Sunday 16 August 2015

ఈ దేశం యెందుకు విడిపోయింది?ఈ దేశం విడిపోయి యేమి సాధించింది!

 1947 ఆగస్ట్ 15వ తేదీన శతాబ్దాల దాస్యశృంఖలాలు విడిపోయాయనీ ఈ దేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించిందనీ కొందరు పండుగలు చేసుకుంటుంటే మరికొందరు జన్మభూమిలో నిరాశ్రయులై ఇకనుంచీ అదే మీ కర్మభూమి అని నాయకులు చెప్తే అమాయకంగా నమ్మి అన్యభూమికి తరలి వెళ్ళే ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దయనీయమైన విషాదయాత్రలో మునిగిఉన్నారు!
అప్పటివరకూ యేకజాతిగా ఆంగ్లేయుల మీద తనుమనఃప్రాణధనాలన్నింటినీ తృణప్రాయంగా త్యజించి సంఘటితంగా పోరాడిన చరిత్రని మర్చిపోయి తమ సౌభ్రాతృత్వానికి తిలోదకాలిచ్చి కేవలం అర్ధశతాబ్ది కాలంలోనే రెండు జాతులుగా విడిపోయి సరిగ్గా పరాధీనత నుంచి బయటపడే ఆనందకరమైన సన్నివేశంలోనే ఈ ఉపఖండం రెండుగా చీలిన వేళ తుఘ్లక్ విదూషకత్వాన్ని మరిపించేలా 10 మిలియన్లకి పైగా బీదా బిక్కీ తమ కొంపా గోడూ వదిలి కట్టుబట్టలతో ప్రపంచ మానవాళి చరిత్రలోనే యెక్కడా కనీ వినీ యెరుగని వలసని మొదలుపెట్టారు!
ఆ మహాభయంకరమైన వలసలో అంత సుదీర్ఘమైన మరింత కష్టతరమైన ప్రయాణాన్ని భరించలేక మరణించిన వాళ్ళు గానీ,అసహనం నుంచి పుట్టిన క్రోధం మనుషుల్ని పశువులుగా మార్చివేస్తే చెలరేగిన అల్లర్లలో చంపబడిన వాళ్ళు కానీ 1 మిలియన్ నుంచి 2 మిలియన్ల వరకు ఉండవచ్చు!యెక్కడికక్కడ పురుగుల్లా రాలిపోతున్న కాలంలో ఖచ్చితమైన లెఖ్ఖలు దొరకవు - ఉజ్జాయింపు లెఖ్ఖలే ఇంత దారుణంగా ఉంటే నిక్కచ్చిగా లెఖ్ఖలు తీస్తే భరించగలమా!కేవలం హత్యలే అయితే కొంచెం నయం,మానభంగాలకు గురైన స్త్రీల సంగతి తల్చుకుంటే మానవత్వం ఉన్నవాళ్ళు వినడానికే అసహ్యం వేసే దారుణాలు జరిగినాయి! 
తన వల్ల జరిగిన యుధ్ధంలో లక్షమంది మరణించినందుకే చండాశోకుడు యుధ్ధాలకి సెలవిచ్చి శాంతిమార్గం పట్టి ధర్మాశోకుడుగా మారాడు,మరి అప్పటి నాయకులు యెట్లా తట్టుకోగలిగారు?వారికేం వారు చాలా హాయిగా ఉన్నారు!హిందువుల వైపున గానీ ముస్లిముల వైపున గానీ ధనవంతు లెవరూ తరలిపోలేదు,వెళ్ళినా గొప్పగానే బతికారు!యెటొచ్చీ రాజకీయనాయకులకి ఓట్లు వెయ్యటానికీ వారికి రాజకీయ వైభవాలు దక్కించటానికీ తప్ప్ప యెందుకూ పనికిరాని అలగాజనమే వెళ్ళారు,వెళ్తూ వెళ్తూ నడవలేక చచ్చారు!
వీళ్ళంతా యెందుకిలా కాళ్ళీడ్చుకుంటూ నడ్వటం రైళ్ళలో సుఖంగా పోవచ్చుగా అనుకుంటే వాటి పరిస్థితి ఇలా ఉంది!దీనికి తోడు క్రూరత్వం కొద్దీ తాము చంపిన వాళ్ళని రైళ్ళలో కుక్కి పంపించిన శవాల రైళ్ళ కధ కూడా సమాంతరంగా నడిచింది!
నేను పుట్టడానికి పదేళ్ళ ముందు జరిగిన దారుణాన్ని కేవలం బొమ్మలుగా చూసినందుకే ఇవ్వాళ ఇంతగా చలించిపోతున్నాను - ఒకనాడు అసహాయులైన నా దేశపు సామాన్య ప్రజలకి ఎంతటి నికృష్టమైన పరిస్థితి దాపురించింది?!ఏ కాలం లోనూ ఏ ప్రాంతం లోనూ కనీసపు మానవత్వం ఉన్నవాడెవ్వడూ చూడగూదని హృదయవిదారకమైన దృశ్యమిది!గుండెలు చిక్కబట్టుకుని వినండి పగవాడికి గూడా కోరుకోగూడని దౌర్భాగ్యకరమైన సన్నివేశమిది!అక్కడొక ముసలి మనిషి చావుబతుకుల్లో ఉన్నాడు.నడక మొదలుపెట్టి యెన్ని రోజులైందో గానీ ఇక నడవలేక ఆయువు కూడా హరించుకుపోతున్నదని తెలిసి చావు కోసం యెదురు చూస్తున్నాడు.పక్కనున్నది ముసలి భార్య,మనవళ్ళూ,మనవరాళ్ళూ - వాళ్ల కళ్లల్లో దుఃఖం లేదు, కదూ!తొందరగా చచ్చిపోతే బాగుణ్ణు మళ్ళీ నడక మొదలుపెదదాం అనే యెదురుచూపు ఉంది,నిజం?!యెంతసేపు యేడ్చినా పోయినవాడు తిరిగిరాడు,నడకలో వెనకబడితే చీకటి పడేసరికి తలదాచుకునేటందుకు దిట్టమైన చోటు దొరకదు మరి?
యెవరి సురుచిరసుందరభవిత కోసం స్వాతంత్ర్యాన్ని సాధిస్తామని ఆశలు రేకెత్తించి ప్రశాంతంగా ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్లని కూడా వీధుల్లోకి తీసుకొచ్చి ఉద్యమాలు చేయించారో తమ అవివేకపు రాజకీయాల ఫలితమైన విభజనకి అసంఖ్యాకులైన సామాన్యప్రజల నిండు జీవితాలు అగ్నికీలలకు ఆహుతవుతున్నా తన కుటుంబపు భావి వంశపారంపర్యవైభవాల్ని తలుచుకుని కాబోలు మందస్మితవదనారవిందుడై ఆంగ్లేయప్రభువులతో కరచాలనం చేస్తున్నాడు స్వతంత్రభారతప్రప్రధమప్రధాని!ఈ మనిషి పదవి నలంకరించిన యేదాది లోపునే దేశం మొత్తం అశాంతితో రగిలిపోతుంటే తీరికగా ఇంగ్లాడు దేశపు రాజుని ఇంకా వారి అధీనంలో ఉన్న ఒక సామంతుడు చక్రవర్తిని సంబోధించే పధ్ధతిలో "Your Highness" అని సంబోధిస్తూ తన ఇష్టసఖి యొక్క భర్తగారికి వారు భారతదేశానికి చేసిన గొరుగుడు సేవకి మెచ్చి కాబోలు "సర్" బిరుదు నిచ్చి సత్కరించమని కోరుకుంటూ మహజరు పంపుకున్నాడని యెంతమందికి తెలుసు?ఆ ఇంగ్లాడు రాజే రాణిగారి మొగుడు అని తప్ప సొంత రాజరికం లేని పెట్టమారి మొగుడు!ఆ రాణీ పేరుకే రాణీత్వం తప్ప అధికారాలు లేని వూగొట్టిన నాగటిదుంప - అంత తెలివైన వాడు ఈ పండిట్ బిరుదాంకితుడు?!ఇంకా నయం, ఇంకొంచెం పత్తిత్తు తెలివి చూపించి ఆ ఉత్తరం  చర్చిలు మహాశయుడి లాంటి అన్ని అధికారాలూ ఉన్న అప్పటి ప్రధానికి పంపించాడు గాదు,అప్పటికే గాంధీని నేకెడ్ పకీరు అనేసిన భారతద్వేషి "ఇదుగోనయ్యా చూడండి భారత దేశ ప్రధాని యెంత పిచ్చిపుల్లయ్యో?!" అని ప్రపంచవేదిక మీద అప్పుడే మన పరువు గంగలో కలిపి ఉండేవాడు.

అసలు స్వతంత్రం వచ్చేనాటికి ఉపఖండం విడిపోవటానికి బీజం 1905లో లార్డ్ కర్జన్ అనే దుర్జన ప్రభువు చేసిన బెంగాలు విభజన నాడు మొలకెత్తింది.ప్రపంచంలోనే పరమ భయంకరమైన బెంగాల్ కరువు కూడా ఈ దుర్జనుడి పుణ్యమే!!బుధ్ధిమంతులైన నాయకులు రకరకాల కారణాలతో పక్కకి తప్పుకోగా మిగిలిన నాయకుల బుధ్ధిశూన్యత వల్ల అప్పుడే అణగారిపోవాల్సిన విషబీజం కాస్తా ఇంతింతై వటుడింతయై అన్నట్టు పెరిగి 1945 నాటికి పీకిపారెయ్యలేని విషవృక్షమై కూర్చుంది!

నిజానికి పరిపాలనా సౌలభ్యం కోసం చేశాడే తప్ప అతనికి దురుద్దేశాలు లేవని కొందరు వాదిస్తున్నప్పటికీ ప్రజల్లో అప్పుడున్న మానసిక స్థితి వల్ల అది సృష్టించిన భీబత్సం వాళ్ళ ప్రభుత్వాన్నే కూల్చడానికి కారణమైన విప్లవ బీజాలు నాటింది!సాటి ముస్లిము రైతులకి తమ భూముల్ని కౌలుకిచ్చి ప్రశాంతంగా బతుకుతున్న హిందువులకి విభజన తర్వాత బీహారీల ప్రాబల్యం పెరిగి ఇబ్బందికి గురయ్యారు.అదీగాక అప్పటికే తాము ఆంగ్లేయులకి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు ప్రతీకారంగా చేశారనే భావం బలపడి మరింత బలంగా ఉద్యమాన్ని దేశమంతటికీ పాకించారు!తర్వాత కాలంలో దేశమంతటినీ ఉర్రూత లూగంచిన "వందే మాతరం" నినాదం ఈ సమయంలోనే తొలిసారి దాని శక్తిని చూపించింది!దీనినుంచి పుట్టిన భావావేశంలో దేశభక్తీ మతాభినివేమూ కలగలిసిపోయి యువకుల్లో వెర్రి ఆవేశాన్ని పుట్టించి జుగాంతర్ లాంటి రహస్య తీవ్రవాద సంస్థలు యేర్పడి బహిరంగ స్థలాల్లో బాంబులు పేలుస్తూ బ్రిటిష్ అధికార్లని చంపటం వరకూ చాలా భీబత్సాలు జరిగాయి!

ఈ ఉద్యమంలో అనుకోకుండా హిందూ మతానికి సంబంధించిన పౌరాణిక గాధల నుంచి వచ్చిన ప్రతీకలు అతిగా ముందుకు రావటం,ఆంగ్లేయుల నుంచి అధికారాన్ని బదలాయించుకోవడం అనే అప్పటి ఎలైట్ గ్రూపుల వ్యక్తిగత ప్రాబల్యాల రాజకీయ క్రీడలో హిందూమహాసభ హిందువుల రాజకీయ ప్రాధమ్యాన్ని పెంచే విధంగా తీర్మానాలు చెయ్యటం,ఉద్యమధాటికి భయపడి ఆంగ్లేయులు దిగివచ్చి చేసిన సంస్కరణలు హిందువులకే యెక్కువ అనుకూలంగా ఉండటంతో ముస్లిం ఎలైట్ గ్రూపులు కూడా జాగరూకులై ముస్లిం లీగ్ యేర్పాటు చేశారు!"హోమ్ రూల్" గర్జనతో అప్పటిదాకా శాంతమార్గంలో పోరాడుతున్న మిగిలిన వారందరికన్నా ఆవేశపూరితుడైన దేశభక్తుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మహమ్మదాలీ జిన్నా 1930 కల్లా ద్విజాతి సిధ్ధాంతాన్ని తలకెత్తుకోవటమే కాకుండా 1940ల నాటికి పాకిస్తాన్ కోసం వాదిస్తూ అందరూ యెవరి రహస్య ఎజెండాతో వారు హడావిడి పడి చేసిన విభజన కిరాతకంలో తన వంతు పాత్రని మాత్రమే పోషించినా ఇక్కడ అధికారంలోకి వచ్చిన వారి చాతుర్యం వల్ల ఈ దేశంలోని కొందరు ఆవేశపరులైన జాతీయవాదుల దృష్టిలో విభజనకి మొత్తం అతడే బాధ్యుడని నిందించేటంతగా అపార్ధానికి గురయ్యాడు!

ఆంగ్లేయుల మీద పోరాడుతూ జైళ్ళకు వెళుతున్న హిందువులకి విరుధ్ధంగా ఆంగ్లేయులతో సహకరిస్తూ మరింత ప్రయోజనం సాధించాలనేది వీరి వ్యూహం!అందులో కొంతమేరకు విజయం సాధించారు కూడా!నిజానికి బెంగాలు విభజనలో ఉన్న అసలు మెలిక 1857 తిరుగుబాటులోనూ 1878 నుంచి 1880 వరకూ షేర్ అలి ఖాన్ నాయకత్వంలో ఆఫ్ఘన్ భూబాగంలో ఆంగ్ల ప్రభుత్వం మీద జరిగిన యుధ్ధంలోనూ వీరోచితంగా పోరాడిన ముస్లిములని భారతరాజకీయసామాజికప్రధానజీవనస్రవంతి నుంచి వేరు చెయ్యడానికే జరిగినా తొలిదశలో ప్రజల నుంచి పుట్టిన నిజాయితీ గల ప్రతిస్పందన వల్ల అది ఫలించకపోయినా మలిదశలో దూరదృష్టి లేని నాయకుల అవివేకపు పోకడల వల్ల పరిస్థితి ఆంగ్లేయుల రాజనీతి కనుకూలమైన మలుపు తిరిగింది!

అప్పటి రాజకీయ సామాజిక పరిస్తితి యెలా వుందంటే ఇప్పటి లాగే అప్పుడూ రాష్ట్రాలు ఉన్నాయి గానీ మూడు రకాలుగా ఉండేవి.మొదటి రకం:పూర్తిగా ఆంగ్లేయుల అధీనంలో ఉన్నవి.రెండవ రకం:పూర్తిగా ప్రాచీనకాలపు రాజవంశాలకు చెందిన వారైన రాజుల జమీందారల యేలుబడిలోని రాష్ట్రాలు - వీటినే సంస్థానాలు అని కూడా అంటారు.మూడవ రకం:ఈ రెండు వర్గాల మిశ్రమ అధికారంలో ఉన్నవి.కాంగ్రెసు,హిందూ మహాసభ,ముస్లిం లీగ్ లాంటి సంస్థలన్నీ ఆయా వర్గాల లోని విధ్యాధికులు తమని తాము ఎలైట్ అని పిలుచుకుంటూ తమ వ్యక్తిగత ప్రాభవాల కోసం రకరకాల సిధ్ధాంతాలని వల్లెవేసే కుహనా మేధావుల గుంపు తప్ప విశాలప్రజాప్రయోజనం గురించి నిజాయితీగా ఆలోచించిన వాడు ఒక్కడూ లేడు - ఇది నేను వారందరి వ్యక్తిత్వాల్నీ పరిశీలించి చెబుతున్న అక్షరసత్యం!అందుకే మనం గొప్పగా జరిగిందని చెప్పుకునే గుండ్రబల్ల ముచ్చట్ల బేరసారాల ప్రక్రియ ద్వితీయ స్వాంతర్య పోరాటంగా గుర్తింపు పొందింది,సజావుగా జరగాల్సిన ఉపఖండ విభజన అంత దరిద్రంగా తగలడింది?!

మోతీలాల్ కొడుకు రాజకీయ రంగప్రవేశానికి ముందరి దశలో కాంగ్రెసువారు ఆయా సంస్థానాధిపతులకి స్వాతంత్ర్యానంతరం తమ అధికారాలు చెక్కు చెదరని పధ్ధతిలో ఆయా రాష్ట్రాలకి వారే ముఖ్యమంత్రు లయ్యే వెసులుబాటుని కల్పించారు.ఆ ప్రాభవం పట్ల ఉన్న ఆశతో వాళ్ళు ఆంగ్లేయులతో తమ మితృత్వాన్ని చెడగొట్టుకుని కాంగ్రెసుకి సాయం చెయ్యకుండా ఉండి ఉంటే ప్రజల్లో అంత స్పందన వచ్చి ఉండేదా అని నాకు అనుమానమే!యెందుకంటే ఆంగ్లేయులు మనల్ని అత్యంత క్రూరంగా అణిచిపారెయ్యడానికి నియంతల్లాగ ప్రవర్తించారని చెప్తున్న కాలంలో గూడా ఈ దేశ జనాభాలో 5% మించని వాళ్ళు ఇక్కడివారి సహాయ సహకారాలు లేకుండానే అవన్నీ చెయ్యగలరంటే ఒక పట్టాన నమ్మడం కష్టమే!కట్టబొమ్మన పక్కనే యెట్టప్ప ఉన్నాడు,సిరాజ్ ఉద్దౌలా పక్కనే మీర్ ఖాసిం ఉన్నాడు - ఓకవైపు నుంచే చూస్తే మనకి వీరులుగా కనబడే వాళ్ళు ఆంగ్లేయులతో సఖ్యతగా ఉండి సుఖపడలేని వాళ్ళు గానూ మనకి ద్రోహులుగా కనబడే వాళ్ళు ఆంగ్లేయులకి సహాయం చేసి సుఖపడిన బతకనేర్చిన వాళ్ళు గానూ కనపవచ్చు, మరొక వైపు నుంచి చూస్తే?!"ఒకవైపే చూడు,రెండో వైపు చూకు - చచ్చిపోతావ్!" అని బట్టనెత్తి బాలయ్య విగ్గుపెట్టుకుని పంచి డైలాగు వొదిల్తే సరదాగా నవ్వుకోవచ్చు గానీ చరిత్ర నించి గుణపాఠాలు నేర్చుకుని ఒకసారి జరిగిన తప్పుని మళ్ళీ మళ్ళీ జరగనివ్వకూడదనుకుంటే మాత్రం గతించిన చరిత్రని ఖచ్చితంగా రెండు వైపుల నుంచీ చూడాల్సిందే!తాత తాతల నాటి కధల్ని తవ్విపోయడంలో యెలాంటి తప్పూ లేదు,లేతబుర్రలు వెక్కిరించనూ అఖ్ఖర్లేదు!చదవటానికి తగినంత డబ్బుంది గనక అలవోకగా బారిస్టరు గిరీని లాగించేసినా ఒక్క రోజు కూడా కోర్టు గుమ్మం యెక్కకుండా తండ్రి అప్పటికే చేరిపోయి పలుకుబడిని సాధించుకున్న కాంగ్రెసు పార్టీలో చేరిపోయి పటేల్ కన్నా జిన్నా కన్నా యే విషయంలో పోల్చినా దిగదుడుపుగా ఉన్న ఈ పేరుగొప్ప జాతిపిత గారి అధమశిష్యుడు  మహాత్ముని ఇచ్చిన బిరుదుకి కళంకం తెచ్చేలా గురువు చూపించిన పక్షపాతం వల్ల గొప్ప రాజనీతి దురంధరుడిగా పేరు తెచ్చుకోగలగడం ఈ దేశప్రజల దురదృష్టం మాత్రమే!కోర్టు రూములో వాదనకి దిగగానే నాలుక పిడచ గట్టుకుపోయి గుడ్లు తేలేసి స్పృహ తప్పిపోయి కూలబడిన ఒకనాటి చెత్త లాయరు తర్వాతి కాలంలో మహా మేధావుల్నీ దిగ్దంతులైన లాయర్లతో సహా ఈ డేశప్రజలందర్నీ తన కట్టుబానిసలుగా చేసుకుని ఆడించగలగడం సైతాను లాంటి దుష్టశక్తి యేదో ఈ జాతి చరిత్ర మీద వేసిన పరమ క్రూరమైన ప్రాక్టికల్ జోకులా కనిపిస్తుంది నాకు!ఈ దేశంలో కలవనని నిజాము భీష్మించడం వెనక కాంగ్రెసు తొలిదశలో ఇచ్చిన వాగ్దానం వల్ల పుట్టిన న్యాయమైన ఆశ ఉండి ఉండవచ్చు - ఈ దేశచరిత్రని మరోసారి మరోరకమైన చూపుతో నిశితంగా శోధిస్తే కొత్త నిజాలు చాలా బయట పడవచ్చును.

1876 డిసెంబర్ 25న కరాచీలో జన్మించిన మహమ్మదాలీ జిన్నా లాయరుగా అత్యంత ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకుని రాజకీయాలలో ప్రవేశించి తొలిదశలో ఉద్రేకపూరితుదైన దేశభక్తుడిగా 1916లో "All India Home Rule League" స్థాపించినా,హిందూ ముస్లిం ఐక్యత కోసం లక్నో ఒప్పందానికి రూపకల్పన చేసి యెంతో హేతుబధ్ధమైన ప్రయత్నం చేసినా కాంగ్రెసులోని అంతర్గత వైరుధ్యాల వల్ల అవి సత్ఫలితాల నివ్వక పోవడంతో విసుగుపుట్టి వేరుకుంపటి నినాదాన్ని యెత్తుకున్నాడే తప్ప అతను స్వభావతః ఈ ఉపఖండాన్ని రెందు దేశాలుగా చీల్చాలని కంకణం కట్టుకున్న వేర్పాటువాది కాదు!

ద్వితీయ స్వాతంత్ర్యపోరాటం అని పిలువబడే కాలాన్ని ప్రామాణికంగా తీసుకుని అప్పటి ప్రభావశీలమైన వ్యక్తుల ద్వారా చరిత్ర యే విధమైన మలుపులు తీసుకున్నదీ వివరిస్తూ తిలక్ గురించీ గాంధీ గురించీ నెహ్రూ గురించీ చెప్పిన "కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?!" వ్యాసపరంపరలో కాంగ్రెసు,హిందూమహాసభ,ముస్లిం లీగ్ అనే సంస్థలు యెప్పుడు పుట్టాయనే దాని దగ్గిర్నుంచీ అన్ని విషయాలనీ ప్రస్తావించాను గనక మళ్ళీ ఆ చరిత్రనంతా ఇక్కడ తవ్విపోయడం లేదు.

ప్రపంచంలోని తెలుగు వారందరికీ సవినయంగా చేస్తున్న ఒక సున్నితమైన విన్నపం:ఆనాడు సామాన్య ముస్లిం ప్రజానీకం కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించినా పైవారి రాజకీయావసరాల కోసం హడావిడిగా చేసిన దేశవిభజనకీ ఈ మధ్యనే ప్రజలెవ్వరూ బలంగా విడిపోతామని తెగేసి చెప్పకపోయినా ఒక వ్యక్తి యొక్క కుటుంబానికి ప్రయోజనం కలిగించటానికా అన్నట్టు కనబడుతున్న రహస్య ఒప్పందాలతో చీకటి సభలో హడావిడిగా చేసిన ఆంధ్రప్రదేశ్ విభజనకీ ఉన్న పోలికల్ని జాగ్రత్తగా గమనించితే ఇప్పుడు కొందర్ని పట్టి పీడిస్తున్న తెలంగాణ ఇస్తామని అంత గట్టిగా చెప్పి కూడా ఆఖరి నిముషం వరకూ ఇవ్వకుండా తప్పుకోవాలని విశ్వప్రయత్నం చేసి ఇప్పుడివ్వకపోతే ఇంకొకడు మైలేజి కొట్టేస్తాడని తెలిసిన ఆఖరి క్షణంలో ఠపీమని ఇచ్చెయ్యడం ఎందుకు జరిగిందనే సందేహానికి సమాధానం దొరుకుతుంది!రెండూ ఒకే పార్టీ అధ్వర్యంలోనే జరిగాయి.రెండూ హడావిడిగానే జరిగాయి.యే విద్వేషాలని చల్లార్చటానికి విభజించామని చెప్పారో విభజన అనంతరం కూడా ఆ విద్వేషాలు చల్లారకపోగా ఇంకా పెరిగినాయి!మన కన్నా ముందు మొత్తం భారతప్రజలు కూడా ఇట్లాగే ఆ పార్టీ చేతిలో వెధవలయ్యారులే అని సరిపెట్టుకుని ఓదార్చుకుంటారో ఆ పార్టీ చరిత్ర తెలుసుకుని ఉంటే ముందుగానే జాగ్రత్త పడేవాళ్ళం కదా అని పశ్చాత్తాప పడతారో మీ ఇష్టం!చరిత్రని చరిత్రలా సాక్షి గణపతి వలె వివరిస్తున్న నాకు మాత్రం రాగద్వేషాలు అంటగట్టి మీ బుధ్ధిని పెడదార్లు పట్టించనివ్వకండి!ఆ పార్టీ యొక్క,ముఖ్యంగా ఆ కుటుంబం యొక్క చరిత్ర అంతా తప్పుల తడక నిర్ణయాల నిప్పుల కుంపట్లని దేశచరిత్రకి నెత్తికెత్తడమే తప్ప కుంపట్లని ఆర్పిన దాఖలాలు యెక్కడా లేవు.నెహ్రూ కాశ్మీరు కుంపటిని వెలిగించాడు!ఇందిర భింద్రన్వాలేని అనధికారికంగా ప్రోత్సహించడం ద్వారా పంజాబు నరమేధానికి కారణ మయింది.రాజీవ్ మనదేశపు తమిళులతో వివాహ సంబంధాలు కూడా ఉన్న శ్రీలంక తమిళుల్ని చంపటానికి భారతసైన్యాన్ని పంపటం ద్వారా శ్రీలంక యొక్క అంతర్గత సమస్యని భారత భూభాగం మీదకి తీసుకొచ్చాడు!అవన్నీ ఇతర్లు మంచి సలహాలు ఇచ్చినా పెడచెవిన పెట్టి మూర్ఖంగా తీసుకున్న యేకపక్ష నిర్ణయాల ఫలితమే అని కుల్ దీప్ నయ్యర్ లాంటి రాజకీయ విశ్లేషకులంతా బల్లగుద్ది చెప్పారు!ఇప్పుడు మరో తరపు మూర్ఖుణ్ణి ముందుకు తెస్తున్నది కాంగ్రెసు.ఇతనికి అజ్ఞానం ,దేబెతనం అనే మరికొన్ని సుగుణాలు కూడా వున్నాయి - ఆ కుటుంబానికి చెందిన వ్యక్తుల్ని ప్రధానిగా చూడాలనే ముచ్చట తీర్చుకోవటం కోసం యెన్ని కుంపట్లని భరించడానికయినా సిధ్ధంగా ఉండగలిగిన ఆత్మవిశ్వాసం గలవాళ్ళు మాత్రమే అతని నాయకత్వంలోని కాంగ్రెసు కధికార మిచ్చి ఈ దేశచరిత్రతో మరోసారి ప్రయోగాలు చెయ్యటానికి సిధ్ధపడతారు!అతని పేరుకి కాలిబంధనాలు అని అర్ధం!గౌతమ బుధ్ధుడు తాను సర్వం పరిత్యజించి వనవాస దీక్షకి సిధ్ధమైన సమయాన తన భార్యకి పుట్టిన నూత్నశిశువుకు కొంచెం విసుగుతో పెట్టిన పేరది.అత్యవసరమైన విషయాలను విమర్శించి తన విజ్ఞానాన్ని చూపించే అవకాశాన్ని వొదులుకుని అనవసరమైన విషయాలకి అఖ్ఖర్లేని రాధ్ధాంతం చేస్తూ అతనిప్పటికే సభాకార్యక్రమలకి అంతరాయం కలిగిస్తూ పేరు నిలబెట్టుకుంటూ వినోదాన్ని కలిగిస్తున్నాడు - అట్లాగే ఉండమని ఆశీర్వదించండి తప్ప ముద్దు చేసి అధికారాన్ని కట్టబెట్టకండి!

ఆనాటి ఉపఖండపు విభనలోనూ ఈనాటి ఆంధ్రప్రదేశ్ విభజనలోనూ కొంచెం యెక్కువ సమయం తీసుకుని అన్ని వర్గాలతో సామరస్య పూర్వకమైన సంప్రదింపులు జరిపి శాస్త్రీయమైన పధ్ధతిని ఫాలో అయి ఉంటే ఆనాడు ప్రపంచ మానవాళి చరిత్రలోనే అత్యంత దయనీయమైనదిగా చెప్పబడే అసంఖ్యాక ప్రజల సామూహిక విషాదయాత్ర సంభవించి ఉండేది కాదు ఈనాడు మాతృరాష్ట్రం లోని ప్రజలు ఇంత దారుణమైన అనిశ్చితిని యెదుర్కొంటూ భవిష్యత్తు పట్ల భయసందేహాలకి గురికావలసిన దుస్థితి తప్పి ఉండేది!కాలమూ చరిత్రా నిస్తేజంగా యెప్పుడూ ఉండవు,యెన్ని సాంత్వనలు చెప్పుకున్నా వెనకబడిపోయిన వాళ్ళ కోసం అవి ఆగవు!తమ నిర్ణయాలకి అనుకూలంగా భవిష్యత్తుని నడిపించగలిగిన వాళ్ళు రాజనీతి దురంధరులు,కాలానికి లోబడి భవిష్యత్తుని దిక్కుతోచని గమ్యాలకు చేర్చి చేతులు దులుపుకునే వాళ్ళు రాజకీయ నాయకులు.అప్పుడు దేశానికీ ఇప్పుడు రాష్ట్రానికీ మొదటిరకం వారు లోపించడం వల్లనే రెండుసార్లూ చరిత్ర ప్రజల ఆకాంక్షలకి విరుధ్ధమైన దిశలో నడిచింది!ఆనాటి దేశపు పరిస్థితి చూస్తే అతి కొద్ది కాలంలోనే పై స్థాయిలో ఉన్న పెద్దలకి కాళ్ళ కింద పీఠాలు కదిలిపోయే ప్రమాదం వచ్చి పడింది.అక్కడ బ్రిటన్ భూభాగం మీద 1945 యెన్నికల్లో కొత్తగా లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది.యుధ్ధాల్లో అత్యుత్సాహంగా పాల్గొనడం వల్ల  ఆర్ధికంగా తగ్గిపోయిన స్థితిలో భారత్ లాంటి పెద్ద వలసల్ని బలవంతంగా పట్టి ఉంచాలంటే ఖర్చు తడిసి మోపెడయ్యేలా ఉంది.ఇక్కడ గాంధీ పలుకుబడి శరవేగంగా దిగజారిపోతూ అంతకు కొద్ది కాలం క్రితం ఉరితీసిన భగత్ సింగ్ లాంటి వాళ్ళు పదుల సంఖ్యలో పుట్టుకొస్తున్నారు.మొదటి నుంచీ మిత్రబాంధవుల వలె ఒకరికొకరు సహకరించుకుంటూ వస్తున్న ఆంగ్లేయ-గాంధేయ సమూహాలు రెంటికీ ఇంకా సాగదీస్తే వారిద్దరూ ద్వేషించే కమ్యునిష్టు దేశంగా భారత్ అవతరిస్తుందని భయపడి దాన్ని నివారించడం కోసం హడావిడిగా విభజనని ప్రకటించేసి అధికార మార్పిడిని చేసుకున్నారు.

ఒకవేళ దేశవిభజన జరగకుండా ఉపఖండం యేకజాతిగానే స్వాతంత్ర్యాన్ని సాధించుకుని ఉంటే అప్పుడు ప్రధాని పదవికి పోటీదారులుగా ముగ్గురు ఉండేవాళ్ళు - పటేల్,జిన్నా,నెహ్రూ!ఇప్పటి వలెనే పటేల్ గాంధీ గనుక ఒత్తిడి పెడితే వెనక్కి తగ్గి ఉండేవాడు కానీ జిన్నా మాత్రం వెనక్కి తగ్గి ఉండేవాడు కాదు!అందువల్ల్లనే జిన్నా లక్ర్నో ఒడంబడిక ప్రతిపాదించిన నాటి నుంచే నెహ్రూ కూడా ముస్లిములకి రక్షకుడిగా జిన్నా కన్నా తనని ప్రొజెక్ట్ చేసుకోవటానికి స్వధర్మద్రోహిగా కూడా నిలబడ్డాడు?!హిందూ ముస్లిం విభేదాల వల్ల జరిగిన హింసాయుత సన్నివేశాలకి హిందూమహాసభ,ముస్లిం లీగ్ రాజకీయాల కన్నా ముస్లిములకి పరిరక్షకుడిగా నిలబడాలన్న ఇతని అత్యుత్సాహమే యెక్కువ కారణం!

అన్ని సంవత్సరాలుగా ముస్లిం లీగ్ అంత ప్రభావశీలంగా ఉన్నప్పటికీ ముస్లిములకి ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించబడినప్పటికీ ముసిములు కూడా జిన్నాను నిర్ద్వంద్వంగా తిరస్కరించేసి తాము దేశవిభజనకి వ్యతిరేకం అని యెందుకు చాటిచెప్పారు?ఈ యెన్నికల ఫలితాలతోనే జిన్నా ఇక తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని ప్రకటించి నిస్తబ్దుగా ఉండిపోయినా ఉపఖందం యెలా విడిపోయింది!అప్పుడూ హిందూమహాసభ ఉంది,అయినా ముస్లిములు లీగుని వొదిలి కాంగ్రెసుకే పట్టం కట్టారు,యెందుకని!?మీరు మరోసారి అప్పటి భారత దేశపు రాజకీయ చిత్రపటాన్ని సరిగ్గా గుర్తుకు తెచ్చుకోవాలి.మూడు రకాలుగా ఉన్న అప్పటి రాస్ట్ర్రాల ప్రజల్లో అధిక సంఖ్యాకులు నిరక్షర కుక్షులు.కాంగ్రెసు,హిందూమహాసభ,ముస్లిం లీగ్ - ఇలాంటీవన్నీ కొద్దిమంది విద్యాధికుల సమూహాలు!క్షేత్రస్థాయిలోని ప్రజల్లో చాలామందికి ఈ సంక్లిష్తమైన రాజకీయాల గందరగోళం అర్ధం కాలేదు.కాంగ్రెసు నాయకులూ హిందూమహాసభ నాయకులూ జైళ్ళలో ఉన్న వీలు చూసుకుని మెంబర్లని పెచుకున్నా క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసే క్యాడర్ లేకపోవటం అనే బలహీనత వల్లనూ యెటూ ప్రత్యేకనియోజకవర్గాల యేర్పాటు జరగటంతో కాంగ్రెసు ప్రతికక్షిగా నిలబడటం అనెది ప్రజలకి అంతగా తెలియని ముస్లింలీగ్ విభజనకి రిఫరెండంగా భావించాల్సిన ఆ కీలకమైన యెన్నికల్లో చిత్తుగా ఓడిపోవటానికి ముఖ్యమైన కారణం కావచ్చు!అదీగాక, అప్పటిదాకా మరిన్ని సౌకర్యాల కోసం పోట్లాడటానికి వాడుకుంటున్న ద్విజాతి నినాదాలు క్రమంగా పాకిస్తాన్ ఆవిర్భావం వరకూ వచ్చేసరికి సామాన్య ముస్లిం ప్రజానీకం కూడా భయపడ్డారు!యెంత దరిద్రంలో ఉన్నా ఒక నలభైలలో ఉన్న వ్యక్తి యెంతో కొంత ఆర్జించే ఉంటాడు.పుట్టి పెరిగిన చెటు గనక యెంత బీదరికంలో ఉన్నా తెలిసిన ముఖాల మధ్య ఉందే ధీమాకీ హఠాత్తుగా ఇదంతా వదులుకుని మళ్ళీ శూన్యం నుంచి బతుకు పోరాటం మొదలుపెట్టడం అదీ తామెన్నడూ చూడని దూరప్రాంతానికి వెళ్ళడమంటే యెవరికయినా భయానకమే గదా!వారి భయాల్ని నిజం చేస్తూ ఈ దేశపు నాయకుల మీద వారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసి అప్పటి నాయకులు వారికి ద్రోహం చేశారు!ఆ గురుశిష్యులిద్దరికీ మాత్రమే ఈ దేశపు భవిష్యత్తుని నిర్ణయించే నిరంకుశమైన అధికారాన్ని దఖలు పరచిన ప్రతి నాయకుడికీ ఆ పాపంలో భాగం ఉంది.

విభజించి పాలించే దుర్నీతితో ఆంగ్లేయులు మన దేశప్రజల్ని చీల్చారని నిందించతం చాలా తేలిక,కానీ ఉపఖండాన్ని యేకంగా ఉంచటానికి ముస్లిం ప్రజల వైపు నుంచి వచ్చిన యెన్నో అవకాశాల్ని చేజేతులా వదిలేసుకున్న మన నాయకుల అసమర్ధత వల్లనే అలా జరిగిందని ఒపుకోవడం కష్టమే అయినా అది నిష్ఠుర సత్యం!మొదట్లోనే ముస్లింలీగ్ బలపడితే ప్రమాదం, అణిచివేద్దాం అన్న ప్రాక్టికాలిటీ ఉన్న నాయకులు పక్కకి నెట్టివేయబడ్డారు!తర్వాతి కాలంలో నెహ్రూ జిన్నాకి బదులుగా మౌలానా వంటి వారిని ప్రోత్సహించుదాం అంటే జిన్నా మీద అతి విశ్వాసంతో గాంధీ పడనివ్వ లేదు.రాజకీయాల నుంచి విరమించుకుని మూలన కూర్చున్న జిన్నాని పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్టు పోయి కెలికి మళ్ళీ రంగంలోకి తీసుకొచ్చిన గాంధీని వొదిలి వాళ్ళనీ వీళ్ళనీ విభజనకి కారకులని తిట్టి యేమి ప్రయోజనం?గురుశిష్యుల వింతపోకడల్ని కూడా వారికి కలికితురాయిలుగా కట్టబెడుతూ రచించిన నాటి పత్రికాధిపతుల అమోఘమైన ప్రచారవ్యూహం అగ్నికి వాయువు వలే తోడై మహాత్ముడనే ఇమేజి నిచ్చి దేశప్రజల మీదకి వదిలితే అతను నామాట వినకపోతే నిన్ను చంపుతానని కత్తితో జడిపించే నియంతృత్వానికి బదులుగా నామాట వినకపోతే నేను చస్తానని బెదిరించే నియంతృత్వాన్ని పాటిస్తూ అసత్యంతో చేసిన ప్రయోగాలు వికటించి ఈ దేశం విడిపోయింది!


ఈ దేశం విడిపోయి యేమి సాధించింది?మీకు తెలియదా,అదీ నేనే చెప్పాలా!

14 comments:

  1. >ఉపఖండం విడిపోవటానికి బీజం 1905లో లార్డ్ కర్జన్ అనే దుర్జన ప్రభువు చేసిన బెంగాలు విభజన నాడు మొలకెత్తింది

    ఈ భారతదేశపు మరో దౌర్భాగ్యజీవితారంభానికి తెరచాప యెత్తిన దుష్టఘటన యేమో నిన్న సోనియమ్మ చేసిన అంధ్రప్రదేశవిభజన!

    ReplyDelete
  2. "తెలంగాణ ఇస్తామని అంత గట్టిగా చెప్పి కూడా ఆఖరి నిముషం వరకూ ఇవ్వకుండా తప్పుకోవాలని విశ్వప్రయత్నం చేసి ఇప్పుడివ్వకపోతే ఇంకొకడు మైలేజి కొట్టేస్తాడని తెలిసిన ఆఖరి క్షణంలో ఠపీమని ఇచ్చెయ్యడం ఎందుకు జరిగిందనే సందేహానికి"

    Did Congress unilaterally decided to give the T-state or the opposition (including BJP) also has agreed to that decision in the parliament? If this decision is perceived as politically beneficial to Congress then why the opposition would have supported it. Even if you say BJP shrewdly supported knowing that this decision will backfire then why Congress wouldn't have seen this outcome? Did Congress really thought that it could pull off in both AP and T-state?

    he he he he he (ROTFL)

    ReplyDelete
    Replies
    1. రాష్ట్రం ముక్కలైనా పర్వాలేదు కానీ కాంగ్రెస్ మాత్రం ఓడిపోవాలని భాజపా అనుకుందా? దానికి సమైక్యవాదం అనే పేరు ఎందుకు? కాంగ్రెస్ వ్యతిరేకవాదం అనే పేరు సరిపోతుంది. 2004లో సోనియా తెలంగాణా ఇవ్వకుండా రాజశేఖరరెడ్డి అడ్డుకున్నట్టు 2014లో భాజపా తెలంగాణా బిల్లుకి మద్దతు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటాడని చివరి నిముషం వరకు సమైక్యవాదులు అందరూ నమ్మారు. భాజపా తెలంగాణా బిల్‌కి మద్దతు ఇవ్వదని అన్ని ఆంధ్రా చానెల్‌లూ ప్రచారం చేసాయి కూడా. తెలంగాణా బిల్ పాస్ అయిన తరువాత ఆ చానెల్‌లు ఒకటిరెండు రోజులు మాత్రమే భాజపా వ్యతిరేక ప్రచారం చేసాయి, తెలుగు దేశం ఓడిపోకూడదని. విభజనని సమర్థించి తెలంగాణాలో నాలుగు స్థానాలు, సమైక్యవాద పార్తీతో పొత్తు పెట్టుకుని ఆంధ్రాలో నాలుగు స్థానాలు గెలవడమే భాజపా వేసిన ఎత్తుగడ. ఇలాంటి పనే కాంగ్రెస్ చెయ్యాలనుకుంటే మాత్రం తెలుగు దేశం అనుకూల చానెల్‌లు ఊరుకోవు.

      Delete
    2. ఆ టైములో మోడీ మేనియా విపరీతంగా ఉంది. అలానే కాంగ్రెస్ అంటే వ్యతిరేకత దేశం మొత్తం ఉంది. కాంగ్రెస్ కనీసం తెలంగాణా ఇస్తే చెప్పుకోదగ్గ సీట్లు వస్తాయని హడావిడిగా ఇచ్చింది. BJP కి ఆ ఐడియా backfire అవుతుంది అని తెలియదు కానీ సపోర్ట్ చేసారు. ఇప్పుడు చేయకపోతే మళ్ళీ కాంగ్రెస్ మేము ఇస్తామన్న BJP సపోర్ట్ ఇవ్వలేదు అని ప్రచారం చేస్తారని చేసింది అంతే. ఆ టైంలో కాంగ్రెస్ నాయకులు ( ముఖ్యంగా AP వాళ్ళు ) దేశం మొత్తం వ్యతిరేకత ఉన్నా తెలంగాణా ఇస్తే తెలంగాణాలో భారీ సీట్లు. ఆంధ్రాలో ఎలాగో సాంప్రదాయక ఓటు బ్యాంకు ఉంది కాబట్టి కనీసం 5 సీట్లన్న( మెయిన్ లీడర్స్) వస్తాయి అనుకున్నారు. కానీ తెలంగాణాలో KCR రాజకీయ చతురతకి, ఆంధ్రాలో ప్రజాగ్రహానికి గురయ్యి చతికిలపడింది. తెలంగాణా ఇచ్చే టైములో BJP కి కూడా కాంగ్రెస్ మీద ఇంత వ్యతిరేకత ఉంది అని తెలియదు. ఈ పరిస్థితిని అంచనా వెయ్యలేదు కాబట్టే కాంగ్రెస్ చరిత్రలో అతి తక్కువ సీట్లు వచ్చాయి. మోడీ కి కూడా పూర్తి మెజారిటీ వస్తుందని ధీమా లేదు. అందుకే తెలంగాణాలో ఒకలాగా. ఆంధ్రలో ఒకలాగా ప్రచారం చేసారు విభజన గురించి. కాబట్టి ఈ నిర్ణయం కేవలం కాంగ్రెస్ పొలిటికల్ మైలేజ్ కోసం తీసుకున్నారు తప్పితే తెలంగాణాకి ఏదో చేసేద్దామని కాదు. ఒక వేళ కాంగ్రెస్ పరిస్థితి పొలిటికల్గా బాగుంటే ఇంకో 100 ఏళ్ళు అయిన సాగాతీసేవాళ్ళు. అది సంగతి.

      Delete
    3. @Ashok8734
      నేను దేశవిభజన గురించి చెప్తూ పోలికగా దీన్ని ప్రస్తావించాను,కానీ ఈ టాపిక్కే మెయిన్ అవుతుందనుకోలేదు!యేమైనా నేను పోష్టులో ఇవ్వాళ కొందర్ని పట్టి పీడిస్తున్నది అన్న ప్రశ్నకి మీ జవాబు పూర్తి వాస్తవికంగా ఉంది.

      Delete
  3. To ROTFL ANON and Marxist Hegelian

    My question is why congress didn't start framing the bill until one month before elections?why the party in power has a bifurcated groups within the same party?No other party was involved in that so ferocious "smaiyka" movement?

    can you answer as you are in the opinion that congress is just seeking benefit!taking benefit in a task is not a crime - but what benefit it got?

    ReplyDelete
  4. ఒక పక్క TRS మద్దతుతో, ఇంకో పక్క YSRCP మద్దతుతో మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంది కాంగ్రెస్.
    ఇది ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రధాన అరోపణ. ఇది నిజమని ప్రజలు కూడ నమ్మారు.
    ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోతే సరిగ్గా ఇదే ఫార్ములాని తాను ఉపయోగించుకోవచ్చని BJP కూడ విభజన బిల్లుకి మద్దతు ఇచ్చింది. కాని UP, బీహార్ లో వాళ్ళు ఊహించినదానికన్నా ఎక్కువ సీట్లు రావడంతో ఈ ఫార్ములా అవసరం లేకపోయింది.

    ReplyDelete
    Replies
    1. ఒకవేళ మరోవేళ అనే వూహాగానాలు కాదు,యెన్నికల ప్రచారపు యెత్తుగడల విశ్లేషనలు కాదు ఇక్కడ విషయం!

      ఇస్తానని చెప్పిన తర్వాత అన్నేళ్ళు యెందుకు సాగతీత వ్యవహారం నడిపిందిని?బిల్లులో మిగిలిన అన్ని అంశాలూ ఒక దామాషాలో కరెంటు మరొక దామాషాలో విదగొట్టి వెరసి మొత్తం లాభం తెలంగాణా వైపుకీ నష్తం ఆంధ్రా వైపుకీ సర్దటానికి హేతుబధ్ధత ఉందా?

      అప్పుడంతే దేసమంతటా కమ్యుఇన్ష్టు సిధ్ధాంత ప్రభావం పెరిగే సూచనలు ఉన్నాయి గాబట్టి దేసవిభజన హడావిడిగా చేసి ఉండొచ్చు,ఇప్పుడు ఆంధరప్రదేశ్ విభజనకి అలాంటి ప్రమాదం యేమీ ముంచుకు రాలేదే?ఒక రాష్ట్రాన్ని విభజించటమంటే తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి అన్నట్టు చాపలాగ చుట్ట్టేయ్యటమేనా

      విభజన బిల్లు రూపకల్పనలో ఇప్పుడు రాష్ట్రం యొక్క ఆదాయ మెంత?వనరులు యేమిటి?ఎస్సెట్స్ యే భాగానికి యేవి సర్దాలి అనే హోం వర్ర్క్ చేసినట్టు మీరు చెప్పగలరా?

      వాళ్ళనీ వీళ్ళనీ లేఖలు అడగటం,తీరా లేఖలు ఇచ్చాక మాటిమాటికీ మాట మారుస్తున్నాడనతం - ఇవన్నీ సాంకేతికంగా చూస్తే యెంత చెత్తపనులు?!మొదట్ అడిగినప్పుడు తెలియదా ఆ లేఖలు ప్రామిసరీ నోట్ల మాదిరి ప్రభుత్వం వారు చట్ట రూపంలో విడుదల చేఇన అధీకృతమైన పత్రాలు కావని!ఆఫ్టరాల్ ఒక పార్టీ అధ్యక్షుడు తన లెతరుహెడ్డ్డు మీద యేమి రాసి ఇచ్చినా వాటికి చట్టబధ్ధత ఉంటుందా?మరి యెందుకు అడిగినట్టు!

      పోనీ గ్యారెంటీ కోసం అడిగారే అనుకుందాం,వాళ్ళీచ్చిన లేఖలు నీ దగ్గిర ఉన్నప్పుడు ఆ గ్యారెంటీ ఉన్నట్టే గదా/తెల్లవారి నుంచే బిల్లు రూపకల్పనకి పని మొదలు పెట్టకుండా నెలల తరబడి వాల్ళు దానికి విరుధ్ధమయిన స్టేటుమెంట్లు ఇచ్చేవరకూ ఆగి(లోపాయకారీగా అన్ని పార్టీల వాళ్ళూ పబ్లీకున తిట్టుకున్నా సీక్రేతుగా కలుసినప్పుడు ఆప్యాయంగానే ఉంటారు - అది అందరికీ తెలుసు.వాళ్ళలో వాళ్ళ్ళు చేసుకునే గూడుపుఠానీ యవ్వారాల్లో కాంగ్రెసు వాళ్ళే మిగతా వాళ్ళకి మీరు కొంచెం మాట మారిస్తే చాలు ఆ మాట పట్టుకుని ఇంకొతకాలం సాగదీస్తాం అని ఐడియాలు ఇచ్చుకుని ఉండవచ్చు!) అదుగో వాడు అడ్డం తిరిగాడు అనటం మరింత చెత్తపని కాదా?

      అధికారంలో ఉన్నవాడు విడగొట్టటానికి వాల్ళ ఉత్తరాలూ వీళ్ళ వాగ్దానాలూ దేనికసలు నాకు తెలెకడుగుతాను?

      Delete
    2. "బిల్లులో మిగిలిన అన్ని అంశాలూ ఒక దామాషాలో కరెంటు మరొక దామాషాలో విదగొట్టి వెరసి మొత్తం లాభం తెలంగాణా వైపుకీ నష్తం ఆంధ్రా వైపుకీ సర్దటానికి హేతుబధ్ధత ఉందా"

      ఆస్తులను అప్పులను జనాభా దామాషా పద్దతిలో విభాజించారని అనుకోవడం పూర్తిగా పొరపాటు. కుదినంత మేరకు లొకేషన్ ఆధారంగానే విభజించారు. అలా కుదరని వాటిని (ఉ. కేంద్ర కార్యాలయం, బయటి రాష్ట్రాలలో ఉన్నవి వగైరా) *మాత్రమె* జనాభా నిష్పత్తిలో పద్దతిలో పంచారు.

      1953లొ ఉమ్మడి మదరాసు రాష్ట్రాన్ని విడగ్గోట్టిన నాటి నుండి వాజ్పీయి హయాములో ఏర్పడ్డ మూడు రాష్ట్రాల వరకు ఇదే పద్దతిని పాటించారు.

      ఇందులో హేతుబద్ధం కానిదేమిటో చెప్తే జవాబు ఇవ్వగలను.

      కరెంటు విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలను & డిస్కాములను కూడా లొకేషన్ ఆధారంగా పంచారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల (CGS) నుండి వచ్చే కరెంటును *మాత్రమె* గడచిన అయిదేళ్ళ వినియోగం ఆధారంగా పంచారు. ఇది మొత్తం కరెంటులో షుమారు 21% మించదు. కరెంటు వెలలొ ఎటువంటి రాయితీ లేదు పూర్తి మూల్యం చెల్లించాల్సిందే.

      Delete
  5. Congress had delayed the process because of CBN and Jagan who twisted their tongues for every 6 months.

    ReplyDelete
    Replies
    1. @Marxist Hegeiyan
      నేను అడుగుతున్నది మొదటిసారి యెన్నికలకి ముందే తెలంగాణా ఇస్తానని చెప్పి 9.10 సంవత్సరాల వరకూ యెందుకు నానబెట్టింది అని?అక్కడా ఇక్కడా అధికారంలో ఉన్న తను విదగొట్టదల్చుకుంటే ప్రతిపక్ష పార్టీల నాలుకల మడతలతో పనేమిటి అని?

      తెలంగాణా ఇస్తానని అధిష్ఠానం అన్నేళ్ళకి ముందే చెప్పీన పార్టీ అధికారంలో ఉండి ధీమాగా విదగొట్టటానికి కనీసం హోం వర్కు కూడా చెయ్యకుండా బాబు ఒప్పుకోవటం లేదు,జగన్ అడ్డం తిరుగుతున్నాడు అని అంతే బుర్రతక్క్కువ వాళ్ళూఉ నమ్ముతాడు గానీ నేను నమ్మను!

      మాటిమాటికీ వాగే సమైక్యం ఉద్యమంలో కాంగ్రెసేతరులు యెవరయిన అపాల్గొన్నారా?అధిష్ఠానం విదగొడతానని కొన్నేళ్ళకి ముందే చెప్పిది గదా,అప్పుడు అభ్యంతరాలు చెప్పకుండా ఆఖరి నిముషంలో అధికార పార్టీయే యెందుకు రెండుగా చీలిపోయి అయోమయాన్ని సృష్టించింది?

      Delete
  6. సోనియా తెలంగాణా ఇవ్వదు అనే నమ్మకంతోనే తాము నోరు మూసుకున్నాం అని కాంగ్రెస్ నాయకుడు జేసుదాసు శీలం బహిరంగంగా చెప్పుకోలేదా? ఇంకా అనుమానమెందుకు? అదే నమ్మకంతో బాబు, జగన్‌లు ఆరు నెలలకొకసారి మాటమారిస్తే మాత్రం తప్పు కాదా?

    ReplyDelete
    Replies
    1. బాసూ!నీ వెర్రిపుల్లాయతనాన్ని ఇంతగా ఇదగదీసేవిధంగా కామెంతు జేస్తావనే నేనెప్పుడూఒ అనుకోలే,యేం జెప్పినవ్?

      అరె బాబు మాట మారిసె నీకు దేనికి వయా?పవరులో ఉంతివి!పవరులోకి వచ్చెనాడ్డు ఇస్తనంటిచ్వి!రాంగనే గమ్మునె ఇచ్చెడ్దానికి ప్రతిపక్ష గొట్టం గోవిందరాజులు మాట నీకు దేనికశ?!

      అసలు మాట మార్చడం గాదు,విభజించుడు నకిష్తం లేదెహే అని బాబు అన్నా కాంగ్రెసు కేంటి దూల?సక్కంగ అగో బాబు యెదురురిరిగినా సరే ఇచ్చేసినా అని చంకలెగరెయ్యొచ్చును గందా?!

      దిమాగ్ తక్కువోడ,అస్లు బాబు తెలంగాణా ఇచ్చుడు ఇష్టం లేదంటే వాడి పాట్లు వాడు బదతడు,నీకెందుకు,కాంగ్రెసు కెందుకు?

      నువ్వు యెర్రి పుచ్చకాయవని తెలుసు గానీ మరి ఇంత లెక్కన ముదిరిపోయావని అనుకోలే,సారీ?!

      Delete
    2. కాంగ్రేసు
      బిజెపి
      బాబు తెలుగుదేశం
      చిరంజీవి ప్రజారాజ్యం

      అన్నీ తెలంగాణాని మోసగిద్దామని చూసిన పార్టీలే. ఓట్లకోసం మాట్లాడడం తప్ప నిజాయితీగా తెలంగాణా ఇద్దామని అనుకున్న పార్టీ ఇందులో ఒకటీ లేదు.

      అయితే చంద్రబాబు కొత్తరాజకీయానికి తెరలేపి రెండుకళ్ళ/రెండునాలుకల సిద్ధాంతం ప్రయోగించి రెండువేపులా మోసం చేయడం మొదలు పెట్టాడు. చివరికి పరిస్థితి తెలంగాణాకు అనుకూలంగా మారే సరికి, ఇవ్వకుండా ఆపడానికి సర్వశక్తులా ప్రయత్నించాడు. తద్వారా ఆంధ్రలో అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

      కానీ కాంగ్రెస్ బాబును సరిగా కాపీ కొట్టడం చేతకాక "రెండు పడవల మీద కాళ్ళ" సిద్ధాంతాన్ని అమలు చేసింది. ప్రత్యేక, సమైక్య ఉద్యమాలతో మరింత ఎడంగా జరుగుతోన్న పడవలను చూసి, ప్రాణాలు దక్కించుకునే చివరి ఆశతో మాట నిలుపుకునేందుకు తెలంగాణా ఏర్పాటు చేసింది. కాని అప్పటికే పరిస్థితి పూర్తిగా దిగజారడంతో చివరికి రెండు పడవల్లోంచి జారి నీటిలో పడింది!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...