Thursday 9 October 2014

యే వెలుగులకీ ప్రస్థానం?యే మలుపులకీ ప్రయాణం!

        "నా మూలాలు నీకు లేకుండా చేస్తా" - పంచ్ అదిరింది!ఇలాంటి పంచ్ సినిమాలో పడీతే కాసుల వర్షమే!!కానీ ఈ మాట నిజజీవితంలో ఒక భర్త అన్నాడు.ఫలితంగా రక్తం వర్షమై కురిసింది? "అతను కిరాతకుడు, పెళ్లయిన రెండో రోజు నుంచే కొడుతూ వుండేవాడు, అత్తమామలు కూడా నన్నే సర్దుకు పొమ్మనేవాళ్ళు" - ఇవ్వాళ గర్భశోకానికి గురయిన ఆ భార్య ప్రతివాదన! పెళ్లయి ఇద్దరు పిల్లల్ని కని వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఇప్పుడు విడిపోయే సమయంలో వాళ్ళ మధ్య యెంతటి అగాధం? వసుధైక కుటుంబ భావనతో దేశాల్నీ జాతుల్నీ కలపడం మాట దేవుడెరుగు ఒక ఇంట్లో ఇంతకాలం తనువులు కలిసినా మనసులు కలవని దిక్కుమాలిన స్థితిలో వున్నారివాళ్టి మనుషులు. రేపటి రోజున చంపుకోవడానికీ పగలు తీర్చుకోవడానికీ  పెళ్ళిళ్ళు చేసుకుంటారేమో - యే వెలుగులకీ ప్రస్థానం?యే మలుపులకీ ప్రయాణం!

        మన పెంపకాలు అలా వున్నాయి మరి!మగవాడు పుడితే వాడికేం మగమహారాజు యెలా అయినా బతికేస్తాడు అనే దరిద్రపు మాటల్తో రేపటి రోజున వాడు ఒక కుటుంబ పెద్దగా వుండాలి అనేది తెలిసి కూడా బాధ్యతలు నేర్పకుండా సంస్కారం గలవాడిగా తీర్చిదిద్దకుండా గాలి కొదిలేస్తున్నారు! ఆడపిల్ల పుడితే యెప్పటికయినా పెళ్లయి కొత్తచోటికి వెళ్ళాల్సినదే గాబట్టి యెక్కడయినా బతకగలిగే ధైర్యమూ కొత్తవాళ్లతో చొరవగా కలిసిపోయి అందిస్తే అల్లుకుపోగల తెలివినీ నేర్పకుండా అంతులేని విధినిషేదాల్తో భయస్తురాళ్ళుగా తయారు చేసి అమాయకంగా హతమారి పోయేటట్టు పెంచుతున్నారు! దాని ఫలితంగానే మగతనం అంటే ఆడదానితో సామరస్యంగా వ్యవహరించి తన సమర్ధతతో ఆమెను సంతోషపెట్టటంగా కాకుండా పశువులాగా భయపెట్టి లొంగదీసుకుని తన కోరిక తీర్చుకోవటం అని భ్రమించి ఈవ్ టీజింగుల దగ్గిర్నించి రేపుల వరకూ గల అకృత్యాల నన్నిట్నీ అంత ధీమాగా చేస్తున్నారు మగవాళ్ళు. మన పిల్లల్ని యెలా పెంచాలి అనేది కూడా తెలియని అజ్ఞానంలో వున్నారివ్వాళ్టి తలిదండ్రులు. రేపటికాలంలో పిల్లలకి జైళ్ళే స్కూళ్ళవుతాయేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

       పెంపకాలతో పాటు మనిషిని తీర్చిదిద్దే మన చదువులూ అట్లాగే అఘోరించాయి!పరదేశీయుడు తనకి పనికొచ్చే బంత్రోతుల్నీ భావదాసుల్నీ తయారు చేసుకునేటందుకు రూపొందించుకున్న విద్యావిధానాన్నే వాళ్ల నుంచి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాక గూడా మన దేశపు సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మార్చలేకపోయారు!అన్ని పాఠ్యాంశాల్లోకీ పిల్లల్ని భయపెట్టేదిగా లెక్కల్ని చెబుతారు. కానీ వేదగణితాన్ని అనుసరిస్తే పిల్లలు భయాన్ని పోగొట్టుకోవడమే గాకుండా హుషారుగా నేర్చుకోగలుగుతారు! దాదాపుగా మిగతా అన్ని పాఠ్యాంశాల్లోనూ యెక్కడో అక్కడ లెక్కలు వస్తాయి, అలాంటిది అందులో వెనకబడ్దం వల్ల మొత్తం చదువులే పిల్లలకి బోరు కొట్టించేవిగా తయారయినా కనీసం యెందుకు పిల్లలు బోరు ఫీలవుతున్నారు అనే ప్రశ్న కూడా వేసుకోకుండా బలవంతంగా ఈ రొడ్డకొట్టుడు బట్టీలకే అలవాటు చేసి తీపి జ్ఞాపకాలతో జీవితకాలం గుర్తుండిపోవాల్సిన అందమయిన బాల్యాన్ని భయంకరమయిన శిక్షగా మార్చేస్తున్నారు. మన విద్యావ్యవస్థ యెంత కిరాతకంగా వుందో తెలుసుకోవడానికి బండ్లకొద్దీ రిపోర్టులు చదవక్కర్లేదు - కిలోల్లెక్కన బరువున్న స్కూలుబ్యాగుల్ని మోసుకుంటూ వెళ్లే ప్రైమరీ స్కూలు పిల్లల్నీ స్టెయిలుగా ఒక నోట్ బుక్కూ ఒక నాలుగయిదు టెక్స్టు బొక్కులతో చేతులూపుకుంటూ వెళ్ళే కాలేజీ కుర్రాళ్లనీ మార్చి మార్చి చూస్తే చాలు - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

       "రెండు పవిత్రాత్మలు కలిసి ఒక పరమాత్మ స్వరూపాన్ని పుడమి పైన ప్రభవింప జేయడం" అనేది మనుషుల మధ్య జరిగే వివాహక్రతువులోని వుద్దేశం! పుట్టినప్పుడు మెడకూడా నిలబెట్టలేనంత సున్నితంగా వుండే శిశువుకు నడక, పలుకు, నడత నేర్పి సమాజానికి మంచి కానుకగా నిలబేట్టాల్సిన ఒక జీవితకాలపు యజ్ఞభావనతో కూడిన ఉన్నతలక్ష్యం లాభనష్టాల బేరీజులతో కూడిన క్రయవిక్రయాల ఒప్పందం స్థాయికి దిగజారిపోయింది. స్త్రీతో చేసే సహజశృంగారానికి బెదిరి ఒక మగాడు మరొక మగాడి శరీరాన్ని నాక్కుంటూ చేసే వికృతత్వాన్ని కూడా పెళ్లి గా గుర్తించేసేటంత అజ్ఞానంలో వున్నారివ్వాళ్టి న్యాయమూర్తులు. రేపటి రోజున అన్నాచెల్లెళ్ళ మధ్య జరిగే ఇన్సెస్ట్ కూడా పెళ్ళిగా ఆమోదించబడుతుందేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

    ప్రస్తుతం మన భూమి వున్న సూర్యమండలం పాలపుంత అనే ఇడ్లీ ఆకారంలో వున్న నక్షత్ర సమూహానికి సంబంధించినది. ఈ ఇడ్లీలో వుడికీ వుడకని ఒక మినప్పప్పు బద్ద అంత వుంటుంది మన సూర్యమండలం.వీటిల్లో సూర్యుడి నుంచి మూడో గ్రహమయిన భూమి మీద వున్న మనం సూర్యుడి నుంచి నాలుగో గ్రహం మార్స్ కి జస్ట్ ఇప్పుడే చేరుకున్నాం. ప్లుటో అనే తొమ్మిదో గ్రహానికే యెప్పటికి చేరుతామో ఇప్పుడే చెప్పలేం. వీటన్నిట్నీ శోధంచి యేమి చేస్తారు? ఇక్కడ తామరతంపరగా పెరిగిన జనాభాలో కొందర్ని అక్కడికి తరిమెయ్యడానికా,ఇక్కడ పేరుకు పోయిన చెత్తనంతా యెత్తి అక్కడ గుమ్మరించడానికా - యెందుకు గ్రహాంతరాల్లో జనావాసాల కోసం వీరంతా అలమటిస్తున్నారు? ఒకనాడు హరప్పా కాలం లోనే మురుగునీటి పారుదల సౌకర్యాలతో బహిరంగ స్నానఘట్టాలతో నగరజీవనాన్ని క్రమబధ్ధీకరించుకుంటే ప్రశాంతంగా బతకడాని కయినా తక్కువమంది సంతానంతో సరిపెట్టుకుని వున్నదాన్ని సమంగా పంచుకోవటాన్ని నేర్చుకోవాలి, ఆరోగ్యంగా వుండేటందుకయినా తమ చుట్టూ వున్న పరిసరాల్ని పరిశుభ్రంగా వుంచుకోవాలి అనే చిన్న విషయాన్ని కూడా తెలుసుకోలేని దుస్థితిలో వున్నారివ్వాళ్టి నవనాగరికులు. రేపటి రోజున మనుషులందరూ తరతమ భేదాల్లేకుండా  చెత్తలో పుట్టి, చెత్తలో పెరిగి చెత్తలో ఐక్యమయ్యే చెత్తాద్వైత స్థితికి చేరుకుంటారేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

     ఒక కొడుకు తమ పెళ్ళి ఫొటోలు చూపించినంత గొప్పగా "నాన్నా,ఇవిగో నీ కోడల్ని చంపి పాతిపెట్టిన ఫోటోలు" అని గొప్పగా చూపిస్తే కబీరు పురస్కార గ్రహీత అయిన ఆ పవిత్రాత్మ స్వరూపుడయిన తండ్రి యెలా స్పందించాడో ప్రత్యక్షంగా మనం చూడలేదు గాబట్టి ఖచ్చితంగా తెలుసుకోలేము గానీ అది తప్పు అని చెప్పిన దాఖలాలు లేవు! వురిశిక్షకి గురై చావబోతూ ఆఖరి కోరికగా తల్లిని ఫెళ్ళుమని చెంప పగలగొట్టి, "తోటకూర నాడే చెప్పివుంటే నాకీ గతి పట్టేది కాదు గదే" అన్న కధలోని పాత్రధారి నిజంగా మనిషే అయి వుండి  ఈ తండ్రి పెంపకపు తీరునీ ఆ కొడుకు చేసిన వరస భీబత్సాల్ని చూసి వుంటే తను తల్లిని అలా కొట్టినందుకు సిగ్గు పడి వుండే వాడేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

      మంత్రివర్గాలు యేర్పడిన తర్వాత నెలలు గడిచినా ప్రభుత్వపరంగా నిక్కచ్చిగా ఒక్క పనినీ మొదలు పెట్టకుండా సర్వేలూ,శ్వేతపత్రాలూ,కబుర్లూ,తిరుగుళ్ళూ,పండగలూ,తిట్టుకోవడాలూ లాంటి బేవార్సు పనుల్తో సరిపుచ్చుతుంటే ఆ ప్రభుత్వ నిర్వహణకి అన్ని నెలల ఖర్చూ వృధా యే గదా! యెంత ఖర్చు పెట్టారు అని లెక్క వేసుకోవాలంటేనే గుండె గుభేలు మంటున్నది. హామీలూ, వాగ్దానాలూ చూస్తే ప్రపంచంలో వున్న సంపదనంతా తరలించుకు రాగలమన్నట్టు పిట్టల దొర కబుర్లు చెప్తున్నారు ఇద్దరూ. తెలంగాణా ముఖ్యమంత్రిని చూస్తే కొత్తగా వొచ్చిపడ్డ హోదాతో కేళీ విలాసంగా వున్నాడు! బంగారు తెలంగాణా తెస్తానని కంగారు తెలంగాణా తెచ్చినా రాష్ట్రం విడిపోతే చాలు అనే జనం అధికంగా వుండటం వల్ల రాష్త్ర సాధకుడిగా అపరిమితమయిన కీర్తి ప్రతిష్టలు యెలాగూ వచ్చేశాయి గాబట్టి ముఖ్యమంత్రిగా తన దివాళాకోరుతనంతో ఫెయిలయినా ఆంధ్రోళ్ళు పడనియ్యలేదని తప్పుకునే వీలుందనే లెక్కలేని తనంతో మిడిసి పడుతున్నాడు. పత్రికల్లో వ్యతిరేక వ్యాఖ్యలు తన కొక్కడికే వచ్చాయా?నిన్నటి తరం దిగ్దంతులు దేశోద్దారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు గారూ నార్ల వెంకటేశ్వర రావు గారూ అప్పుడు ప్రభుత్వంలో వున్న వాళ్లు తనకన్నా మహోన్నతు లయినప్పటికీ వదలకుండా యేకి పారెయ్య లేదా?ఇమ్రోజు ఎడిటర్ షోయబుల్లా ఖాన్ పట్టపగలు నడిబజార్లో హత్యకు గురయ్యాడంటే అతని రాతలు యెంత ఘాటుగా వుండి వుండాలి?నిన్నటి తరం ప్రజాస్వామిక మహారాజ్ఞి ఇందిరా నెహ్రూ(ఖాన్)గాంధీనెహ్రూ ను అనుసరిస్తున్నాడేమో!వాళ్ళ రాష్ట్రం వాడే అని మురుసుకుంటున్న పోతన యెప్పుడో చెప్పాడుగా "కారే రాజులు?రాజ్యముల్ గలుగవే?గర్వోన్నతిం బొందరే?వారేరీ?సిరి మూటగట్టుకు పోవంజాలిరే?" అని! "అధికారాంత మందు జూడవలె గదా అయ్యల సౌభాగ్యము" లని మరో కవివాక్యం కూడా తనలాంటివాళ్లని గురించేనని యెప్పటికయినా తెలుసుకుంటాడా ఆ పెద్దమనిషి? తను మాట్లాడిన తప్పుడు కూతల్ని కూడా వొప్పుల కుప్పలుగా తొండివాదనల్తో సమర్ధించుకొచ్చే పంఖాలూ శీతలీకరణ యంత్రాల్లో ఇంధనం నిండుకోనంతవరకూ అతనికి తన ప్రవర్తనని మార్చుకోవలసిన అవసరం లేదేమో! తమ ముఖ్యమంత్రి తమ విపరీతపు సమర్ధనల వల్లనే అహంకారిగా మారి పరిపాలనని అస్తవ్యస్తంగా చేసి తమ కష్టాలకు కారణ మయ్యాడని భవిష్యత్తులో గానీ ఈనాటి వీరభక్తులకు తెలియదు! ఇటు చూస్తే రైతు సాధికారిక సంస్థను యేర్పాటు చేసేశాను మీకేం భయం లేదంటూనే అప్పు చేసయినా మీ బాకీలు తీరుస్తానంటాడు ఆంధ్రా ముఖ్యమంత్రి, తను సొంతంగా చేసి తీరుస్తాడా? మనతోనే చేయిస్తాడే! కానీ ఆ అప్పెలా తీరుస్తాడో మాత్రం చెప్పడు? ఒకనాడు తనే అధికారం నుంచి క్రూరంగా లాగి పారేసి చావు వరకూ తీసుకెళ్ళిన పెద్దమనిషి ఇవ్వాళ ప్రతి చిన్న పధకానికీ రామనామాన్ని తగిలిస్తున్నాడు!దేవుడి వేషాలు వేసినంత మాత్రాన రామారావు దేవుడూ కాదు, ప్రతిచోటా అతని పేరును తగిలించనూ అక్ఖర్లేదు!అతిపనులు వికటిస్తే వొచ్చే అనర్ధం కూడా అతిగానే వుండి వీపు విమానం మోత మోగిస్తుంది ఒకోసారి! ప్రపంచంలోనే అపూర్వమయిన రాజధాని కడతానంటాడు, అయితే విరాళాలూ మీరే ఇవ్వాలి శ్రమదానమూ మీరే చెయ్యాలంటాడు - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

      విడిపోక ముందు అన్ని రాష్ట్రాల్లోకీ ధీమాగా వున్న రాష్త్రం కాంగ్రెసు నిర్దాక్షిణ్యంగా లెక్కాడొక్కా యేమీ లేకుండా విడగొట్టటం వల్ల రెండు రాష్ట్రాలకీ కష్తమే అని ఇద్దరు ముఖ్యమంత్రులకీ తెలుసు, అయినా మేకపోతు గాంభీర్యంతో చెలాయంచు కొస్తున్నారు.కేంద్రం కూడా సాయం చేసే పరిస్థితి లేదు. మోదీ గారు ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి ముఖ్యమంత్రుల పానెల్ వెయ్యడంతో ఆ మూగమొద్దు పెతాన మంత్రి కేవలం వుత్తుత్తి మాటలే చెప్పాడు గాబట్టి నికరంగా రావాలంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ జాలి చూపిస్తే తప్ప ఈ రెండు రాష్ట్రాలూ కేంద్రం నుంచి నిధులు కూడా తెచ్చుకోలేవు.ఈ రెండు రాష్ట్రాల నిజమయిన ఆర్ధిక స్థితి తెలియాలంటే అధికారుల విభజన పూర్తయి(?) యెక్కడి వాళ్ళు అక్కడ కుదురుకున్నాక ఆదాయ వనరులు యేమి వున్నాయి,వీటిని ఆదాయంగా మార్చడానికి యెంత ఖర్చవుతుంది,తప్పనిసరి ఖర్చులు యేమిటి,వాటిల్లో పొదుపు యెంత చెయ్యగలం అనే లెక్కలు వాళ్ళు తేల్చుకోవడానికే కొంత సమయం(?) పడుతుంది. అదంతా పూర్తయ్యాకే ప్రభుత్వం నిజంగా పని చెయ్యడానికి సిధ్ధంగా వున్నట్తు లెక్క! మామూలు పన్లకే విభజన కష్టాల్ని యేకరువు పెడుతున్నారు గానీ కరువు ప్రస్తావన వొస్తే మాత్రం అదేం చేస్తుందని దవిలాగులు దంచేస్తున్నారు!కరువంటే చాక్లెట్ ఇస్తే తీసుకుని సంతోషంగా తప్పుకుపోయే చిన్నపిల్ల అనుకుంటున్నారా?కరువు యొక్క మొదటి దెబ్బ మనుషుల మనస్సుల మీద పడుతుంది! ఆ కంగారులో యెంతటి ధైర్యస్తుడయినా బేజారు కావల్సిందే. రావడం అంటూ జరిగితే తన ఆవృత్తం పూర్తయ్యాకే వొదులుతుంది.కరువు లెందు కొస్తాయో ఎకనామిక్స్ లో కొత్తగా వచ్చిన డ్రాట్ ఎకానమీ చెబుతుంది. అంతకు ముందరి అస్తవ్యస్తపు ఆర్ధికవిధానాల ఫలితంగానే కరువు వొస్తుంది! ఒకనాటి బెంగాలు కరువు మొత్తం కర్జన్ అనే వొక్క వ్యక్తి దుర్మార్గమయిన ఆర్ధిక విధానాల వల్ల వొచ్చిపడింది. అట్లాగే నిన్నటి ప్రభుత్వం పాటించిన అస్తవ్యస్తపు ఆర్ధిక విధానాల కారణంగా ఒక చైన్ రియాక్షన్లో భాగంగా వచ్చే కరువు కూడా దానంతటది పోదు - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

       మొబైలు టవర్ల నుంచి వచ్చే హానికారక వుద్గారాలు అమాయకమయిన పిచ్చుకల పాలిటి శాపాలుగా మారినా ఆ హాని మనకి కాదుగా అని నిష్పూచీగా వున్న మనుషి ఈ భూమి మీద నుండి అంతరించిపోయే ప్రమాదం తనకీ యెదురవబోతున్నదని తెలుసుకోలేని అజ్ఞానంలో వున్నాడు!మగవాళ్ల వీర్యకణాల్లో సంతానాన్ని పుట్టించే సత్వం రానురానూ తగ్గిపోతున్నదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.ఆ తగ్గుదల "0" స్థాయికి పడిపోతే చావులే తప్ప పుట్టుకలు లేక ఒక యాభైయేళ్ళలో మానవజాతి సమస్తం తుడిచిపెట్టుకు పోవటం ఖాయం!ఈ పరిస్థితికి పారిశ్రామిక వ్యర్ధాలూ కరగని గంధక ధూళీ మట్టిలోకీ, నీటిలోకీ, గాలిలోకీ ఇంకిపోవడం వల్ల జీవ రసాయనిక సమతౌల్యం దెబ్బతినడం ఒక కారణం కాగా అందరి కష్టాన్నీ ఒక్కచోట చేర్చి అందరూ కలిసి పంచుకోవడం అనే ఆర్ధికసూత్రంలో వుండే ప్రశాంతతని కాకుండా అందరి దగ్గిరా వున్నది తనకే కావాలని కోరుకుంటూ అందరూ ఒక్కదానికే పోటీపడే జీవనవిధానం వల్ల మనస్సు మీద పడే వొత్తిడులు మరో కారణం. ఒకనాడు డైనోసార్లు మనిషిలాగే ఈ భూమినంతా ఆవాసం చేసుకుని చెలరేగిపోయి హఠాత్తుగా అదృశ్యమయి పోయాయి. కారణాలు ఇతమిధ్ధమని ఇప్పటికీ నిర్ధారించలేకపోతున్నారు, కానీ మనిషి మాత్రం తెలివి తేటలు యెక్కువై నశించిపోయాడనే సాక్ష్యాన్ని వొదిలే వెళ్తాడు? అప్పుడు అణుధూళిలో కూడా క్షేమంగా బతకగల్గిన బొద్దింకలూ చీమలూ మనిషి గురించి "ఈ పెనుమంటి దిబ్బపై వసియించి రొకనాడు మానవుల్!పాపము శేముషీ విభవ పారగులై అందరు మడిసి చచ్చిరి!!" అని జాలిగా కరుణ గీతికలు పాడుకుంటాయి కాబోలు - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

      ప్రపంచంలోని అతి ప్రాచీనమయిన సాంప్రదాయం అని వివేకానందుడు గొప్పగా చెప్పుకోగా ప్రపంచ ఆధ్యాత్మిక రంగంలో యెంతో ప్రభావశీలిగా వున్న హిందూధర్మం ఇవ్వాళ తమ దుర్మార్గం వల్లనే మతాంతరీకరణలు జరిగాయని తెలిసి కూడా లవ్ జెహాదుల మీద అల్లరి చేస్తూ రివర్స్ మతాంతరీకరణలకి తెగబడుతూ పాప్యులారిటీ పెంచుకోవడం కోసం నిన్న మొన్న పుట్టిన ఆ మతాలనే ఇమిటేట్ చేస్తూ పట్టుపంచె కట్టుకుని హుందాగా వుండాల్సిన తాతగారు మనవడితో పోటీ పడుతూ లెవ్వీ జీన్సులు తొడిగి అమ్మాయిలకి లైనులు వేస్తూ వుంటే యెలా వుంటుందో అలా తయారయింది! పంచమవేదంగా జయేతిహాసాన్ని అందించిన వేదవ్యాసుడు అవతారికలో "ఖండాంతరాలలో వున్న యవనుల్లో కూడా ఋషులు వుండే వుంటారు, వారందరికీ కూడా నమస్కరిస్తున్నాను" అన్నాడు.ఆ వినయశీలత్వాన్నీ ఆచరణలోని స్వచ్చతతో గౌరవాభిమానాల్ని అందుకోవడాన్నీ వొదిలేసి మనం విశ్వగురువుల మని అహంకరిస్తూ ఆర్భాటాలు చేస్తున్నారివాళ్టి ఆషాఢభూతులు.రేపటి రోజున ఇతర మతస్తుల్ని బుజ్జగించడానికి ఓంకారాన్ని హల్లెల్లూయాతో ఢీకొట్టించి కొత్తరకం బీజాక్షరాల్ని కూడా సృష్టిస్తారేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!

    తన చుట్టూ అప్పుడున్న హింసకీ అశాంతికీ విసుగెత్తి శాంతిని పెంచాలని "ఇస్లాం" ధర్మాన్ని ప్రతిపాదించాడు ప్రవక్త! శ్రమకీ దానానికీ ప్రాముఖ్యతని ఇచ్చే ఒక కొత్త సాంప్రదాయాన్ని సృష్టించి అతి తక్కువ కాలంలోనే యెంతోమందిని ప్రభావితం చెయ్యగలిగింది ఇస్లాం ధర్మం. ఇవ్వాళ్టి ప్రపంచంలో వున్న అన్ని మతాల్లోకీ అతి తక్కువ కాలంలోనే ఇంత ప్రభావశీలంగా యెదిగిన విశిష్టత ఇస్లాం ధర్మానికి మాత్రమే వుంది! ఒక చోట వ్యతిరేకత రాగానే పరమ శాంతంగా అక్కడి నుంచి తప్పుకుని వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ తన బోధనని కొనసాగించే వాడు!చూడటానికి ఇది తన్నడాని కొస్తే పారిపోయినట్టు సిల్లీగా కనబడినా ప్రవక్త వేసిన అమోఘమయిన యెత్తుగడ?తను చెప్పిన దాన్ని కొందరు నిష్టగా పాటించటం వల్ల మరికొందరు వ్యతిరేకిస్తున్నారంటే దానర్ధం యేమిటి?పాటించే వాళ్ళ ఆచరణ  వ్యతిరేకుల్ని నష్టపెట్టేటంత బలంగా వుందని కదా!ఇంకా అక్కడే వుండి అక్కడి వ్యతిరేకుల్తో కుక్కజట్టీల్లో ఇరుక్కోవడం వల్ల  కధ అక్కడే ముగిసిపోవడం జరిగి వుండేది కాదా! అలా ప్రవక్త తొలినాళ్లలో వ్యతిరేకతని కూడా వివేకంతో యెదుర్కోవటం వల్లనే ఆ అద్భుతం సాధ్యపడింది. ప్రపంచంలోని ప్రతి ముస్లిమూ ఇవ్వాళ పవిత్రంగా పూజించేది కర్బలా మైదానంలో నేల కొరిగిన త్యాగమూర్తుల రక్తంతో తడిసిన భూమినే!ఒకనాడు కాఫిర్ల మీద జెహాద్ చెయ్యటమంటే వ్యతిరేకించే వారిని ప్రేమతో గెలిచి తమ రక్తం చిందించి అయినా సరే శాంతమార్గంలోనే గెలవాలనే అర్ధం వుండేది?శాంతి కోసం ప్రభవించిన ధర్మాన్ని అనుసరిస్తూ కూడా అశాంతితో రగిలి పోతున్నారు. ప్రవక్త బోదనల్ని నిష్ఠగా పాటించటం కన్నా తుపాకులతో యేదటివాళ్లని భయపెట్టటం  ద్వారానే ఎక్కువ రక్షణ వుంటుందని భ్రమ పడుతున్నారు. ఈరోజు వీరు పరిధిని దాటి చేస్తున్న పొరపాట్ల వల్ల యెదురయ్యే వ్యతిరేకత ఇస్లాం ధర్మానికి అతి తక్కువ కాలం లో అదృశ్యమయిపోయిన మతంగా మరో రకమయిన కీర్తిని తెచ్చిపెడుతుందేమో - యే వెలుగులకీ ప్రస్థానం? యే మలుపులకీ ప్రయాణం!.


ప్రళయమే రానీ ప్రణయమే పోనీ
                                                           హృదయమే కాలి బూడిదై పింజలైపోనీ
                                                           కన్నుగానని తత్వం తెలిసి బతికితే
                                                           మనిషిగా కలకాలం మిగులుతావుగా హరీ!
                                                           ఇంత దెలిసి యుండి అంత బాధ పడతావేం బాబూ!!

7 comments:

  1. చాలా గొప్ప పోస్ట్ సార్! వాస్తవం.

    ReplyDelete
  2. ఏమని చెప్పాలి...

    ఒక విషయమును సృశిస్తే దాని మీద మనమో ఒక అభిప్రాయము చెప్పొచ్చు.. కానీ పలు విషయములను ఒకే చోట సృశిస్తూ మానవళి ఎటు పోతుందో అన్న అవేదనతో వ్రాసిన ప్రతి అక్షరం చాలా బాగుంది. నిజాలు తెల్సిన తర్వాత జాగత్ర పడే వారుంటారు కొందరు... తెల్సిన కూడా అశ్రద్ద చేసేవారుంటారు కొందరు. దురదృష్టావత్తు ఇలాంటి వారు ఎక్కువయిపోయారు ప్రస్తుత సమాజంలో.

    ReplyDelete
  3. హరిబాబు గారు,

    చాలా విషయాల్ని మీదైన ఒక ప్రత్యేక శైలిలో స్పృశించారు. ఏవిషయం మీద స్పందించాలో అర్ధం కావటం లేదు. అన్నీ బావున్నాయి. తన చుట్టూ వున్న విషయాల పట్ల ఒక సామాన్యుడి ఆవేదన, ఆగ్రహం కనపడుతున్నాయి. కానీ ఒక చిన్న సలహా, మీ ప్రతి వ్యాసాన్ని ఒక టాపిక్ కు పరిమితం చేయండి. పాఠకులు స్పందించడానికి అనువుగా వుంటుంది.

    ReplyDelete
    Replies
    1. ఈ వొక్కటే ఇలా వుంటుందండి!వీటన్నింటిలోనూ వున్న సారూప్యం వల్ల ఇలా చేసాను.

      Delete
  4. క్షమించాలి. మతాల గురించిన మీ అభిప్రాయంతో నేను ఏకీభవించలేను.

    హైందవం ఎన్నడూ ఒక మతంగాలో, రాజ్యవయవ్యవస్థగానో precipitate అవ్వడానికి ఉద్దేశ్యించబడినదికాదు. వేదాలూ ఉపనిషత్తులూ philosophical discourses తప్ప assertments/dogma కావు. ప్రస్తుతం మనం వాడుతున్న vocabulary కూడా సరైనదికాదు. ఎవరైతే సృష్టించారో వారిని స్రష్ట/బ్రహ్మ అన్నారుతప్ప, బ్రహ్మ/స్రష్ట అన్నవాడు జగత్తును సృష్టించినట్లుగా చెప్పబడలేదు. The same goes with 'The caretaker' and the 'The destroyer'. హిందువుల ఖర్మకొద్దీ హైందవం దేవతారాధన స్థాయికి దిగజారిందికానీ హైందవం భూమ్మీద సిధ్ధించిన అతి శ్రేష్టమైన ఫిలాసఫీ.

    యూదులను రోమన్ల domination నుండి సంఘటిత పరచి, రక్షించడానికి క్రీస్తు అవసరమయ్యాడు. ఆనాడు ప్రతి తిరుగుబాటుదారుడూ తననుతాను దేవుని కుమారుడిగానే చెప్పుకున్నాడు. అలాంటి ప్రతి 'దేవునికుమారుడు' శిలువకే వ్రేళ్ళాడాడు. వాళ్ళలో క్రీస్తు ఎంత విజయవంతమయ్యాడంటే రోమన్లుకూడా క్రీస్తుభావజాలపు ఆధిపత్యాన్ని అంగీకరిస్తేతప్ప తమ hegemonyని నిలుపుకోలేనంత. The 'Son of God' claim was a mere claim that was necessitated but not a fact. The claims of divinity served the purpose of unification he had intended.

    The same goes with Muhammad. ఈయన అరబ్బులను ఒకతాటిపైకి తీసుకురావడానికి దేవుణ్ణివాడాడేగానీ, మహమ్మద్ తానకు తాను claim చేసుకున్నడని చెప్పబడే devine associationకి ఎలాంటి శాస్త్రీయ, చారిత్రిక ఆధారాలు లేవు.

    మరాఠులను unify చేసిన శివాజీని, హైందవాన్ని సంస్కరించిన శంకరాచార్యుణ్ణి దైవాంశగా భావించడం హిందువులలో మనం గమనిస్తాం. క్రీస్తు, మహమ్మద్ల legacyలు అంతకంటే భిన్నంకావు.

    ReplyDelete
    Replies
    1. @iconoclast
      హిందువుల ఖర్మకొద్దీ హైందవం దేవతారాధన స్థాయికి దిగజారిందికానీ హైందవం భూమ్మీద సిధ్ధించిన అతి శ్రేష్టమైన ఫిలాసఫీ.
      >>
      ఆ స్తితి నుంచి దిగజార్చారనే నేను ప్రస్తావించాను.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...