Thursday 15 October 2015

కళాపూర్ణోదయం ఒక శృంగార విజ్ఞాన సర్వస్వం!

     నేనొక చిలకని!అలాంటిలాంటి చిలకననుకుంటున్నారేమో నన్ను,బ్రహ్మలోకంలో సరస్వతీదేవి వద్ద ఉన్న పెంపుడు చిలకని నేను!యెక్కడున్నా చిలక చిలకే గదా అని తీసిపారెయ్యకండి - అర్ధంతరంగా నడమంత్రం జేరితే యెంకటేసు కాస్తా వెంకటేశ్వర్లు కావటం లేదూ?ఒకసారేమైందో తెలుసా,బ్రహ్మ పంజరంలో ఉన్న నన్ను చూసి,"ఏమే చిలుకా!ఏమీ తోచకుండా ఉన్నది.ఒక కమ్మని కధ చెప్పవే?" అన్నాడు.అప్పుడు నేను - "స్వామీ!మీ ముందు నేను కధలు చెప్పేపాటి దాననా!" అన్నాను."అయితే నేనే నీకొక కధ చెబుతాను వినవే" అంటూ పరమేష్ఠి ఒక కధ చెప్పాడు.

   "కాసారపురం అనే పట్టణంలో కళాపూర్ణుడనే ఒక రాజున్నాడు.అతను పుట్టుకతోనే యువకుడుగా పుట్టాడు.స్వభాసిధ్ధుడు ఇచ్చిన అరుణమణిని ధనుర్భాణాలను స్వీకరించి బలాఢ్యుడై తన ప్రాభవాని కడ్డుగా ఉన్న రాజులందరినీ జయించాడు.ఇలా ఉండగా ఒకప్పుడు మదాశయుడనే రాజు రూపానుభూతి అనే భార్యతోను,ధీరభావుడనే మంత్రితోను వచ్చి కళాపూర్ణుడితో యుధ్ధానికి తలపడ్డాడు.అయితే కళాపూర్ణుడు తన కోదండవిహారంతో వారిరువురినీ చిత్తుచిత్తుగా ఓడించాడు.ధీరభావుడు పారిపోయాడు.మదాశయుడు శరణు వేడుకున్నాడు.అప్పుడు కళాపూర్ణుడు మదాశయుణ్ణి,అతని భార్యను కూడా తనకు సేవలు చేయడానికి నియమించాడు."

    బ్రహ్మ ఇట్లు కధ చెప్తుండగా విని సరస్వతి నవ్వింది."ఏమే చిలుకా!అయితే ఆ కళాపూర్ణుడు తరవాత ఏమైనాడు?అతని తల్లి దంద్ర్లూ,భార్య ఎవరు?అది అడుగవే" అని నాతో పలికింది.అప్పుడు నేను అట్లాగే బ్రహ్మను అడిగాను.అంతట ఆయన "కళాపూర్ణుడి భార్య అభినవ కౌముది.తండ్రి సుముఖాసత్తి!తల్లి మణిస్తంభుడు?" అని చెప్పాడు.ఇది వినగానే సరస్వతీదేవికి కోపం పూర్తిగా పోయి నవ్వు వచ్చింది.పకపకా నవ్వుతూ "ఏమిటీ?ఆ రాజు తల్లి మగవాడూ,తండ్రి ఆడదీనా?విడ్డూరంగా ఉన్నదే!" అని ప్రశ్నించింది.తరచాత కధ ఏమిటో చెప్పమని కూడా పరమేష్ఠిని కోరింది.

     అప్పుడు బ్రహ్మ శారదకు కోపం పోయిందని,ప్రసన్నురాలైనదనీ గ్రహించాడు.ఈ కధ చెప్పి తను ఆమెను వశపరుచుకొనగలిగితిని గదా అని లోలోపల సంతోషించాడు.మన్మధోద్రేకం పెల్లుబికి రాగా శారద కంఠాన్ని గట్టిగా కౌగలించుకున్నాడు!తన నాలుగు ముఖాలతో ఆమె అధరాన్ని తనివితీరా ముద్దాడాడు!అంతట సరస్వతి "తరవాత కధ ఏమిటో చెప్పండి స్వామీ!" అని తొందరపెట్టింది.అప్పుడు బ్రహ్మ "తరవాత ఏమున్నదీ!ఆ మహారాజు సత్వదాత్ముడనే తన మంత్రి అంగదేశమందలి క్రముకకంఠోత్తరమనే పట్టణమున తనకు పట్టము గట్టి నిల్పగా రాజ్యం చేస్తున్నాడు.సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నాడు.ఇక మదాశయుడు ఆ పట్టణానికి బంగారు కోట కట్టించి రాజు కృపకు పాత్రుడైనాడు!తన భార్యతో కూడా రాజుకు సేవ చేస్తూ గడుపుతున్నాడు.ఆ కళాపూర్ణుడి దగ్గిర గొప్ప మహిమ గల మణి ఒకటి ఉన్నదని చెప్పాను గదా!దానిని చూస్తూ ఉన్న కారణంగా మదాయ రూపానుభూతులకు మధురలాలస అనే చక్కని కుమార్తె పుట్టింది.మదాయుడి దగ్గిర నలుగురు పురోహితులు ఉన్నారు.ప్రధమాగముడు,ద్వితీయాగముడు,తృతీయాగముడు,తురీయాగముడు - అని వారి పేర్లు!వారు కూడా యధాశక్తి తమ ప్రభువు ధరించే ఆ దివ్యమణిని పర్యాయంగా పట్టి దాని సంస్పర్శన సుఖం చేత ఆనందం పొందుతూ ఉన్నారు.వారంతా తనను ఆశ్రయించుకుని ఉన్నవారు కావడం వల్ల వారి చేష్టలకు కళాపూర్ణుడు కూడా సమ్మతించాడు.అయితే ఒకసారి ఆ నలుగురు పురోహితులలో ఒకడు ఆ మణిని గట్టిగా నొక్కిపట్టగా కళాపూర్ణుడికి కోపం వచ్చింది.వాళ్ళను వెళ్ళగొట్టాడు.వారు అపరాధం చేసినందున వారి స్వామి అయిన మదాశయుని బంగారుకోటలో ఉండటాన్ని కళాపూర్ణుడు సహించలేకపోయాడు.వెంటనే దానిని పడగొట్టించాడు.అందుకు మదాయుడు కోపం తెచ్చుకోకుండా స్వామీ - ఎంతచెడ్డా నేను మీవానే - వద్దంటే యెక్కడికి పోతాను - మీ దేశంలోనే యెక్కడో ఒకచోట బ్రతుకుతాను అని ప్రార్ధించాడు.తన భార్య రూపానుభూతిని తన కుమార్తె మధురలాలసను తీసుకుని క్రముకకంఠోత్తరపురం నుండి దూరంగా వెళ్ళీపోయాడు.అలా కొంత దూరం వెళ్ళగా ఒకచోట పూర్ణకలశద్వయం శోభాయమానమై కనిపించింది.అందుకు సంతోషించి వాటి మధ్యదేశంలో స్థిరనివాసం యేర్పరచుకున్నాడు.అయితే క్రముకకంఠోత్తరపురం నుండి బయలుదేరి వచ్చేటప్పటి ప్రయాణక్షోభ వల్ల వారి కుమార్తె మధురలాలస కృశించిపోయింది.ఎన్నాళ్ళు గడించినా ఆ పిల్ల మళ్ళీ తేరుకోలేదు.అందువల్ల్ల మదాయుడు మళ్ళీ తన కుటుంబంతో క్రముకకంఠోత్తరపురానికి తిరిగి వచ్చాడు.సకుటుంబంగా కళాపూర్ణుడి కొలువుకి వెళ్ళి అతన్ని సందర్శించాడు.కళాపూర్ణుని చూడడం వల్ల మధురలాలస కృశత్వం పోయి ఎప్పటివలె పుష్టిగా తయారైంది.అప్పుదు మదాయుడు రూపానుభూతి తమ ముద్దుల కూతురుకు పట్టిన అవస్థ చెప్పుకున్నారు.కరుణించమని వేడుకున్నారు.కళాపూర్ణుడు ప్రసన్నుదై వారిని సమాదరించాడు.ప్రధమాగమాది పురోహితులు కూడా మళ్ళీ ఎప్పటివలె వినయవిధేయతలతో మెలగుతూ వచ్చారు.కొంత కాలం గడిచింది.మధురలాలస పెరిగి పెద్దదయింది.కళాపూర్ణుని సౌందర్యం చూచి ఆమె అతన్ని మోహించింది."

     బ్రహ్మ ఈ విధంగా చిలవలు పలవలుగా అల్లుకుపోతున్న కధ చెప్తుండేటప్పటికి వింటున్న సరస్వతికి రోషం వచ్చింది."చాల్లెండి ఇక మీ చమత్కారాలు!ఇప్పుడు మనమధ్య జరిగినదే - మీరొక కధగా కల్పించి మారుపేర్లు పెట్టి చెప్పారు.ఆ మాత్రం నాకు తెలియదనుకున్నారా?నన్ను తెలివితక్కువదాన్ని చేసి తాటాకులు కట్టాలనుకున్నారా?" అని చిరుకోపంతో నిలదీసింది.

     "ఇక్కడి సరోవరానికే మీరు కాసారపురం అని పేరు పెట్టారు.సరోవరజలంలో ప్రతిఫలిస్తున్న నా ముఖబింబాన్ని కళాపూర్ణుడని చెప్పారు.నా ముఖచంద్రుదు తక్కిన ముఖచంద్రుల కంటె మిన్నగా ఉన్నాదని చెప్పటానికి గాను ఆ కళాపూర్ణుడు తక్కిన రాజులందరినీ జయించాదని చెప్పారు.ఇక అతడు స్వభావుడనే సిధ్ధ్డి వల్ల ధనుర్బాణాలు,అరుణమణీ,శలాక సంపాదించాదని చెప్పటం భ్రూలతా,వీక్షణ,అధరములు స్వభావము చేతనే ఆకర్షణ కలిగినవని చెప్పడం లేదా?ఇక మదాశయుడు రూపానుభూతితోను ధీరభావునితోను వచ్చాడనీ కళాపూర్ణుడు తన కోదంవిహారము చేత ధీరభావుని తరిమివేశాడనీ మదాశయ,రూపానుభూతులకు ఆశ్రయం ఇచ్చి వారి సేవలందుకున్నాదని వర్ణించారు మీరు - ఆ కాసారానికై మీ హృదయం మీ దృష్టి ధైర్యంతో ఒక్కించుక ప్రవర్తించగా - నా ప్రతిబింబం భ్రూవిలాసంచే మీ ధైర్యాన్ని పోగొట్టి మీ హృదయాన్ని దృష్టిని ఆకర్షించిందని చెప్పడానికే మీరు అలా వర్ణించారు.అవునా?మీ మాటలు విని నాకు నవ్వు వచ్చంది.అప్పుడు మీరు నా ప్రతిబింబంలో కనిపించిన నవ్వుకు లేత వెన్నెలతో అభేదం కల్పించారు.దానికి అభినయ కౌముది అని పేరు పెట్టి స్త్రీని చేసి అది కళాపూర్ణుణ్ణి వరించిందన్నారు.ఇకపోతే కళాపూర్ణుడి తండ్రి సుముఖాసత్తి అనీ,తల్లి మణిస్తంభుడనీ తల్లిదండ్రుల పేర్లు తారుమారు చేసి చెప్పారు.అది నా ప్రతిబింబం శోభనమగు ముఖసామీప్యం కారణంగా సరోవరం నడుమన గల మణిస్తంభము యొక్క గర్భమున ఉదయించేనని చెప్పడం కాదా?నేను మీ మాటలకు నవ్వుతూ మీకు అభిముఖంగా తిరిగాను.అప్పుడు సరోవరంలో ప్రతిబింబం మాయమై నా ముఖం మీ యెదుట కనిపించింది.అది నా దేహమందు కంఠం పై భాగాన కనిపించటం చేతనే కదా మీరు కళాపూర్ణుడు అంగదేశమున క్రముకకంఠోత్తర పురమున పట్టం కట్టుకున్నాని వర్ణించినది?అది నా ఆత్మాధీనం కనుక సత్వదాత్ముడని పేరు పెట్టారు.తరవాత మీరు నా కంఠాన్ని కౌగిలించారు.అది మీ ఆత్మాధీనం కావడం మీ బాహువులు సువర్ణమయం కావడం - దీనినే మీరు మదాశయుడు క్రముకకంఠోత్తరపురాన బంగారుకోట కట్టించాని వర్ణించారు!మీ ఆత్మ, దృష్టి ఏ మమతావశంబుననో నా ముఖముపై పాయక వర్ధిల్లుతూ మధురాధరేచ్చ కలిగియుండటం గురించి మీరు మదాయ రూపానుభూతులు కళాపూర్ణుని సేవిస్తూ అతని మణిలాక మహత్యం వల్ల మధురలాలస అనే కుమార్తెను కన్నారని అభివర్ణించారు,అవునా!ప్రధమాగమాదులగు మదాశయుని పురోహితులు ఆ మణిని పట్టి చూస్తూ దాని స్పర్స వల్ల ఆనందం పొందేవారని మీరు అన్నారు.నన్ను ముద్దాడిన పిమ్మట మీ నాలుగు ముఖాలూ అధరామృత పానం వల్ల ఇంపొందినవని చెప్పడానికి మీరీ కల్పన చేశారు.తరవాత అధరపీడనం వల్ల్ల నాకు కోపం వచ్చింది.మిమ్మల్ని వారించాను.మీ కౌగిలి విడిపించుకున్నాను.ఈ విషయాన్నే మీరు - పురోహితులలో ఒకడు మణిని గట్టిగా నొక్కినప్పుడు కళాపూర్ణుడు కోపించి వారిని వెళ్ళగొట్టాడనీ మదాశయుడు కట్టించిన బంగారుకోటని పడగొట్టాడనీ వర్ణించారు.అటుపైన మీ మనస్సూ, దృష్టీ నా ముఖంపైన కాక తక్కిన అవయవాలపై లగ్నమైనాయి.దానినే మీరు మదాయుడు భార్యాసమేతుడై కళాపూర్ణుని సేవ చాలించి,తదాశ్రయమైన అంగదేశానికి వెళ్ళిపోయాడని చెప్పారు.పూర్ణకలశద్వయాన్ని చూచాడని చెప్పి నా కుచకుంభాలను,మధ్యదేశంలో ఉన్నాడని చెప్పి నా నడుమును వర్ణించారు,అవునా?ముఖమును చూడటం మానినందున అధరేచ్చ అణిగింది మీకు.ఆ విషయాన్నే మీరు ప్రయాణక్షోభ వల్ల్ల మధురలాలస కృశించిందని చెప్పారు.తర్వాత మళ్ళీ మీ చిత్తం,మీ దృష్టి నా ముఖం మీద లగ్నమైనాయి.నన్ను మీరు తనివితీర ముద్దాడి సంతుష్ఠులైనారు.ఈసారి మీ కోరిక తీరింది.ఈ సంగతినే మీరు మదాయుడు మరల కళాపూర్ణుడి దగ్గరకు వచ్చాని,మధురలాలస కృశత్వం పోయి తిరిగి యౌవ్వనం పొందినదని,కళాపూర్ణుని అనుగ్రహం పొందినదని చమత్కారంగా కల్పన చేశారు!ఈ మాత్రం నాకు తెలియదనుకున్నారు,ఇప్పుడు చెప్పండి!నేను చెప్పినదంతా సరిగ్గా ఉందా - లేదా!"

     బ్రహ్మ చెప్పిన కధకు సరస్వతి ఈ విధంగా వ్యాఖ్యానం చేసి ఆ కధలోని అంతరార్ధాన్ని విడమరిచి చెప్ప్పింది.బ్రహ్మ సరస్వతుల శృంగార క్రీడయే ఈ కధారూపం దాల్చాయి.బ్రహ్మ సరస్వతిని మెచ్చుకున్నాడు - ఆమె చెప్పిన వ్యాఖ్యానం నూటికి నూరుపాళ్ళు సరిగ్గా వుందని శ్లాఘించాడు.నేను పక్షిని కనుక నాకు తెలియదనో,మరే కారణం వల్లనో బ్రహ్మ సరస్వతులు నన్ను లెక్కలోకి తీసుకోక తమ శృంగారక్రీను గురించి ఈ విధంగా నా సమక్షంలోనే మాట్లాడుకున్నారు.కొన్నాళ్ళు గడిచాక ఒకప్పుడు ఈ ప్రసంగాన్ని మననం చేసుకుంటూ ఉన్నాను.ఆ సమయంలో బ్రహ్మను సేవించటానికి దేవేంద్రుడు వచ్చి ఉన్నాడు.ఆయన వెంట రంభ కూడా వచ్చి బ్రహ్మలోకమంతా తిరుగుతూ నేనున్న చోటికి వచ్చి నేను మనం చేసుకుంటుండగా విన్నది.చాలా బాగున్నదని రంభ ఆ కధని నా చేత రెండు మూడు సార్లు చెప్పించుకున్నది.అంతలో సరస్వతీదేవి అక్కడికి వచ్చి ఎక్కడ లేని కోపంతో "ఓసీ!ఏమిటే ఆ వాగుడు?" అని తిట్టింది."నీవు చేసిన పనికి భూలోకంలో వేశ్యవై పుట్టుదువు గాక!" అని నన్ను శపించింది.సరస్వతీదేవి కోపం చూసేటప్పటికి రంబహ్కు వొణుకు పుట్టి ఒక రత్నస్తంభం చాటుకు పోయి దాక్కుంది.ఇంతలో బ్రహ్మ కూడా అక్కడికి వచ్చాడు.విషయమంతా తెలుసుకుని "ఏమే!మీ అమ్మ నీకు శాపం ఇచ్చిందని దుఃఖపడకు.ఆ జన్మలో వేశ్యగా పుట్టినప్పటికీ మరుసటి జన్మలో మదాయుడనే రాజుకు మధురలాలస అనే పేరుతో పుత్రికవై జన్మిస్తావు.కళాపూర్ణునే గొప్ప రాజుకు భార్యవౌతావు.భోగభాగ్యాలు అనుభవిస్తావు" అని నన్ను ఓదార్చాడు.అప్పుడు సరస్వతీదేవి బ్రహ్మను చూచి "ఏమిటి ప్రాణేశ్వరా!మళ్ళీ మీరు వెనుకటి కధ ప్రారంభించారే!" అంది.

     "అవును,నేను చెప్పినట్లు జరిగి తీరుతుంది" అన్నాడు బ్రహ్మ."అయితే మీరన్నట్లు తల్లి మగవాడు,తండ్రి ఆడది కూడా అవుతుందా?" అని శారద ప్రశ్నించింది."అవును,అలాగే జరుగుతుంది" అని బ్రహ్మ సమాధానం చెప్పడు."యేమైనప్పటికీ ఏకాంతంగా మనం సంభాషించుకున్న వృత్తాంతం లోకంలో వెల్లడి కావదం శ్రేయస్కరం కాదు స్వామీ!" అని మళ్ళీ అడ్డు చెప్పింది సరస్వతి."ప్రాణేశ్వరీ!మనం ఎంత వద్దన్నా,ఏమి చేసినా ఈ కధ లోకంలో వ్యాపించక మానదు" అని బ్రహ్మదేవుడు ఖండితంగా చెప్పాడు.అంతట సరస్వతీదేవి రంభను బయటికి పిలిచి "రంభా!చిలుక వల్ల విన్నావు కానీ,ఎక్కడయినా సరే,ఎప్పుడయినా సరే,నీవు ఈ విషయం బయటపెట్టావా జాగ్రత్త!" అని ఆజ్ఞాపించింది.అలాగే ఈ విషయం ఎవరి వద్దా బయటపెట్టనని బ్రజ్మచేత కూడా సరస్వతి వాగ్దానం చేయించుకున్నది."ఇక ఈ సంగతి ఎలా వెల్లడి అవుతుందో చూస్తాను" అని పంతంగా పలికింది.అయితే బ్రహ్మ ఆమె మాటలు ఖండించాడు.ఈ కధ భూలోకంలో వ్యాపించటానికి ఏదో విధంగా మార్గం ఏర్పడుతుందనీ ఈ కధ చెప్పిన వారూ,విన్నవారూ కూడా భూమిపై పుత్రపౌత్రాభివృధ్ధి,ధనధాన్యసంపత్తి గలిగి భోగభాగ్యాలతో కలకాలం సర్వసౌఖ్యాలూ అనుభవిస్తారనీ, ఆ విధంగా తను వరం ఇచ్చి ఆశీర్వదిస్తున్నాననీ బ్రహ్మదేవుడు పలికాడు!
-----------------------------------------------------------------------------------------------------------------
     ఒక అద్భుతమైన కల్పిత కధాకావ్యం కళాపూర్ణోదయం.దీనిని రచించిన వాడు పింగళి సూరన.మన ప్రాచీన కవుల్లో యెవరి కాలాన్ని లెక్కగట్టాలన్నా అదో బ్రహ్మభెద్యమైన ప్రహేళికలా తయారవుతున్నది.దీనికి కారణం "పురాణ మిత్యేవ న సాధు సర్వం!" అన్న వాక్యాన్ని బట్టి తమ కావ్యం త ప్రాచీనమైనది అయితే అంత గొప్ప అనే భావం కావచ్చు.మరొకటి తమ రచనల పట్ల ఉండే గర్వం,తమ అస్తిత్వం పట్ల వినయం కలిసి "నా గురించి నేను చెప్పుకోవడం దేనికి?నా కావ్యంలో సత్వం ఉండి అది ఆచంద్రతారార్కం నిలబడితే చాలదా!" అనే మనస్తత్వం కూడా మనకి వారి గురించి ఏ సాక్ష్యాల్నీ వారి కావ్యాల్లో కనబడకుండా చేసింది.ఈ కావ్యాన్ని సూరన నంద్యాల కృష్ణభూపతికి అంకితం ఇచ్చాడు.నంద్యాల కృష్ణభూపతి శా.శ 1526(క్రీ.శ 1605) ప్రాంతంలో నంద్యాలకు రాజుగా ఉన్నట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి.గరుడపురాణం,గిరిజా కళ్యాణం,రాఘవ పాండవీయం,కళాపూర్ణోదయం,ప్రభావతీ ప్రద్యుమ్నం ఇతని రచనలు.మొదటి రెండు దొరకటం లేదు.రాఘవ పాండవీయం రెంర్ధాలు వచ్చే విధంగా రామాయణ మహాభారత కధల్ని ఒకే కావ్యంలో జోడించి చెప్పిన ద్వర్ధి కావ్యం!రెండవదైన కళాపూర్ణోదయం ఎనిమిది ఆశ్వాసాల  అద్భుత కావ్యం.

   మహాకవి సూరనార్యుడు కళాపూర్ణోదయ కధను ఎనిమిది ఆశ్వాసాలుగా రచించిన తీరు చూస్తే అత్యద్భుతమైనదిగా కనిపిస్తుంది.కధను వివరంగా చెప్పే పధ్ధతులు రెండు.సంఘటనలు జరిగిన కాలక్రమానుసారంగా కధను అల్లుకుపోవడం ఒక పధ్ధతి.అలాకాక కాలక్రమాన్ని వదలిపెట్టి సందర్భోచితమైన ఏదో ఒక సంఘటనతో కధ ప్రారంభించిన అతరువాత ముందువెనుకలుగా కధను పెంచుకుంటూ పోయి ఒక ఘట్టంలో పూర్తి చేఅయదం రెందవ పధ్ధతి.ఇలాంటి పధ్ధతిని అనుసరించిన ఆంధ్రకవి మరొకరు లేరు!

     కాలక్రమాన్ని బట్టి చూస్తే పైన నేను ఉదహరించిన కధా ప్రారంభం అయిదవ ఆశ్వాసంలో వస్తుంది.మరొక కవి అయీతే దానినే ప్రధమాశ్వాసంగా చేసి కధ మొదలు పెట్టేవాడు.అలాకాక సూరనార్యుడు కడపటి విషయంతో కధ ప్రారంభించాడు.కధ మధ్యభాగాన్ని ముందు వెనుకలు చేశాడు.చేసి కధ మొదటి భాగాన్ని చివర చేర్చాడు.అలా చేర్చి,ప్రధాన కధతో చాలా దగ్గర సంబంధం ఉన్నప్పటికీ ఆ విషయం తెలియనివ్వకుండానే అనేక అవాంతర కధల్ని చమత్కారంగా కల్పించాడు.ఆది నుంచి అంతం వరకూ కనపడీ కనపడకుండా ప్రధాన కధ మహావేగంగా పరిగెత్తేటట్లు కావ్యం రచించాడు.కనుకనే ఆషామాషీగా కళాపూర్ణోదయం చదివితే అర్ధం కాదు.శ్రధ్ధగా రెండు మూడుసార్లు చదివితే చదివిన కొద్దీ చవులూరించే కమ్మని కావ్యం ఇది!ఆసక్తితో చదవటం మొదలుపెడితే అయిపోయే వరకూ చుట్టలు చుట్టలుగా చుట్టుకున్న జిలేబీ తింటున్నట్టు ఉంటుంది - ఒక్కో చోట ఒక్కో రకం కిక్కు!

     ప్రధమాశ్వాసంలో కధ బ్రహ్మలోకంలోని చిలక మొదటి జన్మలో పుట్టిన కలభాషిణికి నలకూబరుడిని పెళ్ళాడాలనే కోరికా మణికంధరుదికి రంభ మీద మోజూ పుట్టేవరకూ నడుస్తుంది.కధకు రంగస్థలం ద్వారక.కాలం శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్న కాలం.కలభాషిణి తన స్నేహితురాళ్లతో కలిసి ఉయ్యాల లూగుతుండగా సరిగ్గా ఆ సమయానికే నారదుడు తన శిష్యుదైన మణికంధరుడితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆకాశమార్గాన వస్తుంటారు.మణికంధరుడు వీళ్ళు ఉయ్యాల లూగుతూ ఉంటే కాళ్ళు ఆకాశంలోకి దూసుకుపోవడాన్ని గురించి రంభ లాంటి అప్సరసల్ని అందంలో మాతో పందేనికి వస్తారా అని కయ్యానికి కాలు దువ్వుతున్నట్టు ఉందని పోలుస్తాడు.దానికి నారదుడు కూడా నీ కవిత్వం బాగుంది, నువ్వు నిజమే చెప్పావు అని పొగుడుతాడు.అప్పుడే రంభా నలకూబరులు కూడా దివ్యవిమానంలో అటుగా ప్రయాణిస్తుంటే ఈ మాటలు విన్న రంభకి యెక్కడ లేని అసూయా పుట్టుకొచ్చింది.దాంతో వాళ్ళ విమానంలోకి వీళ్ళిద్దర్నీ పిలిచి కూర్చోబెట్టి రంభ తన మనసులో మాటని అడిగేసింది "మీ మాటల్ని విన్నాను,మాట అనేముందు కాస్త ఆలోచించారా?నా ప్రక్కనున్నవాడు నలకూబరుడు.కుబేరుని ముద్దుల కొడుకు.చక్కదనంలో జగన్మోహనాకారుడు.రమ్మని చేసైగ చేస్తే చాలు మూడు లోకాలలో ఉన్న సుందరాంగనలందరూ ఉరుకుతూ వచ్చి కౌగిట్లో వాలుతారు.అయినా నలకూబరుడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నాడంటే దాని అర్ధమేమిటి మునీంద్రా?చక్కదనంలో నన్ను మించినవారు లేరనే కదా!" అని.దానికి నారదుడు కూడా తగ్గకుండా "అన్ని రోజులూ ఒక్కలాగే ఉంటాయని అనుకోకు.నీలాంటి చక్కని యువతి అతనికీ,నలకూబరుని వంటి చక్కని యువకుడు నీకూ తారసపడి మీ హృదయాల్ని కలచి వేస్తారేమో,ఎవరికి తెలుసు?ఈ ప్రేమలూ పొంగిపోవడాలూ ఎంతసేపు!" అని మెత్తని కత్తితో కోసినట్టు జవాబు చెప్పటంతో రంభ ఋషివాక్యం నిజమవుతుందేమోనని భయపడి వాదన పెంచకుండా వెనక్కి తగ్గింది.గురుశిష్యు లిద్దర్నీ కలభాషిణి ఉన్న వనంలోనే దించి సెలవు పుచ్చుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.ఇటువైపు అలభాషిణి తనకు దగ్గిరగా జరుగుతున్న వినింది.దానికి తోడు నలకూబరుణ్ణి చూసి మోహం పెంచుకుంది.నారదుణ్ణి దించాక ద్వారకలో ఉన్నారు గాబట్టి రంభా నలకూబరులు విమానం కొంచెం కింది నుంచే పోనిస్తూ ఉండటంతో వారు చూదకుండా విమానం క్రిందుగా కొంతదూరం వెళ్ళీ వాళ్ళిదరూ మాట్లాడుకున్న కొన్ని వింతైన విషయాల్ని విన్నది.మొత్తం విషయాలు నారదుల వారి ద్వారా తెలుసుకుంటుంది.నారదుడు కూడా రంభకి సవతిగా ఉండటానికి కలభాషిణి తగినదనే ఉద్దేసంతో చిలక వృత్తాంతం తప్ప మిగిలినాన్నీ చెప్పి రంభకి సవతిపోరు రాబోతుందని కూడా చేప్పి అది నువ్వే కాకూడదా అని కూడా అనేసి కలహానికి బీజం వేస్తాడు.

     అలా మొదలైన కధ తొలుత బ్రహ్మ చెప్పిన కధలోని అన్ని పాత్రలూ ఈ భూమి మీద మనుషులుగా పుట్టి ఆయా సన్నివేశాలన్నీ వాళ్ళ మధ్యన అదే నాటకీయతతో యెలా నడిచాయో చూపించి వైకుంఠంలోని లక్ష్మీ నారాయణులు కూడా ఈ కధను ప్రస్తావించి ఆశీఃపూర్వాకంగా చెప్పే మంగళకరమైన వాక్యాలతో కధని ముగిస్తాడు.పద్యకావ్యంగా చదవటం అపురూపమైన అనుభవమే అయినా ఇప్పుడు అది మనబోటి వాళ్లకి దొరుకుతుందా అనేది అనుమానమే!జనంలో రాన్రానూ సాహిత్యం పట్ల ఆసక్తి తగ్గిపోతుండటం వల్ల మనం చాలా మంచివనుకునే పుస్తకాలు కూడా ప్రచురణకి నోచుకోవడం లేదు - కొనేవాళ్ళు లేనప్పుదు ప్రచుర కర్తలు మాత్రం యేం చేస్తారు?తేలికపాటి అచనంలోకి రెంటాల గోపాలకృష్ణ గారు అనువదించగా జయంతి పబ్లికేషన్స్ ద్వారా 2015లో కూడా దొరకటం ఒకరకంగా సంతోషించదగ్గ విషయమే!

     కధ చిక్కురొక్కురుగా ఉంటుంది కాబట్టి కధా ప్రారంభం మాత్రమే ఇక్కడ చెప్పాను గానీ ఉపకధల్లో కొన్నిటి గురించి చెప్తాను.యెందుకంతే కధగా చదివినా వాటి ప్రాముఖ్యతకి సంబంధించిన క్లూలు అక్కడ ఉండవు.నాకెట్లా తెలిసినయ్యంటారా, అలాంటి విషయాల్లో నేను షెర్లాక్ హోంసు కన్నా ఉద్దండుణ్ణి!నేను ఇక్కడ చేసిన విశ్లేషణల్ని మీరు కధ చదివాక పోల్చుకుంటే ఆ విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది.ఈ పోష్టు మాత్రం చదివితే మీకు యెలాంటి ఉపయోగమూ ఉందు.పుస్తకం చదువుతునప్పుడు గానీ ఇక్క నేను చేసిన విశ్లేషణలు పూర్తిగా అర్ధం కావు.


మాయా రంభ - మాయా నలకూబరుల ప్రణయం:

     నారదుడు ద్వారకకు రావడానికి అతనికి తుంబురుడితో ఉన్న ఒక పాత స్పర్ధ.అతన్ని మించి గానవిద్యలో ప్రావీణ్యం సాధించడానికి తపస్సు చేస్తే శ్రీకృష్ణుడిగా ద్వారకలో ఉన్నప్పుదు నీ కోరిక తీరుస్తానని వరమిస్తాడు.ఇప్పుడు ద్వారకలో అతని శిక్షణ పూర్తయ్యాక మణికంధరుణ్ణి దేశాటన చెయ్యమని పంపించి తన దారిన తను వెళ్తాడు.కొన్ని క్షేత్రాల దర్సనం తర్వాత మణికంధరుడు అననతసయనంలోని ఒక వనంలో సమాధి నిష్ఠుదై శ్రీహరిని గురించి తపస్సు చేస్తుంటే ఆ తపస్సును భగ్నం చెయ్యడానికి ఇంద్రుదు రంభని నియోగిస్తాడు.

     కలభాషిణి యేమో ఒంటరిగా నలకూబరుణ్ణి యెలా చేరుకోవాలో తెలియక దిగాలు పడుతుంటే మణిస్తంభుడనే సిధ్ధుడు సింహ వాహనం మీద ఆకాశమార్గంలో ఆమె ముందు దిగి తనకు దూరశ్రవణ దూరదర్శనాది శక్తులున్నాయని చెప్పి నమ్మించాడు.నారదుడు తనకిచ్చిన వరాల గురించీ ఇంకా అతి రహస్యమైనవీ చెప్పి నమ్మించేసరికి కలభాషిణికి ఇతని ద్వారా నలకూబరుణ్ణి చేరుకోవచ్చుననే ఆ పుడుతుంది.తనూ సేవలు చేసి అతన్ని ప్రసన్నం చేసుకుని మణికంధరుడు ఇప్పుడెక్కడ యెలా ఉన్నాడని అడిగితే అతని తపస్సు భగ్నమైంది,రంభతో క్రీడిస్తున్నాడని చెప్తాడు.మెల్లగా నలకూబరుది గురించి ఆరా తీసింది.నలకూబరుడు కూడా రంభ మణికంధరుని తపస్సును భగ్నం  చెయ్యటం పూర్తి కాగానే మళ్ళీ తోడుకొని పోవటానికి అక్కడే సంచరిస్తున్నట్లు తెలిసి తనని ఏ విధంగా నైనాసరే నలకూబరుడి చెంతకి చేర్చమని ప్రార్ధించింది.మొదట ఇష్టం లేనట్టు నటిస్తూ తర్వాత తన సింహ వాహనం మీదనే తీసుకెళ్తానని చెప్పి దారిలో మృగేంద్ర వాహన ఆలయం దగ్గిర దింపి పూలు కోసుకొస్తానని పూలతోటలోకి వెళ్తాడు.అక్కడ సుముఖాసత్తి అనే ఒక ముదుసలి కలభాషిణికి సిధ్ధుడు దగ్గిర లేని వీలు చూసుకుని అసలు కధ చెప్పి మళ్ళీ సిధ్ధుడు కలభాషిణిని బలి ఇవ్వబోయే సమయానికి తన కంఠాన్ని అడ్డు పెట్టి కలభాషిణిని రక్షిస్తుంది.రెంవసారి సిధ్ధుడు కలభాషిణిని వధించబోతే వాళ్ళిద్దరూ యెవరో విసిరేసినట్టు పోయి దూరంగా పడతారు,యెక్కద>సరిగ్గా మణికంధరుడు తపస్సు చేసుకుంటున్న వనంలో!అప్పటి వరకూ బలి ఇచ్చి శక్తులు పొందాలని చూసిన వాడిలో కామం ప్రకోపించి సిధ్ధుడు కలభాషిణిని బలాత్కరించబోయినప్పుడు నలకూబరుడు వచ్చి సిధ్ధుడితో తలపదతాడు.

    సిధ్ధుడు పారిపోతున్నా వెంటబడి తరుముకుంటూ వచ్చి సంహరించబోయే సమయానికి రంభ ఆవైపుగా వచ్చి నలకూబరుణ్ణి ఆపి ఆ స్త్రీ యేవరో వెతకమంటుంది.సిధ్ధుడు తీరా తాము పడిన ప్రదేశానికి వచ్చి చూస్తే కలభాషిణి కనపడదు.ఇంతలో మరొక రంభ అక్కడికి వచ్చి అందర్నీ విభ్రాంతికి గురి చేస్తుంది.చాలాసేపు వాగ్వాదం,అయోమయం,వినోదం,విషాదం లాంటివన్నీ జరుగుతాయి.ఆఖరికి ఒక రంభ దేవసభకి రమ్మని సవాలు విసరడంతో రెండవ రంభ మాయా రంభ అని తెలుస్తుంది.ఇంతలో నిజ మైన రంభకి ఇప్ప్పుడు మరొక షాకు!మరొక నలకూబరుడు రంగప్రవేశం చేసి రంభని కంగారు పెడతాడు.మొదట వాళ్ళిద్దరూ పోరాడి తేల్చుకుందామని చూసి ఇద్దరూ సమబుజ్జీలుగా తెలియటంతో అసలు రంభ "పూర్వం కళాపూర్ణుని గురించిన ప్రసంగం మనకు యెప్పుడు వచ్చింది?అప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం - పొల్లు పోకుండా చెప్పు!" అని అడిగి.సరైన జవాబు చెప్పిన అసలు నలకూబరుడితో కలిసి తన దారిన తను వెళ్తుంది.

     ఇక్కడ సన్నివేశం యెంత గందరగోళంగా ఉంటుందంటే మీరు యెన్ని సార్లు చదివినా యెవరు యెవరితో యెప్పుడు యెలా కలిశారో కనుక్కోలేరు.కానీ సంవిధానం అంతా పింగళి సూరన వివరిస్తాడు.అసలు రంభ అసలు నలకూబరుడు,నకలు రంభ నకలు నలకూబరుడు - ఈ రెండు జంటల్లో అటు తిరిగి ఇటు తిరిగి రంభా నలకూబరులు,కలభాసిణీ మణికంధరులు కలిసినట్టు తెలుస్తుంది!యెందుకీ సన్నివేశం కల్పించబడింది అనేది అర్ధం చేసుకోవాలంటే ఆధునిక లైంగిక మనోవైజ్ఞానికశాస్త్రం లోని రెండు సూత్రాలు తెలియాలి.ప్రతి మగాడికీ ఒక "IDEAL SHE" ఉంటుంది.ప్రతి ఆదదానికీ ఒక "IDEAL HE" ఉంటాడు.సుదీర్ఘకాలం పాటు యెవరూ ఒకే వ్యక్తితో వైవిధ్యం లేని ఒకే రకమైన సహచర్యానికి కట్టుబడి ఉండలేరు.నూతనత్వాన్ని కోరుకుంటారు.కానీ సమాజం వైవాహిక విధిలో పవిత్రతని శాసిస్తుంది.వివాహం ప్రధానంగా వారసత్వానికి సంబందించినది కాబట్టి పవిత్రత తప్పనిసరి.అలాంటప్పుడు మనముందు రెండు మార్గాలు ఉంటాయి.పాత సహచరులతో తెగదెంపులు చేసుకుని కొత్త సహచరుల్ని వెదుక్కోవటం - అంత వీజీ కాదు!యెవరూ కనిపెట్టలేని విధంగా సమాజం అనుమతించే దారిలోనే నూతనత్వాన్ని సాధించడం - యెట్లా కుదురుతుంది?యేముందీ,తమ సహచరులతొనే గడుపుతూ మనస్సులో తాము బలంగా కోరుకుంటున్న వ్యక్తితో గడుపుతున్నట్టుగా వూహించుకోవడం - యెంత వీజీ!వ్రతమూ చెడదు ఫలమూ దక్కుతుంది!!ఈ పిట్టకధ ద్వారా పింగళి సూరన ఇచ్చిన క్లూ ఇది - శృంగారం మానసోద్భూతమైన దేహాలు ప్రధానం కాని క్రీడ.ఆట రంజుగా నడిచినంత కాలం యదీ తప్పు కాదు.ఈ ప్రమోదం ప్రమాదం కాకుండా ఉండాలంటే ప్రయత్న పూర్వకంగా నయినా సరే తమ సహచరులకి తమని తాము యెప్పుడూ నూతనంగా ఆవిష్కరించుకుంటూ కనబడాలి.రొటీన్ అనేదాన్ని యెక్కువకాలం కొనసాగించకుండా వెరైటీని చూపించాలి!


సుగాత్రీ శాలీనుల కధ:

     కధలో కధగా వచ్చే ఈ కధని గురించి రచయిత అయిన పింగళి సూరన గూడా యెంతో ప్రత్యేకంగా కొందరు దీనిని పారాయణ గ్రంధంగా చదువుతూ ఉన్నట్టు వర్ణిస్తాడు.మణికంధరుడు తీర్ధయాత్రలలో కాశ్మీర దేశం చేరుకుని శారదా పీఠం దగ్గిర అక్కడి వారంతా ఈ కధని పారాయణ గ్రంధంగా చేసుకుని చదువుతుండటం చూసి అడిగి వివరంగా తెలుసుకున్నట్టు ప్రస్తావించబడుతుంది.

   కాశ్మీర దేశంలోని శారదా పెఠానికి సంబంధించిన ఒక పూజారికి సరస్వతీదేవి అనుగ్రహం వల్ల సుగాత్రి పుట్టింది.శాలీనుడు ఇల్లరికపుటల్లుడిగా అత్తవారింట్లోనే ఉంటున్నాడు.శోభనం నాటి తొలిరాత్రి సుగాత్రిని అందంగా అలంకరించి భర్త దగ్గిరకి పంపిస్తే శాలీనూడు ఆమెని కిందనించి పైకి ఒకసారి తేరిపార జూసి బుస్సూరుమని నిట్టూర్చి అటువైపు తిరిగి పడుకున్నాడు?ఒక్కరోజు కాదు యెన్ని రోజులైనా ఇదే తంతు కావడంతో సుగాత్రి తల్లికి అల్లుడి మీద కోపం పెరిగి తోటపనికి పురమాయించింది.తల్లి తన భర్త చేతగాని తనాన్నీ తన అమాయకత్వాన్నీ తిడుతున్నా,సాటివాళ్ళు వేళాకోళం చేస్తూ యేడిపిస్తున్నా సుగాత్రి మాత్రం భర్తను తప్పుగా తలచకుండా తన మంగళసూత్రం చల్లగా ఉంటే అదే పదివేలు అనుకుంటూ అతనంటే భక్తితోనే ఉంటూ వచ్చింది.

     ఇంతలో ఒకరోజు శాలీనుడు తోటపని చేస్తున్నప్పుడు ఉరుములతో మెరుపులతో కుండపోతగా వర్షం పడింది.ఆ అసమయంలో శాలీనూడి గురించి ఆందోళన పడి వర్షం తగ్గగానే తోటకి వెళ్ళింది.అతను ఒక పనివాడిలా కష్టపడుతుండటం చూసి జాలిపుట్టి తను కూడా సాయం చెయ్యాలనుకుంది.పనికి నగలు అడ్దంకదా అని అవి తీసి పక్కన పెట్టి తనూ మగడికి పనిలో తోడుగా శ్రమించటం మొదలు పెట్టింది.ఆభరణాలు లేకుండా చిత్తడి చిరు చెమటలతో అలరారుతున్న సుగాత్రిని చూడగానే శాలీనుడిలో శృంగార వాంచ పెల్లుబికింది!హమ్మయ్య!తల్లి అనుమానిస్తున్నట్టు భర్త నపుంసకుడు కాదు అని తెలిసి ఆనందంగా తల్లికి చెప్పింది!ఆ రాత్రికి సర్వాలంకార భూషితని చేసి పంపిస్తే మళ్ళీ పాతకధయే పునరావృతమయింది.దీంతో సుగాత్రి తల్లికి కూతురు మీద కూడా కోపమొచ్చింది.కానీ మరుసటి రోజు తను తోటపనిలో సాయం చేస్తున్నప్పుడు భర్త మళ్ళీ దగ్గరకు తీసుకోవటం చూశాక భర్త ప్రవర్తనలోని రహస్యం అర్ధమయింది.శాలీనుడిలో ఉన్న మర్మం ఇది - అతడికి నిసర్గ సౌందర్యం అంటే ప్రీతి,కృత్రిమ సౌందర్యం అంటే భీతి?!అదేదో నోటితో చెప్పొచ్చు గదనయ్యా మగడా - అని మీరు అందామనుకుంటే కుదరదు,అన్నీ నోటితో చెప్పలేం యెవళ్ళకి వాళ్ళు అర్దం చేసుకోవాలి అని మా బంగారం సాగదీసింది ఒక విషయం గురించి నేనూ ఇలాగే నోటితో చెప్పొచ్చు గదా అని నిలదీస్తే:-)

     తల్లి సుగాత్రిని తప్పు పట్టి మందలించబోతే సుగాత్రి తన తల్లికి భర్తకు యేది ప్రియమో ఆ విధంగా నడుచుకోవటం భార్యగా తన కనీస ధర్మమని తగిన సమాధానం చెప్పి ఒప్పించింది.సుగాత్రి పతిభక్తికి మెచ్చి సరస్వతీదేవి ప్రత్యక్షమై ఆమె కధ లోకంలో పవిత్రమై వెలయునని వరమిచ్చి అంతర్ధానమైంది.

    యెందుకీ కధకి ఇంత ప్రాధాన్యత నిచ్చాడు అంటే, శ్రమకీ ప్రేమకీ ఉన్న అవినాభావ సంబంధం వాత్స్యాయనుడి నుంచి పింగళి సూరన వరకు గల సనాతన ధర్మతత్వ కోవిదు లందరికీ తెలుసును గనక!నరాల రాపిడినే ప్రేమ అనుకుని నన్ను ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించేవాళ్ళది ప్రేమ కాదు - కామం!తనకి ఇష్టమున్నా లేకపోయినా నాకనవసరం నా నరాల వేడి తగ్గితే చాలునని బలాత్కార సంభోగానికి తెగబడటం అసలైన పురుషత్వం కానే కాదు.పశువుల నుంచి మనుషుల్ని వేరు చేసే అనేకానేకమైన అంశాలలో మనొధర్మశృంగారం ఒకటి - అది తెలియని వాళ్ళు స్త్రీని పశువులాగ కుమ్మడమే పురుషత్వం అనుకుంటున్నారు.పిల్లల్ని పుట్టించగలిగిన ప్రతివాడూ మగవాడు కావచ్చు,అంగస్తంభన ఉన్న ప్రతివాడూ దాన్ని సాక్ష్యంగా చూపించవచ్చు - కానీ పురుషత్వం అనేది స్త్రీని సంతోషపెట్టగలిగిన సమర్ధతని కూడా ఇముడ్చుకుని ఉంటుంది -  ఆ మనోగతమైన సంస్కారాన్ని కూడా కలిగి ఉంటేనే వాడు పురుషుడు అవుతాడు!అది లేనివాడు ఉత్త మగాడు,అంతే!ఇదే రకం విశ్లేషణ ఆడతనాన్నీ స్త్రీత్వాన్నీ వేరు చేస్తుంది.నిర్భయ హంతకుడి లోనూ ఇంద్రాణీ ముఖర్జీ లోనూ ఉన్న సామాన్య ధర్మం ఒకటుంది గమనించారా?కాయకష్టంతో గౌరవప్రదంగా తను బతికి ఇతర్లని బతికించాలనే మంచితనం లేకపోవడమనే వాళ్ళ మనస్తత్వాల లోని ఒక మెలికయే వాళ్ళు చేసిన నేరాలకి మూలం!శ్రమజీవికి తనకు యెటువంటి భాగస్వామి కావాలో స్పష్టంగా తెలుస్తుంది,ఏ విధమైన గందరగోళం ఉండదు.యెర్రగానే ఉండాలి,నున్నగానే ఉండాలి,పిటపిలాడుతూ ఉండాలి,చెయ్యెత్తు మనిషై ఉండాలి,సాటి ఆదవాళ్ళు కుళ్ళుకు చావాలి అనే గొంతెమ్మ కోరికలు ఉండవు.అన్నీ తనవైపుకే లాక్కునేలా కాకుండా ఉన్నదాన్ని చెరిసగం పంచుకునేలా ఉంటే చాలు -ఈ భావం యెక్కించటానికే సుగాత్రీ శాలీనుల కధకి అంతటి పవిత్రతని కల్పించి కళాపూర్ణోదయం అనే కధ రాశాడు పింగళి సూరన!

     ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలుపేమున్నది అనే శ్రమైక జీవన సౌందర్యంలోనే ఒకరితో ఒకరుగా ఇద్దరం,ఒకరిలో ఒకరుగా ఒక్కరం అనే ప్రేమైక జీవన సాఫల్యమూ ఉంటుంది.అది తెలిసిన వాళ్ళు ధన్యజీవులు,తెలియని వాళ్ళు భ్రష్టజీవులు!


లక్ష్మీ నారాయణ సంవాదం:

    ఈ ఉపకధతో కళాపూర్ణోదయం సంపూర్ణం అవుతుంది.బ్రహ్మకీ సరస్వతికీ జరిగిన సరసం నుంచి పుట్టిన కధకి లక్ష్మి నారాయనుణి భక్తుల గురించి అడిగి ఆయన నుణి ఒక ఆశీఃపూర్వకమైన వాక్కులతో ముగుస్తుంది.బ్రహ్మ-సరస్వతి,మణికంధరుడు-కలభాషిణి,సుగాత్రి-శాలీనుడు,కళాపూర్ణుడు-మధురలాలస అనే పేర్లతో ఉన్న ప్రధాన పాత్రలన్నీ జంలుగానే ఉన్నాయి.ఒక జంటలోని స్త్రీ పురుషుల మధ్య అనుబంధాలూ,కోపతాపాలూ యెలా ఉండాలో తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ అది తెలిసే వరకు వీలున్నన్ని యెక్కువసార్లు కళాపూర్ణోదయం చదవాలి.ప్రేమ ఒక స్థాయిని దాటితే భక్తిలాగే ఉంటుంది!నిరంతరం దగ్గరితనాన్ని ఆశిస్తూ ఉండటం,తీసుకోవడం కన్నా ఇవ్వడం గురించి ఆలోచిద్తూ ఉండటం,సహచరులకు క్షేమాన్నీ భద్రతనీ ఆనందాన్నీ కోరుకోవడం - ఇవీ నిజమైన ప్రేమకి లక్షణాలు.నిజమైన ప్రేమ సుఖంగా ఉండనివ్వదు,అందులో బాధే యెక్కువ - అయినా నాస్తికులు గూడా కోరుకోదగిన మోక్షం అది!


ఆత్మవత్ సర్వభూతాణి!ప్రణయవత్ సర్వ మానసాణి!

2 comments:

  1. "కాలక్రమాన్ని బట్టి చూస్తే పైన నేను ఉదహరించిన కధా ప్రారంభం అయిదవ ఆశ్వాసంలో వస్తుంది.మరొక కవి అయీతే దానినే ప్రధమాశ్వాసంగా చేసి కధ మొదలు పెట్టేవాడు.అలాకాక సూరనార్యుడు కడపటి విషయంతో కధ ప్రారంభించాడు..."
    Screen play trick!!

    Thanks for introducing new Literature .....
    Will try to get this book.

    Good Readers are there but shops not selling Good sahitua!
    My personal example: I went to Navofaya Book store ... To buy Ramayana Kalpa Vruksha and ....Potana Bhagavatam. But I found many books of Communists ..... I found " Ramayana Visha Vruksha ...IdanDee Bhaarat..."
    Then I came out after a long search I was succeeded to get Potana Bhagavatam, still searching for "Ramayana Kalpa Vruksham" .....need to find good shop in Hyderabad to buy good books.

    ReplyDelete
  2. @Narsimha Kammadanam
    Screen play trick

    haribabu:అవును,ఒక సస్పెన్స్ నవల చదువుతున్నట్టు ఉంటుంది.మాయా అరంభ-మాయా నలకూబరుల అన్నివేఅశమ యితే తిప్పి తిప్పి నాలుగుసార్లు చద్వినా యెవరు యెవరితో రిఒమాన్సు చేశారో సన్నీవెసాల్ని బట్టి కనిపెట్టలేం!

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...