Friday 29 August 2014

రాజు లంతా ఒక రకంగానే వుంటారా?నిజామునీ కృష్ణదేవరాయల్నీ ఒకే గాటన కట్టెయ్యొచ్చా?

సీ||          వెలిసిన గోడపై వేసిన మసకలు
                 గమ్మిన బొమ్మలు కదిలి నట్లు

                  తోచు మార్మిక చిత్రతోరణాలు! తెగ వే
                  ధించెడి మనను బాధించెడి గత

                  కాలపు గాయాల్ని కళ్ళకు మరల మ
                  రల చూపించెడి హర్రరులు! హుషారు

                  లను పెంచు ఫాంటసీలు!చదివి చూడవోయ్
                  మమ్మల్ని తెలుసుకో మనసు మర్మ

తే||            మంటు చాలెంజి విసిరేటి పజిలు గళ్ళు!
                   మనసు భాషను తెలిపేటి మార్మికాల
                   లెక్క తేల్చేటి పదనిధులు! గహనాలు!
                   నిదర చెట్టుకు పూసేటి విరులు- కలలు!!
(23/07/2014)
______________________________________________________
పదనిధులు=vocabulary(list of key words)
______________________________________________________


         విజయవాడ లయోలా కాలేజిలో చదివుకునేటప్పుడు నేనూ మా ఫ్రెండూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నాం.మా కాలపు కుర్రాళ్లకి ఘంటసాల ఇంకా టచ్ లోనే వున్నాడుగా, వాడు హఠాత్తుగా ఒక ఘంటసాల పాట యెత్తుకున్నాడు, "బ్రతుకంత బాధగా కన్నీటి ధారగా" అని.వెంటనే దానికి జవాబుగా  నేను, "బ్రతుకూ కన్నీటి ధారల లోనే బలి చేయకూ" అని యెత్తుకున్నా8=P)

           తెగ నవ్వుకున్నాం, ఈ సినిమా పాటలు రాసేవాళ్ళు యే మూడ్లో వుంటే ఆ మూడ్ కి పనికొచ్చే పాట రెడీగా వుంచారు, బహుశా ఆ రెండు పాటలూ ఒకడే రాసినా ఆశ్చర్యపోనక్కర లేదు గదా!కొన్ని పాటలయితే బహురూపుల మాదిరి ఒకే పాట యే మూడ్ లో వుంటే ఆ అర్ధానికి పనికొస్తాయి. అలాంటివాటిలో ఒకటి, "ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నం" - అదే యేడుపు పాటా, అదే వోదార్పు పాటా అవుతుంది మరి!

           కవిత్వంతో పని లేని వాళ్ళు బండిచక్రంతో పోలుస్తారు కాలాన్ని, తిరుగుతూ వుంటే పై ఆకు కిందకీ కిద ఆకు పైకీ వస్తాయని.కానీ నాకు ఈ పోలిక తప్పనిపిస్తుంది, యెందుకంటే రిపీట్ అవుతున్నవి సన్నివేశాలు కాదు, మన భావాలు మాత్రమే!ఒకసారి తప్పు చేసేశాక దిద్దుకోవటం అసంభవం, ఫలితాన్ని అనుభవించటమే శరణ్యం. స్ప్రింగు పై నుంచి చూస్తే సర్కిల్ లాగ కనపడినా పక్క నుంచి చూస్తే యే రెండు పాయింట్లూ కలవవని.

        మనిషి బతుకూ అంతే, ఒకసారి చేసిన తప్పుని దిద్దుకోవటం కుదరదు - పరిహారం చెల్లించుకోవటమూ తప్పదు!గతంలో చేసిన తప్పులకు యేడుస్తూ కూచున్నా ముందు కెళ్ళలేం! ఇతర్లు చేసిన తప్పుల నుంచీ వాళ్లకి తగిలిన దెబ్బల నుంచీ నేర్చుకోవటం ద్వారానే మనం తప్పులు చెయ్యకుండా వుందగలుగుతాం. అన్నీ మన స్వానుభవం మీదనే నేర్చుకోవద మంటే నిప్పు కాలుతుందిరా అంటే చెయ్యి పెట్టి చూసి తెలుసుకుంటా ననడం లా వుంటుంది!

          గడపలకి పసుపు రాయడం నుంచి బొడ్డుతాడు దాచటం వరకూ మన పెద్దవాళ్ళు యెంతో అనుభవసారాన్ని మన కందించారు, యేమి లాభం?నపుంసకుడికి లావణ్యవతిని కట్టబెట్టినట్టుంది ఇవ్వాళ్టి పరిస్థితి! యెప్పటి కప్పుడే యెప్పటి దప్పుడే అనే ధోరణి పెరిగి ఒకప్పుడు యేం జరిగింది, దానివల్ల ఇవ్వాళ్టి మనం యెలా ప్రభావితుల మవుతున్నామో తెలిస్తే గదా ఇవ్వాళ మనం చేస్తున్న పనుల వల్ల మన తర్వాత తరం వాళ్ళ బతుకులు యెలా ప్రభావిత మవుతాయో తెలిసేది?అందుకే మనవాళ్ళు మానవజాతి మనుగడని ప్రవాహం తో పోల్చారు. నిన్నా నేడూ రేపూ ల మధ్యన చక్కని సమన్వయంతో సాగే ఆ ప్రవాహం దారిలో వూషర క్షేత్రాలు పెరగదంతో కొంచెం బలహీన పడింది!

       ఈ దేశ చరిత్రలోని కొన్ని అనివార్యతలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి.అనివార్యత అంటే ఒకటి - ముఖ్యంగా హాని చేసే దుస్సంఘటన - జరగబోతుందని తెలిసినా ఆపలేని నిస్సహాయత! యెందుకొస్తుంది?ఒకటి మనకి హాని కలిగిస్తుందనీ దాన్న్ని వొదిలేస్తే మంచి జరుగుతుందనీ తెలిసినా సరే వొదలకుండా గట్టిగా పట్టుకుని ఒక  విధ్వంసం యెదురయ్యే వరకూ అకర్మణ్యంగా వుండిపోతున్నాం.మొదటిసారి జరిగినప్పుడు దాని నుంచి నేర్చుకుంటే రెండవసారి జరగ్కుండా ఆపవచ్చు, కానీ నేర్చుకునే చురుకుదనం మనలో లేనట్లుంది?!

       దారా షికో - గొప్ప పండితుడు, సజ్జనుడయిన ప్రభువు.మన భారతీయ సాంప్రదాయం పట్ల గౌరవాదరాలు వుండి మన సాహిత్యాన్ని పారసీ భాషలోకి తర్జుమా చేసి ప్రపంచాని కందించాలని కలలు గన్న దార్శనికుడు.ఔరంగజేబు - ఈ దేశాన్ని యెంత దుర్మార్గమయిన పధ్ధతిలో నైనా సరే తనకు నచ్చిన మతానికి అంటుగట్టాలని చూసిన సంకుచిత మనస్తత్వం గలవాడు.వీరిద్దరి మధ్యనా అధికార మార్పిడికి పట్టిన ఆ అయిదు నిముషాల కాలం హిందువులూ ముస్లిములూ అన్యోన్యంగా కలిసి వుండి వుండేవాళ్లేమో అని అనుకోవాల్సిన జరగని భవిష్యత్తు నుంచి ఇవ్వాళ మనం చూస్తున్న ఈర్ష్యా ద్వేషాలతో రక్తపుటేరులు పారించుకుంటున్న పరిస్థితి దాపరించింది!?

      మొగలాయీ వంశంలో తండ్రి నుంచి కొడుక్కి అధికారం రావటం కూడా కుట్రల తోనూ కుహకాల తోనూ రక్త సంబంధీకుల్ని కూడా కత్తికి బలిచ్చి కూడా యేమాత్రమూ పశ్చాత్తప పడని విధంగా జరిగింది!యెంత పరమ శాంతంగా అధికారం లోకి వచ్చినా దారా  ఔరంగజేబు చేసిన మోసపు యుధ్ధంతో చరిత్ర చెత్తబుట్టలోకి క్రూరంగా విసిరివెయ్యబడ్డాడు!దారా సైన్యంలోని ఒక వ్యక్తిని కొనేశాడు, తక్కువ సైన్యంతో యుధ్ధానికి వచ్చి వెనక్కి తిరిగి పారిపోతున్నాట్తు నటిస్తున్నాడు. ఈలోపు పాదుషా సైన్యంలోని అతని పావు, "ప్రభూ, తమరు గజం మీద నుంచి కన్నా అశ్వం మీద నుంచి అయితే మరింత చురుగ్గా కదలగలరు" అనడంతో అమాయకంగా హౌదా మీద నుంచి దిగాడు.సమయం కోసం చూస్తున్న ఔరంగజేబు పాదుషా వోడిపోయి వెనక్కి తిరుగుతున్నాదని హడావుడి చేశాడు, అంతే - వోడిపోతున్నామనుకున్న సైన్యం హుషారుగా రెచ్చిపోయింది, గెలుస్తున్నామనుకున్న సైన్యం దిగ్భ్రాంతితో చతికిల బడింది - ఫలితం తారుమారయింది!

          కేవలం కొన్ని మొహిరీల అదనపు సంపాదన కోసం అనామకుడైన ఆ లంచగొండి సైనికుడు  చేసిన పని భారతదేశ చరిత్రని యెంత వూహించని మలుపు తిప్పిందో చూశారుగా!ఇవ్వాళ రక్షణ శాఖ లోని వున్నతాధికారులే అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తుంటే దేశ భవితవ్యం గురించి నిర్భయంగా వుండగలమా?దారా షికో ఆస్థానంలో కవిగా తెలుగువాదైన పండిత జగన్నాధ రాయలు వుండేవాడు.దారా షికో పతనం తర్వాత ఢిల్లీ వొదిలి దేశాతనలో కాలం గడిపాడు.కధాకావ్యాలు రాయలేదు గానీ ఇతని వ్యంగ్యవైభవం అసామాన్యం! అతనిలా అంటాడు, "ఓ గాడిదా! రోజంతా బట్టల మూటలుమోసి వీపు విరగ్గొట్టుకుని ఈ గుగ్గిళ్ళు తినదం దేనికి?రాజుగారి అశ్వశాలలో హాయిగా విందు భోజనమే చెయ్యవచ్చు గదా! కాపలా వాళ్ళు గుర్తు పట్టి తంతారు గదా అంటావా, అక్కడ నూటికి తొంభయ్ శాతం మంది గుర్రానికీ గాడిదకీ తేడా తెలియని వాళ్ళే వుంటారు, మిగిలిన ఆ పదిమంది మాటా రాజుగారి దగ్గిర చెల్లదు." అని.అప్పటి రాజస్వామ్యంలోనూ ఇప్పటి ప్రజాస్వామ్యంలోనూ పరిస్థితి ఒక్క లాగానె వుంది కదా, యెంత మందకొడి తనం? అనివార్యత లన్నీ విషాదాన్నే మోసుకొస్తున్నాయని తెలిసినా ఇప్పటికీ చిన్న చిన్న వాట్ని కూడా ఆపలేకపోవడానికి మందకొడి తనమే కారణం కదా!

             అయితే ఇంత మందకొడిగా బతికే అసంఖ్యాక ప్రజల మధ్య నుంచి అప్పుడప్పుడూ తమ జీవిత కాలం లోనే కాలాన్ని పట్టి బంధించి గుప్పిట పట్టి చరిత్రని తమ సంకల్పాని కనువుగా మలుపు తిప్పి చూపించి అనంతకాలం వరకూ నడక ఆపని వాళ్ళూ వున్నారు!వాళ్ళింకా నడుస్తూనే వున్నారు,చూస్తున్నారా!వారి చిరంజీవిత్వం వెనక వున్న రహస్య మేమిటి?యేమీ లేదు, వాళ్ళొక కల గన్నారు దాన్ని కష్టపడి నిజం చేసుకున్నారు!కాలం తెలియని ఒక స్థలంలో పరమ పురుషుదు పుట్టీ పుట్టగానే తన చుట్టూ వ్యాపించి వున్న యేమీలేనితనం చూసి బోరు కొట్టి ఒక 3డి బ్రష్ ని కదిలించి ఈ అనంతకోటి విశ్వాల్నీ సహస్రాధిక భాను మండలాల్నీ యేది కిందో యేది మీదో తెలియని విశ్వ ఘనంలో మునగానాం తేలానాం అంటూ వేలాడుతూ కదులుతున్న పాలపుంతల్నీ బృహత్తారల్నీ సృష్టించుకున్నాడు - తన ఆనందం కోసం!అనేకానేక జీవరాశుల్నీ సృష్టించాడు - చంపుతూ,పుట్టిస్తూ, యేడిపిస్తూ, నవ్విస్తూ - కాలక్షేపం చెయ్యడానికి! అంతా అయిపోయాక బ్రష్ పక్కన పడేసి తీరిగ్గా చూస్తే యెక్కడో యేదో కనబడీ కంబడకుండా దాక్కున్నట్టు అనిపించింది!? తనే సృష్టించుకున్న బ్రహ్మాండమంతా కలయదిరిగినా ఫలితం లేకపోయింది, విసుగెత్తి తన బదులుగా వెతకడం కోసం మనిషిని సృష్టించాడు!

            తనకు మాత్రమే ప్రత్యేకమయిన సృజించే శక్తినీ అమరత్వాన్నీ తప్ప తనకున్న అన్ని శక్తుల్నీ - ముఖ్యంగా కనిపించిన దాన్ని బట్టి కనిపించని దాన్ని చూడగల బుధ్ధి చాతుర్యాన్నీ యేది చేయందగు నేది చేయందగదనే విచక్షణనీ -  ఇచ్చాడు. ఇచ్చి వెదకమన్నాడు గానీ అతను ఒక జీవితకాలం సరిపోదనేశాడు. సరే, ఆ మనిషినే రెండుగా చేసి ఒక సగం నుంచి  ఆడ మనిషిని కూడా సృష్టించి వాళ్ళిద్దరికీ పెళ్ళి చేసి ఈ భూమి మీదకి దించాడు. ఆ లోపాన్ని సరి చెయ్యగలిగిన వాడికి తన సృజించే శక్తితో సహా అన్నీ ఇచ్చి తనంతవాణ్ణి చేస్తానని హామీ ఇచ్చాడు! సంతానం అయితే తామరతంపరగా పెరిగింది గానీ నూటికి తొంభయ్ శాతం మందకొడిగా తిరిగే బేవార్సు గాళ్ళే. కేవలం పదిశాతం మందే భగవంతుడు విసిరిన ఛాలెంజిని టేకప్ చేశారు. "యేమీలెనితనం నుంచి వచ్చిన ఈ కనిపించే దాంట్లో యేది కలిస్తే పరిపూర్ణత్వం సిధ్ధిస్తుందో అది యేది?" అనే వెతుకులాటలో జీవితాల్ని అన్వేషణకి అంకితం చేశారు.అసలుదైన దైవత్వం సిధ్ధించలేదు గానీ కొసరుదైన అమరత్వం సిధ్ధించింది!

          మీరూ ప్రయత్నించండి.నేనూ ఖాళీగా వుండన్లెండి.దేవుడితో సమానం అయ్యే ఛాన్స్ వొదులుకుంటామా, చెప్పండి! వెతుకుదాం,వెతుకుదాం,వెతుకుదాం - అలిసిపోతే నిదర పోదాం. ఆ నిదరలో ఒక కలొస్తుంది!ఆ కల, పైన చెప్పినట్టు - హర్రర్, ఫాంటసీ, పజిల్, క్లూ వర్డ్ - యెలా అయినా వుండొచ్చు! పీడకల వచ్చి వులిక్కిపడి లేచినా యెంత సేపు మేలుకుని వుండగలం? అదృష్టం ఈడ్చి తన్నే ఒక క్షణంలో వచ్చే కల మన లక్ష్యాన్ని కళ్ల ముందు బొమ్మ కట్టిస్తుంది.ఆ కల వెంట పయనమయితే మనమూ చరితార్ధుల మవుతాం?!
గొప్పోణ్ణవటానికి దగ్గిర దారేది గురూ? అర్జెంటుగా ఒక మంచి కల గనెయ్యటమే శిష్యా!

9 comments:

  1. చాలా అద్భుతంగా వ్రాశారు...

    వెతుకుదాం,వెతుకుదాం,వెతుకుదాం -
    అలిసిపోతే నిదర పోదాం.
    ఆ నిదరలో ఒక కలొస్తుంది
    ఆ కల వెంట పయనమౌదాం ...
    మరి మనం ఆ 90 మందిలో వాళ్ళమే గదా !?

    ఇంకెక్కడి ప్రయత్నం ?
    కల వెంబడే ప్రయాణం ...

    ReplyDelete
    Replies
    1. మెచ్చుకోలుకు నెనర్లు!
      నన్ను నేను ఆ పదిమందిలోనె చేర్చుకున్నా, మీరు కూడా ఆ పదిమందిలోనె వున్నారని నేను అనుకుంటున్నాను.కల అంటూ వుంటే అదే కదిలిస్తుంది.

      Delete
  2. ఎందుకు సార్ మీకు రాయల మీద అంత కసి, ఈ ద్వేషపు రాతగాళ్లు ఇప్పుడు అర్జెంట్ గా రాయల మీద బురద చల్లుతూ, నిజామును పొగుడుతూ టపా లు కట్టటం మొదలెట్టరంటారా :-)

    వీళ్లకు అర్ధం కానిది ఏమిటి అంటే, ఈ బానిసలకు హైదరాబాదు లో entry కూడా సరిగా ఉండేది కాదు, 1956 కు మొత్తం హైదరాబాద్ స్టెట్ కంటే ఒక్క గుంటూర్ జిల్లాలో హైస్కూల్లు (అర్ధమయి చావదమో కొందరకి, ఇస్కూళ్ళు) ఎక్కువ ఉన్నాయ్యి అంటే ప్రపంచం లో అత్యంత ధనవంతుడు అయిన వీళ్ళ మంచి రాజు వీళ్లను ఎంత జాగ్రత్తగా అభివ్రుద్ది చేసాడో తెలుస్తూనే వుంది.

    ఇక వీళ్ల సొంత తెలుగు భాష సారీ తెలంగాణా భాష (కొందరి మనోభావాలు దెబ్బతినకుండా :)), చదవటానికి లేదు, పి.వి. గారి దగ్గారి నుండి చదువుకొన్నవాళ్లు వెరే రాష్ట్రాలకెళ్లి చదువుకొన్నారు అని వీళ్లకీ తెలుసు. అందుకనే ఆ తరం ఆంధ్ర అన్న పేరుతో మొదలయ్యే సంఘాలు అవ్వి తెలంగాణా లో మొదలెట్టారన్నది నిజం, కాని ద్వేషం కమ్ముకొని, తర తరాలు గా ఎదో ఒక దొర కు కాలుమొక్కే తత్వం ఉన్న జనాలకు కళ్లు మూసుకుపోయినప్పుడు నిజాలేమి పనికి రావు.

    ఇప్పుడు అర్జెంట్ గా రాయలను ఎలా బదనాం చేయాలి, నిజామును గొప్పోడిని చేయటానికి (మన గీత ను పెద్దది చేయలేకపోతే, ప్రక్క గీతను చెరిపితే పోతే సరి పోతుంది అన్న లాజిక్) పూనుకొన్నా పూనుకొంటారు మఖానుభావులు!

    ReplyDelete
    Replies
    1. క్రిష్ణ గారూ,
      మీ కామెంటులో నిజాముకు సంబంధించిన పార్టు వరకూ కరెక్టే.వింతేమిటంటే వాళ్ళ చరిత్రలో మహానుభావుల్ని కీర్తించుకోవాల్నటే ఇంకొంచెం వెనక్కి వెళితే శాతవాహనులు వున్నారు, ఈ మైకంలో వాళ్ళు కూడా కనపట్టం లెదు వీళ్ళకి - పోయి పోయి నిజాముని మోస్తున్నారు!

      వాళ్ళకీ మనకీ కూడా తెలియని కొన్ని విషయాలు 18వ తేదీ ఆంధ్రజ్యొతి లో పరబ్రహ్మ శాస్త్రి గారు శాసనాలూ పురాణాలూ పరిశోధించి ఒక విషయం చెప్ప్పారు.అసలు ఆంధ్ర పదం తెలంగాణా ప్రాంతంలో వున్న తెలుగు వాళ్లకీ తెలుగు అనే పదం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మనకీ వాడే వాళ్ళు.అందువల్లనే నిజాము వ్యతిరేక పోరాటానికి పెట్టుకున్న వేదికకి ఆంధ్ర మహా సభ అని పేరు పెట్టుకున్నారు అప్పటి తెలంగాణా మేధావులు!

      ఇప్పుడు ఆంధ్రా అనేదాన్ని మనకి దఖలు పర్చేసి తిట్టటం వల్ల జరిగిందేమిటంటే వాళ్ళ ఆంధ్రత్వాన్ని కూడా మనకే ఇచ్చెయ్యటం. వాళ్ళ రాష్ట్రం పేరుని తెలంగాణా స్టేట్ అని రిజిస్టర్ చేయించుకోవడం, మన రాష్ట్రం పేరులో ఆంధ్ర వుండటం ద్వారా ఆ పదం మీద పూర్తి హక్కు మనకే వచ్చింది,

      Delete
  3. చాలా అద్భుతంగా వ్రాశారు...

    వెతుకుదాం,వెతుకుదాం,వెతుకుదాం -
    అలిసిపోతే నిదర పోదాం.
    ఆ నిదరలో ఒక కలొస్తుంది
    ఆ కల వెంట పయనమౌదాం ...
    మరి మనం ఆ 90 మందిలో వాళ్ళమే గదా !?

    ఇంకెక్కడి ప్రయత్నం ?
    కల వెంబడే ప్రయాణం ...

    ReplyDelete
  4. చాలా బాగా రాశారు. చరిత్ర చదివిన వ్యక్తిగా నాకు దారా షికో గొప్ప పండితుడు, సహనశీలి అని తెలుసు. కానీ యుద్ద సమయాలు పూర్తిగా కుట్రలు, కూహకాలతో నిండి వుంటాయి గదా, వాటిని గ్రహించలేని వ్యక్తులు యుద్దాల్లో ఓడిపోకతప్పదు. ఉదాహరణకు కృష్ణదేవరాయలు, గజపతులు, 16 మండి పాత్రులు. అలా అని నేను ఔరంగజేబును సమర్ధిస్తున్నాననుకోవద్దు. ప్రభువు అనేవాడు అన్నివిధాలా సమర్ధుడు అయి వుండాలి లేకపోతే ఔరంగజేబు లాంటి దుర్మార్గుల చేతుల్లో దుర్మరణం తప్పదు. సొంత అన్న దారా షికో మొండాన్ని నెలరోజులపాటు కోటాబయట వేలాడదీయించాడు ఔరంగజేబు.

    చివరి మూడుపేరాల్లో మీరు రాసిన శైలి చేయి తిరిగిన పెద్ద రచయితలకు ఏమీ తీసిపోదు. మీరుచెప్పిన ఆ పదిమందిలా బ్రతకటం గురించి వేరే వ్యాసంలో ఇంకొంచెం విపులంగా చెప్తారా? తెలుసుకోవాలనుంది.


    A.P రాజధానిపై అనిశ్చితి ఎందుకు ఏర్పడుతోంది? కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారా? అనే టాపిక్ పై ప్రజ - తెలుగువారి చర్చావేదిక లో మీ కామెంట్స్ చూసినతరువాత నేను మీ 25 వ ఫాలోయర్ గా మారాను.



    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. @vkbabu,
      మీ స్పందన నన్ను చాలా సంతోషపెట్టింది!చివర్లో అన్న 25వ ఫాలోయర్ అనేది హాప్పీ గానే వుంది కానీ మీరు కూడా చరిత్ర గురించి చదివి వుండటం మరీ బాగుంది.

      దారా కూడా అమాయకంగా యేం లేడు,రాజధానిలో వున్న అంతర్గత రాజకీయాలని గట్టిగానే శాసించాడు.మొత్తం సైన్యంలోనూ ప్రభుత్వం లోనూ అందర్నీ తన గ్రిప్లో వుంచుకోవటం లాంటి విషయాల్లో మందకొడిగా యేమీ లేడు,ఔరంగజేబుని కూడా రాజధాని నుంచి తరిమేశాడు.దుర్మార్గులలో ఒక రకమయిన మొండితనం అలా వుంటుంది, అది అంతే.యెంత సమర్ధంగా వున్నా కాలం కలిసి రానప్పుడు యెవ్వరూ విధిని తప్పించుకోలేరు.కానీ మిగతా వాళ్ళ లాగా తను కూడా ఔరంగజేబుని మట్టగించేసి వుంటే యెలా వుండేదో?అయినా ఇన్ని శతాబ్దాల తరవాత మీరూ నేనూ మన లాంటి వాళ్ళందరం దారాని కీర్తిస్తున్నాం, ఔరంగజేబుని చీదరించుకుంటున్నాం.

      అది చాలు దారాకి!కాకి చిరకాల మున్ననేమి?హంస బతికే ఒక్క రోజుకు సాటి రాదు!!

      Delete
  5. “Walk with the dreamers, the believers, the courageous, the cheerful, the planners, the doers, the successful people with their heads in the clouds and their feet on the ground. Let their spirit light a fire within you to leave this world better than when you found it.”
    – Wilfred Peterson

    నన్ను కూడా 10 మంది క్లబ్ లోకి
    లాక్కున్నందుకు కృతజ్ఞతలు ...

    ReplyDelete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...