చెప్పు,బయట వాగే చెత్త వాగుడు మేము నమ్మం - నిండుసభలో ఒక ప్రధాని మాకిచ్చిన హామీయే గాలికి పోయే పేలపిండిలా తయారయింది రేపు శంకుస్థాపన రోజున కూడా మళ్ళీ నలగని డ్రస్సుతో చెదరని నవ్వుతో నువ్వు సొల్లు కబుర్లు చెబీతే పగటివేషగాడనే చెత్తపేరు తప్ప గొప్పపేరు రాదు,అది తెలుసుకో!


     అర్రెర్రె బాబుని కదిలిస్తే చాలు హైదరాబాదుని నేనే యెత్తాను,నేనే మోశాను,నేనే నేనే అనే సోది యెత్తుకుంటాడు వినేవోళ్ళకి బోరు గొడుతుందేమోనని కూడా అనుకోడు,అదేం మనిషో!23 జిల్లాల ప్రజల కష్టార్జితమంతా ఒక్క నగరాన్ని యెత్తడానికే పెట్టావు,మరి విడిపోయేటప్పుడు ఇప్పుడు నువ్వు యేల్తున్న 13 జిల్లాల వాటా నీ దమ్ము చూపించి రాబట్టలేక పోయావేం?తాతల నాడు తాగిన నేతుల వాసన కాదయ్యా ఇవ్వాళ నువ్వేం ఉధ్ధరించావో చెప్పవయ్యా!విడిపోయి యేడాది గడిచినా ఇంకా పొరుగు రాష్ట్రంలో యెందుకున్నావు నువ్వు?విభజన అన్యాయంగా జరిగింది అని ఇన్నిసార్లు నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేని బడుధ్ధాయిలం కాదుగా మేము,అట్లా అన్యాయంగా జరుగుతుంటే చూస్తూ వూరుకోవడం,కాకుంటే మరీ బాగుండదని శవాసనం వెయ్యటం తప్ప ఆ అన్యాయం జరక్కుండా అడ్డుకోగలిగావా?నీ సమర్ధత చూపించాల్సిన ఈ టైములో అసమర్ధత బయటపడే సన్నాయినొక్కు లెందుకు నొక్కుతావు?తెలుగువాళ్లని కలపడం అని పైకి గొప్ప ఆదర్శాన్ని చెప్తూ నువ్వు ఇంతవరకూ ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్యన తలెత్తిన అన్ని వివాదాల్లోనూ తెలంగాణా ముఖ్యమంత్రితో మెతకగా యెందుకు వ్యవహరిస్తున్నావు?2019లో తెలంగాణాలో గెలవడం కోసం ఆంధ్ర ప్రజల పౌరుషానికి భిన్నంగా వ్యవహరిస్తున్నావు - ప్రజలు మాత్రం నువ్వు దూకుడుగా ఉంటే చూడాలనుకుంటున్నారు!నువ్వు ఆంధ్రప్రదేశ్ అనే స్వతంత్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రివా తెలంగాణ ముఖ్యమంత్రికి సామంతుడివా?రానని చెటెక్కి కూర్చుని నీ పిలుపుల్ని వినోదంగా చూస్తున్నా సిగ్గు లేకుండా అన్నిసార్లు తెలంగాణ ముఖ్యమంత్రిని యెందుకట్లా దేబిరిస్తావు? పరిపాలించడానికి నీకో 13 జిల్లాల రాష్ట్రముంది,యెన్నో సమస్యలు ఉన్నాయి,ప్రజలు నీనుంచి యెంతో ఆశిస్తున్నారు - నువ్వు మాత్రం రెండుకళ్ళ సిధ్ధాంతం ప్రజలకి చెప్తూ తెలంగాణా వొదిలి రాలేకుండా వున్న్నావు.భ్రమల నుంచి బయట పడు!అక్కడ కొలువుదీరి ఉన్నవాడు నీకు లొంగే ఘటం కాదు,అతనింకా నీ పార్టీలో నీ కింద పనిచేసిన కాలం నాటి మనిషి కాడు,అతనికి తెలంగాణా ముక్తిప్రదాత అనే గొప్ప ఉంది - నిన్నటి గొప్ప తప్ప ఇవ్వాళ నీకేమి వుంది?రాజధాని గొప్పగా ఉంటే చరిత్రలో నీపేరు నిలబడుతుంది,ఆ ప్రాంతం వాళ్ళకి గొప్పగా ఉంటుంది - అప్పుడు హైదరాబాదు విషయంలో చేసిన తప్పునే ఇప్పుడు రాజధాని పేరుతో మళ్ళీ పదింతలు గట్టిగా చేస్తే ఈ చిన్న ముక్క కూడా నాలుగు ముక్కలవుతుంది - కళింగ కేకలు మొదలైనాయి తొలిదశలోనే పట్టించుకో!ఆంధ్ర-తెలంగాణ మధ్యన జరిగే తగాదాల్లో గానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి సాధించుకోవలసినవి సాధించడంలో దూకుడు పెంచకపోతే 2015లో తెలంగాణలో గెలవడం కాదు ఆంధ్రలో కూడా మట్టికొట్టుకుపోతావు,తెలుసుకుని బుధ్ధిగలిగి మసులుకో - దూకుడు పెంచవయ్యా చంద్రయ్యా!

     అబ్బబ్బ కేసీఆర్ దర్జా చూస్తా ఉంటే రాజుల కాలం యెందుకూ పనికిరాదనిపిస్తా వుండ్లే!?అక్కడి ఇక్కడి చిన్నా చితకా రాజులేంది ఇంద్రుడు కూడా యేడుస్తా వుండాలి?దిష్టి తగిలి పొయ్యేట్టుంది బంగారు మారాజుకి,గాలీ దూళీ సోక్కుండా బక్తులంతా పూజలూ గట్రా సెయ్యాలి - ఈపాటికే సేస్తా వుండారేమో!విభజన కోసం ఆంధ్రోళ్లని తిడుతూ అంత గయ్యాళితనం చూపించినా ఆఖరికి లోక్ సభలో దరిద్రపు సన్నివేశాల్తో యెన్ని అమంగళాలకయినా సిధ్ధపడి చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు  తెచ్చుకుని "అది మనకే,ఇహ మనకే,కుర్సి మనదే" అని యెన్ని గంతులు వేసినా తెలంగాణా ప్రజానీకం అత్తెసరు మెజార్టీయే ఇచ్చి ఒకరకంగా బిత్తరపోయేలా చేశారు!అయ్యగారు కూడా ఇక ఆంధ్రోళ్ళని తిట్టమాకండి అని ఒక హుకుం జారీ చేసి ఆ ఆంధ్రోళ్ళ కాళ్లల్లో తను గుచ్చిన ముల్లుల్ని తనే నోటితో తీసే పనిలో ఒళ్ళు మరిచిపోతున్నా యే తెలంగాణా స్వాభిమానీ అదేమని గద్దించి అడగకపోవడం అయ్యగారి అదృష్టమో మరొకటో కాదు,విభజన వాదుల్లో ఉన్న పైత్యకారి తనమే అది!విడిపోతే రాష్ట్రం అభివృధ్ధి సాధిస్తుందనే గ్యారెంటీ వాళ్ళకి ముందునుంచే లేదనేది స్పష్టంగా ప్రతి ఒక్కరికీ తెలుసు!ఒకప్పడు అటువైపునా ఇటువైపునా జరిగిన వుద్యమాలలో సిధ్ధాంత బధ్ధత ఉంటే విడిపోవాలి అనే కోరిక మాత్రం బలంగా ఉన్న శాడిష్టులు కొందరు లాఘవంగా సాగించిన పైస్థాయి పైరవీలతొనూ మీడియా ప్రపంచంలోని రాజకీయాలతొనూ బలవంతంగా సృష్టించి కొనసాగించబడిన ఉద్యమం ఇప్పటిది!కోరికలో న్యాయం ఉంటే, వారిలో దాన్ని వివరించగలిగిన సమర్ధత ఉంటే కేసీఆర్ తో సహా విభజనవాదులు ఆంధ్రోళ్లని తిడుతూ కేవలం తెలంగాణ లోనే ఉండకుండా ఆంధ్రప్రాంతంలోకి కూడా వచ్చి ఇదుగో ఇందువల్ల మేము విడిపోతున్నాం, ఇది మా న్యాయమయిన కోరిక అని ఆంధ్ర ప్రజల మద్దతుని కూడా అడిగి మొత్తం 23 జిల్లాల ప్రజల ఆశీస్సులతో శాసనసభలో థంపింగ్ మెజారిటీ తెచ్చుకుని రాజమార్గంలోనే దాన్ని సాధించుకుని ఉండేవారు,కాదంటారా?ఆ రకమయిన పరిస్థితి ఇవ్వాళ కేసీఆర్ మహారాజులుం గారికి అయాచిత వరంలాగ కలిసొచ్చింది - కేసీఆర్ పాలనని యేమాత్రం విమర్శించినా తెలంగాణా విఫల ప్రయోగం అనే కారణం చూపించి మళ్ళీ ఈ రెండు రాష్ట్రాల్నీ కలిపి ఒక్కటి చెస్తారేమోననే భయమే కేసీఆర్ పట్ల యెంత వ్యతిరేకత వున్నా నోరు మెదపకుండా ఉండేలాగ చేస్తున్నది!నిన్న గాక మొన్న హరగోపాల్ యేమి చెప్పాడు?అరగంట మాట్లాడితే చాలు ఒకదాని నొకటి ఖండించుకునే వాదనలు తెలంగాణ వాళ్ళు మాత్రమే చెయ్యగలరేమో అనిపించేటట్టు "తెలంగాణ సమాజం చాలా వైబ్రాంట్" అని ఒకచోట చెప్పి "నాయకులు ప్రజలంత వైబ్రాంట్ కాదు" అని తేల్చి చెప్పడం యే విధంగా చూసినా వైరుధ్యమే కదా?ప్రజలు మాత్రమే వైబ్రాంట్ అయి వుండి వారినుంచి వచ్చే నాయకులు వైబ్రాంట్ కాకపోవడం అనే అసలైన వైరుధ్యాన్ని కప్పిపుచ్చి ఆంధ్ర దోపిడీ అనే అబధ్ధాన్ని భుజానేసుకుని మొయ్యడమే ఇవ్వాళ్టి తెలంగాణా ఉద్యమంలోని నిజాయితీ పరులు జవాబు చెప్పకుండా తప్పించుకోలేని అసలైన తప్పు?!

     రేపటి తెలంగాణ యెట్లా ఉందబోతుందో కేసీఆర్ కుటుంబానికి తప్ప యెవరికీ స్పష్టత లేదు గానీ ఇవ్వాళ్టి తెలంగాణ మాత్రం మధ్యయుగాల నాటి రాజరిక పరిపాలన యెట్లా ఉంటుందో ఇవ్వాళ చూడాలనుకునేవాళ్ళకి వుదాహరణగా నిలుస్తుంది!ప్రజాస్వామ్యబధ్ధంగానే రాచరికాన్ని చూపించగలగడంలో నీ ప్రజ్ఞ అమోఘం చందూ,కానీ రాజుల్ని కూలగొట్టడానికి కారణమయింది మంత్రి,సామంత,దండనాధిపతుల్లో యెవరో ఒకరు కారణమైన దుస్థితి కూడా దాపరించే ప్రమాదం ఉందని తెలుసుకో!కూటనీతిని నమ్ముకున్న రారాజు అంతిమ యుధ్ధంలో తొడలు విరిగి కూలిపోయిన దృశ్యాన్ని నీ చేజేతులా తెచ్చుకోకుండా ప్రజాస్వామయబధ్ధంగా పరిపాలించు!ముందు జాగ్రత్తగా తెలంగాణా విఫల ప్రయోగం అని నిరూపించడానికి కంకణం కట్టుకున్నాడని వేరేవాడి మీద ఒక పుచ్చొంకాయ స్టేట్మెంటు పారేసి తెలివైన మాట మాట్లాడాననని పొంగిపోతున్నావేమో,నిజంగా రేపటి రోజున తెలంగాణ విఫల ప్రయోగం అన్ తేలితే దానికి మొదటి కారణం నువ్వే అవుతావనేది తెలుసుకుని బుధ్ధి గలిగి మసులుకో!మహాత్ములనుకున్నవాళ్ళ పట్లనే  పక్షపాతం చూపించని చరిత్ర నీకు భుజకీర్తులు తొడిగి సత్కరించటానికి నువ్వు సాధించాలనుకున్నది రాజమార్గంలో సాధించలేదు - యేదో ఉద్యమవేడిలో అట్లా అన్నాను పట్టించుకోకండి అని నువ్వు అన్నంతమాత్రాన గాయపడ్డ మనసులు శాంతించవు,యెందుకో తెలుసా?ఇప్పటివరకూ చేసిన పుణ్యానికి వైభవాలు చూశావు ఇప్పుడు చేసిన సీతాహరణం అనే పాపానికి ఇకముందు కష్టాలు అనుభవిస్తావు అనే పావని రావణునికి చెప్పిన ధర్మసూక్ష్మం తెలుసుకంటే బాగుపడతావు - సాహిత్యాన్ని కూలంకషంగ చదివిన పండితుడవటగా?ప్రజల్ని మరిచిపోయి ప్రజాస్వామ్యాన్ని లెక్క చెయ్యకుండా ఇప్పటిలాగే కళ్ళు మూసుకుని నడిస్తే నాలుగేళ్ళ తర్వాత నిజంగానే వోట్లడగటానికి మొహం చెల్లని పరిస్థితి రావొచ్చు - కాస్త కళ్ళు తెరిచి చూడండి చంద్రశేఖరేంద్ర మహారాజులుం గారూ!

     ఈ ముగ్గురిలో యెవ్వరూ కూడా ప్రజలు తమకు తం ఆకాంక్షల్ని నెరవేర్చడానికి అవకాశం ఇచ్చారనే గమనిక లేకుండా ఇదంతా వోట్లు రాబట్టగలగడంలోని తమ ప్రజ్ఞయే అనుకోవడమే కారణం అని అంత ధీమాగా ఉండటాన్ని చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతున్నది!ప్రజలకి చెయ్యాల్సిన ఒక మంచిపనికి కూడా ఈ పని చేస్తే యెన్ని వోట్లు పడతాయి అనే లెక్క వేసుకుని చేస్తున్న ఈనాటి రాజకీయ సంస్కృతి జగన్ లాంటి వాళ్ళ యొక్క అవినీతి కన్నా ప్రమాదకరమైనది,అయినా దీనికి తరుణోపాయం కూడా కనిపించటం లేదు - యెందుకని?ఆంధ్రప్రదేశ్ విభజనని తమకి అనుకూలంగా వాడుకోవటానికి యెట్లా అయితే ఆరాటపడి 23 జిల్లాల ప్రజలూ సంతోషంగా ఒప్పుకుని శాంతియుతంగా జరిగే విధంగా కాకుండా ప్రజల మధ్యన ఒక కనిపించని తెరని దించినంత భయానకంగా జరగడానికి కారణమైనట్టుగానే అవే రాజకీయ పక్షాలు జగన్ అనే చదరంగం లోని మంత్రి లాంటి కీలకమయిన పావుని తమకి లాభం చేకూర్చేటందుకు తురుపుముక్కలా వాడుకోవాలని ఆరాటపడటం చూస్తుంటే ఈ దేశంలో ఒక క్షణం కూఒడా ఉందకూడదన్నంత ఆవేశం కలుగుతున్నది?!

     జగన్ మీద ఉన్న ఆరోపణలు రుజువై అతను జైలు కెళ్తాడని నేను మొదటినుంచీ ఇప్పటివరకూ  యే ఒక్క క్షణమూ అనుకోలేదు!అతని మీద అభియోగం యేమిటి?తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని కదా/అదే గనక నిజమైతే అప్పుడు మంత్రివర్గంలో ఉండి దాన్ని ఆపలేకపోయినందుకు గానీ ప్రోత్సహించినందుకు గానీ అప్పుడు రాజశేకర రెడ్డి మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్న బొత్స,రఘువీరా రెడ్డి లాంటివాళ్ళు కూడా దోషులు కావాలి గదా!వాళ్ళందరూ వాగ్మూలాలు ఇవ్వడమూ వాళ్ళు యే అక్రమమూ చెయ్యలేదన్న మాటతో వాళ్లని వొదిలేశాక ఇంక జగన్ యెట్లా నేరస్తువుతాడు?అప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు మేము తప్పు చెయ్యలేదని రొమ్ములు విరుచుకుని తిరుగుతుంటే జగన్ యెట్లా దొరుకుతాడు చట్టానికి,ఆలోచించండి?వ్యాపారస్తుల్లో కొందరు అతను ముఖ్యమంత్రి కొడుకు గాబట్టి అతని సంస్థలో పెట్టుబడులు పెట్టతం ద్వారా ప్రభుత్వంతో ప్రయోజనాలు సాధించుకోవాలని అనుకున్న వాళ్ళ కేసులే బయటికొచ్చి రుజువవుతున్నాయి తప్ప ఇంతవరకూ జగన్ నేరస్తుడు అని చెపే ఆధారం ఒక్కటి కూద దొరకలేదు,అవునా!అలాంటి వ్యాపారస్తులు ఇప్పుడు కూడా ఉన్నారు.కాబట్టి నేను వూహించినంత వరకూ అతన్ని సమయం చూసుకుని నిర్దోషిగా విడుదల చేసి బయటికి తీసుకొచ్చి తమ ప్రయోజనాల కోసం వాడుకోవటానైఅకి పనికొచ్చే తురుపు ముక్క స్థానం అతనిది!తన పొజిషన్ అంత సేఫ్ అని తెలీసే అతను అంత ధైర్యంగా ఉన్నాడనేది నా అంచనా.ఇవ్వాళ కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా మాత్రమే అతని విడుదలని ప్రభావితం చెయ్యగలదు కాబట్టి యెప్పుడు అతన్ని బయటికి తీసుకొస్తే దాని ద్వారా భాజపాకి ప్రయోజనం కలుగుతుందో ఆసమయానికి జగన్ విడుదల జరుగుతుంది!వాళ్ళు బహుశా కర్ణూడు అర్జునుడి కోసం నాగాస్త్రాన్ని దాచినట్టు చంద్రబాబు తమని దాటిపోయి సొంతబలం పెంచుకుని తోక ఝాడిస్తే అప్పుడు జగన్ సాయంతో బాబుని ఇబ్బంది పెట్టడం కోసం చూస్తున్నారని నా అనుమానం,ఆ భయం వల్లనే రాష్త్రానికి చెయ్యాల్సిన సహాయాలు చెయ్యకపోయినా పోరాడాల్సిన పరిస్థితి కనబడుతున్నా సొంతమనుషుల్ని కూడా కేంద్రతో ఘర్షణ పడవద్దని చెప్పి అంత జాగ్రత్త పడుతున్నాడేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి?

     అందువల్లనే యెన్నికల ముందువరకూ జగన్ గురించి యేనాడూ సానుకూలంగా స్పందించని కేసీఆర్ యెన్నికల తర్వాత అధికారంలోకి వచ్చాక రాజకీయంగా జగన్ వైపుకి మొగ్గు చూపుతున్నాడు కాబోలు!భాజపా - తెదెపా ద్వయం కలిసి ఆలోచించుకుని జగన్ అనే పావుని విడుదల చేసి కేసీఆర్ మీదకి వొదిలితే కేసీఆర్ ఇబ్బంది పడటం ఖాయం!కేసీఆర్ ఇప్పటివరకూ ఆంధ్ర-తెలంగాణ వివాదాల్లో లాభపడటం తెలంగాణలో పట్టుకోసం రెండుకళ్ళ సిధ్ధాంతి చూపిస్తున్న మెతకతనమే యెక్కువ కారణం కాగా ఆ బలహీనత జగన్ వైపు లేదు,పైగా కేసీఆర్ లాగే అతని వ్యవహార సరళి కూడా దూకుడుగానే ఉంటుంది!ఈ ఇద్దరు దూకుడు మనుషులూ కలిస్తే ఆ ఇద్దరు మెతక నాయుళ్ళూ తట్టుకోలేరు,ఈ ఇద్దరు దూకుడు మనుషుల్నీ ఒకరికొకర్ని యెదురుగా నిబెడితే యెక్కువ ఇబ్బంది కేసేఅర్ వర్గానికే!ఇప్పటికే అధికారం లేక అల్లల్లాదుతున్న పాతకాపులైన రెడ్డి కులస్థులు జగన్ వైపు సపోర్టు ఇస్తే కేసీఆర్ కొత్తగా పైకి తీసుకువచ్చి బితుకూ బితుకూ మంటున్న వెలమ కులస్థులు అంత గట్టిగా నిలబడలేకపోవచ్చు!అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి పకలో బల్లెమై కూర్చుని ప్రజలకి గట్టిమేలు చేసే విధంగా ఒత్తిడి పెట్టగలడు!లేదంటే తెలంగాణ ముఖ్యమంత్రికి యెదురు నిలబడి అతని కళ్ళు కొంచెం నేలమీదకి చూసేలా ప్రభావితం చెయ్యగలుగుతాడు!నేనేదో తెలితక్కువగా అతన్ని యెక్కువ చేస్తున్నానని అనుకుంటే బొత్స అతనివైపుకి చేరడం కేసీఆర్ అతనితో కలవడానికి చూడటం దేనికి గుర్తో అర్ధం చేసుకోండి!ఇవ్వాళా రేపూ రాష్ట్రాలు విడిపోవటం,ప్రభుత్వాలు మారటం అన్నీ ప్రజాబీష్టాల కనుగుణంగా జరగడం లేదనేది మొదటిసారి తెలిసినప్పుదు ఆశ్చర్యంగా వుండవచ్చు,కానీ పైస్థాయిలో ఉన్నవాళ్ల అవసరాల కనుగుణంగా నాయకులు ఆడిపాడి అలరిస్తున్న రాజకీయం యెప్పట్నుంచో నడుస్తున్నదనేది అక్షరసత్యం!తాము వేసిన విలువైన వోట్ల మూలంగానే అవన్నీ జరుగుతున్నాయని భావించేవాళ్ళు పిచ్చివాళ్ళు?తన మాటల ద్వారా సంచలనాన్ని సృష్తించి అయినా సరే మెజార్టీ ప్రజల్ని సమ్మోహితుల్ని చెయ్యగలిగినవాడు పనికొచ్చేవాడి కింద లెక్కలోకి వస్తాడు!అలాంటివాణ్ణి మీడియా కొంత హైప్ సృష్టించీ, వ్యాపార పారిశ్రామిక వర్గాలు నిధులు సమకూర్చీ,ప్రచార వ్యూహకర్తలు అధ్భుతమైన తమ మేధాశక్తితో అతన్ని అనితరసాధ్యుడిగా నిలబేట్టి విపుల జన సమూహం ముందు తమ కలల్ని సాకారం చెయ్యగలిగిన రక్షకుడిగా ఆవిష్కరించీ అధికారంలో కూర్చోబెడతారు, అతడు వారి ఆకాంక్షల కనుగుణంగా పరిపాలిస్తాడు - స్వింగ్ ఫ్యాక్టర్ అనేదాన్ని ప్రభావితం చెయ్యగలిగిన మైనార్టీలకి రిజర్వేషన్లు ఇవ్వటం, అయోధ్యలో రామాలయం కట్టటం లాంటివి ఆ యజ్ఞంలో విసరబడే సమిధలు, అంతే!

     తెలంగాణలో యే ఉద్యమ వీరుల త్యాగాలతో యెదిగి ముఖ్యమంత్రి స్థానం వరకూ వచ్చాడో ఆ వ్యక్తియే ఉద్యమవీరుల్ని పనిగట్టుకుని దూరం పెట్టి ఉద్యమద్రోహుల్ని దగ్గరకి తీసుకుంటున్న దృశ్యంలో నాకు కనబడుతున్నది ఇది - ఆనాటి ఉద్యమవీరులు ఈనాడు కూరలో కరివేపాకులు,వాళ్ళకి వోట్లు వేసిన ప్రజలు గొర్రెలు!తెరాసా ఒకటే కాదు అన్ని పార్టీలూ ఇదే సంస్కృతిలో ఉండటానికి కారణం వీళ్ళెవరూ అధికార ప్రాప్తికి అసలు కారణం కాదు గనకనే!కాబట్టి జగన్ కేసు వీలయినంత తొందరగా తేలాల్సిన అవసరం ఇవాళ్టి చరిత్రకి చాలా ఉంది!అతడు దిఎషి అని నిరూపించబడి జైలుకి వెళ్తే వెంఠనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికీ కాస్త లేటుగా తెలంగాన ముఖ్యమంత్రికీ ఒక సస్పెన్సు విదిపోయి రిలీఫ్ వస్తుంది.కేంద్రంలో ఉన్న భాజపాకి గూడా కేస్ తమ హయాంలో పూర్తి అయింది గాబట్టి గొప్పగా చెప్పుకోవచ్చు.అలా కాకుండా ఆధారాలు లేవని తేలిపోయి నిర్దోషిగా బయత్టి కొస్తే మాత్రం యెవరివైపుకి చెరి యెవర్ని ఇబ్బంది పెడతాదనేది మాత్రం నేను చెప్పలేను గానీ ఈఎ రెందు రాష్ట్రాల్లోని రాజకీయ వాతావరనం వేడెక్కటం మాత్రం ఖాయం!

అరె వో సాంబా!అబ్ ఆయా మజా ఖేల్ కా?

Tuesday 26 May 2015

హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విజృంభణం

     పాండిత్యం సజ్జనుడిలో పెరిగితే వినయంగా ఉంటాడు - మృదుభాషి అవుతాడు!అదే పాండిత్యం దుర్జనుడిలో పెరిగితే అహంకరిస్తాడు - వ్యర్ధప్రసంగాలు చేస్తాడు?నేను ముందరి భాగంలో ప్రస్తావించిన డా.స్వర్ణ వాచస్పతి లాంటివాళ్ళు రేండో కోవలోకి వస్తారని బల్లగుద్ది చెప్పగలను.లేకపోతే మహాకవి కందుకూరి రుద్రయ విరచిత "నిరంకుశోపాఖ్యాన" సుధాతరంగిణీ వ్యాఖ్యాత,భారతీయ మహాశిల్పాద్యనేక గ్రంధకర్త,త్రిశతాధిక దేవతా ప్రతిష్ఠా నిర్వాహకులు మరియు కనకాభిషిక్తులు అయిన "విమర్శకాచార్య","శిల్పకళాకోవిద" స్వర్ణ సుబ్రహ్మణ్య కవిగారి పుత్రుడై ఉండి ముప్పాళ రంగనాయకమ్మ విషవృక్షం ఆరో ముద్రణ కూడా పూర్తి చేసుకుని హిందూ ధార్మికతకి మూలమయిన రామాయణ తత్త్వాన్ని యెండగడుతుంటే సద్బుధ్ధి గలవాడెవడయినా స్వధర్మానికి అంతకన్నా యెక్కువ హానిచేసే "వాల్మీకి రామాయణ సౌరభాలు" అనే పుస్తకం రాస్తాడా?ఈ మహాద్భుతమైన గ్రంధరాజమునకు పీఠిక వ్రాసిన "విద్యా విశారధ","సాహిత్య సరస్వతి" బిరుదాంకితులైన డా.కన్నెగంటి రాజమల్లాచారి గారు ఆ గొప్ప గొప్ప బిరుదులన్నీ యెవరినుంచి యెప్పుడు యెందుకోసం అందుకున్నారో ఆయనకయినా తెలుసా?

     రంగనాయకమ్మ అయితేనేం స్వర్ణ వాచస్పతి 
అయితేనేం విమర్శించటం తప్పు కాదు,అక్కడ యేమి ఉందో విప్పి చెప్పటమూ తప్పు కాదు!కానీ సంస్కృతభాషలో ఒక పదానికి కేవలం ఉచ్చారణ వల్ల కూడా అర్ధం మారిపోయే సంక్లిష్టత ఉన్నప్పుడు వ్యాఖ్యానంలో మోళీ చేసి "నేనుగాక చూడండహో వాల్మీకిలో కూడా తప్పులు పట్టాను,నాదైన పాండిత్యాన్ని మెచ్చుకొనండహో" అనేటట్టు రెచ్చిపోవడం ఒక హిందువుగా యెంతవరకు సమంజసం?మొదట ఆయన హిందువా కాదా,ఈ సాంప్రదాయాన్ని ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా?నాకయితే "ఆదికవి గనుక ఆదికావ్యం గనుక ఈ మహాకావ్యంలో రచనాపరంగా దొరలిన నెరుసులని మనం భావించవచ్చు" అనే కంటితుడుపు వ్యాఖ్య ఒకటి తప్ప మిగిలిన అన్ని వ్యాఖ్యలూ పరమ చెత్తగా ఉన్నాయి!చెత్త అని యెందుకంటున్నానంటే ఇతని వాదనల్లో కూడా స్వైరిణి మాదిరి వెకిలితనం కనబడుతున్నదే తప్ప గంభీరమైన నిష్పాక్షికమయిన వాదన ఒక్కటీ లేదు!

     అహల్య వృత్తాంతమే తీసుకుంటే బాలకాండలో ఉన్నదే మనం తీసుకోవాలి.దానికి సంబంధించినంతవరకూ నేను హిందూ ధర్మ ప్రహేళికలు - రామకధా విశ్లేషణంలో అహల్య ఐచ్చికంగా ఇంద్రుడితో సంగమించినా యెందుకు గౌతముడు కూడా క్షమించి ఆమెని కేవలం శిక్షతో సరిపుచ్చి సతీత్వానికి భంగం రానివ్వలేదో విపులంగా చెప్పాను!సతీత్వానికి  నిజమైన అర్ధం ప్రవర్తన నుంచే తీసుకోవాలి.దానికి సాక్ష్యం పాండవులు దేవతల వల్ల పుట్టినా మొదట కౌంతేయులు గానూ తర్వాత పాండవులు గానూ వ్యవహరించబడ్డారే తప్ప ఆయా దేవతలతో కలిపి యెవరూ వ్యవహరించలేదనేది గట్టి సాక్ష్యం!ఒకవేళ ప్రస్తావించినా అది నిందార్ధకంగా మాత్రం లేదు,అవునా?అక్కడ స్రీ మాత్రమే ప్రధానం, ఆవిడ క్షేత్రమే ప్రధానం,ఇక్కడ నేనొక కఠినమైన నిజాన్ని చెప్పదల్చుకున్నా - సంక్లిష్ఠమైన డి.యన్.యే టెస్టులకి పోకుండా,పోలికల్నీ అలవాట్లనీ లెక్కవేయ్యకుండా లోకవృత్తాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే - మీకయినా నాకయినా నీ తండ్రి ఫలానా అని తల్లి చెబితే చచ్చినట్టు వొప్పుకు తీరాల్సిందే,కాదా?అందుకే మనవాళ్ళు సంతానాన్ని నిర్ధారించేటప్పుదు క్షేత్రమయిన తల్లి గర్భానికే యెక్కువ ప్రాధాన్యత నిచ్చారు!ఆ క్షేత్రం పాండురాజుకు వంశాంకురాల్ని ఇవ్వడానికి మాత్రమే మరొకరితో గర్భం దాల్చింది కాబట్టి పుట్టిన తర్వాత వాళ్ళు అక్రమ సంతానమో మరొకటో యెంతమాత్రం కారు,ఇక్కడ అహల్యకి గూడా ఆ విధేయత వల్లనే సతీత్వం వచ్చింది!ఈ మౌలికయిన విషయం తెలిసే చెశాడో తెలియక చెశాడో అంబేద్కర్ గూడా రాముడు అక్రమ అంతానం అనే అర్ధం వచ్చేలా విమర్శించాడు,ఒకవేళ అక్రమ సంతానమే అనుకున్నా అంబేద్కర్ అక్రమ సంతానం గౌరవనీయంగా వుండకూడదని అంటున్నాడా?మరి తన మతానికి సంబంధించిన మూలపురుషుడు కలలోకి యేనుగు వచ్చాకనే ఆయన తల్లి గర్భం దాల్చి ఈయన్ని కన్నట్టు ఉందిగా బుధ్ధుడి జన్మ కూడా రాముడి లాంటిదే కదా!

     ఇక రాజ్యార్హత దగ్గిరే కాదు వాలి వధ దగ్గిర కూడా రాముడు మొదట్లో కొంత గందరగోళానికి గురయ్యి తర్వాత ఒక స్పష్టత వచ్చాక గట్టి నిర్ణయం తీసుకుని మిగతావాళ్ళని కూడా తనమాటకే కట్టుబడి ఉండేలాగ వొప్పించినట్టు వాల్మీకి సన్నివేశాల్ని కల్పించాడు!నేను ప్రారంభంలోనే చెప్పాను ఆ కధ యెందుకు సామాన్యుల్ని కూడా రాముడు కూడా తనవంటివాడే అని మమేకం అయ్యేలాగ చేసి ఆ తర్వాత కొన్ని విశేష లక్షణాల వైపుకు నడిపించే విధంగా తీర్చిదిద్దబడిందో చెప్పాను గదా!మొదట్లో కధానాయకుడు తనలాగే కనిపించాలి,పోనుపోనూ తనుకూడా అతని వలెనే ప్రవర్తించగలననే విధంగా కధానాయకుణ్ణి మెట్టుమెట్టుగా ఔన్నత్యం వైపుకు నడిపిస్తేనే చదువరి కూడా ఆ మెట్లు యెక్కగలడు అనేది ఆదికవికి తెలిసినంతగా వీళ్ళకి తెలియకపోవడం ఆదికవి తప్పు కాదు గదా?యెట్లాగూ ప్రస్తావన వచ్చింది గాబట్టి అసలు వాలివధ యెంత నాటకీయంగా జరిగిందో ఇక్కడ చెప్తాను.అసలు వాలితో సుగ్రీవుడి యుధ్ధకోలాటం రెండుసార్లు జరిగింది!మొదటిసారి రాముడు చెట్టుచాటున ఉండటం,ఇద్దరూ కలబడుతున్నప్పుడు రహస్యంగా కొట్టడం అంతా రాముడు సొంతంగా వేసుకున్న ప్లాను కాదు,బహుశా సుగ్రీవుడి హడావిడి ప్లాను కాబోలు!చావుదెబ్బలు తిని వెనక్కొచ్చి పడి సుగ్రీవుడు రాముణ్ణి నానాతిట్లూ తిడుతూ గగ్గోలు పేట్టడమూ వర్ణించాడు, రాముడు వివరించిన విషయమూ అక్కడే చెప్పాడు - అసలే కోతులు ఆపైన కవలలు - వాళ్ళలో యెవరు యెవరో తెలిసిచావక పొరపాటున సుగ్రీవుణ్ణి కొడతానేమోనని సందేహం వచ్చి రాముడు మొదటిసారి బాణం వెయ్యలేదు!దానికి విరుగుడుగా రెండోసారి రాముడు తేడా తెలియడం కోసం గజమాల ఐడియా ఇచ్చాడు,కొట్టడం గూడా చెట్టుచాటున ఉండి కొట్టలేదు - ధనుష్ఠంకారం చేసుకుంటూ వచ్చి ఆగి చూస్తున్న వాలి యెదుర్రొమ్మున బాణం నాటాడు!సరిగ్గా మనకర్ధం కాని సన్నివేశంలో నిలబడితే మీరూ నేనూ యేమి చేస్తామో రాముడూ అలాగే ప్రవర్తించాడు గదా, అదీ సంవిధాన మంటే!అదీగాక దుర్మార్గులు అవకాశం వచ్చినప్పటికీ ఇతర్లు విడమర్చి చెప్పినా ఉన్నతంగా ప్రవర్తించలేనట్టే రాముడు కూడా మొదటిసారి మరోరకంగా సంశయగ్రస్తుడవటంవల్లనైతేనేమి వాలిని చెట్టుచాటు నుంచి కొట్టడం అనే నీచకార్యం చెయ్యడానికి అవకాశం వచ్చినా అదృష్టం బాగుండి తప్పించుకున్నాడు!

     ఇక రాముడి రాజ్యకాంక్ష గురించి ఈయన శ్లోకాల వారీగా ఉటంకించి వాటికి తాత్పర్యాలు వివరించి చేసిన తింగరి వాదనలన్నీ యే భరతుడి కన్యాయం జరిగిందని ఈ పండితులు ఆక్రందిస్తున్నారో ఆ భరతుడే తను పట్టాభిషేకం చేసుకోకుండా దాన్ని నిర్వందంగా తిరస్కరించి రాముడ్నే తిరిగి రాజుని చెయ్యాలని ప్రయత్నించిన ఘట్టంలో కైక పశ్చాత్తాపం మరియూ భరతుడి వేడికోళ్ళనూ ఒక్కముక్క కూడా యెందుకు ప్రస్తావించలేదు!సరే,ముప్పాళ రంగనాయకమ్మ అంటే హిందూమతాన్ని వెక్కిరించటానికి మర్చిపోయి ఉండవచ్చు, లేదా తన పుస్తకానికి విషవృక్షం అని పేరుపెట్టి రామకధని వక్రీకరించి అయినా దానిపట్ల గౌరవం తగ్గించాలని రాసింది గాబట్టి మసిపూసి వుండవచ్చు,వాల్మీకి రామాయణంలోని సౌరభాలని వెదజల్లాల్సిన ఈయనెందుకు ఆ భాగాన్ని ప్రస్తావించకుండా వొదిలేశాడు?వాల్మీకి గొప్పకవి అంటూనే ఆ కవి ఆదర్శవంతుడైన కధానాయకుడిగా చిత్రీకరించిన పాత్రలో దోషాలు కానివాట్ని కూడా ఇవిగో నేను కనుక్కున్న గొప్పాతిగొప్ప దోషాలంటూ అంత భీకరంగా చెలరేగిపోవటానికి కారణమేమిటి?యే ప్రతిఘటనా లేకపోతే యెక్కడయినా పెద్దకొడుకే నిస్సందేహంగా తండ్రి రాజ్యానికి వారసుడౌతాడు,పైగా మంధర మొదట శ్రీరామపట్టాభిషేకం వార్త చెప్పగానే కైక ఆనందించిందనే విషయం వాల్మీకి రామాయణంలో లేనిదా?దానికి ముందరి సన్నివేశాల్నీ తర్వాతి సన్నివేశ్శాల్నీ పాండిత్యంతో సమర్ధించినా కైక కూడా రాముడి వ్యక్తిత్వాన్ని చూసి యేమాత్రమూ అభ్యంతర పెట్టలేదని అంత స్పష్టంగా ఉన్నదాన్ని కూడా తన పాండిత్యగర్వంతో మరిచిపోవడం యెంత దారుణం?తను హిందువై వుండి హిందూ ధర్మానికి మూలమైన రామాయణ కావ్యం గురించి తను వెదజల్లుతున్న సౌరభాలు ఇవేనా?

     రాముడు తనకు తనుగా నాకు పట్టాభిషేకం చెయ్యమని అడిగిన శ్లోకం ఒక్కటైనా చూపించగలిగాడా?కైక కూడా మొదట ఉదారంగా సమ్మతించినదంటే దానర్ధం యేమిటి?అప్పటికే రాజ్యంలోని సకల ప్రజానీకమూ ప్రభుత్వాధికార్లూ సైన్యాధిపతులూ ఆనందంగా రాముడి రాజ్యాభిషేకాన్ని ఆహ్వానిస్తున్న అలాంటి ప్రశాంత వాతావరణంలో అన్ని అర్హతలూ ఉన్న తనకు జరిగే పట్టాభిషేకాన్ని తిరస్కరించటం లోకజ్ఞానం లేని వీరిలాంటి దద్దమ్మలు మాత్రమే చేస్తారు!యెప్పుడయితే రాముడు కైకనుంచి వనవాసం విషయం విన్నాడో వెంటనే మారుమాట్లాడకుండా తనకు తనుగా రాజ్యపరిత్యాగానికీ వనవాసానికీ ఒప్పుకున్నాడని తప్ప మరోవిధంగా మాట్లాడిన శ్లోకాలు యేవీ ఈ కుపండితుడికి అక్కడెక్కడా కనిపించి ఉండవు,యెందుకంటే వాల్మీకి పూర్వాపరాలు ఆలోచించుకునే సన్నివేశ కల్పన చేశాడు గాబట్టి!దశరధుడు నన్ను ఖైదు చేసి నువ్వు రాజువి కమ్మని చెప్పినా ఒప్పుకోకుండా సంతోషంగా వనవాసానికి సిధ్ధమైన వాడిలో ఈయన రాజ్యాభిషేకం కోసం తండ్రితో చాటుగా మంతనాలు జరిపిన దుర్మార్గాన్ని జబర్దస్తుగా చూడగలిగాడు - కేవలం రామలక్ష్మణులు తండ్రిని సేవించుకోవడం ఈయనకి దుర్మార్గంగా కనబడింది - ముప్పాళ రంగనాయకమ్మ అయినా ఈ పాపకార్యం చేసిందో లేదో గానీ ఆదికవి మీద గౌరవమున్నదంటున్న వాచస్పతి గారు మాత్రం నిస్సంకోశంగా చేసేశారు!కైక వ్యతిరేకిస్తున్నదని అప్పటికి తెలియనే తెలియదు గదా దశరధుడికైనా!అంతకు ముందెన్నడూ రామలక్ష్మణులు తండ్రిని సేవించుకున్న సందర్భాలు లేవని ఈ పండితుడు చెప్పగలడా, బహుశా వాల్మీకి ఉన్నాయని రాయలేదు గాబట్టి ఈయనకి అది దురుద్దేశంగా అర్ధమై ఉంటుంది కాబోలు - వారెవా యేమి పాండిత్యమండీ మీది వాచస్పతి గారూ?!వాల్మీకి బలమైన సాక్ష్యంగా చూపించిన వాట్ని కావాలనే వొదిలేస్తారు,రాయని వాట్ని కూడా స్వకపోల కల్పనలతో రాసినట్టుగా భ్రమింప జేస్తారు - ఈయనకీ ఈయన తండ్రిగారికి లాగే యెవరయినా బిరుదులూ అవీ ఇచ్చి సత్కరించారా లేదా?రామకధని అట్లా రాయమని వాల్మీకికి చెవిలో చెప్పిన వాడు నారదుడు కాదేమో - కొంపదీసి ఈయన కాదు గదా?త్రిశతాధిక ఆలయాలు నిర్మించిన తండ్రిగారికి కనకాభిషేకం చేస్తే ఈయనకి కనీసం గజారోహణ అయినా చేయించి ఉండాల్సింది - అడ్డెడ్డెడ్డే!

     రాముడిలో తప్పులు పట్టటానికి ఈయనగారు యెంతకి దిగజారాడో తల్చుకుంటే ఇతనసలు మనిషా పశువా నోటికి తింటున్నది అన్నమా గడ్డా మరొకటా అన్నంత కంపరమేస్తుంది నాకు!భరతుడు తనని వెనక్కి పిలవటానికి వచ్చే సమయానికి రూరంగా సైన్యాల ధూళి కనిపించేటప్పటికి సీతతో మాంసం వొరుగులు తింటూ ఉండి తీరా భరతుడు వచ్చే సమయానికి అవన్నీ శుభ్రం చేసి కృష్ణాజినం పరుచుకుని కూర్చోవడం నటన అనిపించిందట ఈ మర్యాదస్తుడికి!భోజనం చేస్తుండగా ఇంటికి అతిధులు వస్తే యెంగిలి చేత్తోనే పిలిచి భోజనాల బల్ల మీదే కూలేసి కబుర్లు చెప్తాడు గావును ఈ ప్రబుధ్ధుడు,సిగ్గు లేకపోతే సరి?!భరతుడు ఒక్కడే వస్తున్నాడా పోన్లే వచ్చేది తమ్ముడే గదా యెట్లా ఉంటేనేం అనుకోవటానికి, ససైన్య సపరివార సమేతంగా వస్తున్నాడు!సందేహం లేదు,నేను మొదటి భాగంలో చెప్పిన రామాయణం చదవగూడని వాళ్ళ లిస్టులో ఉన్న ఒక త్రాష్ఠుడికి పొరపాటున సంస్కృతం చదవడం వచ్చింది - అది మన ప్రారబ్ధం!అయినా మాంసం తినడం గురించి ఈయనే కాదు చాలామంది చాలా క్రూరంగా ఆడిపోసుకుంటున్నారు యెందుకనో? బ్రాహ్మలు తింటే తప్పుగానీ రాజుగారబ్బాయి మాంసం తింటే తప్పేమిటి?తనే మాటిమాటికీ కందమూలాలు తింటానని చెప్పివున్నా అది అంత గట్టిగా పట్టించుకోవలసిన విషయం కాదే!కైకకి కావలసినదేమిటి?భరతుడి పట్టాభిషేకం మొదలయ్యేటప్పటికి రాముడు రాజ్యానికి దూరంగా ఉండటం,అదీ పేరుకి వనవాసం అని చెప్పి అయోధ్య చుట్టుపక్కల ఉన్న యే కారడవిలోనో కాపరముండి అయోధ్యనుంచి అన్నీ తెప్పించుకుంటూ గడపటం కాకుండా పూర్తిగా అయోధ్యకీ రాజభోగాలకీ దూరంగా వుండటం,అవునా కాదా?యెదటివాడికి ఇస్తానని వాగ్దానం చేసి ఇవ్వకపోవడమే అసత్యదోషం!సజ్జనుణ్ణి బాధ పెడితేనే హింస!దుర్జనుణ్ణి బాధ పెడితే శిక్ష!యెదటివాళ్ళను తరతమ భెదాలు లేకుండా చూడటం సమదృష్టి!నీతి విషయంలో పెద్దలు యే సూత్రాలు చెప్పినా యెదటివాళ్ళతో వ్యవహరించాల్సిన సందర్భంలో చెయ్యాల్సినట్టుగానే చెప్పారు తప్ప అలవాట్ల విషయంలోనూ తిండి తిప్పల విషయంలోనూ బొక్కలు వెదకటం కుసంస్కారులు మాత్రమే చేస్తారు!

     ఇంకా రాముడు కూడా మానవసహజమైన ఉద్రేకాలు ఉన్నవాడే అని చెప్పడానికి తల్లి కౌసల్యకి ఆనందం కలిగించలేకపోయాను గదా అని తల్లిని తల్చుకుని బాధపడటంలో కూడా ఈ పండితుడు భయంకరమైన దుర్మార్గాన్ని కనిపెట్టేశాడు?రాముడు తండ్రి దశరధుడితో యెంత కఠినంగా మాట్లాడాడు!కైకకి యెక్కువ ప్రాముఖ్యత నిచ్చి తన తల్లికి కష్టం కలిగించడాన్ని అక్కడే చెప్పి నేను లేను గదా అని ఇప్పుడు ఆమెకి అవమానం జరిగిందో ఖబడ్దార్ అని హెచ్చరించాడని అక్కడ ఉందా లేదా?తనేమన్నా నాకు పట్టుపరుపుల్లేక ఇబ్బందిగా ఉందని యేడ్చాడా?రాముడు వచ్చేశాక కౌసల్య పరిస్థితి అట్లాగే ఉంది కదా!రెండు రోజులు కుటుంబాన్ని వొదిలి కొత్తవూరు వెళ్తే ఇంటి దగ్గిర వాళ్ళు యెట్లా ఉన్నారో అని అనుకునే సన్నివేశం ఈ కఠీనపు మందకు యేనాడూ అనుభవంలోకి రానే లేదా?

     రెండోసారి పట్టాభిషిక్తుడై 11,000యేళ్ళు రాజ్యం చేసిన రాముడు 14 యేళ్ళు వనవాసం చెయ్యడం పెద్ద త్యాగమా అని వెక్కిరించే ఈ పండితుడి గురించి పీఠికాకర్త గారు "ఇంతటి మహత్తరమైన గ్రంధాన్ని రచించడానికి మిత్రులు వాచస్పతి గారు అష్టాదశ పురాణాలు,దేవీ భాగవతంలాంటి గ్రంధాలు,రామ రహస్యోపనిషత్తులాంటి అనేక ఉపనిషత్తులు,భారతం,టిబెట్ లోని రామకధ,రామ చరిత మానస్,అగస్త్య,భాస్కర,రంగనాధ రామాయణాలు,కంబళ,ఆధ్యాత్మ,అధ్భుత,ఆనంద రామాయణాలు.ఇంకా యెన్నెన్నో గ్రంధాలను క్షోదక్రమంగా పరిశీలించారు.ఆయన చేసిన విశేషమైన కృషి ఈ గ్రంధరూపంలో లభించింది.వాల్మీకి రామాయణంలోని సత్యమైన అంశాలను వెలికితీసి ఆంధ్ర పాఠకులకు మహోపకారం చేశారు" అని పొగడటం చూస్తుంటే పాటకి నేను ఆటకి మా అక్క అన్న సామెత గుర్తుకొస్తుంది!యెందుకంటే భారతీయుల కాలగణంలో 7 రకాల పధ్దతులు ఉన్నాయి,ఒక్కో సందర్భంలో ఒక్కో పధ్ధతిని ఉపయోగించి వర్ణించినా వాటిలో ఒక రకమైన యేకసూత్రత ఉంటుంది!జంటగా కలిసి వచ్చే ప్రతి కాల విశేషాన్నీ యుగం అనవచ్చు.ఒక రాత్రి ఒక పగలు కల్సిన అహోరాత్రము కూడా యుగమే అవుతుంది!"అహోరేవ సంవత్సర" కాలం లెక్క భారతంలో కూడా వస్తుంది.Bheema to Yudhishtira:-O Bharata, it is, also said by those versed in morality that one day and night is, O great prince, equal unto a full year. The Veda text also, exalted one, is often heard, signifying that a year is equivalent to a day when passed in the observance of certain difficult vows. O thou of unfading glory, if the Vedas are an authority with thee, regard thou the period of a day and something more as the equivalent of thirteen years.------Mahabharata-3-49 ఇంకోరకంగా కూడా దినమూ సమత్సరమూ అనే రెండింటినీ ఒక్కటిగానే వ్యవహరించవచ్చును.ఇవ్వాళ సుఖంగా నిద్రించినవాడు రేపటికి సజీవంగా ఉంటాడని ఖచ్చితంగా చెప్పలేము గదా!అలాంటప్పుడు ఒక సూర్యాస్తమయాన్ని చూసి నిద్రించి మరుసటి సూర్యోదయాన్ని చూడటాన్ని కూడా ఒక సంవత్సరం గతించి మరొక సవత్సరాన్ని చూడటంగా కూడా లెక్క్కించవచ్చు.ఈ లెక్క ప్రకారం 11,000 సంవత్సరాల పరిపాలన 31 సంవత్సరాలతో సరిపోలుతుంది,ఈ భారతీయ కాలగణనం అనే మామూలు విషయం కూడా తెలియకుండా బౌధ్ధ సాహిత్యం జైన సాహిత్యం లాంటివి యెన్ని చదివి యేమి ప్రయోజనం?జీవన కాలాన్ని మామూలు సంవత్సరాలలో చెప్పడమూ రాజ్యపాలనని అహోరేవ సంవత్సరాలలో చెప్పడమూ చాలా చోట్ల కనిపిస్తుంది గదా,ఈయన కెందుకు తెలియలేదో!

    *వాల్మీకి రామాయణాన్ని యేకపక్షంగా రచించాడు*రాముడు తాటకను వధించడం న్యాయం కాదు*వనాలలో కందమూలాలు భుజిస్తూ ఋషిలా సంచరిస్తానని ప్రతిజ్ఞ చేసిన రాముడు మృగాలను చంపి మాంసభక్షణ చేశాడు*రాముడు బ్రాహ్మణుల,ఋషుల మాటలు విని ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తించాడు*శ్రీరాముడు సీతను భోగవస్తువుగ భావించాడు అని వాదించే పండితుడు తనకి వాల్మీకి పట్ల గౌరవం ఉందనటం కావ్యం పేరు సౌరభాలు అని పెట్టటం చదువరులను మోసం చెయ్యటం కాదా?వికృత పాండిత్యంతో తప్పులు పట్టే కావ్యానికి సౌరభాలు అని పెట్టటం తమరు వెధవలుంగారు అనటం లాంటిది కాదా!శూర్పణఖ ఒక్కసారి చూసీ చూడగానే కంటికి నచ్చాడన్న కారణం తప్ప పరిచయం గానీ కొద్ది కాలపు స్నేహం గానీ యేమీ లేకపోయినా సరే "నేను శూర్పణఖ యను రాక్షసిని,కామరూపిణిని,సర్వభయంకరనై ఈ వనమున ఒంటరిగా తిరుగుచుందును.నా అన్న రావణుడు రాక్షసులకు రాజు - విశ్రవసుని పుత్రుడు,బలవంతుడు - నీవతని పేరును వినియుండవచ్చును.రామా!నిన్ను చూచి నావారి నందరిని వదలి నిన్ను భర్తగా పొందవలయునని నీకడకు వచ్చితిని.నీవు నాకు చిరకాలము భర్తవు కమ్ము." అని యెంత అహంకారంగా రారమ్మని పిలిచినా అది అడిగిన తీరుకి కాలగూడని చోట కాలినా సరే కంట్రోల్ చేసుకోవాలే తప్ప అట్లా వెక్కిరించకూడదనీ తింగరి నీతులు చెప్తూ రాముడు దుర్మార్గుడనీ కేవలం మర్యాదగా అడగటం అన్న ఒకే ఒక్క కారణంతో శూర్పణఖ వంచనకి గురయిన పవిత్ర ప్రేమికురాలనీ అంటున్న వాళ్ళంతా మరునిముషమే లక్ష్మణుడి వెంట పడటం గురించి యేమి చెప్పి సమర్ధిస్తారు?శూర్పణఖని విరూపిని గావించిన రాముడి కన్నా సీతని గౌరవంగా చూసిన రావణుడు మంచివాడని నిరూపించడానికి ఇన్ని కష్టాలు పడి ఈయనగారు రామాయణం చదివి యేమి నేర్చుకోమంటున్నాడు?అటు వైపు నుంచి తన కోరిక తీరాల్సి ఉంది గాబట్టి రావణుడు సీతతో వ్యవహరించినంత మర్యాదగా వ్యవహరిస్తే చాలు యెత్తుకెళ్ళబడిన ఆడవాళ్ళు రావణుడి లాంటి మంచి వాడైన తనని అపహరించిన వ్యక్తితో స్వర్గసుఖాలు అనుభవించవచ్చు అని చెప్పడమే కదా!రావణుడు "కనిపించిన ఆడదాన్ని యెత్తుకొచ్చెయ్యడం రాక్షస ధర్మం కాబట్టి నేను చేసింది అధర్మం కాదు" అని తను చేసిన తప్పుడుపనిని సమర్ధించుకోవడానికి చెప్పిన పిడివాదన కూడా ఈ పండిత్యుల వారి దృష్టిలో ధర్మమే అయితే యెవడయినా సరే "నేను రావణ ధర్మాన్ని పాటిస్తున్నాను" అనేస్తే చాలు గదా ఇంకోడి పెళ్ళాన్ని కిడ్నాప్ చెయ్యడం కూడా ధర్మమే అయిపోతుంది ఇవ్వాళ గూడా,యేం అవదా?

     ఈ పండితుడు వాల్మీకి ధర్మాత్ములని చెప్పిన వాళ్ళని అధర్మపరులుగా నిరూపించాలని చేస్తున్న వాదనల్ని చదువుతుంటే అసలు ఇతను రామాయణం పూర్తిగా చదివాడా లేదా అనేది అర్ధం కావడం లేదు?సుగ్రీవుడు వాలి చచ్చినప్పుడు యేడుస్తూ అన్నవీ విభీషణుడు రావణుడు చచ్చాక అపరకర్మల నాడు అన్నవీ పట్టుకుని చూశారా చూశారా ఈ పాపాత్ములు యెంతటి ధర్మాత్ముల్ని వాళ్ళని పాదాక్రాంతం చేసుకోవాలని కుట్ర పన్నుతున్న ఆర్యరాజైన రాముడి లాంటి దుర్మార్గుడైన త్రువు పంచన జేరి చంపించి తమ స్వతంత్ర రాజ్యాల్ని ఇక్ష్వాకు రాజులకి సామంతరాజ్యాలుగా చేశారో చూడండి అని స్వయముగ బ్రాహ్మణులై సర్వధర్మసమభావనతో పరిపాలించి సనాతన ధర్మం దక్షిణాదిన కూడా వ్యాపింపజేసిన ఆంధ్ర శాతవాహనుల పరిపాలన మొత్తం భరతఖండపు పజల్ని యేకతా భావనతో కలిపివేసిన ఇన్ని సహస్రాబ్దాల తర్వాత ఇవ్వాళ ఆర్య-ద్రావిడ,ఉత్తర-దక్షిణ మొదలైన సంకుచిత భావాల్ని రామాయణ పాత్రలకి పులమడమనే నికృష్టానికి సైతం తెగబడి అన్నా నేను చెప్పేది వినమని బతిమిలాడుతున్నా వినకుండా తన్ని తగలేసి ఆ తమ్ముడి భార్యని పక్కలోకి లాగేసి తమ్ముణ్ణి తన్నమని జనాల్ని ఉసిగొలిపి ప్రపంచం నలుమూలల్నీ తిప్పించిన వాణ్ణీ కేవలం నువ్వు చేస్తున్నది తప్పు మరోసారి ఆలోచించు అని చెప్పినందుకే గుండెల మీద యెగిరి తన్నిన వాణ్ణీ పొగుడుతున్నాడు ఈ ధర్మతత్వకోవిదుడు!విభీషణుడు చిన్నవాడు గాబట్టి నెమ్మదిగా చెప్పినదాన్నే నిద్రలేచిన కుంభకర్ణుడు చావుతిట్లు తిడుతూ చెప్పిన సన్నివేశం ఇతడు చదవలేదా,చదివినా అర్ధం కాలేదా,తనకి అర్ధమయినా మిగతావాళ్ళకి సంస్కృతం యేమొచ్చి చస్తుంది లెమ్మన్న తెంపరితనంతో పట్టించుకోకుండా వొదిలేశాడా అంత ముఖ్యమయిన సన్నివేశాల్ని!ఇవ్వాళ మన బంధువుల్లోనే మనకి తీరని ద్రోహం చేసి పెళ్ళిళ్ళలో కలిసినా పలకరింపులు లేనివాళ్ళలో యెవడయినా చనిపోతే ఖర్మకాలి దినకర్మలకి వెళ్ళాల్సి వస్తే ముఖప్రీతి కోసం నాలుగు మంచిమాటలు మాట్లాడినంత మాత్రాన అవి మనం నిజాయితీగా చెప్పిన మాటలుగా లెక్కవెయ్యాలా?అలా లెక్కిస్తే అంత మంచివాడి మీద అలిగిన మనమే అధములమౌతాం గదా?

     వాల్మీకి నాటకీయత కోసం కధలో అంత ప్రాధాన్యత లేకపోయినా రచనా చమత్కృతి కోసం చెప్పిన విషయాల్ని కూడా ఆర్య-ద్రావిడ పైత్యకారి తనానికి చిహ్నంగా ఒకటికి పది కల్పనలు చేర్చి రాముడనే ఆర్యజాతికి చెందిన సామ్రాజ్యవాది ద్రవిడ రాజ్యాలని ఆక్రమించడం కోసం నాటకాలాడి తన పట్టాభిషేకాన్ని తనే తప్పించుకుని అవుల కొచ్చి యెప్పుడో చిన్నప్పుడు తన తాతల్ని చంపిన రావణుడి మీద పగ దీర్చుకోవాలనే ఉద్దేశంతో రావణుడి కిష్టం లేని పన్లు చేస్తూ బరితెగించి తిరుగుతున్న ఆర్య ఋషుల దగ్గిర ఆయుధాలు తీసుకుని విద్యలు నేర్చుకుని అవకాశం కోసం యెదురు చూస్తూ అమాయకురాలైన శూర్పణఖని విరూపని చేసి రావణుణ్ణి రెచ్చగొట్టి తనున్న చోటుకే కలుగులో యెలక మాదిరి రప్పించుకుని చంపాలని వ్యూహం పన్ని రివర్సు గేరులో ధర్మాత్ముదైన ద్రవిడ రాజ్యాధిపతి రావణుడు తన భార్యనే యెత్తుకెళ్ళి పోతే జాతి ద్రోహులైన సుగ్రీవ విభీషణాదుల్తో కపటవ్యూహాలు పన్ని తన రక్తదాహాన్ని తీర్చుకున్నట్టుగా యెన్నెన్ని పులుముడు సిధ్ధాంతాలు ప్రతిపాదించాడో ఈ చెత్తస్పతి?!

     ఇప్పటికీ సాంప్రదాయాన్ని ప్రేమించే వాళ్ళు బిడ్డ పుట్టిన దగ్గిర్నుంచీ అన్నప్రాశన,అక్షరాభ్యాసం,ఉపవీత ధారణం,వివాహం లాంటి ప్రతిదానికీ ముహూర్తాలు చూస్తారు గదా - సరిగ్గా అదే రకం సంవిధానంతో వాల్మీకి ఒక తమాషా చేశాడు!ప్రతి ముఖ్య సన్నివేశంలోనూ అది జరుగుతున్నప్పుడు గ్రహతారకల స్థితిగతుల్ని వర్ణించాడు.అయితే ఈ మధ్యకాలం వరకూ దాని ప్రాధాన్యత యేమిటో యెవరికీ స్పష్టంగా తెలియలేదు.మన పూర్వీకుల కాలగణనం అమోఘమైనది - కాలాన్ని తిధుల ద్వారా వర్ణించే వాళ్ళు అంటే ఆ సమయంలొ చంద్రుడు యే నక్షత్రంతో ఒక రేఖ మీదకి వచ్చి ఆ తారని కూడినట్టుగా కనిపిస్తాడో ఆ వివరాల్ని బట్టి దిన,వార,పక్ష,మాసాది విభజన చాలా నిక్కచ్చిగా చేశారు!మనం గనక ఒక గ్రహతారకల కూర్పుని చెప్తే కొన్ని వేల సంవత్సతాలకి మాత్రమే ఆ అమరిక మళ్ళీ వస్తుంది కాబట్టి ఆ తిధి యొక్క దిన,వార,పక్ష,మాసాది వివరణ లన్నిట్నీ ఖచ్చితంగా లెక్కించి చెప్పవచ్చును!కానీ మన పైత్యకారులు మనవాళ్ళు చెప్తే నమ్మరు గదా,వీళ్ళు నమ్మే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆధారంతోనే వాల్మీకి వర్ణించిన తిధులు యే సంవత్సరంలో యే నేలలో యే రోజున వస్తాయో పరిశీలించి చూస్తే అవి ఒక సగటు మనిషి జీవిత కాలం పరిధిలోనే వాటి మధ్య ఉన్న కాలావధులు కూడా సరిపోటంత నిక్కచ్చిగా ఉన్నాయి!

     "ప్లానెటోరియం" అనే ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రపు ఆవిష్కరణకి డా.పి.వి.వర్తక్ మహాశయులు ఆ తిధుల వివరాల్ని యెక్కించి విశ్లేషించగా ఆ వివరాలు ఇలా ఉన్నాయి:రాముడి జన్మ తిధి క్రీ.పూ 7323 డిసెంబర్ 4,వివాహ తిధి క్రీ.పూ 7307 ఏప్రిల్ 7,వనవాసారంభ తిధి క్రీ.పూ 7306 నవంబర్ 29,హనుమంతుని లంకాప్రవేశ తిధి క్రీ.పూ 7292 సెప్టెంబర్ 1,సీతా సందర్సన తిధి క్రీ.పూ 7292 సెప్టెంబర్ 2,సేతు నిర్మాణ కాలం క్రీ.పూ 7292 అక్టోబర్ 26-30,రామరావసమరప్రారంభ తిధి క్రీ.పూ 7292 నవంబర్ 3,కుంభకర్ణ హననం క్రీ.పూ 7292 నవంబర్ 7,రావ నిర్యాణ తిధి క్రీ.పూ 7292 నవంబర్ 15,సీతా లక్ష్మ సమేతుడై శ్రీరాముడు అయోధ్యా నగర ప్రవేశం చేసిన తిధి క్రీ.పూ 7292 డిసెంబర్ 6 అని ఆధారాలతో సహా తేల్చి చెప్పారు తన "వాస్తవ్ రామాయణ్" గ్రంధంలో!మరి ఈ పండితుడు చెప్పినట్టు అయోధ్యలోనే రావణుడి మీద పగ పెంచుకుని రావణుడ్ని జయించే ఉద్దేశం తోనే శూర్పఖని విరూపం చెయ్యడం అనే వాదన నిలబడాలంటే వనవాసం మొదట్లోనే యెకాయెకిన పంచవటి యెక్కడుందో వెతుక్కుని అక్కడికే వెళ్ళేవాడు గదా!నేను హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విశ్లేషణంలో చెప్పినట్టు శూర్పణకని విరూపం చెయ్యడం అనేది పదమూడేళ్ళు అక్కడా ఇక్కడా ఆశ్రమాలు కట్టుకుని బతుకుతూ గడిపాక ఇంకొక్క సంవత్సరంలో వనవాసం ముగిసిపోతుందనగా జరిగింది,ముందుగానే కారణం కోసం వెతుకుతూ రావణుడి మీద పగతో రగిలిపోతున్న వాడయితే అంతకాలం యెందుకు పంచవటికి దూరంగా ఉన్నాడనే దానికి యేమి సబబయిన కారణం చూపించగలరు ఈ ఆర్య-ద్రావిడ కుట్ర సిధ్ధాంతులు?ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రాచీన భారత విజ్ఞానాన్ని యదార్ధం అని నిరూపించే రోజొకటి వస్తుందని వూహించి ఉండరు ఈదేశంలోయేముంది గాళ్ళు?

     విశ్వనాధ సత్యనారాయణ లాంటివాళ్ళు వ్యాసుడు యుధ్ధ కాండలో గ్రహస్థితి గురించి చెప్పిన విషయాలని బట్టి లెక్కించి చెప్తే ఈ పిచ్చోడు ఇట్లాగే చెప్తాడని అవహేళన చేశారు!ఇవ్వాళ కృష్ణుడు నివసించిన ద్వారక అవశేషాలు కార్బన్ డేటింగ్ వివరాలతో సహా బయటపడుతుంటే ఆ కాలమూ గ్రహతారకల స్థితుల్ని బట్టి లెక్కించిన కాలమూ సరిపోతుంటే మాట పెగలడం లేదు,బహుశా యెక్కడయినా బొక్కలు దొరుకుతాయేమో అని ఆత్రంగా యెదురు చూస్తున్నట్టున్నారు - వీటిల్లో బొక్కలు వెతికితే తాము భారతీయ విజ్ఞాన శాస్త్రం కన్నా ఘొప్పదని పొగుడుకుంటున్న తమ మానసాంతర్గతప్రభువులైన అమెరికా వారి సంస్కృతిని కించపరిచినట్టవుతుందేమో నన్న భయం వల్ల కూడా గట్టిగా విమర్శించడానికి సాహసించలేకపోతున్నారు కాబోలు, యేమి ఇరకాటం?పండితులు - తప్పు తప్పు, ఆమాట అనగానే ఈ కుపండితుడి లాంటివాళ్ళు గుర్తుకొస్తారేమో,క్నాదు క్నాదు - నిజమైన పాండిత్యం ఉన్నవాళ్ళు మహాభారతాన్ని ఇతిహాసం గానూ రామాయణాన్ని కావ్యంగానూ గుర్తించారు.యెందుకంటే రామాయణంలో ఉన్న "నదీనాం పుష్పోడు వహవాం","క్వచిద్ వేణీకృత జలాం" వంటి భాగాలలో నభూతో నభవిష్యతి అనిపించే విధంగా విస్తరించిన కవితా సౌరభం భారతంలో తక్కువ.భారతం చరిత్ర పాఠం చదివినట్టు ఉంటుంది - ఆసక్తి గలవాడు మాత్రమే ఓపిక చేసుకుని చదవగలడు,లేని పక్షంలో మంచి వ్యాఖ్యాత యెవరయినా చెప్పగా వినాలి!రామాయణం అట్లా కాకుండా కవిత్వం తేనెలూరుతున్నట్టు ఉంటుంది - ఉదాహరణకి నది ఒడ్డున పెరిగిన పూలచెట్టు నుంచి పూలు రాలిపడి ప్రవాహానికి కొట్టుకుపోతుంటే చూడగానే యేమీ అనిపించదు,కానీ వాల్మీకి కవిత "నదీసుందరి కొప్పులో పూలు ముడుచుకుని నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఉంది" అనే భాగం చదివాక అదే దృశ్యం కొత్తగా కనిపిస్తుంది,అవునా!నాకు భారతం మొదట గ్రంధస్తం అయితే అందులోని అరణ్యకాండలో వచ్చే కధామూలాన్ని చూసి వాల్మీకి రామాయణం రాశాడని - యెవరో అట్లా వ్యాఖ్యానించినట్టు గుర్తు - అనిపిస్తున్నది.ఈ మధ్యనే కొందరు మిత్రులు కాదంటున్నారు.రచనాకాలం యేది ముందయినా కవితా విశేషాల్ని బట్టి చూస్తే మాత్రం రామాయణమే ఆదికావ్యం - నిస్సందేహంగా!తొలిసారి ఒక కొత్త ప్రక్రియని తీసుకుని ఆ మొదటి ప్రయత్నంలోనే అంత గొప్పగా ప్రకాశించడం ప్రపంచ సాహిత్యంలోనే అపూర్వం కదా?

     సూర్యవంశపు రాజులలో 67వ వాడైన రాముని గురించి తవ్వకాల ద్వారానూ మరే విధంగానూ సాక్ష్యాధారాలు లభించకపోయినా వాల్మీకి రామాయణంలోని కొన్ని అంశాలు రాముడు కల్పిత పాత్ర కాదనీ రక్తమాంసాలతో ఈ భూమి మీద నడయాడి కొన్ని ఘనకార్యాల్ని చేసి సాటివారిచే దైవాంశ సంభూతుడిగా కీర్తించబడిన విశేషమానవుడని భావించడం పూర్తిగా అసత్యం కాదని భావించేటందుకు దోహదం చేస్తున్నాయి!అసలు రామకధ మొదలవడమే వాల్మీకి నారదుడికి తను ఒక ఆదర్శమానవుణ్ణి నాయకుడ్ని చేసి కధ రాయాలనుకుంటున్నట్టు చెప్పి అటువంటివాడు ఇదివరకే యెవరయినా ఉన్నారా అని అడిగితే నారదుడు కొత్తగా కల్పించడం దేనికి అటువంటివాడు ఉన్నాడు అతని కధనే రాయవచ్చు కదా అనడంతో మొదలవుతుంది కదా!

     రామాయణంలో ప్రస్తావించబడిన ప్రతి నగరమూ జనపదమూ ఈరోజుకి గూడా అక్కడ రాముడు సంచరించాడని చెప్పేటందుకు కధలోని సన్నివేశంతో గల అనుబంధానికి ఒక ఆలయమో చిహ్నమో కలిగి వుండి కనబడుతున్నాయి.వాల్మీకి వాటి గురించి వర్ణించిన స్థల-కాల-దూర సంబంధాలు అన్నీ వాల్మీకి వర్ణించిన విధంగానే ఉన్నాయి.కధ అయోధ్యలో మొదలవుతుంది.రాముని తల్లి కౌసల్య ఇప్పటి చత్తిస్ ఘడ్ ప్రాంతంతో సరిపోలుతున్న కోసల రాజ్యం నుంచి వచ్చింది.సుమిత్ర వచ్చిన మగధ బీహారులో ఉంది.కైక వచ్చిన కేకయ రాజ్యం ఇప్పటి వజీరిస్థాన్ అవుతున్నది.సీత జన్మించిన మిధిల ఇప్పటి నేపాల్ రాష్ట్రంలో ఉంది.సీత భూమి నుంచి బయల్పడిన సీతామర్హి అనే ప్రాంతం స్మారకచిహ్నంగా కూడా ఉంది.వనవాస కాలంలో రాముడూ సీతా నడయాడిన చోటులన్నీ అడుగుజాడలుగా నేటికీ కనబడుతూనే ఉన్నాయి - ఈనాటికీ వాల్మీకి వర్ణించినంత నిర్దుష్టమైన స్థల-కాల-దూర విశేషాలన్నింటితో సజీవసాక్ష్యాలుగా నిలబడుతూనే ఉన్నాయి!ఇదిగో ఇక్కడ ఇలా:
ఇప్పటికి దొరికిన చారిత్రకాధారలతో వాల్మీకి క్రీ.పూ 4వ శతాబ్దికి చెందిన శుంగ వంశపు రాజైన పుష్యమిత్రుడి కాలం లోని వాడైతే ఈ స్థల-కాల-సంబంధాలన్నీ నిజం కావాలంటే రెండే రెండు విధాలైన కారణాలు ఉన్నాయి.మొదటి వూహగా ఆయా స్థలాల్లో ఆ వెనుకటి కాలంలో సంచరించిన ఆ విశేషమానవుణ్ణే వాల్మీకి రామాయణ కావ్యంలో నాయకుడిగా నిలబెట్టాడని ఒప్పుకోవాలి.రెండవదిగా  వాల్మీకి చాలా తెలివిగా తను దేశమంతా తిరిగి చూసిన స్థలాలని రాముడు తిరిగిన స్థలాలుగా చెప్పి ఒక కల్పిత కధని వాటి వాస్తవికత చాటున తన కధకి ప్రామాణికతని కల్పించుకోవటం అనే సిధ్ధాంతం!కానీ ఒక మనిషి కొందర్ని కొంతకాలం మాత్రమే మోసం చెయ్యగలడనేది వాల్మీకి పట్ల గూడా నిజమే కావాలి గదా.మనుషులు పూనుకుని చెయ్యాల్సిన యే వ్యవస్థీకృతమైన శ్రమా లేకుండా అట్లాంటి పనులు సాధ్యం కావు!ఆయా ప్రాంతాలు యెప్పటి నుంచీ రాముడితో అనుబంధాన్ని కలిగి ఉన్నాయి అనేది పరిశోధిస్తే యదార్ధం తెలుసుకోవచ్చు.ఈ రెంటిలో యేది నిజమైనా అది వాల్మీకి అత్యధ్భుతమైన ప్రతిభని నిరూపించినట్టే అవుతుంది!

     అసలు రామాయణం రాముడి కధ కాదు - సీత అనే రామ యొక్క కధ! రాముడిలో తప్పులు పట్టిన ఈ కుపండితులతో సహా అందరూ సీతలోనూ హనుమంతుడిలోనూ తప్పులు పట్టలేకపోవడానికి కారణ మేమిటి?రాముడు దేవుడు కాదు, దైవసంస్పర్శ కోసం తపించే మానవుడు - అతడు తప్పులు చెయ్యటం సహజం,ఆ తప్పుల్ని సరిదిద్దటం ఆచార్య లక్షణం,ఆ సాధకుడి పట్ల కరుణతో అతని వెంటే ఉండి అతన్ని ఆపదల నుంచి రక్షించడం దైవప్రకృతి - కాబట్టి ఆదికవి వాల్మీకి వాళ్ళిద్దరినీ లోపరహితులుగా చూపించి రాముడిలో కొన్ని మానవసహజ దౌర్బల్యాల్ని చూపించటం జరిగింది!సీత ఆఖరిలో రాముణ్ణి చేరకుండా భూప్రవేశం చెయ్యడం రాముని పట్ల తిరస్కారంగా వ్యాఖ్యానం చేసే మందబుద్ధులు వనవాసానికి సీతని రావద్దన్న సందర్భంలో నపుంసకత్వం గురించి కూడా ప్రస్తావించి తన మాట నెగ్గించుకునే సందర్భంలోనూ,రాక్షసుల పట్ల వైరము లేని హింస గురించి ధర్మసూక్ష్మం చెప్పేటప్పుడూ,శీలపరీక్షా సన్నివేశంలో పామరుడిలాగా మాట్లాడుతున్నావు అని ధిక్కరించి మాట్లాడినపుడూ రాముడి కన్నా అధికురాలిగానే కనబడిందనేది మర్చిపోతున్నారు!రాముడు నన్ను అడవులకి పంపించి నాకు అన్యాయం చేశాడని సీత వీళ్ళతో చెప్పుకుని యేడ్చిందా -  సీతకి లేని యేడుపు వీళ్ళ కెందుకో మరి కందకి లేని దురద లాగ?జనకరాజ నందన అయిన సీతకి వీరందరి కన్నా రాజధర్మం యెంత కష్టమో తెలుసు,పదిసార్లు అట్లా జరిగినా పదిసార్లూ రాముడు అట్లాగే తనని పరిత్యజిస్తానీ తెలుసు,అందులోని ధర్మసూక్షం కూడా తెలుసు - రాముడు చేసింది ధర్మమేనని సీతకీ తెలుసు గనకనే ఒక్క మాట కూడా మాట్లాడ లేదు - సీతాయాః చరితం మహత్!అవతార పరిసమాప్తికి కాలం సమీపించిందని సూచన ఇవ్వటానికి తను ముందుగా మాతృగృహం చేరింది.

     సీత భూగహ్వరం చేరిన తర్వాత కూడా యెందుకో రాముడింకా అయోధ్యని వీడి వైకుంఠాన్ని చేరే ఆలోచన చెయ్యకపోవడంతో దేవతలు యమధర్మరాజుని రాముడితో సంభాషించమని పంపించారు.హనుమంతుడు ఉండగా అతని కిష్టులైన వార్ని యముడు సమీపించలేడనో మరి రాముడికే హనుమంతుడు చూస్తుండగా దేహపరిత్యాగం చెయ్యడం కుదరదని అనిపించిందో తెలియదు గానీ హనుమంతుణ్ణ్ణి అక్కడినుంచి దూరంగా పంపించడానికి ఒక చిత్రమైన సన్నివేశం కల్పించబడింది!రాముడి చేతి ఉంగరం జారిపడి నేలమీద ఉన్న చిన్న కలుగులోకి మాయమవుతుంది.రాముడు అడగ్గా హనుమంతుడు కీటకంలా మారి దానిలోకి దూరి వెళ్ళగా అటువైపున తాను నాగలోకం చేరానని గ్రహిస్తాడు హనుమ!అక్కడ వాసుకి కనిపించి హనుమకి ఒక చోటు చూపించి ఇక్కడ వెదుక్కోమంటే వెళ్ళి చూసిన హనుమ ఆశ్చర్యపోతాడు, ఒకటి కాదు రెండు కాదు అంగుళీయకాల రాశియే కనబడటంతో!వాసుకిని అడిగితే "నాయనా,నువ్విప్పుడు ఈ ఉంగరం తీసుకుని పైకి వెళ్ళేసరికే నువ్వు సేవించిన రాముడు అక్క ఉండు!యే ఉంగరం ఇప్పుడు జారిపడిందో వెతికి తీసుకెళ్ళి ఇచ్చే ఆశ వొదులుకో, కాలాని కొక్కటిగా అవి అలా జారిపడుతూనే ఉంటాయి!" అని చెప్పాడు.అంటే రామ కధ యెప్పటికీ అంతమైపోదు,మళ్ళీ మళ్ళీ నడుస్తూనే ఉంటుంది అని సూచన!నేనంటున్నదీ అదే - ప్రతి మనిషీ మనీషి కావడానికి చేసే ఆధ్యాత్మిక ప్రయాణంలో రామకధ గర్భితమై నడుస్తూనే ఉంటుంది!


నైతికంగా ఉన్నతంగా జీవించాలని ఆశించే ప్రతి మానవుడూ రాముడే!
జై శీరాం!
_______________________________________________________________

Friday 22 May 2015

తెరాసా కేంద్రంలో భాజపాతో కలిస్తే తెలంగాణకు లాభమేమిటి?

          తెలంగాణా సాధన వల్ల విపరీతంగా లాభపడింది రాష్ట్ర మంత్రివర్గంలో ఒక ముఖ్యమంత్రి మరియూ అతి కీలకమైన మూడు శాఖల్ని దక్కించుకోవడం ద్వారా కేసీఆర్ కుటుంబమే కదా అంటే  అప్పుడే పుట్టిన బుజ్జి పాపాయి కూడా "ఉంగా ఉంగా" భాషలోనే అవునని పిడికిళ్ళు బిగించి మరీ చెప్తాడు కాబట్టి రేపు తెరాసా "మీరు పిలిస్తే చాలు వచ్చి దూకుతాం" అని అంటున్న వుత్తుత్తి కబుర్లకి భాజపా బొక్కబోర్లా పడిపోయి పిల్చినా అప్పుడు కూడా లాభం కేసీఆర్ కుటుంబానికే తప్ప ఇంకెవ్వరికైనా ఉంటుందా?అదీగాక అక్కడ వినపడుతున్న పేరు పొరపాటున కూడా బయటివాళ్ళ పేరు రావడం లేదు కాబట్టి కేసీఆర్ కీ తెలంగాణా కీ అభేదాన్ని పాటించే బానిసాధములు మాత్రం పులకించి పోతారు!ప్రజలందర్నీ తమలాగే మార్చెయ్యగలిగితే అప్పుడు మాత్రమే తెలంగాణా  మొత్తం సంతోషిస్తుంది.

          ఇంతకీ మోదీ గారు పాత వ్యవస్థని రద్దు చేసి నీతి ఆయోగ్ పేరుతో ముఖ్యమంత్రుల్నే భాగస్వాముల్ని చేసి "మీ ప్లానింగ్ మీరే చేసుకోండి,మీ నిధుల్ని మీరే తీసుకెళ్ళండి" అని కొత్తదనాన్ని చూపిస్తున్నప్పటికీ తెరాసా వారు భాజపా పిలవకపోయినా పిలిచినట్టు వూహించుకుని కలవరిస్తూ కేంద్ర మంత్రివర్గంలో చెరడానికి అట్లా వూగుతున్నారంటే దానర్ధం యేమిటి?సలహా ఇచ్చినప్పుడు కాలినా రాధాకృష్ణ చెప్పినట్టు కేంద్రాన్ని కాకా పట్టనిదే బతుకుబండి సాగదని రూఢిగా తెలిసిపోయిందా అప్పుడే!

          యాభయ్యేళ్ళుగా మమ్మల్ని దోచుకున్నారు అనే వాదనతో ఆంధ్రోళ్లని తిడుతూ అసెంబ్లీలో విభజన బిల్లుకి సానుకూలతని పోగొట్టుకుని ఆర్టికిల్ మూడుని  నమ్ముకుని ఆదాయం పెరగడంలో వాటా ఉందని ఒప్పుకుంటూనే ఇన్నాళ్ళూ మమ్మల్ని దోచుకున్నారు గాబట్టీ మా ప్రాంతంలోకి వస్తుంది గాబట్టి ఆదాయమంతా మాకే మీకు చిల్లిగవ్వ కూడా ఇవ్వం అని అంత మంకుపట్టు పట్టడం వల్ల అంతిమంగా విడిపోయాక చూస్తే మాత్రం విడిపోయిన మొదటి సంవత్సరానికి నిలవలో ఉండటం ఒక్కటే వూరటగా అనిపించినా కడలిని మించిన కష్టాలు రాష్ట్రం మొత్తాన్ని కరువుకోరల్లోకి నెట్టెయ్యడానికి చూస్తున్న పరిస్థితి దాపరించింది.

    విడిపోయిన కొద్ది కాలంలోనే చాలా పరిశ్రమలు హైదరాబాదు నగరం నుంచి అంటే తెలంగాణ నుంచి తరలిపోయాయని రూఢిగా తెలుస్తున్నది.ముఖ్యమంత్రుల కొడుకులు కూతుళ్ళ జాతరలు మాత్రం పెరిగినాయి.అమేరికాలోనే కాదు డిల్లీ మొదలు ప్రపంచంలో యెక్కడ చెప్పుకోదగిన స్థాయిలో తెలుగువాళ్ళు ఉన్నా అక్కడికల్లా ఈ జోడు మద్దెల మేళాల మోత తప్పదేమో!ఒకళ్లనొకళ్ళు తెలుగులోనే గదా తిట్టుకుంటున్నాం అనుకుంటే కుదరదు.సౌగతా రాయ్ అనే బెంగాలు పార్లమెంటు సభ్యుడు అప్పుడెప్పుడో తెరాసాకి ఇద్దరే ఇద్దరు సభ్యులు ఉండి అందులో ఒకరు కేసీఆర్ తన సీట్లోనే ఉండగా విజయశాంతి జై తెలంగాణా నినాదాలు చెయ్యడం నుంచి మొదలు పెట్టి పూస గుచ్చినట్టు చెప్పి అందరూ మనల్ని యెంత చక్కగా గమనిస్తున్నారో కళ్ళకి కట్టినట్టు చూపించాడు!ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని తమ రాష్ట్రంలో అడుగుపెట్ట్టనివ్వం అని ఒక తెరాసా మంత్రి అన్నదానికి ఉచితబోడిసలహా కూడా ఇచ్చినట్టు ఉన్నాడు కదా!ఇంగ్లీషు మీడియా అనువదించి ప్రచురిస్తే ప్రపంచమంతా చదువుతారని తెలుసుకోండి - యెకనామిక్ టైంసులో గనక అలాంటి వార్తలు పడితే దాన్ని యెక్కువగా చదివే వ్యాపారస్తులకి అలాంటి ధెరణులు ప్రమాద సూచనగా కనబడి జరిగే హాని అంతా ఇంతా కాదు!

          అటు నవ్యాంధ్ర చూస్తే లోటుతో విడిపోయినా ముఖ్యమంత్రి కంద్రప్రభుత్వంలో భాగస్వామిగా వుండి కేంద్రం నుంచి లభిస్తున్న సహకారం భరోసా ఇవ్వగా ప్రపంచదేశాలన్నీ తిరిగి యం.వో.యు లు కుదుర్చుకుని పెట్టుబడుల పరంగా ధీమాగా వుండి భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని కలిగిస్తున్నాడు!ఇటు చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రం దాటి రెండుసార్లు వెళ్ళి వచ్చినా పుల్లయ్య్య వేమవరం వెళ్ళోచ్చిన చందమే తప్ప నికరలాభం యేదీ రాలేదు?విభజన బిల్లులో ఉన్నవీ లేనివీ మాట్లాడుకుని ఉన్నవాట్ని న్యాయంగా పరిష్కరించుకోవడంలోనూ లేనివాట్ని కొత్తగా ప్రతిపాదనలు చేసుకుని పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోకపోతే నష్టం తెలంగాణకే యెక్కువ అని తెలంగాణా మేధావులు యెప్పటికి గుర్తిస్తారో!వాతావరణం వేడెక్కి మారుమూల గ్రామాల్లో చెరువులు యెండిపోవటానికి కూడా ఆంధ్రోళ్ళ నిర్లక్ష్యమే కారణం అంటుంటే అది నిజమో అబధ్ధమో తేల్చుకుందామని ప్రయత్నించకుండా విద్యాధికులు కూడా నమ్మేస్తున్నారు,ఇవ్వాళ పూడికలు తీస్తున్న సరస్సులు నిండటానికి నీరు యెక్కణ్ణించి తెస్తారు?ఆ పూడికలు తియ్యటం పూర్తయ్యి అవి నిండేవరకూ రైతులు తమ పొలాల్ని బీడుభూములుగా వుంచాల్సిందేనా?అదొక్కటే తెలంగాణ వ్యవసాయానికి పరిష్కారమైనట్టు సమైక్యంగ ఉన్నప్పటి రైతుల ఆత్మహత్యలకు అప్పటి సమైక్య ప్రభువులే కారణమన్న వారు ఇవ్వాళ్టి రోజున జరుగుతున్న ఆత్మహత్యలకి కనీసం స్పందించను గూడా స్పందించటం లేదనేది చూస్తున్నారా?రాగద్వేషాలు లేని నిండుమనస్సుతో నిక్కచ్చిగా అంచనా వేస్తే నవ్యాంధ్రప్రదేశ్ లోటుతో విడిపోయినా రాజకీయపరమైన నాయకత్వం గట్టి నమ్మ్మకాన్ని కలిగిస్తుండగా తెలంగాణా మిగులుతో విడిపోయినా రాజకీయ నాయకత్వం యెట్టి నికరమైన ఆశనీ కలిగించని విధంగా ఉంది!

          కేంద్రమంత్రివర్గంలో చేరడం అనేది పైకి చూడటానికి గొప్పగా కనబడినా లోనారసి చూస్తే అక్కడ ప్రధాన పార్టీ అయిన భాజపాకి పల్లకీ మొయ్యటం కన్నా గొప్పగా వుండదు.తన రాజకీయ జీవితం మొదలైన తొలిరోజుల్లో అనామకంగా ఉన్న మోదీని ప్రతి పత్రికా సమావేశంలోనూ ఒకసారయినా ప్రశంసించకుండా తన పత్రికాసమావేశాన్ని పూర్తి చెయ్యలేకుండా ఉన్నాడు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,తప్పనిసరిగా నన్ను పొగడమని మోదీ చెప్పాడా,లేదే?మోదీ ఇప్పుడున్న స్థానమూ తన అవసరమూ అట్లా ఉంది మరి!నేను రెండు ముష్టి చిప్పలు అన్నందుకు అప్పుడు మిత్రులొకరు అట్లా ఉండదేమో అన్నారు,కానీ ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు నిలబడి ఉన్న వాస్తవ పరిస్థితి యేమిటో చూస్తున్నారు గదా!నిన్నటి నా అంచనాలన్నీ చాలామటుకు ఇవ్వాళ నిజమవుతున్నాయి,కానీ అవి నిజం కాకుండా ఉంటేనే బాగుండేది కదా అని బాధపడాల్సిన పరిస్థితిలో ఉన్నాను నేను!

          పరస్పర లాభాన్ని ఆశ్రయించే ఈనాటి వాతావరణంలో తెరాసాకి కేంద్రమంత్రివర్గంలో చోటు కల్పించడానికి తెరాసా వైపు నుంచి యేమీ చెయ్యనక్కర లేదా?చెయ్యాలి,తెలంగాణలో వ్యాపించడానికి భాజపాకి సహకరించాలి!తెలంగాణలో తొలి బోణీ భాగ్యనగరమే కావాలని భాజపా ప్రణాళికల్ని బట్టి వూహించవచ్చు.ఇక్కడయితే హిందూ ముస్లిం వాతావరణాన్ని బలంగా పైకి లేపే వీలు ఉండటం వల్ల తను కూడా సొంతంగా కృషి చేసి పునాదిని పటిష్ఠం చేసుకోవచ్వ్హు,నగరం వెలుపలి ప్రాంతాల్లో యెక్కడన్నా అయితే పై స్థాయిలోని నాయకులే కాదు తెరాసా కింది స్థాయిలోని శ్రేణులు కూడా భాజపాని బుజాల మీద మోస్తే గానీ పని జరగకపోవచ్చు!మొదటి సాక్ష్యంగా నిన్నటిదాకా నిజాముని పొగిడినంత గట్టిగా స్వామి రామానంద తీర్ధని పొగడాలి!పాతబస్తీ మిత్రుల సాయం ఆశ వొదులుకోవాలి,అంత క్రూరకార్యం చెయ్యగలరా?యేదో ఒక నికరమయిన హామీ లేకుండా వస్తామనంగానే అక్కున జేర్చుకోవడానికి భాజపా వాళ్ళు వెర్రి వెంగళప్పలు కారుగా!

పూర్ణకుంభాన్ని పగలగొట్టుకుని రెండు ముష్టిచిప్పల్ని సాధించుకున్న వెంగళప్పలు తెలుగువాళ్ళే!

Tuesday 19 May 2015

లాలూ లాలూ?యేంటి పప్పా!గడ్డి తిన్నావా?లేదు పప్పా!అబధ్ధం చెప్తున్నావా?లేదు పప్పా!యేదీ నోరు తెరువ్?హ్హా హ్హా హ్హా:-)

          రక్తచందనం శేషాచలం కొండలు మొదలుకొని రాయలసీమ ప్రాంతంలోని కడప,చిత్తూరు,కర్నూలు జిల్లాలలోనూ ఆంధ్రప్రాంతంలోని నెల్లూరు జిల్లా లోనూ విస్తారంగా పెరుగుతుంది.చైనా మయన్మార్,జపాన్ మరియూ తూర్పు ఆసియా దేశాలలో దీనికి గిరాకీ యెక్కువ!ప్రాచీన కాలంలో యజ్ఞాలలో సమిధలుగా వాడేవాళ్ళు.బౌధ్ధులు ఇప్పటికీ ప్రార్ధనా సమయంలో సువాసన కోసం ప్రశాంతత కోసం చందనం వెలిగిస్తారు.టిప్పు సుల్తాన్ "చందనం వృక్షరాజం" అని పొగిడి ప్రభుత్వపరంగా దాన్ని ఆదాయవనరుగా ఉపయోగించుకున్నాడు.ఇదివరలో దీని ఉపయోగం జపానులోనూ చనాలోనూ గృహోపకరణాల కోసమే పరిమితమైనా ఇటీవల రంగుల తయారీలొనూ టూత్ పేష్టుల తయారీలోనూ కూడా వాడుతున్నారు.

          భారత ప్రభుత్వం 2013లో పట్టుకున్న రక్తచందనం దుంగల విలువ 5000 కోట్లు.ఆంధ్రా లోనే గోడౌన్లలో తరలించదం కోసం దాచి ఉంచిన 9000 టన్నుల్ని వశపరుచుకున్నారు.2001 నుంచి 2007 సంవత్సరాల మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3000 టన్నుల్ని పట్టుకుని వశపర్చుకున్నది.ఆగస్టు 2014 నాటికి రక్తచందనం స్మగ్లింగు చేస్తూ చట్టానికి పట్టుబడిన వాళ్ళు చిత్తూరు జిల్లాలో 40మంది,తిరుపతిలో 36మంది,కడపలో 42మంది,నెల్లూరులో36మంది,మొత్తం తమిళనాడు రాష్ట్రంలో 18మంది,మొత్తం కర్నాటక రాష్ట్రంలో 24మంది!2014 జూన్ నుంచి జూలై లోపు చిత్తూరు జిల్లాలో 50,00,000 విలువ చేసే  25లాగ్సు, కడప జిల్లా సంబేపల్లి మండలంలో 1,25,00,000 విలువ చేసే 64 లాగ్సు, కడప జిల్లా కోడూరు మండలంలో 2,50,00,000 విలువ చేసే 156 లాగ్సు, కడప జిల్లా బద్వేల్ మండలంలో 2,50,00,000 విలువ చేసే 156 లాగ్సు పట్టుబడినాయి.

          మొదట్లో చాలా తక్కువ స్థాయిలోనే జరిగేది,కానీ వీరప్పన్ ఘనకార్యాలు ప్రపంచానికి విదితమయ్యాక మిగతావాళ్ళు అసహ్యంతో చీకొడీతే ఇక్కడి స్మగ్లర్లు గురుభావంతో పూజించి అతనినుంచి తమకు కావల్సిన ట్రిక్కుల్ని నేర్చుకున్నారు!చేస్తే శుధ్ధక్షవరమే చెయ్యాలన్నారు గదా పెద్దలు అని స్మగ్లింగుని మరింత సంఘటితంగా చెయ్యడం మొదలుపెట్టారు.అందరికీ తెలియకుండా జరుగుతుందనే తప్ప పరిశ్రమలకి ఉండాల్సిన అన్ని హంగుల్నీ చాలా దిట్టంగా యేర్పాటు చేసుకున్నారు.ఈ వ్యవస్థలో కింది అంతస్తులో కేవలం చెట్లని కొట్టి దుంగల్ని దళారీల కనువైన చోటికి మారుస్తూ ఖర్మచాలక పట్టుబడితే అనాధపిండాలుగా హతమారిపోయే యెర్రకూలీలు అని మీడియా చేత దుర్మార్గులుగా ముద్రవేయబడ్డ పనివాళ్ళు ఉన్నారు, అన్ని ప్రమాదాలకి గురయి అన్ని భీబత్సాలు చేసి స్పాట్ దగ్గిర కనబడి హతమారిపోవడానికి సిధ్ధపడినందుకు వాళ్లకి దక్కేది రోజుకు రు.500 నుంచి రు.750 వరకూ మాత్రమే!మరీ గట్టిగా పనికొస్తాడు అనుకున్నవాళ్ళకి 1000 నుంచి 3000 వరకూ ఇస్తారేమో!యెట్టి పరిస్థితుల్లోనూ అట్టడుగున ఉన్నవాళ్లకి యెక్కువ లాభం మాత్రం ఉండదనేది ఖాయం!వాళ్లలో చాలామందికి అసలు రక్తచందనం విలువ యెంతో తెలియదు,రిస్కు నంతా తమమీద తోసి పై స్థాయిలో వాళ్ళు సంపాదించేదానితో పోలిస్తే తమకు అన్యాయం జరుగుతున్నదని కూడా తెలియదు పాపం!?పైనుంచి సరుకుకోసం కబురు రాగానే యెంత కావాలో చెప్పి కూలీల్ని నరకాల్సిన దుంగల్ని మార్క్ చెయ్యడానికి పంపించి మళ్ళీ వాళ్ళు నరికి అప్పజెప్పిన స్పాట్ గురించి పై స్థాయి వాళ్లకి వివరాలు చెప్తూ కూర్చున్న చోటు ఉంచి కదలకుండా వారానికి రు.80,0000 లెక్కన సంపాదించే మధ్యదళారీలు రెండో వరసలో ఉన్నారు.వీళ్ళ పైన దారిలో ఉన్న చెక్ పోష్టుల్ని తడిపి రహదారుల్ని మెత్తబరుచుకుంటూ సరుకుని దేశం సరిహద్దులు దాటించే ఘనాపాఠీల ఆదాయం వాళ్ళు పోలీసుల్ని,రాజకీయ నాయకుల్ని తడపటానికి పెట్టిన ఖర్చు లన్నిట్నీ కలిపి మినహాయించినా మనమెవ్వరమూ యేనాడూ కనీసం వూహించను గూడా వూహించలేం,వూహించడానికి ప్రయత్నిస్తే మనం ప్రశాంతంగా ఉండలేం!అసలు పై స్థాయి స్మగ్లర్లు చైనా,జపాన్ లాంటి దేశాలలో అంగరంగవైభోగాల్తో కొలువుదీరి చక్రం తిప్పుతూ ఉంటారు - వాళ్ళు యెంత సంపాదిస్తున్నారో తెలుసుకోవడం మనబోటి సామాన్యులకే కాదు ఈ కేసుల్ని విచారించే అధికార్లకి గూడా అసాధ్యం - ఈ పోష్టు రాయడం కోసం నేను చదువుతున్న విషయాలకి నాకే తల తిరిగి మైండు బ్లాంకయి పోయింది!

          నిక్కచ్చిగా అంకెల ఆధారాల్ని సేకరించకుండా యెంత ఉజ్జాయింపుగా లెక్కేసినా గానీ ఇప్పటి 13 జిల్లాల నవ్యాంధ్ర రాష్ట్ర ప్రభుత్వపు తలసరి ఆదాయం కన్నా యెక్కువే వుండొచ్చు అక్కడ జరుగుతున్న వ్యవహారంలో అంతిమగా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్లందరి దగ్గిరా పైకి తేలుతున్న ఆదాయాల్ని లెక్కవేస్తే!విడిపోయిన తర్వాత లోటుబడ్జెట్టు కష్టాలతోనూ యెటువైపు నుంచీ నికరమైన సహాయం రాని స్థితిలో ఉన్న ఇప్పటి ప్రభుత్వం తప్పనిసరి అయి వీళ్ళ మీద యుధ్ధం ప్రకటించింది గానీ గత యెన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్లలో కూడా యెర్రస్మగ్లర్ల సహాయ సహకారాల తోనే గెలిచినవాళ్ళు చాలామంది ఉన్నారు!

          మొత్తం వ్యహారమంతా అచ్చు సినిమాల్లో చూస్తున్నట్టు చాలా నాటకీయంగా ఉంటుంది.యెక్కడో ఒక చిన్న కాకా హోటల్లో కూర్చుని నిముషానికో సెల్ ఫొనుని మారుస్తూ యేదేదో మాట్లాడేస్తున్న మనిషి మీకు కనబడ్డాడనుకోండి అతను ఫోను పిచ్చోడు కాదు - కూలీల్నీ,కూతపిట్టల్నీ,నిఘా పోలీసుల్నీ,ఫారెస్టు రేంజర్లనీ కలుపుతున్న స్మగ్లింగు సామ్రాజ్యానికి సంబంధించిన సింధువులో ఒక బిందువు కావచ్చు!మాసిపోయిన బట్టల్తో రోడ్డుపక్కన బీడీ కాల్చుకుంటూ ఉండే వ్యక్తి కూడా - గట్టిగా పోలీసులు దబాయిస్తే "ఇక్కద తిరిగేవాళ్ళనతా స్మగ్లర్లేనా?" అని నిర్లక్ష్యంగా జవాబిచ్చినా మరు నిముషంలోనే పోలీసుల గురించి ఉప్పందించే కూతపిట్ట కావచ్చు!శేషాచలం అడవుల పరిసర ప్రాంతాలలోని పోలీసు స్టేషన్ల గోడల మీద ఆయా ప్రాంతాలకి చెందిన చాలామంది రాజకీయనాయకుల ముఖారవిందాలు జేబుదొంగల పక్కనే కనిపిస్తాయి,అయినా వాళ్ళకి సిగ్గు కానీ మరొకటి గానీ లేవు?

          మన దేశపు రాజకీయ వ్యవస్థ యెంత దారుణంగా ఫెయిలయిందో చూదండి!అవేం పాల డబ్బాలా సిల్కు రుమాళ్ళా అగ్గిపెట్టెలా కనబకుండా దాచేసి అమాయకులైన అధికార్లని మోసం చేసి దాటించుకుపోవడానికి?అంత పెద్ద సైజులో ఉన్న యెర్ర్రచందనం దుంగల్ని స్మగ్లర్లు ఇన్నేళ్ళుగా అంత నిర్భయంగా కొన్ని వందల వేల మైళ్ళు దేశపు సరిహద్దుల లోపల తిప్పుతున్నా, క్షేమంగా దేశపు సరిహద్దులు దాటిస్తున్నా,దానివల్ల ప్రజాప్రభుత్వాల ఖజానాలకి యెంత నష్టమో తెలిసి కూడా యేమాత్రమూ సంకోచించకుండా స్మగ్లర్ల నుంచి సహాయాలు పొందుతూ వాళ్ళకి సహాయాలు చెయ్యడం కోసమే అధికారంలోకి వస్తున్నది మనం వేస్తున్న వోట్లతోనే గదా?వాళ్లకి వత్తాసు పలికేవాళ్ళు అధికార పార్టీలోనూ ఉన్నారు కదా,ఈ ప్రభుత్వాన్ని నిజంగా నమ్మగలమా?


యధా రాజా తధా ప్రజా అన్నది అప్పటి మాట!
యధా ప్రజా తధా రాజా అన్నది ఇప్పటి మాట?

Monday 18 May 2015

పనిలేక బ్లాగు యెందుకు మూతపడింది?అందులో నా ప్రమేయం యెంత!నేను దొంగనాయకమ్మ బ్లాగులో కామెంట్లు వెయ్యడం తప్పా?!

హఠాత్తుగా వరూధిని బ్లాగులో మే 13న ఒక బాంబు పేలింది - నేటితో "పనిలేక" బ్లాగు మూతపడింది అనే కామేంటుతో!నిజంగా ఇది సంచలనమే,యెందుకంటే కొత్తగా తెలుగు బ్లాగుల్లో కడుగుపెట్టినవాళ్లకి తెలియదు గానీ పాతకాపు లందరికీ బాగా తెలిసిన బ్లాగే అది!రొజుకోసారయినా ఆ బ్లాగుని తొంగి చూడకుండా ఉండలేరు, అక్కడి విషయానికి తగ్గట్టు కామెంటు వెయ్యకుండానూ ఉండలేరు!నేనయితే ఆగ్రిగేటరు వరకూ వెళ్ళడం యెందుకని నా ఆడ్మిన్ అక్కౌంటులోనే ప్రతిరోజూ చూడడానికి వెలుగా ఫ్యావరేట్ బ్లాగుల లిస్టులో యెప్పుడో చేర్చేశాను.

అసలు ఇవ్వాళ తెలుగు చదవాలని యెంతమంది అనుకుంటున్నారు?భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే నినాదంతో విడిపోయిన తొలి రాష్ట్రం తెలుగుని రాష్త్రంలో అధికార భాషగాచేసుకోలేకపోయింది, పైగా తర్వాత విడిపోయిన రాష్ట్రాలు త్వరపడి వారి వారి రాష్ట్రాలలో అధికార భాషలుగా తమ తమ  మాతృభాషల్ని చేసుకోవదం చూశాక గూడా సిగ్గుతోనయినా తొందరపడలేదు మనం, యెందుకని?మాతృభాష అధికార భాషగా లేనిది కేవలం మనకేనా, ఇంకా యే దిక్కుమాలిన రాష్ట్రాలైనా మనకి తోడు ఉన్నాయా!ఇప్పుడీ గొల యెందుకంటే మామ్మూలుగానే భాష మీద ఇంత నిరాదరణ ఉండగా పనిగట్టుకుని ఆగ్రిగేటరు అవసరమైన తెలుగు బ్లాగుల్ని యెంతమంది చూస్తున్నారు - ప్రమాదవశాత్తూ రావడమే తప్ప తెలిసి వచ్చిన వాళ్ళెంతమంది?

నా బ్లాగులో నేనెప్పుడూ నా వ్యక్తిగత విషయాలు ఇంతవరకూ రాయలేదు,భవిష్యత్తులో మరోరకంగా రాయాలనే ఉద్దేశం ఉంది గానీ ఇట్లా రూలు మార్చవలసి వస్తుందని అనుకోలేదు.అనుకోనివి జరగడమే కదా జీవితం!దాదాపు మనకొచ్చే కష్టాలన్నీ అనుకోకుండానే వస్తాయి,ముందే తెలిస్తే తప్పుకునేవాణ్ణి గదా అనిపించేటట్టు వస్తాయి!కానీ యెవరో అన్నట్టు,"మనం పడే తిప్పలకి చాలామటుకూ మనకున్న వ్యామోహాలతోనూ భయాలతోనూ మనం చేసే తప్పులే కారణం" అనేది తెలుసుకోగలిగీతే వ్యామోహాల్నీ భయాల్నీ జయించి తప్పులు చెయ్యకుండా తిప్పలు పడకుండా బతకొచ్చు.ఇవ్వాళ నేను పడుతున్న కష్టాల్లో పదిశాతం గురించి చెప్పినా చాలామంది తట్టుకోలేరు, అయినా నేనెట్లా చిదానందమూర్తిలాగా సీరియస్ పోష్టుల్ని గూడా బోరు కొట్టనివ్వకుండా రాయగలుగుతున్నాను అంటే నేను గతంలో చేసిన తప్పులకీ నేనిప్పుడు పడుతున్న తిప్పలకీ లింకు ఉందని తెలుసు గాబట్టి, నా కష్టాలకి యెవణ్ణో బ్లేం చేసి నా ఇగోని సాటిస్ఫై చేసుకునే అవలక్షణాలు గానీ చిన్న చిన్న కుక్కజట్టీలకి హృదయం బద్దలు చేసుకుని కిందామీదా పడి మూర్చరోగాలు తెచ్చుకునే బలహీన మనస్తత్వం గానీ లేదు గాబట్టి!అట్లాగే నాకు సంబంధం లేని విషయాల్ని పనిగట్టుకుని మనసుకి పట్టించుకుని ఆక్రోశపడి మనశ్శాంతిని కోల్పోను, మనంతట మనమెందుకు మన జుట్టు యెదటివాళ్ళ చేతికిచ్చి తీరా వాళ్ళు మన జుట్టుకి రిబ్బన్లు కట్టాక అదుగో వాడు నన్ను అవమానించాడని యేవటం?

రమణ గారు చేసిందీ అదే!తన పాటికి తను బ్లాగులో యే విషయమైనా రాసుకునే స్వేచ్చ ఆయనకి ఉన్నది నిజమె!కానీ అవి కేవలం తన కంప్యూటరు ముందు కూర్చుని తను మాత్రం చదువుకుని పులకించిపోవడానికి రాయడం లేదు గదా?పబ్లిష్ చేసిన ప్రతి పోష్టూ ఆగ్రిగేటరు ద్వారా అందరికీ కనబడుతున్నప్పుడు ఆ పోష్టు చదివిన వాళ్ళలో అది కలిగించే ప్రభావాన్ని కూడా తెలుసుకోవాలి గదా, తెలియకపోవడానికి ఆయన నిరక్షరకుక్షి కాదుగా!చదివినవాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారు, ఆ పోష్టు తమకి ఇబ్బందికరంగా ఉంటే యే మాత్రమూ సంకోచించరు - అది మానవనైజం!తమ చేతల వల్ల యెదటివాళ్ళకి ఇబ్బంది కలిగీతే యెవరయినా సహజంగా యేమి చేస్తారు?యందుకు యెదటివాళ్ళు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుని తన పోష్టుల్లో ఆ ఇబ్బందికరమైన విషయాల్ని సృశించకుండా నిగ్రహంగా ఉంటారు,అవునా కాదా!లేదు నేనిలాగే రాస్తాను అంటే యెదటివాళ్ళ ఇబ్బందిని అసలు పట్టించుకోవాల్సిన పనిలేదు కదా!మరో మార్గం అంటూ ఉంటే అది దొడ్డిదారి మాత్రమే, ఆ దారినే యెంచుకున్నారు ఆయన , కామెంట్లు బందు జేస్తున్నానని ప్రకటించారు 2014 అక్టోబరులో అనుకుంటాను.అది కూడా మళ్ళీ వరూధిని బ్లాగులోనే చూశాబు.ఆ పోష్టు బహుశా వరూధిని బ్లాగరు ఆ సంగతి గురించి సరదాగా రాసిన వాటిలో రెండవది అనుకుంటాను,యెందుకంటే అదే విషయంతో మరొక పాత పోష్టు గూడా చూశాను ఆ బ్లాగులోనే!

యేమయితేనేం అక్కడి సరదా కామెంట్లని చూసి నేనూ కొంచెం క్యామెడీగా ఒక కామెంటు వేశాను - - అప్పుడూ ఇప్పుడూ కూడా చెప్తే యెవరూ నమ్మరు గానీ కొంచెం రెచ్చగొట్టి అయినా రమణ గారు మళ్ళీ కామెంట్లు ఓపెన్ చేసేటట్టు చూడాలనేది నా వుద్దేశం. అయితే పుణ్యానికి పోతే పాప యెదురయినట్టు ఆయన కామెంట్లకి తలుపులు తెరిచారు గానీ నన్ను మాత్రం అపార్ధం చేసేసుకున్నారు!ఆయన రెస్పాన్సు చూసి కంగారు పడి అక్కడే ఒక కామెంటు వేశాను,అయినా డ్యామేజీ జరిగిపోయింది,చెయ్యగలిగినది వేడికోలు మాత్రమే గదా?నా మట్టుకు నాకు మిగతావాళ్ళతో ఆయన యెన్ని తలనొప్పులు పడ్డారో తెలియదు గానీ, నేనెప్పుడూ ఆయన్ని ఇబ్బంది పెట్టలేదు కామెంట్ల ద్వారా!ఒకోసారి ఆయన గూడా మీరు వాడిన మాటలే బాగున్నాయి వాటితో పోష్టుని అప్డేట్ చేస్తున్నానని గూడా అన్నారు, చేశారు గూడా - చేప్పాను గదా దేన్నీ అతిగా తలకెక్కించుకోనని!

నా సమస్య అంతా నా సొంత గొదవ మాత్రమె కదా,ఆ బ్లాగులో ఈ బ్లాగులో వెళ్లబోసుకుని ప్రయోజనమేమిటి?అక్కడికీ వరూధిని బ్లాగులోనే ఒకసారి చిన్నగా నసిగీతే "ఆగండి ఆగండి" అంటూ వారించడం జరిగింది,నేను కూడా అప్పటికి ఆగిపోయాను. ఆగక చేసేదేమిటి - అప్పటికే "డాక్తరు గారికి నమస్కారం" అంటూ మొదలుపెట్టి వినయంగా నావైపునుంచి నేను చెప్పుకోవలసిన ముఖ్యమయిన విషయాలన్నీ నివేదించుకున్నాను.ఆ కామెంటు కనబడకపోయినా "అది పబ్లిష్ చెయ్యడం వల్ల యేమి వొరుగుతుంది నాకు, చదివే ఉంటారు యెటూ తర్వాతి కామెంట్లు వేస్తారు గదా" అని సరిపెట్టుకుని తర్వాతి పోష్టులోని విషయం నన్ను బాగా కదిలించి ఒక మంచి కామెంటు వేసి అది పబ్లిష్ కాకపోవడం వల్ల ఆయన నా పేరుతో వచ్చిన కామేంట్లేవీ కనీసం హరిబాబు యేమైనా వివరణ ఇస్తున్నాడేమో చూద్దాం అనే అనుమానం కూడా తెచ్చుకోకుండా తొలగించివేస్తున్నారని అర్ధమైపోయింది గదా!

ఈలోపు "నా బ్లాగులో నా ఇష్తమొచ్చినట్టు నేను రాస్తాను,చదివడం వరకే తప్ప విమర్శించే అధికారం యెవరికీ లేదు,ప్రశంసల్ని మాత్రమే ప్రచురిస్తాను" అనే ఆయన ధోరణికి వ్యతిరేకంగా దొంగనాయకమ్మ బ్లాగుని కొందరు తెరవడం జరిగింది,నేను అక్కడ దీని గురించే కాదు మిగతావాట్ని గుఇంచి కూడా కామెంట్లు వేశాను.నాకు నేను పెట్టుకున్న రూలు - విషయాన్ని గురించి విమర్శించదమూ,ధోరణిలో ఉన్న లోపాన్ని యెత్తి చూపించడం తప్ప వ్యక్తిగతంగా నేను యేనాడూ యెవర్నీ విమర్శించకూడదనే దానికి కట్టుబడే ఉన్నాను!దొంగనాయకమ్మ బ్లాగు వుద్దేశం కూదా వ్యతిరేకించదగినంత క్రూరంగా యేమీ లేదు!నా పోస్టుల్లో సరదాగా జగదేక వీరుని కధ సినిమా గురించి రాసిన భాగాల్ని మెలితిప్పి రాముడు సీతని వొదిలెయ్యటానికి లింకు కలుపుతూ వాడకూడని చోట వాడటం చూశాను.నా మామూలు పధ్ధతిలోనే ప్రతిస్పందించాను గూడా, ఆ అధికారం అందరికీ ఉండటం ప్రజాస్వామ్యానికి యేమి చెరుపు చేస్తుందో మరి?

ఈ మధ్యనే "కళింగ కేక" అనే బ్లాగుని చూశాను.అక్క కేక బలంగా వెయ్యాలనుకుంటున్నారా?నెమ్మదిగా వెయ్యాలనుకుంటున్నారా? అనే ఆప్షన్లని చూసి ఆవేశపడిపోయి టాప్ లెవెలు కేకకే బటన్ నొక్కాను!తీరా కొంచెం వివరంగా చూస్తే ఆయన ఒకపోష్టులో కృష్ణదేవరాయల స్పోకం మచ్చల మొహాన్నీ తక్కువకాలం బతకడాన్నీ అదోరకమయిన విధంగా ప్రస్తావించటం చూసి కంగుతిన్నాను? ఆయన కళింగ గజపతులతో మమేకమై వాళ్ళని ఓడించిన దుర్మార్గుడు గనక కృష్ణదేవరాయల్ని మేమెందుకు పొగడాలి అంటున్నాడు?కృష్ణదేవరాయలకి స్పోకం మచ్చలు ఉందటం వాస్తవమే గానీ పెద్దనని "పెద్దిరాజు" అనటంలో ఆయన యేమి చెప్పదల్చుకున్నాడో మీకు తెలుస్తూనే ఉంది గదా!చూశాక నేను వూరుకోను గదా!"యేమిటిది?గజపతులంతా అందగాళ్లేనా?వాళ్లలో ఉన్న అవకరాల్ని వెతికి ఒక పోస్టు నేనూ వెయ్యగలను,చరిత్రలో సొంతపైత్యాలు జోడించకండి,రాయలైనా గజపతులైనా చేసింది ఒకటే - అందరూ ఒక తానులో ముక్కలే.ఇవ్వాళ మనం ఉన్న సువిశాల భారతదేశం గురించి వాళ్లలో యెవరూ వూహించను గూడా వూహించలేదు.వాళ్ళ అధికారాన్ని తమప్రాంతంలో బలంగా వుంచుకోవడం కొత్తప్రాంతాలకి విస్తరించడం తప్ప?ఇప్పటి కాలంలో బతుకుతూ అప్పటి వాట్ని తవ్వి తలకెత్తుకోవదం ఈ రాజు మాప్రాంతం వాడు గనక పొగుడుతాం అతన్ని ఓడించిన రాజుని తిడతాం అనటం అనవసరం కదా!" అని కామెంటు వేసాను.షరా మామూలే కామెంటు పలేదు.కొంతకాలానికి ఆ బ్లాగరు కళింగరాష్ట్రసాధనాపితామహుడు కూడా కావొచ్చు,ఆలోచించుకోండి?!

ఒక విషయాన్ని చూసీ చూడగానే అందులో యేదయినా తమకి నచ్చనిది ఉంటే స్పందించకుండా ఉంటే యేమి జరుగుతుంది?యెవరూ ప్రతిస్పందించలేదు గాబట్టి ఒకనాటికి అది న్యాయమైన వాదనగా మారుతుంది!ఉదాహరణకి తెలంగాణా వాదుల పైత్యకారి వాదనలు చాలామటుకు సరయిన సమయంలో స్పందించాల్సిన వాళ్ళు స్పందించి సరయిన జవాబులు చెప్పి ఉంటే యెట్లా ఉండేది?ఇక్కడ బ్లాగుల్లో జరిగిన వాదనల ప్రకారం చూసినా అవి చాలామటుకు ఆధారం లేనివే - ముఖ్యంగా ఆంద్రోళ్ళ దోపిడీ అనేది!కాబట్టి యేవడేమి రాసినా వ్యతిరేకించకుండా ఉండిపోవటమే ప్రమాదకరం - ఆ బ్లాగరు వ్యతిరేకించడానికి అవకాశం ఇవ్వకపోతే ఆ అవకాశాన్ని సృష్టించుకుని అయినా వ్యతిరేకించి తీరాల్సిందే!


అసందర్భం వచనం బృహస్పతిరపి బ్రువన్ విద్వజ్జన మవామానం లభతే!

Thursday 14 May 2015

విన్నారా?విన్నారా?ఈ వింతను విన్నారా?దేముడి దయవల్లనె ఇంగిలీజులరాజ్య మొచ్చెనంట!

          ఇదివర్లో గంధం వాసనేస్తూ ఉండే ఒక సబ్బుకి సాంప్రదాయబధ్ధమైన నురుగు అని వచ్చేది ప్రకటనల్లో?ఇప్పుడు బూతు వెబ్సైట్లని వర్గీకరించిన చిహ్నం లాంటి పేరుతో ఉన్న ఒక సబ్బుకి కూడా సంస్కారవంతమైన సబ్బు అని టముకేస్తున్నారు!సాంప్రదాయం,సంస్కారం అనే మాటల్ని ప్రతిదానికీ తగిలిస్తే యేమవుతుంది?అవి కూడా తొందర్లోనే బూతుమాటలైపోతాయి!కళ్ళముందు ఒక ఆడది తనకింకా ఆయుష్షు ఉన్నా బలవంతంగా మొగుడి చితిమీద తను కూడా తగలబడిపోవటం అన్యాయమని చెప్పటానికి కామన్ సెన్సు చాలదా!అయినా అంత నిష్ఠగా వాట్ని అంతకాలం యెందుకు కొనసాగించారు?ఒక మనిషి పట్టుదలగా దాన్ని ఆపాలని నిలబడితే అతన్ని ఆజీవ పర్యంతం యే వాదనతో వ్యతిరేకించారు?అది దుష్టమైనది అని తెలిసినా సాంప్రదాయం - పెద్దలు యెందుకు చెప్పారో చెప్పారు,పెద్దలు చూపిన దారిలో నడవటం అనే వాదనతోనే కదా!

          ఒక జాతికి తన ప్రాచీన సాంప్రదాయాల పట్ల వ్యామోహం ఉండటం ఒక వ్యక్తికి తన బాల్యం పట్ల ఉండే వ్యామోహానికీ సంబంధం ఉంటుందని యెంతమందికి తెలుసు?మనం చిన్నప్పుడు నెమిలి కన్నుని పుస్తకాల మధ్యన దాచి అది పిల్లల్ని పెడుతుందని యెదురు చూసి నిరాశపడటం ఇవ్వాళ మనకి నవ్వొచ్చినా అప్పుడు యెంత గంభీరంగా ఆ పని చేశామో గుర్తు వస్తే యెట్లా ఉంటుంది?ఆఖరికి ఆ సంస్కర్తలు యేమి చేశారు?జాతి చరిత్రని తవ్వి తీసారు, ఒకనాడు విదేశీ దంయాత్రలలో ముష్కరుల నుంచి యెదురవుతున్న తమ స్త్రీల మానహరణ ప్రయత్నాల్ని నిరోధించడానికి ఆ సాంప్రదాయం పాటించారనీ ఆ చారిత్రక పరిస్థితులు ఇవ్వాళ లేవు గాబట్టి మనం దాన్ని ఇప్పుడు కూడా కొనసాగించనక్కర లేదని నయాన వినేవాళ్ళకి తార్కికంగా ఋజువు చేసి దానినొక ఆర్జనమార్గంగా మార్చుకుని మొండిగా సంస్కరణని వ్యతిరేకిస్తూ భయాన లొంగేవాళ్ళని అప్పటి ప్రభుత్వాలతో శాసనాలు చేయించి శిక్షిస్తే గానీ ఆ దురాచారం యొక్క ప్రభావాన్ని తగ్గించలేకపోయారు, ఒక జాతి చరిత్ర ఆజాతి సామూహిక బాల్యం వంటిది!

          అలాంటి చరిత్రని అబధ్ధాలతో నిర్మిస్తే యెట్లా?చరిత్ర అబధ్దం చెప్తే యెట్లా?అద్దం మోసం చేస్తే యెట్లా?మన తప్పుల్ని సవరించుకునే అవకాశం కల్పించే చరిత్రని కూడా రాగద్వేషాలతో కలుషితం చేస్తే యెట్లా?ఒక జాతి ఒక తరంలో యెన్ని భిన్నమైన పోకడలు పోయినా అది మరో తరానికి తన ముందరి తరం నుంచి అందుకున్న వారసత్వపు సంస్కృతీ విశేషాన్ని పదిలంగా అందిస్తే ఆ జాతి గమనం యేకోన్ముఖంగా సాగుతున్నట్టు లెఖ్ఖ!అట్లా కాకుండా ఒక తరం యొక్క ప్రవర్తన ఒకరికి ఒక రకంగా మరొకరికి మరో రకంగా అర్ధమయితే అక్కడ ఖచ్చితంగా పులుముడు ప్రవేశించిందన్నమాటే గదా?ప్రతి వర్గమూ ఆ తరాన్ని అర్ధం చేసుకోవడానికి ముందుగానే మనం ఈ విధమయిన అర్ధాన్నే లాగాలి అనే వ్యూహంతోనే చరిత్ర నిర్మాణానికి పూనుకున్నారని అర్ధం అవుతుంది గదా!జరిగిన సంఘటనల్ని మార్చడం లేదు, కానీ విశ్లేషణలు మారుతున్నాయి - యేకం సత్ విప్రాని బహుధా వదంతి అనే విభిన్నత పట్ల సహనశీలాన్ని పెంచే మాటని భవిష్యత్తుని యేకోన్ముఖంగా  తీర్చిదిద్దుకోవటానికి పనికివచ్చే చరిత్రకి అంటగట్టవచ్చునా?

         పాఠ్యపుస్తకాల్లోకి యెక్కించి తప్పనిసరిగా తెలుగు చదవటం వచ్చిన ప్రతివాడికీ పరిచయం చేస్తే చదివిన ప్రతివాడూ తలలూపి మెచ్చుకున్న "దేశమును ప్రేమించుమన్నా" అనే మంచి భావాలతో నిండిన గీతం రాసిన కవి గొప్ప దేశభక్తుడనుకుంటాం.కానీ ఆ వ్యక్తి భారతదేశానికి ఇంగ్లీషువాళ్ళ పరిపాలన మరికొంతకాలం అవసరమనే అభిప్రాయంతో వుండేవాడనీ మీదుమిక్కిలి ఇంగ్లీషువాళ్ళ పట్ల కొంచెం కఠినమైన పదాల్ని అప్పటి స్వాతంత్ర్యవీరులు వాడీతేనే వాళ్ళని వ్యతిరేకించేవాడనీ యెంతమందికి తెలుసు?"నతులగుచున్ మహోన్నతి దనర్చుచు నవ్యగుణోక్తిచే గుణోన్నతి బ్రకటించుచుం బరజన ప్రియ కార్యసమర్ధతన్ సముచిత నిజకార్య సంగ్రహము నిష్ఠురవాదులన్ క్షమాధృతి నిరసించుచుం బరగు ధీరులు పుణ్యులు గారె యేరికిన్" అనే విధంగా బతికి "ఒకవంకన్ పదివేల కంఠములతో హుంకారముల్ సల్పి సాంఘికశార్దూలము చప్పరించుటకు లంఘించన్ రవంతేని జంకక దీక్షారధమున్ మరల్పక కళాక్షత్రము రూపించు ధార్మిక వేదండుని ఉక్కుగుండెలు మహాంధ్రీ నీకు ఆదర్శమౌ గాక!" అంటూ కవులు కీర్తించిన కందికూరి వీరేశలింగం కన్నా ఇతనికే నవయుగ వైతాళికుడిగా పేరు రావడం వెనక ఇవ్వాళ్టి కంచె ఐలయ్య లాంటివాళ్లకి "బ్రాహ్మణవాదం" పిలకని అందించిన కోవర్టు పని చేసినందుకేనని నేనంటే మీకు విడ్డూరంగా ఉండవచ్చు.కళ్ళు మూసుకుపోయిన హిందూ మత చాందసత్వంతో పరమ సజ్జనుడైన వ్యక్తికి కూడా దుర్మార్గం అంటగడుతున్నానని మీరు అపార్ధం చేసుకునే అవకాశం కూడా వుంది!

Lives of moderates all remind us
We should wisely keep from crime
Open sedition only finds us
Shelter in a far off clime
Let us then line up and speaking
Speaking at a furious rate
Not always some benefit seeking
Learn to be loyal and to wait.

          ఈ కవి పై కవితలో చెప్పిన హితోక్తిని అప్పటివాళ్ళు పాటించి ఉంటే ఇప్పటికీ మనం యే తిరుగుబాట్లూ చెయ్యకుండా సంస్కారవంతమైన ఇంగ్లీషువాళ్ళ పరిపాలనలోనే ఉండేవాళ్ళ మనుకుంటాను. యెటూ క్రైస్తవం ప్రజాస్వామ్యబధ్ధమైన మతమే కాబట్టి ఐలయ్య లాంటివారికి కూడా ఆమోదయోగ్యంగానే ఉండి ఉండేదేమో!గురజాడ అప్పారావు బతికిన కాలం క్రీ.శ1862 నుంచి క్రీ.శ1915 వరకు,అంటే ఇంగ్లీషువాళ్ళు పరమదుర్మార్గులు అని గ్రహించి వాళ్ళ కబంధహస్తాల నుంచి భారతమాతని విముక్తం చెయ్యాలని సామాన్యులు కూడా ప్రాణాలకి తెగించి పోరాడుతున్న రోజుల్లో వారికి పూర్తి విరుధ్ధమైన అభిప్రాయాలతో ఉన్నాడితను?స్వాతంత్ర్య సమరవీరులు అబధ్ధం చెప్తున్నారా?నవయుగ వైతాళికుడు అబధ్దం చెప్తున్నాడా?ఒక తరం వెనకటి చరిత్ర తిరగేస్తేనే అప్పటి సమకాలికుల్లోనే ఇంత పరస్పర విరుధ్ధమైన అభిప్రాయాలు ఉంటే ఇంకా వెనక్కి వెళ్ళి తాతతాతల నాటి కధల్ని తవ్వితీస్తే ఇంకెంత గందరగోళం బయటపడుతుందో?కురుక్షేత్రం సినిమాలో శకుని వేషం కట్టిన నాగభూషణం మాదిరి ఉభయతారకంగా "ఇదియునూ సూనృతమే అదియునూ సూనృతమే" అనేసి తప్పుకుందామా!

          గురజాడ అప్పారావు కాలానికి మరొక శతాబ్దం వెనక్కి వెళ్తే క్రీ.శ1780 నుంచి క్రీ.శ1835 వరకూ చెన్నపట్నం సుప్రీం కోర్టులో ఇంటర్ప్రిటర్ పని చేసి క్రీ.శ1836లో సన్యసించి యోగసాధనతో తనువు చాలించిన యేనుగుల వీరాస్వామయ్య గారు కూడా తన యాత్రాస్మృతిగ్రంధం "కాశీయాత్ర చరిత్ర"లో ఆంగ్లేయులను చాలా మర్యాదగా ప్రస్తుతించారు.ఇందులో బ్రహ్మణులు శూద్రజాతిని మిక్కిలీ తక్కువ పరచి అవమానించుట ఇతర మతములు వృధ్ధిబొందుటకు హేతువైనదనిన్నీ,పెద్దలు పామరజనులను కడతేర్చవలెనని బింబారాధనను విధించితే భగవంతునికి హేయములైన వికారపు ఉపచారములను లోకులు చేయసాగినందుననున్ను బ్రాహ్మణులు మేము శ్రేష్ఠులమని ఇతరవర్ణాలను ధిక్కరించడము వల్లనున్ను,వీరి దురాచారముల వల్లనున్ను వీరియెడల భగవంతునికి కటాక్షము తప్పినందున సత్యము అహింస మొదలగు సుగుణసంపత్తులు గల ఇంగ్లీషువారు హిందూదేశము యేలేటట్టు వారు దేవుని కృపకు పాత్రులైనారనిన్ని చెప్పబడినది. ఇందులో యీశ్వరుడు పరులకు యీ హిందూదేశమును స్వాధీనపరచినందుకు కారణ మేమంటే అందరున్ను అహింస సత్యము మొదలైన సద్గుణాలతోనే నటిస్తే తన చిద్విలాసానకు వ్యతిరిక్తమని యెంచి ఇచ్చటి వారికి కామక్రోధాదులను వృధ్ధిబొందించి తద్వారా బ్రాహ్మణుల గుండా ఇచ్చటి క్షత్ర జాతిని బొత్తిగా నశింపజేసి వెనక బ్రాహ్మణులకు గర్వభంగము కొరకు తురకలను కొన్నాళ్ళు వృధ్ధిపరచి మళ్ళీ కరుణతో సాత్వికులైన యింగిలీషువారికి యీ దేశాధికారమును యిచ్చినాడని చెప్పియున్నది.

          మరి క్రీ.శ1825 న పుట్టి క్రీ.శ1917 వరకూ జీవించి భారతీయులందరికీ "గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా" పేరుతో పరిచయమైన దాదాభాయ్ నౌరోజీ అయితే నిర్ద్వందంగా సంవత్సరాల వారీగా గణాంకాలతో సహా "Further development was checked by the frequent invasions of India by, and the subsequent continuous rule of, foreigners of entirely different character and genius, who, not having any sympathy with the indigenous literature— on the contrary, having much fanatical antipathy to the religion of the Hindus – prevented its further growth. Priest-hood, first for power and afterwards from ignorance, completed the mischief, as has happened in all other countries" అని తేల్చి చెప్పాడు,అయినా యేందుకీ ఆంగ్లేయులు మంచివాళ్ళు క్రైస్తవం మంచి మతం అనే ముసుగు సిధ్ధాంతాలు మళ్ళీ మళ్ళీ ప్రచారంలోకి తెస్తున్నారు కొందరు వ్యక్తులు?ఈయన క్రీ.శ1892లో బ్రిటిష్ పార్లమెంటుకి యెన్నికై తాను క్రైస్తవుడు కాదు గనక బైబిలు మీద ప్రమాణం చెయ్యడానికి నిరాకరించి "Khordeh Avesta" మీద భగవంతుని పేర ప్రమాణం చేసి సభలో అడుగు పెట్టిన స్వాభిమానం గల భారతీయుడు!

          ఆర్ధిక శాస్త్రంలో అఖండమైన పరిజ్ఞానం కలిగిన నౌరోజీ మహాశయుడు ఆంగ్లేయులు భారత దేశాన్ని యెలా పీల్చిపిప్పి చేశారో సోదాహరణంగా నిరూపించాడు.అక్క 6 అంశాలు ఉన్నాయి:మొదటిది భారతదేశం విదేశీయుల చేత పరిపాలించబడుతున్నది,రెండవది ఇతర్లని ఇక్కడికి వచ్చి సంపద పెంచేటందుకు ఆహ్వానించి పెట్టుబడుల్ని ఆకర్షించే స్థితిలో లేకపోవటం అంటే సర్వసత్తాక సార్వభౌమ ప్రభుత్వం లేకపోవటం,మూడవది బ్రిటిష్ ప్రబుత్వాధికారుల్నీ వారి అవసరార్ధపు సైన్యాన్నీ పోషించాల్సి రావటం,నాల్గవది ఇంటా బయటా సామ్రాజ్య విస్తరణ భారాన్ని మొయ్యటం,ఐదవది విదేశీయులకి అధిక జీతభత్యాలు దొరికే విధంగా స్వేచ్చావాణిజ్యానికి తలుపులు తెరవటం,ఆఖరుదైన ఆరవది ముఖ్యమైన ఆదాయాన్ని పెంచే వర్గాలు విదేశీయులు కావదం వల్ల తమ కొనుగోళ్లని దేశం బయట చెయ్యటం గానీ లేదా తమ ఆదాయాల్ని దేశం బయట దాచటం - కరుణామయుని బోధనల్ని నిత్యమూ జపిస్తూ ఐలయ్యగారు పొగుడుతున్న ప్రజాస్యామ్యబధ్ధమైన మతాన్ని అనుసరించే వాళ్ళు ఈ దేశాన్ని అంత భయంకరంగా దోచుకున్నారు!ఒక అతి పెద్ద స్పాంజిని గంగా నదిలో ముంచి ఆ నీటినంతా ఒడిసిపట్టి ధేంసు నదిలో పిండినంత క్రూరమైన దోపిడీ అది!ఇప్పటికీ మన పాఠ్యపుస్తకాల్లో గొప్పగా చెప్తూ ఉండే రైళ్ళను వేయించడం లాంటివాటి బండారం కూడా అప్పుడే బయటపెట్టాడు - మన దేశపు ఆదాయంతోనే నిర్మించారు,మన దేశపు జనం అటూ ఇటూ తిరగడానికి ఉపయోగపడినాయి,కానీ ఆ డబ్బంతా ఇక్క నిలవలేదు గదా?

          యేనుగుల వీరాసామయ్య గారంటే సత్తెకాలం వాడని సరిపెట్టుకోవచ్చు గానీ గురజాడ కాలానికి స్పష్టంగా తెలిసిపోయింది గాబట్టి అతన్ని మాత్రం అనుమానించాల్సిందే!వీరాసామయ్య గారు చేసింది కోర్టు కాగితాలని తర్జుమా చెయ్యటం - ప్రజలతో రోజువారీ సంబంధం లేని ఉద్యోగం.కీలకమైన ఉద్యోగం కావడం వల్లనూ ఆయన అనువాదంలో మంచి ప్రతిభ గలవాడవటం వల్లనూ ఆర్జన కూడా యెక్కువే ఉండి ఉంటుంది!ఆ ఉద్యోగంలో ఉండటం వల్ల వీలునామాలకి సంబంధించిన భయంకరమైన విషయాలు యెక్కువగా తెలియడం వల్లనే వైరాగ్యం మీదకి మనసు మళ్ళిందని చెప్పడం వల్ల అతనికి ఇంగ్లీషువాళ్ల వల్ల బాగా లాభపడి అట్లా సమర్ధించాడనే విధంగా డబ్బాశని అంటగట్టలేము.దేశాటనలో తనకి కనబడిన విషయాల పట్ల తనకు కలిగిన సందేహాలకి  తనకు తోచిన జవాబులు చెప్పుకోవడం వరకే పరిమితమై పోయాడు గనక అందులోని కొన్నింటిలో శాస్త్రీయత ఉండదు,నిజమే!కానీ క్రైస్తవం మహమ్మదీయం వంటి ఇతర మతాల్ని గురించి కూడా మంచిగానే మాట్లాడాడు గనక హిందూమతోన్మాది అని మాత్రం అనలేము!కానీ గురజాడ అప్పారావు తన కన్యాశుల్కం నాటకంలో బ్రాహ్మణుల్ని వెక్కిరించే కుళ్ళుజోకుల్ని తీసేస్తే గొప్పగా చెప్పడానికి యేం ఉంది?ఆడపిల్లల్ని అమ్ముకోవడం గురించి రాసిన వ్యాసాల్లో గూడా అమ్మకాలు కొనుగోళ్ల లెక్కలు చెప్పడం తప్ప శాస్త్రీయమైన విశ్లేషణ యేదైనా చేశాడా?

          సాంప్రదాయం చెప్పే పితృకర్మల పట్ల వ్యామూహాలూ ఆస్తిపాస్తుల మీద వచ్చిపడే వార్సత్వపు హక్కుల్నీ పట్టించుకోకపోయినా ఒక వయసు రాగానే లైంగికావసరాల కోసమైనా ఖచ్చితంగా స్త్రీ పురుషుల కలయిక అవసరమే!అయితే అన్ని మతాల్లోనూ ఆ కలయిక వివాహ విధి ద్వారానే జరగాలనే నియమం ఉంది కాబట్టి పెళ్ళి తప్పనిసరి - ఇప్పటికీ సహజీవనం అనేది కొద్దికాలానికే తప్ప ఆజీవపర్యంతమూ అట్లా ఉండటం కుదరటం లేదు,అవునా?ఆ పెళ్ళి సమయంలో మొదట "కన్యాం కనక సంపన్నాం" అని సంతోషంగా ఇచ్చేది వరశుల్కమైతే ప్రతివారూ మగపిల్లల కోసమే ఆత్రపడి ఆడపిల్లల్ని నష్టం కింద చూడటంతో ఒకానొక కాలంలో ఆడ-మగ పిల్లల మధ్య ఉండాల్సిన లైంగిక నిష్పత్తి లెక్కల ప్రకారం ఆడపిల్లలకి కరువు రావడం వల్ల ఉనికిలోకొచ్చిన ప్రత్యేకమైన వ్యవహారం "కన్యాశుల్కం" అనేది.దీనికి సంబంధించిన చారిత్రక విశ్లేషణ అతని సాహిత్యమంతా వెతికినా మీకెక్కడయినా కనిపిస్తుందా?పెళ్ళి సమయంలో దబ్బు మార్పిడి "ఓలి","కట్నం" లాంటి రూపాల్లో అన్ని కులాల్లోనూ ఉంది కదా!డబ్బాశతో అన్ని కులాల వాళ్ళూ చేసే చెత్తపన్లకి బ్రాహ్మణుల్ని మాత్రమే కారకుల్ని చెయ్యడం దేనికి?గురజాడ కావాలని చెయ్యకపోవచ్చు - పాత్రల్ని సహజంగా వుంచటం కోసం తను బ్రాహ్మణుడు కాబట్టి తనకి బాగా తెలిసిన వాతావరణాన్ని వాడుకుని ఉండవచ్చు!కానీ అసలు వైతాళికుడు వీరేశలింగాన్ని వదిలేసి గురజాని పరిధికి మించి ఆకాశాని కెత్తిన వాళ్ళు మాత్రం తేనెటీగ పువ్వుల మీదా పోతుటీగ శ్లేష్మం మీదా వాలటం సహజమేనని నిరూపించుకున్నారు.

         భారతదేశపు చరిత్రలోని సంక్లిష్టతల్ని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంటే ఒకోసారి సినేమా కధల్లోని ఆకురౌడీల మధ్యన జరిగే క్యామిడీ ఫైట్లను బోలిన కుక్కజట్టీలు కూడా చాలా గంభీరంగా సిధ్ధాంత ప్రాతిపదికన జరగటం చూస్తే నాకప్పుడప్పుడూ పొట్టచెక్కలయ్యేలా నవ్వు కూడా వస్తూ ఉంటుంది!ఇవ్వాళ పరస్పరం ఘూర్ణిల్లుతున్న "హిందూ జాతీయ వాదం" మరియూ "బ్రాహ్మణ వ్యతిరేక వాదం/దళిద వాదం" అనే రెండు శాఖలూ మొదట్లో ఒబ్బిడిగా కలిసిపోయి ఈ దేశం మీద జమిలిగా పెత్తనం చేసెయ్యాలని కలలు గని అది కుదరకపొయ్యేసరికి తెగదెంపులు చేసుకున్న పాతస్నేహితులు ఒకళ్ళ మీదకి ఒకళ్ళు విసురుకున్న పేడముద్ద్దలు తెలుసా?వ్యాపారం కోసం ఈ దేశానికి వచ్చి ఇక్కడున్న పరిస్థితుల వల్ల మిగతా దేశాల్లో మాదిరిగా కాకుండా పై స్థాయిలోని రాజుల్ని మచ్చిక చేసుకోవడం ద్వారా రాజకీయాధికారం చేజిక్కించుకున్నారు,ఆ తర్వాత సాంస్కృతిక ఆధిపత్యం కూడా బ్రాహ్మణుల్ని మచ్చిక చేసుకుంటే చాలు పనైపోతుందనుకున్నారు - కానీ ఆ ప్లాను బెడిసికొట్టింది!మొదట్లో మతప్రచారానికి ఇక్కడి కొచ్చిన వాళ్ళలో గుండు గీసుకుని కాషాయం కట్టి పేరు మార్చుకుని బైబిలే అసలైన వేదం అని ప్రచారం చెయ్యబోయిన వాళ్ళూ ఉన్నారు,మాక్సు ముల్లరు మహాశయుడు సంస్కృతం నేర్చుకున్నది కూడా మన దేశపు సంస్కృతి మీద ప్రేమతో కాదు మన దేశాన్ని క్రైస్తవీకరించడానికి కావలసిన దారులు వెతికేటందుకు మిగతావాళ్ళకి సహాయం చెయ్యడానికే!

          హిందూ రాజుల మరియూ ముస్లిము నవాబుల రాజ్యాలు పూర్తిగా ఇంగ్లీషు వాళ్ళకి దఖలు పడినా లేక పరస్పరాంగీకారంతో రాజుల పరంగా నడపబడినా ఆ ప్రాంతపు కలక్టర్లే నిజమైన అధికారం చెలాయించేవాళ్ళు.ఆలయాల మీద ఆదాయం కూడా వచ్చేది కాబట్టి ఆలయాల నిర్వహణ విషయాల్లో ఉదారంగానే ఉండేవాళ్ళ్ళు - ఆలయానికి యెంత యెక్కువ ఆదాయమొస్తే వాళ్ళకి అంత యెక్కువ వాటా వస్తుంటే మూర్ఖంగా యెవడు అడ్డుకుంటాడు?తిరుమల లాంటి ప్రముఖ ఆలయాల నిర్వహణ చరిత్ర చూస్తే ఈ సత్యం బోధపడుతుంది.తమ ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా సహనంగా ఉన్నందుకే యేనుగుల వీరాస్వామయ్య గారు అలా పొగిడింది!అయితే పోను పోనూ ఈ హిందూ దేవాలయాలు కలక్టర్ల చేత అట్లా ఆదరించబడుతున్నంత కాలం తమ చర్చిలకి పాప్యులారిటీ మరియూ ఆదాయమూ రాదని తెలుసుకున్న క్రైస్తవ మతప్రచారకులు రివర్స్ గేరులో ఒక ద్విముఖవ్యూహాన్ని పన్నారు - మొదటిది అధికారంలో ఉన్న తమవాళ్ళని హిందూమతాన్ని యెక్కువగా ఆదరించవద్దని ఒత్త్తిడి తీసుకురావటం,రెండవది తమ మామూలు పధ్ధతైన కష్టాల్లో ఉన్నవాళ్ళ మీద ప్రార్ధనలు,పాపక్షమాపణలు,మారుమనస్సు,దేవుని రాజ్యం,శిలువ మహిమ లాంటివాటితో బెదరగొట్టి వూదరగొట్టటం.మొదటి దానివల్ల బ్రాహ్మణులకీ వాళ్ళ ప్రభావంతో వున్న రాజులూ జమీందారులకి ఆంగ్లేయులతో దోస్తీ తెగెపోయి పోయిన ప్రాభవాన్ని తెచ్చుకోవడానికి అప్పటి బ్రాహ్మణుల్లో తెలివైనవాళ్ళు జాతీయవాదం అనేదాన్ని కనిపెట్టి ఇంగ్లీషువాళ్లని దేశంనుంచి వెళ్ళగొట్టెయ్యాలనే ఆవేశం తెచ్చుకుని ద్వితీయ స్వాతంత్ర్యభారతసమరానికి సిధ్ధమయ్యారు.రెండవదానినుంచి కింది కులాలకి బ్రాహ్మణులే మీ కష్టాలన్నిటికీ కారణం అనే ప్రచారంతో కిందికులాల వాళ్లని హిందూసమాజం నుంచి విడగొట్ట్గలిగారు ఇంగ్లీషువాళ్ళు!ఇరువర్గాలూ ప్రజలకి తమ అతితెలివి పులుముడు సిధ్ధాంతాల్ని ప్రచారం చేసి నమ్మించి వాటిని తమ ప్రాభవాల్ని నిలబెట్టుకోవటం కోసమే ప్రయత్నించారు,యెందుకంటే ప్రజలకి నిజంగా ఉపయోగపడే విషయం ఈ రెండు వాదనల్లో దేనికీ లేదు!వాళ్ళ లక్ష్యం ప్రాభవాల కోసం పాకులాడ్డం గనక తాము క్షేమంగా ఉండాల్సిన అవసరం యెక్కువగా ఉంది కాబట్టే మోకంగాంధీ యొక్క దిక్కుమాలిన అహింసాయుత పోరాటం రెండు వర్గాలకీ అంత గొప్పగా నచ్చింది!ఇందులో రెండువైపులా పదునైన కత్తికున్న సులువుంది, అది యే వర్గం వాళ్ళు గెల్చినా ఒకరంటే ఒకరికి తీవ్రమయిన ద్వేషం లేకపోవడం వల్ల ఓడిపోయిన వర్గం నుంచి అందులోకి దూకేసి ప్రాభవాన్ని నిలబెట్టుకోవచ్చు!ఇవ్వాళ్టి పార్టీ ఫిరాయింపుల వెనక ఉన్నదీ వీరందరిలో ఉన్న ఇలాంటి యేకోన్ముఖమైన సంస్కృతీ ప్రభావమే!

          నేను కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (మోహన్ దాస్ కరంచంద్ గాంధీ) అనే పోష్టులో "అంత పిరికిగా  వ్యతిరేకత వచ్చిన రెండేళ్లలోనే అదిరి పడి పారిపోయిన వాళ్ళు, అదీ ఈ దేశజనభాలో 5% మించని వాళ్ళూ అన్నేళ్ళ పాటు అంత మొండిగా అన్ని దుర్మార్గాలు యెట్లా చెయ్యగలిగారు?పైస్థాయిలో వున్న మనుజేశ్వరాధములు అరాచకం పేరుతో హడావుడి చేసి పోలీసుల్నీ సైన్యాన్నీ ఇంగ్లీషువాళ్ళ పేరు మీద పంపిస్తే ఈ బానిసాధముడి నట్టువాంగం మేజువాణీ గాళ్ళు ఆ పోలీసుల్ని ఇంగ్లీషు వాళ్ళ దౌష్ట్యానికి చిహ్నంగా చూపించి డబుల్ గేము యేదయినా అడారా?" అని ఒక చిన్న అనుమానం వ్యక్తం చేశాను.అక్కడ నాకొచ్చిన అనుమానానికి ఇక్కడ జవాబు దొరికింది - ఆంగ్లేయుల్ని దుర్మార్గులుగా చిత్రీకరించిన ఆ పులుముడు జాతీయత ఆంగ్లేయులతో స్నేహంగా ఉన్నప్పటి ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకోవడానికి పై స్థాయిలో ఉన్నవాళ్ళు అప్పుడే నిద్రలేచినట్టు నటించి చూపించిన నాటకం!

          ఇవ్వాళ తను క్రైస్తవంలో చేరి ఐలయ్య గారు యెవరి నయితే పొగుడుతున్నాడో వాళ్ళు అనాగరికులు అని విమర్శించినది తమ పూర్వీకులనేననేది చరిత్ర సరిగ్గా చదివితే అర్ధం అవుతుంది యెంతటి పామరుడికైనా,ఆయన కెందుకు అర్ధం కాలేదో?ఆయన యేమి చదివి యే ప్రభావంతో ఆ సూత్రీకరణలు చేస్తున్నాడో గానీ చరిత్రనీ మతాలనీ రాగద్వేషాల కతీతంగా అధ్యయనం చేసిన వాడెవ్వడూ ఆయుధాలు ధరించడం వల్ల హిందూ దేవతలు అప్రజాస్వామికమైనవాళ్లనీ బుధ్ధుడూ జీసస్సూ మానవులుగా పుట్టి వాళ్ళ సొంత ప్రతిభతోనే ప్రపంచ దైవాలుగా యెదిగారనే సూత్రీకరణలు చెయ్యడు!ఆయుధం హింసకే గుర్తయితే ఘనత వహించిన తమ ఆధ్యాత్మిక సామ్రాజ్య ప్రభువులైన అమెరికా దొరతనం  వారు అణ్వస్త్రాల మీద అధిపత్యాన్ని సడలనివ్వకుండా యెందుకు దృఢంగా నిలబెట్టుకుంటున్నారో చెప్పగలడా?శిలువ అనే చిహ్నమూ జీసస్ అనే దైవపుత్రుడూ పూజలందుకుంటున్న విషయం తెలిశాక గూడా క్రైస్తవం విగ్రహారాధనకి దూరంగా ఉందని యే ముఖం పెట్టుకుని అనగలుగుతున్నాడు!క్రైస్తవం లాగ కరుణ గురించి చెప్తూ పైగన్లనీ యూదుల్నీ అంత కిరాతకంగా అణిచివేసే హిపోక్రసీ హైందవధర్మంలో లేదు,ఆయుధం ఇక్కడ దుష్టశిక్షణకి గుర్తు!క్రైస్తవుడైన హిట్లర్ నాలుగు కోట్లమంది యూదుల్ని చర్చి అనుమతితోనే హతమార్చాడని ఐలయ్యకి తెలుసా తెలియదా?యూదులకి ఒక మతం ఉందని యెంతమందికి తెలుసు?దాన్ని అణిచేస్తే తప్ప క్రైస్తవం యెదగదని హిట్లర్ అనే నరహంతకుడికి నిధులిచ్చి క్రైస్తవ మత రక్షకుడని బిరుదు లిచ్చి గాలికొట్టి వొదిలిన మతంలో ప్రజాస్వామ్య స్వభావం కనిపించిందా ఈ ప్రబుధ్ధుడికి?యెన్ని సర్వసత్తాక సార్వభుమత్వం గలిగిన స్వతంత్ర దేశాల్నీ బ్రిటన్ మరియూ అమెరికా ఆక్రమించి వారి సంస్కృతుల్ని శిధిలం చేసి చెలరేగిపోతే ఆ విశ్వవ్యాప్తత వచ్చిందో తెలియని దెవరికి?కొత్తరకం కమ్యునిష్టు సామ్రాజ్యవాదాన్న్ని పాటిస్తున్న చైనా దేశమూ జాత్యహంకారంతో మూర్ఖంగా ప్రవర్తించి అణువిధ్వంసం చెలరేగడానికి కారణమైన జపాను దేశమూ తమిళులకి కనీసం ఓటుహక్కు కూడా ఇవ్వకుండా అంతులేని అత్యాచార పరంపరతో నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించి తీరా దాన్ని యెదుర్కోవడానికి పులిలాంటి ప్రభాకరన్ విరుచుకుపడ్గా ప్రపంచదేశాల్లో ముఖరక్షణ కోసం అతనినే విలన్ అని ప్రచారం చేసిన సిగ్గులేని శ్రీలంకా పరమ ప్రశాంతమైన భౌధ్ధమతాన్ని అనుసరిస్తూనే ఆ పాపకర్మలు చేశాయి గదా - ఇంకా అవి ప్రజాస్వామ్యబధ్ధమైనవేనని వాదిస్తే "వాళ్ళు మొదట కమ్యునిష్టుల కోసం వచ్చారు,నేను కమ్యునిష్టుని కాదు కాబట్టి మాట్లాడలేదు.తర్వాత వాళ్ళు యూదుల కోసం వచ్చారు,నేను యూదును కాదు కాబట్టి మాట్లాలేదు.తర్వాత వాళ్ళు కార్మికనాయకుల కోసం వచ్చారు,నేను కార్మికనాయకుణ్ణి కాదు కాబట్టి మాట్లాడలేదు.తర్వాత వాళ్ళు కాధలిక్కుల కోసం వచ్చారు,నేను కాధలిక్కును కాదు కాబట్టి మాట్లాడలేదు.చివరకు వాళ్ళు నాకోసం వచ్చారు,అప్పటికి మాట్లాడేందుకు యెవరూ మిగిలిలేరు?" అని అంతా అయిపోయాక ఆక్రోశించిన మార్టిన్ నీమోలర్ మాదిరిగానే అఘోరించాల్సి వస్తుంది ఒకనాటికి!

          పాయింట్లవారీగా "ప్రపంచ మానవాళి ముందు మూడురకాల దేవుళ్ళ ఆలోచన,ఆచరన అరళులు ఉన్నాయి.{1} ఆబ్స్ట్రాక్ట్ దేవుడు, {2} మానవులుగా పుట్టి ప్రవక్తలుగా మారి క్రమంగా పరపంచదేవుళ్ళుగా మారిన వ్యక్తులు, {3} ఊహాజనిత మానవాకార దేవతలు" అని చాలా గొప్పగా వర్గీకరించానని మురిసిపోతున్నాడు.కానీ తన మతమయిన క్రైస్తవంతో సహా అన్ని మతాల్లోనూ అంతర్భాగంగా ఈ మూడురకాల ఆలోచనా ధోరణులూ వున్నాయని కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే ఈజీగా తెల్సుకోవచ్చు,ఆయనగారు తిన్నగా ఆలోచిస్తే గదా?క్రైస్తవంలోనే యెహోవా - ఆబ్స్త్రాక్ట్ దేవుడు,జీసస్ ప్రవక్త,గాబ్రియేలు - దైవదూత అనే మూడు అంశాలూ ఉన్నాయి కదా!బౌధ్ధంలోనూ తధాగతుడు లేక బోధిసత్త్వుడు - ఆబ్స్ట్రాక్ట్ దైవం,గౌతమ బుధ్ధుడు - ప్రవక్త,మారుడూ అతని కుమార్తెలు - వూహాజనిత మానవాకార దేవతలు అనే మూడు అంశాలు ఉన్నాయి కదా?యెక్కడ ముస్లిము మతాన్ని ప్రస్తావించినా ఇవ్వాళ పూర్తి స్థాయి మతంగా వెలుగొందుతున్నదనే విషయాన్ని గుర్తించకుండా, నేడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే మతాల్లో అది కూడా ఓకటని ఒప్పుకోకుండా క్రైస్తవం నుంచి పుట్టిన శాఖగా మాత్రమే చూస్తూ అవమానించటం ప్రజాస్వామ్యయుతమైన మతాన్ని పాటిస్తున్నానని డప్పు కొట్టుకుంటున్న ఇతనికే చెల్లింది?మరి గౌతమబుధ్ధుడు తాను కొత్తమతాన్ని స్థాపించటానికి ముందు ఒక క్షత్రియ హిందువు కాబట్టి బౌధ్ధం కూడా హిందూ మతంలోని శాఖ అని మనమంటే మాత్రం ఒప్పుకోడు, యెందుకనో?ఇంతవరకూ యే హిందూ మేధావీ ఇతను కక్కినంత విషాన్ని ముస్లిము మతం మీద కక్కలేదు - అదీ హిందువుల ఔన్నత్యం!

          ఒకోసారి మనం యెదటివాళ్ళకి మంచిదౌతుందని చేసిన పని అవతలివాడు తనకి ద్రోహం చెయ్యడానికే మనం ఆ పని చేశామని అపార్ధం చేసుకోవచ్చు - పుణ్యానికి పోతే పాపం యెదురైందన్నట్టు!ఒకోసారి యెదటివాడు ఖచ్చితంగా మనకి ద్రోహం చెయ్యాలనే ఉద్దేశంతొనే చేసినా మనకి వూహించని వైభవాన్ని తీసుకురావచ్చు - అంతా మనమంచికే అన్నట్టు?ఆ మధ్యయుగాల నాటి రాజ్యాలతో కాలం యెన్ని యుగాలు గడిచినా దేశంలో యేకత్వం యేర్పడకపోయేది - ఇంగ్లీషు వాళ్ళమీద పోరాడిన వాళ్ళు కూడా తమ రాజ్యపు సరిహద్దుల లోపల తమ పెత్తనం జరక్కపోవటం వల్ల ఇంగ్లీషువాళ్ళ మీద అలగడమే తప్ప విశాల భారతదేశం గురించి ఆలోచించి ఆ యుధ్ధాలు చెయ్యలేదు.పూర్వకాలంలో మౌర్యులూ గుప్తులూ కూడా చెయ్యలేనిది ఇంగ్లీషు వాళ్ళు దేశం మొత్తాన్ని బ్రిటిష్ ఇండియాగా మార్చడంతో సాధ్యపడింది! క్రైస్తవ మిషనరీలు తమ మతానికి వూపు తెచ్చుకోవడానికి పైస్థాయిలో అప్రతిహతంగా సాగిపోతున్న బ్రాహ్మణ-క్రైస్తవ వర్గాల మైత్రిని తెగగొట్టితే అది భారతీయులలో జాతీయత రగుల్కొనడానికి దారితీసి సుదీర్ఘకాలపు పరాధీనతని వదిలించుకోవడానికి సహాయపడింది.తీరా దేశం పరాధీనతని వదిలించుకుని ప్రజలంతా ఒక్కతాటిమీద ప్రగతి కోసం పరుగులు పెట్టాల్సిన వేళ క్రైస్తవ మిషనరీలు బ్రాహ్మణుల సాయంతో వ్యాపించలేకపోవడంతో కిందికులాల్లో వ్యాపించడానికి పుట్టించిన బ్రాహ్మణ వ్యతిరేకత కులస్పృహని పెంచి జనం మానసికంగా విడిపోవటానికి కారణమైంది.యే ఒక్క క్షణంలో నైనా  మనముందు వేనవేల దారులున్నా సారూప్యవిభేదాలన్నిటినీ చూసుకుని ఆలోచిస్తే ఒకసారికి ఒకదారిలోనే వెళ్ళగలం గనక యేదో ఒక్కదారినే యెన్నుకోవాల్సి ఉంటుంది.ఒక ప్రాంతంలో ఒక తరంలో అనేక రకాలైన భావాలు గల వ్యక్తులు ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలోని అత్యధికులు దేన్ని పాటిస్తారో అదే ఆ సమాజపు సంస్కృతీ లక్షణం అవుతుంది - పదుగురాడు మాట పాడియై ధర జెల్లు నన్నట్టు!ఆ పాతకాలం శ్శ్రోత్రియ బ్రాహ్మణుదైన యేనుగుల వీరాస్వామాయ్య గారికున్న వివేకం కూడా లేకపోయిందేమిటి ఈ నూత్నకాలం సామాజిక శాస్త్రవేత్త అయిన కంచె ఐలయ్య గారికి?

         ప్రతి మతంలోనూ తాము చెప్పిన వాట్ని హేతువు కోసం వెదక్కుండా నమ్మితీరాలనీ అలా నమ్మకపోతే మతం నుంచి బహిష్కరిస్తామనే బెదిరింపులతో కూడిన పెత్తందారీ ధోరణి ఉండగా తన కిష్టమైన కొన్ని మతాలని ప్రజాస్వామికమైనవని పొగడుతూ తనకిష్టం లేని మతాల్ని చిన్నబుచ్చుతూ తీర్పులు తీర్చే ఈ అహంభావికి తన మతగ్రంధంలోనే యేనాడో ఒక వ్యక్తి గడ్డిపెట్టాడు, బహుశా బైబిలు కూడా పూర్వాపరాలు సరిచూసుకుంటూ చదివే అలవాటు లేకపోవటం వల్ల తెలిసి ఉండదు:

ఇతరులను నేరముల గురించి తీర్పును లిఖించు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవును నేరస్థుడవేనని తీర్పు తీర్చుకొనుచున్నావు.ఏలయనగా తీర్పు తీర్చుచున్న నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు గనక.అట్టి కార్యములను చేయువారిమీద దేవుని తీర్పు శుధ్ధసత్యము ననుసరించి బయల్పడునని తెలిసికొనుము.అట్టి కార్యములు చేయుచున్నవారికి తీర్పు  నిచ్చుచు వాటినే చేయు నీవు దేవుని తీర్పు తప్పించుకొనగలనని అనుకొందువా?

నీ కాఠిన్యమును, మార్పు పొందని హృదయముననుసరించి ఉగ్రత దినమునందు  - అనగా దేవుని న్యాయమైన తీర్పు బయల్పరచబడు దినమునందు - నీకు నీవే భయంకరమైన శిక్షను విధించుకొనుచున్నావు.నీవు మందుగా ఊహించలేని ఆ దినము నీ జీవితమునందే ఏ క్షనము నందైనను తటస్థించవచ్చును.

ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము నిచ్చును.సత్ క్రియను శ్రధ్ధతో చేయుచు,మహిమను,ఘనతను,అక్షయతను వెదుకువానికి నిత్యజీవమును దయచేయును.సత్యమునకు లోబడక దుర్నీతి ననుసరించువాని మీదికి దేవునిఉగ్రత తప్పక వచ్చును.పరమపితకు పక్షపాతము లేద్.ఆయనను మోసగించుట నీకు శక్యము కాదు.                                                               
 రోమా 2:1-11
JUDGE NOT OTHERS,JUDGE YOURSELF!

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...