Sunday, 20 April 2014

యెన్నికల వేళ పంచటానికి ఒక సీసాడు పద్యం!

సీ||          యెవడండి ఇక్కడ చెవిలోన పూల్గుత్తి
                 పెట్టుకు తిరిగేటి పిచ్చి వెధవ?

                  లేకి మాటలు వాగి, లేని వాటికి ఆశ
                  చూపించి, రూక లిచ్చి తమ వోటు

                  ను కొను దండగమారి నేత లందరు గొప్ప
                  నీతిపరు లనుకొని, కుల గోత్ర

                  ములకు విలువ నిచ్చి, మోసకారుల నదే
                  పనిగ పోటీకి దింపేటి పాత

తే||            కులను గొప్పవారని నమ్మి, కాస్త మేలు
                   కే దభాలున పడిపోయి కాటి కాప
                   రులను మించిన వార్ని కుర్చీల పైన
                   చేర్చి - బంగరు భవిత కాశ పడు వాడు!
(20/04/2014)

Saturday, 19 April 2014

భాజపా లాంటి తెలివి తక్కువ పార్టీకి అప్రహతిహతమయిన అధికారం అవసరమా?

ఒకానొకప్పుడు అంటే రాజుల కాలం నాడు ఉరిశిక్ష పడిన ఒక ఖైదీని ఆఖరి కోరిక యేమిటని అడిగితే మా అమ్మని చూడాలని ఉందని అడిగాట్ట. పాపం సెంటిమెంటుతో కదిలిపోయి వాళ్ళమ్మని తీస్కొచ్చి యెదురుగా నిలబెడితే లాగి ఒక్కటిచ్చుకున్నాట్ట చెంప ఛెళ్ళుమనేట్టు.యెందుకని అడిగితే "తోటకూర నాడే నువ్వు నన్నిలా కొట్టి ఉంటే ఈ రోజు నాకీ దిక్కుమాలిన చావు తప్పేది గదే?!" అని అఘోరించాట్ట.


ప్రస్తుతం తెదేపా-భాజపా పొత్తు పరిస్థితి కూడా అలాగే ఉంది.కొద్ది రోజుల క్రితమే వేరొకరి బ్లాగులో నేను కామెంటు వేశాను, యేమని?


ఇంతవరకూ ఇదివరకటి సమైక్య రాష్ట్రంలో అసలు చెప్పుకోదగిన స్థాయిలో ప్రాతినిధ్యమే లేని భాజపా -  విభజన లో కేవలం ప్రతిపక్ష పార్టీగా గందరగోళం చెయ్యడం తప్ప ఫలితాన్ని యే విధంగానూ శాసించకుండా, కనీసం ఆంధ్ర ప్రాంతానికి జేపీ ప్లాన్ ని చంకనేసుకుని గోల చెయ్యటం తప్ప నికరమయిన లాభాన్ని కూడా చూపించలేకపోయినా -  తన బలాన్ని తను అతిగా వూహించుకునీ తప్పనిసరిగా అధికారంలోకి రావలసిన నాచబా వీక్నేసుని అడ్దం పెట్టుకునీ అన్ని స్థానాలకి పోటీ చేసి యేం ఉధ్ధరిస్తాననుకుంటుందో? ఆనాడు తెరాసా వాపుని చూసి  బలుపనుకుని నలభయ్ ఇచ్చి మట్టానికి మునిగి తీరుబడిగా అక్కడ కూడా మేమే పోటీ చేసుంటే అధికారంలోకి వచ్చేవాళ్ళమేమో అని భోరుమన్నప్పటి పరిస్థితే మళ్ళె యెదురయితే ఇక తెలుగుదేశం గతి శ్రీమతే రామానుజాయ నమహ!

సరిగ్గా ఇవ్వాళ అదే జరుగుతున్నది, మరోసారి తెలుగుదేశానికి మిత్రపక్షమే సుంతీ చెయ్యబోతున్నది.యెంత ఘోరం!

అసలు భాజపా యే రకమయిన తెలివితో విభజన వల్ల  ఈ రెండు ప్రాంతాల్లో తనకి మైలేజీ విరగబడుతుందని అనుకుంటున్నది?విభజన ప్రకటన బహిరంగంగా జరిగినప్పటి నుంచీ భాజపా యెన్ని తెలివి తక్కువ పనులు చేసిందో తెలుసా?కాంగ్రెసు ఇవ్వదు యెన్నికల తర్వాత మేము వచ్చాక ఇస్తాం అనే మాట పదే పదే పబ్లీకున కూసి కాంగ్రెసుకి ఆ ఇచ్చే ఛాన్సు భాజపా కి యెందుకు దక్కనివ్వటం యెన్నికలకు ముందు మనమే ఇచ్చేస్తే పోలా అనే అలోచన రేపెట్టి కాంగ్రెసు తన యూపీయే-3 అనే మాస్టర్ ప్లాన్ లో తెలంగాణా ఇవ్వటం కూడా ఒక అంశంగా చేర్చుకునేలా చేసింది.

ఇచ్చేది మేమే అని చెప్పుకున్నప్పుడు వీలున్నంత వరకూ యెన్నికల లోపు తెలంగాణా ఇవ్వాలనే కాంగ్రెసు యూపీయే-3 మార్కు ప్లాన్లకి మెడ మీద తలకాయ ఉన్న యే రాజకీయ నాయకుడయినా అది యెలాగయినా జరగనివ్వకుండా ఉందటానికి దారులు వెతుకుతాడు, వ్యూహాలు పన్నుతాడు, పరిస్థితిని తనకు అనుకూలంగా తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు.అదీ గత యెన్నికల్లో కాంగ్రెసు అవినీతి గురించి అంత గత్తర చేసినా యూపీయే-2 యేర్పడకుండా అడ్డుకోలేకపోయిందిగా! ఇప్పుడు ముందుగానే ప్రధాన మంత్రి అబ్యర్ధిని ప్రకటించి పులిజూదానికి తెగబడినప్పుడు యెంత తెలివిగా ఉండాలి?ఉందామరి?

అప్పుడు తొలిసారి బహిరంగంగా పాత్రికేయుల ముందు ప్రకటించిన పిగ్గీ రాజా నుంచీ ఇప్పటి రాం రాం రమేష్ వరకూ కచరా విలీనం ఒప్పందాన్నిమేమడక్కుండా తనంత తనే ప్రతిపాదించాడనీ దాని వల్ల వచ్చే ప్రయోజనం కోసమే తెలంగాణా ఇచ్చామనే అర్ధంలో వాగుతున్నప్పుడు అందులో వీళ్ళకి తమకి పనికి వచ్చే యే ఆయుధమూ కనబడలేదా?ఇలాంటి కొనుగోలు అమ్మకం ఒప్పందాల్ని మేము సమర్ధించం అనే వాదన యెంతా హుందాగా ఉండేది. పరిస్థితిని తమ కనుకూలంగా మార్చుకోవడానికి విలీనం అనే వికృతమయిన వ్యవహారాన్ని తెలివిగా ఉపయోగించుకోలేని పార్టీ యొక్క రాజకీయ పరిణితి యెంత?

తెరాసా కాంగ్రెసులో విలీనం అవడానికి ప్రతిఫలంగా కాంగ్రెసు తెలంగాణాని ఇవ్వడ మంటే రేపటి రోజున తెలంగాణాలో తాను ఆశించే ప్రయోజనానికి తన ప్రధాన వైరి వేరే పార్టీతో ముందే సీట్లని పంచేసుకోవడం కాదా? మరో పార్టీ సాయం లేకుండా మూడింట రెండువంతుల మెజార్టీ కోసం తను ఆడే ప్రమాదకరమయిన పులిజూదంలో ప్రతి సీటూ విలువైనదే అయిన పరిస్థితిలో ఉండి కూడా విలీనం ఒప్పందం ద్వారా తన ప్రధాన వైరి మరో పార్టీతో కలిసి తన నుంచి కొన్ని సీట్లని లాగేసుకుంటుంటే మెదడులో సరుకున్న యే రాజకీయ పార్టీ అయినా తన శత్రువుకు లాభం కలిగించే తెలివి తక్కువ పనులు చేస్తుందా?భాజపా చేసింది.

వచ్చేది మేమే ఇచ్చేది మేమే అని చెప్పుకుని కూడా తెరాసా తో బేరాలాడుకుని యూపీయే-3 ప్లానుతో ఉన్న కాంగ్రెసు తెగబడి అంత బహిరంగంగా తమని వెధవాయల్ని చేస్తూ తమని కూడా కాంగ్రెసు వ్యూహానికి అనుకూలంగా నడిపించుకుంటుంటే తెలివి తక్కువగా వైరి పక్షానికి సాయం చేసి ఇప్పుడు మిత్రపక్షమయిన తేలుగు దేశంతో డబుల్ గేం ఆడటానికి తయారయింది.యెందుకో తెలుసా? ఒక వేళ భాజపాకి యేక పార్టీగా అధికారం సుస్థిరం కావడానికి కావలసిన మాజిక్ నంబర్ రాకపోతే మోడీ కున్న రా.స్వ.సే ముద్రని బూచిగా చూపించి ప్రధాని పదవికి బాబు పోటీ పడతాడేమోనని. కాదా?

యెక్కడో చెన్నైలో కూర్చుని పత్రికల ద్వారా మాత్రమే పరిస్థితిని తెలుసుకున్న నాకు తెలిసిన మాత్రం కూడా చంద్రబాబుకి తన గురించి తనకి తెలియడం లేదు -  భాజపాతో పొత్తు గురించి ఆలోచించి గందరగోళంలో పడకుండా తన బలం తను చూపిస్తే రేపటి రోజున మోడీతో ప్రధాని పదవికే పోటీ పదే అవకాశం ఉందని. విభజన ప్రకటనకి చాలా కాలం ముందు నుంచే పాదయాత్రల పేరుతో రాష్ట్రమంతా చెడతిరిగి యేం చూశాడు?చూసి యేం తెలుసుకున్నాడు?ప్రజల్లో తనకి పూర్తి సపోర్టు లేదనుకున్నాడా?ఆంధ్రాలో భాజపాతో పొత్తు తనకి అవసరమా?విభజనలో రాయలాంధ్రకి అన్యాయం జరగడం వల్ల ప్రజల్లో భాజపాకి వ్యతిరేకతే యెక్కువగా ఉంది కదా!అది కూడా తెలియలేదా?

తెలంగాణాలో మాత్రం యేమంత గొప్పగా ఉంది పరిస్థితి? ప్రతిపక్షంలో కూర్చుని కాంగ్రెసు ఇస్తుంటే తెరాసా పుచ్చుకుంటుంటే చూస్తూ కూర్చున్నందుకే తెలంగాణాలో భాజపా పట్ల హవా విరగబడుతుందా?ఒక దశలో రాయలాంధ్రకి అన్యాయం జరుగుతుందని,బిల్లులో లోపాలు ఉన్నాయని అద్వానీ గారు కూడా ఇప్పుడు బిల్లుని వ్యతిరేకిద్దాం, మనం వచ్చాక సరయిన పధ్ధతిలో ఇద్దాం అనే రకంగా ఆలోచించలేదా?ఆ వాదన మీద కూడా గట్టిగా నిలబడకుండా కాంగ్రెసు యెక్కడ మేము ఇద్దామనుకుంటే భాజపా అడ్డం కొట్టేసింది అని ప్రచారం చేసుకుంటుందో అనే భయంతో మళ్ళీ పిల్లిమొగ్గ వెయ్యటం అబధ్ధమా?అసలు కాంగ్రెసు వ్యూహమే భాజపాని గందరగోళంలోకి నెట్టెయ్యడం అయినప్పుడు ఆ గందరగోళానికి గురై పిల్లిమొగ్గలేసిన పార్టీ తెలంగాణాలో మాత్రం యేం వూడబొడుస్తుందనుకున్నాడు చంద్రబాబు?ఇప్పుడు తెలంగాణాలో కాంగ్రెసు తెరాసా రెండూ భాజపా బిల్లుని అడ్డుకోవాలని చూసింది అంటుంటే గట్టిగా కాదని చెప్పలేని దిక్కుమాలిన స్థితిలోకి తనంతట తనే నడిచి వెళ్ళిన పార్టీతో అంటకాగినందు వల్ల కొత్తగా తనకి వొచ్చే లాభ మేంటి?

తెలుగు దేశం ఈ రెండు ప్రాంతాల్లోనూ చెప్పుకోదగిన సొంత బలమున్న పార్టీ. యే పార్టీ కయినా క్షేత్ర స్థాయిలో జండాలు మోసి బానర్లు పట్టుకు తిరిగే మామూలు కార్యకర్తలు యే అబ్యర్ధికి మనస్పూర్తిగా పని చేస్తే ఆ అబ్యర్ధికే విజయావకాశాలు యెక్కువగా ఉంటాయి. అది మర్చిపోయి కార్యకర్తలు కూడా ఇబ్బంది పడే ఈ పొత్తుల వల్ల తెదేపాకి నష్టమే తప్ప లాభం లేదు - రెండు ప్రాంతాల్లోనూ!

అయిందేదో అయిపోయింది, పొత్తుల్ని వీలున్నంత తొందరగా తన కార్యకర్తల మనోభావాలకి అనుకూలంగా ముగించుకుని ముందు జరగాల్సిన దానికి సిధ్ధం కావడం చంద్రబాబు తక్షణ కర్తవ్యం. లేదంటే 2009 నాటి భంగపాటు మళ్ళీ యెదురవుతుంది!భాజపా వాళ్లకి కేటాయించిన సీట్లు గెలుస్తారో వోడుతారో వాళ్ళ మానానికి వాళ్ల నొదిలేసి తను పోటీ చేస్తున్న సీట్లలో గట్టిగా పని చేసి మంచి ఫలితాన్ని రాబట్టటంమీద దృష్టిని కేంద్రీకరించాలి చంద్రబాబు. నిన్నటి దాకా కాంగ్రెసులో అఘోరించి విభజనకి సంబంధించి చెయ్యగూడని దిక్కుమాలిన రాజకీయ మంతా చేసి తెల్లారేసరికి తెదేపా లోకి దూకిన వాళ్ళకీ సీట్లిచ్చాడు.అలాంటి చోట్ల మూతి కాలకుండా చూసుకోవాలి అతను. అక్కడ ప్రధాని పదవికి మోడీతో పోటీ పడటం అనే తమాషా వూహని వొదిలేసినా ఈ రెండు రాష్ట్రాల పునర్నిర్మాణంలోఅతని పాత్ర చాలా అవసరం..

దక్షిణాదిలో అతి పెద్ద రాష్ట్రంగా ఉండి దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన ఆంధ్ర ప్రదేశ్ తన ప్రాభవాన్ని కోల్పోయి రెండు చిన్న రాష్ట్రాలుగా విడిపోయింది. కొందరి లాగా విడిపోవటం గురించి నేనెప్పుడూ అతిగా ఆందోళన పడలేదు కానీ విడిపోయిన విధం చాలా భయానకంగా ఉంది.జహ్వేరీ లాల్ నెహ్రూ లాగా నేను డ్రీమర్ ని కాదు. నేను వేసే అంచనా లన్నీ వాస్తవాల ప్రాతిపదికగానే ఉంటాయి.ఒక ప్రతిపాదనని మిగతా వారి ముందు పెట్టాలనుకున్నప్పుడు నా రాగద్వేషాలకి తావు లేకుండా చూసుకుంటాను.విభజన బిల్లు పైన యెవరికయినా ఇంకా పాజిటివ్ ఒపీనియన్ ఉంటే రాష్ట్ర విద్యుచ్చక్తి కార్యాలయం వారి లేఖని చూడొచ్చు.ప్రభుత్వం లోని ఒక ఉపాంగమయిన ఒక సంస్థ కేంద్రం లోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండి మేధావుల మని డప్పు కొట్టుకుంటున్న సన్నాసులు ఆదరాబాదరాగా వండి వార్చి మన మొహాన కొట్టిన బిల్లుని తిట్టి పోసింది. అక్కడున్నది కాంగ్రెసు పార్టీ కాబట్టి సిగ్గు పడక పోవచ్చు గానీ యెంత దరిద్రమయిన విభజనో కదా ఇది?

ఈ యాభయ్ అరవయ్ యేళ్ళుగా యెంతో కొంత కాదు, చెప్ప్పుకోదగిన స్థాయిలోనే అభివృధ్ధి చెందింది రాష్ట్రం.అయితే ఇప్పుడు యెన్నికలు సమైక్య రాష్ట్రంలో జరుగుతున్నా యెన్నికల అనంతరం యేర్పడే రెండు రాష్ట్రాలూ మళ్ళీ మొదటి నుంచీ మొదలు పెట్టాల్సి వస్తున్నది.యెందుకంటే ఇరు పక్షాలూ ఒక చోట కూర్చుని న్యాయంగా తమకి యేది కావాలో అన్నీ ముందే తేల్చుకుని పంచుకుని విడి పోవటం లేదు.గీత గియ్యడమే తప్ప వనరుల్ని వేటినీ సామరస్యంగా పంచే బాధ్యత తీసుకోలేదు ఆ బాధ్యత లేని పెద్దమనిషి.పైగా భాజపా విడగొట్టినప్పుడు సంవత్సరాలు పట్టిన దాన్ని మేము నెలల్లోనే పూర్తి చేస్తున్నాం అనే సుత్తి ఒకటి! అసలు విభజన కోసం తను యేమి చేస్తున్నది నెలలయినా పట్టటానికి. అంతా కాలానికీ, దైవానికీ, ఈ రెండు రాష్ట్రాల ప్రజల ఖర్మానికీ వొదిలేసి పంచాల్సిన వాటి పట్ల యే లెక్కా లేనప్పుడు నెలలయినా యెందుకు, రోజుల్లోనే పూర్తి చెయ్యొచ్చు!

పసుపు దేశాధిపతీ గులాబీ దళపతీ జాతీయ పార్టీలతో అంటకాగడం గురించిన భ్రమల్ని వొదులుకోవాలి. అంటకాగడం వల్ల వాళ్ళకి ఉపగ్రహంగా మారడమే తప్ప మనకి లాభమేమీ ఉండదు.కేంద్రంలో అధికారం వెలగబెడుతూ రాష్ట్రాలతో వ్యవహరించడంలో కాంగ్రెసూ భాజపా రెండూ ఒకే విధంగా ప్రవర్తిస్తాయి - నాకేంటి లాభం అని!అలాంటప్పుడు కేంద్రంలో మోడీ ఉన్నా రాహుల్ ఉన్నా మనకేంటి?యేదయినా పోట్లాడి సాధించుకోవడమే అయినప్పుడు మనకి మొహమాటం దేనికి?

ఈ రెండు ప్రాంతాల్లోని మేధావులకీ, ప్రజాస్వామ్య వాదులకీ నేనొకటి సూటిగా చెప్పదల్చుకున్నా - సావధానంగా వినండి.చదువుకున్న వాళ్లం, మిగతా వాళ్ళ అభిప్రాయాల్ని కూడా కొంత మేరకు ప్రభావితం చెయ్యగలిగిన వాళ్ళం మనం విభజన వల్ల కొందరికి అధికార పీఠాన్నిచ్చి వాళ్ళ హవా హవాయీలకి తాళం వెయ్యకుండా సామాన్య ప్రజల గురించి ఆలోచిస్తున్నట్లయితే మీరు వోటు వెయ్యబోయే ముందు ఇతర్లకి చెప్పే ముందు దీన్ని మనసులో ఉంచుకోండి.

యెన్నికల అనంతరం ఈ రెండు ప్రాంతాల్లోనూ యేర్పడాల్సిన రాజకీయ చిత్రపటం ఇలా ఉండాలని నేననుకుంటున్నాను:1.తెలంగాణాలో కేసీఆర్ అధ్వర్యంలో తెరాసా అధికారంలోకి రావాలి. తెలంగాణాలో తెలుగు దేశం ప్రధాన ప్రతి పక్షంగానే ఉండాలి.2.రాయలాంధ్రలో తెలుగు దేశం అధికారంలోకి రావాలి. యెటూ తనతో నువ్వా నేనా అన్నట్టు జగన్ ఉన్నాడు కాబట్టి జగన్ పార్టీ అక్కడ ప్రధాన ప్రతిపక్ష మవుతుంది సహజంగా.(ఇప్పటి దాకా రహస్యంగా ఉన్న లాలూచీ బహిరంగమై పోయి కేసులన్నీ మాఫీ అయిపోగా తను నా మాతృసంస్థకీ జై అనేస్తే కాంగ్రెసు ప్రధాన ప్రతిపక్ష మవుతుంది?)3.రెండు శాసనసభల్లోనూ లోక్ సత్తాకి చెప్పుకోదగిన స్థాయిలో ప్రాతినిధ్యం ఉండాలి. 4.మల్కజ్ గిరీ నుంచి జేపీ తప్పనిసరిగా యెన్నికల్లో గెలిచి సభలో ఉండాలి 5.ఈ రెండు ప్రాంతాల్లోనూ ఆ రెండు జాతీయ పార్టీలనీ మోడీ హవా అనీ తెలంగాణా ఇచ్చిందనే తొక్కలో వాదనల్ని పట్టించుకోకుండా పూర్తిగా వూడ్చి పారెయ్యాలి.

భాజపా ఈ రోజున రా.స్వ.సే ని నెత్తిన పెట్టుకు మోస్తున్నది.రేపటి రోజున ఆ కోతి మూక మళ్ళీ రామాలయాన్ని కెలికి యేదయినా చెయ్యరాని దుడుకు పని చేస్తే రెండేళ్ల లోనే ప్రభుత్వం పడిపోయి మధ్యంతరం రావచ్చు.విడి పోయి తొలి అడుగులు వేస్తున్న మన రెండు రాష్ట్రాలకీ కంద్రంలో స్థిరంగా అయిదేళ్ళు ఉండే ప్రభుత్వం కావాలి.అందుకోసం భాజపాకి బదులుగా యూపీయే-3 వచ్చినా ఫరవాలేదని నేననుకుంటున్నాను.

ఈ అయిదు అంశాల్లో మొదటి రెండూ నా బుధ్ధికి పొడిచిన అద్భుతమయిన ఆలోచన లేమీ కాదు. వాస్తవం వాటికి అనుకూలంగానే ఉంది. కాకపోతే తేడా రాకుండా చూసుకోవాలని చెప్తున్నా, అంతే. ఇతర బ్లాగుల్లో నా కామెంట్లనీ నేను రాసిన కొన్ని పోష్టుల్నీ చూసిన యెవరికయినా నా కాంగ్రెస్ ద్వేషం, గులాబీ దళపతి పైని నా అక్కసూ తెలిసే ఉంటుంది.అయినా సరే పరిస్థితిని బట్టి ఈ రెండు రాష్ట్రాల ప్రజల భవిష్యత్తుకీ ఆ అమరిక మాత్రమే మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను.
సర్వే జనా సుఖినో భవంతు!

Tuesday, 8 April 2014

జన్మాంతర సౌహృదాలు పల్కరించిన వేళ

సీ||      జన్మాంతరపు సౌహృదము లేవొ పల్కరిం
           చిన యట్లు తోచెను చిన్ని మాధ

           విని చూడగానె, విచ్చిన పారిజాతమ

           ల్లె కనబడింది పాలు మరవని ప

           సి తనపు నిద్రలో, ఇది వీడ్కి పెండ్లాము

           అవుతుందనో ఏమొ అమ్మ లక్క

           లందరు మేలమాడంగ -  పైనున్న త

           ధాస్తు దేవతలు తధాస్తు చెప్పు

తే||       నట్టు అప్పుడే తొలిముద్దు నిచ్చి వేస్తి!

            కామ మెరుగని వయసులో కాంక్ష విత్తు
            మొలిచి పాతికేండ్లకు నేడు మొక్క లాగ
            మారి ఒకగూటి పక్షుల మైతి మిపుడు!!
(08/04/2014)

బంగారం, నువ్వంటే నాకెంతో ఇష్టం రా! ఇంత ఇష్టపడి చేసుకున్నా నా అసమర్ధత వల్ల నిన్ను సుఖపేట్ట లేకపోతున్నా నెందుకో?


యేదీ కలిసి రావడం లేదు. కొందరికి మట్టి ముట్టుకుంటే బంగార మవుతుంది. నేను బంగారం ముట్టుకున్నా మట్తై పిగిలి పోతుంది! 


ఆ కలిసొచ్చే రోజు వస్తే నిన్ను మహారాణి లాగ చూసుకుంటా, నన్ను నమ్ము. అంతవరకు:


రవి గాంచని కవి గాంచని సుకుమారపు సౌందర్యమా, నా జన్మాంతర సౌహృదాలను మేళవించుకున్న స్వరరాగ సంరంభమా -  నన్ను క్షమించు!!!

Saturday, 5 April 2014

చిత్రమయిన గొప్పవాళ్ళు?!

రాం గోపాల్ వర్మ:

          ఇతని సినిమాల్లో చాలావరకూ చీకటి ప్రముఖ పాత్ర వహిస్తుంది! తన మెదడులోనూ అదే ఉందేమో?పాత్రలు మాట్లాడే భాష కూడా పొడిపొడిగా "కొట్టు, చంపు, స్పాట్ పెట్టెయ్, కూర్చో, నుంచో, అదిటివ్వు. ఇది తీసుకో" అన్నట్టుగా ఉంటాయే తప్ప మనసుకు హత్తుకు పోయే సంభాషణలూ ఉండవు.తను ఇచ్చే ఇంటర్వ్యూల్లో తను మాట్లాడే సంగతులూ అంతే.అసలు చేప్పే విషయమే చెత్త అనుకుంటే,చెప్పటం కూడా ఆ చెత్త విషయాల్ని ఇంతకన్నా చెత్తగా ఇంకెవ్వడూ చెప్పలేడు అనిపించేటట్టుగా ఉండటమే ఇతని ప్రత్యేకత!

          రాఘవేంద్ర రావు దగ్గిర్నుంచీ యే ప్రముఖ దర్శకుడికీ లేని వెసులుబాటు తనకి ఉంది. పది సినిమాలు ఫ్లాపయినా సరే తనతో సినిమాలు తియ్యడానికి సిధ్ధపదే నిర్మాతలు ఉండటం.జ్యోతి నుంచీ మొదలుకుని యెన్నో హిట్ సినిమాలు తీసి ఇప్పటికీ అదే హవాను చాటుతున్న రాఘవేంద్ర రావు సైతం ఒక సినిమా ఫ్లాపయితే తర్వాతి సినిమాకి యెంతో హడావుడి పడతారు, యెలాగయినా ఈ సినిమాని హిట్ చెయాలని కసి చూపిస్తారు. కానీ అలాంటి జాగ్రత్త లేవీ అవసరం లేని ఒకే ఒక అదృష్ట వంతుడయిన దర్శకుడు ఇతనే.

          దేవుడ్నీ అదృష్టాన్నీ తను నమ్మక పోయినా ఇవ్వాళ ఇతనికి దక్కిన ఈ అరుదయిన స్థానానికి మాత్రం అతనికున్న సాంకేతిక పరమయిన ప్రతిభా, సినిమా తియ్యడంలో అతను పాటించే జాగ్రత్తలూ లాంటివి కాకుండా అదృష్టమే కారణం కావడం విచిత్రం!


దాసరి నారాయణ రావు:

          పాలగుమ్మి పద్మరాజు శిష్యుడయి ఉన్నా తన సినిమాల్లో ఇది దాసరి భాష అని గుర్తు పట్టగలిగే యే  రకమయిన సాహితీ విలువలూ లేని సుత్తి డైలాగులు ఉంటాయి ఇతని సినిమాల్లో!సినిమాలు హిట్ చెయ్యడం వరకూ గట్టివాడే కానీ బయట వేదికల మీద నోరు విప్పితే మాత్రం తన సినిమాల్లోని డవిలాగుల స్థాయిలోనే మాట్లాడ్డం ఇతని ప్రత్యేకత.

          నిన్నటి దాకా కాంగ్రెసుని అంటకాగి కేంద్ర మంత్రి అయి బొగ్గు మసి అంటించుకుని వచ్చిన ఇతను ఇవ్వాళ మోహన్ బాబుని అక్కినేని రామా రావుల కన్నా గొప్ప వాడనటం, కాంగ్రెసు కన్నా కమ్యునిష్టులు మంచి వాళ్ళని చిన్నప్పటి జ్ఞాపకాల సాక్ష్యాలు తీసుకు రావటం, ఆంధ్ర ప్రదేశ్ విభజనలో ఒక బ్రోకర్ ఉన్నాడనటం లాంటివి చూస్తుంటే నవ్వాలో యేడవాలో అర్ధం కావడం లేదు?!ఇతని మాటలకి చక్కిలిగిలి పెట్టుకుంటే తప్ప మనసారా నవ్వలేం:-)

          తనకు తెలిసిన ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పటానికి దమ్ము లేక సరయిన సమయం కోసం చూస్తున్నానంటూనే తన ధైర్యం గురించీ సాహసం గురించీ సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు చూడండి? ముందెప్పుడో కూస్తానని క్లూ ఇస్తున్న ఆ నిజం బయట పెట్టే సమయం యెప్పుడు వస్తుందో? తనకు బ్రోకరేజీ అవసరమయినప్పుడు వెయిటేజి కోసం వాడుకుంటాడన్న మాట తెలిసిన నిజాన్ని చెప్పటానిక్కూడా వర్జాలూ వారశూలలూ చూసే ఈ అవకాశవాది.విభజన మొత్తం పూర్తయ్యాక ఇప్పు డందులో బ్రోకరేజి ఉందంటే అంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణా వాళ్ళలో ముదుర్ల కెవరికయినా కాలగూడని చోట కాలితే తన్నను గూడా తంతారు!

          సినిమా ఫీల్డులో చాలా మంది ఇలాంటి బాపతే. సినిమా చూసేవాడికి యేం కావాలి. టికెట్టు కొనుక్కుని థియేటర్లో అడుగు పెట్టి బయటి కొచ్చాక తన డబ్బు గిట్టుబాటయిందనే సంతృప్తి. అది కూడా ఇవ్వలేని దద్దమ్మలు మేధావు ల్లాగా సమాజం గురించీ విప్లవాల గురించీ గంభీరంగా మాట్లాడ్డం దేనికి?

          అసలు విషయం నిన్నటిదాకా హైదరాబాదు ఆంధ్రా కింద ఉండటం వల్ల అవార్డులు తెచ్చుకునే స్థాయి లేకపోయినా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అంటకాగి అవి కూడా సాధించేసి పోజులు కొట్టారు గదా, అది రేపు హైదరాబాదు తెలంగాణా లోకి వెళ్తే ఆ హావా ఉంటుందో లేదో అన్న బెంగ యెక్కువయిందీ.తెలంగాణా యేర్పాటులో బ్రోకర్ల గురించి మాట్లాదే దాసరికీ, సొంతంగా పార్టీ పెట్టిన జనసేనానికీ, మోడీని కలిసిన నాగార్జునకీ అందరికీ ఒకటే లక్ష్యం - తమ హవా తగ్గకుండా చూసుకోవాలనే లాభదృష్టి.


నారా చంద్రబాబు నాయుడు:


          అల్లుడు అనే అచ్చ తెలుగు మాటకి అల్లడం అనేది మూల పదం, అంటే రెండు కుటుంబాల్ని అల్లుతాడు అని దానికి అర్ధం. కానీ ఈ అల్లుడు మాత్రం మామ గార్ని గిల్లి పారేశాడు. కాబట్టి ఇతన్ని గిల్లుడు అనుకోవచ్చా? జర్నలిష్టులు కానీ మరెవరయినా సరే యే విషయం గురించయినా తన సొంత మాటని మాత్రం ఇతని నుంచి బయటకి లాగలేరు. వాళ్ళు చెప్పింది తప్పు, వీళ్ళు చెప్పింది తప్పు అనడం తప్ప తను యేదీ చెప్పి కమిటవ్వడు.

          ఇతని రాజకీయ పరమయిన యెదుగుదల కూడా అలాగే ఉంటుంది. తను యేదీ పూనుకుని చేసి జనాన్ని మెప్పించి యెదగడు.వేరే పార్టీ వాళ్ళలో గానీ సొంత పార్టీ వాళ్ళలో గానీ యెదటి వాళ్ళలో ఉన్న లోపాల్ని ఉపయోగించుకుని - తప్పులు పట్టి  నేను అంతకన్నా మెరుగు అని సమర్ధించుకోవడం వల్ల గానీ, లేదంటే ఆ వ్యక్తి లోని బలహీనతల్ని ఆధారం చేసుకుని వెన్నుపోటు పొడవటం గానీ చేసి పైకొస్తాడే తప్ప నిజమయిన నాయకత్వ లక్షణాలతో యెదగడు.

          సాధారణంగా యెవరయినా నాయకుడి గురించి "ఇతను ప్రభుత్వం లోకొస్తే మనకి మంచి బతుకు గ్యారెంటీ" అని ప్రజలు అనుకోవాలి. కానీ ప్రజలు అనకపోయినా తనకు తనే అనేసుకుంటాడు, "నేను ప్రభుత్వంలో ఉంటే చాలు ప్రజలు బాగుపడ్డట్టే" అని? ఒక్క మాటలో చెప్పాలంటే రాజులాగా ఉండాలనుకుంటాడు, కానీ స్వభావంలో రాజసం లేదు.ప్రజాస్వామ్యానికి కట్టుబడ్డట్టుగా ఉంటాడు కానీ ప్రజాస్వామ్య స్పూర్తి లేదు.


జయప్రకాశ్ నారాయణ్:


          పదహారేళ్ళు అత్యంత సమర్ధుడయిన ప్రభుత్వాధికారిగా పని చేసిన తర్వాత హఠాత్తుగా జ్ఞానోదయమయ్యింది - ఈ రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలూ లొసుగులూ పీటముళ్ళూ తననూ తన లాంటి వాళ్ళనీ సరిగ్గా పని చెయ్యనివ్వటం లేదని.

          వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి జనం మీద పడ్డాడు.మొదట్లో కేవలం ప్రజల్ని యెన్నికల గురించి, తమ బాధ్యతల గురించి విడమర్చి చెప్పి క్షేత్ర స్థాయిలో ప్రజలకి అవగాహన కల్పించడం లక్ష్యంగా పని చేశాడు. పరిస్థితి తగినంత ప్రోత్సాహ కరంగా కనిపించటంతో ఉద్యమాన్ని రాజకీయ పార్టీగా మార్చి ప్రభుత్వాధికారాన్ని ఆశిస్తున్నాడు.

          ఇతను యెంత తెలివయిన వాడంటే తన పార్టీ తరపున గెలిచి చట్టసభలో అడుగు పెట్టింది తనొక్కడే అయినా చాలా బిల్లుల్ని సభలో ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకోగలిగాడు. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా వాటిని వ్యతిరేకించి చెడ్డ పేరు తెచ్చుకోవడం కన్నా ఆమోదించి అమలు చేస్తే తమకు మంచి పేరు రావడం ఖాయం అనిపించేటంత గట్టిగా వాట్ని రూపొందించటమే దానికి కారణం.

          యే విషయం గురించి అయినా మంచి అవగాహనతో మాట్లాడడం, యెంత ప్రతికూలమయిన పరిస్థితి లో నయినా సరే తన అభిప్రాయాల్ని మార్చుకోకుండా వాటికే కట్టుబడి ఉండి తను యే మార్పు నయితే ఆశిస్తున్నాడో దానికి కావలసిన సంస్కారం తనలో ఉందని నిరూపించుకుంటున్నాడు.

          కానీ ఈ వ్యవష్థని మార్చాలనుకున్న వాడికి ఈ వ్యవస్థ ఇప్పుడున్నట్టుగా ఉండటం వల్ల లాభ పడే వాళ్ళు సాయం చెయ్యరు.యెవరి సాయమూ లేకుండా ఒంటరిగా ఇతను లక్ష్యాన్ని సాధించలేడు.ప్రేమ నగర్ కధా నాయకుడు "తాగితే మరచి పోగలను, తాగ నివ్వదు.మరచి పోతే తాగ గలను, మరువనివ్వదు" అని దుఖ్ఖించినట్టు రాజకీయ వాతావరణం ఇప్పుడున్నట్టుగా ఉన్నంత కాలం ఇతను అధికారం లోకి రాలేడు.ఇతను అధికారం లోకి రానంత వరకు రాజకీయ వాతావరణం ఇలాగే ఉంటుంది.


మన్ మోహన్ సింగ్:

          యెక్కువగా మాట్లాడడు గనక మౌన మోహన్ సింగ్ అని కూడా అంటారు. ఒకే ఒక పత్రికా సమావేశంతో ఇతను మాట్లాడక పోవటమే తెలివయిన పని అని ఋజువైపోయింది. పెద్ద చదువే చదివాడు గానీ క్రియేటివిటీ గానీ సరదా తనం గానీ లేకుండా పుస్తకాల పురుగులా చదివి డిస్టింక్షన్లు కొట్టే చాలా మంది ముద్దబ్బాయిలలో ఇతనూ ఒకడయ్యుంటాడు.అందుకే ఇతని వ్యక్తిత్వంలో ఈసురో మని కనిపించే దిగులు తప్ప చురుకుదనం కనపడదు.

          యెంత పెద్ద పొజిషన్లో ఉన్నా స్థాన బలిమి కాని తన బలిమి కాదయా అని వినయంగా ఉండటం మంచి లక్షణమే కానీ అది మరీ దేశ ప్రధాని పదవి అయి ఉండి ప్రజలు ఆ మనిషి నుంచి ఆశిస్తున్నందుకయినా పదవికి తగ్గ వైభవం ఉండకపోవటం చిత్రమే కదా!

          కొందరితన్ని మంచివాడే గానీ మెతకతనంతో అన్యాయ మైపోయా డంటారు. నేనొప్పుకోను.కాంగ్రెసులో అమాయకులు ఉంటారంటే నేను నమ్మను.మొదటి సారి అధికారం లోకి రాగానే తొలి రెండు రోజుల్లోనే పోటాని యెత్తేశాడు చాలా మామూలుగా. భాజపా అప్పుడు యెందుకు వోడిపోయిందో తెలీదు గానీ పోటాని మాత్రం గట్టిగా అమలు చేసింది. కొందరు రానాలు ఇబ్బంది పడినా దేశం మాత్రం ప్రశాంతంగా ఉంది.దానర్ధం యేంటంటే తన పార్టీ విధానం యేమిటో తనేం చెయ్యాలో తెలిసే చేస్తున్నాడు అన్నీ.

          తను ఉన్న స్థానానికి విలువేమిటో తెలుసుకోకుండా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవాలనే కనీసపు తెలివి కూడా లేకుండా భవిష్యత్తు తరాల నుంచి నుంచి కేవలం జాలిని మాత్రమే కోరుకున్న మందభాగ్యుడు?!


నరేంద్ర మోడీ:

          ఒక మనిషి తన స్వంత ప్రతిభా విశేషాలతో కన్నా ప్రతికక్షుల తెలివితక్కువ తనం మూలంగా గొప్పవాడవటం యెలా ఉంటుందో ఇతని యెదుగుదలను చూస్తే అర్ధ మవుతుంది.చదువుకునే రోజుల్లో మార్కులు సాధించటంలో ఇతడు గొప్ప తెలివైన వాడు కాకపోయినా నాటకాలూ, వక్తృత్వ పోటీలూ లాంటి వాటిల్లో అమోఘమయిన తెలివిని చూపించాడు.ఇవ్వాళ ఇతని బహిరంగ సమావేశాల్లో వినపడే ఆశువుగా వెదజల్లే చతుర్లు ఆనాటి మూలాల నుంచే వచ్చాయి కాబోలు.

          తనకి పదమూడేళ్ళ వయస్సులోనె నిర్ణయించబడిన బాలికా వధువు యశోదను పద్దెనిమదేళ్ళ వయసులో పెళ్ళి చేసుకున్నాడు.కానీ అప్పటికే ఆరెస్సెస్ భావజాలం పట్ల ఆకర్షితు డవటం వల్ల ఆమేకు తన ఉద్దేశాన్ని చెప్పి ఆవిడ కూడా ఒప్పుకోవటంతో దూరంగానే ఉండిపోయారు - చట్టబధ్ధంగా విడాకులు తీసుకోకపోయినా.మోడీలో తప్పులు పట్టాలనుకౌనే తెలివి తక్కువ విమర్శకులు విమర్శించకూడని ఈ విషయాన్ని కూడా వాడుకోవాలనే తొందరపాటు కూడా మోడీకి అనుకూలంగానే మారింది.

          గోధ్రా సంఘటన గురించి కూడా ఇతన్ని విమర్శించకూడని పాయింటు మీద విమర్శించటమే తర్వాతి యెన్నికల్లో కూడా ఇతనే తిరిగి గెలిచి విమర్శకుల పాయింట్లని ప్రజలు పట్టించుకోలేదనే ధైర్యాన్ని ఇతనికీ ఇతని సపోర్టర్లకీ ఇచ్చింది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నరోడ-పాటియా మారణ కాండను గురించి "a spontaneous reaction to the Godhra train carnage resulting from the natural and justified anger of people and the state government and ruling party had nothing to do with it." అనే స్టేట్మెంట్ ఇవ్వడానికి యెంత సాహసం కావాలి?అంత క్రూరమయిన కామెంటు చేశాక కూడా తర్వాతి యెన్నికల్లో మళ్ళీ ప్రజలు అతన్నే యెన్నుకోవడానికి కారణ మేమిటి?

          విషయ మేమిటంటే మతకలహాలలో యెప్పుడూ ముస్లిములే బాధితులుగా ఉండటం లేదు.ముస్లిములు చెలరేగి పోయినప్పుడు హిందువులు కూడా బాధితు లవుతున్నారు. కానీ మోడీకి ప్రతికక్షులుగా నిలబడిన కుహనా సెక్యులర్ పండితులు ముస్లిముల మీద దాడులు జరిగినప్పుడు చూపించే నిరసనలో ఉండే తీవ్రత్వం ముస్లిముల వైపు నుంచి హిందువుల మీద జరిగినప్పుడు కేవలం నత్తి మాటల స్థాయికి దిగజారి పోతున్నది.

          రెంటినీ నిశితంగా పరిశీలిస్తే ఉదారవాదులయిన హిందువులు కూడా ఈ యేకపక్షపు ప్రతిస్పందనని గుర్తించగలిగేటంత స్పష్టంగా ఉంది వాళ్ళలోని డొల్లతనం. మోడీ బలం అదే!లౌకికవాదులు ఈ డొల్లతనాన్ని వదిలించుకుని ఇరుపక్షాల పట్లా నిష్పక్షపాతంగా వ్యవహరించటం వల్లనే మోడీ యెదుగుదలని అడ్డుకోవటం సాధ్య పడుతుంది.

          ప్రజల ఆదరాభిమానాల్ని అందుకుని యెక్కాల్సిన స్థానాలకి బ్రాండ్ అడ్వర్టైజింగ్, ఈవెంట్ మ్యానేజిమెంట్ లాంటి చీప్ ట్రిక్స్ తో యెక్కుతున్నాడు.ఒకనాటి రధయాత్రికుడికి ఇది తెలుసు.మోడీ గురించి అన్యాపదేశంగా అతడు చేస్తున్న కామెంట్లలో చాలా అర్ధం ఉంది -  అర్ధం చేసుకోగలిగిన వాళ్ళకి. హస్తినాపురం లోనే ఉండాల్సి రావటం వల్ల బహిరంగంగా చెప్పలేకపోయినా లాక్షా గృహ దహనం గురించి ధర్మజుడికి నర్మగర్భంగా సూచనలు మాత్రమే ఇవ్వగలిగిన విదురుడి స్థానంలో ఉన్నాడు అతను.మోడీ లో ఉన్న తప్పు యేమిటో, మోడీ ని యెలా గెలవాలో హింట్స్ ఇస్తున్నాడు అతను.సీనియరిటీ ప్రకారం తనకి రావల్సిన పదవి మోడీకి దక్కిందనే దురదతో అలా మాట్లాడుతున్నా డనుకునే ఈ కోడి మెదడు కుహనా సెక్యులరిష్టులకే అది అర్ధం కావడం లేదు.
-----------------------------------------------------------------------------------------------------------------
(photos  courtesy: Google Images)

Monday, 31 March 2014

కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (బాల గంగాధర తిలక్)

               ఈ మద్యనే వెండితెర మీద నుంచి జనం మీదకి హఠాతుగా దూకిన ఒక యువ నేత తన పార్టీని కూడా విలీనం చెయ్యమన్న వ్యంగ్యానికి కినిసి "అదేమయినా గంగా అన్నిట్నీ కలపడానికి?" అని ఈసడించాడు.గంగ లాగా కాకపోయినా ఈ దేశపు రాజకీయాల్ని సుదీర్ఘకాలం పాటు తన చుట్టూ తిప్పుకుని ప్రస్తుతం అవసాన దశలో ఉన్నట్టు కనిపిస్తున్న ఆ పార్టీ చరిత్ర చాలా చిత్రమైనది.అది పుట్టినప్పటి నుంచీ నేటివరకూ ఈ దేశంలోని ప్రతి రాజకీయ వేత్తా తన రాజకీయ జీవితంలో యేదో ఒక దశలో కాంగ్రెసు స్పర్శ(Congress Touch) తగిలిన వాడే!


               1885 డిసెంబర్ 28 న ఒక విదేశీయుడి చేత తమ ప్రభుత్వానికి దేశం లోని తమకు స్నేహశీలురయిన మేధావుల నండి తమకు కావలసిన సహకారమును, తమ ప్రభుత్వానికి సాధికారికతను తెచ్చుకొనుటకు |Allan Octavian Hume| అను బ్రిటిష్ అధికారి నేతృత్వమున |Indian national Congress| అను ఒక సంస్థ స్థాపించబడినది.ఇది ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామము తరవాత అధికారం |బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ| నుండి |బ్రిటిష్ సామ్రాజ్యం| కు దఖలు పర్చటం అను ప్రక్రియకు సహాయ పడటం కోసం చెయ్యబడిన యేర్పాటు. అప్పటి నుండి భారత దేశం  ఉత్తర దేశంలో "రాజ్" అనే ముద్దు పేరు తోనూ తెలుగు వాళ్ళు "కుంఫిణీ దొరల పాలన" అని డాబుసరి పేరుతోనూ పిల్చుకునే అధికారికమైన పరాధీన స్థితిలోకి వెళ్ళిపోయింది.


               తొలి దశలో కాంగ్రెసు పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వ సహాయ సహకారాల తోనే మనుగడ సాగించింది.దాని ప్రతిపాదన లోనే ప్రజలలో తమ పట్ల గల వ్యతిరేకత భౌతిక ప్రతిఘటన స్థాయికి వెళ్ళకుండా |సేఫ్టీ వాల్వ్|గా ఉపయోగ పడటం అనే ఉద్దేశం ఉంది.యేమైతేనేం, ప్రతిపాదన చేసిన తొలి రోజుల నుంచీ అక్కడా ఇక్కడా యెన్నో విమర్శలూ సందేహాలూ యెదురయినా అన్నింటినీ దాటుకుని 1885 డిసెంబర్ 28న బొంబాయి నగరంలో గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఉమేష్ చంద్ర బెనర్జీ అద్యక్షతన 72 మంది ప్రతినిధులతో భారత జాతీయ కాంగ్రెసుని అతను ప్రారంభించాడు. అప్పటి పరిస్థితిలో ఒక భారతీయుడు పార్టీ స్థాపించే ప్రతిపాదన చెయ్యడం, స్థాపించడం అనేది వూహించలేని కాల మది.కాబట్టి యేటికి యెదురీదలేని పరిస్థితిలో అప్పటి మేధావులు అలా సర్దుకుపోవటం సమంజసమే.

                అప్పట్లోనే సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి ముస్లిం విద్యావేత్తలు కాంగ్రెసులో అందరూ హిదువులే ఉండటాన్ని చూసి కొంత అనుమాన దృష్టి తోనే చూశారు. హిందువుల్లో కూడా మతాధిపతులూ ఛాందసులూ కాంగ్రెసు విదేశీ సంస్కృతిని సమర్ధించే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి దూరంగానే ఉండిపోయారు. అసలు సామాన్యులకి కాంగ్రెసు అనే ఒక సంస్థ ఉందనేది కూడా అది పుట్టిన చాలా కాలం వరకూ తెలియదు.అప్పటి కాంగ్రెసు కూడా సామాన్యుల సమస్యలయిన పేదరిక నిర్మూలన, ప్రజారోగ్య సమ్రక్షణ మరియు సామాజిక సంస్కరణలు లాంటి వాటికి దూరంగానే ఉంది.ఒక విహంగ దృష్టితో చూస్తే అప్పటి కాంగ్రెసు ధనవంతులయిన ఆంగ్ల ప్రభుత్వ మిత్రులయిన |యెలైటిస్ట్| మేధావుల గుంపు, అంతే.

               తొలి దశలోని ఈ స్తబ్దత తిలక్ ప్రవేశంతో ఒక కుదుపుకు గురయింది.పూర్తి స్వాతంత్ర్యం అప్పటి వారి భావనలో లేదు. వాదనలు కూడా కాంగ్రెసు ప్రతినిధులకి చట్టాల రూపకల్పనలో మరింత యెక్కువ అవకాశం ఉండాలనే పరిమిత స్థాయిలోనే జరిగేవి. "స్వరాజ్యం నా జన్మహక్కు" అని నినదించిన మొదటి వ్యక్తి తిలక్. కేవలం నినాదంలా కాకుండా దాని పూర్తి అర్ధంతోనే ప్రతిపాదించాడు.|హోం రూల్| గురించి మాట్లాడిన యువ |మహమ్మదాలీ జిన్నా| కూడా ఇదే దశలో రంగ ప్రవేశం చేశాడు.

               కానీ తిలక్ గారి హవా యెక్కువ కాలం కొనసాగలేదు. మితవాదులయిన గోపాల కృష్న గోఖలే, ఫిరోజ్ షా మెహ్తా వంటి వారు ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చడాన్ని నిరసించి 1906లో పార్టీ నుంచి తిలక్ ని బహిష్కరించారు. సరిగ్గా అదే కాలంలో తిలక్ ఉద్యమాల్లో హిందువులకి మాత్రమే పరిచయమయిన పదజాలాన్ని ప్రవేశ పెట్టటం వల్ల ముస్లిములు సంఘటిత మయ్యారు.తిలక్ అనుకుని చేసింది కాకపోయినా దాని ఫలితంగా 1906లోనే |ఇంగ్లీషు వాళ్ళు స్పాన్సర్ చెయ్యగా| ముస్లిం లీగ్ స్థాపించబడింది.

               సందట్లో సడేమియా అన్నట్టు మొదటి ప్రపంచ యుధ్ధం వొచ్చి పడింది.దీంతో విభేదాలని పక్కన పెట్టి తిలక్, గొఖలే మొదలయిన వాళ్ళంతా మళ్ళీ కలిసి పోయి 1916లో లక్నో వేదిక ను చేసుకుని కొత్త ప్రతిపాదన చేశారు. అదే జిన్నా మరియూ అనీ బీసెంట్లు ప్రతిపాదించిన స్వరాజ్ కు మారు రూపమయిన హోం రూల్. తన రాజకీయ జీవితపు తొలి దశలో అంతటి స్వదేశాభిమానంతో మొదలయిన జిన్నా చివరి కొచ్చేసరికి దేశ విభజనకి కారణ మయ్యాడు?!

               తిలక్ ని వ్యతిరేకించిన మితవాదులు ముస్లిం లీగ్ ప్రమాదాన్ని గుర్తించటం వల్లనో లేక అతివాదుల వల్ల పార్టీ మీద పడిన మచ్చను తొలగించుకోవడానికో ముస్లిముల వైపు అతిగా వంగడంతో అది నచ్చని వాళ్ళు బయటికి వెళ్ళి పోయి 1914లో హిందూ మహా సభను యేర్పాటు చేశారు. 1910లో వీరందరూ అలహాబాదులో కలిసి పెరుగుతున్న ముస్లిం లీగ్ ప్రాబల్యం నుంచి తమను తాము కాపాడుకోవటం కోసం ఒక సంస్థ ఉండాలని సూత్రీకరించి 1914లో అమృతసర్ హరిద్వార్ లు కేంద్రాలుగా హిందూ మహా సభ రూపం ధరించిది.బనారస్ హిందూ విశ్వ విద్యాలయ స్థాపకుడయిన మదన్ మోహన్ మాలవ్యా, లాలా లజపతి రాయ్ దీనిలో ప్రముఖ పాత్ర వహించారు.


               ఇప్పటికీ దేశ రాజకీయాల్లో తమ ప్రభావాన్ని  చూపిస్తున్న ఆ రెండు ప్రతీప శక్తులూ కాంగ్రెసు వల్లనే ప్రభవించడం కాకతాళీయమా చారిత్రక అనివార్యతా అనేది దేవుడున్నాడా లేడా అనే దానికన్నా సంక్లిష్టమయిన ప్రశ్న?!కాంగ్రెసు రాజకీయ చరిత్ర తొలి దశలోని గందరగోళం ఒక కొలిక్కి వచ్చేసరికి -  యువతీ యువకుల మద్జ్యన జత కోసం యేర్పడే పోటీల్లో సాధారణంగా కనిపించే ప్రణయ త్రికోణం లాంటి ఒక రాజకీయ ప్రళయ త్రికోణం ఈ దేశపు రాజకీయ రంగస్థలం మీద ఆవిర్భవించేసింది.



               ఇదంతా నేను ఇక్కడ చెప్పినంత సరళంగా జరిగి పోలేదు.ఆంగ్ల ప్రభుత్వానికి సాయం చేసే సద్బుధ్ధి గల సాధు సజ్జనుల సంస్థలోకి దాన్ని కూల్చడానికి కంకణం గట్టుకున్న విద్రోహులు ప్రవేశించడం వల్ల యేర్పడిన ఆ గందరగోళాన్ని ఇప్పటి వాళ్ళకు అర్ధమయ్యేలా వివరించడం నా వల్ల కాకనే ఇంత క్లుప్తంగా ముగించేస్తున్నాను. కానీ ఒక వైపు ప్రభుభక్తీ మరోవైపు స్వేచ్చావాదం, ఒక వైపు తమలోని హిందూత్వపు ఆధిక్యతా భావాన్ని వొదులుకోలేకపోవడం అనే బలహీనత, మరోవైపు ముస్లిములని ఆకర్షించాల్సీన అవసరం అనే పరస్పర విరుధ్ధమయిన అంశాల్ని ఒకే సంస్థలో ఇమడ్చడానికి ప్రయత్నించారు.చచ్చీ చెడీ శాయంగల విన్నపములై అన్నట్లుగా పడుగు పేకలా యెవరూ నొచ్చుకోని విధంగా అందర్నీ కలిపేశారు. ఇప్పటికీ కాంగ్రెసు పార్టీలో వివిధ వర్గాలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరి మీద మరొకరు అధిపత్యం కోసం వ్యూహాలు పన్నుతూ కూడా కలిసే ఉండటం యెలా సాధ్యపడుతున్నదో మీకిప్పుడు అర్ధమయి ఉండాలి!

______________________________________________________
1    2    3    4    5    6

Monday, 17 March 2014

తెలంగాణా మేధావుల్లోని మేధావిత్వపు శాతం యెంత?

         అజ్ఞానం  - దరిద్రం  కవల పిల్లలు.  అవి ఒకదాన్నిఒకటి అంటిపెట్టుకుని ఉంటాయి. ఒకటి  కొంటే ఒకటి ఉచితం  అనేటంతగా పెనవేసుకుని ఉంటాయి. డబ్బు ఎలా సంపాదించాలనేది తెలియని అజ్ఞానం వల్ల  దరిద్రం పట్టుకుంటుంది . దరిద్రం వల్ల మనస్సు సరిగ్గా పని చెయ్యక అజ్ఞానం పట్టుకుంటుంది. ప్రెషర్ కుక్కర్ అనే వస్తువు ఒకటి ఉoది. అది ఆడవాళ్ళు మాకది కావాలని అడిగితే తయారు చేసింది కాదు. అది ప్రజలు ఇవ్వాళ పడుతున్న బాధని తొలగించటానికి దాన్ని తయారు చేసిన వాడికి వచ్చిన ఆలోచన నుంచి తయారయింది.    ఆ ఆలోచన మంచి చేసేది గనక దానికి కొత్తగా మార్కెట్టుని అదే పుట్టించుకొవల్సి వచ్చింది.  మొదట ఆ ఆలోచన ఎవడికి వచ్చిందో వాడు కొంతకాలం మార్కెట్టుని యేలేస్తాడు. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఆ మార్కెట్ లోకి ప్రవేశిస్తారు. ఇలా ప్రవేశిoచాలంటే అంతకు ముందున్న వాళ్ళు ఇచ్చే సౌకర్యాల  కన్నా తను ఎక్కువగా ఇస్తేనే మార్కెట్లో తను సరయిన స్థానాన్ని పొంద గల్గుతాడు.


        ఉద్యోగాల కయితే డిగ్రీలు కావాలి. పరీక్షలు రాయాలి. నానా రకాల తంటాలూ పడాలి. కానీ వ్యాపారం చెయ్యాలన్నా పరిశ్రమ పెట్టాలన్నా ఇవేమీ అక్ఖర్లేదు. కానీ ఏది తను బాగా అమ్మగలడో తన గురించి తనకు బాగా తెలియాలి. కొత్త వస్తువును తయారు చేసి దానికి కొత్తగా మార్కెట్ ని పుట్టించుకొవడమా, అప్పటికే ఉన్న వస్తువుని మరింత బాగా మెరుగు పరచి అమ్మడమా - ఏది తనకు చేతనయితే అది చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. మొదటి విడత లాభాలు వచ్చేవరకు అవసరమయ్యే  సంస్థాగతమయిన పెట్టుబడి ని తనే సమకోర్చుకోవాలి. ఒకసారి లాభాలు రావడం మొదలయితే తరవాత వ్యాపారాన్ని విస్తరించడానికి మోలధనాన్ని కదిలించకుండా లాభాల నుంచే పెట్టుబడినీ పొందాలి. ఇవన్నీ చెయ్యగలిగిన వాడే వ్యాపార పారిశ్రామిక రంగాల్లో వృద్దిలొకి వస్తాడు.  ఇది చెయ్యలేని మీ లాంటి నా లాంటి వాళ్ళు యేదో ఒక  ఉద్యోగం చూసుకుని బతికెయ్యాలి. అయితే ఈ రెంటికి కొన్ని ముఖ్యమయిన తేడా లున్నాయి. ఉద్యోగం లో భద్రత ఉంటుంది,  ్వ్యాపారంలోఉండదు. కానీ ఒక ఉన్నతోద్యోగి కూడా తన ముప్పయ్యేళ్ళ సర్వీసులో పొంద లేని ఆదాయం ఒక మధ్యస్థ అంతరువు లోని వ్యాపారి కేవలం అయిదు పది సంవత్సరాల లోనే పొంద గలడు.  వ్యక్తులకు ఉద్యోగాలు భద్రతా నిచ్చినా ప్రాంతాల వారీగా చూస్తే వ్యాపార పారిశ్రామిక రంగాల వల్లే లాభం ఉంటుంది. 



       హైదరాబాదు రాష్ట్ర ఆదాయంలో అధికశాతం ఆక్రమించ గల్గడానికి కారణ మిదే.  యాభయ్ అరవయ్ యేళ్ళపాటు ఇది మన రాష్ట్రం అని మన రాజధాని అని ఆత్మీయత ఫీల్ అయ్యి వ్యాపారాలలో ెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించి కేవలం ఒక్క నగరం నుంచే రాష్ట్ర ఆదాయం మొత్తంలో 47% ఉండేలాగ చేస్తే దానికి ఫలితం అక్కడి నుంచి వెళ్ళగొట్టబడటమా? హైదరాబాదు ఆదాయాన్ని ఖర్చుపెట్టటం గురించి ఉన్న సాంకేతికమయిన మెలికతో మొత్తం మాకే చెందుతుందంటున్నారు. ఇది న్యాయమేనా?పెట్టుబడులకు దగ్గ శాతాన్ని అడిగితే యెవరూ తప్పు పట్టరు, కానీ "రిప్ వాన్ వింకిల్" లాగా అరవయ్ యేళ్ళ పాటు పెట్టుబడులు పెట్టటంలో యే మాత్రమూ చొరవ చూపకుండా రాజ్యాంగం అనుమతించిన పధ్ధతుల్లో వ్యాపారం చేసిన వాళ్ళని దోపిడి దార్లుగా, అందుకు అవసరమయిన భూముల్ని కొనుగోలు చెయ్యటం భూ ఆక్రమణలు గా జమ చెయ్యటం యెంతవరకూ సబబు?


        అవి కబ్జా లయితే అతను తెలంగాణా వాడయిన ఆంధ్రా వాడయినా నేరాన్ని యెవరూ సమర్ధించరు.అలా కాక కొనటమే జరిగితే మీరు సాంకేతికంగా తెలంగాణాలో ఇతరులు భూమిని కొనగూడదనే నిషేధాన్ని సాకుగా అతన్ని దోషిని చెయ్యాలనుకుంటే మరి అమ్మిన తెలంగాణా వ్యక్తి సంగతేమిటి?తెలంగాణాలో భూముల, ఆస్తుల కొనుగోలు అమ్మకాల్ని పర్యవేక్షించే ఒక ప్రాంతీయ కమిటీ ఉంది.ఆ కమిటీ అనుమతి లేకుండా కొన్నారా?ఆ కమిటీ అనుమతి లేకుండా కొంటే యే వివాదమూ అక్కర్లేకుండానే అనుమతి లేని అమ్మకం చెల్లదు కదా? వారు అనుమతి ఇచ్చిన దాన్ని తప్పు పడితే మీ తెలంగాణా ప్రాంత నాయకులే అవినీతికి తెగబడ్డట్టు కాదా?అవినీతిలో అందరికీ భాగం ఉన్నప్పుడు ఒక ప్రాంతం వారు పులు గడిగిన ముత్యాలై మరొక ప్రాంతం వారు దోపిడీ దారు లెలా అవుతారు?

      దేశంలో యే ప్రాంతం వాడయినా యెక్కడయినా స్థిరనివాసం యేర్పరచుకోవచ్చు కదా(కష్మిర్ని మినహాయిస్తే), మరలాంటప్పుడు గుజరాతీ వార్నీ, ఇంకా  వార్నీ వీర్నీ అని లెక్కలు చెప్పి ఆదరిస్తున్నామనే వాళ్ళు,ఆంధ్రా ప్రాంతం నుంచి వొచ్చిన వాళ్ళకి మాత్రం ఆంగ్లేయులకి వాడినట్టుగా వలస వాదులు అని అనడం యెందువల్ల జరుగుతున్నది?

     కలిసుండడం వల్ల తెలంగాణా భాషకి అన్యాయం జరిగిందనీ కృష్ణా జిల్లా మాండలికాన్ని అధికార భాషగా చేస్తే భరించాల్సి వొచ్చిందనీ చెబుతున్నారు. అది నిజమేనా? నిజంగా కృష్ణా జిల్లా మాండలికం ఇలాగే ఉంటుందా? కృష్ణా జిల్లా మాండలికాన్నే గనక కుట్ర పూరితంగా పైకి తీసుకొస్తే ఒక్క తెలంగాణా వాదులేనా గుంటూరు జిల్లా వాళ్ళు, ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళూ రాయల సీమ వాళ్ళూ గొడవ చెయ్యరా? యే ఇద్దరు రెండు వేర్వేరు జిల్లాల నుంచి వొచ్చ్చిన వాళ్ళు యెవడి భాషలో వాడు మాట్టాడుకుంటూ పోతే వ్యవహారం నడుస్తుందా? అందువల్ల అప్పటి వాళ్ళు మాండలిక వ్యవహారిక తెలుగు ని కాకుండా అందరూ అర్ధం చేసుకొగలిగే విధంగా భాషని సామాన్యీకరించారు? ఇప్పుడు బ్లాగుల్లో మనందరం వాడుతున్నదీ అదే, యే ప్రాంతీయ పదాలూ లేని అందరికీ అర్ధమయ్యే సామాన్య తెలుగు. ఇది కూడా తప్పేనా?

      ఆయా మాండలికాలకి ఆదరణని కల్పించడం అనేది ఆ భాషలో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు తమ రచనల్లో ఉపయోగించి మిగిలిన వారికీ పరిచయం చేస్తే మిగిలిన వారు అందులోని స్వారస్యాన్ని గ్రహించి మెచ్చుకుంటారు. తిక్కన గారు తన పదిహేను పర్వాల తెలుగు భారతంలో నెల్లూరు జిల్లా మాండలికపు సొంపుని వాడినట్టుగా శ్రీ శ్రీ గారు చెప్పగా విన్నాను. ఆ రకంగా నెల్లూరు జిల్లా మాండలికం తన పలుకుబడులతో సహా భారతేతిహాసంలో ఒక భాగం కాగలిగింది. దీన్ని యెవరయినా వ్యతిరేకించగలరా? మరో విధంగా యే ఒక్క భాష నయినా అధికారికంగా ప్రోత్సహిస్తే మిగిలిన వారు ఊరుకుంటారా?

       ఇక్కడ పదాల వాడకం గురించి తెలంగణా వాదులతో నాకెదురయిన ఒక చిత్రమయిన సన్నివేశాన్ని వివరిస్తాను. వాళ్ళు మాటిమాటికీ ఆంధ్రోళ్ళు అని వాడుతుండడం గురించి నేను అభ్యంతరం చెప్పాను యువవాణి బ్లాగులో. దానికి వారి ప్రతిస్పందన యేమిటో తెలుసా? "ఆంధ్రోళ్ళు అంటే తప్పు మాటా, నాకు తెలియదే?" అని అమాయకంగా అడగటం, పైగా మీ తెలుగుకో నమస్కారం" అని నన్ను వెటకారం చెయ్యటం. వారు ఒకసారి నా మొదటి టపాని చూసి ఆ తర్వాత నా తెలుగు భాషని గురించి యేదయినా మాట్లాడితే బాగుంటుందని అడుగుతున్నాను. అసలు సమస్య అది కాదు. తెలంగాణా వాదులు బుల్లెబ్బాయి అంటే మాకు తప్పు అన్నారు, అది వాళ్ళ దగ్గిర వాడకూడదు అంటే మనం ఒప్పుకోవాలి. కానీ మనకి ఆంధ్రోళ్ళు అనే మాట గురించి పట్టింపు ఉన్నా వాళ్ళు పట్టించుకోరు. వారి ఉద్దేశ్యం - వాళ్ళకి ఇష్టం లేని మాటలు మనం వాడకూదదు, వాళ్ళు వాడే మాటలకి మనం అభ్యంతరం చెప్పకూడదు.ఇదీ వారు భాషాపరంగా కోరుకునే సమానత కాబోలు!
________________________________________________________ 

Saturday, 15 March 2014

పవనిజం ఇవ్వాళ్టి అవసరం?!

                    పవన్ చాలా బాగా మాట్లాడాడు.మొత్తం అన్ని వీడియోలూ విన్నా.విన్నానని యెందుకంటున్నానంటే చూసింది వీడియోనే అయినా రాసుకొచ్చింది చదవడమే కదా చూడ్డానికే ముంటుంది?మంచి ఆవేశం ఉంది. భాషలో చాలా పవర్ ఉంది. పవర్ స్టార్ కదా! ఇవ్వాళ జనం తెలుసుకోవలసిన విషయాల్లో చాలా వాటిని ప్రస్తావించాడు. అప్పటి అన్నగారిలాగా నసగటం గొణగటం యేమీ లేకుండా తను చెప్పదల్చుకున్న దాన్ని బల్ల గుద్ది చెప్పాడు.

                    ముఖ్యంగా తను హఠాత్తుగా వొచ్చి అందర్నీ వెనక్కి తోసేసి ముందుకెళ్ళిపోయి ముఖ్యమంత్రి అయిపోవాలనే దురాశతో మాత్రం లేడు. తలలో తింగరి అలోచన ల్లేవు,కాళ్ళు భూమి మీదనే ఉన్నాయి.అంతవరకూ అతన్ని తెలివయిన వాడిగానే లెక్కెయ్యొచ్చు.మనం కూడా అతన్నుంచి యెక్కువ ఆశించనక్కర్లెదు.

                    ఇవ్వాళ ఇటువైపున జగన్ అటువైపున కచరా చాలా ప్రమాదకరమయిన వ్యక్తులు. కచరా ని కంచె అయిలయ్య లాంటి మేధావులూ గద్దర్ లాంటి ప్రజా కళాకారులూ సమర్ధించటం లేదు. అతనిలో తెలంగాణా దొరతనపు అహంభావం ఉంది.అసలు తెలంగాణా వాడు కాదు, విజయనగరం వాడని తెదెపా వాళ్ళంటున్నారు.అది యెలా ఉన్నా అతని వ్యక్తిత్వంలో అహంభావం ఉంది.ఆ మూర్ఖత్వమే ద్వేషభాషకు కారణం. అతన్ని తెలంగాణాలో యెదుర్కోగలిగిన సత్తా ఉందనిపించింది. అతని ధోరణి కూడా కచరాతో ఢీ కొట్టడానికి నిశ్చయించుకున్నాడని తెలిసిపోయే విధంగానే ఉంది.

                    కాబట్టి ఇటు వైపున జగన్ని అటువైపున కచరాని తగ్గించి తెదెపా భాజపా లోక్సత్తా త్రయానికి కొంచెం వూపిరి పీల్చుకునే సహాయం మాత్రమే చెయ్యగలడు. అంతకు మించి భూనభోంతరాళాలు బద్దలు కొట్టగలడని నేను నమ్మటం లేదు. అది అతనికీ తెలుసు.

                    అతని మానిఫెస్టో యేమిటనేదాని గురించి నేను పట్టించుకోవటం లేదు.మానిఫెస్టోలూ అవీ అక్కర్లేదు కూడా. ఇప్పుడు మనం విద్యాధికులమే అయినప్పటికీ యే పార్టీ మానిఫెస్టో నయినా పూర్తిగా చదివి వోట్లు వేస్తున్నామా?రెండు వైపులా కొంచెం సొంత మెదడుతో ఆలోచించగలిగిన ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే.విలీనం మీది ఆశతో ఈ రాష్ట్రాన్ని విడగొట్టగూడని విధంగా - రెండు ప్రాంతాల్లో యెవరికీ ప్రయోజనం లేని భీబత్స కాండగా మార్చి -  విడగొట్టిన కాంగ్రెసు నామ రూపాల్లెకుండా పోవాలి.

                    ఇప్పుడు కాంగ్రెసు పార్టీ లోని ప్రతీ వాడు తెదెపా లోకి జంప్ అవుతున్నాడు. యెదిరి పక్షం నుంచి వచ్చే వాళ్ళని వొద్దనకుండా చేర్చుకోవటం వ్యూహాత్మకంగా మంచిదే గానీ అప్పుడు తెరాసాకి నలబై సీట్లిచ్చి దెబ్బ తిన్నట్టుగా ఇప్పుడు వీళ్ళందరికీ సీట్లిస్తే బాబు మళ్ళీ మట్టానికి మునిగి పోతాడు.

                    తెదెపాకి బలం క్యాడరే. నిన్నటి దాకా తిట్టిన వాళ్ళకి ఇవ్వాళ జండాలు మొయ్యాలంటే వాళ్ళు మనస్పూర్తిగా చెయ్యరు.ఆ పొరపాటు చెయ్యకుండా, అవసరమయిన చోట పవన్ సాయం తీసుకుంటూ మంచి వ్యూహంతో వెళ్తే రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రాగలడు.మిత్రపక్షాలుగా భాజపా లోక్ సత్తా యెటూ ఉండనే ఉన్నాయి.

                    ప్రస్తుతానికి పవన్ తనగురించి యేవేవో వూహించేసుకుని అతిగా పోకుండా ఈ మూడు పార్టీలకీ సహాయం చెయ్యడం ద్వారానే అతని ప్రవేశానికి సార్ధకత యేర్పడుతుంది.మరో విధంగా ప్రవర్తిస్తే శృంగభంగం తప్ప వొరిగేదేం ఉండదు.

ఏడుపు గురించి కూడా యాడవాల్సింది చాలా ఉందండోయ్!

పాపం చెట్లకి ఏడుపు రాదు . వాటికి ఏడుపు రాకపోవటమే మంచిదైంది . చెట్లకి కాక మిగిలిన అన్ని జంతువుల ఏడుపులకే ఇంత విసుగొస్తుంటే వాటి...