Friday 29 August 2014

రాజు లంతా ఒక రకంగానే వుంటారా?నిజామునీ కృష్ణదేవరాయల్నీ ఒకే గాటన కట్టెయ్యొచ్చా?

సీ||          వెలిసిన గోడపై వేసిన మసకలు
                 గమ్మిన బొమ్మలు కదిలి నట్లు

                  తోచు మార్మిక చిత్రతోరణాలు! తెగ వే
                  ధించెడి మనను బాధించెడి గత

                  కాలపు గాయాల్ని కళ్ళకు మరల మ
                  రల చూపించెడి హర్రరులు! హుషారు

                  లను పెంచు ఫాంటసీలు!చదివి చూడవోయ్
                  మమ్మల్ని తెలుసుకో మనసు మర్మ

తే||            మంటు చాలెంజి విసిరేటి పజిలు గళ్ళు!
                   మనసు భాషను తెలిపేటి మార్మికాల
                   లెక్క తేల్చేటి పదనిధులు! గహనాలు!
                   నిదర చెట్టుకు పూసేటి విరులు- కలలు!!
(23/07/2014)
______________________________________________________
పదనిధులు=vocabulary(list of key words)
______________________________________________________


         విజయవాడ లయోలా కాలేజిలో చదివుకునేటప్పుడు నేనూ మా ఫ్రెండూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాం.మా కాలపు కుర్రాళ్లకి ఘంటసాల ఇంకా టచ్ లోనే వున్నాడుగా, వాడు హఠాత్తుగా ఒక ఘంటసాల పాట యెత్తుకున్నాడు, "బ్రతుకంత బాధగా కన్నీటి ధారగా" అని.వెంటనే దానికి జవాబుగా  నేను, "బ్రతుకూ కన్నీటి ధారల లోనే బలి చేయకూ" అని యెత్తుకున్నా8=P)

           తెగ నవ్వుకున్నాం, ఈ సినిమా పాటలు రాసేవాళ్ళు యే మూడ్లో వుంటే ఆ మూడ్ కి పనికొచ్చే పాట రెడీగా వుంచారు, బహుశా ఆ రెండు పాటలూ ఒకడే రాసినా ఆశ్చర్యపోనక్కర లేదు గదా!కొన్ని పాటలయితే బహురూపుల మాదిరి ఒకే పాట యే మూడ్ లో వుంటే ఆ అర్ధానికి పనికొస్తాయి. అలాంటివాటిలో ఒకటి, "ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం" - అదే యేడుపు పాటా, అదే వోదార్పు పాటా అవుతుంది మరి!

           కవిత్వంతో పని లేని వాళ్ళు బండిచక్రంతో పోలుస్తారు కాలాన్ని, తిరుగుతూ వుంటే పై ఆకు కిందకీ కిద ఆకు పైకీ వస్తాయని.కానీ నాకు ఈ పోలిక తప్పనిపిస్తుంది, యెందుకంటే రిపీట్ అవుతున్నవి సన్నివేశాలు కాదు, మన భావాలు మాత్రమే!ఒకసారి తప్పు చేసేశాక దిద్దుకోవటం అసంభవం, ఫలితాన్ని అనుభవించటమే శరణ్యం. స్ప్రింగు పై నుంచి చూస్తే సర్కిల్ లాగ కనపడినా పక్క నుంచి చూస్తే యే రెండు పాయింట్లూ కలవవని.

        మనిషి బతుకూ అంతే, ఒకసారి చేసిన తప్పుని దిద్దుకోవటం కుదరదు - పరిహారం చెల్లించుకోవటమూ తప్పదు!గతంలో చేసిన తప్పులకు యేడుస్తూ కూచున్నా ముందు కెళ్ళలేం! ఇతర్లు చేసిన తప్పుల నుంచీ వాళ్లకి తగిలిన దెబ్బల నుంచీ నేర్చుకోవటం ద్వారానే మనం తప్పులు చెయ్యకుండా వుందగలుగుతాం. అన్నీ మన స్వానుభవం మీదనే నేర్చుకోవద మంటే నిప్పు కాలుతుందిరా అంటే చెయ్యి పెట్టి చూసి తెలుసుకుంటా ననడం లా వుంటుంది!

          గడపలకి పసుపు రాయడం నుంచి బొడ్డుతాడు దాచటం వరకూ మన పెద్దవాళ్ళు యెంతో అనుభవసారాన్ని మన కందించారు, యేమి లాభం?నపుంసకుడికి లావణ్యవతిని కట్టబెట్టినట్టుంది ఇవ్వాళ్టి పరిస్థితి! యెప్పటి కప్పుడే యెప్పటి దప్పుడే అనే ధోరణి పెరిగి ఒకప్పుడు యేం జరిగింది, దానివల్ల ఇవ్వాళ్టి మనం యెలా ప్రభావితుల మవుతున్నామో తెలిస్తే గదా ఇవ్వాళ మనం చేస్తున్న పనుల వల్ల మన తర్వాత తరం వాళ్ళ బతుకులు యెలా ప్రభావిత మవుతాయో తెలిసేది?అందుకే మనవాళ్ళు మానవజాతి మనుగడని ప్రవాహం తో పోల్చారు. నిన్నా నేడూ రేపూ ల మధ్యన చక్కని సమన్వయంతో సాగే ఆ ప్రవాహం దారిలో వూషర క్షేత్రాలు పెరగదంతో కొంచెం బలహీన పడింది!

       ఈ దేశ చరిత్రలోని కొన్ని అనివార్యతలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి.అనివార్యత అంటే ఒకటి - ముఖ్యంగా హాని చేసే దుస్సంఘటన - జరగబోతుందని తెలిసినా ఆపలేని నిస్సహాయత! యెందుకొస్తుంది?ఒకటి మనకి హాని కలిగిస్తుందనీ దాన్న్ని వొదిలేస్తే మంచి జరుగుతుందనీ తెలిసినా సరే వొదలకుండా గట్టిగా పట్టుకుని ఒక  విధ్వంసం యెదురయ్యే వరకూ అకర్మణ్యంగా వుండిపోతున్నాం.మొదటిసారి జరిగినప్పుడు దాని నుంచి నేర్చుకుంటే రెండవసారి జరగ్కుండా ఆపవచ్చు, కానీ నేర్చుకునే చురుకుదనం మనలో లేనట్లుంది?!

       దారా షికో - గొప్ప పండితుడు, సజ్జనుడయిన ప్రభువు.మన భారతీయ సాంప్రదాయం పట్ల గౌరవాదరాలు వుండి మన సాహిత్యాన్ని పారసీ భాషలోకి తర్జుమా చేసి ప్రపంచాని కందించాలని కలలు గన్న దార్శనికుడు.ఔరంగజేబు - ఈ దేశాన్ని యెంత దుర్మార్గమయిన పధ్ధతిలో నైనా సరే తనకు నచ్చిన మతానికి అంటుగట్టాలని చూసిన సంకుచిత మనస్తత్వం గలవాడు.వీరిద్దరి మధ్యనా అధికార మార్పిడికి పట్టిన ఆ అయిదు నిముషాల కాలం హిందువులూ ముస్లిములూ అన్యోన్యంగా కలిసి వుండి వుండేవాళ్లేమో అని అనుకోవాల్సిన జరగని భవిష్యత్తు నుంచి ఇవ్వాళ మనం చూస్తున్న ఈర్ష్యా ద్వేషాలతో రక్తపుటేరులు పారించుకుంటున్న పరిస్థితి దాపరించింది!?

      మొగలాయీ వంశంలో తండ్రి నుంచి కొడుక్కి అధికారం రావటం కూడా కుట్రల తోనూ కుహకాల తోనూ రక్త సంబంధీకుల్ని కూడా కత్తికి బలిచ్చి కూడా యేమాత్రమూ పశ్చాత్తప పడని విధంగా జరిగింది!యెంత పరమ శాంతంగా అధికారం లోకి వచ్చినా దారా  ఔరంగజేబు చేసిన మోసపు యుధ్ధంతో చరిత్ర చెత్తబుట్టలోకి క్రూరంగా విసిరివెయ్యబడ్డాడు!దారా సైన్యంలోని ఒక వ్యక్తిని కొనేశాడు, తక్కువ సైన్యంతో యుధ్ధానికి వచ్చి వెనక్కి తిరిగి పారిపోతున్నాట్తు నటిస్తున్నాడు. ఈలోపు పాదుషా సైన్యంలోని అతని పావు, "ప్రభూ, తమరు గజం మీద నుంచి కన్నా అశ్వం మీద నుంచి అయితే మరింత చురుగ్గా కదలగలరు" అనడంతో అమాయకంగా హౌదా మీద నుంచి దిగాడు.సమయం కోసం చూస్తున్న ఔరంగజేబు పాదుషా వోడిపోయి వెనక్కి తిరుగుతున్నాదని హడావుడి చేశాడు, అంతే - వోడిపోతున్నామనుకున్న సైన్యం హుషారుగా రెచ్చిపోయింది, గెలుస్తున్నామనుకున్న సైన్యం దిగ్భ్రాంతితో చతికిల బడింది - ఫలితం తారుమారయింది!

          కేవలం కొన్ని మొహిరీల అదనపు సంపాదన కోసం అనామకుడైన ఆ లంచగొండి సైనికుడు  చేసిన పని భారతదేశ చరిత్రని యెంత వూహించని మలుపు తిప్పిందో చూశారుగా!ఇవ్వాళ రక్షణ శాఖ లోని వున్నతాధికారులే అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తుంటే దేశ భవితవ్యం గురించి నిర్భయంగా వుండగలమా?దారా షికో ఆస్థానంలో కవిగా తెలుగువాదైన పండిత జగన్నాధ రాయలు వుండేవాడు.దారా షికో పతనం తర్వాత ఢిల్లీ వొదిలి దేశాతనలో కాలం గడిపాడు.కధాకావ్యాలు రాయలేదు గానీ ఇతని వ్యంగ్యవైభవం అసామాన్యం! అతనిలా అంటాడు, "ఓ గాడిదా! రోజంతా బట్టల మూటలుమోసి వీపు విరగ్గొట్టుకుని ఈ గుగ్గిళ్ళు తినదం దేనికి?రాజుగారి అశ్వశాలలో హాయిగా విందు భోజనమే చెయ్యవచ్చు గదా! కాపలా వాళ్ళు గుర్తు పట్టి తంతారు గదా అంటావా, అక్కడ నూటికి తొంభయ్ శాతం మంది గుర్రానికీ గాడిదకీ తేడా తెలియని వాళ్ళే వుంటారు, మిగిలిన ఆ పదిమంది మాటా రాజుగారి దగ్గిర చెల్లదు." అని.అప్పటి రాజస్వామ్యంలోనూ ఇప్పటి ప్రజాస్వామ్యంలోనూ పరిస్థితి ఒక్క లాగానె వుంది కదా, యెంత మందకొడి తనం? అనివార్యత లన్నీ విషాదాన్నే మోసుకొస్తున్నాయని తెలిసినా ఇప్పటికీ చిన్న చిన్న వాట్ని కూడా ఆపలేకపోవడానికి మందకొడి తనమే కారణం కదా!

             అయితే ఇంత మందకొడిగా బతికే అసంఖ్యాక ప్రజల మధ్య నుంచి అప్పుడప్పుడూ తమ జీవిత కాలం లోనే కాలాన్ని పట్టి బంధించి గుప్పిట పట్టి చరిత్రని తమ సంకల్పాని కనువుగా మలుపు తిప్పి చూపించి అనంతకాలం వరకూ నడక ఆపని వాళ్ళూ వున్నారు!వాళ్ళింకా నడుస్తూనే వున్నారు,చూస్తున్నారా!వారి చిరంజీవిత్వం వెనక వున్న రహస్య మేమిటి?యేమీ లేదు, వాళ్ళొక కల గన్నారు దాన్ని కష్టపడి నిజం చేసుకున్నారు!కాలం తెలియని ఒక స్థలంలో పరమ పురుషుదు పుట్టీ పుట్టగానే తన చుట్టూ వ్యాపించి వున్న యేమీలేనితనం చూసి బోరు కొట్టి ఒక 3డి బ్రష్ ని కదిలించి ఈ అనంతకోటి విశ్వాల్నీ సహస్రాధిక భాను మండలాల్నీ యేది కిందో యేది మీదో తెలియని విశ్వ ఘనంలో మునగానాం తేలానాం అంటూ వేలాడుతూ కదులుతున్న పాలపుంతల్నీ బృహత్తారల్నీ సృష్టించుకున్నాడు - తన ఆనందం కోసం!అనేకానేక జీవరాశుల్నీ సృష్టించాడు - చంపుతూ,పుట్టిస్తూ, యేడిపిస్తూ, నవ్విస్తూ - కాలక్షేపం చెయ్యడానికి! అంతా అయిపోయాక బ్రష్ పక్కన పడేసి తీరిగ్గా చూస్తే యెక్కడో యేదో కనబడీ కంబడకుండా దాక్కున్నట్టు అనిపించింది!? తనే సృష్టించుకున్న బ్రహ్మాండమంతా కలయదిరిగినా ఫలితం లేకపోయింది, విసుగెత్తి తన బదులుగా వెతకడం కోసం మనిషిని సృష్టించాడు!

            తనకు మాత్రమే ప్రత్యేకమయిన సృజించే శక్తినీ అమరత్వాన్నీ తప్ప తనకున్న అన్ని శక్తుల్నీ - ముఖ్యంగా కనిపించిన దాన్ని బట్టి కనిపించని దాన్ని చూడగల బుధ్ధి చాతుర్యాన్నీ యేది చేయందగు నేది చేయందగదనే విచక్షణనీ -  ఇచ్చాడు. ఇచ్చి వెదకమన్నాడు గానీ అతను ఒక జీవితకాలం సరిపోదనేశాడు. సరే, ఆ మనిషినే రెండుగా చేసి ఒక సగం నుంచి  ఆడ మనిషిని కూడా సృష్టించి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసి ఈ భూమి మీదకి దించాడు. ఆ లోపాన్ని సరి చెయ్యగలిగిన వాడికి తన సృజించే శక్తితో సహా అన్నీ ఇచ్చి తనంతవాణ్ణి చేస్తానని హామీ ఇచ్చాడు! సంతానం అయితే తామరతంపరగా పెరిగింది గానీ నూటికి తొంభయ్ శాతం మందకొడిగా తిరిగే బేవార్సు గాళ్ళే. కేవలం పదిశాతం మందే భగవంతుడు విసిరిన ఛాలెంజిని టేకప్ చేశారు. "యేమీలెనితనం నుంచి వచ్చిన ఈ కనిపించే దాంట్లో యేది కలిస్తే పరిపూర్ణత్వం సిధ్ధిస్తుందో అది యేది?" అనే వెతుకులాటలో జీవితాల్ని అన్వేషణకి అంకితం చేశారు.అసలుదైన దైవత్వం సిధ్ధించలేదు గానీ కొసరుదైన అమరత్వం సిధ్ధించింది!

          మీరూ ప్రయత్నించండి.నేనూ ఖాళీగా వుండన్లెండి.దేవుడితో సమానం అయ్యే ఛాన్స్ వొదులుకుంటామా, చెప్పండి! వెతుకుదాం,వెతుకుదాం,వెతుకుదాం - అలిసిపోతే నిదర పోదాం. ఆ నిదరలో ఒక కలొస్తుంది!ఆ కల, పైన చెప్పినట్టు - హర్రర్, ఫాంటసీ, పజిల్, క్లూ వర్డ్ - యెలా అయినా వుండొచ్చు! పీడకల వచ్చి వులిక్కిపడి లేచినా యెంత సేపు మేలుకుని వుండగలం? అదృష్టం ఈడ్చి తన్నే ఒక క్షణంలో వచ్చే కల మన లక్ష్యాన్ని కళ్ల ముందు బొమ్మ కట్టిస్తుంది.ఆ కల వెంట పయనమయితే మనమూ చరితార్ధుల మవుతాం?!
గొప్పోణ్ణవటానికి దగ్గిర దారేది గురూ? అర్జెంటుగా ఒక మంచి కల గనెయ్యటమే శిష్యా!

Monday 25 August 2014

యేందీ తెలంగాణా కాంగ్రెసోళ్ళ చిలుకుడు పండగ?నాకేందో కెలకనీకి హుషారు గున్నది!

(హలొ.. హలొ ..మైక్ టెస్టింగ్,మైక్ టెస్టింగ్.వ్యాఖాతలకు ఒక మనవి, ఈ వొక్క పోష్టును మాత్రం నేను ఆంధ్రోణ్ణి గాకుండ ఒక తెలంగాణోడిగా వేస్తున్నా!కొసాకి ౘదివితే బుర్రలో దీపం వెలుగుతుంది యెందుకట్లా చేసానో?)       
              తెలుగుని తెలుగులాగ వుంచకుండ సంస్కృతంతోనో ఇంగ్లీషుతోనో సంకరం జేసెటొళ్ళంటె నాకు మా సెడ్డ సిరాకు!రెండుగ చీలింది భూమే గద, భాష గాదు గద.మొత్తం 23 జిల్లాలల్ల బహు చక్కని తెలుగుండె, ముచ్చట పడి కాలికి బలపం గట్టుకుని తిరిగి అన్నీ నేరుస్తనంటె వొద్దని యెవడయిన అంటడా?అది గాకుంటె వున్న వూర్ల నేర్చుకున్న  సొంత బాస వుండె గద!

         గదేందో కాంగ్రెసోళ్ళు దొంగలు బడ్డ ఆర్నెల్లకు మొరిగే కుక్కల మాదిరి "తెలంగాణా ఇచ్చినా మనం తెలంగాణలో యెందుకు గెల్వలేదు" అని తేల్చుకొనుడు గిప్పుడు షురూ జేసిన్రు. దానికి "మేధో మధనం" అని సంస్కృతంల పేరు బెట్తిన్రు.గింత చిన్న దానిగ్గూడ సంస్కృతం గలిస్తె గాని యవ్వారం తిన్నగ నడ్వదా ఈళ్ళకి?అచ్చ తెలుగుల "తలల చిలుకుడు" అంటే అందరికీ అర్ధమయితలేదా,  జర చెప్పున్రి?

           అయిపోయిన పెళ్లికి బాజాలు యెందు కన్న సంగతి గూడ యెర్క లేనోళ్ళు దేనికి పనికొస్తరు బై?వూరందరికి దెల్సి పాయె, నవ్వనోడు వుంటె పాపమన్నట్టు దేన్ని బడితె దాన్ని తిట్టుడే దప్ప జోకులెయ్యని కంచె అయిలయ్య మేష్టారు గూడ జోకులేసిండె - ఈళ్లకి మాత్రం దెలియక పాయె!?

         యెన్నికల సందట్లోనే మన దొర దేశానికి సొతంత్రం దెచ్చుకొనుడులో తెచ్చిన గాంధీ గొప్పోడా?ఇచ్చిన ఇంగ్లీషోడు గొప్పోడా అని ఇరగనూకిండు గద, అది గూడ యెక్కలేదా ఈ కోడి మెదడు సన్నాసులకి?!సోనియ గాంధి యెన్నో కష్టనష్టాల కోర్చి ఇచ్చిందంట, వార్ని మనకి దెల్వనట్టు?అయిదేండ్ల క్రితం యెన్నికల్ల తెలంగాణా ఇస్తనని చెప్పి పవర్ దక్కించుకుని నాలుగేండ్ల పదకొండు నెల్లు యేడిపించి ఇచ్చుడు మనమీద గారాబం కొద్దీ ఇచ్చినట్టా?ఒకేపున సెంటరోళ్ళు ఇస్తమని హడావుడీ జేస్తంటె వాళ్ళే కిరికిరిగాణ్ణొకణ్ణి ఈడ కుర్సీల బెట్టి యెంత లొల్లి జేయించిన్రు వాని తోని?యెన్నిసార్లు యేందివయా ఇది, మీ వోడే నఖరాలు జేస్తండని అడిగినా మావోడు మంచోడు మామిడి కాయంత దొడ్డోడు అని అనిందెవరు, ఈళ్ళు గాదట్నా? ఈ ఇచ్చుడు గూడ ఆంధ్రోళ్లతో గూడి నాటకమాడి మనకి ద్రోహమే జేసింది గద!

          అన్నా ఒకటి జెప్త ఇనుకో, కాంగ్రెసు అంత మాదచ్చేదు పార్టీ ఇంగొకటి లేదీ బూమ్మీద,యెవళ్ల సంగతో మనకేల?గారోజున తెలంగాణను బలవంతంగా ఆంధ్రోళ్ళతో గలిపిన పాపమూ దానిదే,అందుకోసరమని పెద్దమనుషుల ఒప్పందం అనే కంటితుడుపు మేళం ఒకటి యేర్పాటు జేసిందీ ఆ పార్టీయే, ఆ బల్లకి అటూ ఇటూ గూడ కాంగ్రెసోళ్ళే గూసోని దస్తర్ల మీద ముద్దర్లు గుద్దిందీ ఆళ్ళే, ఆ ఒప్పందాన్ని తుంగలో దొక్కి మన మీదెక్కి తొక్కిందీ  ఆ పార్టీయే గద?యెంటీ ఆర్ వొచ్చెదనుక ఆంధ్రాలో హవా అంతా ఆ పార్టీదే గద, యేం పీకింది బై?ఆంధ్రా రెడ్లూ ఆంధ్రా కమ్మోళ్ళూ ముఠాలు గట్టి రాష్ట్రం మొత్తాన్ని ఆళ్ళ సంక కింద నుంచి బయటికి రానీకపాయె?!ఒకడేమో వాని పెండ్లాం పక్కోనితో లేచిపోయినా దుఃఖ పడడు గానీ పదవి లోంచి పీకేస్తే చాలు చెవిగోసిన మేకలాగ అరెచెటోడు!మిగతోళ్ళు రాష్ట్రాన్ని  పంచుకొనుడు దంచుకొనుడు అంతా సొంత యవ్వారమల్లె ఆళ్ళలో ఆళ్ళు జేస్కుంట మనకి సందే ఇవ్వకపోతె మనకు మండదా?

           మండి యేమడిగినం? మీతోనీ మీ కరప్షన్ తోనీ మాకు విసుగెత్తి పోయింది, మాది మాకు పారెయ్యమంటిమి?అంతా శ్రీ వైష్ణవులే మరి బుట్టెడు చేపలూ యేమాయె నన్నట్టు అందరూ లేఖలిచ్చిన్రు - తెలంగాణా ఇస్తె మాకు ఫికర్ లేదని.అయినా నాలుగేండ్ల పదకొండు నెల్లు దేనికి సాగలాగినట్టు?సెంటర్లోనూ స్టేట్లోనూ వాళ్ళే వుండి ఇంత దరిద్రంగా విభజన జేసి మనకి చెడ్డపేరు దెచ్చిన పరమ నికృష్టమయిన పార్టీకి అసల్కి మొన్న యిన్ని వోట్లు యెలాగ పడినై బై?మన రాష్ట్రం మనకి ఇమ్మని అడిగినమే గాని ఇంత దరిద్రంగ ఇమ్మన్నమా?నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించినట్టు ఇచ్చిందన్నా కాంగ్రెసు తెలంగాణా  మనకి!ఆంధ్రోళ్ళ సమైక్యం హడావుడి చూసీ విడిపోతే చస్తామన్న శోకాలకి మతి పోయీ మన బోలాశంకరుడు గూడ మాకు తెలంగాణా ఇస్తె చాలు ఆంధ్రోళ్లకి యేమిస్తరో మీ ఇష్టం అనేసిండు!?అటు ఆంధ్రోళ్లని సమైక్యమని రెచ్చగొట్టి ఆఖరి మినిట్ వరకూ వస్తదా రాదా అని కంగారు పెట్టి తరుగు రెవెన్యూ పేర్న, రాజధాని పేర్న పాకేజీలు ఆళ్లకీ ఖాళీ పళ్ళెం  లాంటి వుత్త తెలంగాణా మనకీ  ఇచ్చిన్రు, సమజైందా?!ఆంధ్రోళ్ళు ఆంధ్రోళ్ళే, హమ్మో?!

         మాటిమాటికీ కేసీఆర్ విలీనం ప్రపోజల్ బెట్టిండు అంటరు, తప్పేందీ అంట!అవస్ర పడి వసుదేవు డంతటోడు గాడిద కాళ్ళు బట్టిండు,యేమాయె?కేసీఆర్ పట్టింది ఈ గాడిదలనె గద,యెట్లుండె రిటార్టు?వీండ్లు కష్టనష్టాల కోర్చిందీ అనే సొనియకు మొదట్నె తెలంగాణా అంటె సానుభూతి వుంటె విలీనం అనక ముందే ఇచ్చి వుండును గద! అది పచ్చ మీడియాయే గావొచ్చు, కెలకడానికే గావొచ్చు - యెన్ని సార్లు యెందు కిస్తున్నరు తెలంగాణా అంటె ఒక్క సారయినా తెలంగాణా ప్రజల కోరిక మేరకు అనకపోయె, అన్ని సార్లూ విలీనం జేస్తనన్నడు, మాకు ముఫయ్ సీట్లు రప్పిస్తనన్నడు - ఇదే గోల జేసి మాకు మేము ఆ ముఫయ్ సీట్లు గూడ దెచ్చుకోలేని యెదవలం అని వొప్పుకున్నరు గద! ఇంగిప్పుడు ఈ చిలుకుడులో కొత్తగ దేల్చే పరమ సత్య మేముంటది - బూదిలో కెలుకుడు ఇంత కన్న నయం గాద!

     అయినా ఒక కుటుంబానికి కట్టుబానిసలల్లె బతికెటోళ్ళు వీళ్లకి రాజ్యమూ అధికారమూ యేలన్నా?సొంత రాష్ట్రాల్లో దిక్కూ దివాణం లేని చిదంబరం, షిండే లాంటి కూర్పాసం గాళ్ళు కోటరీలో జేరి యెంత హవా వెలగబెట్టిన్రు, మరి నలబై రెండుకి నలభై ఒకటి వొచ్చిన్నాడు కేంద్రంలో యేమాత్రం చక్రం దిప్పిన్రు ఈ పోటుగాళ్ళు?పోరాడి గెలుస్తరంట, గెలిచి మళ్ళ పవర్లో కొస్తరంట, దేనికో?మొదటి మూల స్తంభం దగ్గిర్నుంచి ఆఖరి మూలస్తంభం వరకూ బెట్టిన కుంపట్లు జాలవనా?కొత్త కుంపట్లు రగిలించాలనా?మొదటి మూలస్తంభం నెహ్రూ ఒక్కడు యెన్ని కుంపట్లు బెట్టిండు?మొదటి కుంపటి కష్మీరే ఇంకా ఆరకుండె!హైదరాబాదు యెన్నికల్లోనూ మెదక్కులోనూ పోటీ జేస్తరు గాబోలు, ఒకే ఒక్కటి అదగాలె - లోక్ సభ యెన్నికల కయితే పవరిస్తం గానీ కష్మీరు కుంపటి ఒక్కటి ఆర్పి చూపించమని అడగాలె,అసెంబ్లీ యెన్నికల కయితే తెలంగాణాకు పాకేజీ లెందుకు ఇవ్వలేదని అడగాలె..

నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించిన మీకు తెలంగానోళ్ళ వోట్లు గావాల్నా?
మీరే బానిసలు!బానిసలకు అధికార మేలరా మాదచ్చోదు ల్లారా?

Monday 11 August 2014

యేక్ దిన్ కా సర్వే?బహుత్ అచ్చా!! పారా హుషార్!!!

       ఆ వొక్క రోజే? ఆ వొక్క రోజే! ఆ వొక్క రెజే?! త్వరన్ కదులుడు త్వరన్ కదలుడు ఇంటి కడనే నిలువుడు.బలే మంచి చౌక బేరము?!తెలంగాణా వాసులారా, ఆ వొక్కరోజూ శుభకార్యాలూ అశుభాలూ అన్నింటినీ వాయిదా వేసుకోండి!గుడి గోపురాలకూ దేమునికీ యముని మహిషానికీ కూడా ఆ రోజు శలవు రోజు!.తెలంగాణా సామ్రాట్టు ఆరోజు ప్రపంచ చరిత్రలోనే యెవ్వరూ చెయ్యని ఒక అధ్బుతాన్ని చెయ్యబోతున్నారు, సహకరించండి!!బలే మంచి చౌక బేరము!! ఆలసించిన ఆశాభంగము,ఆ పైని యెంత విలపించినా లేదు లాభము!

       ఆ వొక్కరోజూ తెలంగాణా సమాజం మొత్తం స్తంభించి పోవాల్సిందే,శ్రీమాన్ చంద్రశేఖర వర్మ మహారాజులుంగారు ఆదేశించారు,యేమని?ఆ వొక్క రోజు యెవరు ఇంటి దగ్గిర వుండి తమ ఇళ్ళ కడకు గంటకు వంద కుటుంబాల లెక్కన వాయువేగంతో పరిగెత్తుకు వచ్చే సర్వే అధికార్లకు తమ వివరాలు ఇస్తే చాలు,మరుసటి రోజు నుంచీ ప్రభువుల వారు కురిపించే వరాలన్నీ మీవే?! ఇవ్వక పోతిరా పంచ మహా పాతకాలూ చుట్టుకుంటాయి, అసలు మీరు తెలంగాణా వాసులే కానట్టు లెఖ్ఖ?!బంగారు తెలంగాణా కోసం ఆ మాత్రం కంగారు పడలేరా?!

    పూర్వం యెప్పుడో రాజుల కాలంలో జరిగేవి ఇట్టాంటి హదావిళ్ళు,రాజుగారు ఒక్క రాజ ముద్ర నొక్కేసి హుకుం జారీ చెయ్యగానె యేమిటిది?యెందుకు? - అనే ప్రశ్నలు లేవనెత్తకుండా జనం కకావికలై పరుగులు పెట్టటం నిజంగా చూడ చక్కని దృశ్యం!!!చరిత్ర మలుపు తిప్పే మహనీయుల్ని చూశాం గానీ చరిత్రని యేకంగా కొన్ని శతాబ్దాలు వెనక్కి నడిపించగలిగిన మహనీయుడు ఇన్నాళ్లకి మళ్ళీ పుట్టాడు?!పరిజనులారా పుణ్య భాగీరధీ తోయముల నందుకొనుడు!వందిమాగధు లారా కచరా మాహారాజును కర్ణపేయముగా కీర్తించుడు!!యేరీ తెలంగాణా కవిద్వయం, నిద్రపోవుచున్నారా?సహస్ర ఫణముల సహస్ర ఫూత్కారములతో విజృంభంచవయ్యా ఆచార్య కవీంద్రా!చందస్సుల్తో మందుగుండు దట్టించి విషజ్వాలలతో ఆంధ్ర మశకములను తరిమి కొట్టవయ్య మొద్దుసూదనా!! మీ మీ కవితా విష గంధపు ధాటికి ఆంధ్రోళ్ళు, ముఖ్యముగా చంద్రనాధుడు ముక్కులు మూసుకొని పుంజాలు తెంపుకొని పది నిముషాల్లో భాగ్యనగరిని, కాదు కాదు -  మన కంగారు తెలంగాణాను - అర్రర్రె నేనే కంగారు పడినాను, మన బంగారు తెలంగాణాను వదలి పరుగులు పెట్టునట్ట్లు చేయుడయ్య!!ప్రజాస్వామ్యంలో రాజస్వామ్యాన్ని చూపిస్తున్న చంద్రశేఖర వర్మ గారి వైభవాన్ని చూస్తా వుంటే కళ్ల నిండికీ ఆనంద భాష్పాలు వొద్దన్నా తన్నుకొచ్చేత్తన్నాయి, కర్చీఫులు చాలవేమో తుడుచుకోవటానికి?

    నా బెంగంతా ఇంట్లో ఆడోళ్ళ తిట్లు పడలేక అఫీసుల్లో యేదో పొడిచేస్తున్నట్తు హడావుడి పెట్టి పగలంతా తిట్లు తప్పించుకుని హాయిగా కులుకుతున్న మగాళ్ళు ఆ రోజంతా యెంత నరకం అనుభవిస్తారో గందా అనే!యేం గాచ్చారం వొచ్చి పడిందిరా నాయనా!!పైగా మొగాళ్ళు ఆఫీసులకి చెక్కెయ్యంగానే మారిణింగు షోలో మహేష్ బాబునీ మాట్నీ షోలో బాలయ్యనీ కళ్ల నిండికీ చూసుకునేవోళ్ళు రోజంతా ఈ పొట్టి బుడంకాయల్నీ బట్టతలోళ్లనీ చూడాల్సిన దరిద్రానికి యెంత కాక మీదుంటారో ఆడోళ్ళు?!ఇరగ దీసెయ్యరూ?సాయంకాలానికల్లా ఆ అర్భనాకారి మొగుళ్లలో యెంత మంది బతికి బట్ట గడతారో?ఆయన కేం, చూట్టానికి బక్కగా వున్నా ఆయువులో గట్టోడు - ముక్కు బలంతో బతీకేస్తన్నడు,లక్ష తిట్లు దిని కూడా తట్టుకు నిలబడ్డాడు, ఈ బక్క ప్రాణుల కంత సీను లేదే?!పోన్లెండి, పోయినోళ్ళు నిక్కచ్చిగా ఒక శాతానికి తేలినా ఆ మొత్తం ఖజానా మీద బరువు తగ్గుద్ది- కరువులో అదిగ మాసం అన్నట్టు పెరిగారీ మందంతా!! 

      తెలంగాణా వాసులారా మీరెంత అదృష్టవంతులు? యెప్పుడూ ఏసీలో హాయిగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుని మిమ్మల్ని చిన్న చూపు చూసిన అధికార్లు కాగితాల కట్టలు తీసుకుని మీ దగ్గిరకి పరుగులు పెట్టుకుంటూ వచ్చే సుందర దృశ్యాన్ని తనివితీరా చూసి పులకించిపొండి!!ప్రజల వద్దకే ప్రభుత్వం అనే ఆదర్శాన్ని కనుల విందుగా వీక్షించడానికి రెండు కళ్ళూ చాలవు గదా?!అధికార్ల్లూ పరిగెత్తండి, ఆ ఒక్క రోజే మీది?!మీరు యేది రాస్తే అదే ఫైనల్! మీకు నచ్చిన వాళ్ళు లేకపోయినా వున్నట్టే రాసుకోండి, సంతకాలు ఫోర్జరీ అయినా ఫర్లేదు, యేం కాదు!అంత గాకపోతే ప్రభువుల వారు అంతా సరిగ్గా జరిగిందా లేదా అనేది తేల్చుకోవడానికి మరొక రోజు కేటాయిస్తారు. ఆ రోజు మళ్ళీ పరుగులు పెట్టొచ్చు.మాంచి యెక్సరసైజు వొంటికి మంచిది! ముఖ్యంగా ప్రభువుల వారు పైకి చెప్పక పోయినా మీరు అర్ధం చేసుకుని చెయ్యాల్సింది యేంటంటే - ఆ ఆంధ్రోళ్ళని మాత్రం లిష్టులోకి రానివ్వ మాకండి!ఆ కొంపల వేపుకు అసలు వెళ్ళకుంటే పాయే?! లేని వివరాలకి రుజువు లెవడు అడుగుతాడు? మీ సత్తా అంతా చూపించండి?!యాభయ్యేళ్ళ నుంచీ ఆంధ్రోళ్ళ అధికారంలో మొద్దు నిద్ర పోయారు,  ఇప్పుడే నిద్ర లేచి పరుగులు పెట్టే అవకాశం వచ్చింది, లేవండి పరిగెత్తండి!! యేవరు పరిగెత్తుతున్నారో యెందుకు పరిగెత్తాలో తెలియక పోయినా సరే పరుగు ఆపకండి?!నించుని నీళ్ళు తాగదం కన్నా పరిగెత్తి పాలు తాగడం మంచి దన్నారు, పాలు తాగడానిక్కూడా ఆగకుండా పరిగెత్తాల్సిందే, ఇది రాజాజ్ఞ!

      అసలు పనంతా అధికార్లదే గదా, వాళ్ళొచ్చి రాసుకునే అయిదు నిముషాలు మినహా ఇంట్లో బోరుకొట్టదా అని అనుకోమాకండి?అయాచితంగా వచ్చిన ఈ సెలవును యెలా వుపయోగించుకోవాలో ఆలోచించుకోండి, ప్రబువుల వారి దొడ్డ మనసు తెలుస్తుంది. ఆడవాళ్ళు వరలక్ష్మీ వ్రతాలూ అవీ చేసుకోవచ్చు.మగవాళ్ళు చతుర్ముఖ పారాయణాలూ ద్రవయజ్ఞాలూ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు!!అయ్య బాబోయ్, అసలు విషయం మర్చే పోయా?! అన్ని ఆఫీసులూ మూసేస్తా మన్నారు, క్లబ్బులూ బారులూ కూడా మూసేస్తారా యేంటి, కనుక్కొవాలి - వస్తా!!

Thursday 7 August 2014

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా! ఆ అన్నాన్ని తిట్టిన వాడు ముఖ్యమంత్రి యెట్లా అయ్యాడు?

                                      సీ||          ఆంధ్ర బిర్యానీని పేడ యనిం డొక
                                                       బాడుఖావు! పరుల భోజనాన్ని

                                                       కావరమున వెటకారించె టోడు మ
                                                       నిషె కాడుగా, పవరిచ్చి రెట్ల

                                                       ఘనమైన గా తెలంగాణోళ్ళు? మొదలెమొ
                                                       మా తిండిపై వూస్తడా, అటెన్క

                                                      మమ్ముల్ని కడుపుల బెట్కొని సూస్తడా!
                                                      గిట్ల జూస్తె పురుషుడూ గట్ల జూస్తె

                                    తే||            ఆడదీ ఐన బహురూపి లాగ వుంది
                                                      గా దిమాగు యెక్వోని నయా జమాన!!
                                                      వూరు పేరు లేనోళ్ళు గొప్పోళ్ళ నేందొ
                                                      పనికిమాలినో ళ్ళంటున్రు పొగరు బట్టి!!!
(28/07/2014)
______________________________________________________
     నాకు మొదటి నుంచీ తెలంగాణా వుద్యమాన్ని గురించి ఒక సందేహం పట్టి పీడిస్తూ ఇప్పటికీ జవాబు దొరక్కుండా యేడిపిస్తుంది - అంత చదువుకుని ఇంత చెత్తగా మాట్లాడుతున్నారు, యేమిటి వీళ్ళ సంస్కారం? పోనీ తెలంగాణా సంస్కృతే అంత అనుకుందామా అంటే - నాకు వస్తుతః తెలియదు గనక వారూ వీరూ చెప్పిందే ఆధారం, మరి గొల్లపూడి మారుతీ రావు గారి దగ్గిర్నుంచీ అందరూ చాలా గొప్పగా పొగుడుతున్నారు!యెంత వైరుధ్యం?యే ప్రజల కోసం పోరాడుతున్నాం అంటున్నారో ఆ ప్రజల సంస్కారానికి యే మాత్రం సంబంధం లేకుండా ప్రవర్తించే వాళ్ళు తామే తెలంగాణా ప్రజలకు నిజమయిన ప్రతినిధులుగా డప్పు కొట్టుకుంటున్నారు!

      న్యాయ పోరాటం పేరుతో వీళ్ళు చేసిన వుద్యమ విధానాన్ని చూస్తే ప్రపంచంలో న్యాయం కోసం పోరాడిన వాళ్లంతా సిగ్గుతో తల దించుకోవాలి!మా వుద్యోగాలు లక్షల్లో లాకున్నారు, మమ్మల్ని మా హైదరాబాదు నుంచే మెడబట్టి గెంటేసి కులుకుతున్నారు - కావాలంటే గిర్గ్లానీ రిపోర్టు చూడండని యెక్కడ బడీతే అక్కద రెచ్చి పోయారు, చదువుకున్న వాళ్ళు మరీ ఇంతగా అబధ్ధాలు చెప్పగలరని అనుకోలేదుగా - ఈ మధ్య వరకూ నేనూ నిజమే నని నమ్మేశా!తీరా చూస్తే ఆయన వీళ్ళ వాదనకి పూర్తి విరుధ్ధంగా వుల్లంఘనలు అన్ని జోన్ల లోనూ జరిగాయి, అందరూ నష్టపోయారు అని నిక్కచ్చిగా  చెప్పాడు.ఈ ప్రస్తావన మూడుసార్లు గ్రీన్ స్టార్ అనే తెలంగాణా మేధావి నుంచి వచ్చింది.మొదట మాలతీ మాధవం బ్లాగులో ఈ విభజన గురించి ఆమె నాకు ఈ లెక్కలూ డొక్కలూ యేమీ తెలియవు కానీ విడిపోవటం బాధగా వుంది అనే ధోరణిలో వుంటే అరిభీకరంగా చెల రేగిపోయాడు - గిర్గ్లానీ రిపోర్టు గురించి. ఒక లింకు గూడా ఇచ్చేశాడు - అది గిర్గ్లానీ గారు ఈనాడు కి ఇచ్చిన ఇంటర్వ్యూ.అక్కడా విలేఖరి యెవరు నష్ట పోయారు, యెవరు లాభ పడ్డారు? అని అడిగితే అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి వెళ్ళగలిగిన వాళ్ళు లాభ పడ్డారు, వెళ్ల లేని వాళ్ళు నష్ట పోయారు అని చెప్పాడు.ఆమె ఈ పాయింటు యెత్తి జవాబు చెప్పాక మళ్ళీ అటు నుంచి జవాబు లేదు?

          ఈ క్లూ పట్టుకుని అసలీ గిర్గ్లానీ గారు యేం చెప్పాడు అనే అనుమానం వొచ్చి వెతికితే ఈ లింకు దొరికింది.తీరిగ్గా అదంతా చదివి ఈ వడ్లగింజలో బియ్యపు గింజ కింత రాధ్ధాంతమా? అనే పోస్టు వేశాను.ఆయన ఈ జోనల్ సిస్టం గురించి చాలా చెప్పాడు.మొత్తం మీద దాని సారాంశం యేమిటంటే - అది కానీ అంతకు ముందు ఈ వుద్యోగాల విషయాలకి స్మబంధించిన రిపోర్టుల స్వభావ మంతా ఒకటే!మామూలుగా యే శాఖలో నయినా శాఖాదిపతులుగా గెజిటెడ్ స్థాయి గలిగిన అధికార్లు వుంటారు.వీళ్లు కింది స్థాయిలో నాన్-గెజిటెడ్ వాళ్లని తీసుకోవటానికి సంబంధించిన తకరారు లో వీటి ప్రమేయం వస్తుంది.పాత రిపోర్టులతో సహా తన రిపోర్టు కూడా యెందుకని నిరుపయోగం అవుతుందో కూడా చెప్పాడు.ఈ రిపోర్టు లన్నీ సలహాల కోసమే తప్ప అధికారికం గా పాటించి తీరాలన్న నిబంధన యే రిపోర్టు విషయంలోనూ లేదు.అన్ని రకాల నిబంధనల కన్నా పైన ఆ అధికారి విచక్షణ మాత్రమే నిర్ణయానికి కీలకం అని ఆయనే చెప్పాడు.ఈ రిపోర్టు ల్లోని అంశాల్ని ప్రభుత్వ పరమయిన విధి విధానాల్లోకి అంటే రూల్ బుక్ లోకి యెక్కించనంత వరకూ యేమీ ఫలితం వుండదన్నాడు. యెందుకంటే,  శాఖాపరంగా ఒక వుద్యోగి మీద దర్యాప్తు జరపాలంటే తను తన రూల్ బుక్ ని ఫాలో అయ్యాడా లేదా అనే చూస్తారు తప్ప గిర్గ్లానీ రిపోర్టును ఫాలో అయాడా లేడా అని చూడరు.ఇంకా ఇంట్రో లోనే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి మామూలు వాళ్ళకి కాదు - వీటి గురించి ప్రభుత్వాన్ని యెలర్ట్ చెయ్యాల్సిన ప్రభుత్వ సలహాదార్లకే గందరగోళం వుందన్నాడు. అంత గందరగోళం వున్నప్పుడు జరిగిన వాట్ని కూడా కావాలని తమకు అన్యాయం చేసినట్టుగా గయ్యాళి తనంతో రెచ్చి పోయారు!మరి అన్ని ప్రాంతాల్లోనూ వుల్లంఘనలు జరిగాయి, అన్ని ప్రాంతాల వాళ్ళూ నష్ట పోయారు అని ఆయన తెగేసి చెప్పినప్పుడు ఆంధ్రా రాయలసీమ వాళ్ళకీ అన్యాయం జరిగినట్టే కదా?ఆ అన్యాయానికి తెలంగాణా వాళ్ళు కారణ మయినట్టే కదా?

        మరో చోట ఇదే పెద్దమనిషి గిర్గ్లానీ గారి ఈనాడు వ్యాఖ్యని కొంచెం మెలితిప్పి వాదిస్తూ కనబడ్దాడు.చర్చలో వారే ఈ రిపోర్టు గురించి యెత్తేసరికి అన్ని జోన్లలోనూ జరిగాయని అంటున్నారు కదా అనే జవాబు వేశాను.దానికి వారు "అన్ని జోన్లలో జరిగాయి, నిజమే. కాని వారు ఇంకో విషయం కూడా చెప్పారు, అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు అని. అంటే హైదరాబాదు అని నేను అనుకుంటున్నాను. అసలు ఏ ఏ జోన్ లలో ఎంతెంత అక్రమాలు జరిగాయో ప్రభుత్వమే ఒక శ్వేత పత్రం ఎందుకు విడుదల చెయ్యదు?" - అని మరో ప్రశ్న వేసారు. వారు అంటున్నది "అభివృద్ధి చెందిన ప్రాంతాలకు వలస వెళ్ళే వారు బాగు పడ్డారు" - అని. కానీ ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిర్గ్లానీ గారు చెప్పింది ఇది,"ఒక్క తెలంగాణా వారే నష్టపోలేదు.అన్ని ప్రాంతాల వారికీ అన్యాయం జరిగింది.మేలు జరిగిందెవరి కంటే అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి తరలి వెళ్లగలిగిన వారు లబ్ధి పొందారు." ఆయన చెప్పింది వెళ్ళగలిగిన వాళ్ళు లాభ పడ్దారు అని.ఆంధ్రా వాళ్ళు (యెక్కడో కృష్ణా జిల్లా నుంచి) వెళ్ళగలిగినట్టు తెలంగాణా వాళ్ళు (చాలా దగ్గిరే ఉన్న పొరుగు జిల్లాల నుంచి) కూడా వెళ్ళగలిగితే సమస్యే వుండేది కాదు కదా?యెందుకు వెళ్లలేకపోయారు?స్పష్టంగా చెప్పిన దాన్నే ఒప్పుకోనప్పుడు శ్వేతపత్రాలు సాక్ష్యానికి పనికొస్తాయా?వారు యే గిర్గ్లానీ కమిటీ రిపోర్టును గురించి మాకు అన్యాయం జరిగిందని చెప్తుందని వూదరగొట్టారో ఆ రిపోర్టు తయారు చేసిన పెద్ద మనిషే అంత స్పష్టంగా మీ మాట తప్పు అంటుంటే ఇంకా శ్వేతపత్రం అంటారేమిటి? - అని నిగ్గదీశాను.మళ్ళీ జవాబు చెప్పలేదు,మౌనమే సమాధానం.మళ్ళీ అక్కదే మరొక పాయింటు మీద నాకౌ ప్రశ్న వేస్తే - మీ ప్రశ్నకి నేను జవాబు చెప్పేముందు మీరు నాకో ప్రశ్నకి జవాబు బాకీ వున్నారు ముందు అది తీర్చండన్నాను.అదీ భేతాళుడి ఆఖరి ప్రశ్నే అయింది - అంతతో నాకు మల్ళీ ఆ ప్రశ్న యెవ్వర్నీ వెయ్యకూడదన్నంత విరక్తి పుట్టింది!



        అసలు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం యేమిటంటే |violations| అంటున్న |deviations| అన్ని జోన్ల లోనూ సమానంగానే జరిగాయి, ప్రత్యేకంగా ఒక జోను నష్టపోయింది అని చెప్పలేం అని అంత ఖచ్చితంగా చెప్తే మాకు అన్యాయం జరిగిందని గిర్గ్లానీ కమిషన్ రిపోర్తులో ఉంది, వెళ్ళి చూసుకోండని వీరంగాలు వేశారు. మిగతా అన్ని జోన్లలోనూ అంతా బాగనే ఉండి ఒక్క తెలంగాణాలోనే జరిగితే కదా వారికి ప్రత్యేకంగా అన్యాయం జరిగినట్టు?ఇంత కాలం నేను అసలు గిర్గ్లానీ కమిటీలో యేం ఉందో చూడాలని అనుకోకపోవటానికి కారణం మేధావులూ విద్యావంతులూ సంస్కారం గలిగిన వాళ్ళు మరీ దుర్మార్గంగా అబధ్ధాలు చెప్తారా అనే భరోసా తోనే!తీరా చూస్తే పరిస్థితి ఇది.

        అసలు ఒక విషయం నిజమా అబధ్ధమా అని యెలా కనిపెట్టాలి?ఒక విషయం గురించి యెదటి వ్యక్తి వెయ్యి వాక్యాలు చెప్తే మొదటి వాక్యానికీ వెయ్యవ వాక్యానికి అర్ధంలో తేడా వొస్తే అబధ్ధం అని తేలుసుకుంటాం, కదా? ఒక వేళ ఈ వెయ్యి వాక్యాల్లో యే విరుధ్ధతలూ లేకపోయినా వెయ్యిన్నొకటో వాక్యం కొత్తగా తెలిసి దానికి గట్టి సాక్షాలు ఉంటే ఈ వెయ్యి వాక్యాలూ నిజమనిపించేటట్టు అంతా యేకసూత్రంగా ఉన్నా అవన్నీ అబధ్ధాలు అయి పోతాయి,అవునా? ఇప్పుడు అసలు విషయంలో వైరుధ్యాలు ఉన్నా యెదటి వాళ్ళకి తెలిసే వీలు లేదనుకుని వాటిల్లో కొన్నిట్ని దాచేసి అంతా తమ వాదానికి అనుకూలంగా ఉన్నవాట్ని మాత్రమే చెప్తే అబధ్ధం కూడా నిజమయి పోతుంది గదా!తెలంగాణా వాదులు వాదనల్లో ఇదే పద్ధతిని అనుసరించారు.వారంతట వారు చెప్తే తమకు అనుకూలంగా లేని సగాన్ని దాచేసి  అనుకూలంగా వున్న సగాన్ని మాత్రమే చెప్పటం,ఇతర్లకి ఆ మిగతా సగం కూడా తెలిసి నిలదీస్తే చల్లగా జారుకోవటం!!


      కలిసుండడం వల్ల తెలంగాణా భాషకి అన్యాయం జరిగిందనీ కృష్ణా జిల్లా మాండలికాన్ని అధికార భాషగా చేస్తే భరించాల్సి వొచ్చిందనీ చెబుతున్నారు. అది నిజమేనా? నిజంగా కృష్ణా జిల్లా మాండలికం ఇలాగే ఉంటుందా? కృష్ణా జిల్లా మాండలికాన్నే గనక కుట్ర పూరితంగా పైకి తీసుకొస్తే ఒక్క తెలంగాణా వాదులేనా రాయల సీమ వాళ్ళూ గొడవ చెయ్యరా? యే ఇద్దరు రెండు వేర్వేరు జిల్లాల నుంచి వొచ్చ్చిన వాళ్ళు యెవడి భాషలో వాడు మాట్టాడుకుంటూ పోతే వ్యవహారం నడుస్తుందా? అందువల్ల అప్పటి వాళ్ళు మాండలిక వ్యవహారిక తెలుగు ని కాకుండా అందరూ అర్ధం చేసుకొగలిగే విధంగా భాషని సామాన్యీకరించారు? ఇప్పుడు బ్లాగుల్లో మనందరం వాడుతున్నదీ అదే, యే ప్రాంతీయ పదాలూ లేని అందరికీ అర్ధమయ్యే సామాన్య తెలుగు. ఇది కూడా తప్పేనా?ఆయా మాండలికాలకి ఆదరణని కల్పించడం అనేది ఆ భాషలో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు తమ రచనల్లో ఉపయోగించి మిగిలిన వారికీ పరిచయం చేస్తే మిగిలిన వారు అందులోని స్వారస్యాన్ని గ్రహించి మెచ్చుకుంటారు. తిక్కన గారు తన పదిహేను పర్వాల తెలుగు భారతంలో నెల్లూరు జిల్లా మాండలికపు సొంపుని వాడినట్టుగా శ్రీ శ్రీ గారు చెప్పగా విన్నాను. ఆ రకంగా నెల్లూరు జిల్లా మాండలికం తన పలుకుబడులతో సహా భారతేతిహాసంలో ఒక భాగం కాగలిగింది. దీన్ని యెవరయినా వ్యతిరేకించగలరా? మరో విధంగా యే ఒక్క భాష నయినా అధికారికంగా ప్రోత్సహిస్తే మిగిలిన వారు ఊరుకుంటారా?


      మరి ఇంతటి భాషాభిమానమూ అందెశ్రీ గారు నూతన తెలంగాణా రాష్ట్ర గీతం ఆ పాత తెలుగు లోనే రాసినప్పుడు యేమయ్యిందో?యేది చేసినా వాళ్లంతట వాళ్ళకి తోచి  చెయ్యాలే తప్ప మనం చెప్పితే తప్పన్నమాట!నేను ఒక తెలంగాణా వారి బ్లాగు పోష్టులో ఒక టపాను చూశాను. అక్కడ నేను ఒక ప్రశ్న అడిగాను. "ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు" - అనే ప్రస్తావన చూసి అయ్యా, ఈ అర జిల్లాకు అర్ధ మేమిటో సెలవిస్తారా?భౌగోళికంగా కానీ, సామాజికంగా కానీ,సాంస్కృతికంగా కానీ, వ్యావకారికంగా కానీ అయితే మూడు జిల్లాలు లేకపోతే రెండు జిల్లాలు ఉంటాయి.కానీ మీరు రెండున్నర జిల్లాలు అంటున్నారు.దాని అర్ధం కొంచెం విపులంగా వివరిస్తే బాగుంటుంది. మొదలు పెట్టటమే రెండున్నర జిల్లాలు అని మీరు యెంత వెటకారంగా మాట్లాడినా మేము ఆ వ్యంగాన్ని చాలా సంతోషంగా స్వీకరిస్తే మిమ్మల్ని మీ భాషని ఆదరంగా చూసుకున్నట్టు అవుతుందా?ఇంతకీ ఆ “రెండున్నర జిల్లాల” పేర్లు చెప్తారా మీ నోటితో? అని అడిగాను


     దానికి అక్కడ వారిలో ఒకరు ఇచ్చిన జవాబులోని మొదటి భాగం ఇది: (ఇది 1969ల కాలోజి రాసిన పెద్ద కవితలో చిన్న భాగము) ఇగ రెండున్నర జిల్లాలు అంటే క్లియర్ గానే చెప్పిన. 1. కృష్ణా, 2. గుంటూరు 3. ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము.మళ్ళీ అడిగాను,యేమని? ఉభయ గోదావరి జిల్లాల్లో సగ భాగము – అనేది యేంటి? ప్రత్యేకంగా ఆ జిల్లాలు రెండూ విడివిడిగానే ఉన్నాయి.అందుకనే అడుగుతున్నా, అయితే మూడు జిల్ల్లాలు లేదా రెండు జిల్లాలు అని మామూలు వాళ్ళు అంటారు.కానీ పైత్యకారి తనం ఉన్న వాళ్ళు మాత్రమే రెండున్నర జిల్లాలు అనే వెటకారం ఆడుతారు, అవునా కాదా?నేను దాని గురించి బాబూ అడుగుతున్నది!ఆ పైత్యకారి వెటకారాన్ని కూడా మీరు మమ్మల్ని పొగిడినట్టుగా భావించి మిమ్మల్ని నెత్తినపెట్టుకోవాలన్న మాట. దీనికి వారింకా జవాబు చెప్పలేదు,యేమి చెప్తారో మన కనవసరం.ఒకటి మాత్రం నిజం,అలా మనల్ని వెక్కిరించిన కాళోజీకి మనం కూడా నీరాజనాలు పట్టాం ప్రజాకవి బిరుదు నిచ్చి పొగిడాం, యెందుకు?ఫలితం యేమిటి?


      ఇంతకీ అన్నాన్ని తిట్టిన వాడికి పరిహారం మన పెద్దవాళ్ళు అనుభవంతో తరచి చూసి యేం చెప్పారో తెలుసా?అన్నాన్ని తిట్టిన వాడికి అన్నం దొరక్కుండా పోతుంది, వున్నా తీనలేని దౌర్భాగ్యం దాపరిస్తుంది!మనిషిని తిట్టినా తప్పు లేదు, మనిషిలో తప్పూ వొప్పూ వుండొచ్చు.డబ్బుని తిట్టినా తప్పు లేదు అది పాపపు సొమ్మూ కావచ్చు, కానీ పాపపు తిండి వుంటుందా?!సత్యధర్మన్యాయ ప్రతిష్ఠిత మయిన నా గురు పరంపర - వ్యాస పరాశరాది శిర్డి సాయినాధ పర్యంతం వున్న నా గురు పరంపర -  పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా,ఆ తిట్టిన వాడికీ, పక్కనే వుండి కూడా అది తప్పని అతనికి బుధ్ధి చెప్పని వాళ్లకీ, అతనికి అప్రతిహతమయిన అధికారమిచ్చి అచ్చోసిన ఆంబోతులా వొదిలిన వాళ్లందరికీ ఆ పాపంలో భాగం వుంటుంది.ఆ పాపం తన ఫలితాన్ని తప్పకుండా చూపిస్తుంది.

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...