Thursday, 19 February 2015

ఈ విభజన నామ సంవత్సరంలో ఒక యవనిక యేదో జారుతున్నట్లనిపిస్తున్నది!

అంతము లేని యీ భువనమంత పురాతన పాంథశాల; వి
      శ్రాంతి గృహంబు; నందు నిరుసంజలు రంగుల వాకిళుల్; ధరా
                                        క్రాంతులు పాదుషాలు బహరామ్ జమిషీడులు వేనవేలుగాఁ
                                        గొంత సుఖించి పోయి రెటకో పెఱవారికిఁ జోటొసంగుచున్!

      ఈ ఒక్క సంవత్సరం లోనే కవులు,కళాకారులు చాలామంది కీర్తిశేషు లయ్యారు?!నిన్ననే డి.రమానాయుడు అస్తమించాడు!సినిమా నిర్మాతల్లో హీరో లాంటివాడు?నిర్మాత పరిశ్రమకి యెంత ముఖ్యమో అందరికీ తెలిసింది రామానాయుడు ద్వారానే.యెన్నో సినిమాలు తీసినా ఒక్క ముక్కలో యెవరీ రామానాయుదు అని చెప్పాలంటే "ప్రేం నగర్ ప్రొడ్యూసరు" అంటేనే అందరికీ తెలుస్తుంది! 

      చిన్న వయస్సు లోనే నిర్మాతగా మారింది కూడా రామానాయుడే అనుకుంటాను.మొదటి సినిమా రాముడు భీముడు -యెత్తుకోవడమే పెద్ద హీరోతో,అదీ దబల్ రోలు?యే కాస్త అటూ ఇటూ అయినా నెత్తికి చెంగూ మొహం మీదే జోకులూ గ్యారెంటీ! అయినా సరే కధ కున్న సత్తాయే యెక్కువ అని తెలిసే ధైర్యం చేశాడోమో!ఆ హీరోనే తన మీద తనకున్న అతి నమ్మకంతో అయిదు వేషాలు వేసినా అట్టరు ఫ్లాపు అయిపోయింది గదా?కేవలం తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ సినిమాలు తియ్యాలనుకోవడం చూస్తే సినిమా అంటే అతనికి యెంత వదలని పిచ్చి?!

      అంటే అన్నానంటారు గానీ అసలు విషయం వొదిలేసి కొసరు విషయం యెత్తుకున్నానని కొందరు విసుక్కుంటారేమో గానీ ఈ మధ్యన వరసగా పోతున్న వాళ్ళ చావులు మొదలయిన తొలినాళ్ళ నుంచీ ఒక ముక్క లోపల్లోపలే తన్నుకుంటున్నది!వీళ్ళంతా రాష్ట్రం ఒక్కటిగా వున్నప్పుడు 23 జిల్లాల వాళ్ళని సమానంగా పలకరించిన వాళ్ళు!!ఒక పదేళ్ళ తర్వాత వెనక్కి చూసుకుని రెండు రకాల జీవితాల్నీ పోల్చుకుని యేడ్చే ఖర్మ నుంచి తప్పుకుని పోతున్నారు?ఒకరకంగా చూస్తే వాళ్ళు అదృష్తవంతులు!కాలపురుషుడు గజ్జె కదిలించి ఆడే చిరనర్తనంలో ఈ గజ్జె సవ్వడి వెనక కవ్వడి చెప్తున్న ముచ్చట యేమిటో తెలుసా?!


      యాభయ్యేళ్ళ వటవృక్షం కూలిపోయింది?పక్షులన్నీ చెల్లా చెదరవ్వాల్సి వుంది!కూలిన అదురుకి గాలికెగెరిన వాటికి తిరిగి వాలడానికి చెట్టు కూడా లేక గాల్లోనే గిరికీలు కొడుతున్నాయి కొన్ని పక్షులు?యాభయ్యేళ్ళలో అంతో ఇంతో యెదిగి కొంచెం తలెత్తి చూస్తే 23 జిల్లాలకీ కలిపి లక్ష కోట్ల బడ్జెట్టుతో ధీమాగా వుండి దక్షిణాదిలో రాజకీయంగా సాంస్కృతికంగా పెద్ద రాష్ట్రంగా వున్నాము అని సొంతోషపడుతున్న సమయంలో పాలకుండ భళ్ళున పగిలింది?!పాలన్నీ ఇంకిపోయాయి.ఒక్కటిగా వుండి యెంతో కొంత యెదిగిన ధీమా అంతా యేమయింది?ఇప్పుడు విడిపోయాక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ముష్టి కబుర్లు చెప్తున్నారెందుకు?తెలంగాణా ముఖ్యమంత్రి ప్రభుత్వ భూముల అమ్మకానికి దిగాడు!నాలుగు చోట్ల వున్న ఆఫీసు లన్నిట్నీ ఒక చోటికి చేర్చి మిగతా మూడిట్నీ అమ్మాలట?10 జిల్లాలకే లక్ష కోట్ల బడ్జెట్ వేశాడు?యెంత గట్టిగా లెక్కేసినా ఆదాయం 6000 కోట్లు మించేలా లేదు-ట! మిగతా కొరతంతా భూములమ్మడంతోనే పూడుతుందా?సంక్షేమ పధకాలే రెండు వందలు-ట?ఒక్కోదానికీ హీనపక్షం ఒక కోటి వేసుకున్నా 200 కోట్లు ఆదాయం లేని ఖర్చు.కులానికి పది కోట్లకి తక్కువ కాకుండా అడిగిన వాడిది పాపం అన్నట్టు కేటాయించేస్తున్నాడు.డప్పులు మోగించుకోవటానికీ రికార్డింగు డ్యాన్సులకీ తప్ప యెందుకు పనికొస్తాయనే ఇంగిత జ్ఞానం కూడా లేదు?!


      ఇటు చూస్తే చెన్నై నుంచి వలస వచ్చిన నాటి దృశ్యం మళ్ళీ కనబడుతున్నది!రాజధాని లేదు.ఆర్భాటంగా మొదలు పెట్టిన రాజధాని యెప్పటికి పూర్తవుతుందో తెలీదు?ముఖ్యమంత్రి నన్ను చూడండి,నా సమర్ధతని చూడండి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని దేశాలు పట్టి అడుక్కుంటున్నాడు?తిరుగుడు ఖర్చులన్నా గిట్టుబాటవుతాయో లేదో?అటు చూస్తే నిజాము కట్టిన భవంతులు తప్ప మొత్తం కూలగొట్టి కట్టే వూపు కనబడుతున్నది!మొత్తం మీద తెలుగువాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి మొదటిసారి కలవక ముందరి కాలాన్ని మళ్ళీ చూడబోతున్నారు ఈ తరం వాళ్ళు?!సరిగా ఇదే రకం సన్నివేశం మహాభారతంలో నడిచింది! సత్యవతీ మాతతో వేదవ్యాసుడు "అమ్మా!ఇప్పటి కేమి చూశావో చూశావు. గతకాలమె మేలు వచ్చు కాలం కంటె. ఇప్పుడు చూసిన వాటికే ఇలా అయిపోయావు.ముందు ముందు జరిగేవి ఇంకా భయంకరంగా వుండవచ్చు" అని ఆవిణ్ణి ప్రయాణానికి సిధ్ధం చేశాడు!


      కాలపురుషుడు బల్ల మీద వున్న పాత పావుల్ని మొత్తం తుడిచేస్తున్నాడు!కొత్త పావుల్ని సిధ్ధం చేస్తున్నాడు?కొత్త రాష్ట్రం,కొత్త రాజధాని,కొత్త తరం,కోటి ఆశలు అంతా కొత్తగా వుంది కానీ - అదిరిందయ్యా చంద్రం అని మాత్రం అనుకోలేకుండా వున్నాం?ద్వేషబీజాలు నాటడం చాలా తేలిక!విత్తనం లా చూస్తే అవి కూడా అన్ని విత్తనాల లాగానే అమాయకంగానే వుంటాయి!కానీ అవి మొలిచి పెరిగి పెద్దయి అసలు ఫలితం యేమిటో చూపించాక అందుకు కారకు లయినవాళ్ళు మాత్రం సొంతానికి దక్కించుకోవలసింది దక్కించుకుని తప్పుకుంటారు.అప్పటికి బల్లమీద మిగిలిన పావులు వాటి ఆట అవి ఆడాక తప్పదు గదా,కష్టమయినా నష్టమయినా?!



ఇల చదరంగ; మందు జనులెల్లరు పాపు; లహస్సులున నిశల్
   దెలుపును నల్పుగళ్ళు; కదలించును రాజును బంటుఁ దక్కు పా
  వుల విధియాటకాఁడు; పలుపోకలఁ ద్రిప్పును గళ్ళు మార్చు, న
                                    వ్వల నొకటొక్కటిం జదిపివైచు నగాధ సమాధి పేటికన

Wednesday, 18 February 2015

తిరుపతిలో కూడా తిరుక్షవరమేనా?చింత మరీ ఇంత మోహనమా!

     అనుకోనిది జరిగితే కదా వింత!అనుకున్నది జరగకపోతేనే కదా చింత!వూహించరానిది యేమి జరిగినదని ఈ వగపంత?!ఓటమి అలవాటై పోయి ఆపో సోపో యెవరు గెలిచినా సంబరపడిపోతున్న ఈ తరుణంలో పొరపాటున గెలిస్తే ఆనందం పట్టలేక యెన్ని గుండెలు ఆగిపోతాయో లెక్కేసుకుంటే అంతా మన మంచికే అనిపిస్తుంది!

     తెలిసీ వలచీ విలపించుటలో తీయదనం కోరి వలచుట యేలనో!వికట కవి చెప్పినట్టు "గోవిందా గోవిందా నన్ను బాగుచెయ్యి గోవిందా" అంటూ ఆపదమొక్కుల వాడి సన్నిధిలో నన్నా బోణీ కొడదామని ఆశపడిన మోహనుడి ఆశల వేణువు స్వామివారు కూడా విరగ్గొట్టేశారే,కరుణ యొకించుక యైనను లేకుండగ?చింత చచ్చినా పులుపు చావనట్టు కొందరికి సత్యం కళ్లముందు కనబడినా బుర్రకెక్కదని సరిపెట్టుకోవాలే తప్ప ఇపుడతిగా ఆవేశపడి లాభమేమి?కాలం కలిసిరాకపోతే గాంధీ గారు కూడా బ్రాందీ షాపు పెట్టుకోవలసొస్తుంది,మనమెంత అని బొత్సబాబు యెప్పుడో చెప్పాడంట?!పోగాలము దాపురించిన వారు బ్రాందీమార్గం కనరు కదా!

     చచ్చినోడి పెళ్ళికి వొచ్చిందే కట్నం అని యెన్ని వోట్లు పడ్డాయో లెక్కేసుకుని సంతోషించక పాత అలవాటు చొప్పున రిగ్గింగుల గురించి మాట్లాడతాడేంటి లఘుశంకవీరుడు?మూలిగే నక్కమీద తాండిపండు పడ్డట్టు ఓడిపోతామని తెలిసిన ఇట్టాంటి యెన్నికల్లో పోటీ చెయ్యడాన్ని గురించి మేం విడగొడ్తాం రాష్ట్రాన్ని అంటే మేం విడగొడ్తాం అని పోటీలు పడి మాకంతా తెలుసు యెట్టా విడగొట్టి యెట్టా లాభం తెచ్చుకోవాలో అని గంతులేసి ఇంత దారుణానికి కారణమైన డిగ్గీరాజా కూడా చివాట్లేశాడంట ఆఖరికి - ముఖం యెక్కడ పెట్టుకోవాల్రా నాయనా?!

ఓడిపోయే యెన్నికల్లో పొటీ చెయ్యగూడదనుకుంటే ఇంక పోటీ చెయ్యగలిగిందెక్కడ?!
గెలిచే యెన్నికల్ని కూడా ఓటమికి నడిపించగలిగిన రాహుబాబు యెటూ వున్నాడు!?

Saturday, 14 February 2015

హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విశ్లేషణం

సీ||  యేమయా రామయా యేదయా నీదయా!
         మాకు నీవేకదా మేటి వేల్పు?

         ఎన్నియో బాధలూ ఎంతయో వేదనా
         మోసిమోసీ మరీ మోయలేని

         వాడనై నేడిలా వేడుతున్నానయా!
         కావవే దేవరా కాస్త శాంతి

         నివ్వు నా తండ్రిగా! నీటిలో ముంచినా
         నావలా తేల్చినా నీవెనంటు

తే||  చేరినానుగా, స్వామి?నా చేయి పట్టి
        నాకు నీవెతోడై సదా నన్ను తప్పు 
        చేయనీక నీ బిడ్డలా చూసుకోవ
        యా - త్రిలోక పాలా, దయాపాశహస్త?!
(08/02/2015:ఇందులో రామనామం లోని "ర" గణం మాత్రమే వాడాను,"మ" గణం వాడకూదు గాబట్టి అందులోని అకారంతో ధ్వనిసామ్యం వున్న "హ" గణం వాడాను!)
_______________________________________________________________
శ్రీ గురుభ్యో న్నమః

          అవతార ప్రాధాన్యాన్ని బట్టి కాలక్రమాన్ని లెక్కిస్తే రామకధ ముందుగా వచ్చినా మొదట గ్రంధస్థ మయింది మాత్రం మహాభారతమేనని కొందరి వాదన!అరణ్యపర్వంలో ధర్మరాజుని చూసి పలకరించిన మునులు నువ్వొక్కడివే కాదు మంచివాళ్లయి వుండి కూడా కాలం కలిసిరాక బాధలు పడినవాళ్ళు గతంలో కూడా వున్నారు,వాళ్ళకి లాగే నీ కష్టాలూ తీరుతాయిలే అని ధైర్యం చెప్పడం కోసం చెప్పిన కధల్లో ప్రముఖమైనవి నలచరిత్ర, రామకధ.రామాయణం యొక్క ముఖ్యకధ అంతా అదే వరసలో నడవటాన్ని బట్టి వాల్మీకి తనకంటూ శాశ్వతత్వాన్ని సాధించుకోవటానికి ఆ చిన్న కధని వుపయోగంచుకున్నాడని అనుకోవాలి.ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టు ఒక కవి మరో కవికి వుషారు నిచ్చాడు!

          సామాన్య జనం పై రెండు కధలతో మమేకం కావడం కూడా వాళ్ళు పడిన కష్టాలను తమ కష్టాలతో పోల్చుకుని తమ కష్టాలు కూడా అట్లాగే పోతాయనే ఆశ కలిగించడమే! ఆ కవులు తమ కధలకి కోరిన ప్రయోజనం కూడా ఆ కధ చదివిన వాళ్ళు విన్నవాళ్ళు తమ కష్టాలకి కుంగిపోయి అర్ధాంతరపు ప్రాణత్యాగాలకి పోకుండా ఆ కధలోని నాయకుడి లాగే వీళ్ళు కూడా పోరాడి గెలవాలనే వుత్సాహాన్ని తెచ్చుకోవడమే!రోగీ పాలే కోరాడు వైద్యుడూ పాలే ఇచ్చాడన్నట్టు ఆ ప్రయోజనం పూర్తిగా సిధ్ధించాలంటే కధ ఆకుకీ పోకకీ అందకుండా పోయి పాఠకుణ్ణి కంగారు పెట్టగూడదు,కధానాయకుడు చదువరి లాగే వుండి, చదువరి ఆ పాత్రలో తనని చూసుకోవడం మొదలయ్యాక రచయిత మెల్లగా అతన్ని యే రకం మనస్తత్వంలో నిలబెట్టాలని అనుకున్నాడో అవన్నీ కధానాయకుడి ప్రవర్తన లోని అంశాలుగా సన్నివేశాల్ని కల్పించి చూపించాలి - ఇన్ని గొడవ లున్నాయి జగధ్ధితం కోసం సాహిత్య రచన చెయ్యాలంటే?!

      అవన్నీ తనకి పుష్కలంగా వున్నాయనే ధీమా వుంది గనకనే "నా రామకధ ఈ ప్రపంచంలో నదులు పారుతున్నంతవరకూ పర్వతాలు స్థిరంగా వున్నంతవరకూ నిలిచి వుంటుంది" అని గొప్పగా చెప్పుకున్నాడు!సాహిత్య రచన అనేది మొదలయిన తర్వాత ప్రపంచంలోని యే భాషకి చెందిన కవీ తన సృజన గురించి ఈ మాట అనడానికి సాహసించ లేదు?తను రాసిన దాన్ని పదేళ్ళ తర్వాత తనే మర్చిపోయే రకం చెత్త సాహిత్యాన్ని సృష్టించిన మనిషి వాల్మీకి కన్నా నా తెలివి యెక్కువ నాకందులో తప్పులు కనబడ్డాయి అంటే తెలివైన వాడెవడయినా నమ్ముతాడా?మరి, కొన్ని దశాబ్దాల తర్వాత మరో కమ్యునిష్టు మేధావి రామాయణం గురించి చాగంటి వారూ మల్లాది వారూ కూడా చెప్పని విషయాల్ని చెబుతూ ప్రశంసించినప్పుడు జనం యెవరిని నమ్మాలి?మూలకధ అదే అయినా ఉపకధలకీ కొన్ని ముఖ్యమయిన సన్నివేశాలకీ యెక్కడెక్కడో లింకులు కనబడుతున్నాయంటే అవన్నీ తెలుసుకునే రాశాడని అనుకోవాలి గదా!అంతటి విజ్ఞానిని ఇంతటి అజ్ఞాని వెక్కిరించటానికి పూనుకోవటమే దరిద్రమయితే దాన్ని అభిమానించే వాళ్ళు కూడా వుండటం మరీ నికృష్టం కాదా?!

          రామాయణంలో మొట్టమొదటి మార్మిక సన్నివేశం అహల్యా సంక్రందనం?!రాముణ్ణి దేవుడిగా కొలవడానికి జనానికి వచ్చే మొదటి వూహ "అహల్యకి శాప విమోచనం కలిగించినట్టు మన బాధల్నీ తొలగిస్తాడు" అనే ఆశ!రాయిని నాతిగ చేసిన రామపాదరజం యొక్క మహిమల్ని యెంతోమంది కవులు,భక్తులు కీర్తనల్లో గానించి పులకించిపోయారు?కానీ ఒక ముఖ్యమయిన విషయం - వాల్మీకి రాముడికి యే విధమయిన మహిమలూ ఇవ్వలేదు.పూర్తిగా మనలాగే నవ్వాడు,కోపగించుకున్నాడు,సంతోష పడ్డాడు - అచ్చం మనలాగే భార్య కనపడకపోతే పొర్లిగింతలు పెట్టి యేడ్చాడు?!అసలు కధ అహల్య రాయిలాగా రోడ్డు పక్కన పడివుంటే రాముడు నేనిప్పుడు ఈ రాయిని తన్నాలి గాబోల్ను అని డైరెక్టరు గారు చెప్పినట్టు చేసే ఇవ్వాళ్టి చెక్కమొహం విశ్వనటుల్ల్లాగా పోయి తన్నడమూ ఆ రాయి కాస్తా గ్రాఫిక్సులో మోకాటి తండా వేసిన ఆహల్యగా మారడం లాగానూ జరగలేదు!విశ్వామిత్రుడు తనతో తీసుకు వెళ్ళినప్పుదు కుర్రాళ్ళకి బోరు కొట్టకుండా పురాణ కధలూ అవీ చెప్పడం దారిలో వచ్చే ఆశ్రమాలకి సంబంధించిన కధలూ అవీ చెప్పడం అనే వరసలో అహల్యా గౌతముల కధ కూడా చెప్పి ఆశ్రమం కనబడగానే "ఇక్కణ్ణించే ఒక నమస్కారం చేసుకుని ముందుకు పద" అన్నాడు, కానీ రాముడు నాకు స్వయంగా గౌతముల వార్ని చూడాలని వుంది అంటాడు!ముచ్చట పడి తన అవసరం కోసం వెంట తిప్పుకుంటున్న శిష్యుడు ముచ్చట పడుతున్నాడు గదా అనిపించి "సరే పద!" అని ఆశ్రమం వైపుకి నడవటం మొదలు పెట్టారు!ఇది తెలిసిన గౌతముడికి అహల్యకి తను వేసిన శిక్ష నుంచి విడుదల చెయ్యక తప్పలేదు!అందరూ అపోహ పడినట్టు గౌతముడు రాయిలా పడి వుండమని శపించలేదు."మనుషులకి కనపడకుండా,నువ్వేమి తింటున్నావో యెవరికీ తెలియకుండా భస్మరూపివై - అంటే జీవించి ఉందా మరణించిందా అనేది తెలియకుండా బతుకు"  అని శాసించడమే తప్ప రాయిలాగా మారే శాపం ఇవ్వలేదు? ఇప్పుడు ఆశ్రమానికి వస్తున్న వాళ్ళు లోకారాధ్యుడైన విశ్వామిత్రుడూ, అప్పటికే ఋషుల్లో ఫలానా దశరధుల వారబ్బాయి,వశిష్టుల వారి శిష్యుడూ యెప్పటికయినా మనందరికీ పనికొచ్చే వాడూ అని తెలిసిపోయిన రాముడూ, అంతటి వాడే అయిన అతని తమ్ముడూనూ!సాంప్రదాయం ప్రకారం ఇంటికి వచ్చిన అతిధులకి మర్యాదలు కాళ్ళకి నీళ్ళీవ్వడంతో మొదలౌతాయి.అది కూడా పెళ్ళి కాని ఆడపిల్ల వుంటే తప్పనిసరిగా తనూ లేదంటే భార్య గానీ చెయ్యాలి.లోపలి కెళ్తే కాళ్లకి నీళ్ళిచ్చే మనిషి లేదనే విశ్వామిత్రుడు మొదట ముందుకు పదమన్నది!ఆ మర్యాద జరిపించాలి గాబట్టి తన శిక్షని తనే రద్దు చేశాడు గౌతముడు!ఇదంతా చూడాలని అడగటం వల్ల జరిగింది కాబట్టి  అడిగిన రాముణ్ణి గురించి ఒక విశేషణంలా వాడిన మాట కధలోకి రాయిని తీసుకొచ్చింది?!రాముణ్ణి దేవుణ్ణి చేసింది!

          అసలు అహల్యా గౌతముల కధలోనే మరింత నిగూడత వుంది!N.T.R తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చూసిన వాళ్లకి ఆ సన్నివేశానికి ముందు నెర్రెలు విచ్చిన బీడు భూమినీ తర్వాత నాట్లు వేస్తున్న వరిపొలాల్నీ చూపించటం గుర్తుందా?మన పౌరాణికాలన్నీ వ్యవసాయ సంస్కృతిలో తలబంటిగా మునిగిన వాళ్ళు రాసినవి గాబట్టి దానికి సంబంధించిన విషయాలు సందర్భానికి తగ్గట్టుగా వుంటే అక్కడ నిక్షేపించటం జరుగుతుంది!"అహల్య" అంటే నాగలి వెయ్యని భూమి అని అర్ధం!"గోతమ" అంటే గోవుల్ని పోషించేవాడని అర్ధం.అహల్యను కూడిన ఇంద్రసూర్యు లిద్దరూ వ్యవసాయాన్ని నష్టపరిచే అతివృష్టీ అనావృష్టీ అనేవి!ఇద్దరు పరపురుషులతో సంగమించిన తర్వాత కూడా అహల్యకి పంచమహాపతివ్రతల్లో స్థానం చెక్కుచెదరకుండా అలాగే వుంది అంటే తాత్కాలికంగా ఆ భూమి సేద్యయోగ్యం కాకపోయినా ఆ భూమిలోని సారం పూర్తిగా నశించలేదని!నార్మన్ జాకోబీ అనే ఫ్రెంచి పండితుడు మొత్తం రామాయణమే వ్యవసాయ సంస్కృతికి సంబంధించిన విశేషాల్ని పాత్రలుగా సన్నివేశాలుగా రూపు దిద్దిన కధ అని వ్యాఖ్యానించాడు.ఇక్కడి అర్ధం ఒక వ్యవసాయ దారుడు తనకి ప్రాప్తించిన భూమిలో యెంత కష్టపడినా అతివృష్టీ అనావృష్టీ వేధించటం వల్ల విసుగు పుట్టి సేద్యభూమిని బీడునేలగా వదిలేస్తే ఒక సులువు తెలిసిన రైతు కౌలుకి తీసుకుని దాన్ని వ్యవసాయ యోగ్యంగా మార్చి అప్పజెప్పటం అనే పైకి వాచ్యంగా కనపడని మరో రహస్యమైన కధ దాగి వుంది?!ముందూ వెనకా ఆ రెండు దృశ్యాల్నీ పనిగట్టుకుని చూపించటం వల్ల N.T.R ఆ రకం విశ్లేషణలు చదివాడనే తెలుస్తుంది!

          ఇంద్రుడూ సూర్యుడూ కోడికూతతో గౌతముణ్ణి నదికి పంపించాక గౌతముడి వేషంలో వచ్చి పక్కన జేరారనే సినేమా మసాలా దట్టించి చెప్పలేదు అహల్య కదని వాల్మీకి! అలా జరిగి వుంటే నీ వేషంలో ఉండటం వల్ల నువ్వనుకున్నాను నా తప్పేమిటి అని అహల్య నిలదీసే అవకాశం లేదా?తమ నిజరూపాల్లో మేము ఫలానా అని తెలిపి అహల్యని యే బలాత్కారమూ చెయ్యనక్కరలేకుండానే తమ కోరిక తీర్చుకున్నారు?వాల్మీకి ఇంత నిక్కచ్చిగా కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళిద్దరూ  నిజరూపాల్లోనే వున్నారనీ పైగా అహల్య అంగీకారంతోనే అదంతా జరిగిందనీ తెలిసిన మరుక్షణం మనకి చాలా సందేహాలు వస్తాయి - రావాలి కూడా!ఇద్దరు పరపురుషుల్ని సంగమించినా గౌతముడు వేసిన శిక్షని భరించడమే తప్ప పంచ మహాపతివ్రతల్లో ఆమె స్థానానికి మాత్రం భంగం రాలేదు,యెందుకని?రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఇద్దరు మగవాళ్ళలో ఇంద్రుడికే భయంకరమైన శాపాన్ని ఇచ్చిన గౌతముడు సూర్యుణ్ణి యెందుకు వదిలేశాడు?నా విశ్లేషణ ఇది:ఇప్పటి వుద్యొగినులు బాసు చెయ్యి పట్టుకుంటే వెంటనే వేరే వుద్యోగం తెచ్చుకోగలిగితే అక్కడ వుద్యోగం మానెయ్యటం లేదా పరిస్థితి తప్పనిసరిగా ఆ వుద్యోగమే చెయ్యాల్సిన విధంగా వుంటే ఇష్టం లేకపోయినా లొంగిపోయేటటువంటిదే అహల్య పరిస్థితి కూడా!యెదురుగా వున్నవాళ్ళలో ఒకడు స్వర్గాధిపతి మరొకడు కర్మసాక్షి.తను తిరస్కరించడం వల్ల వాళ్ళకి క్రోధం కలిగితే భర్తకి హాని చేసే ప్రమాదం వుంది.ఇక్కడ జరుగుతున్నదేమిటో తెలియకపోవడం వల్ల వీళ్ళు యేదయినా చేస్తే గౌతముడు తనని తను రక్షించుకోలేని పరిస్థితి!అవినీతి,నేరం అనే వాటి నిర్వచనాలు పాతకాలపువైనా కొత్తకాలపువైనా అన్ని న్యాయసూత్రాల లోనూ ద్రోహబుధ్ధితో పూనుకుని చేసినప్పుడే ఆ మనిషికి కర్తృత్వం ఆపాదించడం జరుగుతుంది!అహల్య మనసులో జారత్వం లేదు గాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా దోషానికి పరిహారంతో సరిపెట్టేసి ఆ సన్నివేశానికి ముందూ ఆ సన్నివేశం జరుగుతున్నప్పుడూ ఆ సన్నివేశం తర్వాతా అహల్య మనసా వాచా కర్మణా గౌతముడి క్షేమాన్ని కోరుతూనే వుండటం వల్ల పంచమహాపతివ్రతాల్లో ఆమెకున్న స్థానం అలాగే వుంది!అహల్య గనక తిరగబడి,"నేనెలా పుట్టానో నీ దగ్గిర కెలా వచ్చానో నీకూ తెలుసు.మా నాన్న బ్రహ్మదేవుడు మా అమ్మ సరస్వతి తన సృష్టిలో యేదీ పరిపూర్ణంగా వుండకపోవటాన్ని చూసి వెక్కిరిస్తుంటే వుడుకుమోత్తనం తెచ్చుకుని అన్నిటా సర్వొత్తమంగా ఉండేటట్టు సృష్టించి కూడా షరా మామూలే అన్నట్టు ఇంద్రుడు అంతగా ఆశపడి తనకిమ్మని అడుగుతున్నా నొసటి రాతలో అన్యాయం చేసి నీ భార్యగా పంపించాడు!నా తండ్రి చేసిన తెలివితక్కువ పనికి బలయి గడుపుతున్న ఇంత దుర్భరమైన జీవితంలో ఒకే ఒక్కసారి ఈడూజోడైన వాళ్ళతో కూడితే తప్పేంటి?" అని నిగ్గదీస్తే గౌతముడు కోపానికి బదులు జాలి చూపించాల్సి వచ్చేది కాదా?సూర్యుడు ఇంద్రుడు ప్రలోభపెట్టగా వచ్చాడు.గౌతముడి ముందు తప్పు వొప్పుకుని తల దించుకు నిలబడ్డాడు.ఇవ్వాళ్టి న్యాయసూత్రాల్లో కూడా అప్రూవరయి అసలు ముద్దాయిని పట్టిచ్చే సహాయం చేసినా తప్పు వొప్పేసుకుని శిక్షకి తలొగ్గినా తక్కువ శిక్షతో సరిపెట్టెయ్యడం గానీ అసలు యే శిక్షా లేకుండా వొదిలెయ్యటం గానీ చేస్తారు గదా!ఇక ఇంద్రుడికి వేసిన శిక్ష పూర్తి స్వభావం తెలిస్తే వొళ్ళు జలదరిస్తుంది!కళ్లని కాకుండా అక్షులు అని పిలిచే వాటిలో కుష్టు రోగులకి చర్మం చిట్లి కనబడే గాయాలు కూడా వున్నాయి!గౌతముడు ఇంద్రుడికి ఇచ్చిన శాపం మొత్తం దేవలోకాన్నే జలదరింపజేసింది, యెందుకంటే ఆ భయంకరమైన రూపాన్ని చూడాల్సింది వాళ్ళే గదా!దానికి సర్దుబాటుగా తనవైపు చూసుకుంటే తనకి తప్ప మిగిలినవాళ్లకి మామూలుగానే కనబడే విధంగా శాపం తీవ్రతని తగ్గించారు!యెంతటి నేరమయినా చేసేటప్పుడు పేరుకున్న తిమ్మిరి కరుగుతుంది గనక సర్దాగానే వున్నా ఒకసారి నేను అలా చేసి వుండాల్సింది కాదు అనే గిల్ట్ తొలచడం మొదలయితే ఆ మనిషి నరకాన్ని చూస్తాడు!ఇంద్రుడి కిచ్చిన శాపం మనిషిలోని అపరాధభావన?!ఆ ఉపకధకి రామాయణ కధలో వున్న ప్రాధాన్యమేమిటో అందులో మనం నేర్చుకోవలసిందేమిటో తెలియక పోవడం వల్లనే "నదికి పోలేదా స్వామీ" అంటూ క్యామిడీ నాటకంగా చూపిస్తే జనం కూడా నిజం సీను కూడా ఇలాగే జరిగింది కాబోలనుకుని నవ్వుతూ చూశారు?!

           రామాయణంలో మొట్టమొదటి గందరగోళపు సన్నివేశం - పట్టాభిషేకం?!మొదట్లో అంత భీకరంగా పంతం పట్టి అడవులకి పంపించిన కైక భరతుడితో వెళ్ళినప్పుడు చాలా దుఃఖపడుతుంది!అందువల్లనే కాబోలు కొందరు వ్యాఖ్యాతలు పట్టాభిషేకాన్ని తప్పించటానికి దేవతలు కైకకి మాయపొర కమ్మించారు అనే రకం కల్పనలు చేశారు?కొందరు జాతక రత్నాలు వశిష్టుడు తప్పుడు ముహూర్తం పెట్టాడు,అందుకే అట్టా జరిగిందీ అని కూడా తీర్మానించేశారు.కొందరు వాస్తు పండితులు సీతాపహరణాన్ని లక్ష్మణుడి మీదకి తోశారు పర్ణశాల వాస్తువిరుధ్ధంగా కట్టాడు,అందుకే అట్టా జరిగిందని!కానీ పట్టాభిషేకం అట్లా భ్రష్టు పట్టిపోవటానికి కారణమైన అసలు విలన్ దశరధుడు?!కైక కూడా మంచిదే పాపం!మొదట పట్టాభిషేకం వార్త మంధర ద్వారా వినగానే సంతోష పడుతుంది అమాయకంగా!అంటే పుట్టింటి వాళ్ళు తనని ఇక్కడికి పంపించేప్పుడు తనకి పుట్టిన వాడే రాజవ్వాలని కండిషన్ పెట్టి పంపించటాన్ని పట్టించుకోకుండా రాముడు రాజవటానికి మానసికంగా తను కూడా సిధ్ధంగా వున్నదనే గదా?మంధర పూర్తిగా చెప్పాల్సింది చెప్పాక అప్పుడు మొదలైంది అసలు భీభత్సం, అవునా?యేమి చేప్పింది మంధర!"తల్లీ నీకు అసలు విషయమే తెలియదు గానీ కౌసల్య మందిరంలో పండగ చేసుకుంటున్నారు!అన్ని విషయాల్లోనూ నీకు చెప్పి చేసే రాజుగారు ఈ విషయం మాత్రం నీకు చెప్పలేదు చూశావా?అందరూ కలిసి నీచుట్టూ వుచ్చులు బిగిస్తున్నారు!" అని బోధపర్చింది?ఈ మంధర యెవరు?కైక పుట్టింటి నుంచి ఇక్కడ తమ కూతురికి అన్నీ సరిగా జరుగుతున్నాయా లేదా అని కనిపెట్టుకుని వుండటానికి వచ్చింది కదా, మరి జరిగేవి అనుమానం పుట్ట్టించే విధంగా వున్నప్పుడు కైకని హెచ్చరించకపోతే తన బాధ్యతని విస్మరించినట్టు కాదా!ఇంతకీ దశరధుడు చేసిన పనులేమిటి?సరిగ్గా ఒక్కరోజు ముందు భరతుణ్ణి మేనమామ ఇంటికి పంపించాడు!హఠాత్తుగా నిండుసభలో ఇప్పటికిప్పుడు నేను రాముణ్ణి రాజుని చెయ్యాలని అనుకుంటున్నాను,ముహూర్తం వెంఠనే పెట్టండి అని వశిష్టుణ్ణి తొందర పెట్టాడు!తెలిసి చేసినా వుషారు కొద్దీ చేసినా దశరధుడి ప్రవర్తన అంతా కైకని అనుమానించి అన్నీ పూర్తి చేసేసి అప్పుడు చెబుదామనే ప్లానుతో చేసినట్టుగానే వుంది!అందుకే కైకకి అంతగా కాలింది?!ఇప్పటికీ ఆడవాళ్ళ మనస్తత్వంలో ఒక ట్విస్టు వుంటుంది గమనించారా - చేప్పి చేస్తే యెంత దుర్మార్గం చేసినా సహిస్తుంది గానీ భర్త చేసింది మంచిపనే అయినా వేరే  వాళ్ళ ద్వారా తెలిస్తే మాత్రం తన కోపం తగ్గేదాకా నరకం చూపిస్తుంది,అవునా?!వాల్మీకి మహా గడుసువాడు - ఒకవైపు నుంచి చూస్తే దశరధుడు కావాలనే చేశాడు అని అనిపించేటట్టూ మరోవైపు నుంచి చూస్తే పాపం అనవసరంగా తొందరపడి అన్యాయంగా కొడుకు మీద బెంగతో కక్కటిల్లి చచ్చిపోయాడేమో అనిపించేటట్టూ సన్నివేశాలని రన్నింగ్ కామెంటరీ లాగా చెప్పేసి వొదిలేస్తాడు తప్ప తనుగా యేమీ చెప్పడు?!మన సంస్కారాన్ని బట్టి నాలాంటి శాడిష్టు అయితే ముసలోడు కావాలనే చేశాడు ఆ శాస్తి జరగాల్సిందే అనుకుంటాడు,శ్యామలీయం మాస్టారి లాంటి శాంతమూర్తు లయితే దశరధుడి మీద జాలిపడి క్షమించేస్తారు!

          చాలామంది రాముడు తండ్రి మీద వున్న ప్రేమ వల్ల పితృవాక్య పరిపాలన కోసం సింహాసనాన్ని త్యజించి వనవాసం వెళ్ళాడని అపోహ పడుతున్నారు!జరగకూడని హాని అంతా జరిగి మఠధ్వంసం అయ్యాక అప్పుడు దశరధుడు రాముడు కనబడగానే "నువ్వు నన్ను ఖైదు చేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకో" మంటాడు!నిజంగా కూడా రాముడు ఆ పని చేస్తే కధ అక్కడితో ఆగిపోయి వుండేది.ఎందుకంటే,కైక కూడా రాముడి రాజరికాన్ని వొప్పుకుందంటే మిగతా ప్రభుత్వాధికారులు అప్పటికే విధేయులై పోయి వుండాలి గదా?అన్నింటికీ కైక చుట్టూ తిరుగుతూ భర్త తనని నిర్లక్ష్యం చెయ్యడం లోటు తప్ప కౌసల్య హోదా కూడా తక్కువదేం కాదు.ఆవిడ అయోధ్యా నగరానికి రక్షకురాలు!ఆవిడ అధీనంలో వున్న బలగం చాలు నగరాన్ని గుప్పిట్లో పెట్టుకోవటానికి!రాముడు లెక్క ప్రకారం రెండు విషయాలు ప్రస్తావిస్తూ జవాబు చెప్పాడు - "మాట ఇచ్చినది ఇక్ష్వాకు వంశానికి సంబంధించిన రాజు.ఆ మాట పొల్లు పోతే నీ రాజపదవికీ మన వంశచరిత్రకీ కళంకం గనక ఆ పని పొరపాటున కూడా చెయ్యను." అని తిరస్కరించి "పట్టపు రాణి స్థానంలో వున్నా నీ పక్షపాతం వల్ల ఇన్నాళ్ళూ నన్ను చూసుకుని బతికింది నా తల్లి,ఇప్పుడదీ లేకుండా చేశావు!నేను లేను గదా అని తనకి దుఃఖం కలిగించే పని చేస్తే మాత్రం సహించను?" అని హెచ్చరించాడు.ఈ కటువైన మాటల్లో తండ్రి మీద ప్రేమ కన్నా తండ్రి యొక్క బహుభార్యాత్వం పట్ల వున్న అసహ్యమూ అందులో కూడా పక్షపాతం చూపించి యెవరో ఒకరి వైపుకి మొగ్గి మిగతా భార్యల్ని చిన్నచూపు చూడటం పట్ల వున్న తిరస్కారమూ కనపడటం లేదా?!సరిగ్గా ఈ పాయింటు మీదనే - తండ్రి చేసిన తప్పు తను చెయ్యకూడదనే పట్టుదల తోనే  అరుంధతీ వశిష్టుల్ని దగ్గిర్నుంచి చూసిన రాముడు యేకపత్నీవ్రత దీక్షని పాటించాడు!దశరధుడు గుండె బద్దలై మరణించింది రాముడితో యెబాటు వల్ల కాదేమో, రాముడి అంతరాంతరాల్లో తనపట్ల వున్న అసహ్యం అనుకోకుండా బయట పడటం వల్లనేమో!లేదంటే పధ్నాలుగేళ్ళ తర్వాతైనా వస్తాడనే ఆతో బ్రతికి వుండే వాడేమో?!ఈ మొత్తం భీభత్సం అంతా పూర్తయ్యాక కైక సాధించింది శూన్యం?!భరతుడు కూడా తల్లినే తప్పు పట్టడం, రాముణ్ణి తిరిగి తీసుకు రావాలని ప్రయత్నించి అది కుదరక (భలే తమ్ముడు లెండి!పాదుకలడిగి అడివిలో అన్నగారికి చెప్పులు కూడా లేకుండా చేసేడు?) తను రాముడి ప్రతినిధి గానే శృంగిబేర పురం నుంచి పరిపాలన సాగించటంతో భర్తని పోగొట్టుకుని కొడుకు దృష్టిలో చెడ్డదానిగా నిలబడింది!నిదానంగా చెయ్యాల్సిన పని హడావిడిగా చేసిన దశరధుడు ఒక్కరోజులో తన జీవితాన్ని యెంత భయంకరమైన మలుపు తిప్పుకున్నాడు?!

          భరతుడు వచ్చే సమయానికి రాముడూ సీతా మంచి రొమాంటిక్ సీనులో వున్నారు?తమ్ముడు గారు చంపి తెచ్చిన మాంసాన్ని వొరుగులుగా యెండబెట్టి "సీతా!ఈ ముక్క బావుంది,తీసుకో" అనీ "కాదు కాదు,ఇదింకా బావుంది - మీరూ తిని చూడండి" అనీ ఒకరికొకరు తినిపించుకునే సరదాలో వున్నారు!ఇది యెందుకు చెప్తున్నానంటే పైన చెప్పానే రామాయణాన్ని అంత గొప్పగా పొగిడిన కమ్యునిష్టు మేధావి ఈ దృశ్యాన్ని వర్ణించగానే రామభక్తులంతా మూర్ఖంగా రెచ్చిపోయారు?తెరవెనక యెంత గందరగోళం జరిగిందో తెలియదు గానీ తర్వాత కొద్ది వారాల్లోనే ఆ సీరియల్ ఆగిపోయింది?మరి కొన్ని వారాల్లోనే అసలు ఆంధ్రజ్యోతి కూడా అదృశ్యమైపోయింది!వీళ్ళ పిచ్చి గాకపోతే రాజుగారబ్బాయి మాంసం తింటే తప్పా?ఆయనేమన్నా వైదీక బ్రాహ్మణోత్తముడా?రాముడికి పెట్టిన నియమం నారచీరలు గట్టుకుని వనవాసం చెయ్యమని గానీ మునివృత్తి చెయ్యమనీ కాదు,మౌనిత్వం వృత్తీ కాదు!ఇంకొక్క మెలిక చెప్పి తిన్నగా సీతాపహరణం దగ్గిరకి జంప్ జిలానీ ఐపోతా!రాముడు చంపిన కబంధ,విరాద మొదలైన కొందరు రాక్షసుల వధ జరిగాక వాళ్లలోంచి ఒక తేజస్సు రాముడిలో లీనమైనట్టుగా వర్ణించిన జ్ఞాపకం వుంది!శ్రీకాంత్ చారి లాంటి నాలో తప్పులు పట్టడం కోసం యెదురు చూసేవాళ్ళు పొరపాటున ఆ భాగం గనక ముక్కస్య ముక్కః చదివితే రాముడికి వాల్మీకి మహత్యాలు అంటగట్టలేదన్నావుగా,మరి దీనికేం చెప్తావు అని నిలబెట్టి వుతికి ఆరేసే ప్రమాదం వుంది గనక దాని విశ్లేషణ కొంచెం క్లుప్తంగా చెప్పి ముగిస్తాను!

          కబంధుడి వర్ణన ఇలా వుంటుంది:తల లేదు,పొట్టలో నోరు,యోజన దూరం వరకూ చాపగలిగిన చేతులు?అంతరార్ధం లెక్క ప్రకారం ఇవన్నీ మనిషిలోని దురాశకి రూపచిత్రణలు!చంపగానే తేజస్సు రాముడిలో లీనమవ్వటం వెనక దుష్టగుణాల్ని వున్నతీకరించటం అనే సూచన వుంది.మామూలుగా మనకి దుష్టగుణాల్ని గురించి చెప్పే వారంతా నిగ్రహం,శమం,దమం గురించి మాత్రమే చెప్పారు గానీ వాటిని వున్నతీకరించటం అంటే యేమిటో యెవరూ చెప్పలేదు.ఈనాటి ఒక సైకో అనలిష్టు చెడు లక్షణాల్ని పోగొట్టుకోవటానికి, "మీ పక్కింటి కుర్రాడు మీ ఇంట్లో అల్లరి చేస్తున్నాడనుకోండి,యేమి చేస్తారు?వాడి తలిదండ్రుల్ని పిలిచే లోపు మీ ఇంట్లోని విలువైన వస్తువుల్లో దేన్నో ఒకదాన్ని పగల గొట్టనూ వచ్చు!ఒకటే దారి - వాడిని మెల్లగా మచ్చిక చేసుకుని ఆ కబురూ ఈ కబురూ చెబుతూ చల్లగా గుమ్మం దాటించి తలుపేసుకోవటం, ఇదంతా చాలా ఓర్పుగా నేర్పుగా చెయ్యాలే తప్ప పిల్లాడే గదాని తన్నేస్తే పగబట్టి వేధిస్తాడు?!" అని ఒక సరదా పిట్టకధ చెప్పాడు.వాల్మీకి సూచించిన దుష్టగుణాల్ని వున్నతీకరించటంలో వున్న ప్రాక్టికాలిటీ కూడా ఇదే!

          సీతాహరణం జరిగిన కాలాన్ని లెక్కిస్తే పట్టాభిషేకం తప్పిపోవటం లాగే దురదృష్టం మరోసారి విరుచుకు పడ్డట్టు అనిపించి యెలాంటివాడికయినా అలాంటివి పగవాడిక్కూడా జరగకూడదనిపించేటంత జాలి వేస్తుంది ఆ దంపతుల మీద!సీతాహరణం జరిగాక వెతుక్కుంటూ తిరిగి తిరిగి శబరి ద్వారా సుగ్రీవుణ్ణీ కలుసుకోవడానికి సుమారొక రెండు మాసాలు గడిచినట్టు చెప్తాడు,వాలివధ తర్వాత రాజ్యం రాగానే సుగ్రీవుడు కొన్ని రోజులు నిర్లక్ష్యం చేస్తాడు,లక్ష్మణుడి ధాటికి జడిసి అగ్గగ్గలాడుతూ వొచ్చిపడి వర్షాకాలంలో వెతకటం కష్టం అది కాగానే వెతకటం మొదలు పెడతానంటాడు,ఇదంతా జరిగి హనుమంతుల వారు చెట్టుకొమ్మల మీద నుంచి సీతా రావణ సంవాదం వింటున్నప్పుడు వాడు "ఒక మాసం లోపు నాకు లొంగకపోతే మరుసటి రోజున ప్రాతఃకాల భోజనం చేస్తాను నిన్ను?!" అంటాడు. రావణుడు సీతతో ఆ కారుకూత కూసిన నెల తిరిగే లోపు రణభూమిలో హతమారిపోయి తనే కాకులకీ గద్దలకీ ప్రేతభోజనమై పోయాడు!మాయ మొదట దుర్మార్గుడితో వాడి అంతాన్ని వాడి నోటితోనే చెప్పిస్తుంది యెదరున్న సజ్జనులకి చేస్తాననేటట్టు?అప్పుడు హరి రంగంలోకి దిగి వాడు యేదయితే యెదటివాళ్ళకి చేస్తానని విర్రవీగాడో వాడికి దానినే విధిగా చేసి చూపిస్తాడు - హరిమాయ?!అఖిలాండకోటిబ్రహ్మాండనాయకుడు సమయమెరిగి చేసే దుష్టశిక్షణ అట్లాగే వుంటుంది!,రావణ వధ జరిగాక వీళ్ళు పుష్పకం మీద వెళ్ళేనాటికి భరతుడు అగ్నిప్రవేశానికి సిధ్ధమై వున్నాడు - ఇవన్నీ యెంత వుజ్జాయింపుగా లెక్కేసినా పదమూడు సంవత్సరాల తర్వాతే జరిగి వుండొచ్చు ఆ దుర్ఘటన?!

        యెక్కడి అయోధ్య!యెక్కడి చిత్రకూటం!యెక్కడి రాజభవనం?యెక్కడి పర్ణశాల?మాంసం వొరుగులే పంచభక్ష్య పరమాన్నంగా తిన్నారు!అడివిలో మాత్రమే దొరికేవీ రాజభవనంలో దొరకనివీ అయిన ప్రతిదాన్నీ దాచి పెట్టుకోవటమే సీతకున్న వ్యాపకం! అయోధ్య వెళ్ళాక మిగిలిన ఆడవాళ్ళకి చూపించి "మేం ఇంత హాయిగా బతికాం తెలుసా!" అని గొప్పగా చెప్పుకుని వాళ్ళంతా కుళ్ళుకునేలా చెయ్యాలని ఆలోచిస్తున్న అతి సామాన్యత్వం సీతది!ఆ ఘటన జరక్కుండా వుండి ప్రశాంతంగా అయోధ్యకి తిరిగి వెళ్ళగలిగీతే కల్పవృక్షపు తరుచ్చాయల్లో గడిపినట్టుగా అనిపిస్తూ ఒక మధురానుభవంలా మిగిలిపోవలసిన వనవాసం శూర్పణఖ అనే కాముకురాలి రంగప్రవేశంతో విషవృక్షపు గంధక ధూమం విసిరికొట్టినట్టుగా అనిపిస్తూ గుర్తు చేసుకోవడానికే మనస్కరించనంతటి భయంకరమైన అనుభవంగా మారింది,యేమి నాటకీయ విషాదం?!

          ఈ శూర్పణఖ లంకాధిపతి అయిన రావణుడి చెల్లెలు!వాడు యెడాపెడా యుధ్ధాలు చేస్తూ ఆ హడావిడిలో దీని మొగుణ్ణి కూడా మట్టగించేస్తే ఇది పోయి నేను బతికేదెట్టా అని గగ్గోలు పెడితే పోయి దండకారణ్యాన్ని యేలుకో మంటే పుట్టింటోళ్ళూ తరిమేశారూ కట్టుకున్నోడూ ఖతమైపోయాడూ అని పాడుకుంటూ ఖుషీ ఖుషీగా బతికేస్తున్నది మహాజనానికి మరదలు పిల్లలాగ! సీత ఖర్మ కాలి దీనికి రాముడు నచ్చాడు?వింత వింత మేకప్పు లేసుకుని తక్కుతూ తారుతూ వొచ్చి రాముణ్ణి అడిగేసింది తన కోరిక తీర్చమని!మొత్తం కధలో యెవరితోనూ హాస్యాలాడని గంభీర మూర్తి రాముడు దీనిమీద జోకు లెయ్యడం చూస్తే ఆ ఆడమనిషి యెంత చవకబారుదో అర్ధం చేసుకోవచ్చు!పెళ్ళి చేసుకుని సాధికారిక శృంగారంతో పరస్పరం ఆనందించాలనే ఔన్నత్యపు కోరిక కూడా కాదు కేవలం నరాల వేడి చల్లబరుచుకోవాలనే పశుకామపు సరదా?అన్నా చెల్లెళ్ళిద్దరిదీ భలే జారత్వపు జాతం - చెల్లెలు పరాయి మొగోడ్ని మోహిస్తే అన్న పక్కోడి పెళ్ళాన్ని ఆశించాడు!వీళ్ళిద్దర్నీ గౌరవనీయులుగా నిలబెట్టి రాముడు శూర్పణఖని చూసి చొల్లు కార్చుకున్నాడనీ సీత రావణుణ్ణి లోలోపల ఇష్టపడిందనీ ఆ పాతివ్రత్యమూ ఈ యేకపత్నీవ్రతమూ జనంలో మెప్పుకోసం చేసిన నటననే విధంగా మసిపూసి మారేడుకాయ చేసి వెక్కిరించాలని చూసిన వాళ్ళు అన్నింటినీ యదార్ధాల ప్రాతిపదిక మీద విశ్లేషించాలని చెప్పే ఘనమైన కమ్యునిష్టు తాత్విక చింతన ప్రకారం చూసినా నిజంగా గౌరవనీయులేనా?

        దాని తింగరితనానికి రాముడు నవ్వేసి "అమ్మాయీ!నేను పెళ్లయిన వాణ్ణి.నాకిలాంటి వాటి మీద వ్యామోహం లేదు. పెళ్ళి చేసుకున్నా సవతి పోరు వుంటుంది. మా తమ్ముడున్నాడు,నాకన్నా అందగాడు" అని లక్ష్మణుడి కేసి పంపించాడు.నిజమే గదా నల్లోడి కన్నా ఎర్రోడు మాంచి షోగ్గా వున్నాడనుకుని లక్ష్మణుడి దగ్గిర కెళ్తే "చూశావుగా!తమ్ముణ్ణని కూడా చూడకుండా కులుకుతూ నాతో పన్లన్నీ చేయించుకుంటున్నాడు!నాపక్కన జేరితే నీకూ ఈ చాకిరి తప్పదుగా!యెందుకొచ్చిన గోల చెప్పు?!" అని తనూ నవ్వాడు.దాంతో ఈ యెగతాళి అర్ధమయి కోపమొచ్చింది, ఇంతలో సీతని చూసింది, అన్ని సింగారాలతో వున్న తనకన్నా నారచీరల్తోనే సీత అందంగా యెందుకుందనేది ఆలోచించకుండా అందంగా వున్న ఆడది పెళ్ళాంగా వుండటం వల్లనే నన్ను కాదంటున్నాడు అనే రీజనింగు తీసుకుని సీతని చంపడానికి బయల్దేరింది?!అది సీతని చేరే లోపు  అప్పటిదాకా ఆడదనే భావంతోనే తిట్టడం దేనికిలే అని అలా హాస్యాలకి దిగిన రాముడు తమ్ముణ్ణి హెచ్చరించటం కోపమొస్తే ముందూ వెనకా చూడకుండా కాటువేసే పాములాగా లక్ష్మణుడు కన్నుమూసి తెరిచేలోగా దాని ముక్కూ చెవులూ కోసెయ్యడం జరిగిపోయింది!గాయాలకి కట్టు కట్టుకుందో లేదో వాల్మీకి చెప్పలేదు గాబట్టి ఆ రూపంతోనే పోయి ఖరధూషణుల్ని వుసిగొలిపింది.వీళ్ళు 14,000 మంది సైన్యంతో వచ్చిపడినా ఒకే ఒక్క కోదండంతో రాముడు పాస్పోర్టు లడక్కుండా వొచ్చినవాళ్ళందరికీ ఎంట్రీ ఇచ్చే యమసదనానికి పంపించటంతో ఇంకా మొండిగా అదే వూపుతో పెద్దన్న రావణుడి దగ్గిరికి పోయి పడింది!సీత అందం గురించి వర్ణించి చెప్పి యెత్తుకొచ్చి పండగ జేస్కోమని నీచపు సలహా ఇచ్చింది, యేమి ఆడతనం దానిది?తను చెడింది గాక తన చెత్తకోరిక తీరడానికి అడ్డంగా వున్నదని మరొక ఆడదాన్ని చెడగొట్టాలనుకునే ఆడదాన్ని యేమని పిలవాలి?ఆ ఆడదాన్ని మంచిదని కధలు చెప్పి సమర్ధించిన మరో ఆడదాన్ని యేమని పిలవాలి?

          ఆ చెల్లికి అన్న గదా!పెళ్ళయితేనేం,పిల్లయితేనేం,తల్లయితేనేం,పండు ముసిల్దైతేనేం అనుకునే ఇవ్వాళ్టి కక్కుర్తిగాళ్లకి మూలపురుషుడు గదా! వీడు పోయి మారీచుడి ముందు పెట్టాడు ఒక మాస్టర్ ప్లాను?ప్లాను సంగతి తర్వాత రాముడి పేరు వినగానే వాడు కంగారు పడ్డాడు?!చిన్నప్పుడు విశ్వామిత్రుడికి సహాయంగా వెళ్ళిన చోట అల్లరి చేస్తున్న మారీచ సుబాహులనే వాళ్లలో వీడూ ఒకడు.సుబాహుణ్ణి ఆగ్నేయాస్త్రంతో కొడితే వాడు బూడిదై పోయాడు!ఒకే అస్త్రం రెంసార్లు వాకూదు గనక వీణ్ణి వాయువ్యాస్త్రంతో కొడితే చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి "కొట్టిందెవరో తెలీదు గానీ లేపింది మాత్రం నన్నే" అన్నట్టు అక్క కొడితే ఇక్కడ కొచ్చి పడ్డాడు వీడు!ఆ దెబ్బకి రాక్షసత్వం వొదిలేసి కందమూలాలు తింటూ తపస్సులో మునిగి వున్నాడిప్పుడు?వయస్సులో రావణుడి కన్నా పెద్దవాడయ్యుంటాడు - ముక్కచివాట్లేశాడు!"యెప్పుడో కొట్టిన దెబ్బకి ఇప్పటికీ చుక్కలు కనిపిస్తున్నయి నాకు,రాముడు అనే పూర్తిపేరు గాదు ర అనే అక్షరం వినపడ్డా వులిక్కిపడి చస్తున్నాను,నీకీ యెదవ సలహా యెవడిచ్చాడో గానీ లంకకి చేటు తెచ్చినట్టే,మర్యాదగా వెనక్కి వెళ్తే క్షేమంగా వుంటావు" అని యెంత చెప్పినా "ఎహే,అసలు యెత్తుకొచ్చింది నేనని తెలియదు గదా నేనేసిన ప్లాను ప్రకారం - నామాట వింటావా నాచేతులో చస్తావా?" అనేసరికి మారీచుడు "నీలాంటి పాపిష్టోడి చేతుల్లో చావడం కన్నా ఆలాంటి పుణ్యాత్ముడి చేతుల్లో చావడమే బెస్టు!" అని విసుక్కుంటూ వొప్పుకున్నాడు.హ్యారీపోటరు కధల్లో మాదిరి ఈ మారీచుడికి జంతువుగా మారే శక్తి వున్నట్టూ ధ్వన్యనుకరణ కూడా తెలిసినట్టూ కల్పించాడు వాల్మీకి!రావణుడి ప్లాను మారీచుడు కాంచనమృగం లాగ మారి రామలక్ష్మణుల్ని దూరంగా తీసుకెళ్తే తను ఒంటరిగా వున్న సీతని మళ్ళీ రామలక్ష్మణులు తిరిగొచ్చే లోపు తన ఆనవాళ్ళు కూడా తెలియకుండా యెత్తుకు పోవాలని.మరీచిక అంటే యెండమావి!కాంచనమృగం అంటే బంగారు లేడి!అన్ని కాలాల్లోనూ కొందరు ఆడవాళ్ళు మిగతావాళ్ళ కన్నా గొప్పగా కనబడాలని యెక్కువ బంగారం కోసం భర్తల్ని యెండమావుల వెంట పరిగెత్తిస్తూ ఆ ప్రయత్నాలు బెడిసికొట్టి అనంతవిషాదాన్ని మూటగట్టుకోవటం చూస్తుంటే వాల్మీకి యెంత రియాలిటీని చూపిస్తున్నట్టు?!

          సీతకి ఇక్కడివన్నీ పోగేసుకుని అయోధ్యకి తీసుకుపోవాలనే అమాయకపు ముచ్చట వుండటం రావణుడికి కలిసొచ్చింది!లక్ష్మణుడు రోజూ అడివంతా కలయదిరిగేవాడు గనక ఇప్పటి దాకా కనబడనిది ఇప్పుడెలా వచ్చింది రాక్షస మాయ కావచ్చునన్నా భార్య గారాబంగా అడిగితే వుబ్బులింగడై యెంత కష్టమయినా తీర్చాలనుకునే మామూలు భర్త మనస్తత్వంతో మర్మమయితే చేదించి వస్తాన్లే నువ్వు మాత్రం సీతని వదిలి పోవద్దు అని చెప్పి రాముడొక్కడే వెళ్ళాడు?మరి లక్ష్మణుణ్ణి దూరంగా పంపించాలి గదా!విసుక్కుంటూ వెళ్ళినా క్రియేటివిటీ వున్నవాడు గాబట్టి దానికి ఠస్సా మారీచుడు వేశాడు - చస్తూ చస్తూ రాముడి గొంతుతో ఆర్తనాదాలు చేశాడు.కాలం కలిసిరాకపోతే తాడే పామై కరుస్తుందన్నట్టు రాముడు వీరాధివీరుడని తెలిసినా సీత భయపడి పోయి లక్ష్మణుణ్ణి సాయంగా వెళ్ళమని తొందర పెట్టింది.ఒక్కరోజులో రాజరికం కాస్తా వనవాసానికి దారి తీసినట్టు అనుకోనిది యేదయినా జరిగిందేమోననే ఆలోచన విచక్షణని కోల్పోయేలా చేసి వుండొచ్చు వెళ్ళనని మొండికేస్తున్న లక్ష్మణుణ్ణి అనకూడని మాట అనేసింది "మీ అన్నగారు పోతే నన్ను పెళ్ళాడదామని చూస్తున్నావు" అని?!వెళ్ళేందుకు ఒప్పించటానికే అన్నా లక్ష్మణుణ్ణి అస్సలు అనకూడని మాట గదా అది?తనంటే భార్య గాబట్టి తోడుగా వచ్చింది,లక్ష్మణుడికేం ఖర్మ వీళ్ళతో వచ్చి వీళ్ళకి పనివాడిగా వుండటానికి!రావణుడు తనని యెత్తుకెళ్తూ జటాయువుతో యుధ్ధం చేసే హడావిడిలో వున్నప్పుడు తను విసిరిన నగల మూటని ఆంజనేయ భగవాన్లు దాచి వుంచి రామలక్ష్మణులకి చూపిస్తే రాముడు దుఃఖంతో కళ్ళు మసకలు గమ్ముతున్నాయి నువ్వు చూడమన్నప్పుదు బయటి కెళ్ళేటప్పుడు నమస్కరించి వెళ్ళేవాణ్ణి గాబట్టి కాలి అందెల్ని తప్ప మిగిలినవాట్ని నేనూ గుర్తు పట్టలేనంటాడు!అట్లాంటి లక్ష్మణుణ్ణి అంతమాట యెట్లా అనగలిగింది!ఒకదాని మీద వ్యామోహం యెక్కువగా వుండి అది దూరమవుతుందేమోనన్న భయం గనక కలిగితే మనిషి యెంత చిత్రంగానైనా ప్రవర్తిస్తాడు!సరిగ్గా ఈ పాఠాన్నే తనకప్పటికి తెలిసొచ్చిందన్నట్టు అశోకవనంలో మెడకురి బిగించుకోబోయిన సన్నివేశంలో సీత నోటి నుంచే చెప్పిస్తాడు వాల్మీకి.

          అలా లక్ష్మణుడు కూడా దూరం వెళ్ళాక సాధువు వేషంలో వచ్చి భిక్షమడిగి దగ్గిరగా వచ్చాక మొదలు పెట్టాడు దాడి!యెంత పెనగులాడినా యేమి లాభం?దణ్ణాలు పెట్టినా జాలిపడ్డం లేదే ఇవ్వాళ్టి రేపిష్టులు!వీళ్ళు చేసేవన్నీ వాడూ చేశాడు, చెట్టుని కావిలించుకుంటే జుట్టుపట్టి లాగి నెప్పి భరించలేక చేతుల పట్టు వొదిలేసి ఆ వూపుకి కిందపడేలా చెయ్యడం నుంచి నడుం మీదా పిరుదుల మీదా పిడికిళ్ళతో వుడుం పట్టు పట్టి యెత్తి రధంలో కూలవెయ్యడం వరకూ కామం కళ్ళకి పొరలు గమ్మిన మదాంధుడు అసహాయురాలైన స్త్రీమీద యెంత భయంకరంగా దాడి చెయ్యగలడో అంత భయంకరంగా జరిగిన భీభత్స కాండతో రెచ్చిపోయిన రావణుడు, స్త్రీత్వం పట్ల గౌరవం వున్నవాడెవడయినా అసహ్యించుకోదగిన రావణుడు - శీఘ్రస్ఖలనాలతో తడిసిపోవటానికి తప్ప మరెందుకూ పనికిరాని చెత్త సాహిత్యాన్ని సృష్టించిన గుడిపాటి వెంకట చలం అనే గొప్ప రచయితకి సీతని అపురూపంగా ప్రేమించిన ఆదర్శ ప్రేమికుడిలా కనపడ్డాడు, అమ్మతోడు -  నిజం?!

          గుర్రాల స్థానంలో గాడిదలు వున్న రధం మీద వొచ్చి తనకున్న అతీంద్రియశక్తులతో రధంతో సహా గాలిలో ప్రయాణిస్తూ మధ్యలో అడ్డుకోబోయిన జటాయువుని రెక్కలు నరికి తప్పించుకుని తిన్నగా తన లంకా నగర రాజ్యానికే తీసుకుపోయి తనకున్న అతి గొప్ప భవనాలన్నిట్నీ తిప్పి చూపించినా వాటిల్లో చచ్చినా వుండనని చెప్పటంతో తనకే విసుగు పుట్టి అశోకవనంలో వుంచాడు.స్త్రీ తనంతట తను వరించి వస్తేనే మజా వుంటుందని తెలుసు గనక నన్ను వరించి సుఖపెట్టమని ఒత్తిడి చెయ్యటమే తప్ప యెట్లాగయినా అనుభవించి పారేద్దామని అనుకోకపోవడం వల్ల ఇవ్వాళ్టి కక్కుర్తివెధవల కన్నా వున్నతుడే!ఇక్కడ రామలక్ష్మణులు సీత కోసం గాలిస్తూ ఉంటే మొదటి అదృష్టం శబరి రూపంలో కనపడింది!శబరి కర్రపోటేసుకుని వొణుక్కుంటూ వొచ్చి యెంగిలి పళ్ళు తినిపించిన పండుమసలి కాదు దివ్యతేజస్సుతో వెలిగిపోతూ పద్మాసనస్థయై రామలక్ష్మణులకి సుగ్రీవుడి గురించి చెప్పి అతని దగ్గిర మంత్రిగా వున్న హనుమంతుడనే కార్యసాధకుడున్నాడు అతనివల్ల మీకార్యం తప్పక నెరవేరుతుందని ధైర్యం చెప్పి చూస్తుంగానే యోగాగ్నిలో దగ్ధమైపోగలిగిన మహాయోగిని!అక్కణ్ణుంచి మళ్ళీ సుగ్రీవుడి కోసం ఋష్యమూక పర్వతం వైపుకి బయల్దేరినప్పుడు మొట్టమొదటిసారిగా అంతరార్ధం ప్రకారం ఆచార్య స్థానంలో కనబడే శ్రీ మదాంజనేయ గురువరేణ్యుడు "మా భయ!మా సంవిక్త!" అంటూ కధలోకి ప్రవేశిస్తాడు.

          అలా ప్రవేశించిన సుగ్రీవసచివుడు వారిద్దరికీ సఖ్యత నేర్పరచి రాముడు వాలిని చంపి సుగ్రీవుణ్ణి రాజుని చేస్తే సుగ్రీవుడు రామకార్యాన్ని నెరవేర్చే విధంగా వుభయతారకమైన వ్యూహం సిధ్ధం చేశాడు!ఇక్కడ మళ్ళీ నగల మూట కనబడటం మరో గొప్ప క్లూ!ఆ నగల మూట వల్లనే ఆమె సీతయేనని తెలిసింది గనక అందరికీ పని తేలికైంది,లేకపోతే ఇంత కధా నడిచాక ఆ స్త్రీ సీత కాదు రావణుడు అలవాటుగా యెత్తుకొచ్చే ఆడవాళ్ళలో మరొకరు అని తెలిస్తే?మళ్ళీ సీతకోసం వెతుకులాట మొదటి కొచ్చినట్టే గదా!ఇవ్వాళ్టి వాలి ఫ్యాన్స్ అసోసియేషను వాళ్ళు మా హీరో వాలిని చెట్టుచాటు నుంచి చంపిన విలన్ మీ రాముడు అని ప్రతి శ్రీరామనవమికీ నల్లబ్యాడ్జీల వూరేగింపు చేస్తారు గానీ వాస్తవంగా ధనుష్ఠంకారం చేసుకుంటూ బయటి కొచ్చి యుధ్ధం ఆపేసి చూస్తున్న వాణ్ణి యెదుర్రొమ్ము మీదకి అమ్ము వేసి చంపాడు!కొందరు వాలిగాడికి యెదటివాళ్ళ బలాన్ని లాక్కునే శక్తి వుందనే కల్పన ఒకటి ప్రచారంలోకి తెచ్చారు గానీ అలాంటి పిచ్చి వూహలు వాల్మీకి మహాశయుడికి రాలేదు.ఈ మట్ట్టిబుర్రలకి తట్టని డౌట్లు గూడా అడిగాడు.మీరు కోతిమాంసం తినరు గదా నన్నెందుకు చంపావు అని యెటకారాలు గూడా వాగాడు."నువ్వే నాతో యుధ్ధం చేసి చంపొచ్చు గదా అంటున్నావు నువ్వూ నేనూ సమ వుజ్జీలం కాదు,తమ్ముడేమి చెప్తున్నాడో వినకుండా నీకు నువ్వే వూహించుకున్న కారణాలతో అమాయకుణ్ణి వేధించటమూ వావి వరుసలు మర్చిపోయి తమ్ముడి భార్యని వరించినందుకు నిన్ను శిక్షించడమే నా లక్ష్యం తప్ప నీతో యుధ్ధం చేసి నిన్ను గెలవాల్సిన అవసరం నాకు లేదు.నన్ను కలిస్తే రావణుడితో మాట్లాడి నా భార్యని అప్పగించేవాణ్ణిగా అంటున్నావు నీలాంటి వాడి నుంచి నేను సహాయం తీసుకోను - అది నా ధర్మానికి విరుధ్ధం.ఇది మా వానర రాజ్యానికీ అన్నదమ్ములకీ సంబంధించిన సొంత విషయం కదా నీకేం హక్కుంది కలగజేసుకోవటానికి అంటున్నావు,అట్లా కుదరదు.నా చేత కోదండ ముంది,యేది ధర్మమో యేది అధర్మమో తెలుసు. ధర్మం తెలిసిన శక్తిమంతుడికి అధర్మపరుల్ని నిగ్రహించడానికీ ధర్మాన్ని స్థాపించడానికీ స్థలకాలాలు వుండవు!" అని అన్ని ధర్మసూక్ష్మాలూ వివరించి చెబితే నోర్మూసుకుని కన్నుమూశాడు!?ఒక్క వాలి తప్ప రామ బాణం తగిలిన వాళ్ళంతా మంచినీళ్ళక్కుండా చచ్చారు,బహుశా ఈ వాలి ఫ్యాన్సు అసోసియేషను వాళ్ళకి జవాబులు చెప్పించటం కోసమే వాల్మీకి వాలికి ఆ ప్రత్యేకతని కట్టబెట్టాడేమో?!

        వాలివధ అనంతరం సుగ్రీవ పట్టాభిషేకం తర్వాత వర్షర్తువు ముగిశాక మళ్ళీ అందరూ కలిశారు.జటాయువు చెప్పిన దాని ప్రకారం లంక వైపుకే వెళ్ళినా రావణుడు ప్రపంచంలో అన్ని రాజ్యాల్నీ ఓడించిన వాడు గాబట్టి యెక్కడైనా దాచవచ్చు సీతని.అందుకని ముఖ్యులైన జాంబవంతుడూ హనుమంతుడూ అంగదుడూ లాంటి వాళ్లని లంకానగరం వైపుకి పంపించి మిగతావాళ్ళని కూడా అన్నిదిక్కులకీ పంపించాడు సుగ్రీవుడు. లంక వైపు వెళ్ళిన వాళ్ళలో వున్న హనుమంతుడు శతయోజన విస్తీర్ణమైన సాగరాన్ని లంఘించి దాటి లంకని చేరాడు.అశోకవనంలో సీతని చూశాడు.ఆమెకి చెప్పాల్సిన విధంగా ధైర్యం చెప్పి ఆనవాలు కూడా తీసుకున్నాడు.పుల్లయ్య వేమవరం వెళ్ళనూ వెళ్ళాడు రానూ వచ్చాడు గానీ యెందుకెళ్ళావురా అంటే మాత్రం రాత్రి మీరు రేప్పొద్దున్న పుల్లయ్యని వేమవరం వెళ్ళిరమ్మనాలి అనుకోవడం విన్నాను గాబట్టి వెళ్ళాను వచ్చాను అన్నట్టు హనుమంతుడు కూడా చూసిరమ్మన్నారు గాబట్టి చూసొచ్చాను అంతకి మించి నన్నడక్కండి అంటే దద్దమ్మకి దద్దమ్మ మేధావిలా కనబడినట్టు ముప్పాళ రంగనాయకమ్మకి తెలివిగా కనబడి వుండేదేమో గానీ హనుమంతుడికి మాత్రం వెంటనే ఇక్కణ్ణుంచి దాటుకుని వెళ్ళవడం కన్నా ఇక్కడ తను చెయ్యాల్సింది ఇంకొంచెం వుందనిపించింది - అది యెంత తెలివైన పనో నేను చెప్తాను వినండి! వీళ్ళు తనకేదో హాని చేస్తారనే భయం లేదు, రావణుణ్ణి కలవాలి, వాడి బలమేంటో తెల్సుకోవాలి, కలిసి మాట్లాడాలి, నయానో భయానో మనవైపు నుంచి మనం కూడా ఒక మాట చెప్పి చూడాలి గదా, మనం చెప్పే మాట గట్టిగా చెప్పగలిగితే వాడు మాటల్తోనే లొంగివస్తే ఇక్కడికిక్కడే నూరుశాతం పని పూర్తయిపోయినట్టు గదా, పుల్లయ్య లాగా వెళ్ళాను చూశాను వచ్చాను అని చెప్తే అప్పుడైనా మళ్ళీ యెవడో ఒకడు ఇంతదూరం మళ్ళీ దూతగా రావాల్సిందే గదా - ఇవ్వన్నీ ఆలోచించిన లంకా భయంకరుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి తనకి తనే పట్టుబడి మొత్తానికి రావణుడి ముందు కెళ్ళాడు!ఈ అశోకవనాన్ని ధ్వంసం చెయ్యడం తర్వాత లంక మొత్తం తగలబడినా సీత క్షేమంగా వుండటానికి పనికొచ్చింది?!


(గూగులమ్మ కానుక)

         చాలా వాదన జరిగింది ఇద్దరి మధ్యా."ప్రస్తుతం నీ అధీనంలో నీకు లొంగివున్న ఆడవాళ్ళంతా నువ్వు యుధ్ధాల్లో గెలుచుకొచ్చిన వాళ్ళూ నీ వైభవాన్ని చూసి మోహపడి వరించిన వాళ్ళూ, ఇప్పుడు నువ్వు చేసింది మాత్రం పాపమే!" అని పావని అంటే "నేను శివుడి ఆత్మలింగాన్ని సాధించిన శివభక్తుణ్ణి, యెన్నో పుణ్యకార్యాలు చేశాను ఒక్క సీతాపహరణం అనే పాపం నన్నేమి చేస్తుంది?" అన్నాడు రావణుడు.చాలా గొప్ప సమర్ధన ఇది!ఇప్పుడు మనం కూడా ఇలా మాట్లాడే వాళ్లనీ పైకి అనకపోయినా మనసులో ఇలాంటి ఆలోచన తోనే పది పాపాలు చేసి యేదో ఒక గుడికి యేవరో ఒక దేవుడికి ఒక కైంకర్యం చేయించో ఒక కానుక ఇచ్చో దేవుణ్ణ్ణి కూడా తమ పాపాలకి పార్ట్నర్ని చేసేశాం గనక మనం బేఫికరుగా వుండొచ్చుననుకునే వాళ్లని చూస్తూనే వున్నాము గదా!అదీ వాల్మీకి రామాయణం యొక్క సార్వకాలిక లక్షణం,అందువల్లనే ఇంతకాలం నిలబడింది, ఇకముందు కూడా నిలబడుతుంది!ఆ పొగరుకి విరుగుడుగా "నిజమే, నువ్వు పుణ్యాలు చెశావు.దాని ఫలితం మీద నీకు నమ్మక ముంది.కానీ పాపానికి కూడా ఫలితం వుంటుంది గదా!దాన్ని కూడా అనుభవించాల్సిందే గదా?సీతని వదలకపోతే నీ పుణ్యానికి సరిపడా వైభవం పూర్తయిపోతుంది.రెండోది దాని పని మొదలు పెడుతుంది - ఆలోచించుకో" అని వాడు పట్టించుకోవడాని కిష్టపడని అసలు పాయింటు చెప్పాడు.దుర్మార్గుడికి వాడిని కార్నర్ చేస్తున్నట్టు కనిపించే నీతుల్ని చెప్తే ఇంకా రెచ్చిపోతాడు!మంచి చెప్పిన వాడు తన కోరికని తీర్చుకోవడాని కడ్డమొచ్చే దుర్మార్గుడిలా కనబడతాడు?మొదట వీణ్ణి సంహరించెయ్యమన్నాడు, విభీషణుడు ఆపి దూతని చంపగూడదు యేదో ఒకటి చెయ్యల్సిందే ననుకుంటే అవమానించి పంపించెయ్యవచ్చు అని ధర్మసూక్ష్మం వివరిస్తే తోక కాల్చి వదల మన్నాడు.ఈ బుధ్ధిమంతుడు దాంతో లంకనంతా కాల్చి సముద్రంలో ముంచి చల్లార్చుకుని మరోసారి సీతని చూసి వీడ్కోలు చెప్పి వచ్చేశాడు. హనుమంతుడి ద్వారా విషయమంతా తెలుసుకుని ఇక యుధ్ధమే శరణ్యమని సైన్యసమేతంగా మళ్ళీ లంకనగరం చేరారు అందరూ. కాల్చడానికి లంక మొత్తం తిరిగాడు గాబట్టి రావణుడి బలాబలాలు కూడా తెలుకోగలిగి వుండటంతో సైన్యసంచాలనానికీ వ్యూహనిర్మాణానికీ పూర్తిగా ఆంజనేయుడి మీదనే ఆధార పడ్డాడు రాముడు. అయోధ్యలో జరిగిన కధకి "అయోధ్య కాండ" అనీ దండకారణ్యంలో జరిగిన  కధకి "అరణ్య కాండ" అనీ కిష్కింధలో జరిగిన కధకి "కిష్కింధ కాండ" అనీపేరు పెట్టిన వాల్మీకి వాలి వధ అనంతరం జరిగిన ఈ మొత్తం కధ వున్న భాగానికి "సుందర కాండ" అని పేరు పెట్టాడు,యెందుకని?.వరస ప్రకారం "లంకా కాండ" అని పెట్టాలి, అవునా!అన్నిటికీ మూస పధ్ధతిలో పోవడానికి వాల్మీకి అట్టాంటిట్టాంటి రొడ్డకొట్టుడు రచయిత కాదు,"పుంసాం మోహన రూపాయ" అని చెబ్బబడే మగవాళ్లలోకల్లా అందగాడూ "సీతే జగత్సుందరీ" అని చెబ్బబడే ఆవాళ్లలోకల్లా అందగత్తె తమ స్వభావంలో వున్న ప్రత్యేకతల్ని చూపిస్తారు!వీళ్ళిద్దరికీ సుందర నామధేయుడైన హనుమంతుడు ఒకరి క్షేమాన్ని మరొకరికి చెప్పి ఆనందం కలిగిస్తాడు,ఆ విశేషాన్ని సూచించడానికే అట్లా చేశాడు.చదివే వాళ్ళకి కూడా దీన్ని మీరు ఇంకొంచెం శ్రధ్ధగా చదవాలి అనే హెచ్చరిక వుంది అందులో?!

          సకల దేవతా గణాలూ ఆకాశాన చేరి ఇప్పటికయినా రావణపీ వొదుల్తుందనే ఆశతో ధైర్యంగా రాముడికి సహాయాలు కూడా అందించగా, అరిషడ్వర్గాలని జయించిన దేవర్షి సంఘాలలో కూడా యెవరు గెలుస్తారో ననే వుత్సుకతా లోపల్లోపల రాముడే గెలవాలనే మోహం పుట్టగా వారు జపతపాల సంగతి కూడా మర్చిపోయి వుద్విగ్నంగా చూస్తూ వుండగానే కేవలం పక్షం రోజుల్లో అంతవరకూ యెవ్వరికీ జయింపశక్యంగాని రావణుడు రాముడు వేసిన బాణాల రూపంలో వచ్చిపడిన తన పాపాల ధాటికి హతమారి పోయి కాలీకాలనికాష్ఠంగా మిగిలిపోయా డిప్పటికీ కాల్తూనే వున్నాడు?!

          రావణ సంహారం జరిగిపోయింది!విభీషణుడు రాజయ్యాడు!తన పట్టాభిషేకం జరిగేటప్పుదు రాముడు వుంటే బాగుంటుందని విణీషణుడు అడిగితే పురప్రవేశం నాకు నిషిధ్ధం నా బదులుగా లక్ష్మణుడు వస్తాడని సున్నితంగా తిరస్కరించి నియమ పాలనకే కట్టుబడ్డ సత్యవిక్రముడు రాముడు!అయోధ్యకి చేరుకోవడానికి సమయం తక్కువగా వుంది గనక విభీషణుడు పుష్పక విమానంతో సిధ్ధమయ్యాడు.ఇక రావలసినది సీత!అంతటి అపురూపమైన స్త్రీని అప్పటిదాకా చూడని వాళ్లంతా ఆమెని చూడాలని మీదకి తోసుకొస్తుంటే వెనక్కి తోస్తున్న వాళ్ళని యెవరూ వూహంచని విధంగా అలా చెయ్యవద్దని గద్దించాడు రాముడు?అతని వాలకం కూడా వింతగా వుంది!అంతకాలం దూరంగా వున్న భార్య దగ్గిర కొస్తున్నదనే సంతోషం లేదు,మొహం గంటు పెట్టుకుని వున్నాడెందుకో?పలికిన మాటలూ వినపడిన గొంతూ మాటల్లోని భావమూ అన్నీ పరుషంగా వున్నాయి - అందరూ చేష్టలుడిగి చూస్తున్నారు!దగ్గిరకొచ్చి నిలబడిన సీతతో అతడు మాట్లాడినవి చాలా తక్కువ మాటలు. - "అపహరించబడిన భార్యని తిరిగి సాధించుకోలేని అసమర్ధుడు రాముడు అనే చెడ్దపేరుని భరించలేకనే కేవలం వంశప్రతిష్ఠ కోసమే రావణుడితో యుధ్ధం చేసి అతని చెరనుంచి నిన్ను విడిపించాను కానీ నీమీద మోహంతో కాదు.నిన్ను నేను స్వీకరించను.ఇక్కడ జాంబవంతు డున్నాడు,సుగ్రీవు డున్నాడు,లక్ష్మణు డున్నాడు.వీరిలో యెవరినైనా నువ్వు చేపట్టవచ్చు" అని ముఖం పక్కకి తిప్పుకుని మాట్లాడకుండా వుండిపోయాడు!రామాయణంలో అత్యంత వివాదాస్పదమయిన సన్నివేశం ఇదే.రాముడి మాల్లో వున్న కాఠిన్యం తప్పులు పట్తేవాళ్లకి చాలా హుషారు ఇచ్చింది.రాముడే పరీక్ష పెట్టి అందులో నెగ్గితేనే నిన్ను స్వీకరిస్తానని అన్నట్టుగా ఈ సన్నివేశానికి కూడా "అగ్ని పరీక్ష" అని పేరు తగిలించి రాముడు మొత్తం స్త్రీజాతినే అవమానించిన పురుషాదిక్య సమాజానికి ప్రతినిధిగా ముద్రవెయ్యడానికి పనికొచ్చిన సన్నివేశ మిది!అప్పటి వరకూ అన్ని విశేషణాలతో తను ఆదర్శవంతుడని పొగిడిన రాముడి చేత అంతగానూ పొగిడి లోకంలో ఆదర్శవనితగా నిలబెట్టాలని చూసిన సీతని అవమానించాలనే దుర్బుధ్ధిని వాల్మీకి రాముడి కెందుకు అంటగడతాదనే సందేహం కూడా రాలేదు వాళ్ళకి?!అప్పుడెప్పుడో సీత లక్ష్మణుణ్ణి అన్న మాటలకి ఇప్పుడు సీతకి కౌంటర్ ఇచ్చాడు రాముడు!

          లిస్టులో లక్ష్మణుడి పేరు కూడా వుండటంతో ఆ కౌంటర్ సీతకి వెంటనే అర్ధమయింది!దాంతోపాటు మరొక విషయం కూడా అర్ధమయింది?. సరిగ్గా ఇరవై నానుగు వేల శ్లోకాలలో వెయ్యి శ్లోకాల కొకచోట మొదటి అక్షరంగా గాయత్రి మంత్రంలోని అక్షరాల్ని నింపి లెక్కప్రకారం కధ చెప్పిన వాల్మెకి రాముడికీ లెక్క ప్రకారం మాట్లాడే అలవాటు పెట్టాడు.ఒకటే మాట!తను అంత ఖచ్చితంగా తెగేసి చెప్పాక బతిమిలాడినా ప్రయోజనం లేదని తెలిసి తన ఆభిజాత్యం నిలుపుకోవడానికి ఆత్మాహుతి చేసుకోవాలని నిర్ణయించుకుంది! అగ్గిలో దూకి మొగ్గలాగా వచ్చిన తర్వాత కూడా రాముడు మాత్రం కరగలేదు,ఆఖరికి దివ్యదేహంతో వున్న దశరధుడు కోడలి మీద వాత్సల్యంతో ఇంటికోడలికి అన్యాయం జరగడం వంశాన్ని కాల్చేస్తుందని యెంతగానో నచ్చజెప్పాక మాట తిప్పుకున్నాడు.నిజానికి ఈ సన్నివేశం ఇక్కడ వుండకపోయినా కధకి పెద్ద లోపం వుండదు అప్పటికే రాముడి మూలంగా ధర్మతత్వ నిరూపణ చేసి చూపించిన అంశాలు చాలా యెక్కువగానే వున్నాయి.కానీ ఈ సన్నివేశంలో నిక్షేపించిన అంతరార్ధం గురించి తెలుసుకుంటే గానీ దీని ప్రాముఖ్యత తెలియదు!రాముడనే ఒక యోగసాధకుడు మొదట తన ఓంకార సాధనతో సీత అనే భగవత్స్వరూపంతో సంస్పర్శన సుఖాన్ని పొందినా ప్రకృతిలోని మార్మిక సౌందర్యానికి విస్మితుడైన సందర్భంలో మాయ ప్రభావంతో పంచేంద్రియాలు పంచవికారాలు విజ్రంభించగా దానికి దూరమై ఆంజనేయుడనే ఒక ఆచార్యుడి సాయంతో తిరిగి సాధించి దైవాన్ని తన మనసులో సుస్థిరంగా ప్రతిష్ఠించుకోవటం అనే అంతర్గత యోగప్రయాణమే రామకధ?!రెండవసారి సాధించినప్పుడు ఆ అధికారాన్ని నిరూపించుకోవడమనే చిత్రమైన సన్నివేశానికి బాహ్యరూపమే సీత అగ్నిప్రవేశ ఘట్టం!అన్నమయ్య బాలుణ్ణి చేసి జోలపాడినా రామదాసు యెవడబ్బ సొమ్మని కులుకుతు తిరిగేవు అన్నా వారు ప్రదర్శిస్తున్నది అలాంటి అధికారమే!భక్తుడు భగవంతుడి మీద ధాష్టీకం చెయ్యడం భగవంతుడు అతని ముందు తలవంచడం అనే యోగశాస్త్ర రహస్యాన్ని అక్కడ రాముడూ సీతా మనకి చూపించారు!

          ఇక్కడి సంగతులేమీ తెలియవు గనక అక్కడ భరతుడు ముహూర్త కాలం కూడా ఆగడని గుర్తొచ్చి విషయం చెప్పి అతడి అగ్నిప్రవేశాన్ని ఆపడానికి ముందు ఆంజనేయుణ్ణి పంపి వీళ్ళు ప్రశాంతంగా పుష్పకవిమానప్రయాణ సుఖాన్ని అనుభవిస్తూ అయోధ్య చేరుకున్నారు!పధ్నాలుగేళ్ళ తరవాత యే అడ్డంకులూ లేకుండా శ్రీరామపట్టాభిషేకం జరగడంతో రామకధని సంపూర్ణం చేశాడు వాల్మీకి! "ఉత్తరే రామచరిత్రే భవభూతిర్విశిష్యతి" అన్న మాటతో వున్న ఉత్తర రామచరిత్ర తప్ప వాల్మీకి పేరుతో యెక్కడా కనబడటం లేదు.శ్రీరామ చూర్ణిక కూడా "పట్టాభిషేక మహోత్సవానందం గోవిందం" అనే పదంతోనే ముగుస్తుంది గాబట్టి ఈ శుభప్రదమైన ముగింపుతో వున్న కధయే సంపూర్ణమైన రామాయణం!


స్వస్తి!
_______________________________________________________________
సీ||  యేమయా రామయా యేదయా నీదయా!
         మాకు నీవేకదా మేటి వేల్పు?

         ఎన్నియో బాధలూ ఎంతయో వేదనా
         మోసిమోసీ మరీ మోయలేని

         వారమై నేడిలా వేడుతున్నామయా!
         కావవే దేవరా కాచి రక్ష

         నివ్వు మా తండ్రిగా! నీటిలో ముంచినా
         నావలా తేల్చినా నీవెనంటు

తే||  చేరినాముగా, స్వామి?మా చేయి పట్టి
        మాకు నీవెతోడై సదా మమ్ము బాధ 
        చూడనీక నీ బిడ్డలా చూసుకోవ
        యా - త్రిలోక పాలా, దయాపాశహస్త?!
(12/02/2015:పైనున్న పద్యంలో యేకత్వాన్ని బహుత్వంగా మార్చాను.తప్పు చెయ్యనివ్వక పోవడానికి బదులుగా బాధ చూడనివ్వవద్దని మార్చాను, భావం ధర్మాధర్మవిచక్షణ నుంచి సంపూర్ణశరణాగతికి తిరిగింది!)
_______________________________________________________________

Monday, 9 February 2015

ఆంధ్రాకు అన్యాయం చేసినోడు ఎవడూ బతికిబట్టకట్టడు… కాంగ్రెసుకి దేశంలో పట్టిన గతి బీజేపీకి ఢిల్లీతో మొదలవుతుంది

రాజ్యం వీరభోజ్యం అన్న పెద్దలే రాజ్యాంతే నరకం దృవం అన్నారు!

రాష్ట్రాన్ని విడగొట్టటం మరో అధికార కేంద్రాన్ని సృష్టించే పై స్థాయిలోని పెద్దమనుషుల వెసులుబాటు కోసం జరిగిందే తప్ప తెచ్చుకున్న వాడికి తెలంగాణా ప్రజల సౌభాగ్యం మీద దృష్టీ లేదు.ఇచ్చిన వాడికి అసలు విభజించాక అటుపక్కన మరో ముక్క కూడా వుంటుందనే వివేకమూ లేదు?విభజించితే తను అన్ని సీట్లు గ్యారెంటీగా ఇస్తానంటున్నాడు,విభజించకుండా వుండాలంటే మీరు యెన్ని సీట్లు గెలిపించగలరు అని పరిశీలకుడి హోదాలో వచ్చిన తన పార్టీ వాడే కూశాడని మర్చిపోయిన లఘువీరుడు ఇతర్ల మతిమరుపును గురించి యాష్ట పడిపోతున్నాడు?!మాతృరాష్ట్రం అనే గౌరవప్రదమైన హోదా వుండగా అవశేషాంధ్ర అని విన్నవాడికి గుందెలు భగ్గుమనే విధంగా వెక్కిరింతగా మాట్లాడిన దౌర్భాగ్యులు ఇవ్వాళ రాష్ట్రం పట్ల యేదో బాధ్యత వున్నట్టు రెచ్చిపోతున్నారు.సమైక్యవాదం పేరుతో హడావిడి చేసిన దంతా కాంగ్రెసు వాళ్ళు కాదా!వాళ్ళ అసలు వుద్దేశం రాష్ట్రాన్న్ని సమైక్యంగా వుంచడం కానే కాదు,కేసీఆర్ నుంచి హైదరాబాదులో వున్న తమ వ్యాపారాల్ని పదిలంగా వుంచుకోవటానికి కావలసిన లోపాయకారీ హామీ కోసమే జరిగింది!?అతడూ వీళ్ళలాగే పార్ట్ టైం పొలిటీషియన్ కం ఫుల్ టైం బిజినేస్ మాగ్నెట్ గనుక పై స్థాయిలో అది దొరకగానే చల్లబడిపోయారు!

చంద్రబాబు ప్రజాభిమానంతో అధికారంలోకి వచ్చినా కేంద్రంతో గట్టిగా వ్యవహరించకుండా పిరికిగా యెందుకుంటున్నాడో తెలుసా?ఒకనాడు వాజపేయి అనే మేధావీ రుజువర్తనుడూ భాషాయుధ పాణీ నిష్కపటీ ఉదారుదూ అయిన వాజపేయి వల్ల ఒకానొకప్పుడు కేవలం 2 సీట్లకే పరిమితమయి కూడా భాజపా నేడున్న స్థానానికి వచ్చింది!మోదీ ఇవ్వాళ వచ్చాడు?2 సీట్లకి మాత్రమే పరిమితమయిన స్థానం నుంచి యే అంశాన్ని చూసి ప్రజలు ఆదరించారో భాజపా వాళ్ళు మర్చిపోయి వుండవచ్చు.రధయాత్ర నాడు భాజపాని ద్వేషించిన నాలాంటి వాళ్ళు కూడా కాంగ్రెసుకి భిన్నంగా అక్కడున్న వాజపేయి,అద్వానీ లాంటి వాళ్ళ హుందా అయిన రాజకీయ వ్యక్తిత్వాలను చూసే అభిమానించడం మొదలు పెట్టారు!కానీ ఒకసారి అధికారాన్ని అనుభవించి పోగొట్టుకుని మళ్ళీ సాధించిన ఇప్పటి భాజపా నేతలు ఆ గతాన్ని మర్చిపోయి కమలమే సకలం కావాలి అనే ధూర్తత్వాన్ని ప్రదర్శిస్తూ కాంగ్రెసుకి నకలుగా తయారయ్యారు.దేశప్రజలంతా నిర్ఘాంతపోయి చూసే విధంగా లగడపాటి రాజగోపాల్ అనే కాంగ్రెసువాడు చేసిన పెప్పర్ స్ప్రే దుర్మార్గమే కాంగ్రెసుకి ఆ గతి పట్టించింది!అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన పట్టుదల మీదనే వచ్చిందని చెప్పుకున్న ప్రత్యేక హోదానీ విభజన ప్యాకేజినీ తను అధికారంలో వుండి కూడా మా చేతుల్లో లేదని వెంకయ్య నాయుడు చెప్పినప్పటి నుంచే ఆప్ వైపుకి త్రాసు మొగ్గడం వూపందుకుంది?!

సకలం కావాలీ అనే భాజపా లక్ష్యం ప్రతి పార్టీకి వుండొచ్చు,కానీ యెలా సాధించాలనుకున్నది ఆ పార్టీ?తను చేసిన వాగ్దానాల్ని నిరపేక్షంగా నెరవేర్చి సజావైన పధ్ధతిలోనా!తనకే లాభం రావాలనే తొండి రాజకీయపు పైత్యకారి తనంతోనా!

ఆంధ్రప్రదేశ్ విషయంలో భాజపా పరమ దుర్మార్గమైన వ్యూహంతో వుంది!జగన్ మీద వున్న కేసులు ఇప్పుడు విచారణ జరుగుతున్న పధ్ధతి ప్రకారం 2090వరకూ కూడా పూర్తి కాకపోవచ్చు,అసలెప్పటికీ పూర్తి కానె కాకపోవచ్చు!అసలు జగన్ మీద ఆరోపణలు యేమిటి?తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించాడని కదా!ఆ తండ్రి ముఖ్యమంత్రి అనే ప్రధమ స్థానంలోనే వున్నా మంత్రివర్గ సభ్యులకి తెలియకుండా చెయ్యగలడా యే పని అయినా?అధికార దుర్వినియోగం జరిగితే అది రహస్యంగా యెప్పటికీ జరగదు?!కన్నమేసే దొంగ కూడా  తోడు లేకుండా చెయ్యడు గదా, మరి అతని మంత్రివర్గంలో వున్న లఘువీరుడికీ బొత్సకీ పార్టీలో యెవ్వడికీ తెలియకుండా జరిగిందా అది?ఆ కేసు స్వరూపం ప్రకారం అసలు ముద్దాయి జగన్ అవ్వడు వీళ్ళే అసలు నేరస్థు లవుతారు!జగన్ ధైర్యం కూడా అదే!చంద్రబాబు తోక ఝాడించిన మరుక్షణం జగన్ భాజపా సహకారంతో నిర్దోషిగా బయట పడి తెదెపాని మట్టి కరిపిస్తాడు.నేను జగన్ అభిమానిని కాదు,కానీ ఇన్ని విధాల కేసులతో సతమతమవుతున్నా రోజుకొకసారి తెదెపా శ్రేణులతో యెప్పుడు జైలు కెళ్తావో తెలియదు అని జోకు లేయించుకుంటున్నా అంత ధీమాగా వుండగలటానికి కారణం యేమిటనే ప్రశ్న వేసుకుంటే మీకే అర్ధమవుతుంది! జగన్ కూడా నిక్కచ్చిగా కేసుల నుంచి బయట పడదల్చుకుంటే  చాలా ఈజీగా బయట పడగలడు,కానీ తనకి సానుభూతిని రప్పిస్తున్న ఈ వ్యవహారాన్ని తనూ తన కనుకూలంగా తీసుకుంటున్నాడు!

యే విధంగా జరిగినా ఒకసారి అధికారం కోల్పోయాక మళ్ళీ అధికారంలోకి రావడం అంత తేలిక కాదని మనందరి కన్నా చంద్రబాబుకే యెక్కువ తెలుసు! అంతా మోసం!అంతా దగా!ముఖ్యమంత్రుల బోర్డు ఒప్పుకోదేమో అని అనుమానాలు ఇప్పుడు వెలిబుచ్చుతున్న వాళ్ళు ఇచ్చినవాడు తమ పార్టీ వాడు కాదు గదాని గట్టిగా కృషి చెయ్యకపోవడం వల్లనే గదా వ్యతిరేకించేది?హామీ ఇచ్చిన వాడు నిన్నటి వాయినా ఇచ్చింది ప్రధాని స్థానంలో వుండి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రులయినా మరెవరయినా కుంటిసాకులతో దానికి తూట్లు పొడిస్తే రాజ్యాంగబధ్ధమయిన ఆ పదవికే తలవొంపులు కాదా?

ఒక దేశప్రధాని ఇచ్చిన న్యాయబధ్ధమయిన హామీ పట్ల ఇంత అనిశ్చితిని రగిలించిన భాజపాని యెవరయినా యెలా అభిమానించ గలరు?అందుకే వ్యతిరేక ప్రభంజనం దిల్లీలో తొలి విసురు విసురుతున్నది?!ముస్లిముల్ని రంజింప జేసినా  కాశ్మీరులో వుషారు ఇచ్చినా ప్రధాని స్థానంలో ఉండి ఒక నగర ప్రజానీకాన్ని రంజింపజెయ్యాలని చూసినా యెదురు తన్నడం యెందుకు జరుగుతుందో యెదురుదెబ్బ తగిలిన తర్వాతనయినా బోధపర్చుకుంటే మంచిది.

అధికారాంత మందు జూడవలె గదా అయ్యల సౌభాగ్యములు?!

Saturday, 7 February 2015

దోపిడీ->యుధ్ధం->రాజ్యం->కులం->అణిచివేత?->వైప్లవ్యం!

ఈ దేశం ఒకప్పుడు యుధ్ధాలు లేని,అసమానతలు లేని,దోచుకోవడం అంటే యేమిటో తెలియని ఒక వ్యవస్థలో కొంతకాలం బతికింది!పైగా తారతమ్యాలు అంచనా వేస్తే ఆ కాలంలో పరిఢవిల్లిన మిగతా ప్రాంతాల సంస్కృతి కన్నా అన్నింటిలో అగ్రాసనం ఇవ్వదగిన ఒక సంస్కారవంతమైన నాగరక జీవన వృత్తాన్ని పదిహేను వందల సంవత్సరాలు 5 మిలియన్ల జనసమూహం పాటించి నిలబెట్టడం ఇప్పటికీ మనం గర్వంగా చెప్పుకోదగినదే!దానినే చరిత్రకారులు "సింధు లోయ నాగరికత"గా పిలిచి యెన్నో పరిశోధనలు చేసి మనకి తెలియని మన ప్రాచీనుల గొప్పదనాన్ని మన కళ్లముందు నిలబెట్టారు.వెతికి చూసినా యుధ్ధానికి వుపయోగపడే పరికరాలు లేవు?యెంత శోధించినా మతానికి సంబంధించి మూఢనమ్మకాలు వున్న ఆధారాలు కనపడలేదు?తర్వాతి కాలంలో శైవులు శివుడి గానూ, బౌధ్ధులు అవలోకితేశ్వరుడి గానూ, జైనులు తీర్ధంకరుడి గానూ భావించిన యోగముద్రలో కనబడుతూ జంతువులతో పరివేష్టించబడిన "పశుపతి" ప్రముఖంగానూ శక్తి వుపాసనకి మూలమైన "మహా మాత" మూర్తి మాత్రమే కనబడుతున్నాయి.ప్రత్యేకంగా అతిపెద్ద మందిరాలు లేకపోవడం చేత ఇవ్వాళ మనం చేస్తున్నట్టుగానే యెవరికి వారు వ్యక్తిగతంగా పూజలు చేసుకునే వారని అనుకోవాలి!

ఇలాంటి గొప్ప వ్యవస్థ యెందుకు అదృశ్యమై పోయింది? యెక్కువమంది పరిశోధకులు తీర్మానించిన దాని ప్రకారం కాలం కలిసిరాక,విపరీతమైన చలికి తట్టుకోలేక,నిరంతర వర్షాలకి అతలాకుతలమైపోయి విధిలేని పరిస్థితుల్లో ఆ నగరాలని వొదిలేసి మరింత లోతట్టు ప్రాంతాలకి చేరి అప్పటికే అక్కడున్న ప్రజలతో యుధ్ధాలు చేసి గెలిచి కొత్త చోట్లలో కొత్తగా ఋతుపవనాల మీద ఆధారపడిన సేద్యాన్ని అలవాటు చేసుకుని ఒక కొత్త యుగంలోకి ప్రవేశించారు.క్రీ.పూ 1900 ప్రాంతాల మధ్యన విరాజిల్లిన సింధు నాగరికత క్రీ,పూ 1700 ప్రాంతానికి ఋగ్వేద కాలంలోకి మారింది.ఇది భారతదేశ చరిత్రలోకల్లా నిరంతర యుధ్ధాలతో,యుధ్ధాలలో గెలుపు కోసం యజ్ఞయాగాదుల పేరున సరికొత్త ఆరాధనా పధ్ధతులు తలయెత్తిన కాలం.అందుకేనేమో ఋగ్వేద సాహిత్యంలో శక్తిని,గెలుపును,వృధ్ధిని కోరుకునే సాహిత్యమే యెక్కువ? ఇక్కడ నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది - ఇప్పటికీ సంతృప్తి కలిగించే జవాబు దొరకనంత అస్పష్టంగా వుండి మార్మికంగా ఉంటున్నది!వీరు నిజంగా సింధు నాగరికతా శిధిలాల నుంచి వచ్చిన వారేనా అనేది?యెందుకంటే ఋగ్వేద సాహిత్యంలో గానీ మిగిలిన వైదిక సాహిత్యంలో గానీ ఇవ్వాళ కనుక్కున్న సింధు లోయ నాగరికతకి సంబంధించిన ప్రస్తావనలు లేవు,యెందుకని?!

నా వూహ అయితే కొత్తగా సాహిత్యసృష్టి నేర్చుకున్న వెంటనే కళ్ళముందు జరుగుతున్న కోలాహలం ప్రధానంగా రికార్డు చెయ్యాల్సిన అవసరం వుండటం వల్ల ముందు వాట్ని గ్రంధస్థం చేసి ఆ తర్వాత పాత విషయాల్ని గుర్తు చేసుకోవడం మొదలు పెట్టేసరికి సింధు నాగరికత నాటి విషయాలు అస్పష్టమై పోయి కధలుగా మారి అప్పటి వ్యక్తులు రూపం మార్చుకుని పురాణ పురుషులుగా నిలబడ్డారని అనుకోవాలి!"ఇమ్మోర్టల్స్ ఆఫ్ మెలూహా" రచయిత విజయవంతంగా చేసింది ఇప్పుడు మన ముందు శివుడిగా పూజలందుకుంటున్న ఒకప్పటి సామాన్య మానవుణ్ణి అత్యంత వాస్తవికంగా చిత్రించడమే!

వైదిక కాలానికి సంబంధించిన జ్ఞానమంతా క్రీ.పూ 1500 - 1200 మధ్యలో సంకలించబడిన ఋగ్వేద సంహిత నుంచే  లభిస్తున్నది!ఇతర రాజ్యాలని ఆక్రమించే వుద్దేశంతో యేర్పరచిన "అశ్వమేధ యాగం" ప్రముఖంగా వర్ణించబడింది. ప్రముఖమైన "బ్రాహ్మణ","క్షత్రియ","వైశ్య","శూద్ర" వర్ణాలు నాలుగూ ప్రస్తావించబడినాయి,కానీ ఇవి అక్కడున్న వ్యక్తుల ప్రాధాన్యతని సూచించే విధంగానే వున్నాయి తప్ప జన్మకు అనుసంధానించటం అనేది తొలి వైదిక కాలంలో జరగలేదు!ఇక్కడే మరొక విశేషాన్ని కూడా ప్రముఖంగా చెప్పుకోవాలి.సింధు నాగరికత ద్వంసమైపోయి వారు చెల్లా చెదరవటం కేవలం ఒకే దిశలో జరగలేదు.అన్ని వైపులకీ వెళ్ళగా మన వైపుకి వచ్చిన వారు ఇక్కడ తమ పూర్వీకుల గురించి చెప్పుకున్న విషయాలూ ఇవ్వాళ్టి భారత దేశపు సరిహద్దుల కవతల వున్న సంస్కృతుల లోని ప్రాచీన సంస్కృతికి సంబంధించిన విషయాలూ ఒకే రకంగా వున్నాయి!అందుకే ఇక్కడి కొందరు అఖండ భారత్ పేరుతో ఆఫ్ఘనిస్థాను కూడా మనదే అంటున్నారు?వీటిని భాషా కుటుంబాలు అంటారు.ఇండో ఇరానియన్ భాషా కుటుంబం యొక్క వారసత్వం ప్రకారం మన దేశాన్ని ఆక్రమించిన ఆంగ్లేయులు కూడా మనకి సోదర జాతి అవుతారు?"మదర్ - మాతర్","బ్రదర్ - భ్రాతర్" లాంటి చిన్న చిన్న మాటల్లోని పోలికలే కాదు భాషా శాస్త్రవేత్తలు ఇంకా గహనమైన పోలికల్ని కూడా పట్టుకోగలిగారు!



వైదిక కాలంలోని రాజ్యం మొదటిసారిగా అధికారాన్ని కంద్రీకృతం చేసుకుంటూ యేర్పడింది!కురు వంశం అప్పటి చిన్న చిన్న తెగల నుంచి యుధ్ధాలు చెయ్యడంలో నేర్పరులైన వాళ్ళంతా వాళ్లలో వాళ్ళు కలిసిపోయి ఒక వున్నతమైన వంశంగా ప్రభవించింది.వీరిలో "పరిక్షిత్", "జనమేజయుడు" అనే ఇద్దరు తండ్రీ కొడుకులు అప్పటి రాజ్యానికి కావలసిన అన్ని హంగులూ యేర్పరచారు.పెరుగుతున్న జనాభాని పోషించడానికి అవసరమైన భూమి కోసం ఇతర్లని దోచుకోవడానికీ ఇతర ప్రాంతాలకి విస్తరించడానికీ యుధ్ధాలు అవసరమైనాయి.యుధ్ధానికి నాయకత్వం వహించి గెలిపించగలిగిన వాడు రాజయ్యాడు.యెంత లెక్క ప్రకారం వ్యూహాలు పన్ని పోరాడినా గెలుపు అదృష్టాన్ని బట్టి వుండటంతో దైవబలాన్ని సాధించుకోవడం కోసం పురోహితుడు అతనికి అవసరమయ్యాడు.యుధ్ధానికి అవసరమైన వనరుల్ని సమకూర్చగలిగిన వైశ్యుడు రాజ్యానికి మూలస్తంభం అయ్యాడు.యుధ్ధం తప్పనిసరి అయినప్పుడు కొన్ని పనులు తప్పనిసరిగా చెయ్యడానికి కొందరు తప్పనిసరిగా అవసరం గనుక శూద్రులు అందుకు వుపయోగపడ్దారు.యుధ్ధ పరికరాల అవసరమే లేని ఒక అధ్భుతమైన నాగరికతలో యెంత హీనపక్షంగా లెక్కేసినా వెయ్యేళ్ళ పాటు ప్రశాంతంగా గడిపిన జనసమూహమే కాలాంతరంలో యుధ్ధమే సమస్తంగా బ్రతికే జీవన విధానానికి మారడం ప్రపంచ చరిత్రలోని అత్యంత దుర్భరమైన విషాదా లన్నింటిలో ఒకటి?!

క్రీ.పూ 12వ శతాబ్దం వచ్చేసరికి ఋగ్వేద సాహిత్యం సంపూర్ణంగా సృజించబడి రాజ్యం యొక్క స్వభావం పూర్తిగా నిర్వచించబడి క్రీ.పూ 6వ సతాబ్దానికి 16 మహాజనపదాలు యేర్పడి భారత దేశపు స్సంస్కృతిలో అత్యంత ప్రముఖమైన కుల స్వభావాన్ని ప్రజల మనసుల్లో సుస్థిరం చేశాయి!.వీటన్నిటిలో మగధ ఇవ్వాళ్టి ప్రపంచ రాజకీయ వేదిక మీద అమెరికా స్థానానికి దీటయిన స్థానాన్ని ఆక్రమించడానికి కారణం ఆ రాజ్యంలోని విస్తారమైన ఇనుప ఖనిజపు నిధులు!ఈ మగధ చరిత్ర క్రీ.పూ 600 నాడు హర్యంక వంశంతో మొదలవుతుంది.క్రీ,పూ 424 నంచి శిశునాగ వంశం మొదలైంది.రాజు బలహీనుడైతే మంత్రో సైన్యాధిపతో అతన్ని హతమార్చి తమ పేరుతోనే ఒక కొత్త వంశాన్ని కల్పించుకోవటంతో కొత్త రాజవంశం అవతరించేది!ఈ శిశునాగుల కాలంలోనే గౌతమ బుధ్ధుని ప్రవచనాల ఆధారంగా బౌధ్ధ మతం, మహావీరుని బోధనల ఆధారంగా జైన మతం ఆవిర్భవించాయి.ఈ శిశునాగ వంశంలోని పదవ రాజు గారి బార్యకి ఆష్థాన క్షురకుడు చాలా మోహాన్ని పుట్టించాడు!అంతే,రాజుగారు హతమై పోయాడు - మహా పద్మ నందుడు నంద వంశ స్థాపకుడిగా రాజయ్యాడు!రాజవ్వగానే ఆ రాణిని ఖైదు చేసి పట్టపురాణి హోదాని వేరొక స్త్రీకి కల్పించాడు - తెలివైన వాడు గదూ?!

అయితే ఈ క్షురకుణ్ణి రాజుగా సాటివాళ్లంతా అంగీకరించడం అనేది "నందో రాజా భవిష్యతి" అనే గట్టి సంకల్పంతో రాజ్యాన్ని వృధ్ధిలోకి తీసుకొచ్చిన రాక్షస మంత్రి ఇతనికి విశ్వాసపాత్రుదైన మంత్రిగా దొరకడం వల్ల్లనే సాధ్యపడింది.రాజ్యం యెంత వృధ్ధిలోకి వచ్చినా ఇతడి కొడుకైన ధననందుడి తోనే వంశం అంతరించి పోయింది.ధననందుడికి యెనిమిది మంది కొడుకులు.అందర్నీ కలిపి నవనందులనే వాళ్ళు. చాణక్యుడు అప్పటికే అలెగ్జాంర్ యొక్క ప్రమాదాన్ని గుర్తించి మగధ రాజుని కలిసి అలెగ్జాంరు సైన్యాన్ని నిరోధించగలిగిన శక్తివంతమైన రాజ్యం గనుక అతన్ని సిధ్ధపరుచుదామని అక్కడికి వస్తే నందుని కొడుకులు నిర్లక్ష్యంగా అతన్ని అవమానించారు.దానితో అలెగ్జాండరు గురించి మర్చిపోయి నందహతకుల్ని భూస్థాపితం చెయ్యడంలో కృతకృత్యుదు కావడంతో చాణక్యుని శిష్యుడైన చంద్రగుప్తుడు రాజుగా మౌర్య వంశం మొదలైంది.ఈలోపు అలెగ్జాండరు తనంతట తనే మగధ వరకూ రాకుండానే వెనుదిరగడంతో మగధకి అలెగ్జాండరు పోటు తప్పింది!

నందుడికి విధేయుడిగా వున్న రాక్షసుణ్ణి చంద్రగుప్తుడికి మంత్రిని చెయ్యడానికి వేసిన రాజకీయపు యెత్తుగడల నేపధ్యంగా రచించబడిన "ముద్రా రాక్షసం" నాటకపు ఇతివృత్తం సంస్కృత సాహిత్యంలో అత్యంత విభిన్నమైనది - ఇప్పటి దిటెక్టివ్ కధల్లో వుండే టెన్షన్ పుట్టించే గుణం అంతర్లీనంగా వుంటుంది?!ఇప్పటికీ ప్రాచీన కాలపు రాజరికాలు యేవిధమయిన సాంప్రదాయాల్ని పాటించేవి అనేది తెలుసుకోవడానికి చాణక్యుని "అర్ధశాస్త్రం" అనే గ్రంధం ఒక్కటి చాలు.ఇందులో శూద్రుల స్థితి గురించి నిర్మొహమాటంగా "శూద్రుడికి సొంత ఆస్తి సమకూరితే దాసవృత్తి చెయ్యడు గనక శూద్రుడి దగ్గిర పోగుపడిన చిల్లిగవ్వనైనా సరే లాగివేసుకోవటం చట్టవిరుధ్ధం కాకపోగా రాజు తప్పనిసరిగా చెయ్యాల్సిన ముఖ్యమైన పని" అని తేల్చి చెప్పాడు!ఇటువైపు నుంచి ధార్మిక విషయాలలో "శూద్రుడు తనంతట తను వేదం చదవడం కాదుగదా ఆ దారిన దూరంగా వెళ్తున్నప్పుడు పొరపాటున చెవిన పడ్డా ఆ శూద్రుడి చెవుల్లో సీసం కరిగించి పొయ్య" మనే రకం సుభాషితాలు మరింత క్రూరమైనవి - చేశారో లేదో తెలియదు గానీ మాటలు మాత్రం మిగిలి వున్నాయి?!వీటి నన్నిట్నీ దుందుడుకు ప్రస్తావనలుగా కొట్టిపారేసినా శంబుక వధని సమర్ధించలేరు గదా!తపస్సు చెయ్యడం పట్ల శ్రధ్ధ అనే బ్రాహ్మణ స్వభావం అతని మనస్సులో వుండటం వల్ల అతన్ని బ్రాహ్మణుడిగా గుర్తించడానికి బదులు మృతశిశువును కారణంగా చూపించి చంపించటం అన్యాయమే కదా?అయితే ఒకటి - అప్పటి బ్రాహ్మణులు చేసిన దానికి ఇప్పటి బ్రాహ్మణుల్ని నిందించి ప్రయోజనం లేదు.ఇప్పటి బ్రాహ్మణుల్లో చాలామందికి నాకు తెలిసిన మాత్రం కూడా తెలియదు అప్పటి విషయాల గురించి,యేదో పెద్దవాళ్ళు చెప్పారు అని పాటించటమే తప్ప అందరూ అవన్నీ అర్ధమయి పనిగట్టుకుని కులాధిపత్యాన్ని చూపిస్తున్నారని చెప్పలేం.వాళ్లలోనే వీటిని దగ్గిరగా చూసి అసలు అర్ధం తెలుసుకుని వ్యతిరేకించి పోరాడిన సంస్కర్తలు గూడా పుట్టారు మరి?

అయితే ఇన్ని సహస్రాబ్దాల పాటు ఈ వ్యవస్థ యే తిరుగుబాటూ లేకుండా వొద్దికగా యెలా వుంది?ఇంతకాలం బద్దలు కొట్టకుండా వుండటానికి ఇక్కడి ప్రజలు క్షాత్రం లేనివాళ్ళు కాదుగదా!ఇతర దేశాల్లో బానిసల పేరుతో చేసినట్టు గొలుసుల్ని కట్టి బంధించి చేయ్యలేదు గదా,విపణి వీదిలో పెట్టి అమ్మలేదు గదా - మరి దీన్ని దుర్మార్గం కింద యెలా లెక్కిస్తాం?ఈ కులవ్యవస్థని అంతం చెయ్యాలనుకునే వాళ్ల మీదకి సంధించబడే ఈ ప్రశ్నలు బలమైనవి గనకనే వాళ్ళూ నోరెత్తలేక పోతున్నారు.తమ కులంలోనే కులాన్ని గట్టిగా పట్టుకుని వుండేవాళ్ళని చూసి,తమలోనే తమ కులం పట్ల ఆత్మీయత వుండటం చూసి -  దీన్ని యెలా బద్దలు కొట్టాలో పాలుపోని స్థితిలో నిలబడ్డారు.కులవ్యవస్థలోని కీలకం యేమిటంటే కులానికీ వృత్తికీ అనుబంధాన్ని యేర్పరచారు - దాన్నొక ఆదాయమార్గం చేశారు!దానితో ఒక వృత్తిలో నైపుణ్యం వున్నవాళ్ళకి సొంత ఆస్తి లేకపోయినా జీవనం గడుస్తుంది కాబట్టి సర్దుకుపోయారు.ఆ వృత్తి ద్వారా వచ్చే జీవనోపాధిని తమ పిల్లలకి నికరంగా సంక్రమింపజెయ్యడం కోసం ఒక వృత్తికి సంబంధించిన వాళ్ళు తమలో తామే పెళ్ళిళ్ళు చేసుకుని దాన్ని క్రమబధ్ధం చెయ్యడం తప్ప మరో మార్గం లేకపోయింది!ఆరకంగా ఆ కాలంలోని అన్ని దేశాల్లో సాటి మనుషుల్ని బానిసలుగా చేసి కిరాతకంగా ప్రవర్తిస్తే "సూర సుబ్బన యోర్మధ్యే సుబ్బనః కించిదుత్తమి?సుబ్బనః రక్తపాయీ చ సూరనః శల్యభక్షకః(సూరన సుబ్బనల్లో సుబ్బన కొంచెం మంచివాదు - సుబ్బన రక్తం పీల్చి వొదిలేస్తాడు? సూరన యెముకల్తో సహా నమిలేస్తాడు!)" అన్నట్టు ఇక్కడ కులవ్యవస్థ అనే బంగారు పంజరాన్ని సృష్టించారు?!

స్వయంపూర్ణ గ్రామ వ్యవస్థ అని సామాజిక శాస్త్రవేత్తలతో వర్ణించబడిన ఒకవైపు నుంచి చూస్తే అధ్భుతంగానూ మరోవైపు నుంచి చూస్తే కిరాతకంగానూ కనబడే ఈ ద్విముఖ వ్యవస్థ పారిశ్రామిక విప్లవం ఇచ్చిన అతుత్సాహంతో అప్పటివరకూ చలనం లేకుండా వున్న మిగతా దేశాలలో భూకంపాల్ని పుట్టించిన ఆంగ్లేయులు ఇక్కడ కూడా అడుగు పెట్టడంతో పునాదులతో సహా కదిలిపోయింది.సముద్రయానాన్ని నిషేధించి అప్పటిదాకా అపురూపంగా పట్టి వుంచిన బంగారు పంజరం ఆంగ్లభాషాద్యయనం వల్ల వీచిన కొత్తగాలుల దెబ్బకి మూడొంతులు ద్వంసమైంది!గాంధీ - నెహ్రూ ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు,పైగా ఒకరంటే ఒకరికి అభిమానం వున్న గురుశిష్యులు అయినా వారిద్దరి మధ్యనా విభేదాలు రావడానికి కారణ మేమిటో ఇప్పటికీ చాలామంది గ్రహించలేకుండా వున్నారు!గాంధీ తన వుపన్యాసాలన్నిటి లోనూ తనకి ప్రాచీన హిందూ సాంప్రదాయాల పట్ల వున్న మక్కువనీ ముఖ్యంగా కుల వ్యవస్థని మరీ అంత క్రూరంగా కాకుండా కొంచెం సుకుమారంగా తయారు చేసి అయినా సరే యధాతధంగా వుంచాలనే వుద్దేశం వెలిబుచ్చే వాడు?ముస్లిములకి ప్రత్యేక నియోజకవర్గాలకి వుదారంగా వొప్పుకుని దళితులకి ప్రత్యేక నియోజక వర్గాలకి అడ్డం తిరిగడానికి సరయిన కారణం చెప్పలేదు - మొండిగా వ్యతిరేకించటం తప్ప?నెహ్రూ యేమో తనకి వ్యామోహంగా వున్న కమ్యునిజం ప్రభావంతో ఈ సమస్తాన్నీ బద్దలు కొట్టెయ్యాలని ఆవేశ పడే వాడు!అయితే వర్గరహిత సమాజం యెట్లా వుంటుందో కార్ల్ మార్క్సు గారికే అవగాహన లేక వేదాంతం చెప్పడం వల్ల నెహ్రూకి కూడా ప్రత్యామ్నాయం లేక ఇద్దరి పైత్యాల్నీ సంతృప్తి పర్చే ఒక దిక్కుమాలిన విధానాన్ని జనం మీదకి ప్రయోగాత్మకంగా వొదిలాడు.అటు పూర్తిగా కమ్యునిజమూ ఇటు పూర్తిగా క్యాపిటలిజమూ కాని మధ్యేవాదపు సోషలిజాన్ని కళ్ళు మూసుకుని పాటించేశాడు?!లెక్క ప్రకారం నడపాల్సిన ఆర్ధిక వ్యవహారాల్ని గవ్వలిసిరే మహలనోబిస్సు కప్పజెప్పాడు?!

దీనివల్ల్ల యదార్ధంగా జరిగింది కులవృత్తుల మీద పట్టును కోల్పోయి ఆర్ధికంగా మరింత దిగజారడం, ఒకే పనికి అన్ని కులాల వాళ్ళూ పోటీ పడటం వల్ల మనుషులు కులానికి మరింత గట్టిగా అంకితం కావడం, కులం పేరుతో రాజకీయ లబ్ధిని కోరుకుని వైషమ్యాలు పెంచుకోవడం తప్ప దేశపు మొత్తం పరిస్థితిని నిక్కచ్చిగా లెక్కించినా ఆర్ధికంగా అభివృధ్ధినీ సాధించలేదు,సామాజికంగా సంస్కారాన్నీ మెరుగు పర్చుకోలేదు!గాంధీ అంతరాంతరాల్లో కోరుకున్నట్టుగానే అప్పటి రాజవంశీయులూ, జమీందార్లూ,కాకుంటే భూస్వాములూ చట్టసభల్లో యెన్నికల పేరుతో జరిగే హంగామా చాటున తప్పు యెక్కడుందో మహామేధావులకి కూడా అంతుపట్టనంత చక్కని వక్రమార్గంలో ప్రవేశించి అధికారం తమ నుంచి జారిపోకుండా చూసుకోగలిగారు!ఇప్పటికీ విద్యారంగానికి అతితక్కువ నిధులు కేటాయించటం,అర్హతలు వున్న టీచర్లు యేళ్ళ తరబడి యెదురు చూస్తున్నా,వారందర్నీ నియమించడానికి సరిపడిన ఖాళీలు వున్నా వాటిని భర్తీ చెయ్యకపోవటం,ఇంకా యెన్నివిధాల వుపాయాలు వున్నాయో అవన్నీ వుపయోగించి ప్రభుత్వ పాఠశాలల్ని నీరసంగా తయారు చెయ్యటం అనుకోకుండా జరిగే పొరపాటు అనుకుంటున్నారా?కాదు,విద్యని కింది అంతరువుల్లో వున్నవాళ్ళకి చేరనివ్వకుండా వాళ్లని పాకీపనులకీ,మంగలి పనులకీ,చాకలి పనులకీ మాత్రమే పరిమితం చెయ్యడం అనే వ్యూహం వుంది ఆ నిర్లక్ష్యం వెనక?!

నిజానికి మంచి అవగాహనతో గట్టి సంకల్పంతో ప్రయత్నిస్తే తొలి పద్దెనిమిదేళ్ళూ అప్రతిహతమైన అధికారాన్ని అనుభవించిన నెహ్రూ యెంతో కొంత మార్పుని సాధించగలిగి వుండేవాడు!ఇవ్వాళ వున్న పరిస్థితి మరీ దారుణమైనది? వెనకటి రోజుల్లో యెవడికి వాడికి కులవృత్తి పట్ల వున్న ధీమాతో ఒక కులంవాళ్ల మీద మరో కులంవాళ్ళు జోకులేసినా సర్దుకుపోయే స్పోర్టివ్ మనస్తత్వం వుండేది - ఇప్పుడు కాస్తకీ కూస్తకీ మనోభావాలు దెబ్బతినడం అనే ధోరణిని చూస్తున్నాం?!స్వతంత్ర భారత ప్రప్రధమ ప్రధాని ఈ దేశప్రజలు తనపైన వుంచిన నమ్మకాన్ని తనకి తోచిన కొత్త ప్రయోగానికి వుపయోగించుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది?అసలే ప్రతి కులంలోనూ వుపకులాలు కూడా వుండి పొరలు పొరలుగా వున్న ఇక్కడి వాస్తవ జీవిత దృశ్యాన్ని పట్టించుకోకుండా అక్కడెక్కడో మెరుస్తూ కనిపించిన యెర్రమావుల వెంట పరిగెత్తేసరికి కొండనాలిక్కి మందేస్తే వున్న నాలిక వూడినట్టయింది! ఇప్పటి పరిస్థితి గురించి కామ్రేడ్ అనూరాధ గాంధీ విశ్లేషణ చాలా బాగుంది!దాదాపు నా అవగాహన కూడా అదే కాబట్టి ఇక్క మళ్ళీ అదంతా చెప్పడం లేదు!దళిత అనుకూల ప్రభుత్వం అనే వూహని మొదట్లో చాలా గట్టిగా వ్యతిరేకించాను,వారి నుంచి వచ్చిన ప్రతిస్పందన చూసి నాకు దానిపట్ల బలమైన వ్యతిరేకత యేదీ లేకపోవటం వల్ల అంతే నిజాయితీగా దాన్ని గురించి చాలా కూలంకషంగా పరిశోధించాను,దాని ఫలితమే ఈ పోష్టు!ఆ వూహ కూడా సరయిన ఫలితాన్ని ఇవ్వదనే అనిపిస్తున్నది నాకు.తెలంగాణాలో రాజయ్య వ్యవహారం పైకి కనబడేటంత సూటిగా జరగలేదు కాబట్టి గట్టి సాక్ష్యంగా చెప్పలేను గానీ అధికారంలో వున్నవాడు అవినీతి పరుడయితే దళిత ప్రాతిపదికన అక్కడికి చేరినా సాటి అవినీతిపరుల్తో చాలా ఈజీగా కలిసిపోయి మార్పుకి కావల్సిన సామాజిక సంస్కరణలకి అనుకూలంగా వుండడు అని అర్ధం చేసుకోవడానికి పనికొస్తుంది.

మార్క్సిష్టులు గతించి పోయిన చరిత్రనీ వర్తమాన సమాజాన్నీ అద్భుతంగా విశ్లేషించగలరు,కానీ  భవిషత్తు గురించిన సూత్రీకరణల దగ్గిర కొస్తే మాత్రం సైన్సు కెక్కువా మతానికి తక్కువా అన్నట్టు పిడివాదనలకి దిగిపోతారు?!యెందుకంటే ఇవ్వాళ యెన్నికల్లో నిలబడే బూర్జువా కమ్యునిష్టులు మొహమాట పడి చెప్పరు గానీ కమ్యునిష్టు సిధ్ధాంతం ప్రకారం విప్లవానికి సాయుధ పోరాటం తప్ప మరో దారి లేదని మార్క్స్ తెగేసి చెప్పాడు,లెనిన్ కూడా అదే చేశాడు?!సాయుధ పోరాటం అనగానే నెత్తురు చూస్తే కళ్ళు బైర్లు గమ్మే రకాలు ప్రతి చోటా వుంటారు గనక అదంత గబుక్కున ముందుకు దూకదగిన పరిష్కారం కాదు!నాకున్న అవగాహన మేరకు ఇవ్వాళా రేపూ మహాధ్భుతమైన మార్పుల్ని సాధించలేం.


స్వైన్ ఫ్లూ యెందుకొస్తుంది?!అపరిశుభ్రమయిన వాతావరణం వల్ల!మన పరిసరాలు పరిశుభ్రంగా వుండనంత కాలం చికెన్ గన్యా, స్వైన్ ఫ్లూ మరొకటీ మరొకటీ వేధిస్తూనే వుంటాయి.పోనీ వచ్చాక నయం చెయ్యగలుగుతున్నారా అంటే డాక్టర్లకే స్వైన్ ఫ్లూ అంటే యేమిటో తెలియక పేషెంట్లకి వైద్యం చెయ్యడానికి ముందుకు రావడానికి బదులు వాళ్లే దూరంగా పారిపోతున్న పరిస్థితి వుంది!అనారోగ్యాన్ని నిరోధించే ఆస్పత్రులే అనారోగ్య నిలయాలుగా వున్నాయి.రోగికి ఇవ్వడానికి మందులు లేని పరిస్థితి యెందుకు దాపరించింది? "స్వచ్చ భారత్" అని సెలెబ్రిటీలకి చీపుళ్ళిచ్చి హడావిడి చేసి దానిపేరుతో ప్రత్యేకంగా నిధులు పంపిణీ చేసే బదులు ప్రజారోగ్య శాఖ మరియు నగర పారిశుధ్య శాఖ అనే రెండూ ప్రభుత్వంలోని విభాగాలే కదా - వాటి పనితీరుని మెరుగు పరిస్తే ప్రతి పక్షాలు అభ్యంతరం చెబుతాయా వుగ్రవాదులు చెయ్యనివ్వబోమని బెదిరిస్తారా?శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు గాబట్టి మొదటిదిగా దీన్ని చెబుతున్నాను.ప్రభుత్వంలో ఆరోగ్య పరిరక్షణకి సంబంధించిన శాఖల నుంచి గరిష్ఠ ప్రయోజనాన్ని సాధించాలి!


ఇవ్వాళ్టి కులవ్యవస్థ తమకి అన్యాయం చేస్తున్నదని తెలుసుకుని పోరాడుతున్న వాళ్ళు చదువుకోవటం వల్లనే గదా అలా తయారయింది!చదువుకున్న ప్రతివాడికీ వుద్యోగం రాకపోయినా చదువు లేకపోవటం వల్ల తనకి జరిగే అన్యాయాల నుంచి తప్పించుకోగలుగుతాడు గదా?విద్యాశాఖని పనిగట్టుకుని దాన్ని నిర్వీర్యం చేసే రెసిడెన్షియల్ స్కూళ్ళ యజమానుల తొత్తుల నుంచి లాగిపారేసి కింది కులాల వాళ్ళు కూడా అతి తక్కువ ఖర్చుతో తమ పిల్లలకి మంచి చదువులు చెప్పించుకోగలిగే విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని పనిచేయించాలి.సాధ్యపడదేమో అనే అనుమానం కూడా లేకుండా తప్పనిసరిగా సాధించాల్సిన లక్ష్యమిది!


దేశం నిండా యెక్కడ చూసినా పరిశ్రమలూ వ్యాపారాలూ తామర తంపరగా విస్తరించినా అధిక సంఖ్యలో ప్రజలు వాళ్ల వుత్పత్తుల్నే కొని వాడుతున్నా మనం యెవరిని వుధ్ధరించాలని అనుకుంటున్నామో వాళ్ళింకా చేతిపనులతోనే హస్తకళలతోనే సతమతమవుతున్నారు!నాణ్యతలోనూ సౌకర్యంలోనూ బహుళజాతి కంపెనీల మరపనివాళ్ల కన్నా యెంతో ముందు వున్నా మార్కెట్ అనుకూలతల్ని గమనించకపోవడం వల్ల వెనకబడుతున్నారు.నేత పనివాళ్ళని వుదాహరణగా తీసుకుంటే వాళ్ళ కౌశలం అమోఘమే అయినా డిజైన్లు మాత్రం తాతల నుంచీ అలవాటయిన వాటితోనే సరిపెట్టుకుంటున్నారు, అందువల్లనే అవి కొనుగోలు దారుల్ని త్వరపడి కొనేటంతగా ఆకర్షించలేకపోతున్నాయి!కొత్త డిజైన్లని అతివేగంగా రూపొందించుకోవడానికి వాళ్లకి కంప్యూటరు ప్రపంచంలోని గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ వుపయోగపడవచ్చు.ఇంటర్నెట్ పరిజ్ఞానం మధ్యదళారులు లేకుండా తమ వుత్పత్తులకి తామే మార్కెట్ సృష్టించుకోవడానికి వుపయోగపడవచ్చు.ప్రతి ఒక్కరికీ నేర్పాల్సిన పనిలేదు వాళ్లలో వుత్సాహంగా నేర్చుకోగలిగిన వాళ్లకి నేర్పితే చాలు వాళ్ళు మిగతావాళ్లకి సహాయ పడతారు!అయినా మొదటి రెండూ నిక్కచ్చిగా జరిగీతే పూర్తి ఆరోగ్యంతో సరయిన విజ్ఞానంతో వున్నవాడు ఖాళీగా వుండడు గనక తన కాళ్ళమీద తను నిలబడటం అనే మూడోది దానంతటదే జరుగుతుంది!ప్రభుత్వంలో వున్నవాళ్ళు ప్రజల్ని తమ బతుకులు తాము బతకగలిగేలాగ చెయ్యకుండా తమ మీద ఆధారపడి బతికేలాగ వుంచేస్తేనే కేవలం తాము చేసే మంచిపన్లకి కృతజ్ఞతగా వచ్చేసారి కూడా తమకే వోట్లు వస్తారనే నికృష్టపు తెలితేటలు చూపించడమే ఇంత చిన్నచిన్న పనులు కూడా జరగకపోవడానికి కారణం!


ఆర్ధికపరమయిన వెనుకబాటుతనం కన్నా సామాజికంగా చెయ్యని తప్పుకి అవమానించబడటం మనిషిని మరింత బాధపెడుతుంది!"ఘర్ వాపసీ!" అని హడావిడి చేస్తున్న వాళ్లని "కిస్కా ఘర్?ఘర్ కహా హై?" అని అడిగితే యేమి జవాబు చెబుతారు?మాల కులస్థులూ మాదిగ కులస్థులూ హిందూ మతంలో భాగమే,కానీ వాళ్ళకి దేవాలయ ప్రవేశం నిషేధం!చట్టం ఒకటి అఘోరించింది గాబట్టి ముఖాన తలుపెయ్యకుండా రాష్ట్రపతి స్థానంలో వున్న వాడు వచ్చినా గడప దాటి బైటికెళ్ళగానే మైల పడిపోయినట్టు శుధ్ధి తంతులు చేస్తారు!అలాంటి పనులు చెయ్యకుండా నిగ్రహంగా వుండి సాటి మనుషులుగా గుర్తిస్తే ఇక్కడున్న వాళ్ళు సంతోషంగా సామూహిక వుత్సవాల్లో పాలు పంచుకునే వాతావరణం కల్పిస్తే బయటికి వెళ్లే అవకాశం యెందుకు వుంటుంది?మతమార్పిడులు డబ్బు ఇవ్వడం వల్ల కన్నా ఇక్కడ గౌరవం లేకపోవడం వల్లనే జరిగినాయని అందరికీ తెలుసు,అయినా డబ్బుతో మార్చడాన్నే ప్రముఖంగా యెందుకు చెప్తున్నారు?ఇవ్వాళ హిందూధర్మం బలహీనపడిందనేది నిజమె,కానీ ఘర్ వాపసీ పరిష్కారం కాదు - మన ఆధ్యాత్మిక సంస్కృతి మారాలి!కన్యాశుల్కంలో బండివాడు "బ్రాహ్మల్లో కూడా మంచివాళ్ళు వుంటారన్నమాట?!" అన్నట్టు కమ్యునిష్టుల్లో వున్న కొందరు మంచివాళ్ళు హిందూధర్మం గురించి ఒక చక్కని విశ్లేషణ చేశారు.హిందూధర్మాన్ని స్వయంచాలిత గడియారంతో పోల్చారు - అంటే తనకి తనే కీ ఇచ్చుకుని నడవగలిగే లక్షణం వున్నది అని అర్ధం!ఒడిదుడుకులు హిందూధర్మానికి కొత్త కాదు.శైవులూ వైష్ణవులూ కొంతకాలం తన్నుకు చచ్చారు.పెద్దలు కల్పించుకుని హరిహర మూర్తిని సృష్టించీ శివుడు యోగముద్రలో విష్ణువుని తలుస్తాడనీ విష్ణువు యోగనిద్రలో శివుణ్ణి ధ్యానిస్తానీ కధలు కల్పించి శాంతపర్చారు!బహుశా వుదారులైన ముస్లిము ప్రభువుల పాలనలో అనుకుంటాను ముస్లిములు ప్రార్ధనా సమయంలో చదివే కల్మాని అల్లోపనిషత్తుగా సంస్కృతీకరించినదీ బ్రాహ్మణులే!మళ్ళీ తనకి తనే కీ ఇచ్చుకోవాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు, లోపాల్ని దిద్దుకోవడం ద్వారానే హిందూ ధర్మం తిరిగి తల యెత్తుకుని నిలబడుతుంది!చర్చిల్నీ మసీదుల్నీ వారి వారి మతాల వారికి అప్పజెప్పేసి హిందూ ఆలయాల్ని మాత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలోకి తెచ్చిన లౌకికవాద ప్రభువులు దానికి పూనుకోవాలి.సమాజంలోని మేధావులు నిర్మాణాత్మకంగా సహకరించాలి.ఈ తరం అలాంటి మౌలిక సంస్కరణల పట్ల నిర్లక్ష్యంగా వుంటే ఇక యెప్పటికీ అది సాధ్యపడక పోవచ్చు?!


హెగెల్ గతితార్కిక బావవాదం అని చెప్పినదాన్ని తిరగేసి ఆర్ధికానికి ముడిపెట్టి గతితార్కిక భౌతికవాదంగా మార్చానని చెప్పుకున్న మార్క్స్ అంతిమ లక్ష్యమైన వర్గరహిత సమాజం గురించి చెప్పడానికి వచ్చేసరికి మళ్ళీ దాన్ని తిరగేసి భావవాదపు కల్పనలతో నింపెయ్యడంతో ఆ లక్ష్యం యెంత ఆశించదగినదయినా ఇంతవరకూ భూమి మీద ఆవిర్భవించలేదు గాబట్టి యెప్పటికయినా సాధ్యపడుతుందంటే నమ్మడం కష్టం!కానీ భారతదేశానికి నేను సూచించే లక్ష్యం మాత్రం ఒకప్పుడు ఈ భూమి మీదే చాలా కాలం పాటు మనగలిగింది!ఇవ్వాళ యెందుకు చేస్తున్నామో కూడా తెలుసుకోకుండా అమరికన్ తరహా జీవనవిధానాన్ని కాపీ కొడుతున్నట్టు కాకుండా సింధు నాగరికత లోని ప్రజల జీవన విధానం నుంచి అసలైన స్పూర్తిని ఆచరణలోకి తెచ్చుకోవాలి!దానికి తోడుగా ఆర్ధిక విధానంలో మార్క్సిష్టులు చెప్పే అదనపు విలువని సమాజపరం చెయ్యడం అనే లక్ష్యాన్ని యెవరి పెత్తనమూ లేకుండానే ఒకప్పటి మనవాళ్ళు వొప్పుకుని పాటించిన దేవీభాగపు సాంప్రదాయాన్ని పాటించాలి!ఈ రెండూ సాధించగలిగితే భారత దేశం యెప్పటికీ ప్రపంచానికి ఆచార్య స్థానంలోనే నిలవడం తధ్యం!!ఒకే సారి పది అంచెల్ని వర్ణిస్తే భయసంకోచాలతో మొదటి అడుగే పడదు గనక ఇప్పుడున్న స్థితికి అతి దగ్గిరగా వున్న మెట్టుని చేరుకోవడానికి సాధించాల్సిన మూడు విషయాల్ని మాత్రమే సూచించి వొదిలేస్తున్నాను,నాలుగోది కొసరు!


నిజాని కివన్నీ మనం గొంతు చించుకుని అడగక్కర్లేదు, చట్టసభల్లో అడుగుపెట్టే రోజున వాళ్ళు చేసే ప్రమాణాల్లో వాళ్ళు వుధ్ధరిస్తామని చెప్తున్నవే. వీటిని నిక్కచ్చిగా చేస్తే అయిదేళ్ళు కాదు యాభయ్యేళ్ళయినా వాళ్లని అధికారంలో వుంచడానికి ప్రజలు వెనకాడరు?!కానీ వాస్తవ సమస్యలకి వాస్తులో పరిష్కారాల్ని వెదుక్కునేవాళ్లకి అది అర్ధం కావడం లేదు!ముహూర్తాలు చూసి మంత్రివర్గ సమావేశాలు యేర్పాటు చేసుకుంటే దారిలో వున్న ముళ్లకంపలు వాటంతటవే మాయమౌతాయా?పాతకాలం వాడైన నిజాము ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు,ప్రజలకి చదువు చెప్పించలేదు అని తప్పులు పట్టి గర్జించే అర్హత నిజంగా వీళ్ళకుందా?ఆధునికులమని చెప్పుకునే వీళ్ళ లౌకికత్వం వెల్లివిరిసే ప్రజాస్వామ్యబధ్ధమైన పరిపాలన కూడా అట్లాగే అఘోరిస్తున్నది గదా!



మంత్రాలకి చింతకాయలు రాలవు,వాస్తు వైభవాల్ని తీసుకు రాలేదు,స్వాప్నికులు యదార్ధాన్ని చూడలేరు!సృజించే శక్తి భూమికీ స్త్రీకే వుంది!పూజించి తీసుకుంటే సకల సంపదల్నీ ఇచ్చే భూమిని ఇష్టారాజ్యంగా అమ్మడం పాడుచెయ్యడం చేసేవాడిని దరిద్రం వెతుక్కుంటూ వొచ్చి కావిలించుకుంటుంది!మెప్పించి అందుకుంటే అన్ని సుఖాల్నీ ఇచ్చే స్త్రీని హింసించి ఆనందించాలనుకునేవాడు పరలోకంలో కాదు ఇక్కడే ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తాడు!యేది సత్యమో అదే శివమైనదీ అవుతుంది!యేది శివమో అదే సుందరమూ అవుతుంది!!


సత్యం శివం సుందరం!!!

Tuesday, 3 February 2015

మళ్ళీ కాంగ్రెసుకి జీవం ఆంధ్రా వాళ్ళే పోస్తారా?

            చావబోతున్న పార్టీ మళ్ళీ బుసకొడుతున్నది?క్రూరంగా విభజించి అన్యాయం చేసినందుకు కాంగ్రెసు చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రంలో సున్నాకి దించారు!యేమి లాభం ఇద్దరు స్మార్ట్ నాయుళ్ళూ తమ దివాళాకోరు రాజకీయంతో కాంగ్రెసుకి కోరలు తగిలిస్తున్నారు?!వీరంగాలు వేసేటందుకు రంగభూమిని సిధ్ధం చేస్తున్నారు,చేజేతులా ఆయుధాలు సమకూరుస్తున్నారు.భాజపా వాజపేయికాలం నాటిలా అమాయకమైన పార్టీ కాదు?!మొన్నటి యెన్నికల్లో మిగతా దేశమంతా యెట్టాగూ మోదీ హవా తో కొట్టుకొస్తాం గదా అనే ధీమాతో అనుకుంటా తను వోడిపోయినా బాబుని బలహెనుణ్ణి చెయ్యాలని మితృత్వం నటిస్తూనే తనకిచ్చిన సీట్లలో దద్దమ్మల్ని నిలబెట్టి తొండి రాజకీయం చెయ్యబోయింది.సమయానికి బాబు కళ్ళు తెరిచి ఇచ్చిన సీట్లు కూడా వెనక్కి లాక్కుని హడావిడిగా గట్టి అబ్యర్ధుల్ని నిలబెట్టడం వల్ల పరువు దక్కింది గానీ అన్ని కేసులతో సతమతమవుతున్నా ఇప్పటికీ నువ్వా నేనా అంటున్న జగన్ ఈజీగా ముఖ్యమంత్రి ఐ వుండేవాడు - కనీసం ఇంకా గట్టి పోటీ ఇచ్చి ఇవ్వాళ్టి ధీమా లేకుండా చేసేవాడు.

        ఇప్పుడు కూడా ప్రధానమంత్రి దగ్గిర్నుంచి వెంకయ్య నాయుడు వరకూ ఆంధ్రాని ఆదుకోవడం మా బాధ్యత,కాంగ్రెసు చేసినట్టు మేము చెయ్యం అంటూనే ప్రత్యేక ప్రతిపత్తి లేదని ముఖానే చెప్పేసి ఆంధ్రాకి రావలసిన నిధుల్లోనూ కోతపెట్టి మాట ఇచ్చి తప్పడం అనే ద్రోహానికి పూనుకుంది.కమలమే సకలం కావాలని ఆశించే భాజపా యే ముఖం పెట్టుకుని ఆంధ్రాకి తను మాట ఇచ్చినవి ఇవ్వకుండా వోట్లడుగుతుంది?ఆంధ్రాలో యేనాడూ సొంత బలమ లేదు!బాబు సాయం లేకుండా సొంతంగా ఒక్క సీటు కూడా రాదు?ఇప్పుడు కృష్ణాతీరం కబ్జాలో భాజపా వాళ్ళూ వున్నారని బయట పడుతున్నది.ఇలాంటి బేఖారీ గాళ్ళని చూసి యెవడూ వోటు వెయ్యడు భాజపాకి!భాజపాకి యెప్పటి నుంచి బలం పెరిగిందో అందరికీ తెలుసు?వాజపేయిని చూసీ కాంగ్రెసులో వున్నంత అవినీతి పరులు భాజపా లో లేకపోవడం వల్ల వున్నత స్థాయి రాజకీయాల్ని కోరుకునే వాళ్ళంతా అభిమానించడం వల్లనే భాజపా బలపడింది. 

              గోకరాజు లాంటివాళ్ళు పెరిగాక భాజపా ఇలాంటి వాళ్ళ అండతో అధికారం లోకి వచ్చిందా?భాజపా అధికారం లోకి వచ్చాక వీళ్ళ హవా పెరిగిందా?ప్రజలకి యేదయినా ఒకటే!భాజపా కూడా కాంగ్రెసు పధ్ధతిలోనే వెళ్తే ప్రజలకి యేపార్టీ అయినా ఒకటే అనిపిస్తే పాత పార్టీ కాంగ్రెసు మీద సానుభూతి పెరుగుతుందే తప్ప కొత్త పార్టీని కావిలించుకోరు!అలవాటుగా భాజపాకి పడతాయనుకున్న వోట్లన్నీ కాంగ్రెసుకి పడ్తాయి.ఆ ధైర్యం తోనే రఘువీరా రెడ్డి విజృంభిస్తున్నాడు!చంద్రబాబు కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని తనకి తనుగా రాబట్టలేనని తెలిసి పెట్టుబడుల కోసం అంటూ రాజధాని కట్టడం కోసం అంటూ చేస్తున్న హడావిడి జనాల్లో కష్టపడుతున్నాడనే ఇమేజి రప్పించటం వల్ల తెదెపా వోటుబ్యాంకు ప్రస్తుతానికి క్షేమంగానే వున్నా కేంద్రం నుంచి యేమాత్రం సాయం రాకపోయినా ఇంకా భాజపాని అంటకాగుతూ వుంటే తొందర్లోనే ఆ పార్టీకి కూడా గడ్డు పరిస్థితి యెదురు కావచ్చు.

           భాజపా మాత్రం కేంద్రం లో వెంకయ్య నాయుడు అట్లా చక్రం తిప్పుతూ వుండి కూడా తెదెపా నుంచి నలుగుర్ని కేంద్రమంత్రులుగా తీసుకుని కూడా ఆంధ్రాకి తను వాగ్దానం చేసినవి ఇవ్వకుండా ఆంధ్రపరదేశ్ నుంచి బలమైన ప్రాతినిధ్యాన్ని ఆశిస్తే మాత్రం అది అత్యాశే అవుతుందిభాజపా రాష్ట్రంలో ఆశిస్తున్న స్థానాన్ని కాంగ్రెసు ఆక్రమించడం ఖాయం!ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం లో ఇవ్వాళ ప్రతి ఒక్కరికీ ఈ రాష్ట్రం తమ కన్యాయం జరిగేలా విభజించబడిందనేది తెల్సు.ఇప్పుడు యెవరేమి చేస్తారు అనే విషయాన్ని వాళ్ళు ప్రశాంతంగా వుంటూనే వెయ్యి కళ్లతో యెదురు చూస్తున్నారు.వాళ్ళని మోసం చేసి నెగ్గుకు రావడం కష్టం!

              మోదీ హవా మీద అతినమ్మకం తొలగి పోయి మిత్రుల్ని కూడా మింగేసి యెదుగుదామనుకుంటున్న హజం తగ్గాలంటే డిల్లీలో వోటమి తప్పని సరి.నేను మనస్పూర్తిగా డిల్లీలో భాజపా వోటమిని కోరుకుంటున్నా!పైగా అఖరి నిమిషాల్లో బేదీని దించి యెటూ ప్రమాదకరమైన యెత్తునే వేసింది.ఆ యెత్తు వికటిస్తే గానీ కళ్లకి పట్టిన పొరలు చిరగవు?!అక్కడ గెల్చినా గెలవకపోయినా ఆంధ్రాలో కాలు మోపాలంటే మాత్రం ఆంధ్రాకి తను వాగ్దానం చేసిన ప్రత్యేక హోదానీ పన్నుల రాయితీని ఖచ్చితంగా రాష్ట్రానికి ఇవ్వాలి?!ఒకసారి లేస్తే కాంగ్రెసుని ఆపడం కష్టం?!

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...