Tuesday 10 May 2016

ఓ రామ - నీ నామ మెంతో రుచి,ఎంతో రుచి రా!

                          సీ||మోటు నిషాదుడు మౌనివరుడు పోవు
                              మార్గాన క్రూరత్వ మావహించి

                              జోడుకూడిన జంట క్రౌంచములందు పో
                              తును కూల్చగా యాడుదాని బాధ

                              మనసును కదిలించి మరిమరి వేధించి
                              శాపమై.నిందయై - కావ్యధార

                              గంగయై పొంగి - లోకాన మరల నిట్టి
                              ఘాతుకమును చేయ కుండునట్టి

                         తే||సాధు సజ్జనులను పెంచు దీక్ష తోడ
                             గిరులు ఝరులు ఉండువరకు నిలిచిపోవు
                             రామకధను తీరిచి దిద్దినాడు మౌని,
                             సాహితీమూర్తు లందు శాశ్వతుడు గాగ!
(17.07.2015)
------------------------------------------------------------------------------------------------------------------------------
          రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు. 

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం
నారదం పరిపప్రచ్చ వాల్మీకి ర్ముని పుంగవం

స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునందనః
ఋషిభిః పూజిత స్సమ్యగ్ యథేంద్రో విజయీ పురా

విశ్వామిత్ర స్స ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం
వత్స రామ ధనుః పశ్య ఇతి రాఘవ మబ్రవీత్

తుష్టావాస్య తదా వంశం ప్రవిశ్యస నిశాంపతేః
శయనీయం నరేంద్రస్య త దాసాద్య వ్యతిష్ఠత

వనవాసం హి సంఖ్యాయవాసాంస్యా భరణాని చ
భర్తార మనుగఛ్చంత్యై సీతాయై శ్వశురో దదౌ

రాజా సత్యం చ ధర్మశ్చ రాజా కూలవతాం కులం
రాజా మాతా పితా చైవ రాజ అహితకరో నృణాం

నిరీక్ష్య స ముహూర్తం తు దదర్శ భరతో గురుం
ఉటజే రామ మాసీనం జటావల్కల ధారిణం

యది బుద్ధిః కృతా ద్రష్టు మగస్త్యం తం మహామునిం
అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః

భరత స్యార్యపుత్రస్య శ్వశ్రూణాం మమచ ప్రబో
మృగరూప మిదం వ్యక్తం విస్మయం జనయిష్యతి

గఛ్ఛ శీఘ్రమితో రామ సుగ్రీవం తం మహాబలం
వయస్యం తం కురు క్షిప్రమితో గత్వాద్య రాఘవ

దేశకాలౌ ప్రతీక్షస్వ క్షమమాణః ప్రియాప్రియే
సుఖదుఃఖ సహః కాలే సుగ్రీవ వశగో భవ

వంద్యాస్తే తు తపస్సిద్ధాః తపసా వీతకల్మషాః
స్రష్టవ్యాశ్చాపి సీతాయాః ప్రవృత్తిం వినయాన్వితై

స నిర్జిత్య పురీం శ్రేష్ఠాం లంకాం తాం కామరూపిణీం
నిక్రమేణ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః

ధన్యా దేవా స్స గంధర్వా స్సిద్ధాశ్చ పరమర్షయః
మమ పశ్యంత యే నాధం రామం రాజీవలోచనం

మంగళాభిముఖీ తస్య సా సదాసీ న్మహాకపీః

ఉపతస్థే విశాఅక్షీ ప్రయతా హవ్యవాహనం

హితం మహార్థం మృదుపూర్వ సంహితం
వ్యతీత కాలాయతి సంప్రతి క్షమం

నిశమ్య తద్వాక్య ముపస్థిత జ్వరః
ప్రసంగ హనుత్తరమే తద బ్రవీత్

ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తోయం విభీషణః
లంకైశ్వర్యం ధృవం శ్రీమానయం ప్రాప్నోత్యకంటకం

యో వజ్రపాతాని సన్నిపాతానన చుక్షుభే వాపి చచాల రాజా
స రామబాణాభిహతో భృశార్తశ్చచాల చాపం చ చముమో చ వీరః

యస్య విక్రమ మాసాద్య రాక్షసా నిధనం గతాః
తం మన్యే రాఘవం వీరం నారాయణ మనామయం

న తే దదృశిరే రామం దహంత మరివాహినీం
మోహితాః పరమాస్త్రేణ గాంధర్వేణ మహాత్మనా

ప్రణమ్య దేవతాభ్యశ్చ బ్రాహ్మణేభ్యశ్చ మైథిలీ
బద్ధాంజలి పుటా చేద మువాచాగ్ని సమీపతః

చలనా త్పర్వతేంద్రస్య గణా దేవాశ్చ కంపితాః
చచాల పార్వతీ చాపి తదాశ్లిష్టా మహేశ్వరం

దారాః పుత్రాః పురం రాష్ట్రం భోగాఛ్ఛాదన భాజనం
సర్వమేవావిభక్తం నో భవిష్యతి హరీశ్వర

యామేవ రాత్రిం శతృఘ్నః పర్ణశాలాం సమావిశత్
తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా దారకద్వయం


ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీ బీజసంయుతం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే

          నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు రామాయణంలో ప్రక్షిప్తాలు ఉన్నాయనీ,వాటిని తొలగించితే గానీ వాల్మీకి రామాయణం శుద్ధంగా ఉండదనీ పండితులు చాలా చర్చలు చెయ్యడం జరిగిందని విన్నాను.అప్పట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు.తర్వాత నిజం అయినా అయ్యుండొచ్చు అనిపించింది.కొన్ని తరాల పాటు చెప్పుకుంటూ వస్తున్న కధలో ఎక్కడో అక్కడ ఎవరో ఒకరికి తన పాండిత్యం కూడా అందులో ప్రదర్శించుదామనే దౌర్బల్యం ఉన్నవాళ్ళు కలిపితే కలిపి ఉండవచ్చు అనుకున్నాను.కానీ,ఈ గాయత్రీ రామాయణం గురించి తెలిశాక మాత్రం అలా జరిగి ఉందటానికి వీల్లేదు కదా అనిపిస్తున్నది.ప్రక్షిప్తాలతో సహా అందరూ కలిపి 24,000 శ్లోకాలకి అమర్చిన తర్వాత ఈ వరస రావడం తర్కానికి అందనిది - వాల్మీకి ముందుగానే అనుకుని చేస్తే తప్ప మామూలుగా అయితే ఇలా కుదరడం అసంభవం!రామాయణంలో వాడిన చందస్సు అనుష్టుప్ చందస్సు, పాత్రల పేర్లలో ఉన్న మార్మికత చూస్తే అపురూపం, యోగశక్తి జ్ఞానచక్రాల గుండా ప్రయాణం చేసేటప్పుడు సాధకుడికి కలిగే అనుభూతుల్ని కధాకధనంలో కనిపించే మలుపుల్లో వర్ణించి చెప్పటం:శివధనుర్భంగం జరిగినప్పుడు వర్ణించినది సాధకుడి మనస్సులో తొలిసారి దైవసంస్పర్శ జరిగినప్పటి అంతర్లోకపు భీబత్సాన్నే - వీటిల్లో దేనిని మనం కాకతాళీయంగా రాశాడని చెప్పగలం?ఇదీ అంతే,నిన్న గాక మొన్న చదివినవి ఇవ్వాళ్టికి మర్చిపోయేవాళ్ళు ఇంతకాలం గుర్తుంచుకునే విధంగా ఒక కధని చెప్పినవాడు మహామేధావి!అట్లాంటివాడి కవిత్వంలో తప్పులు వెదకటం,తన పైత్యం కొంత చేర్చటం కుదిరే పని కాదు!

          మంత్రాలలో గాయత్రీ మంత్రం శ్రేష్ఠమైనది అయితే ఆ గాయత్రిని ఇముడ్చుకున్న రామాయణం కూడా శ్రేష్ఠమైనదే అవుతుంది.సనాతన ధర్మంలో నిర్లక్ష్యం చెయ్యకూడని అవమానించకూడని అత్యంత మౌలికమైనవి మూడు - విశ్వామిత్ర గాయత్రి, ఈశావాస్యోపనిషత్తు ప్రధమ శ్లోకం, శ్రీ చక్ర యంత్రం!భరద్వాజ గాయత్రి,వశిష్ఠ గాయత్రి దాదాపు గాయత్రి,గణేశ గాయత్రీ మంత్రాలు అన్నీ ఒకే నిర్మాణం కలిగి ఉంటాయి.కానీ విశ్వామితుడు ప్రవచించిన సవితృ గాయత్రిలో భావం గొప్పది.వెలుగుని ఆహ్వానించటం!అంతటా నిండిపోవాలనుకోవటం!అందరికీ కోరుకోవటం - అందుకే గాధేయుడు విశ్వామిత్రు డయ్యాడు!!పశ్చిమ దేశాల వారు భౌతికమైన వాస్తవికతని గుర్తించి ప్రగతిశీలంగా ఉంటే మనవారు ఆధ్యాత్మికత పేరుతో సమాజాన్ని వెనక్కి నడిపిస్తున్నారని మేకాలే సృష్టించిన కొందరు రెటమతం చూపిస్తున్నారు గానీ వాస్తవికతని మన ప్రాచీనులు ఎప్పుడూ మరిచిపోలేదు.అలా మరిచిపోయి ఉంటే ఇలా మిగిలి ఉండేది కాదు.

          రామాయణం మొత్తం ఒక ఎత్తు సుందరకాండ ఒక ఎత్తు!మిగతా కాండల్లో ప్రత్యక్షంగా కనబడే రాముడు ఈ కాండలో పరోక్షంగా కనబడతాడు.మిగతా రామాయణ కధకి రాముడు నాయకుడైతే సుందరకాండలో జరిగే కధకి వాగ్విదాంవరుడైన కపిశ్రష్ఠుడు హనుమంతుడు అనుచర స్థానం నుంచి నాయకుడై యెదిగి తన విశ్వరూపం చూపిస్తాడు.ఇక్కడి విజృంభణ అంతా ఇంత గొప్పగా చూపించినవాడు రాముణ్ణి కలవగానే మళ్ళీ అనుచర శ్రేష్ఠుడిగా ఒదిగిపోతాడు!జగత్సుందరియైన సీతకీ పుంసాం మోహనరూపుడైన రాముడికీ ఆనందం కలిగించటం కొసం కపిసుందరుదైన హనుమంతుడు ఒక దుష్కర కార్యాన్ని నెత్తిమీద వేసుకుని అపజయం అంచుల వరకూ వెళ్ళి నిరాశపడి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి మళ్ళీ కూడదీసుకుని తనకి తనే జీవితాశని రగిలించుకుని రెట్టించిన పట్టుదలతో అదృష్టం కూడా తోడై కార్యసాఫల్యత వైపుకి ప్రయాణించిన దృశ్యాలని వాల్మీకి భూతద్దంలో పెట్టి చూపించి వర్ణించాడు.మాటిమాటికీ చావుని గురించి కొటేషన్లు రాసుకుని పులకించిపోతూ నాకు ఉరితాళ్ళు కావాలి,నన్ను చంపండి,నన్ను చంపండి అని అఘోరించేవాళ్ళు ఇలాంటివి చదవనే చదవరు గానీ సుందరకాండలో తొమ్మిది అతి ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి.ఛందస్సు రీత్యా వాటిని శ్లోకాలు అని వూరుకోవచ్చును గానీ వాటిలోని భావం కూడా గొప్పదే గనక మంత్రాలే అవుతాయి.శ్రీ రామాయణ మహామాలా నవరత్న మంత్రావళి అని పిలిచే తొమ్మిది శ్లోకాల్నీ అర్ధం తెలుసుకుని ప్రతి రోజూ జపిస్తూ ఉంటే ఒక సంవత్సరం తర్వాత అంతకు ముందరి జీవితానికీ అప్పటి జీవితానికీ తేడా మీకే తెలుస్తుంది.

శ్లోకం:-తతో రావణ నీతాయా సీతాయాః శత్రుకర్షణః
       ఇయేవ పదమన్వేష్టుం చారణా చరితే పధిః
భావం:-రావణునిచే అపహరించబడిన సీతను వెదకటానికి శత్రుకర్షణుడైన హనుమంతుడు చారణులు సంచరించే ఆకాశమార్గాన్ని యెన్నుకున్నాడు.
సారం:-ఈ శ్లోకం గాయత్రీ మంత్రంలోని 12వ అక్షరంతో సంవదిస్తుంది.గాయత్రీ మంత్రంలో ప్రశంసించబడిన దైవం సూర్య భగవానుడు.సూర్యుడు ఆకాశానికి అధిపతి.సూర్యదేవుని అనుగ్రహ ప్రాప్తికి నిర్దేశించబడిన రత్నం మాణిక్యం.మాణిక్యం రామావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యధాతవ
       ధృతి ర్దృష్టి ర్మతి ర్ధాక్ష్యం స్వకర్మసు నసీదతి
భావం:-ఓ వానరేంద్రా!నీకు విజయం సాధించటానికి తోడ్పడే నాలుగు ప్రధాన లక్షణాలు - జ్ఞాపకశక్తి,మేధస్సు,పట్టుదల,నేర్పు ఉన్నాయి.అందుచేత నీవు తప్పక విజయం సాధిస్తావు.
సారం:-ఈ మంత్రంలో నిక్షిప్తమైన విజయ రహస్యం మనస్సుకు సంబంధించినది.మనస్సును ప్రభావితం చేసే గ్రహం చంద్రుడు.చంద్రునికి ప్రీతిపాత్రమైన రత్నం ముత్యం.ముత్యం కృష్ణావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖం
       అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తకః
భావం:-ఐశ్వర్యానికి మూలం ఉత్సాహం.అదే అపరిమితానందానికి హేతువు.నిజానికి అన్ని యత్నాలకూ చోదకశక్తి ఇదే.విజయరహస్యం కూడా ఇదే.
సారం:-ఈ మంత్రం హనుమంతునిలోని ఆశావాదాన్ని వివరిస్తుంది.ఋణం,ఒత్తిడి మొదలైన మానసిక వ్యధలకు అంగారక గ్రహమే కారణం.అంగారకుడు శుభకరుడైతే అన్నిరకాల వ్యధల నుండి దూరం చేసి సర్వశుభాల నిస్తాడు.అంగారకునికి ప్రీతిపాత్రమీన్ రత్నం పగడం.పగడం నృసింహావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యైచ జనకాత్మజాయై
       నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
భావం:-రామ లక్ష్మణులకు నమస్కారం.దేవి జనకాత్మజకు నమస్కారం.ఉద్ర,ఇంద్ర,యమ,వాయు,చంద్ర,సూర్య మరుద్గణాలకు నమస్కారం
సారం:-ఈ ప్రార్ధన చేసిన మరునిముషంలోనే హనుమంతుడు అశోకవనంపై దృష్టి సారించడం జరిగింది.అందువల్లనే దీనిని పండితులు కార్యసాఫల్యమంత్రంగా గుర్తించారు.మనస్సుబు సరైన సమయంలో సరైన మార్గంలో నడిపించటానికి నిర్దిష్టమైన గ్రహం బుధుడు.బుధుడు శుభకరుడైతే సునిశిత భావాలు అవసర సమయంలో స్ఫురిస్తాయి.బుధునికి ప్రీతిపాత్రమైన రత్నం పచ్చ.పచ్చ బుద్ధావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-ప్రియాన్న సంభవేత్ దుఃఖం అప్రియాత్ అధికం భయం
       తాభ్యాం హి వియుజ్యంతే నమస్తేషాం మహాత్మానం
భావం:-మనకు కలిగే దుఃఖాలన్నింటికీ మూలకారణం - వస్తువులతో గానీ,వ్యక్తులతో గానీ,విషయాలతో గానీ మనకు గల అనుబంధాల నుండి ఎక్కడ వియోగం కలుగుతుందోనని భయపడటం.అలాంతి భయాలకూ,దుఃఖాలకూ అతీతులైన మహాత్ము లందరికీ నేను నమస్కరిస్తున్నాను.
సారం:-ఈ మంత్రం సీతాదేవి మనకు చేస్తున్న జ్ఞానోపదేశం వంతిది.వేదాంత విషయాలకు సంబంధించిన గ్రహం గురుడు.గురునికి ప్రీతిపాత్రమైన రత్నం పుష్యరాగం.పుష్యరాగం వామనావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-రామః కమల పత్రాక్షః సర్వ సత్వ మనోహరః
       రూప దాక్షిణ్య ప్రసూతో జనకాత్మజే
భావం:-ఓ జనకాత్మజా!రాముని నేత్రాలు మిక్క్లి అందమైనవి.తామర పూరేకుల వంటివి.ఏ వ్యక్తి అయ్నా,ఎ ప్రాణి అయినా మోహ పరవశుడయ్యే అద్భుత సౌందర్యవంతు డాయన.విశిష్ట లక్షణాలతో,ఉత్తమ గుణాలతో ఆయన జన్మించాడు.
సారం:-ఈ శ్లోకంలో హనుమంతుడు రాముని వ్యక్తిత్వాన్ని వర్ణించడంలో చూపించిన నిజాయితీని గమనించిన తర్వాతనే సీతాదేవికి ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగింది.అందువల్లనే పండితులు దీనిని సుందరకాండ కంతటికీ ప్రకాశవంతమైన సన్నివేశంగా తీర్మానించి ఈ శ్లోకాన్ని వజ్రంతో సంవందించారు.శుక్రునికి ప్రీతిపాత్రమైన రత్నం వజ్రం.వజ్రం పరశురామావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-జయత్పతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః
       దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణః
భావం:-మహాశక్తిశాలి అయిన రాముడికి జయం.మహావీరుడైన లక్ష్మణునికి జయం.ఎవరి చేతలు సకల జనులకూ శుభాలు కలగజేస్తాయో అట్టి కోసల దేశానికి రాజయిన రాముడికి నేను దాసుణ్ణి.
సారం:-ఈ శ్లోకంలోని జయజయ ధ్వానాలు లంకానగరవాసులకు హెచ్చరిక వంటివి.అప్పటివరకు సీతాదేవి పైన తన దుష్ప్రభావాన్ని చూపించిన సని ఆమెను వదలి రావణుని పీడించటం మొదలైంది.ఈ మంత్రంతో శనీశ్వరుడు సీతారాములకు శుభకరుడుగా మారాడు.శనీశ్వరునికి ప్రీతిపాత్రమైన రత్నం నీలం.నీలం కూర్మావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం మమ
       యది రాస్త్యైక పత్నీత్వం శీతోభవ హనూమతః
భావం:-ఓ అగ్నిదేవా!నేనే గనుక నాభర్త పట్ల అనుకూలవతి నైతే,నేనే గనుక విధి ననుసరించి వివాహమైన భార్యనే అయితే హనుమంతుడికి ఏ బాధా కలిగించవద్దు.
సారం:-జానకీదేవి ప్రార్ధనాపూర్వకంగా స్మరించిన ఈ మంత్రప్రభావం వల్లనే హనుమంతుడికి అగ్నితాపం దరిచేరలేదు.కాలిన గాయాలు,కుష్ఠు మదలైన వాటినుండి ఉపశమనం కొరకు జ్యోతిష్కులు రాహుజపాన్ని సూచిస్తారు.రాహువుకు ప్రీతిపాత్రమైన రత్నం గోమేధికం.గోమేధికం వరాహావతార సూచకమైన రత్నం.
శ్లోకం:-నివృత్త వనవాసంచ త్యయాసార్ధ మరిందమం
     అభిషిక్త మయోధ్యాయాం క్షిపుంద్రక్షసి రాఘవం
భావం:-ఓ పూజ్యమాతా!నీ భర్త అసమాన వీరుడు.శత్రువులను సంహరించగలడు.అతడు విజయాన్ని సాధిస్తాడు.నీవు తిరిగి ఆయనను కలుసుకొనగలవు.మీరు మీ రాజ్యానికి వెళ్ళి అయోధ్యా సింహాసనాన్ని అధిష్ఠిస్తారు.
సారం:-ఈ మంత్రం సీతాదేవి హృదయానికి మిక్కిలి ఆనందం కలిగించింది.దీనినే మరల రాముని ఎదట చెప్పినప్పుడు ఆయనకూ అంతటి ఆనందాన్ని కలిగించింది.భవిష్యత్తులో జరగబోయే శ్రీరామ పట్టాభిషేకాన్ని హనుమంతుదు తన మనస్సులో ముందుగానే జరుపుకున్నాడు.కారాగార వాసం,బంధనం మొదలైన వాటినుండి విముక్తి కొరకు జ్యోతిష్కులు కేతుజపాన్ని సూచిస్తారు.కేతువుకు ప్రీతిపాత్రమైన రత్నం వైడూర్యం.వైడూర్యం మత్స్యావతార సూచకమైన రత్నం.

          వీటిలోని విశేషం ఏమిటంటే ప్రతి శ్లోకమూ నవగ్రహాలలో ఒక గ్రహానికి,నవరత్నాలలోని ఒక రత్నానికి అనుసంధానించబడి ఉంటుంది.దశావతారాలలో ఇంకా రాని కల్క్యావతారాన్ని వదిలేసిన వాటిలో ఒక అవతారంతో కూడా ఆ శ్లోకాలకి సంబంధం ఏర్పరచారు పండితులు - అందులో మాయా, మోసం ఏమీ లేవు.వాటన్నిటికీ ఉన్న సారూప్యతలని బట్టే ఆ సంబంధాన్ని కల్పించారు.కాబట్టి వీటిని ప్రతిరోజూ జపిస్తే నవగ్రహ పూజా,దశావతార స్మరణా కూడా చేసినట్టే!అయితే,ప్రతి శ్లోకానికీ భావం కూడా గొప్పదే,బ్రతుకు మీద ఆశని పుట్టించే మంచిమాటలు ఇవన్నీ!ఉదాహరణకి విజయానికి అవసరమయిన నాలుగు లక్షణాలూ నీకు ఉన్నాయి కనక విజయం సాధిస్తావు అని లక్షణాల లిస్టు చెప్పి హనుమంతుణ్ణి పొగొడుతున్నప్పుడు కవి ఈ లక్షణాలు మీలో ఉంటే మీరూ విజయం సాధిస్తారు అని చెప్తున్నాడు.సీత ద్వారా వాల్మీకి ఏమి చెప్పాడో దాని విస్తృత రూపమే గౌతమ బుద్ధుడి ద్వారా ప్రచారంలోకి వచ్చిన బౌద్ధమత సారం!వీటిని నేను చాలాకలం నుంచి జపిస్తున్నాను.ఫలితం కనబడుతున్నది.అందుకే ఇక్కడ భావంతో సహా ఉంచాను.నిత్యానుష్ఠానంలో వీటిని చేర్చుకుంటే ఫలితం తప్పకుండా మిమ్మల్ని సంతృప్తి పరుస్తుంది!

          సుందరకాండలో ఉన్న అద్భుతం ఇదైతే,తర్వాత వచ్చే యుద్ధకాండలో ఆదిత్యహృదయం అనే మరొక అద్భుతం ఉంది!కొందరికి ఇవన్నీ చాద్స్తంగా అనిపించవచ్చు,ఇన్ని మంత్రాలు,ఇన్ని చోట్ల ఇంత గట్టిగా నొక్కి చెప్పటం అవసరమా అని,తప్పు లేదు!దేహం దృఢంగా ఉంచుకోవాలంటే వ్యాయామం చెయ్యాలి.జిం నిర్వాహకులు వెళ్ళిన ప్రతివాడికీ ఒకే ఓక్ డంబెల్సో,ఒకే ఒక బుల్వర్కరో ఇచ్చి సరిపెట్టెయ్యటం లేదు గదా!వెళ్ళిన వాళ్ళు కూడా మొక్కుబడిగా ఏదో ఒకటి ట్రై చేసి వచ్చెయ్యటం లేదు - ఓ నాలుగో అయిదో రకాలు వాడుతున్నారు.ఇదీ అంతే,ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండాలన్నా నేను దృఢంగా ఉండాలి అనే సంకల్పం ఒక్కటే సరిపోదు - ప్రాక్టీసు చెయ్యాలి!లేప్పోతే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది, యావంటావ్ సెగట్రీ?

ఆదిత్య హృదయం


తతఓ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతే దృష్ట్వ అయుద్దాయ సముపస్థితం

దైవతశ్చ సమాగమ్య ద్రష్టు మభ్యాగతో రణం
ఉపాగమ్య బ్రవీద్రామ మగస్త్యో భగవాన్ ఋషిః

రామ రామ మహాబాహో శ్రుభు గుహ్యం సనాతనం
యేన సర్వా నరీన్ వత్సః సమరే విజయిష్యసి

ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శతృ వినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం

సర్వ మంగళ మంగళ్యం సర్వపాప పణాశనం
చింతాశోక ప్రశమన మాయుర్వధన ముత్తమం

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః

ఏష బ్రహ్మాచ్ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్యోమో హ్యపాం పతిః

పితరో వసవ స్సాధ్యాః హ్యశ్విన్యౌ మరుతో మమః
వాయు ర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః

ఆదిత్య స్సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణ సదృశో భాను ర్హిరణ్యరేతా దివాకరః

సూర్యారాధన ప్రారంభం

హరిదశ్వ స్సహస్రార్చి స్సప్త స్సప్తి మరీచిమాన్
తిమిరోర్మధన శ్శంభు స్త్వష్టా మార్తాండ అంశుమాన్

హిరణ్యగర్భ శ్శిశిర స్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భో అదీతే పుత్ర శ్శంఖ శ్శిశిర నాశనః

వ్యొమనాధ స్తమోభేదీ ఋగ్యజుస్సామ పారగః
ఘనవృష్టి రపాంమిత్రో వింధ్యవీధీ ప్లవంగమః

అతపీమండలీ మృత్యుః పింగళ స్సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తస్సర్వ భవోద్భవః

నక్షత్ర గ్రహతారాణా మధిపో విశ్వభావనః
తేజసామపితేజస్వీ ద్వాదశాత్మ న్నమోస్తుతే

నమః పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః
జ్యోతిర్గణానాం పతయే దివాధిపతయే నమః

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః
నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః

నమ ఉగ్రాయ వీరాయ పాండురాయ నమోనమః
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమోనమః

బ్రహ్మేశానచ్యుతేశాయ సూర్యాయాదిత్య వర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నా యామితాత్మనే
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః

తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే
నమ స్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే

నాసయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరివిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవచ
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః

సూర్యారాధన సమాప్తం

ఏవ మాపత్సు కృచ్చేషు  కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్నో వసీదతి రాఘవ

పూజయస్వైన మేకాగ్రో దేవదేవం జగత్పితం
ఏత త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి

అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవ ముక్త్వా తధాగస్త్యో జగామచ యధాగతం

ఏతఛ్చృత్వా మహాతేజా నష్టశోకో భవత్తధా
ధారయమాన్ సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్

ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్ష మవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వయత్నేన మహతాం వధే తస్య ధృతో భవత్

అధ రవిరవద న్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహ్ర్ష్యమాణ!హ్
నిసిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్య గతో వచస్త్వరేతి

          సూర్యారాధన ప్రారంభం,సూర్యారాధన సమాప్తం అనేవాటికి మధ్యలో ఉన్న పధ్నాలుగు శ్లోకాలూ మూడుసార్లు చదవాలి.ఇది పని చేస్తుందా లేదా అనే సందేహం అక్కర్లేదు,నాకు పని చేస్తున్నది.ఇదివరలో బ్లాగుల్లో హిందూమతం మీద జరుగుతున్న చర్చల్లో అంత దూకుడుగా వెళ్ళేవాణ్ణి కాదు.సరదాగా కప్లెట్ కామెంట్లతో సరిపుచ్చేవాణ్ణి,అన్యాపదేశంగా జోకులు వెయ్యటంతో సరిపెట్టేవాణ్ణి,విసుగుపుట్టి మధ్యలో ఆపేసేవాణ్ణి!గట్టిగా నిలబడి వాదించినవి చాలా తక్కువ!కానీ ఇప్పుడిప్పుడు గట్టిగా నిలబడుతున్నాను, ఎక్కడ నిలబడినా నేనే గెలుస్తున్నాను, అది ఆదిత్యహృదయం నిత్యానుష్ఠానంలో చేర్చిన తర్వాతనే జరుగుతున్నది.వ్యక్తిగత జీవితంలో కూడా విజయాల శాతం పెరిగింది.ఇక్కడ వ్యక్తిగత జీవితంలో విజయం ఎంతశాతం అవసరం అనే దాని గురించి ఒక మాట!అప్పు అనేది లేకుండా,చెయ్యకుండా,చెయ్యాల్సిన అవస్రం లేకుండా బతకగలిగితే చాలు.బడుగు జీవులైనా,మధ్యతరగతి జీవులైనా,కోట్లకి పడగేత్తిన వాళ్లయినా సరే - శ్రీరస్తు,శుభమస్తు,ఐశ్వర్యమస్తు!

          వాల్మీకి ద్వారా మనకి తెలిసిన రామాయణం అనే ఒక కధ గురించి ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా "మరల నిదేల రామాయణంబనగ..." అన్నట్టు ఇంకా చెప్పటానికి ఎంతో మిగిలి వుందనిపిస్తుంది!కవిత్వం,నాటకం,యక్షగాం,హరికధ,బుర్రకధ,సినిమా,టెలివిజన్ - అన్నిరకాల కళారూపాలూ శ్రీరామకధను స్పర్శించి పరు గడించి పులకించాయి.రామాయణాన్ని తిట్టినా పేరొస్తుందనేదానికి అప్పటివరకూ స్వీట్ హోం లాంటి సంసారపక్షపు నవల్లు రాసుకునే ఒక అనామక రచయిత్రి రామాయణ విషవృక్షంతో ఒక్కసారిగా అంత పేరు తెచ్చుకోవడమే నిదర్శనం:-(

ఈ వాట్సప్ సింగిల్ పేరాగ్రాఫ్ రామాయణం కూడా అలాంటిదే:
Student:Please tell us something about raaamaayanam in the simplest way!
Teacher:It is said that the Raamaayanam is happening in your body.Your soul is Rama,Your mind is Seeta,Your breath or lefe-force is hanumaan,Your awareness is lakshmana and Your ego is Raavana. When Seeta(Mind) was stolen by Raavana(Ego), then Raama(Soul) got restless. Now the soul(Raama) cannot reach the mind(Seeta) on its own, It has to take the help of the praana(Hanumaan).When the mind(Seeta) got reunited with the soul(Raama) and the ego(Raavana) vanished - everything goes healthy to the Body!This is the real significance of the story of raama.

          ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే రామాయణానికి ఉన్న సార్వజనీనతని నాస్తికులూ కమ్యునిష్టులకి కూడా వర్తించేటంత basic levelకి కుదించి చెప్పటం!నువ్వు నాస్తికుడివైనా,కమ్యునిష్టువైనా - ఒక లక్ష్యం పెట్టుకుని నిజాయితీగా దాన్ని సాధించటానికి పోరాడుతుంటే నీ మనస్సులో ఈ రామాయణం జరిగి తీరాల్సిందే!నువ్వు రామద్వేషివైనా సరే అబద్ధాలూ,పులుముడులూ లేకుండా నువ్వు గనక సత్యానికి కట్టుబడితే నీ జీవితప్రయాణం కూడా రామాయణమే అవుతుంది.

రామాయణం నచ్చినవాళ్ళు చచ్చినా చావనట్టే!
రామాయణం నచ్చనివాళ్ళు పుట్టినా పుట్టనట్టే!
జై శ్రీరాం!

8 comments:


  1. మరో ప్రవచనకర్త పుట్టాడు !


    ReplyDelete
  2. అర్ధం కాకపోతే అడిగి తెలుసుకో! మంచిమాట వినడం నేర్చుకో!! నీకే మంచిది!!

    ReplyDelete

  3. మరదేల రామాయణ మన్న !

    తెలుగు వారికి దులప దులుచుటకు రాముల వారే గతి యయ్యె సుమీ సారంగా సామి రంగా :)

    మరో ప్రవచన కర్తా ! శభాష్ !

    జిలేబి

    ReplyDelete
  4. హరిబాబు గారూ, "రామాయణంలో వాడిన చందస్సు కూడా గాయత్రీ చందస్సు" అన్నారు. అది సరికాదండి. రామాయణంలో వాడిన చందస్సు అనుష్టుప్పు. అక్కడక్కడా ఇతరఛందస్సుల్లో కూడా కొన్ని కొన్ని శ్లోకాలున్నాయి. మీ సుదీర్ఘవ్యాసాన్ని ఇంకా పూర్తిగా చదువలేదు.

    ReplyDelete
    Replies
    1. గాయత్రి చందోరూపం కూడా అనుష్టుప్పు కదా!గాయత్రీ చందస్సు అని కలిపి వాడటం వల్ల ఆ అర్ధం వచ్చింది."గాయత్రి యొక్క ఛందోరూపమైన అనుష్టుప్పునే" అంటే కంఫ్యూజన్ ఉండేది కాదేమో!సరి చేస్తాను.కృతజ్ఞతలు!

      Delete
    2. ఛందస్సులలో 6 అక్షరాల పాదప్రమాణం కల ఛందస్సుకు గాయత్రి అని పేరు. అనుష్టుప్పుకు పాదానికి 8 అక్షరాలు.

      గయత్రి ఛందో రూపం గాయత్రీ ఛందం కాదండి. సంధ్యావందనంలో గాయత్రీ ఆవాహన మంత్రంలో ' గాయత్ర్యా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషిః ' అని స్పష్టంగా ఉన్న సంగతి మనం గమనికలో ఉంచుకోవాలి. అదే మంత్రంలో 'గాయత్రీ చతుర్వింశత్యక్షరా' అని వస్తుంది. గాయత్రీ ఛందానికి పాదానికి 6 అక్షరాలు కాబట్టి నాలుగు పాదాలకు వెరసి 4 x 6 = 24 అక్షరాలు. ఐతే ఆ మంత్రంలో 'త్రిపదా' అని చెప్పబడింది. అది వేరే విషయానికి సంబంధించినది ఛందశ్శాస్త్రవిషయకంగా కాదు.

      Delete
    3. మాస్టారూ,
      నాకు కనీసం సరిచెయ్యడం కూడా కుదరదని తేలిపోయింది.ఆ భాగం మటుకు తీసేశాను.ఇంకా యేమైనా తప్పులుంటే చెప్పగలరు.ఏది రాసినా లోపరహితంగా ఉండాలనేది నా పట్టుదల.
      కృతజ్ఞుణ్ణి

      Delete
  5. ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే రామాయణానికి ఉన్న సార్వజనీనతని నాస్తికులూ కమ్యునిష్టులకి కూడా వర్తించేటంత basic levelకి కుదించి చెప్పటం!నువ్వు నాస్తికుడివైనా,కమ్యునిష్టువైనా - ఒక లక్ష్యం పెట్టుకుని నిజాయితీగా దాన్ని సాధించటానికి పోరాడుతుంటే నీ మనస్సులో ఈ రామాయణం జరిగి తీరాల్సిందే!నువ్వు రామద్వేషివైనా సరే అబద్ధాలూ,పులుముడులూ లేకుండా నువ్వు గనక సత్యానికి కట్టుబడితే నీ జీవితప్రయాణం కూడా రామాయణమే అవుతంది.
    చాలా బాగుంది

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...