Tuesday 11 November 2014

కమలమే సకలం కావాలి అంటున్న మోదీ దూకుడును ఆపడ మెట్లా?ఇప్పటికీ వెనకపడిన కులాల వాళ్ళు ఇక ముందుకు రావడ మెట్లా!

               "చుండూరు నరమేధం" - యేమాత్రం సంస్కారం వున్నా సరే కులాలు,మతాలు,ప్రాంతాల కతీతంగా అందర్నీ కదిలించింది!ప్రతివారూ చనిపోయిన వారి పట్ల సానుభూతి చూపించారు.దోషులకి శిక్ష పడాలని మనస్పూర్తిగానే కోరుకున్నారు.అది మనుషుల మనసుల్లో వుండాల్సిన ఆదర్శవంతమయిన ఆలోచనలు ఇంకా వున్నాయనే దానికి సాక్ష్యం.కానీ వాస్తవంలో అలా జరగలేదు.ఆదర్శాలు అన్నం పెట్టవు."సూపు లేటి సేత్తాయి?సాపుగా సచ్చూరుకుంటాయి!" - అన్నాడో కవి?! దోషులు శిక్ష నుంచి జారిపోయారు! బెనిఫిట్ ఆఫ్ డవుట్ అనే మెలిక చాలా నిర్దాక్షిణ్యంగా అడ్డు పడటం వల్ల పట్టపగలు వెంటాడి మరీ హతమార్చిన వాళ్ళుగా అందరూ చూసి గుర్తు పట్టగలిగిన వాళ్ళని కోర్టులూ చట్టాలూ మాత్రం గుర్తు పట్టలేక పోయాయి?

               అసలు చుండూరులో జరిగిందేమిటి?మొదట యుధ్ధోన్మాదంతో చెలరేగిపోయి యెవరు యెంత చెప్పినా యుధ్ధం ఆపకుండా మొండిగా వున్న జపాన్ అమెరికా ఆఖరి అస్త్రంగా వేసిన లిటిల్ బాయ్ దెబ్బకి తునాతునకలై అంతా అయిపోయాక  సానుభూతిని పొందినట్టు చుండూరు నరమేధం చరిత్ర కూడా ఇప్పటి హతులు ఒకప్పుడు కామాతురులుగా ఇప్పటి నేరస్తులు ఒకప్పుడు మర్యాదస్తులుగా వుండి - కాలం ఒకే ఒక క్రూరమయిన సంఘటనతో వాళ్ళ స్థానాల్ని గుర్తు పట్టలేనంతగా మార్చి చూపిస్తున్న క్లైమాక్సు లేని సినిమా! సినిమా అనేది యెంత శక్తివంతమయిన సాధనమైనా దాన్ని వాడకూడని విధంగా వాడితే సమాజానికి యెంత చెడు చెయ్యగలదనే దానికి చుండూరు నరమేధానికి బీజాలు సినిమా హాల్లోనే పడినాయనేది నిలువెత్తు సాక్ష్యం! బియ్యే లిట్టు డిగ్రీని చూపించుకుంటూ సినిమాల్లో ఆ ప్రబంధాల ప్రభావంతో స్త్రీసౌందర్యాన్ని ఆపాదమస్తకం(ఆ బెత్తెడు జాగాని మాత్రం యెందుకో వొదిలేసారు?) కనుల పండువుగా చూపిస్తూ తెల్లని చర్మం,నున్నని చెంపలు,సన్నని నడుం వంటివే సౌందర్యానికి గుర్తు అని కృత్రిమ సౌందర్య సాధనాల విక్రయాలను పెంచగలిగిన కళాఖండాల్ని వండి వార్చిన రసికేంద్రుదూ అతని అంతేవాసులూ ఈ కేసులో అసలు ప్రస్తావనకే రాకపోయినా వాళ్ళూ ముద్దాయిలేనని యెంతమందికి అర్ధమయింది!

        ప్రభుత్వ పధకాల వల్ల కొంతా మారిన వుత్పత్తి సాధనాల వెసులుబాటు వల్ల్ల కొంతా హఠాత్తుగా ఆర్జనపరులయిన కుర్రాళ్ళకి మాకూ అలాంటి పెళ్ళాలు కావాలని అనిపించడం చాలా సహజంగా జరుగుతుంది. కానీ చుట్టూ చూస్తే తమ లాగే యెండకి యెండి వానకి తడిసి కూలిపనులకి తిరుగుతూ కావురేసుకు పోయిన తమ కుటుంబాల్లోని నల్లపిల్లల కన్నా అదే సినిమా హాల్లో  ఆ సినిమా కవులే వర్ణించినట్టు జాం పళ్ళ లాగానూ యాపిలు పళ్ళ లాగానూ కనబడే పెద్ద కులాల ఆడపిల్లలు వాటంగా కనబడ్డారు?మనసుకు నచ్చిన వాడికోసం పంజరాన్ని దాటుకుని బంధనాలు తెంచుకుని మేడలు దిగివచ్చి నిరుపేదని వలచే కావ్యనాయికలే వాళ్ళల్లో కనబడ్డారు గానీ "అన్నయ్యా, ఆ మాలొడు నాకు లవ్ లెటర్ రాశాడు, ఓ పట్టు పట్టరా" అనే అహం ఆ పెద్దకులాల ఆడపిల్లల్లోనూ వుంటుందని తెలుసుకోలేకపోయారు -  కనబడే అందాల్ని మాత్రమే చూసి మతి భ్రమించి వుజ్జయిని రాకుమారిని అలవోకగా పట్టేద్దామనుకున్న పాపం పసివాళ్ళు!

           ఈ మొత్తం భారతదేశపు సమాచార సాధనాల్లో హడావుడి చేసేవాళ్ళలో గానీ, సమాజాన్న్ని ప్రభావితం చెయ్యగల రాజకీయ రంగంలో చెలామణీలో వున్న నాయకమ్మణ్యులలో గానీ,జరిగిన నేరానికి దోషుల్ని శిక్షించే అధికారమున్న న్యాయస్థానాల్లో తమకు డబ్బులొచ్చే కేసుల్లో తిమ్మిని బమ్మినీ బమ్మిని తిమ్మినీ చెయ్యగలిగిన లాయరుమ్మణ్యులలో గానీ సమస్య మూలాన్ని తెలుసుకుని నిక్ష్పక్షపాతమయిన తీర్పుని తెచ్చి మళ్ళీ అలాంటివి జరక్కుండా చేసే సమర్ధవంతమయిన పరిష్కారాన్ని చూపగలిగిన మేధావి ఒక్కడు కూడా లేడు?! కమ్యునిష్టుల్ని చూస్తే బ్రాహ్మణాధిపత్యం, అగ్రవర్ణ దురహంకారం, వర్గపోరాటం లాంటి - బాధితులకి అర్ధం కానివీ పీడకుల దగ్గిర పనిచెయ్యనివీ అయిన - చెత్తమాటల్తో రెచ్చిపోతుంటారు? అక్కడ జరిగింది మాలవాళ్ళ మీద కమ్మవాళ్ళు దాడి చెయ్యటం, మధ్యలో బ్రాహ్మణు లేమి చేశారు? ఒకవేళ మా కులం యెక్కువా మీకులం తక్కువా అనే సూత్రాలు చెప్పింది బ్రాహ్మణులే అనుకుందాం, ఆ  బ్రాహ్మణులు చెప్పినది మాలలూ మాదిగలూ కూడా వొప్పుకోవడం వల్లనే గదా ఇంతగా తమ మీద దొపిడీ జరుగుతున్నా ఒక్కటిగా కలిసి పోరాడకుండా మాల మహా నాడు, మాదిగ దండోరా అని వేరు కుంపట్లతో వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుంటున్నది?

        చుండూరు నరమేధానికి బలయిన వాళ్ళకోసం పోరాడుతున్న వుద్యమకారులకి వారి సొంతవర్గాల్లోనే యెంతమంది గట్టిగా నిలబడి మద్దతు ప్రకటించారు?యెవరి స్వార్ధాల కోసం వారు యెవరి లెక్కలు వారు వేసుకుంటూ తమ కులానికి మరింత రాజకీయ ప్రాతినిధ్యం పెంచుకోవడానికి పోరాడుతున్నాం అని చెప్తూ కులసంఘాలు పెట్టి వాటి చాటున సొంత వ్యవహారాల్ని చక్కబెట్టుకోవటం వాళ్ళు కూడా చేస్తున్నప్పుడు  యెదటివాళ్ళకి మాత్రమే కులపిచ్చిని అంటగడితే అది పోట్లాటకీ కాట్లాటలకీ పనికొస్తుందే తప్ప అసలు రొంపి నుంచి బయట పడెయ్యదు గదా!

           ఒకచోట అన్యాయం జరిగినప్పుడు దానికోసం జరిగే పోరాటాల్నీ పై స్థాయిలో జరిగే పైరవీ రాజకీయాల్నీ పక్కన బెట్టి సమాజంలో వున్న స్థితిని చూస్తే మాల కులస్థులు మాదిగ కులస్థుల్ని చిన్నచూపు చూడ్డం చాలా మామూలుగా జరిగిపోతూనే వుంది!నేనొక సాక్ష్యం చూపిస్తాను. మా ఫాదర్ రాజకీయాల్ల్లో తిరిగిన మనిషి. మావూరి మాలపల్లిలో ఆయన యేం చెప్తే అది వేదవాక్కు. అంత గురి వున్నచోట సొంత సంగతులు కూడా చెప్పుకుంటారు కదా! ఒకసారి ఒకతను అలాంటి సలహా కోసం వచ్చాడు.సమస్య ఇదే:వాళ్ళబ్బాయి మాదిగ కులస్థురాలయిన అమ్మాయిని ప్రేమించాడు, ఇతనికి అది ఇష్టం లేదు -  ఈ కులం ప్రాతిపదిక మీదనే, మా ఫాదర్ని ఆ కుర్రాడికి నచ్చజెప్పమని అడిగాడు. ఆయన కూడా అడగ్గానే ఒప్పుకున్నా మా మదరుకి కొన్ని చాదస్తాలు వుండటం వల్ల ప్రేమికుల్ని విడదియ్యటం అనే పాయింటు మీద పోట్లాడటంతో వెనక్కి తగ్గారు. అసలు విషయం ఇంత స్పష్టంగా కనబడుతుంటే కమ్యునిష్టులు ఇంకా బ్రాహ్మణాధిపత్యం అనే సొల్లు కబుర్లు చెప్తున్నారే తప్ప ఆ కులాల వాళ్ళు ఈ వెనుకబాటుతనాన్ని తొలగించుకోవడానికి మార్గాలు యేమిటనేది మాత్రం చెప్పటం లేదు!

         బోడిగుండుకీ మోకాలికీ ముడిపెదుతున్నానని అనుకోకుండా నిశితంగా పరిశీలించి చూస్తే చుండూరు నరమేధం నుంచి గోధ్రా రైలు ఘటన అనంతరం జరిగిన ముస్లిముల వూచకోతల వరకూ జరిగే సామూహిక విధ్వంసాల మధ్యన కొన్ని పోలికలు వున్నాయి. అంతిమంగా యెక్కువ భీభత్సానికి గురై ఆక్రందించే వారి మీద పుట్టే జాలిలో మొదట రెచ్చగొట్టిన వాళ్ళ దుడుకుతనం మరుపు కొచ్చేస్తుంది.జపాను విషయం లోనూ అంతే.అసలు ఆ యుధ్ధానికి కారణం జపానే అని ఒక వాదన.యుధ్ధం మొదలయ్యాక సరే యెంతో మంది యెన్నో విధాల రాజీ ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గలేదు!ఆఖరికి కొన్ని సంవత్సరాల తర్వాత అప్పటి విషయాలకి జపాను చక్రవర్తి క్షమాపణ చెప్పాల్సిన అవసర మేమిటి? మనుషులు తమ రాగద్వేషాల కనుగుణంగా యేదో ఒక పక్షం మంచిదని తీర్మానించేసి తమకు నచ్చిన పక్షాన్ని సమర్ధించ వచ్చుగాక, కాలానికీ చరిత్రకీ సెంటిమెంటు లేదు!

            ఈరోజు అంత దుర్మార్గంగా చెలరేగిపోతున్న ఈ మూడు పెద్ద కులాలూ చరిత్ర కందని కాలం నుంచీ ఇలాగే లేవు.వేదపఠనం జరిగేటప్పుడు దూరం నుంచి విన్నా వాళ్ళ చెవుల్లో సీసం కరిగించి పొయ్యమనే విధంగా అప్పటి బ్రాహ్మణుల చేత అవమానించబడిన శూద్ర వర్ణం లోనివే ఈ కులాలు కూడా!ఇక్కడ ఆంధ్ర ప్రాంతం లోనే కాదు దేశమంతటా గుజ్జర్లు, చౌధురీలు,పన్నియర్లు అనే సహస్రాధికమయిన కులాలు వున్నాయి.తమాషా యేమిటంటే కమ్యునిష్టులూ ఆ భావజాలం మాత్రమే ప్రపంచంలోని అన్ని సమస్యలకీ పరిష్కారం చూపించగలుగుతుందని నమ్మేవాళ్ళూ కులపరమయిన ఆధిక్యతా భావం కేవలం బ్రాహ్మణుల్లోనే వుందని యెందుకు తీర్మానించశారో తెలియదు గానీ ప్రతి కులానికీ ఆ కులానికి చెందిన ప్రాచీనత పట్లా గొప్పదనం పట్లా అభిమానం వున్నది!ఈ మధ్యనే నేను ఇక్కడ బ్లాగుల్లోనే జాంబ పురాణం గురించి చదివాను.వింతేమిటంటే అందులో మనకి రామాయణంలో రాముడికి సహాయంగా వచ్చిన భల్లూక వీరుడిగా మాత్రమే తెలిసిన జాంబవంతుడు ప్రధాన దైవం!అంతకన్నా విశేషం ఇప్పుడు మనం తక్కువ కులాలు అని చెప్పుకునే చాకలి, మంగలి మాదిగ కులాల వాళ్ళంతా ఆ జాంబవంతుడితో చాలా గొప్పగా అనుసంధానించబడ్డారు గానీ ఈ మూడు పెద్ద కులాలకీ అందులో గుర్తింపు లేదు?అటు బ్రాహ్మణులు వీళ్ళని వేదం వింటే చెవుల్లో సీసం కరిగించి పొయ్యమన్నారు?ఇటు జాంబవ పురాణం లో చోటు లేదు?మరి యెప్పుడు మొదలై యెప్పటికి వీళ్ళు ఇంతగా పెరిగారు?


         కాకతి రుద్రదేవ మహారాజు పేరుతో సుమారు క్రీ.పూ 1250 నుంచి 1290ల వరకు తెలుగు ప్రజల్ని పరిపాలించిన ఆంధ్ర మహాసామ్రాజ్ఞి కాకతి రుద్రమ దేవి సైనిక విధానంలో ఒక విప్లవాత్మకమయిన విధానాన్ని పాటించింది - బ్రాహ్మణేతరుల్ని సైన్యంలోకి తీసుకోవటం!కన్యాశుల్కంలో "మీ వైదికపాళ్ళు జంఝాలు వొడుక్కుంచూ వుంచారో?" అనీ "మీ నియోగ్యపాళ్ళు నీచు గూడా తింఛూ వుంచారో!" అనీ వెక్కిరింతలు వున్నట్టున్నాయి కదా!ఆమె ప్రోత్సాహంతో వెలమ వాడయిన బసవ దండనాధుడి మూలంగా వెలమలూ, గోన గన్నారెడ్డి వల్ల రెడ్లూ, కాపయ నాయకుడి వల్ల కమ్మవాళ్ళూ యెదిగి పెద్ద కులాలుగా మారారు.సిపాయిగా చేరి కనీసం దళపతి వరకూ చేరినా అప్పటి కాలానికి ఆర్జన చాలా యెక్కువే!యుధ్ధాలు జరిగితే వోడిపోయిన కోటలో రాజుగారు ఖజానాని పట్టుకుంటే మిగతా వాళ్ళు వూరిమీద పడి అందినంత దోచుకోవడమే!యెక్కడ పరిమితికి మించిన ధనం పోగుపడినా అక్కడ యెంతోకొంత నెత్తురంటిన డబ్బు వుంటుంది?! అయితే పరిమితికి మించిన ఆస్తులు కోమట్లకీ వుండేవిగా ఇవ్వాళ వాళ్ళు వెనకబడిపోయి వీళ్ళు యెలా పైకి వచ్చారు అనుకుంటున్నారా?కోమట్లు యెంత వున్నా బంగారం మీద పెట్టి రొటేషన్లో తిప్పడంతో సరిపెట్టుకుంటే వీళ్ళు మాత్రం సంపాదనంతా భూమి మీద పెట్టుబడి పెట్టి భూస్వాము లయ్యారు! ఆ ఆదాయంతో పరిశ్రమలు పెట్టి పారిశ్రామికాధిపతు లయ్యారు! పరిమితికి మించిన ఆస్తి వుంటే దగ్గిరగా వుండేవాళ్ళు నమ్మకస్తులు కావాలి! బంధుత్వాలు గానీ సెంటిమెంటు గానీ వున్నవాళ్ళ కన్నా నమ్మకస్తులు యెవరు వుంటారు? అందుకే అందరూ తప్పనిసరిగా తమ వ్యాపార వ్యవహారా లన్నింటిలోనూ తమ కులం వాళ్లనే ప్రోత్సహించేది! ఆ విధంగా కులస్థుల్లో పాప్యులర్ అయితే రాజ్యాధికారం దగ్గిర కొస్తుంది!గట్టిగా చెప్పాలంటే రాజ్యాధికారం లేకపోయినా ప్రభుత్వం వాళ్ళకి యే పని కావాలంటే ఆ పని చేస్తుంది.

                ఇప్పటికే ఇలా యెదిగిన వాళ్ళకీ ఇప్పుడు యెదగాలనుకుంటున్న వాళ్ళకీ ఈ నమ్మకమూ ఆప్యాయతా తప్పనిసరిగా అవసరం కాబట్టి కమ్యునిష్టులూ, మానవ వాదులూ, మరింకే శవ వాదు లయినా ఈ అమరికని భగ్నం చెయ్యలేరు?! అతిగా తీసుకుంటే మనం అమృతం అనుకునే పాలు గూడా విషమవుతాయంటున్నారు అన్నిరకాల వైద్యవిధానాల్లోనూ, అలాంటిదే కులాభిమానం కూడా! రాణా ప్రతాప సింహుణ్ణీ చత్రపతి శివాజీనీ పొగడ్డానికి యెవరూ కులాభిమానం చూపించకపోవచ్చు గానీ బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడు లాంటి వాళ్లని పొగిడేటప్పుడు అతను మా కులం వాడే అని మిగతా వాళ్లకన్నా కొంచెం యెక్కువ హుషారు పడ్డంలో తప్పు లేదు గానీ మా కులం వాడు గనకనే అంతటి వాడయ్యాడు అని విర్రవీగటం మాత్రం శానా తప్పు! మా కులం గొప్పది అని అనుకోవటమూ మిగతా కులాల్లో వున్న గొప్పని కూడా మెచ్చుకోవటమూ అయితే OK, BUT మా కులమే గొప్పది మిగతావన్నీ చెత్తవి అనుకుంటే మాత్రం NOT OK?!

              తమ కులం లోని గొప్పవాళ్ల ముచ్చట్లన్నీ కాలక్షేపానికి కూర్చున్నప్పుడు చెప్పుకుని మురుసుకోవడానికే తప్ప కార్యరంగంలో ఇతర్లతో పోటీ పడేటప్పుడు యెందుకూ పనికిరావు. ఇద్దరు సమాన బలం గలవాళ్ళు యెదురెదురుగా నిలబడి తలపడితే వాళ్లలో యెవరు గెలుస్తారనేది కులాన్ని బట్టి గానీ మతాన్ని బట్టి గానీ ప్రాంతాన్ని బట్టి గానీ నిర్ధారించలేము కదా!కానీ ఇవ్వాళ ప్రజాప్రతినిధుల్ని యెన్నుకునే పని మాత్రం అలా జరగడం లేదు.యే నియోజక వర్గంలో యెవరిని నిలబెట్టాలన్నా ఆ నియోజకవర్గంలో వున్న ఈ భూస్వాములూ పారిశ్రామికవేత్తల ప్రాభవానికి ఇబ్బంది కలిగించని మర్యాదస్తుల్నే యెంచుకుంటున్నారు తప్పితే ఆ నియోజకవర్గంలోని అందరి ప్రయోజనాల్నీ పరిరక్షించే ప్రమాదకరమయిన వ్యక్తుల్ని మాత్రం నిలబెట్టటం లేదు! ఈ విషవలయంలో తిరుగాడుతున్నంత కాలం మిగతా కులాల వాళ్ళు రాజ్యాధికారం రాకపోతే పోయింది,ఈ చుండూరు నరమేధం లాంటి క్రూరమయిన దాడుల్నించి తప్పించుకునే మార్గం యెప్పటికీ దొరకదు! రాజ్యాధికారాన్ని పొందటానికి ఈ అమరిక వల్ల లాభం పొందే ఇప్పటి పెత్తందార్లు దీన్ని ఒక పట్టాన వదలరు, మరి ఇప్పుడున్న చిన్న కులాలు యెదిగేదెట్లా?

         ఇప్పుడు మోదీ గారు అంటున్న కమలమే సకలం కావాలి అనే ఆశ నిజమయితే యేం జరుగుతుంది?ఇప్పటికే హిందువుల్లో ఆర్ధికంగా, సామాజికంగా పైకొచ్చి వున్న అగ్రకులాల వాళ్ళు రాజకీయంగా కూడా యెదుగుతారు!అది కూడా గ్రామస్థాయిలోనూ విస్తరించాలనుకున్న మోదీ గారి ప్రనాళిక పూర్తయితే ఇప్పుదు అన్ని విధాలుగా అట్టడుగున వున్న కులాల వాళ్ళు యెప్పటికీ పైకి రాలేరు?!నాకు మోదీ గారి అభిప్రాయం తప్పనే దురుద్దేశం లేదు.చాణక్యుదు రాజు విజిగీషువు, శక్తి వుంటే మొత్తం భూమి నంతా ఆక్రమించ వచ్చు నన్నాడు! భాజపా అనే నాకు నచ్చిన అతి తక్కువ రాజకీయ పార్టీల్లో ఒకటి వ్యాపిస్తానంటే నాకు అభ్యంతర మేమిటి?కానీ ఇప్పటికిప్పుడు భాజపాలో చేరి రాజకీయంగా యెదగగలిగే అవకాశం సమాజంలో ఇప్పటికే ముందుకు వెళ్ళిన వారికే అది మేలు చేస్తుంది తప్ప అట్టడుగున వున్నవారికి మరోరకంగా వాళ్ళు ఇక యెప్పతికీ ముందుకు రానివ్వకుండా దారులు మూసేస్తుంది!మోదీ ప్రధానమంత్రి కాగానే అతని కులంలో వున్న వారంతా ఒకాసారిగా పైకొచ్చేసినట్టేఅ నుకుంటే మనం అంబేద్కరు రాసిన రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం గనక ఆ కులస్తులంతా పైకి వచ్చేసి వుండాలి ఈపాటికే.

        ఆర్ధికంగా నేను యెక్కడో చెన్నయ్ లో కాందిశీకుడిలా బతికే ఒక చిరుద్యోగిని.కానీ సామాజికంగా నేను అగ్రకులం వాడిని.ఆ హోదా నాకు పుట్తుకతోనే వచ్చింది.నేను ముఖ్యంగా ప్రస్తావించాలనుకుంటున్న పాయింటు ఇదే.వ్యక్తులు ఆర్ధికంగా బాగుపడటం వల్ల ఒక కులానికి మొత్తంగా యే విధమయిన హోదా పెరగదు!ఇప్పుదు నిమ్న కులాలుగా వున్న వాటికి ఆ హోదా పెరగాలంటే యేమి జరగాలి అనేది నేను చెప్పాలనుకున్నది!కమ్యునిష్టు తరహా వర్గ రహిత సమాజం అనే ఆదర్శానికి మన దేశప్రజలు మానసికంగా సిధ్ధమయ్యే పరిస్థితి లేదు. ఇక్కడున్న సంక్లిష్టతని అర్ధం చేసుకునే సహనం కమ్యునిష్టులకి లేదు. మన దేశంలో యే మార్పు జరిగినా పైకి కుదుపులాగా కనబదకుండా కొంచెం కొంచెంగా మారుతూ అసలైన సంస్క్తృతి ఒక ప్రవాహం లాగా సాగిపోయే లక్షణం కలది!దాన్ని బద్దలు కొట్టాలనే ముప్పాళ రంగనాయకమ్మ అభిమానుల అత్యుత్సాహం మంచిది కాదు!ఇప్పుడు అగ్రకులాలు కూడా ఒకప్పుడు నిమ్న కులాలే కాబట్టి వాళ్ళు యేమి చేసి అగ్రకులాలుగా యెదిగారో వీళ్ళు కూడా అలా చేస్తే సరిపోతుంది కదా!

         కాళోజీ రెండున్నర కులాలు అని అనేటంత సీను మిగతా కులాలకి యెందుకు లేకుండా పోయింది?యెందుకంటే ఈ కులాలు ఆంధ్రప్రదేశ్ లోని భూమిలో అధిక శాతాన్ని ఆక్రమించుకుని వున్నాయి గాబట్టి! డబ్బు రొటేషన్ తిరగడం కోమట్లలో యెక్కువగా వున్నా ఆ కులం భూమికి దూరంగా వుండటమే రాజకీయంగా సామాజికంగా ఈ కులాల కన్నా బలహీనంగా వుండటానికి కారణం! యే విధంగా నయినా వీలయినంత యెక్కువ భూమి మీద అధిపత్యమే కులానికి హోదా పెంచుతుంది! ఇక్కడొక విశేషం గమనించాలి ఈ కులం అధీనంలో వున్న భూమి కులస్థు లందర్లోనూ సమానంగా వాతాలు పంచబడి లేదు, కేవలం ఆ కులంలోని 10% మంది అధీనంలో ఈ భూమి వున్నా ఆ కులం హోదా పెరిగింది! యెందుకలా జరిగిందంటే తన అధీనంలోని ఆస్తిని కాపాడుకోవటానికి నమ్మకస్తుల కోసం బంధువుల మీదా తెలిసిన వాళ్ల మీదా ఆధార పదటం క్షేమం గనక తమకి దగ్గిరగా తమ కులస్థులే వుండేలాగ చూసుకుంటారు! అందుకే కులపిచ్చి అంతగా లేనివాళ్ళూ దుర్మార్గాలు చెయ్యని వాళ్ళూ కూడా ఇతర్లకి సహాయం చేసేటప్పుడు తమ కులం వారికే మొదటి అవకాశం ఇవ్వడం జరుగుతుంది! సామాజికంగా జరిగే యే మార్పు అయినా కుదుపులు లేకుందా జరగాలంటే తప్పనిసరిగా - తాత్కాలికమయిన పరిష్కారం,దీర్ఘకాలికమయిన పరిష్కారం రెండూ అవసరమే! రిజర్వేషన్లు అనేవి తాత్కాలికంగా వ్యక్తులు ఆర్ధికంగా యెదగటానికి పనికొస్తాయి - నేను వీట్ని పూర్తిగా వ్యతిరేకించటం లేదు. కానీ వీటి ద్వారా ప్రోత్సాహం తెచ్చుకున్న వారిలో కొందరయినా వ్యాపార పారిశ్రామీక రంగాల్లోకి ప్రవేశించి భూమి మీద అధిపత్యం సాధించనంత కాలం ఆ కులం యొక్క సామాజిక హోదా పెరగదు!

            దళితులే కాదు ముస్లిములది కూదా ఇదే పరిస్థితి - రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన ప్రాతినిధ్యం వుండాల్సిన అవసరం వున్నా వాళ్ళు వాస్తవంలో రెండవ తరగతి పౌరుల్లాగే వున్నారు?ఖైదీ తన జైలర్ని తన జైలు గదిలో మరి కొంచెం సౌకర్యవంతమయిన యేర్పాట్లని  కోరుకున్నట్టు శాతాల్లో దక్కే అడుగు బొడుగు తిండి లాంటి రిజర్వేషన్ల కోసం మాత్రం దిట్టంగా పోట్లాడుతున్నారు గానీ తమకి నిజమయిన అభ్యున్నతిని ఇచ్చే దారులు వెతకడం లేదు!ఈ రిజర్వేషన్ల ద్వారా వచ్చే పదీ పరకా వుద్యోగాల ద్వారా వెయ్యేళ్ళు గడిచినా ఆయా వర్గాలు ముందుకి రావడం అనేది కల్ల!ఉద్యోగం లో భద్రత ఉంటుంది, కానీ ఒక ఉన్నతోద్యోగి కూడా తన ముప్పయ్యేళ్ళ సర్వీసులో పొంద లేని ఆదాయం ఒక మధ్యస్థ అంతరువు లోని వ్యాపారి కేవలం అయిదు పది సంవత్సరాల లోనే పొంద గలడు.  వ్యక్తులకు ఉద్యోగాలు భద్రతా నిచ్చినా వర్గాల వారీగా చూస్తే వ్యాపార పారిశ్రామిక రంగాల వల్లే లాభం ఉంటుంది.

           ఉద్యోగాల కయితే డిగ్రీలు కావాలి. పరీక్షలు రాయాలి. నానా రకాల తంటాలూ పడాలి. కానీ వ్యాపారం చెయ్యాలన్నా పరిశ్రమ పెట్టాలన్నా ఇవేమీ అక్ఖర్లేదు. కానీ ఏది తను బాగా అమ్మగలడో తన గురించి తనకు బాగా తెలియాలి. కొత్త వస్తువును తయారు చేసి దానికి కొత్తగా మార్కెట్ ని పుట్టించుకొవడమా, అప్పటికే ఉన్న వస్తువుని మరింత బాగా మెరుగు పరచి అమ్మడమా - ఏది తనకు చేతనయితే అది చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. మొదటి విడత లాభాలు వచ్చేవరకు అవసరమయ్యే  సంస్థాగతమయిన పెట్టుబడిని తనే సమకోర్చుకోవాలి. ఒకసారి లాభాలు రావడం మొదలయితే తరవాత వ్యాపారాన్ని విస్తరించడానికి మూలధనాన్ని కదిలించకుండా లాభాల నుంచే పెట్టుబడినీ పొందాలి. ఇవన్నీ చెయ్యగలిగిన వాడే వ్యాపార పారిశ్రామిక రంగాల్లో వృద్దిలొకి వస్తాడు.

        కాబట్టి వాళ్ళలో ఇప్పటికే వ్యాపార పారిశ్రామిక రంగాల్లోకి అడుగు పెట్టటానికి తగినంత ఆదాయం వున్నవాళ్ళ్ళు అటువైపుకి వెళ్ళాలి!దానికి మొదటి అడుగు వీలయినంత యెక్కువ భూమిని హస్తగతం చేసుకోవాలి?!ప్రతి వ్యాపారికీ పారిశ్రామిక వేత్తకి మొదలు పెట్టటానికి తక్కువ భూమే అవసరమయినా విస్తరించుకునే దశలో భూమి చాలా ముఖ్యమయిన వనరు. దాదాపు దేశమంతటా కులాల పరిస్థితి ఇలాగే వుంది కాబట్టి ఇది అందరూ పాటించగలిగిన చక్కని రాజమార్గమే!అందులోనూ విభజన జరిగాక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్మార్ట్ సిటీల రూపంలోనూ పరిశ్రమల్ని వ్కేంద్రీకరించటం రూపంలోనూ భూమి అమ్మకాలూ కొనుగోళ్ళూ ఇదివరకటిలాగా బిగుసుకు పోయి వుండవు, రాబోయే రెండు మూడేళ్ళలో భూముల అమ్మకాలూ కొనుగోళ్ళూ యెంతో లిబరల్ అవుతాయి.పైగా ఈ సమయం దాటిపోతే మళ్ళీ ఇలాంటి అవకాశం ఇప్పుడప్పుడే రాకపోవచ్చు.భూమికీ సంపదకీ అధికారానికీ వున్న ఈ సంబంధం తెలిసినందువల్లనే శాంతిపర్వంలో భీష్ముడి పరంగా వేదవ్యాసుడూ అర్ధశాస్త్ర రచయిత చాణక్యుడూ భూమి గురించి అంత విస్తారంగా చెప్పారు!

భూమి మీద అధిపత్యమే రాజకీయాధికారానికి దగ్గరి దారి!

21 comments:

  1. మోఢీని అంటారా?? http://saveindiansnow.blogspot.in/ భాషలో చెప్పల్లంటే, మిమ్మల్ని దెశం నుంచి భహిష్కరిస్తున్నాం.. వెంటనే పాకిస్తాన్ వెళ్ళిపొండి(ఎందుకంటే మాకు ఇంకో దేశమేమీ తెల్దు మరి)

    ReplyDelete
    Replies
    1. నేను కూడా మోదీ గారి అభిమానినే నండీ!

      Delete
  2. వ్యాపారం చేయాలన్నా, భూమి కొనాలన్నా ధనం కావాలి. ఇప్పటికీ బడుగు బలహీన వర్గాల వద్ద ధనం లేదు. కొద్దో గొప్పో ఉన్నవాళ్ళు కూడా ఇప్పటికే ఆయా రంగాల్లో పాతుకు పోయిన వారిని గెలిచి నెగ్గుకు వచ్చే పరిస్థితి లేదు.

    ఇక మిగిలింది చదువు. ఫీజు రీ-ఇంబర్సుమెంటు వంటి స్ఖీముల ఉన్నత చదువులకు అవకాశం వుంది. పుస్త్కాలకు కూడా ఎక్కువ కర్చు పెట్ట నవసరం లేకుండా, ఈ ఇంటర్నెట్ యుగంలో ప్రతిదీ శ్రద్ధ గనక వుంటే తెలుసుకునే సావాకాశం వుంది. చదువులో నెగ్గగలిగితే మిగతావి వాటంత అవే సమకూరుతాయి.

    ReplyDelete
    Replies
    1. కేవలం చదువు, దానితో వచ్చే వుద్యోగాలు వెయ్యేళ్ళు గడిచినా ఆ కులాలు ముందుకు రావదానికి తోడ్పదవు.అవి వద్దనదం లేదు.వ్యాపార పారిస్రామిక రంగాల్లో వాళ్ళలో కొందరయినా ప్రవేశించాలి.పెట్టుబడి యెక్కువగా అక్కర్లేని రంగాలు కూడా వున్నాయి.ఆ రంగాల్లోకి వెళ్ళకుండా మార్కెట్ అనేది ఎకనామిక్స్ ని పూర్తిగా డామినేట్ చేస్తున్న ఈ కాలంలో యెదగటం కష్టం - వ్యక్తులుగా కాదు కింది కులాలు పైకి రావడం అనేది అసాధ్యం.

      Delete
    2. 014-11-18 న కొత్త వెర్షన్లో మీ అభిప్రయాన్ని కూడా మరికొంచెం విశ్లేషిస్తాను.

      Delete
  3. హరి గారు నమస్కారాలు!
    మోడీ గారు వెనకబడిన కులానికి చెందిన వారే గదండి,అంటే వెనుకబడిన వారు ముందుకు వేల్తున్నట్టే కదా?ఇంకో విషయం రాజకీయ నాయకుల కులాలను ఎలా తెలుసుకోవచ్చు?

    ReplyDelete
  4. ఇంతకీ మీరు చెప్పదలచుకొన్నదాని సారాంశం ఏమిటో బోధపడలేదు.మేము చిన్నప్పుడు కాలక్రమంలో ఈ కులభేదాలు అన్నీ మాయమౌతాయని అనుకున్నాము.కాని అప్పటికన్నా ఇంకా ఎక్కువ ఐనాయి (రాజకీయాల కారణాలవలన ) .

    ReplyDelete
    Replies
    1. భూమి మీద అధిపత్యమే రాజకీయాధికారానికి దగ్గరి దారి!

      Delete
    2. కేవలం చదువు, దానితో వచ్చే వుద్యోగాలు వెయ్యేళ్ళు గడిచినా ఆ కులాలు ముందుకు రావదానికి తోడ్పదవు.అవి వద్దనదం లేదు.వ్యాపార పారిస్రామిక రంగాల్లో వాళ్ళలో కొందరయినా ప్రవేశించాలి.పెట్టుబడి యెక్కువగా అక్కర్లేని రంగాలు కూడా వున్నాయి.ఆ రంగాల్లోకి వెళ్ళకుండా మార్కెట్ అనేది ఎకనామిక్స్ ని పూర్తిగా డామినేట్ చేస్తున్న ఈ కాలంలో యెదగటం కష్టం - వ్యక్తులుగా కాదు కింది కులాలు పైకి రావడం అనేది అసాధ్యం.

      Delete
    3. మీ దృష్టిలో ముందుకు రావటం అంటే ఎమిటో నాకర్థం లేదు. మీరు ముందుకుకు వచ్చాయంట్టున్న ఆ రెండు కులాల వారు, సమైఖ్యాంధ్ర ప్రదేశ్ లో ఐదు దశాబ్దాలుగా పాలించి సాధించిందేమిటి?

      Delete
    4. "భూమి మీద అధిపత్యమే రాజకీయాధికారానికి దగ్గరి దారి!"

      Bingo!

      Delete
  5. హరి గారు రాసిన వ్యాసం వలన కలిగిన ప్రేరణతో నా అభిప్రాయాలు చెప్పదలిచాను.
    మీరు చదువుకుండే O.C. కులాల విద్యార్ధులను ఎవరినైనా కదిలించండి. రిజర్వేషన్లు మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. నాకున్న అవగాహన మేరకు ప్రస్తుత పరిస్తితుల మీద ఎక్కువ మంది ప్రజలకు సరయిన అవగాహన లేదు. ముఖ్యంగా చదువుకునే వాళ్ళలో అసలు లేదు. రాజకీయ నాయకులు సమాజ స్వరూపాన్ని పూర్తిగా మార్చే చర్యలు తీసుకోలేరు. ఉన్న వ్యవస్థే వాళ్ళకు సౌలభ్యంగా ఉంది.
    ఈ వెనకబడిన కులాల తరపున పోరాడే వాళ్ళు నిజంగా మార్పు రావాలని కోరుకుంటే వాళ్ళ విధానాల్లో కూడా కొన్ని మార్పులు రావాలి.
    1. వెనకబడిన కులాల కోసం కాదు పోరాడాల్సింది. వెనకబడిన వాళ్ళ కోసం. అందులో మళ్ళీ కుల ప్రస్థావన ఎందుకు? ఒక వెనకబడిన కులానికి చెందిన వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదిగాడు అనుకుందాం. తన పిల్లలకు రిజర్వేషన్ సదుపాయం వినియోగించుకోకుండా ఉంటారా? అగ్ర వర్ణాలలో ఉన్న పేదలకు కూడా రిజర్వేషన్ ఇస్తే తప్పేంటి? తప్పు తప్పు. అసలు కుల ప్రస్తావన ఎందుకు? పేదలకు రిజర్వేషన్ ఇస్తే తప్పేంటి? ప్రభుత్వాలు తలుచుకుంటే నిజంగా పేదవాడు ఎవడొ కనిపెట్టడం అంత కష్టమా? SC,ST,BC కులాలలో ఆర్ధికంగా ఎదిగిన వాళ్ళని, డబ్బు ఉండి కూడా దొంగ కుల సర్టిఫికెట్లతో చలామణీ అవుతున్న వాళ్ళను జాగర్తగా వెతికి తొలగిస్తే, నిజంగా వెనకబడ్డ వాళ్ళకు వాళ్ళ కులంతో సంబంధం లేకుండా రిజర్వేషన్ ఇవ్వడం కష్టమా? అయితే ఒకటి ఈ అగ్రవర్ణాలలో పేదలు కొద్దిగా తక్కువ, ఈ వెనకబడిన కులాలలో పేదలు చాలా ఎక్కువ. అందులో సందేహం లేదు. అయినా సరే వెనకబడిన తనానికి కులం ఎందుకు ప్రాతిపదిక కావాలి?
    2.మరొక విషయం. వెనకబడిన వాళ్ళకు రాజ్యాధికారం అని. సరే ఉదాహరణకు మన పాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 294 మందిలో 170 మంది ఒకే పార్టీ తరపున వెనకబడిన కులాల వాళ్ళు ఎన్నికయ్యారు అనుకుందాం. ఆయా కులాలకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యాడనుకుందాం.దాని వలన కోట్లాదిమంది ఆయా కులాలకు చెందిన పేదవారికి ఏం ఒరుగుతుంది అనుకుంటున్నారు? నా ఉద్దేశంలో ఏమీ జరగదు. ఈ దేశంలో ముస్లిం రాజులు 700 సంవత్సరాలు పరిపాలించారు. మరి ఎందుకు ముస్లిములలో వెనకబాటుతనం తీవ్రంగా ఉంది? కొడ్డి మంది ఆయా కులాల వాళ్ళు రాజ్యాధికారం చేసినందువలన ఏమీ జరగదు. కాకపోతే ఈ పిచ్చి పేదోళ్ళు మా వాడు గొప్పోడు అయ్యాడని ఆనందిస్తారేమో... వాళ్ళకు జరిగేది సున్న. అసలు అధికారం అనే మంత్రదండం చేతిలోకి వచ్చాక వాడి priorities మారిపోతాయి. ఇప్పటికే నాయకులయిన ఆయా కులాల వాళ్ళు తమ కులంలోని ఎన్ని పేద కుటుంబాలను బాగు చేసారు?
    నా ఉద్దేశం ప్రకారం కుల పరంగా, మత పరంగా రిజర్వేషన్లు ఇవ్వరాదు. రిజర్వేషన్ పొందటానికి ఉన్న ఏకైక ప్రాతిపదిక పేదరికమే అవ్వాలి. డబ్బున్న కొంతమందికి రిజర్వేషన్లు ఎందుకు తీసేయకూడదో ప్రభుత్వం వారిని వివరణ అడగాలి. వారిని ఒప్పించాలి. పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో క్షుణ్ణంగా వెతకాలి.వారికే కొత్తగా రిజర్వేషన్ ఇవ్వాలి. రిజర్వేషన్ పొందుతున్న వారి ఆర్ధిక స్తితిగతుల మీద ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అవగాహన ఉండాలి. వారు ఎదిగిన తర్వాత వెంటనే ఆ సౌకర్యం తీసేయాలి. ఇదంతా జరగాలంటే ప్రభుత్వానికి నిబద్ధత ఉండాలి. ప్రజల్ని కులాల వారీగా, మతాల వారీగా ఓట్లు దండుకుందాం అనే దురాలోచన ఉండకూడదు.
    3. రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలో ప్రభుత్వం జాగర్తగా తాను ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ద్వారా తెలుసుకున్న తర్వాత వారికి ఏం ఇవ్వాలో నిర్ణయించాలి. నా ఉద్దేశం ప్రకారం ఈ దేశం లో అందుబాటులో ఉన్న నాణ్యమయిన విద్యను వారికి అందేలా చూడాలి. విద్యా వ్యవస్థను పటిష్ఠం చేయాలి. ఒక డబ్బున్న్న వాడు తన పిల్లలను ఎలాంటి చోట చదివిస్తున్నడో అలాంటి విద్యనే ప్రభుత్వం ఈ పేద పిల్లలకు ఇవ్వాలి. అవసరమయితే ప్రైవేట్ భాగస్వామ్యం తీసుకోవాలి విద్య విషయంలో. విద్య ప్రైవేటీకరణ జరగటం వలన నాణ్యమయిన విద్యకు కొంత అవకాశాలు పెరిగినప్పటికీ , పేదవాళ్ళు ఆ విద్యను పొందటం మృగ్యమై పోయింది. ప్రాధమిక విద్యను పటిష్టం చేయాలి. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులు కలిసి పని చేస్తే ఫలితాలు బాగుంటాయని నా అభిప్రాయం. విద్య తర్వాత ప్రభుత్వం చేయవలసింది ఆరొగ్య పరిరక్షణ,పౌష్టికాహార కల్పన, ఉపాధి కల్పన, నైపుణ్యాలు మెరుగు పరచటం ఇలాంటివి.
    నిజం చెప్పాలంటే పైన చెప్పినవి అందరికీ కావల్సినవే. కానీ వెనకబడిన వారి విషయం లో ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి.
    పైన చెప్పినవన్నీ జరగాలంటే దేశం పట్ల, ప్రజల పట్ల నిజమయిన ప్రేమ ఉన్న, స్వార్ధం కొంచెం తక్కువగా ఉన్న నాయకులు రావాలి. ప్రజలు కూడా సొంత లాభం కొంత మానుకుని పేదవాడికి సాయపడాలి.
    సర్వేజనాసుఖినోభవంతు.

    ReplyDelete
    Replies
    1. మీ సవివరమయిన వ్యాఖ్యకి ధన్యవాదాలు!
      2014-11-18 న కొత్త వెర్షన్లో మీ అభిప్రయాన్ని కూడా మరికొంచెం విశ్లేషిస్తాను.

      Delete
    2. *ముస్లిం రాజులు 700 సంవత్సరాలు పరిపాలించారు.... కాకపోతే ఈ పిచ్చి పేదోళ్ళు మా వాడు గొప్పోడు అయ్యాడని ఆనందిస్తారేమో*

      అధికారంలోకి రావాల్ను కోవటం కొన్ని వర్గాల అస్తిత్వ సమస్య. దానిని తప్పుపట్టలేము. ముస్లిం ల విషయాన్నే తీసుకొంటే రిసెర్వేషన్ లేమిటి, ప్రత్యేక దేశమే తీసుకొన్నారు. నేడు పాకిస్థాన్ లో వారు ఎంత అభివృద్ది చెందారో కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తూనే ఉంది. ఆ సమాజాన్ని బాగా పరిశీలిస్తే ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు తెలియవచ్చు. మనదేశ ప్రజలకు వేల కిలోమీటర్లు దూరంలో ఉన్న అమేరికా గురించి తెలిసినంతగా పక్కదేశం పాకిస్థాన్ గురించి తెలియదు. ఏం చేస్తాం?

      Delete
    3. @UG Sriram
      మీరన్నది నిజమే!తెలుసుకోవలసిన అతి ముఖ్యమయిన విషయాలనే నిర్లక్ష్యం చేస్తున్నాం.

      Delete
  6. మొదటిసారి కొంచెం అయోమయాన్ని కలిగించినట్టున్నాను అందరికీ?!

    మొదట టాపిక్ అనుకున్నప్పుడు నేను కవర్ చెయ్యాలనుకున్న పాయంట్లలో మూడు పాయింట్లు మిస్సయ్యాయి.పబ్లిష్ చేసే ముందు ఒకసారి చూసుకుని వుంటే కనుక్కోగలిగే వాణ్ణి.

    ఈ రోజు సనివారం కొంచెం పని వొత్తిడి యెక్కువగా వుంది.సోమవారం అవి కూడా కలిపితే నేను యేమి చెప్పాలనుకున్నానో కొంచెం క్లెయర్ గా తెలియవచ్చు.

    జిజ్ఞాసువులైన మీకు కలిగిన అసౌకర్యానికి క్షమైంచగలరు.2014-11-18 మంగళ వారం నాటికి పోష్టులో చేసిన మార్పుల్ని చూడవచ్చు.

    ReplyDelete
  7. హరి బాబు గారు,
    మీరు మంచి భాషతో మంచి భావాలను రాస్తారు.మీరు చెప్పే నుడి కారాలు కూడా బాగుంటాయి. నేను మీ టపాలను చాలా వరకూ చదివాను. ఈ టపా ముఖ్య ఉద్దేశం తో నాకు పెద్ద గా పేచీ లేదు.
    కానీ వాస్తవాల (facts) గురించి ఇంకొంచెం శ్రధ్ధ తీసుకొంటే బాగుండెది.
    -చుండూరు సంఘటన లో ఇన్వాల్వ్ అయినది కమ్మ వాళ్ళు కాదు. రెడ్లూ, కాపులూ.
    - కమ్మ వారి ఇన్వాల్వ్ అయినది కారం చేదు. (చుండూరు లో ఎక్కువ మంది చనిపోతే, కారంచేడు లో ఎక్కువ పైశాచిక హింస జరిగిందని నా అభిప్రాయం)
    - చుండూరు లో ఆడవాళ్ళ విషయం లేదు. సినిమా హాల్ లో ఒకడి సీట్ పైన వేరొకడు కాలు పెట్టటం తో మొదలయింది (కొంత కాలం క్రితం ఇలానే అనుకొని నా బ్లాగు లో ఎక్కడొ అన్నాను. తరువాత వికి లో చూస్తే తెలిసింది.కారంచేడు గురించి బాలగోపాల్ గారు తదితరుల తో కూడిన fact finding committee నివేదిక ఒకటి నెట్ లో ఎప్పుడో చదివాను. అది నాకు objective అనిపించింది. చుండూరు గురించి అలాంటి రిపోర్ట్ కనపడలేదు)

    మీరు టపాలు రాసే ముందు కొంచెం గూగుల్ చేసి ఆ పై రాస్తే, మీ టపాల కి విలువ పెరుగుతుంది. మీరు లెనిన్ ప్రశాంత గా రిటైరయ్యడని రాసిన కామెంటు ని చూసి వెంటనే వికి లో చూస్తే అలా అనిపించలేదు. తరువాత మీరే సరి చేసుకొన్నారనుకోండి.

    ఆ మూడు కులాల లో ఉన్నాళ్ళు ఓ ఐదు శాతం కూడా ఉండరు. మిగిలిన వారంతా మీ లాంటి, నా లాంటి సాధారణ జీవులే. ఆ మోడల్ మిగిలిన కులాలు అనుసరించటం వలన ఏమి ఉపయోగం?
    ఒక సామజిక వర్గం అభివృధ్ధ్చెందిందనటానికి నా దృష్టి లో రెండు గీటురాళ్ళు:
    1. ఆ వర్గం యొక్క సగటు సాపేక్ష జీవన స్థాయి బాగుండాలి.
    2. ఆ వర్గం లోని వివిధ మనుషుల జీవన స్థాయి సగటు స్థాయినుంచీ ఆటె deviate కాకూడదు. (higher average comparative income, low deviation from the mean). ఒకప్పుడు అభివృధ్ధిచెందిన దేశాలలోని జనాభా ఈ విధం గానే ఉండెది.
    మన రాష్ట్రం లో ఈ criteria కి దగ్గరగా ఒక్క బ్రాహ్మణులు మాత్రమే వస్తారు.
    మిగిలిన కులాలు కూడా కొంచెం కొంచెం పట్టణీకరణ చెంది అటు వైపుకి వెళ్తున్నాయి.

    ReplyDelete
    Replies
    1. బొందలపాటి గారికి,
      నిజమే, ఆ రెండు సంఘతనల్ని గురించి నా పొరపాటు అర్ధమయింది!

      వాస్తవానికి చుండూరు నరమేధానికి సంబంధించి పోరాడుతున్న వార్త గురించి ఒక బ్లాగులో ఆ విషయాన్ని తచ్ చేస్తూ కామెంటుగా వుంచాను.అక్కద సరిదిద్దటం లాంటివి జరగకపోవతంతో ఇక్కద ఈ ఇబ్బంది వచ్చింది!

      లెనిన్ గురించి రాసింది, సరిదిద్దుకున్నట్టుగా అంపించిందా, మొదటే చూఒసి రాసిందే - చివరిలో కొంత గందరగోళం వున్నా నాకు మొదటి నుంచీ అది తీవ్రమయినది కాదనే అనుకున్నాను.

      మీరు ఆకర్లో ఇచ్చిన మూదు పాయింట్లనీ స్టడీ చేసి మరో పోష్టుని సాధికారికంగా రాస్తాను.

      సవివరమయిన విమర్శకి ధన్యవాదాలు!

      Delete
  8. 1. వేదపఠనం జరిగేటప్పుడు దూరం నుంచి విన్నా వాళ్ళను చెవుల్లో సీసం కరిగించి పొయ్యమనే ఆచారం మందేశం లో ఏ ప్రాంతాంలో, ఏ కాలంలో జరిగిందో మీకు తెలిస్తే చెప్పగలరా?

    2. గతంలోకి తొంగి చూస్తే ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్ లోని పంజాబ్, సింధ్ లలో, డిల్లి, ఆగ్రా మొదలైన ప్రాంతాలలో, ఎప్పుడు పరదేశ దండయాత్రల వలన యుద్దానికి ఎక్కువ డిమాండ్ ఉండేది. ఆ విద్యలు ఎక్కువగా నేర్చుకొనే వారు. అక్కడ వేద పాఠశాలలు ఉన్నట్లు చరిత్ర లో చదవలేదు. నార్త్ కంతా కలిపితే కాశీలో వేదధ్యాయనం చెప్పే పాఠశాలలు ఉండేవని తెలుస్తుంది. ఇది మిగతా ఎక్కడైనా ఉన్నాయా? సౌత్ లో ఎన్ని చోట్ల వేద పాఠశాలలు ఉండేవి? మీకేమైనా తెలిసితే చెప్పగలరా?

    ReplyDelete
    Replies
    1. మయసభలో అడుగుపెట్టిన రారాజులాగా తయారయింది నా పరిస్థితి ఈ పోష్టుతో?
      వచ్చిన వ్యాఖ్యలన్నీ కుంగు ఫూ దెబ్బల వలె తగుల్తున్నాయి మరి ఈ పోష్టులో!

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...