Thursday 2 July 2020

ఒకనాటి మొగలాయి వైభవము నేడు కనము,అది మనముందు మరుభూమియై నిలిచె నేడు - రాజ్యాంతే నరకం ధృవం!

(ఒక్కసారి కళ్ళు మూసుకుని మీరు కాలయంత్రంలో 17 శతాబ్దంలో ఉన్నారనుకుని కళ్ళు తెరవండి.మిమ్మల్ని మీరు దారా షికో అని భావించుకోండి!ఎందుకంటే, కధ అతని నుండి వినడమే న్యాయం,అతని మనస్సులోని ఆలోచనల్ని తెలుసుకోవడం మరీ అవసరం.కాబట్టి ఇకనుండి మీరు దారా షికో అనబడు షాజహాన్ చక్రవర్తి పెద్ద కొడుకు!ఇప్పుడు మీరు ఉన్నది ఢిల్లీ కోటలో,17 శతాబ్దంలో,అవునా!)
Dara Shukoh
నేను అతి సామాన్యుడినైతే నా కధ మీకు సోదిగానే అనిపిస్తుంది.కానీ మా ముత్తాత గారైన అక్బర్ పాదుషా యొక్క ఆస్తి అక్షరాలా 1365 లక్షల కోట్లు!అప్పటి ప్రపంచ స్థూల జాతీయ ఉత్పత్తిలో ఆయన ఏలుబడిలో ఉన్న భారతదేశపు స్థూల జాతీయ ఉత్పత్తి 25% ఉంటుంది - పుత్తడి గలవాని పుష్ఠంబు పుండైన వసుధలోన వాసికెక్కు నన్నట్లు ఇప్పుడు మీకు నా కధ కొంత ఆసక్తిని కలిగించవచ్చు.మీ తరంలో ద్రవ్యోల్బణం, పన్నుల ఎగవేతలూ తిరగమోతలూ అన్నీ కలిపి లెక్కవేస్తే దేశంలో కల్లా అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ ఆస్తి మా సంపదతో పోలిస్తే ముష్టి 2.5 లక్షల కోట్లు.దానికోసమే అన్నదమ్ములు తన్నుకుని బజారున పడి తల్లి కల్పించుకుని రాజీ చెస్తే సర్దుకున్నారు,మరి, అంత ఖరీదైన మా నెమలి సింహాసనం కోసం కుట్రలు జరిగితే ఆశ్చర్యమా!
భారత ఉపఖండపు గడ్డ మీద మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన ముత్తాతకు తాతగారైన బాబరుకు తండ్రి వైపున తైమూర్ లంగ్ తల్లి వైపున చెంఘిజ్ ఖాన్ మూలపురుషులు!ఫర్ఘానా అధిపతిగా బాబరు రాజ్యానికి వచ్చేసరికి నవయువకుడైన మహాయోధుణ్ణి తేలికకట్టి మేనమామలతో సహా మధ్య ఆసియా ప్రాంతపు వీరయోధులు నిరంతరం పితృపైతావహమైన రాజ్యానికి దూరం చెయ్యాలని ప్రయత్నిస్తున్నా తట్టుకు నిలబడి కాబూల్ మీద పట్టు సాధించగలిగాడు!అయితే, ప్రయత్నంలో దక్షిణానికి జరుగుతూ వచ్చి క్రీ. 1526లో ఢిల్లీ సుల్తాను ఇబ్రహీం లోడీని గెలవడంతో ఆగిపోయి తన వివేకాన్ని చాటుకున్నాడు.ఎందుకంటే,అప్పుడు గనక యుద్ధోన్మాదంతో ముందుకు వెళ్ళి రాజపుత్రుల మీదకి వెళ్ళి ఉంటే సర్వనాశనం అయిపోయి ఉండేవాడు!
బాబరు మొదట సమర్ఖండ్ మీద యుద్ధం చేసినప్పుడు అతని మేనమామలు ఐకమత్యంతో ఇతన్ని ఓడించగలిగారు.కూడదీసుకుని మరికొంత సైన్యాన్ని పెంచుకుని రెండోసారి సమర్ఖండ్ మీద దాడి చేశాడు.కొండనాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు ఫర్ఘానా కూడా జారిపోయింది!దాంతో రాజ్యం లేని రాజులా తిరుగుబోతు జీవితం గడుపుతూ తిరిగి తిరిగి కాబూల్ చేరి దాన్ని పట్టుకోగలిగాడు.కాబూలును పట్టుకోవడంతో వచ్చిన హుషారు వల్ల సమర్ఖండ్, ఫర్ఘానా అతని మనస్సునుంచి చెరిగిపోయాయి.ఇక్కడ చేరిన వెంటనే అతనికి దగ్గిరలో ఉన్న భారత ఉపఖండం మీద కన్ను పడింది - అటు ఢిల్లీలో Daulat Khan వైపునుంచి పిలుపు అందుకుని వచ్చాడు, గెల్చాడు, రాజ్యం స్థాపించాడు.నిజానికి తనవైపునుంచి తన వంశాన్ని తైమూరిడ్ అని చెప్పుకున్నాడు. మా వంశానికి మొఘల్ అనే పేరును చరిత్రకారులు తర్వాత తగిలించారు.ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా చిన్న పిల్లలకి చెప్పటానికి భారత జాతీయ ప్రభుత్వం వారు కూర్చే పాఠాల నుంచీ కొత్త పరిశోధనలు చేసి చరిత్రని విస్తరించాల్సిన భారతీయ మేధావుల వరకు "మొగలాయి!" అనే మాటని తల్చుకుంటేనే సమర్ధతా వైభవమూ లాంటివి గుర్తొచ్చి ఒళ్ళు పులకరించడం విశేషం - అలాంటి గొప్ప వంశంలో పుట్టడం నా అదృష్టం!
నిజానికి బాబరు కూడా తన వారసులు ఇంత గొప్ప ఆదరణ పొందుతారని వూహించి ఉండడు - ఎందుకంటే, 1530లోనే ఆయన చనిపోయాడు. నాలుగేళ్ళు కూడా యుద్ధాలతోనే సరిపోయింది. ఇతని కొడుకు మా ముత్తాతకు తండ్రిగారైన హుమాయూన్ షేర్ షా సూరి ధాటికి తట్టుకోలేక ఢిల్లీని అతని పరం చేసి  1540లో నమ్మకస్తులైన సైన్యాధికారులతోనూ తనని అభిమానించే సామాన్యుల తోనూ కలిసి భారతదేశపు సరిహద్దుల బైటికి తరలిపోయాడు.
--------------------------------------------

మామూలు లెక్కలో చూస్తే పారిపోవటం పిరికితనమే, కానీ ఈనాడు తెలుగులో మొనగాడు అనే పదం పుట్టడానికి కారణమైన మొగలాయీ సామ్రాజ్యం ఎన్నెన్నో కధలను సృష్టించుకుని నిలిచిందంటే దానికి పునాది ఆనాడు హుమాయూన్ షేర్ షా సూరి ముందు నిలవలేక లాహోరు నుంచి తప్పుకుని ఇప్పటి ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల్ని చుడుతూ సుమారు 9327 కిలోమీటర్ల దూరాన్నిఎక్కే గడప దిగే గడప అంటూ తిరిగి తిరిగి మళ్ళీ దిన్ పనాగ్ నగరాన్ని పట్టుకునే ముందు గడిపిన 15 యేళ్ళ ప్రవాసి జీవితమే!

01. Lahore (
ప్రస్తుత పాకిస్తాన్):క్రీ. 1540 మే 17 కన్నోజు దగ్గిర షేర్ షా సూరి చేతిలో పరాజయం పాలైన హుమాయూన్ మొదట లాహోరుకు వెళ్ళాడు.నమ్మకస్తులైన సైన్యాధిపతులూ కోటల్ని గెలవడానికి సరిపడిన సైన్యమే కాకుండా హుమాయూన్ మంచితనాన్ని ఇష్టపడిన సామాన్యజనం కూడా అతనితో కలిసి తిరుగుతున్నారు.అప్పుడు లాహోరును బాబరు ఇండియా వైపుకు వస్తూ నిలబెట్టిన బాబరు మరొక భార్య అయిన Gulbadan Begum పెద్ద కొడుకు Kamran Mirza అంగరగంగవైభవాలతో యేలేస్తున్నాడు!
ఇతను చాలా బలవంతుడు - హుమాయూన్ ప్లాను కూడా చుట్టుపక్కల ఉన్న ఇలాంటి బలమైన తైమూరిడ్ తెగల్ని కలుపుకుని షేర్ షా సూరిని ఎదుర్కోవాలని, అలా  జరిగి ఉంటే హుమాయూన్ సూరిని అతి తేలిగ్గా గెల్చి ఉండేవాడు!కానీ కమ్రన్ హుమాయూనుకు సహాయం చెయ్యటానికి నిరాకరించేశాడు.అంతే కాదు, షేర్ షా సూరికి హుమాయూనుని అప్పగించినందుకు పంజాబు కోసం బేరం పెట్టాడు గానీ సూరి ఒప్పుకోలేదు.
అయితే తర్వాతెప్పుడో క్రీ. 1545లో లాహోరు ప్రజలు కమ్రన్ క్రూరత్వానికి విసిగిపోయి ఉండటంతో యుద్ధమే లేకుండా హుమాయూన్ వశమయ్యింది గానీ ప్రస్తుతానికి వస్తే, హుమాయూన్ పక్కన ఉన్న చాలామంది అతన్ని అంతం చేసి లాహోరు మీద పట్టు సాధించమని సలహా ఇచ్చారు.అయినా, హుమాయూన్ తండ్రికి ఇచ్చిన మాటకి కట్టుబడి అక్కణ్ణించి తప్పుకున్నాడు.
02. Bukkur (ప్రస్తుత పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతం): అప్పటికే నిలువనీడ లేకుండా తనవెంట తిరుగుతున్న నమ్మకస్తులైన సైన్యాధికారులకీ సామాన్యులకీ ఒక తాత్కాలికమైన విడిదినైనా ఏర్పాటు చేయాలని సింధునదిని దాటి Husen Arghun ఆనె మరొక బలమైన తైమూరిడ్ సర్దారు పాలించే Bukkur వైపు నడిచాడు.ఇతను కూడా బాబర్ లాహోరుని పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ నియమించిన వాడే - కానీ అప్పటివరకు అనుభవించిన స్వతంత్రతను వదులుకోవడానికి ఇష్టపడకనూ వ్యక్తిగతమయిన స్పర్ధలు తోడవటం వల్లనూ కోటని సామరస్యంగా సాధించుకుని కొంత వూపిరి తీసుకుందామనుకున్న హుమాయూన్ ఆశ నెరవేరలేదు, యుద్ధం చాలా తీవ్రంగా జరిగింది.
03. Sehwan (ప్రస్తుత పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతం): Bukkar కోటని ముట్టడిస్తూనే కొంత సైన్యంతో Husen అధీనంలో ఉన్న Sehwan కోటని ముట్టడించటానికి వెళ్ళాడు హుమాయూన్.కానీ కోట హుమాయూనుకి లొంగలేదు. పరాజయానికి తోడు Bukkar కోట దగ్గిర కూడా పరాజయం ఎదురయ్యిందని ఇక్కడుండగానే తెలిసింది.
04. Phalodi (ప్రస్తుత భారతదేశంలోని రాజస్థాన్):రెంటికీ చెడ్డ రేవడిలా Marwar రాజ్యం వైపుకు కదిలాడు.అప్పుడక్కడ Rana Maldeo అనే హిందూ రాజు ఉన్నాడు - ఇతను Afghansకీ Gurkanisకీ తటస్థంగా ఉండేవాడు.ప్రస్తుత పాకిస్తాన్ దేశంలోని Dirawal వద్ద ఒక రోజు విశ్రాంతి తీసుకుని రాజ్యంలో అడుగుపెట్టి జైసల్మేర్ ఎడారిని దాటి Phalodi చేరుకునేసరికి రాజు తనని పట్టించి బహుమతి కొట్టెయ్యడానికి సూరితో బేరమాడుతున్నాడని తెలిసి ఇల్లూ వాకిలీ వదిలి తనవెంట వచ్చిన స్త్రీలనీ పిల్లల్నీ కాపాడుకుంటూ తమ కదలికలు గూఢచారుల కళ్ళల్లో పడకుండా చూసుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి సరిహద్దుల వైపుకి మళ్ళాడు.స్థానికులు బావుల్ని ఇసకతో కప్పెయ్యటమూ తిండి దొరక్కుండా చెయ్యటమూ చేస్తుంటే అలమటిస్తూ అలమటిస్తూ Rana Maldeo సైన్యంతో ఎదురెదురు చెదురు మదురు దొమ్మీలు చేస్తూ చాలా అలిసిపోయాకనే ఆ రాజ్యాన్ని దాటగలిగాడు.
05. Umerkot (ప్రస్తుత పాకిస్తాన్):పైనించీ కిందనుంచీ మాడ్చి చంపే థార్ ఎడారిలో అత్యంత సుదీర్ఘమైన కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఆకలికీ దాహానికీ తట్టుకోలేక ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళని అక్కడ వదిలేసి బతికున్నవాళ్ళు పాదుషాతో సహా అత్యంత దయనీయమైన స్థితిలో హిందూ రాజ్యాన్ని చేరుకున్నారు.రాజ్యం చిన్నదే అయినా హుమాయూనుకు పెద్ద సాయమే చేసింది. ప్రసాద్ రాణా తండ్రి హుసేను చేతిలో మరణించడం వల్ల హుమాయూనుకు మంచి ఆతిధ్యం ఇవ్వడమే కాకుండా సైన్యాన్ని కూడా అప్పగించాడు.ఇక్కడే అక్బర్ పుట్టాడు.
06. Thatta (ప్రస్తుత పాకిస్తానులోని సింధ్ ప్రాంతం):Rana Prasad ఇచ్చిన కొత్త సైన్యాన్ని కూడా కలుపుకుని Arghun పరగణా లోని Jun ప్రాంతాన్ని పట్టుకోగలిగాడు హుమాయూన్.కానీ ఒక Gurkani noble ఒక హిందూ మధ్య వచ్చిన తగాయిదా చిలికి చిలికి గాలివానై రాజు తన సైన్యాన్ని వెనక్కి పిలిపించేసుకోవటంతో హుస్సేనును ఓడించటం మాత్రం కుదరలేదు. మళ్ళీ జండా ఎత్తేసి ప్రయాణం మొదలుపెట్టారు.
07.Sibi (ప్రస్తుత పాకిస్తానులోని బలూచిస్థాన్ ప్రాంతం):పదే పదే ఎదురవుతున్న ఓటములకి విసుగెత్తి కొందరు సర్దార్లూ సైనికులూ కూడా విడిచిపెట్టి తమ బాగు తాము చూసుకున్నారు.కొన్ని చెదురుమదురు ఘర్షణలకే తీవ్రమైన నష్టం పాలయ్యి తాత్కాలిక యుద్ధ విరమణ ప్రకటించి Afghun సైన్యాల చేతిలో పరాభవాల్ని తప్పుకుని Husen రాజ్యపు సరిహద్దులలోని Sibiని చేరుకుని కొంత నెమ్మదించాడు హుమాయూన్.
08.Quetta (ప్రస్తుత పాకిస్తానులోని బలూచిస్థాన్ ప్రాంతం):అప్పటికే Khandhar అని తన పేరును మార్చుకున్న ఒకప్పటి గాంధార దేశపు సరిహద్దు నగరం ఇది.ఇక్కడికి చేరగానే Kamran, Askariలు తనను ఖైదు చెయ్యాలని చూస్తున్నారని తెలిసింది.గత్యంతరం లేక Persia వైపుకు వెళ్ళాలని అనుకున్నారు, కానీ వంశోద్ధారకుడు మరీ చిన్నవాడు, అంత కష్టమైన ప్రయాణాన్ని తట్టుకోలేడని అక్కడనే గట్టి కాపలాతో ఉంచేద్దామనుకున్నాడు హుమాయూన్.అయినా Hamida Banu Begum సాహ్సి కావ్డంతో మోకాటి లోతుమ పేరుకున్న మంచుతో నిండిన పర్వాత్ శిఖరాలను దాటుకుంటూ ప్రయాణం కొనసాగించారు - శిరస్త్రాణాలను వంటపాత్రల కింద వాడుకుంటూ ఉడకబెట్టిన గుర్రపు మాంసం తిని బతికారు అందరూ!
09. Sistan (ప్రస్తుత ఇరానులోని బలూచిస్థాన్ ప్రాంతపు పరగణా):ఒకప్పటి శకస్థానం ఇలా పేరును మార్చుకున్నది,Persian governor ఎంతో ఆదరంగా ఆహ్వానించి Harat వైపుకు పంపించాడు. Harat అనేది హుమాయూను తల్లి Maham గారి పుట్టినిల్లు.ఇక్కడ కొన్ని రోజులు ఆగి తర్వాత సుదీర్ఘమయిన ప్రయాణం చేసి Shah Tahmasp ప్రభువు యొక్క వేసవి రాజధాని అయిన ప్రస్తుత Qazvin ప్రాంతం చేరుకున్నాడు హుమాయూన్.Sistan నుంచి Qazvin మధ్య ఉన్న  Jam మీదుగా వెళ్తున్నప్పుడు Hamida Bano Begum పూర్వీకుల సమాధుల్ని దర్శించుకున్నారు.Shah Tahmasp సభికులకీ సామంతులకీ హుమాయూనుకు కావలసిన అన్ని సౌకర్యాలూ కల్పించి ఉచితరీతిన గౌరవించమని ఆదేశాలు ఇచ్చాడు.
10. Qazvin (ప్రస్తుత ఆఫ్ఘనిస్తానులోని ముఖ్యమైన పరగణా):ఇది హుమాయూనుకు సగం అండ సగం ఖైదు!ఇక్కడ Safi-ad-din Is’haq అనే Safi dynasty వంశస్థాపకుడి సమాధిని దర్శించాడు.బహిరంగ వేదికల మీద ఆతిధ్యంలో షా గారి మర్యాదలు ఎంత తీవ్రంగా ఉండేవో అంతర్గత జీవితంలో షా గారి షియా పాండిత్యం సున్నీ హుమాయూనును అంత భయపెడుతూ వుండేది!
బహిరంగ సభామర్యాదల్నీ ఆంతరంగిక మతమౌఢ్యాన్నీ ఎక్కువ కాలం భరించలేక ఒక ఇష్టం లేని బలాత్కార మానభంగపు తరహా ఏకపక్షపు ఒప్పందం కుదుర్చుకుని ఆయన గారు ఇచ్చిన 14,000 మంది పర్షియన్ సైనికుల్ని పుచ్చుకుని బతుకు జీవుడా అంటూ అక్కణ్ణించి బయటపడ్డాడు. ఇంతకీ షా గారు హుమాయూనుకు వీసమెత్తు లాభం కూడా లేని "కాందహారును పట్టుకోవాలి, కానీ దాన్ని తన కొడుకైన Prince Murad పరం చెయ్యాలి!" అనే ముదనష్టపు ఒప్పందానికి హుమాయూనును ఒప్పించడానికే అంత హింస పెట్టి భయానకమైన ఆతిధ్యం ఇచ్చి వుంటాడని నా అనుమానం!
11. Kandahar (ప్రసుత ఆఫ్ఘనిస్తానులోని ఖందహర్ పరగణా): ఒప్పందం ప్రకారం Kandahar వద్ద సుదీర్ఘ కాలపు వైఫల్యాల తర్వాత దక్కిన నికరమైన గెలుపుని కూడా ఇతరుల పరం చెయ్యాల్సి వచ్చింది.అది మరో వైపు నుంచి అదృష్టం కలిసొచ్చేలా చేసింది - వైఫల్యాలను చవి చూస్తున్నప్పుడు దూరమైన సర్దారులూ సైనికులూ కొత్త విజయం తెచ్చి పెడుతున్న లాభాల మీద ఆశతో తిరిగి దగ్గరయ్యారు.దీనివల్ల Prince Murad చనిపోగానే షా గారి బహిరంగ సభామర్యాదల్నీ ఆంతరంగిక మతమౌఢ్యాన్నీ ఎక్కువ కాలం భరించలేక కుదుర్చుకున్న ఇష్టం లేని బలాత్కార మానభంగపు తరహా ఏకపక్షపు ఒప్పందం నుంచి బయట పడటానికి వీలు కుదిరింది!
12. Kabul (ప్రసుత ఆఫ్ఘనిస్తాను యొక్క రాజధాని):ఇక్కడ దాదాపు ఎనిమిదేళ్ళు బతికాడు హుమాయూన్.తొలినాళ్ళలో సర్దారుల హితబోధ కూడా వినక తండ్రికి చేసిన వాగ్దానం గుర్తొచ్చి జాలిపడి వొదిలేసినందుకు Kamran తనమీద చేసిన కుట్రలకి విసుగెత్తి ఉండి ఉండాలి - ఇప్పుడు, 1553 నాడు అతన్ని ఓడించి కళ్ళు పీకించి వేశాడు.
13. Peshawar (ప్రస్తుత పాకిస్తానులోని ప్రముఖ ప్రాంతం):ఇక దరిదాపుల్లో తనను సవాలు చేసే బలవంతులైన శత్రువులు లేకపోవటం వల్ల హుమాయూనుకు గొప్ప ధైర్యం వచ్చేసింది!అలా 1554 నాడు మళ్ళీ హిందూస్థాన్ వైపుకు ప్రయాణం మొదలుపెట్టాడు.Peshawar, Rothas, Lahore అడుగు పెట్టడం ఆలశ్యం తన పరం ఐపోయాయి.అక్కడ తన పరోక్షాన భారత భూమి మీద కూడా కాలం అనుకూలించే సూచనలు కనిపిస్తున్నాయి.Sher Shah తుపాకి మందు పేలకూడని సమయంలో పేలి గాయాల పాలయ్యాడు.తండ్రి అంతటి సమర్ధుడైన అతని కొడుకు Jalal Khan కూడా చనిపోయి దూరదృష్టి లేని అసమర్ధపు మంద మిగిలింది - వాళ్ళలో వాళ్ళే పంపకాలు వేసుకుని వేరు కాపరాలు పెట్టి షేర్ షా సూరి మొఘలుల నుంచి సాధించిన ఆఫ్ఘన్ సామ్రాజాన్ని ముక్కలు చెక్కలు చేసుకున్నారు.
14. Sirhind (ప్రస్తుత భారతదేశంలోని పంజాబ్ ప్రాంతం):హుమాయూను ఇక క్షణం కూడా ఆలస్యం చెయ్యని హుషారులో ఉండి జలంధరును పట్టుకోవడానికి పరుగులు తీశాడు - దారిలో Diplapur, Sirhind తేలిగ్గానే వశం అయ్యాయి.Sirhind దగ్గిర Baihram Beg అనే నమ్మకస్తుడైన సేనాని Macchiwara యుద్ధంలో 30,000 మంది ఆఫ్ఘన్ సైనికుల్ని అవలీలన గెల్చేశాడు.తను Din Panah చేరుకోవడానికి అడ్డం నిలబడిన Sikander Sur అనే ఘనాపాటీ యొక్క లక్ష మంది సైన్యాన్నీ Sirhind యుద్ధంలో మట్టుబెట్టి నగరం తనది కాగానే కోటని అన్ని విధాల సిద్ధం చేశాడు.
15. Din Panah (భారతదేశంలోని ప్రస్తుత రాజధాని New Delhi యొక్క శివారు ప్రాంతం): హమ్మయ్య! 1555 నాటికి పదిహేను యేళ్ళ క్రితం ఎక్కడి నుంచి ప్రవాసం వెళ్ళాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు - ఇంత పట్టుదల మా ముత్తాతకు తండ్రిగారైన హుమాయూనుకు లేకపోయి ఉంటే ఈనాడు మొఘల్ రాజవంశం గురించి విని ఉండేవాళ్ళు కాదు మీరు!
--------------------------------------------
అప్పటికి షేర్ షా చనిపోయి ఒక దశాబ్దం దాటింది.పోగొట్టుకున్నదాన్ని సాధించడం మాత్రమే హుమాయూన్ చేయగలిగింది. మా ముత్తాత గారైన ఈయన కొడుకు అక్బర్ మాత్రం అసాధారణ ప్రతిభావంతుడు. ఈయన చాకచక్యం వల్లనే చాలామంది హిందూ ప్రభువులు కూడా మిత్రబాంధవసామంతు లయ్యారు!ఆర్ధిక క్రమశిక్షణ సాధించడంలో అఖండుడైన ఇతని సామరస్య పునాదినే ఆర్ధిక ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ రంగాల్లో 2020 నాటి భారత ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నదంటే ఆయన ఘనత గురించి ఇంకేమి చెప్పాలి?తర్వాత కాలంలో జహంగీర్(ప్రపంచ విజేత) అనే బిరుదునామంతో మొఘల్ సింహాసనం యెక్కిన మా తాతగారైన సలీం యవ్వన ప్రాయంలో చాలా అరాచకత్వంగా ఉండేవాడు. మొదటిసారి క్రీ. 1601లో అక్బర్ దక్కన్ మీద దండయాత్రలో నిమగ్నమై ఉన్న అదను చూసుకుని ఆగ్రాలో తిరుగుబాటు జండా యెగరేశాడు!ఇంకేముంది, అక్బరు పాదుషా మరో కొడుకును దక్కన్ ప్రతినిధి హోదాలో ఉంచి ఆగ్రాకి వచ్చిపడ్డాడు - బెంగాలునీ ఒరిస్సానీ ఏలుకోమని రాజీ ప్రతిపాదన పంపించినా సలీం వినకుండా అలహాబాద్ రాజధాని చేసుకుని సొంత కుంపటి పెట్టేశాడు.సలీముని ఎలాగైనా ఆగ్రాకు తీసుకురమ్మని అబుల్ ఫజల్ అనే అంతరంగికుణ్ణి పంపిస్తే సలీం అప్పటి తన సహజసిద్ధమయిన క్రూరత్వంతో అతన్ని హత్య చేయించాడు!తర్వాత తల్లి కలగజేసుకుని సలీముని ఆగ్రాకి తీసుకురాగలిగింది కానీ అప్పటికే తాగుడికి బానిసైపోయాడు.మామూలప్పుడు కళారాధన వల్ల సున్నితంగా వుండేవాడు కాస్తా మత్తులో ఉన్నప్పుడు చాలా క్రూరంగా తయారయ్యేవాడు - కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు!తనకి ఎంతో ఇష్టుడైన అబుల్ ఫజల్ హత్యకే విసిగిపోయిన అక్బరు తాగుబోతుకి రాజ్యం కట్టబెట్టడం ఇష్టం లేక సలీం పెద్ద కొడుకు ఖుస్రూని తన వారసుడిగా ప్రకటించాడు.
ఆఖరికి కొడుకుని నయాన్నో భయాన్నో దారికి తెచ్చుకోవాలనుకున్నాడో ఏమో అక్బరు తనే అలహాబాదు వెళ్ళాలని బయల్దేరాడు. అదే సమయానికి అక్బరు తల్లి జబ్బున పడింది. తన ప్రయాణం ఆగిపోయింది గానీ క్రీ. 1604 ఆగస్టు 29 ఆమె మరణించడంతో అక్బరు యొక్క మరో కొడుకు అప్పటికే తాగుడుతో చచ్చిపోయాడు గనక అక్బరు యొక్క జీవించియున్న ఏకైక కుమారుడను తనేనని తెలివి తెచ్చుకుని సలీం ఆగ్రాకి చేరుకున్నాడు. అవ్వ ఆఖరి చూపుల కోసం అలా వచ్చినవాణ్ణి అక్బరు వెంటనే ఖైదులో పెట్టి పదిరోజుల తర్వాత విడిచిపెట్టాడు - తండ్రిగా, చక్రవర్తిగా అక్బరు సలీం గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో అంత నిరాశ పడ్డాడు!అంతలోనే అక్బరుకీ ఆరోగ్యం పాడైపోయి మంచం పట్టాడు. పాదుషా మరణించిన మరుక్షణం అధికారాన్ని తమకే దఖలుపరుచుకోవడం కోసం కొందరు సలీమునీ కొందరు ఖుస్రూనీ ముందు పెట్టుకుని రెండు శిబిరాలు ఏర్పాటు చేసేసుకుని తయారైపోయారు.
ఒక వాస్తవం యేమిటంటే, అక్బర్ పాదుషా కొడుకుల కన్న మనమళ్ళనే ఎక్కువ ప్రేమించాడు.అది ఎంత దూరం వెళ్ళిందంటే, మనుమలు కూడా అక్బరుని shah – baba(king-father) అనీ తమ తమ తండ్రుల్ని shah-bhai(king- brother) అనీ వ్యవహరించేవాళ్ళు!అలా సలీం కన్న అతని కొడుకు ఖుస్రూనే ఎక్కువ ప్రేమించిన అక్బర్ సలీం పట్ల తనకున్న తిరస్కారం అనే విషాన్ని తనలోనే దాచుకుని సలీముని తన వారసుడి క్రింద ప్రకటించి మొఘల్ సామ్రాజ్యపు భవిష్యత్తు పట్ల ఒకింత ఆందోళనతోనే కన్నుమూశాడని నేను అనుకుంటున్నాను.అలా సా. 1569 ఆగస్టు 31 పుట్టిన Nur-ud-din Muhammad Salim సా. 1605 నవంబర్ 3 తేదీన మహా ఘనత వహించిన అక్బర్ పాదుషా మరణించిన 8 రోజున 'conqueror of the world', 'world-conqueror' or 'world-seizer' అను నామాంతరములు గల Jahangir బిరుదునామంతో అధికారంలోకి వచ్చాడు!
నేను జహంగీర్ అనే పేరు చెప్పగానే మీకు నూర్ జహాన్ అనే ఒక శక్తివంతమైన మహిళ గుర్తుకు రావాలి - వస్తుంది, వచ్చి తీరాలి, నేను కధ చెప్పి తీరాలి! రాజ కుటుంబాల్లోని పిల్లలు భిన్నమైన సంస్కృతిలో పెరిగి మానవ సంబంధాల కన్న అధికార కాంక్షయే మిన్న అనుకుని ఎంత క్రూరమైన జీవితం గడిపినప్పటికీ చరిత్రకారులు వారికి ఆపాదించిన ఘనతల వల్ల సర్వులకీ ప్రేమాస్పదులు అయ్యి కొందరికి ఆదర్శవంతులు ఎలా కాగలుగుతారో మా తాతగారైన జహంగీరు చక్రవర్తి జీవితాన్ని అతి దగ్గరి నుంచి పరిశీలిస్తే కళ్ళకి కట్టినట్టు తెలుస్తుంది.1581లో జరిగిన కాబూలు దాడి నాటికే పది వేల రూపాయల నెలజీతం కలిగిన స్వంత సైన్యాన్ని అజమాయిషీ చేస్తూ తనకు తాను వ్యూహాలు రచించుకుని ఎవరినుంచీ అనుమతులు తీసుకోకుండానే యుద్ధాలు చేసి కొత్త రాజ్యాల్ని గెల్చుకోవడానికి పనికొచ్చే మన్సబ్దార్ హోదాని సాధించుకున్నాడు - అప్పటికి తన వయస్సు పన్నెండేళ్ళు మాత్రమే.ఇక Rajkumari Man Bai అనే బంధువుల అమ్మాయితో పెళ్ళి కుదిరిన 1585 నాటికి నెలజీతం పన్నెండు వేలు అయ్యింది.
1585 ఫిబ్రవరి 13 Rajkumari Man Baiని పెళ్ళి చేసుకున్నాడు.ఆమెకి Shah Begum అనే ముద్దు పేరు పెట్టాడు.ఈమెకి పుట్టిబ్న వాడు Khusrau Mirza.ఆయాన్ తొలినాటి ప్రియపత్నుల్లో Jagat Gosain Begum అనే రాజపుత్ర మహిళ Taj Bibi Bilqis Makani అని అతని చేత పిలిపించుకుని తర్వాతి తరంలో Shah Jahan పేరున పాదుషా అయిన Khurram షాజాదాను కన్నది.1586 జులై 7 Bikaner ప్రభువైన Raja Rai Singh కూతురును పెళ్ళి చేసుకున్నాడు.అదే 1586 జులై మాసంలో Kashghar సుల్తాను Abu Said Khan Jagatai కూతురైన Malika Shikar Begumను కూడా పెళ్ళి చేసుకున్నాడు.అదే 1586లో Herat నవాబు Khwaja Hassan కూతురైన Sahib-i-Jamal Begumను కూడా పెళ్ళి చేసుకున్నాడు.అంతటితో అయిపోలేదు, 1587లో Jaisalmer మహారాజు Bhim Singh కూతురైన Malika Jahan Begumను కూడా పెళ్ళి చేసుకున్నాడు.Raja Darya Malbhas కూతురును కూడా పెళ్ళి చేసుకున్నాడు.1590 అక్టోబరులో Mirza Sanjar Hazara కూతురైన Zohra Begumను పెళ్ళి చేసుకున్నాడు.1591లో Mertia ప్రభువు Raja Kesho Das Rathore కూతురైన Karamnasi Begumను పెళ్ళి చేసుకున్నాడు.1592 జనవరి 11 Ali Sher Khan కూతురైన Kanwal Raniని పెళ్ళి చేసుకున్నాడు.1592 అక్టోబరులో Kashmir ప్రభువైన Husain Chak కూతురును పెళ్ళి చేసుకున్నాడు.1593 మార్చిలో Ibrahim Husain Mirza కూతురైన Nur un-nisa Begumను పెళ్ళి చేసుకున్నాడు.1593 సెప్టెంబరులో Khandesh ప్రభువైన Ali Khan Faruqi కూతురును పెళ్ళి చేసుకున్నాడు.Baluch ప్రభువైన Abdullah Khan కూతురును కూడా పెళ్ళి చేసుకున్నాడు. 1596 జూన్ 28 Kabul, Lahore ప్రాంతాలకు సుబేదారు Zain Khan Koka కూతురైన Khas Mahal Begumను పెళ్ళి చేసుకున్నాడు.1608లో  Qasim Khan కూతురైన Saliha Banu Begumను పెళ్ళి చేసుకున్నాడు.1608 జూన్ 17 Amber యువరాజు Jagat Singh పెద్ద కూతురైన Koka Kumari Begumను పెళ్ళి చేసుకున్నాడు.
కానీ, 1611 మే 25 పెళ్ళి చేసుకున్న Mehr-un-Nisaaయే ఈరోజున నూర్ జహాన్ పేరుతో ఖ్యాతి గడించిన అత్యంత శక్తివంతమైన అద్భుత సౌందర్యరాశి!అనార్కలి అనే నిరాడంబరమైన పేరు పెట్టి అక్బర్ పాదుషా క్రౌర్యానికి బలి అయిన అనామకమైన ముగ్ధ  అని కళాకారులు మోసం చేసిన ఈమె "ఒక దాని తర్వాత ఒకటి - పులుల్నీ సింహాలనీ వేటాడటం, అమోఘమైన మంత్రాంగం నెరపటం, అత్యంత కఠినమైన ఆజ్ఞలు జారీచెయ్యటం, ప్రజలకూ వ్యాపారులకూ రాజ్యానికీ అవసరమైన నాణేలు విడుదల చెయ్యటం, భవంతుల నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించడం వంటి రాజకార్య నిర్వహణలో రాటు దేలిన మకుటం లేని మహారాజ్ఞి" అనేది చాలా తక్కువ మందికి తెలిసిన నమ్మలేని నిజం.
పాదుషా అక్బరు పరిపాలనా సమయంలో ఈమె మొదట Sher Afganను పెళ్ళాడి, జహంగీరు పాదుషా పరిపాలన మొదలైన తొలినాటి రోజుల్లో ఆ సర్దారు అనుమానాస్పదమైన రీతిలో మరణించిన తర్వాత పాదుషా సతీమణి అయ్యాక నడిచిన మొఘల్ సామ్రాజ్యపు చరిత్ర సమస్తం ఈమె కనుసన్నల చేతిసైగల మీదనే నడిచింది - 1622లో ఖుర్రం షాజాదా తిరుగుబాటు చేసేవరకు!
ఇప్పుడు తిరుగుబాటు చేసిన ఖుర్రం షాజాదా క్రూరత్వం తెలియాలంటే మీరు నా కధాకధన వాక్ప్రవాహంలో పడిపోయి మర్చిపోయిన ఖుస్రూ మీర్జా ఇప్పుడు ఎక్కడున్నాడో చూడాలి.సా.శ 1605 నవంబర్ 3వ తేదీన అధికారం తననే వరిస్తుందని నమ్మిన ఖుస్రూ మీర్జా తనను వరించాల్సిన అధికారం తండ్రిని వరించడం సహించలేక 1606లో తిరుగుబాటు చేశాడు.వ్యూహం పన్నడం వరకు అద్భుతమైన చాకచక్యం చూపించాడు.Sikandra దగ్గర ఉన్న అక్బరు సమాధిని చూడాలనే వంకతో 350 మంది ఆశ్వికదళంతో ఆగ్రా నుంచి బైల్దేరాడు.మధుర దగ్గిర 3000 అమంది ఆశ్వికులతో Hussain Beg కలిశాడు.పానిపట్టు దగ్గిర కొచ్చేసరికి లాహోరు నగర దివాను Abdur Rahim కూడా కలిశాడు.ఖుస్రూ అమృత్ సర్ చేరుకుని అక్కడ గురు అర్జున్ దేవ్ ఆశీస్సులు తీసుకున్నాడు.ఆఖరికి Dilawar Khan కాపుదలలో ఉన్న లాహోరు నగరం మీద దాడి చేశాడు. వార్త విన్న వెంటనే జహంగీర్ పెద్ద సైన్యంతో వచ్చి పడ్డాడు - Bhairowal యుద్ధరంగం నుంచి కాబూలుకు పారిపోదామని చూసిన ఖుస్రూని అనుచరులతో సహా చీనాబ్ నది దాటుతున్న సమయంలో చుట్టుముట్టి పట్టుకున్నారు.
విజయవంతం కాని తిరుగుబాటు చేసిన ప్రభువంశీయుడి పరిస్థితి ఎట్లా వుంటుందో ఆ తర్వాత ఖుస్రూ మీర్జా అనుభవించిన అవమానాలనూ విషాదాలనూ చూసి తెలుసుకోవచ్చు - ఖుస్రూని అంబారీ ఏనుగు మీద ఎక్కించి వూరేగింపు తీశారు, అయితే అతని సహాయకుల్ని దారి పక్కన రెండు వైపులా శూలాలకు గుచ్చి అతనికి చూపించారు. చాందినీ చౌక్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తనకి సహాయం చేసినవాళ్ళు పడుతున్న యమబాధని తను కూడా అనుభవిస్తూ ఖుస్రూ మీర్జా చేసిన అత్యంత సుదీర్ఘమయిన ప్రయాణం ఎంత ఘోరమైనది?ఎంత దుస్సహమైనది?ఎంత విషాదం!ఎంత విషాదం!
తర్వాత ఖుస్రూ మీర్జా మీద కంటిచూపును తొలగించే శిక్ష కూడా ఆమలైంది, కారాగార వాసం కూడా దానిని అనుసరించింది - 1616లో అతను నూర్ జహాన్ సోదరుడు అసఫ్ ఖాన్ పరం అయ్యాడు, 1620లో అతని అల్లుడైన ఖుర్రం షాజాదా పరం అయ్యాడు, 1622లో ఖుర్రం షాజాదా ఆజ్ఞ మేరకు వధించబడ్డాడు. తిరుగుబాటు విఫలం కాని ముందరి పరిస్థితిని తల్చుకుంటే విషాదాంతం అనిపించే అతని చావు తిరుగుబాటు విఫలం అయిన తర్వాతి పరిస్థితిని తల్చుకుంటే సుఖాంతం అనిపిస్తుంది - ఎంత చిత్రమైన చావు ఖుస్రూ మీర్జాది!
త్రాగుడు వ్యసనం యవ్వనం నుంచి నడివయస్సు వరకు జహంగీరును బలహీనుణ్ణి చేసింది.అతి కష్టం మీద వ్యసనం నుంచి బయటపడి చూస్తే నూర్ జహాన్ తనకు మారు చక్రవర్తిత్వం వెలగబెడుతున్నది - స్వతంత్రించి చక్రవర్తిత్వం తీసుకోనూ లేడు, పారతంత్య్రతను అనుభవించనూ లేడు.ఈ తాగుడు పిచ్చితోనే ఆనాటి 1598లో అక్బర్ చాలా కాలం నుంచీ కన్ను వేసి ఉన్న Turan మీదకి పంపించాలనుకుంటే తిరస్కరించాడు - దాన్ని పట్టుకుని ఉంటే మధ్యాసియా కూడా మొగలుల ఆధిపత్యం కిందకి వచ్చేది!అక్బర్ కాలం నాటి చరిత్రను గ్రంధస్థం చేసిన Abu’l Fazl ఈ తెలివితక్కువ తనం గురించి "That pleasure-loving youth, could not wean his heart from India." అని విసుక్కున్నాడు.ఇక ఈనాటి 1622లో కాందహారు ముట్టడిని అడ్డుకోమని నూర్ జహాన్ ఇచ్చిన ఆజ్ఞను ఖుర్రం షాజాదా తిరస్కరించడం మాత్రం త్రాగుడు వ్యసనం వల్ల గాక ముందు చూపుతో వేసిన వ్యూహం, తనను తాను నూర్ జహాన్ అనే శక్తివంతమైన మహిళ నుంచి కాపాడుకోవటానికి వేసిన ప్రతి వ్యూహం!జహంగీర్ ఖుర్రం తన వారసుడు అని ప్రకటించాకనే తన మొదటి భర్త కూతురైన Ladliని జహంగీరుకు మరో రాణి వల్ల పుట్టిన కొడుకు Shahriyarకి పెళ్ళి చెయ్యడం సహజంగానే మామా అల్లుళ్ళైన అసఫ్ ఖానుకీ ఖుర్రముకీ అనుమానం వచ్చేలా చేసింది!
ఖుర్రం మొదటినుంచీ తన చుట్టు జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఉన్నాడు.తండ్రికీ ఖుస్రూ మీర్జాకూ గొడవలు జరుగుతున్నప్పుడు ఎవరి వైపుకీ మొగ్గలేదు - అది అమాయకత్వం ఏమీ కాదు, సమయోచితమైన ఉదాశీనతయే, ఖుస్రూ తన అధీనంలోకి రాగానే పనికి రాని కలుపు మొక్కని పీకినట్టు పీకి పారేశాడు. సా.శ 1627లో జహంగీర్ చనిపోగానే అప్పటి వరకు వేటకు సిద్ధమైన పులిలా నిశ్శబ్దం పాటిస్తున్న Asaf Khan చెలరేగిపోయి సివంగి లాంటి చెల్లెల్ని చిట్టెలుకలా మార్చి ఖైదు చేశాడు, ఖుర్రం షాజాదాను షాజహాన్ పాదుషాను చేశాడు!అధికార పదవీ రాజకీయాలు ఎట్లా ఉంటాయో చూశారా?ఇక్కడ నూర్ జహానుకు తెరచి రాజు చెప్పే సన్నివేశంలో మీకు Asaf khan కనిపిస్తున్నాడు గానీ ఖుర్రం కనపడడం లేదు కదూ!కాందహారు మీద దాడి చెయ్యటానికి తిరస్కరించిన ఖుర్రం గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోలేదు.ఆ 1622లోనే తనకి అత్యంత విధేయుడైన Mahabat Khan సహాయం తీసుకుని తండ్రి మీదా సవతి తల్లి మీదా యుద్ధం ప్రకటించాడు.అయితే, 1623 మార్చి నాటికి Bilochpur దగ్గిర ఓడిపోయినప్పటికీ తెలివైనవాడు కావటం వల్లనూ ప్రజాభిమానం ఉన్నవాడు కావటం వల్లనూ Asaf khan అల్లుడు కావటం వల్లనూ కళ్ళు పీకించుకునే దుస్థితి రాలేదు, Udaipur వెళ్ళి Karan Singh II రక్షణలో ఉండి తండ్రి చావు అనే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు!మీకు మరొక చిత్రమైన విషయం చెబుతాను - ఇదే Mahabat Khan 1626లో సాక్షాత్తూ జహంగీరును పట్టి బంధించి 100 రోజుల పాటు  తన అధీనంలో ఉంచుకున్నాడు.ఇప్పుడు చెల్లెల్ని ఖైదు చేసి తన అల్లుణ్ణి పాదుషాను చేసిన Asaf khan కూడా అప్పుడు తప్పించుకున్న నూర్ జహాన్ చక్రవర్తినని ప్రకటించుకున్న Mahabat Khan చెర నుంచి భర్తను విడిపించుకోవడానికి వేసిన నాటకీయతతో నిండిన అత్యద్భుతమైన ప్రణాళికలో పాలు పంచుకున్నాడు - ఇందులోనే ఇమిడిన నవ్వు తెప్పించే మరొక టుమ్రీ వార్త ఏమిటంటే "a man who was governed by a woman is likely to suffer from unforeseen results" అని పొడి వేసి జహంగీరుని తన వైపుకి తిప్పుకునేశాట్ట Mahabat Khan!
అలా తోడబుట్టిన వాడి నయవంచనతో ఆనాటికే కాదు ఈనాటికీ తనతో పోల్చడానికి తగిన అత్యంత శక్తివంతమైన మహిళ లేదని చెప్పగలిగిన నూర్ జహాన్ ఒక్కత్తె మాత్రమే బ్రతికి ఉంది చీకటి ఖైదులో - ఈనాడు ప్రేమకు ప్రతిరూపమని కొనియాడబడుతున్న షాజహాను ఆనాటి 1628 జవరి 23న స్వయాన ఆజ్ఞలు జారీ చేసి చిన్న తమ్ముడు షహర్యారును చంపాడు, Dawar-Garshasp అనే ఇద్దరు మేనల్లుళ్ళని చంపాడు, ఖుస్రూ ఇద్దరు కొడుకుల్ని చంపాడు, చచ్చిపోయిన Daniyal Mirzaకి పుట్టిన Tahmuras-Hoshang అనే ఇద్దరు కొడుకుల్ని చంపాడు!
మా ముత్తాత అక్బరు వరకు బుద్దిమంతులే గాని  మా తాతగారు జహంగీరు,  మా తండ్రిగారు షాజహాన్ - అందరూ కుర్రవయసులో అధికారం కోసం కుటుంబసభ్యులతోనే పోరాడినవారే,ముసలి వయసులో తమ వలెనే తమ కొడుకులు కూడా అధికారం కోసం కుటుంబసభ్యులతోనే పోరాడుతుండటం చూసి వగచినవారే!
సిరి తా వచ్చిన వచ్చును నారికేళ సలిలము భంగి అన్న సత్యానికి బాబరు నుంచి అక్బరు వరకు గల మూడు తరాల ప్రభువుల ఉత్ధానం తార్కాణమైతే సిరి తా పోయిన పోవును కరి మ్రింగిన వెలగపండు వలె అన్న సత్యానికి జహంగీరు నుంచి ఔరంగజేబు వరకు గల మూడు తరాల ప్రభువుల పతనం తార్కాణమౌతుంది.అధికారంలోకి రావడానికి వాళ్ళనీ వీళ్ళనీ అడ్డు తొలగించడంలో చూపించిన కౌశలాన్ని పరిపాలనలో చూపించలేకపోవడం వల్ల జహంగీరు కాలంలో స్పష్టమై కనపడని లోపాలు షాజహాన్ కాలం వచ్చేసరికి కళ్ళకి కట్టినట్టు కనపడ్డాయి.ఎక్కడ పడితే అక్కడ మందిరాలు కట్టే పిచ్చిలోనూ కళ్ళు మిరుమిట్లు గొలిపే వజ్రాలను సేకరించడం అనే వెర్రిలోనూ ఉన్న షాజహాన్ అప్పటికి ఉన్న ఆరు సింహాసనాలు చాలవన్నట్టు వందలు వేల సంఖ్యలో రత్నాలూ వజ్రాలూ ముత్యాలూ పొదిగించి బంగారు తాపడాలు చేయించి నెమిలి సింహాసనాన్ని తయారు చేయించాలనే తిక్కలోనూ పడి ఖజానాని దాదాపు శూన్యం చేసేశాడు!
1630లో పర్షియన్ల నుంచి తను లాక్కున్న వాటిని 1649లో పర్షియన్లు తననుంచి లాగేసుకున్నారు.సైన్యం దాదాపు శూన్యమైపోయి సరిహద్దుల్ని కాపాడటం అటుంచితే, 1648 కల్లా రాజధానినే ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చుకోవలసి వచ్చింది.హతవిధీ, మొగలాయీ చక్రవర్తికి సైనికులని పోషించలేని దౌర్భాగ్యం కూడా దాపరించింది!
శరీరమూ మానసికమూ క్షీణించి 1658 నాటికి ఇక చక్రవర్తి అస్తమయం ఖాయం అని తెలిసే అనారోగ్యం మాటు వేసిన పులిలా షాజహాను మీదకి దూకింది. మా తండ్రిగారైన షాజహానుకు నలుగురు కొడుకులు - నేను పెద్దవాణ్ణి, Murad, Shuja, Aurangzeb నాకు తమ్ముళ్ళు.నేను పుట్టక ముందు పుట్టిన అందరూ ఆడపిల్లలే కావడంతో మా తండ్రిగారైన షాజహాను అజ్మీరులోని Hazrat Moinuddin Chishti దర్గాకు వెళ్ళి ప్రార్ధించిన తర్వాత పుట్టడం వల్ల ఆయనకు నేను వరపుత్రుడి నన్న భావన కలిగి ఉంటుంది.
సైనిక శిక్షణ కాక మిగిలిన విద్య Hazrat Miyan Mir అనే అత్యంత ప్రతిభావంతులైన ఇస్లామిక్ సన్యాసి వద్ద జరిగింది - అమృత సర్ నగరంలోని స్వర్ణ దేవాలయం యొక్క శంకుస్థాపన ఆయన చేతుల మీదుగానే జరిగిందంటే ఆయనెంతటి గౌరవనీయుడో మీరు అర్ధం చేసుకోవచ్చు!నాకు ఈ రెండు మతాలనూ ఐక్యం చెయ్యాలనే క్లోరిక కలగడానికీ సంస్కృతం నేర్చుకోవడానికీ కాశీలోని పండితశ్రేష్టుల సహాయం తీసుకుని 52 ఉపనిషత్తులనూ వేదాలనూ పురాణాలనూ యోగవాశిష్ఠ గీతాది శాస్త్రాలనూ పర్షియన్ భాషలోనికి అనువదించగలగడానికీ ఆయన ప్రభావమే కారణం.అయితే, మా ఔరంగజేబు అంత మతపిచ్చివాడు కావడానికి "స్వధర్మే నిధనం శ్రేయం" అనేది ప్రేరణ కావడం మీకు విచిత్రం అనిపించినప్పటికీ అది నిజం.ఎంతటి సంస్కారవంతమైన వాక్యం కూడా కొందరు అధములకి వారి కుసంస్కారానికి తగ్గట్టు అర్ధమవడం అన్ని ప్రాంతాలలోనూ అన్ని కాలాలలోనూ జరుగుతున్న అనివార్యమైన వైరుధ్యం - ఆధునికులు దీన్ని perspective difference అంటున్నారు.
ఒకే ఇంట పుట్టిన భిన్నధృవాలం Dara Shikoh, Muhi-ud-Din Muhammad అనబడు మేమిద్దరం - ఒకరు వీణావాదనలోనూ పుస్తకపఠనంలోనూ ఆనందిస్తూ మనస్సును ఉల్లాసపరుచుకుంటుంటే ఒకరు ఖడ్గచాలనంలోనూ ఆయుధ శిక్షణలోనూ నిమగ్నమై భూమ్యాకాశాలు దద్దరిల్లే అట్టహాసాలని వెలువరిస్తూ మనస్సును కఠినపరుచుకుంటూ ఉండేవారు.సా.శ 1642 నాడు మా తండ్రిగారు నాకు Shahzada-e-Buland Iqbal బిరుదును ఇచ్చినప్పుడే మిగిలిన ముగ్గురిలో ఈర్ష్య రగిలింది.పైకి మాత్రం మనసులోని భావాల్ని కనిపించనివ్వలేదు.
అది జరిగిన రెండు సంవత్సరాల తర్వాత ఒక నర్తకి నృత్యం చేస్తున్నప్పుడు చూసుకోక దుస్తులకి నిప్పు అంటుకోవడం మా పెద్దక్క జహనార చూసి త్వరపడి ఆర్పడానికి సాయం వెళ్ళి ఈమెయే గాయాల పాలైంది.ఆమె అంత ప్రమాదానికి గురైతే అందరూ ఆందోళన పడ్డారు, ఒక్క Muhi-ud-Din తప్ప - వాడిలా ఉండక మతనిష్ఠ విషయంలో ఔదార్యం చూపిస్తుంది గనక ఆమె కాఫిర్ వాడి దృష్టిలో, ఆ కాఫిర్ ఎప్పుడు చస్తుందా అని అనుక్షణం పళ్ళు కొరుక్కుంటూ బతుకుతున్నవాడు ఆ కాఫిర్ గాయాల పాలైతే అయ్యో అనుకుంటాడా!
వెంటనే కబురు పంపించినప్పటికీ మూడు వారాల తర్వాత వచ్చాడు,పోనీ వచ్చినవాడు ఆత్రుతతో జహనారని చూడటానికి వెళ్ళాడా?ఆంతరంగికులతో సభ దీర్చిన తండ్రి దగ్గిరకి పైనించి కిందకి దిగేసుకున్న సైనిక దుస్తులతో వెళ్ళాడు - పాదుషాకి కాలగూడని చోట కాలిపోయింది! ఇలాంటి చిన్న చిన్న అవిధేయతలతో 1652 CEల నాడు కొద్ది కాలం పాటు సింధ్ ముల్తాన్ల మీద ఉన్న గవర్నరు గిరీని కూడా పోగొట్టుకున్నాడు.అలాంటి శిక్షలని బుద్ధి తెచ్చుకుంటాడని వేస్తారు తండ్రులు, కానీ ఈ ధూర్తుడు మరింత పగని పెంచుకున్నాడు.పాత విషయాలని గుర్తు చేసుకుంటే మా తండ్రిగారు నామీద ప్రేమతోనూ వాడికి బలికాకూడదని నన్నెప్పుడూ కోటని దాటనివ్వకపోవడమూ అన్ని యుద్ధాలకీ వాడినే పంపించడమూ అనేది పెద్ద పొరపాటు అని ఇప్పుడు అనిపిస్తున్నది.నాకు సైన్యాన్ని నడిపించడంలోనూ యుద్ధవ్యూహాలు పన్నడంలో అపారమైన పాండిత్యం ఉన్నప్పటికీ వాడికున్న అనుభవం లేకపోవడమే చరిత్ర వాడికి అనుకూలమైన దిశకి నడవటానికి ముఖ్యమైన కారణం అయి ఉండవచ్చునని అనిపిస్తున్నది ఇప్పుడు.
అలా మొగల్ సింహాసనం చుట్టూ నలుగురు కొడుకులూ మొహరించి వున్న ఆనాటి 1657 CEలో మా తండ్రిగారు వ్యాధిగ్రస్తులయ్యారు.Murad Baksh గుజరాతులో ఉన్నాడు.Shah Shuja బెంగాలులో ఉన్నాడు.Muhiuddin దక్కనులో ఉన్నాడు.మొదటి ఎత్తు షుజా వేశాడు - స్వతంత్రించి తనకు తనే బెంగాలుకు చక్రవర్తిత్వం ప్రకటించుకున్నాడు.రాజధానిని పట్టుకోవడానికి సైన్యంతో ఆగ్రాకు వస్తున్నాడు.నేను మా తండ్రిగారి అనుమతితో నా పెద్ద కొడుకు Sulaiman Shukohను Raja Jai Singh ను తోడిచ్చి పంపించాను - ఇప్పటి బీహారులోని Bahadurpur వద్ద షుజా వోడిపోయాడు.ఇప్పుడు Muhiuddin అమోఘమైన ఎత్తు వేశాడు - సుజా లొంగుబాటును భూతద్దంలో పెట్టి చూపించి మురాదును తిరుగుబాటు చెయ్యమన్నాడు.ఇద్దరూ కలిసి నన్ను ఓడిస్తే మొత్తం సామ్రాజ్యాన్ని చెరి సగం చేసుకోవచ్చునని ఆశ పెట్టాడు.రాత పూర్వక ఒప్పందమేదీ లేని ఈ మోసగాడి లోపాయకారీ వాగ్దానాలకి ఉర్రూత లూగిన ఆ పిచ్చి మురాదు షుజాను అనుకరించాడు.
షుజా మీద యుద్ధం సగంలో ఉండటం వల్ల రాజా జై సింగ్ మిగిలిన సైన్యాన్ని Muhiuddin, Murad చేస్తున్న జమిలి దాడిని ఎదుర్కోవటానికి పంపించాడు.Malwa ప్రాంతంలోని Dharmat వద్ద మొగల్ సైన్యం ఓటమి పాలైంది - తొలి అపశకునం! ఈలోపున మా తండ్రిగారి ఆరోగ్యం బాగుపడి కోటకు వచ్చేశారు.ఇద్దరం కలిసి తిరుగుబాటును అణిచెయ్యాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది.వాళ్ళిప్పుడు ఆగ్రా వైపుకు వస్తున్నారు కాబట్టి నేను ముందు కదిలి కోట బయటనే వాళ్ళని ఎదుర్కోవాలి.మావాడు కోటలోని చాలామందిని ఎంతో కాలం ముందు నుంచే తన వైపుకి తిప్పుకున్నాడని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది.
అటువైపునుంచి జమిలిదాడిని వూహించకపోవటం వల్ల ప్రధాన సైన్యం బీహారులో ఉండిపోయింది.అయినప్పటికీ ఉన్న సైన్యం తక్కువ కాదు.Samugarh దగ్గిర ముఖాముఖి జరిగింది - వాళిద్దరు ఒకవైపు, అసహాయ శూరులైన రాజపుత్రులు నావైపు!పోరాట పటిమ, యుద్ధ కౌశలం, విజిగీష, లక్ష్యం పట్ల దీక్ష వంటి గెలుపుకు కావలసిన అన్ని హంగులూ నావైపే ఎక్కువ ఉన్నాయి.అయితే మురాద్ రాజపుత్రుల సేనాధిపతిని చంపడంతో పరిస్థితి కొంచెం మారింది - ఒక రాజ్యం నిలవాలంటే పౌరులూ రాజూ అవిభాజ్యం అయ్యి రాజు బలవంతుడైనప్పటికీ ప్రజలు బలహీనులైతేనూ ప్రజలు గుణవంతులై రాజు గుణహీనుడైతేనూ నశించిపోయినట్టు ఒక సైన్యం గెలవాలంటే సైన్యమూ నాయకుడూ అవిభాజ్యం అయ్యి వ్యూహరచనానిపుణుడైన నాయకుడు లేని సైన్యమూ సుశిక్షితులైన సైనికులు లేని నాయకుడూ ఓడిపోవటం ఖాయం!
అయినప్పటికీ పోరాటం నడుస్తూనే ఉంది.గెలుపు నావైపునే ఉంది. కానీ ఆ మోసగాడు నా సైన్యంలోని ఒక వ్యక్తిని కొనేశాడు, వెనక్కి తిరిగి పారిపోతున్నాట్తు నటిస్తున్నాడు. ఈలోపు వాడి పావు, "ప్రభూ, తమరు గజం మీద నుంచి కన్నా అశ్వం మీద నుంచి అయితే మరింత చురుగ్గా కదలగలరు" అనడంతో హౌదా మీద నుంచి దిగాను.సమయం కోసం చూస్తున్న ఔరంగజేబు పాదుషా వోడిపోయి వెనక్కి తిరుగుతున్నాడని హడావుడి చేశాడు, అంతే, వోడిపోతున్నామనుకున్న సైన్యం హుషారుగా రెచ్చిపోయింది, గెలుస్తున్నామనుకున్న సైన్యం దిగ్భ్రాంతితో చతికిల బడింది - ఫలితం తారుమారయింది!
అప్పటికీ నేను ధైర్యం కోల్పోలేదు,ఆశలు అడుగంటిపోలేదు - ఓటమిని ఒప్పుకోలేదు.మిత్రులను కలుపుకుని వెంట్రుకవాసిలో చేజారిన గెలుపుని తిరిగి అందుకోవడానికి సింధ్ వెళ్ళాను.అక్కణ్ణించి అజ్మీరు వెళ్ళాను.అక్కణ్ణించి లాహోరు వెళ్ళాను.ఈ దుర్భరమైఅన్ ప్రయాణం నా భార్యను దెబ్బ తీసింది.బోలన్ కనుమల దగ్గిర అస్తమించిన ఆమె హిందూస్థానంలోనే తన పార్ధివదేహం మట్టిలో కలవాలన్న కోరిక మేరకు లాహోరులోని Hazrat Miyan Mir సమాధి పక్కన ఆమె మృతదేహానికి సమాధిని కట్టాను.
ఈలోపు అక్కడ ఢిల్లీలో Muhiuddin చాలా కధ నడిపించాడు.ఆనాటి 1658 CE జూన్ మాసంలో Muhiuddin ఆగ్రాలో పాదుషా హోదాలోనే ఉన్న మా తండ్రిగారిని గృహఖైదు చేశాడు.మా పెద్దక్క జహనారా రాజ్యాన్ని నాలుగు భాగాలు చేసి పంజాబును నాకూ బెంగాలును షూజాకూ గుజరాతును మురాదుకూ ఇచ్చి మిగిలిన రాజ్యం మొత్తాన్ని తనకూ దఖలు పరుస్తూ పాదుషా తరపున ఒక సంధి ప్రతిపాదన చేసింది.రాజనీతి కన్న మతపిచ్చికి బానిసైన ఆ మూర్ఖుడు నన్ను కాఫిరు కింద జమకట్టి సంధిని తిరస్కరించాడు.
అసలు వాడికి సంధి ప్రతిపాదన మీద దృష్టి లేదు, యుద్ధం తనకు అనుకూలమైన దశలోనే మురాదును అడ్డు తొలగించుకోవటానికి చిత్రమైన వ్యూహం పన్ని ఉన్నాడు.మురాద్ సైన్యం చాలా బలమైనది, వాళ్ళ విధేయతను అంచనా కట్టని దుడుకుతనం చూపిస్తే తనే బలహీనుడు అవుతాడు.అందుకని మురాదు కున్న త్రాగుడు వ్యసనం మీద దెబ్బ కొట్టాడు - అతను త్రాగి వున్నప్పుడు తన సొంత సైనికుల్ని పంపించి పెడ ఎక్కలు విరిచి కట్టి సంకెళ్ళు వేసి Qila-i-Mubarakకు తరలించాడు.ఒక పావు సఫా, రెండు మిగిలాయి.షుజాతో ఇచ్చకాలు మాట్లాడి మంతనాలు జరిపి బెంగాలుకు పంపించాడు.నన్ను పట్టుకుని చంపటానికి సమయం తీసుకోవడానికే వాడలా చేశాడని నాకు తెలుసు, షుజాకీ తెలుసు.నాకోసం వేటాడుతూ Muhiuddin ఢిల్లీని వదలగానే షుజా ఢిల్లీని పట్టుకోవటానికి బయల్దేరాడు.Muhiuddin తన పెద్ద కొడుకు Muhammad Sultan అధ్వర్యంలో పెద్ద సైన్యాన్ని పంపించాడు.షుజా వాడికి తన కూతురును ఇచ్చి పెళ్ళి చేస్తానని బేరం పెట్టి తన వైపుకు తిప్పుకున్నాడు.కొడుకు చేసిన ద్రోహానికి రగిలిపోయి తనే స్వయంగా వచ్చి ఇద్దర్నీ ఓడించి పారేశాడు.మహమ్మద్ సుల్తాన్ దొరికాడు - బాబాయితో చేతులు కలపక ముందు వారసుడు అయినవాడు బాబాయితో చేతులు కలిపిన తర్వాత నేరస్తుడు అయ్యాడు!
అప్పుడు తప్పించుకున్న షుజా అరకాన్ ప్రాంతం చేరుకున్నాడు.అరకాన్ ప్రభువు ఆదరించాడు.కొన్ని నెలల తర్వాత ఆదరించిన ప్రభువును అంతం చెయ్యడానికి షుజా పన్నిన కుట్ర బయటపడటంతో అరకాన్ పాలకుడు షుజాను శిక్షించాడు - రెండు పావులు సఫా, నేను మిగిలాను. Ornament of the Throne అని అర్ధం వచ్చే Aurangzeb అన్న కొత్తపేరుతోనూ Conqueror of the World అని అర్ధం వచ్చే Alamgir అన్న కొత్తబిరుదుతోనూ పాదుషా అయిన వెంటనే మావాడు చేసిన మొదటి పని మురాదును గ్వాలియర్ కోట జైలుకు తరలించి అప్పుడెప్పుడో గుజరాతు గవర్నరు హోదాలో మురాదు ఒక దివానును శిక్షించిన సంగతి తెలుసుకుని అతని కొడుకు చేత ఉత్తుత్తి నేరారోపణ చేయించి ఉత్తుత్తి విచారణ చేసి మురాదును దోషిగా నిర్ధారించేసి అంతం చేసెయ్యడం!
1659 CE నాటికి నేను పర్షియా ప్రాంతం మీదుగా ఆఫ్ఘనిస్థాన్ చేరుకుని Malik Jiwan ఇంట తల దాచుకున్నాను.మా తండ్రి గారి చేత రెండు సార్లు శిక్షకు గురయ్యి రెండు సార్లు నాచేత ప్రాణాలు దక్కించుకున్నాడు.వయస్సులో చిన్నవాడైన Sipihr Shukoh శిక్షాభయం లేని కరుడు గట్టిన నేరస్థులకి కృతజ్ఞతలు ఉండకపోవచ్చునని అనుమానించి పదేపదే చెవినిల్లు గట్టుకుని పోరుతున్నప్పటికీ పెడచెవిన పెట్టిన అతి మంచితనంతో కూడిన తెలివితక్కువతనం వల్ల ఆనాటి అర్ధరాత్రి Malik Jiwan తన సైనికులతో దాడి చేసి మమ్మల్ని లొంగదీసుకుని ఢిల్లీకి తీసుకొచ్చి ఔరంగజేబు ముందు నిలబెట్టాడు!
నా అదృష్టం బాగుండి మావాడు చేసిన మోసాల్ని తట్టుకు నిలబడి ఉంటే చక్రవర్తి కావలసిన నేను Nawab Bakhtiyar Khan హోదా కోసం Malik Jiwan చూపించిన కృతఘ్నత దెబ్బకి మురికి పట్టి జిడ్డోడుతున్న Qila-i-Mubarak కారాగారంలో బందీని అయ్యాను - Mubarak అంటే అదృష్టం, ఎంత చిత్రమైన కాకతాళీయత!
సరే, రాజధానీ సభామందిరమూ సమస్తం మావాడి కుటిలనీతికి బాకాలు వూదేవాళ్ళతో నిండిపోయింది గాబట్టి నాకేవో గౌరవాలు దక్కుతాయని నేనూ అనుకోలేదు.కొందరు సభికులు గ్వాలియర్ జైలుకు మార్చమన్నారు,కొందరు సభికులు తన విజయానికి ముక్తాయింపు కింద నన్ను నగర వీధుల్లో వూరేగించమని అన్నారు.కానీ మానవత్వం ఏ కోశాన లేని మావాడి అసలైన ఆజ్ఞకి అందరికీ గుండెలు గుభేలు మన్నాయి - మురికి ఏనుగు మీద నన్ను కూర్చోబెట్టి నాకు చింపిరి దుస్తులు తొడిగి రాజవీదులలో తిప్పమన్నాడు!పై స్థాయిలో ఉన్నవాళ్ళకి ఉండే దురాశలూ కృతఘ్నతలూ లేని సామాన్య ప్రజానీకం నన్ను ఆ స్థితిలో చూసి తట్టుకోలేక ఏడ్చారు, ఔరంగజేబును సర్వనాశనం అయిపోవాలని తిట్టారు - ఒక్కరు కూడా తిరగబడలేదు,కారణం అధైర్యమో భీరుత్వమో కాదు, పక్కన ఉన్న సైనికుడి దూసిన కరవాలం వాళ్ళని ఆపింది.
ఇది ఔరంగజేబు వూహించనిది!ఇక నన్ను ప్రాణాలతో ఉంచితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని నిశ్చయించుకున్నాడు.Nazir అనే బానిసని ఎంచుకున్నాడు.వాడి తప్పుడు బుద్ధులకి నేను గతంలో చేసిన అవమానానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోమని ఎగదోశాడు.అది సా.శ. 1659 ఆగష్టు 30వ తేదీ నాటి రాత్రి.ఇంకా వంట పూర్తి కాలేదు.చీకటి గది తలుపు తెరుచుకుంది.నలుగురు భారీ మనుషులు అత్యంత లాఘవమైన కదలికలతో తలుపు తోసుకుని లోపలికొచ్చి మొదట చిన్నవాడైన Sipihr Shukohను పక్కకి లాగేశారు.అది నా హత్య కోసం జరిగిన కుట్ర అని అర్ధం కాక వాణ్ణి చంపుతారనే ఆత్రంతో అటు వెళ్తుంటే Nazir వెనక నుంచి నన్ను పొడిచేశాడు. ఔరంగజేబు లాంటి అనుబంధాలూ ఆప్యాయతలూ లేని క్రూరులకి అనుభవంలోకి రాదు గానీ నా దేహంలో గుచ్చుకున్న కత్తి చేసిన గాయం బాధ కన్న నా కొడుకు కళ్ళలో కదలాడిన అనంత కోటి భావాల్ని చూస్తూ వాడి ఆప్యాయతని అనుభవిస్తూ తనువు చాలించాను నేను - ఎంత గొప్ప చావు నాది!
ఇంతవరకు నాపట్ల చేసింది శత్రుశేషం ఉండకూడదన్న రాజనీతి అనుకుని సరిపెట్టుకోవచ్చు.కానీ, తర్వాత చేసిన పనులు చూస్తే వాణ్ణి సమర్ధించితే చాలు ఇతరమైన నేరాలు ఏవీ చెయ్యనివాణ్ణి కూడా వెంటనే మరణశిక్ష విధించి చంపెయ్యడంలో ఎలాంటి తప్పూ ఉండదనిపిస్తుంది మీకు.నా శిరస్సును దేహం నుంచి వేరు చేయించాడు.తన దగ్గిరకి తెప్పించుకుని పరకాయించి చూశాడు.అది నేనేనని ఖరారు చేసుకున్నాడు. Ai Bad-bakht (Ah wretched one)!” - ఇదీ నన్ను అలా చూసిన ఔరంగజేబు నోటినుంచి వచ్చిన మాట. తన కత్తితో మూడు గాట్లు పెట్టి నన్ను మరింత వికారం చేశాడు.నన్ను ఒక పెట్టెలో పెట్టి మా తండ్రిగారైన షాజహానుకు కానుక వలె పంపించాడు. ఏదో ఒకలా పంపించి సరిపెట్టుకోవడం కాదు, సమయ సందర్భాలను కూడా వివరించాడు - భోజన సమయంలోనే వెళ్ళాలి, ఆర్భాటమైన ప్రదర్శనతో అర్ధవంతమైన ప్రకటనతో అదరగొట్టెయ్యాలి,పాదుషా బ్రహ్మానంద భరితుదై ఉన్న సమయంలోనే పెట్టె మూత తెరవాలి!ఆగ్రా కోటలో బంధితుడైన మాజీ పాదుషా ముందరికి వెళ్ళిన వ్యక్తి, "Emperor Aurangzeb, your son, sends this box to let him (Shah Jahan) see that he does not forget him" అని అనేసరికి ఆయన మురిసిపోయి "Blessed be God that my son still remembers me" అంటూ పెట్టె మూత తెరిచాడు.తెరిచిన వాడు క్షణంలోనే స్పృహ తప్పి ముందుకు ఒరిగిపోయాడు.స్పృహలోకి వచ్చాక అసలు దుఃఖానికి తోడు తెచ్చినప్పుడు తాజాగా ఉండి గాలికి గడ్డ కట్టుకుపోయిన కొడుకు నెత్తురులో ఇరుక్కుపోయిన తన గడ్డాన్ని పీక్కోవాల్సి రావటం అనే కష్టం కూడా కలిసి ఆ పిచ్చి తండ్రి ఏడ్చిన ఏడుపు కూడా ఔరంగజేబుకు ముఖాన చిరునవ్వునే తెప్పించిందంటే ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది నాకు.
తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు మీరూ నేనూ కూడా జీర్ణించుకోలేనివి - అప్పటి వరకు నాకు విధేయులైన సైనికుల్నీ సర్దారుల్నీ మన్నించి సముచిత మర్యాదలు చేసి ఉన్నత పదవుల్ని ఇచ్చాడు, వాళ్ళూ సర్దుకుపోయారు - అప్పుడు పోరాడిందీ ఇప్పుడు పోరాడేదీ మొఘల్ సైంహాసనాధీశుడి కోసమే కదా!చిన్న కొడుకు Siphir Shukoh కూతురైన Zubatunnisaను Aurangzeb పెళ్ళి చేసుకున్నాడు,పెద్ద కొడుకు Suleiman Shukoh కూతుర్ని Aurangzeb కొడుకైన Akbar పెళ్ళి చేసుకున్నాడు.
మా తండ్రిగారూ నేనూ పైన మర్యాదస్తుల వలె పరిపాలిస్తూ రాజ్యపు ఆదాయం నుంచి కొంత మాత్రమే తీసి వనరులు సమకూర్చి పెడితే తను కింద ఉండి చేసిన యుద్ధాలలో గెలవడం వాడికి సమర్ధతను కట్టబెడితే తను స్వయాన పరిపాలిస్తూ చేసిన మూర్ఖపు యుద్ధాలు సంపదను హరించి శత్రువులను పెంచాయి.ఎనభై తొమ్మిదేళ్ళు బతికిన ఔరంగజేబు  తన మతపిచ్చితోనూ యుద్ధోన్మాదంతోనూ సా.శ. 1526 నుంచి సా.శ. 1658 వరకు నిండుకుండలా తొణికిస లాడిన మొఘల్ సామ్రాజ్యాన్ని తను చచ్చిన యాభై యేళ్ళు కూడా దాటకముందే కుక్కలు చింపిన విస్తరి అయ్యేలా చేశాడు!సా.శ. 1666లో తప్పించుకు పోయిన శివాజీ తన అహాన్ని దెబ్బ కొట్టడంతో పంతంతో చేసిన యుద్ధాలకు మరింత ఖర్చైంది, అయినప్పటికీ శివాజీ లొంగి రాక సంధి చేసుకుని మిగిలిన వాళ్ళకీ అలుసైపోయాడు ఔరంగజేబు.సా.శ. 1707లో వీడు చచ్చి వీడి కొడుకు తఖ్తు ఎక్కేనాటికి ఆ  Muazzamకే అరవయ్యయిదేళ్ళు. కొడుకులకి వయస్సు రాగానే పెళ్ళి చేసి ఆస్తులు పంచి పెత్తనం అప్పగించని తండ్రుల్నీ ఇనప్పెట్టెల నిండా డబ్బుండి కూడా కడుపు కట్టుకుని బతికే పరమ లోభుల్నీ "ఒరేయి, వీడు ఔరంగజేబురా." అని వెక్కిరించి నవ్వుకోవటానికి తప్ప ఇంకెందుకూ పనికి రాలేదు ఔరంగజేబు - ఎంత చెత్త బతుకు వాడిది!
శివాజీ మహరాజ్ కన్న మావాణ్ణి ఎక్కువ ఏడిపించినది గురు గోవింద్ సింగ్ - సా.శ. 1666 డిశెంబర్ 22న పుట్టిన ఈ మహనీయుడు సా.శ. 1699లో ఔరంగజేబు పైశాచికత్వాన్ని నిలువరించడానికి ఖాల్సాను స్థాపించి సా.శ. 1688 నుంచి సా.శ. 1705 వరకు 13 యుద్ధాలు చేసి అజేయుడై నిలిచాడు! సా.శ. 1705లో Muktsar యుద్ధం తర్వాత నాందేడుకు చేస్తున్న ప్రయాణంలో మరుసటి యుద్ధానికి వ్యూహం రచిస్తూ పక్కనున్న దయా సింగును, "How do you now want that Aurunga, the Emperor of India to be killed. By a arrow in the battle or by the tip of the mighty Kalam?" అని అడిగాడు.దానికి దయా సింగ్,"We had many battles now.Better to kill him in writing!" అని జవాబు చెప్పాడు.అప్పుడు మహామేధావి గురు గోవింద్ తన బుద్ధికి పదును పెట్టి రాసినదే ZafarNama.
1).The Lord is perfect in all faculties. He is Immortal and generous. He is the Giver of victuals and Emancipator.2).He is the protector and Helper; He is Compassionate, Giver of food and Enticer.18).Even if I had taken an oath on Quran in concealment, I would not have budged an inch from my place.45).I did not know that these oath-breakers were deceitful and flowers of Mammon.46).They were neither men of faith, nor true followers of Islam, they did not know the Lord not had faith in the prophet.47).He, who follows his faith with sincerity, he never budges an inch from his oaths.48).I have no faith at all in such a person for whom the oath of the Quran has no significance.49).Even if you swear a hundred times in the name of the Quran, I shall not trust you any more.50).If you have even a little of faith in God, come in the battlefield fully armed.76).You are strained by the oath of the Quran, therefore, fulfil the promise made by you.78).What, if you have killed my four sons, the hooded cobra still sits coiled up.79).What type of bravery it is to extinguish a few sparks of fire and fan the flames.81).I have also come from the abode of Your Lord, who will be the witness on the day of Judgement.86).The True and Merciful Lord does not love you, though you have unaccountable wealth.87).Even if you swear a hundred times by the Quran, I shall never trust you.106).You are proud of your kingdom and wealth, but I take refuge in the Non-Temporal Lord.107).Do not be careless about this fact that this saraae (resting place) is not the permanent abode.108).Look at the time-cycle, which is undependable; it gives a fatal blow to everything of this world.109).Do not oppose the lowly and helpless; do not break the oaths taken on the Quran.110).If God is friendly, what the enemy can do?, though he may be inimical in many ways.111).The enemy may try to give a thousand blows, but he cannot harm even one hair, (if God is friendly).
ఖురాను సూక్తులను ఉదహరిస్తూ ఔరంగజేబు లాంటి మూర్ఖుడికి కూడా వాటిని ఎలా అర్ధం చేసుకోవాలో అలా అర్ధం అయ్యే రీతిన వ్యాఖ్యానం చెప్తూ వ్రాసిన ఆ మహాకావ్యం దెబ్బకి జడుసుకున్న ఔరంగజేబుకు తల తిరిగి ముద్ద నోటికి వచ్చింది.చిన్నప్పుడు తాగిన తల్లిపాలు గుర్తుకు వచ్చాయి.మర్చిపోయిన గురువులు నేర్పిన నీతి పాఠాలు గుర్తుకు వచ్చాయి.బెంగతో భయంతో కక్కటిల్లిపోయి మంచం పట్టాడు!రాచతిండి తిని పెరిగిన ఒంట్లోని కొవ్వూ మతపిచ్చి వల్ల రగిలిన తల్లోని అగ్గీ కరిగి కరిగి చల్లబడి చల్లబడి "I came alone and I go as a stranger. I do not know who I am, nor what I have been doing","I have sinned terribly, and I do not know what punishment awaits me.",“I entirely lacked in ruler-ship and protecting the people. My precious life has passed in vain. God is here, but my dimmed eyes do not see his splendor.” అని ఒక ఏడుపుగొట్టు ఉత్తరం వ్రాసి చచ్చాడు!
మా తరానికి వీడిలాంటివాడు అంతకుముందు పుట్టలేదని తెలిసింది గానీ ఇకముందు కూడా పుట్టడని అనుకుంటే మీ తరంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యడుగూరి సందింటి జగన్మోహన రెడ్డి మనస్తత్వంలోనూ ప్రవర్తనలోనూ మూడు మూర్తులా ఔరంగజేబునే గుర్తుకు తెస్తున్నాడు నాకు.పుట్టుక అలానే ఉంది, పెంపకం అలానే ఉంది, ఉత్ధానం అలానే ఉంది, వైభవం అలానే ఉంది, అనుచరులూ అభిమానులూ మంత్రులూ సామంతులూ అలానే ఉన్నారు, పాలన అలానే ఏడ్చింది, పతనం కూడా అలానే తగలడుతుంది కాబోలు!
ఔరంగజేబు చావు తర్వాత మొగలాయిల చరిత్ర శరవేగాన పరిగెత్తింది - 07).1707 A.D. నుంచి 1712 A.D. వరకు Muazzam గాడు Bahadur Shah పేరుతో పరిపాలించాడు - రాజపుత్రులతో మరాఠాలతో బుందేలులతో compromise and conciliation పద్ధతి పాటించి యుద్ధాల్ని తప్పించుకున్నాడు, 08).1712 A.D. నుంచి 1713 A.D. వరకు Jahandar Shah పరిపాలించాడు - వీడు మరీ సన్నాసి,మంత్రులు చెప్పినదానికి గొర్రెలా తలూపడం తప్ప స్వంత ప్రజ్ఞ లేదు, 09).1713 A.D. నుంచి 1719 A.D. వరకు Farrukhsiyar పరిపాలించాడు - వీడు మరీ మరీ సన్నాసి, Sayyid brothers పెత్తనం కింద కుక్కలా పడివుండడం తప్ప స్వంత ప్రజ్ఞ లేదు, కాస్త రోషం పొడుచుకొచ్చి తల యెత్తేసరికి Sayyid brothers కుర్చీనుంచి దించేశారు, 10).1719 A.D. నుంచి 1748 A.D. వరకు  Mohammad Shah పరిపాలించాడు - తల యెత్తిన Farrukhsiyar బదులు Sayyid brothers కుర్చీలో ఎక్కించిన పద్ధెనిమిదేళ్ళ కురాడు వీడు, Sayyid brothers కూర్చోమంటే కూర్చోవడం నుంచోమంటే నుంచోవడం తప్ప ఏమీ తెలియని వీడి వాలకం అలుసైపోయి Hyderabad, Bengal, Awadh, Rohilkhand సామంతులు స్వతంత్రం ప్రకటించుకోలేదు గానీ భయాన్నీ భక్తినీ తగ్గించుకున్నారు, 11).1748 A.D. నుంచి 1754 A.D. వరకు Ahmad Shah పరిపాలించాడు - 1739లో నాదిర్ షా దెబ్బకి Sayyid brothersతో సహా Mohammad Shah కుదేలయ్యి కోహినూరునూ నెమిలి సింహాసనాన్నీ పోగొట్టుకుని ఢిల్లీ నగరం పొలిమేరలకి కుదించుకు పోయిన మొఘల్ సామ్రాజ్యపు సింహాసనం మీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న అనామకుడు వీడు, 12).1754 A.D. నుంచి 1759 A.D. వరకు Alamgir II పరిపాలించాడు - కోహినూరునూ నెమిలి సింహాసనాన్నీ పోగొట్టుకుని ఢిల్లీ నగరం పొలిమేరలకి కుదించుకు పోయిన మొఘల్ సామ్రాజ్యపు సింహాసనం మీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న అనామకుడు వీడు, 13). 1759 A.D. నుంచి 1806 A.D. వరకు Shah Alam II పరిపాలించాడు - ఢిల్లీ నగరం పొలిమేరలకి కుదించుకు పోయిన మొఘల్ సామ్రాజ్యపు సింహాసనం మీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న అనామకుడు వీడు, 14).1806 A.D. నుంచి 1837 A.D. వరకు Akbar II పరిపాలించాడు - మొఘల్ సామ్రాజ్యపు సింహాసనం మీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న అనామకుడు వీడు, 15). 1837 A.D. నుంచి 1857 A.D. వరకు Bahadur Shah II పరిపాలించాడు - కోడి పోయి కత్తివచ్చె డం డం డం అన్నట్టు వచ్చిపడిన కొత్త దొరల మీద తిరగబడటం కోసం భారత సైనికులు మొగలాయీ వంశం మీద అభిమానం కొద్దీ ఉత్సవ విగ్రహం హోదా ఇస్తే పుచ్చుకుని ముడుచుకుని మూలన కూర్చున్న మూడు కాళ్ళ ముసలాడు, కొత్త దొరలు తిరుగుబాటును అణిచి వెయ్యడంతో కొండ నాలిక్కి మందేస్తే ఉన్న నాలిక వూడినట్టు జైలు పాలై కొంత కాలం తర్వాత వీడికి ప్రాప్తించిన దిక్కు లేని చావుతో మొగలాయీ వంశం కధావశిష్టం అయిపోయింది.
సకలప్రాణులను ఒక్కరీతిన చూడగల మితమైన మతమే ఎల్లరకు హితం అనేది వ్యాసపరాశరాదిసత్యసాయిపర్యంతం ఉన్న ఆచార్యపరంపర పాదాల మీద ప్రమాణం చేసి మూడు కాలాలనూ ముడివేసి చూడగలిగిన నేను చెబుతున్న పరమ సత్యం!ఏది సత్యమైనదో అదే శివమైనదీ అవుతుంది!ఏది శివమైనదో అదే సుందరమైనదీ అవుతుంది!
సత్యం శివం సుందరం!!!

11 comments:



  1. హరిబాబుగారు, మీ మాట మీదే నమ్మకం. నా వివరాలేం అక్కరలేదు. అక్కౌంట్ నంబర్ మీ బ్లాగ్ లో పెట్టండి. నేను సొమ్ము పంపుతున్నాను,ఆ అక్కౌంట్ కి. త్వరితంగా అక్కౌంట్ నంబర్ పెట్టగలరు.

    ReplyDelete
    Replies
    1. ప్రస్తుతం మనీ ట్రాన్స్ఫరు కోసం ఎక్కవుంట్ ఏ పద్ధతిలో క్రియేట్ చెయ్యాలో ఆలోచిస్తున్నారు.అది పూర్తి కాగానే తెలియజేస్తాను.

      Delete
  2. I don't like giving my phone number to whatts app group

    ReplyDelete
  3. No account number so far. Expedite

    ReplyDelete
  4. హరిబాబు గారు!! ఆవకాయ వెబ్సైట్ shutdown అయిందాండి. మీరు ఆ వెబ్సైట్ లో కొన్ని వ్యాసాలు వ్రాశారు!!

    ReplyDelete
    Replies
    1. లేదండీ!
      అయితే ఒకటి జరిగి వుంటుంది.ఆవకాయ వెబ్సైటును ణడిపే రఘోత్తమ రావు గారే realnews అని మరొక వెబ్సైటును కూడా నిర్వహిస్తున్నారు.ఇప్పుడు కొత్త వ్యాసాలను అక్కడే వేస్తున్నాను.బహుశః కొత్త వెబ్సైటు పని ఒత్తిడి వల్ల పాత వెబ్సైటును పక్కన పెట్టి ఉంటారు.లేదంటే,పాతదాన్న్ని ఆపేసి కొత్తదాన్ని మొదలుపెట్టి ఉండొచ్చు.ఆ సాంకేతిక వివరాలు నాకు తెలియవు గానీ ఇప్పుడు నా కొత్త వ్యాసాలు realnews దగ్గిర చదవవచ్చును.
      ఇట్లు
      హరి.S.బాబు

      Delete
    2. This is the real nrews link
      http://realnews.co.in/

      Delete
    3. And myn new topic there:
      http://realnews.co.in/%e0%b0%86%e0%b0%a7%e0%b1%81%e0%b0%a8%e0%b0%bf%e0%b0%95-%e0%b0%86%e0%b0%82%e0%b0%a7%e0%b1%8d%e0%b0%b0-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%aa%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%95%e0%b1%80/

      Delete
    4. నమస్కారం హరిబబు గారు!!
      ఆవకాయ లాగా దురద్రుష్టవశాత్తు ఈ రియల్ న్యూస్ అనే వెబ్సైటు కూడా మూతపడినదనుకుంటానండి. మీరు పంపిన లింక్ ఒపెన్ అవడం లేదు

      Delete
    5. అవునండీ!ఈ మధ్యనే నిర్వాహకులు నాకు మెస్సెంజర్ యాప్ నుంచి ఆ విషయం చెప్పారు.

      ఏం చేద్దాం!అలాంటి పేజీల్ని నిర్వహించడం చాలా కష్టం.

      Delete

సందర్శకులకి నమస్కారం.
అందరూ వ్యాఖ్యల్ని నమోదు చేయవచ్చు,ఏ విషయానికి సంబంధించి అయినా మంచి సమాచారం అందించే వ్యాఖ్యల్ని నిరభ్యంతరంగా నమోదు చేయవచ్చు. మోడరేషన్ ఉంది, భాష సభ్యతాయుతంగా ఉంటే విషయం ఎలా ఉన్నా అభ్యంతరం లేదు.మీ మంచి వ్యాఖ్యలతో మంచి టపాలు వేసే విధంగా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.మీరు నానుంచి వివరణ ఆశిస్తే వీలయినంత ముందుగానే అడగండి.కొత్త పోష్టు వెయ్యగానే పాతవి ఆగ్రిగేటరు నుంచి పోతాయి గదా!
భవదీయుడు
హరి.S.బాబు

శ్రమ దోపిడీ గురించి ముప్పాళ రంగనాయకమ్మ గారి లోతైన పరిశీలన బెత్తెడు లోతు కూడా లేదేంటీ!

ఎలక్టొరల్   బాండ్స్   గురించి   మార్చి  31 న  " సుప్రీం   కోర్టు   తీర్పు   సంస్కరణేనా ?" అని   లోక్   సత్తా   జయప్రకాశ్   ఒక   వ్...