Thursday 20 August 2020

గంగ పుట్టిన గడ్డ ఇదిరా! గంగకే కడగ శక్తిలేని ఘనపాపరాశిని మోస్తున్న బుద్ధి లేని గడ్డ ఇదిరా!

 పల్లవి:గంగ పుట్టిన గడ్డ ఇదిరా!

గంగకే కడగ శక్తిలేని

ఘనపాపరాశిని మోస్తున్న 

బుద్ధి లేని గడ్డ ఇదిరా!


చరణం:పుణ్యమార్జించబోవు

గుడి గోపురాలును

గ్రుంకెడి తీర్ధాలును

పాపచింతకుల నెలవు లయిన

సిగ్గు లేని గడ్డ ఇదిరా!

||ప||

చరణం:రైతుల కడగండ్లను

దీర్చుట మాని రైతులకు

రిస్టు వాచిలేల మంచి బట్టలేల

యను తిండి దండగ వెధవలు

రాజత్వ మాశించెడి

రోగిష్టి గడ్డ ఇదిరా!

||ప||

చరణం:అడిగినంత ఇచ్చేటి

విశ్వమ్మును విష్ణుదేవుండును

తోడనే యుండగ మందబుద్ధులై

పరుల మెచ్చుకోళ్ళ కెగబడు

బానిసీడుల పోతుగడ్డ ఇదిరా!

||ప||

చరణం:తన్ను దోచెడి దొరలను

తన్ని కూర్చుండ బెట్టక

నెత్తిన మోసి యాతనలు పడు

మందబుద్ధుల రోతగడ్డ ఇదిరా!

||ప||

Thursday 6 August 2020

ఆధునిక ఆంధ్ర దేశపు రాజకీయ భేతాళ పంచ వింశతిక అనబడు ఫ్యాక్షనిజం యొక్క గుట్టుమట్లు రట్టు!

ఒక వింతైన విషయం ఏమిటంటే, ఇవ్వాళ తమిళ జాతీయత ఉన్నవారు తప్ప ఇతరులు అధికారంలోకి రావడానికి కుదరని తమిళనాడును ఆధునిక కాలంలోని ప్రధమ దశలో తమిళేతర పాలకులు ఎక్కువమంది పరిపాలించారు.ఇంగ్లీషువాళ్ళు ఏర్పాటు చేసిన Madras Presidencyకి మొదటి ముఖ్యమంత్రి (01) ఆగరం సుబ్బరాయలు రెడ్డియార్ గారు దక్షిణ ఆర్కాటు జిల్లా/ప్రావిన్సు వాస్తవ్యుడైన తెలుగు జాతీయత ఉన్న రెడ్డి కులానికి చెందిన వారు.అప్పటికి ఎన్నికలు అంటే ఏమిటో తెలియదు గాబట్టి Frederic Thesiger చేత నియమితులై 1920 డిసెంబర్ 17 మొదలు 1921 జులై 11 వరకు పరిపాలించడంతో ఆధునిక కాలంలో తెలుగువారి ప్రభుత్వాధికారమూ రాజకీయ వైభవమూ మొదలైంది.

ఆయన తర్వాత (02)రాజా సర్ పానగంటి రామరాయనింగార్ అనే పానగల్లు రాజావారు S.I.L.F పార్టీ తరపున 1921 జులై 11 మొదలు 1923 సెప్టెంబర్ 11 వరకు ఒకసారి, 1923 నవంబర్ 19 మొదలు 1926 డిసెంబర్ 03 వరకు ఒకసారి ఇప్పటి ముఖ్యమంత్రికి సమానమైన హోదాని అలంకరించారు.పానగల్లు రాజావారు కాళహస్తిలో పుట్టారనీ తెలుగు పద్మనాయక వెలమ కులస్థులనీ తెలుస్తున్నది.ఇప్పుడు అవసరం కాబట్టి ప్రస్తావిస్తున్నాను గానీ అప్పట్లో కులం ఇంత పిచ్చి కింద మారలేదు.అదీగాక ఉన్నది తమిళ ప్రాంతం కాబట్టి పెరియార్ భావజాలం పనిచేస్తున్న కాలంలో బ్రాహ్మణ వ్యతిరేక ఆర్య ద్రవిడ శత్రుభావన ప్రబలినప్పుడు కూడా తెలంగులూ తమిళులూ కూడా ద్రవిడ వారసత్వం పేరున కలిసి మెలిసి ఉండేవాళ్ళు.

మధ్యలో 1926 డిసెంబర్ 04 మొదలు 1930 అక్టోబర్ 27 వరకు పరమశివన్ సుబ్బరాయన్ గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయ్యారు.మామూలుగా అయితే, పానగల్లు రాజావారికీ బొల్లిన మునుస్వామి నాయుడు గారికీ మధ్యలో ఈయన వచ్చేవాడు కాదు. అప్పటి తమిళనాడు రాజకీయ రంగం జస్టిస్ పార్టీ, స్వరాజ్య పార్టీ అనే రెండు పార్టీల చుట్టూ తిరుగుతూ వుండేది.స్వరాజ్య పార్టీ పూర్తి పేరు Congress-Khilafat Swaraj Party - చౌరీ చౌరా సంఘటన జరిగాక గాంధీ ఉద్యమాన్ని ఆపెయ్యడంతో విసుగు పుట్టి ఏర్పాటు చేసిన పార్టీ.పేరు తేడా తప్ప తీరు తేడా లేని జస్టిస్ పార్టీ, స్వరాజ్య పార్టీ అనే రెండూ బ్రాహ్మణేతర కులాల భూస్వాముల పార్టీలు.1926 నవంబర్ 08 ఎన్నికల ఫలితాల తర్వాత జస్టిస్ పార్టీ 21 సీట్లనూ స్వరాజ్ పార్టీ 41 సీట్లనూ గెల్చి స్వరాజ్ పార్టీ coalition government ప్రతిపాదనకి నిరాకరించడంతో గవర్నర్ రెండు పార్టీల్లో పార్టీకీ చెందని సుబ్బరాయన్ గార్ని ముఖ్యమంత్రిని చేశారు.

అయితే, 1930 నాటికి జస్టిస్ పార్టీ పుంజుకుని ఈసారి (03) బొల్లిన మునుస్వామి నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు.చిత్తూరు జిల్లాలోని తిరుత్తణి ప్రాంతం వారిది. ఇవ్వాళ గౌరవం కోసం అన్ని కులాల వారూ పెట్టుకుంటున్నప్పటికీ రాయణం అనే పదం నుంచి వచ్చిన రావు అనేది వెలమలకు మాత్రమే అధికారికమైన బిరుదు.రాయుడు అనే పదం కూడా రాయణం అనే పదానికి వికృతి అవుతుంది గాబట్టి అది కూడా వెలమలకు మాత్రమే అధికారికమైన బిరుదు.అలాగే నాయుడు, చౌదరి అనేవి కమ్మ కులానికి మాత్రమే అధికారికమైన బిరుదులు.ఇది 15 శతాబ్దికి చెందిన ముసునూరి ప్రోలయ నాయకుడి వరసలోని వారికి ఉన్న నాయకుడు అన్న దానికి వికృతి. ఇవ్వాళ్టి వారికి తెలియదు గానీ ఒకప్పుడు వీటి వాడకం పట్ల పంతాలూ పట్టింపులూ కూడా వుండేవి.తర్వాత కాలంలో తమిళులు నాయకర్ అని మార్చిన వారు కూడా కమ్మ కులస్థులే!అప్పటి మదరాసు రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా సరిహద్దులు ఇప్పటి చిత్తూరు జిల్లా సరిహద్దుల కన్న భిన్నమైనవి.మునుస్వామి నాయుడు గారు గారు రైతు కుటుంబం నుంచి వచ్చారు. పార్టీలోని అంతర్గత కుమ్ములాటల వల్ల రెండేళ్ళకే పదవి నుంచి దిగిపోయిన మునుస్వామి నాయుడు గారు 1930 అక్టోబర్ 27 మొదలు 1932 నవంబర్ 04 వరకు ముఖ్యమంత్రిత్వం నిర్వహించారు.

మునుస్వామి నాయుడు గారు దిగిపోగానే అదే జస్టిస్ పార్టీకి  చెందిన (04) రామకృష్ణ రంగారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు.ఈయన బొబ్బిలి రాజకుటుంబానికి చెందిన వ్యక్తి.అప్పుడు బొబ్బిలి రాజావారి దగ్గిర పర్సనల్ సెక్రటరీ పనిచేసిన C.N.Annadurai గారు కూడా తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అయ్యారు.1932 నవంబర్ 05 31 యేళ్ళ వయస్సులో ముఖ్యమంత్రి అయిన బొబ్బిలి రాజావారు మధ్యలో ఒక నాలుగు నెలల ఇంగ్లాండు ట్రిప్పును మినహాయిస్తే 1937 ఏప్రిల్ 01 వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికల్లో జస్టిస్ పార్టీ యొక్క ఘోర పరాజయానికి కారకు లయ్యారు!

ఎన్నికల్లో వోడిపోయినప్పటికీ 1937 ఎన్నికల తర్వాత అదే జస్టిస్ పార్టీకి చెందిన ద్రక్షారామానికి చెందిన తెలగ కాపు జమీందారు (05) రావు బహదూర్ సర్ కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు.దానికి కారణం, బొబ్బిలి రాజావారి భీబత్సమయిన పరిపాలన దయచేత మెజారిటీ సీట్లు గెల్చుకున్నప్పటికీ కీలకమైన వీటో పవర్ గవర్నరు చేతుల్లో ఉండటం వల్ల అవమానం పాలు కావలసి వస్తుందని వూహించి Indian National Congress ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి విముఖత చూపించింది.దాంతో అప్పటి మద్రాసు రాష్త్ర గవర్నర్ Lord Erskine చొరవ తీసుకుని 1937 ఏప్రిల్ 01 ఈయన్ని ముఖ్యమంత్రిని చేశారు.ఈయన జస్టిస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు.

కె.వి.రెడ్డి నాయుడు గారి తర్వాత 1937 జులై 14 మొదలు 1939 అక్టోబర్ 29 వరకు కాంగ్రెసు పార్టీ తరపున చక్రవర్తి రాజగోపాలాచారి గారు మొదటి తడవ ముఖ్యమంత్రి అయ్యారు.రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు కాంగ్రెసు పార్టీ తన మంత్రివర్గాలను ఉపసంహరించుకోవడం వల్ల రాజాజీ కూడా ముఖ్యమంత్రిత్వం వదిలేశారు.1939 అక్టోబర్ 29 మొదలు 1946 ఏప్రిల్ 30 వరకు బ్రిటిష్ ప్రభుత్వం తరపున మద్రాసు గవర్నరు గారు పరిపాలించారు.

యుద్ధం ముగిసిన తర్వాత కాంగ్రెసు పార్టీ తరపున ఎన్నికై 1946 ఏప్రిల్ 30 మొదలు 1947 మార్చి 23 వరకు (06)ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రి అయ్యారు.ఈయన రాజమండ్రి నగరానికి చెందిన బ్రాహ్మణ కులస్థుడు.1937 ఎన్నికల్లో గెలుపు తర్వాత కాంగ్రెసు పార్టీ ప్రకాశం గార్ని ఒప్పించి రాజకీయ పునర్వైభవం కోసం ఎదురు చూస్తున్న రాజాజీని ముఖ్యమంత్రిని చేసింది.అప్పుడు ప్రకాశం గారు రెవెన్యూ శాఖను తీసుకుని చాలా విప్లవాత్మకమైన పనులు చేసి మంచి పేరు  తెచ్చుకున్నారు.అప్పుడు స్వంత అర్హతా పార్టీ సపోర్టూ ఉండి కూడా గాంధీకి వియ్యంకుడైన రాజాజీకి ముఖ్యమంత్రిత్వాన్ని కట్టబెట్టడం వల్ల దక్కని ముఖ్యమంత్రిత్వం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కాంగ్రెసు ప్రభుత్వం నుంచి వైదొలగి యుద్ధం పూర్తయ్యాక మళ్ళీ ఎన్నికల్లో గెల్చి ఏర్పాటు చేసిన ఇప్పటి కాంగ్రెసు ప్రభుత్వంలో దక్కింది.

ప్రకాశం పంతులు గారి తర్వాత వచ్చిన (07) ఒమందూర్ రామసామి రెడ్డియార్ గారు కూడా తెలుగు జాతీయత ఉన్న రెడ్డి కులానికి చెందినవారే.1947 మార్చి 23 మొదలు 1949 ఏప్రిల్ 06 వరకు ముఖ్యమంత్రిత్వం నిర్వహించారు. రామసామి రెడ్డియార్ గారి తర్వాత (08) పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా గారు 1949 ఏప్రిల్ 06 మొదలు 1950 జనవరి 26 వరకు ఇంగ్లీషువాళ్ళు ఏర్పాటు చేసిన మద్రాసు ప్రెసిడెన్సీకి ఆఖరి ముఖ్యమంత్రిగానూ 1950 జనవరి 27 మొదలు 1952 ఏప్రిల్ 09 వరకు భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్రాసు రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగానూ పనిచేశారు.ఈయన పూసపాటి రాజకుటుంబానికి చెందిన తెలుగు వారు.ఈయన లాంటి నిస్వార్ధపరులు ముఖ్యమంత్రులు కావడాన్ని సహించలేని ఆంధ్ర-తమిళ భూస్వాముల కుట్ర రాజకీయమే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించడానికి ఒక ముఖ్య కారణం.

ప్రకాశం పంతులు గారికన్న ముందు రాజాజీ ముఖ్యమంత్రి అయిన కాలం నాటికే జస్టిస్,స్వరాజ్య పార్టీలు వెనకబడి పోయి కాంగ్రెసు బలం పుంజుకున్నది. అయితే చేజారిన అధికారం తిరిగి చేజిక్కించుకునేందుకు వారు ఆశ్రయించిన సంస్కృతీ ప్రభావం వల్ల ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న వికృతమైన ద్రవిడ భావజాలం మొత్తానికి ఆనాటి జస్టిస్, స్వరాజ్య పార్టీల తరపున హడావిడి చేసిన తమిళ భూస్వామ్య వర్గపు నాయకులే పునాదులు వేశారు.1949లో కుమార స్వామి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు చాలా గొడవలు జరిగాయి.ఒమందూర్ రామసామి రెడ్డియార్ గారు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు కానీ పార్టీలో పట్టు గానీ ప్రజాభిమానం గానీ లేదు. పరమశివన్ సుబ్బరాయన్ గారు కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు కానీ పార్టీలో పట్టు గానీ ప్రజాభిమానం గానీ లేదు.వాళ్ళిద్దరితో నడుస్తున్న ముక్కోణపు పోటీలో ఒకసారి ఒమందూర్ రామసామి రెడ్డియార్ గారు కుమారస్వామి గారికి తనను సపోర్టు చెయ్యమని బేరం పెట్టినప్పటికీ కుమారస్వామి గారు తిరస్కరించి పార్టీ సభ్యుల నుంచి మెజారిటీ తెచ్చుకుని ముఖ్యమంత్రి అయ్యారు.

సాధారణంగా జమిందార్లూ రాజకుటుంబీకులూ అంటే భోగలాలసులూ నియంతలూ అని మనకున్న మూఢనమ్మకాలకి పూర్తి వ్యతిరేకం ఆయన ప్రవర్తన.ఇప్పటికీ అద్భుతం అనిపించే ఆయన చెసిన విపవాత్మకమైన సంస్కరణలలో కొన్ని - న్యాయవ్యవస్థని కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి వేరు చేసి స్వతంత్రీకరించటం, హరిజన సంక్షేమం కోసం ప్రత్యేకమైన ప్రభుత్వ శాఖను ఏర్పాటు చెయ్యటం, సంపూర్ణ మధ్యనిషేధాన్ని అమలు చెయ్యటం.ఈరోజున మిగిలిన అన్ని రంగాల్లో భ్రష్టత్వం పెరిగినప్పటికీ న్యాయవ్యవస్థ ఒక్కటి చెడిపోకపోవటం వల్లనే కదా ప్రజలు ఈమాత్రం ధైర్యంగా ఉన్నది!

ఇతర రాష్ట్రాల వారికి కూడా మద్రాసు రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన ఉదాహరణ కింద నిలబెట్టిన కుమారస్వామి రాజా గారు 1952 జనవరిలో 18 వోట్ల తేడాతో ఓడిపోయాడంటే విచిత్రం కాదూ!విచిత్రం దేనికి?ఈనాడు మన కళ్ళ ముందు తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకుని కేవలం అయిదేళ్ళ కాలంలో 46 వేల కోట్ల ప్రజాధనాన్ని బొక్కేసినవాడు 151/175 మెజారిటీని సాధించి ముఖ్యమంత్రి అయ్యాడంటే అది సహజమైన గెలుపేనని కొందరు నమ్ముతున్నప్పుడు ఆనాడు కుమారస్వామి రాజా గారు గారు 1952 జనవరిలో 18 వోట్ల తేడాతో ఓడిపోయాడంటే నమ్మలేకపోవటానికి అందులో అంత విచిత్రం ఏముందీ!

ఇప్పటి అందరు నాయకుల్లాగానూ అప్పటి కొందరు నాయకుల్లాగానూ పదవి పోయిందని బెంగెట్టుకు చావలేదు - ఎలక్షన్ కమిషనర్ ఫోన్ చేసినప్పుడు మంచి నిద్రలో ఉన్నారు, వార్త విని ఫోను పెట్టేసి మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు!తెల్లారి పొద్దున్న ఈయనెక్కడ మొహం వేళ్ళాడసుకుని కనిపిస్తాడో చూసి తరిద్దామని వచ్చిన జర్నలిస్టులకి ఈయన నవ్వుమొహం చూసి మతిపోయింది. అలాంటి సందర్భాల్లో మీడియా వాళ్ళు ఇప్పటికీ అడుగుతున్న "మీ వోటమికి కారణాలేమి"టనే రొడ్డ కొట్టుడు ప్రశ్నకి "I am not wanted by my constituency; and what else could be the reason?" అని నవ్వుతూ జవాబు చెప్పారంటే ఆశ్చర్యంగా లేదూ!ఇంకా విచిత్రం ఏమిటంటే, తర్వాత సొంత భవంతిని గాంధీ కళా మండపం ఏర్పాటు చెయ్యడానికి ఇచ్చేసి చిన్న ఇంటిలోకి మారి కూడా ఆనందంగానే బతికారు!

పూసపాటి సంజీవి కుమారస్వామి రాజా గారి తర్వాత 1952 ఏప్రిల్ 10 మొదలు 1954 ఏప్రిల్ 13 వరకు చక్రవర్తి రాజగోపాలాచారి గారు మద్రాసు రాష్ట్రానికి రెండవ విడత ముఖ్యమంత్రి అయ్యారు.రాజాజీ గారి మొదటి విడత ముఖ్యమంత్రిత్వం కొందరు తమిళ రాజకీయ నాయకుల్లోనూ కొందరు తమిళ విద్యాధికుల్లోనూ హిందీ పట్ల వ్యతిరేకతను పెంచి ద్రవిడ జాత్యహంకారాన్ని పెంచితే రాజాజీ గారి రెండవ విడత ముఖ్యమంత్రిత్వం కొందరు తెలుగు రాజకీయ నాయకుల్లోనూ కొందరు తెలుగు విద్యాధికుల్లోనూ తమిళం పట్ల వ్యతిరేకతను పెంచి తెలుగు భాషాభిమానాన్ని పెంచింది.కోస్తా తీర ప్రాంతం వారూ రాయలసీమ వారూ భాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదం ప్రకారం ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించుకోవటం కోసం ఆందోళన మొదలు పెట్టారు.

ఉద్యమకారులు అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ రాజాజీ ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన రాలేదు.ఒకవైపున తమిళులు తెలుగువాళ్ళు మెజార్టీ అయిన వూళ్ళ పేర్లని కూడా తమిళంలో బోర్డులు పెట్టి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెలుగు భాషనీ జాతినీ నేతల్నీ అవమానిస్తూ సామాన్య ప్రజలు సైతం ఆంధ్ర రాష్ట్ర వాంచతో రగిలిపోతున్న కాలంలో ఆంధ్రకి చెందిన నలుగురు దొంగలు మాత్రం రాజాజీ నాడారు లాంటివాళ్ళతో తిరుగుతూ ఉద్యమాన్ని నీరుగార్చటానికి కుట్రలు చేశారు.వీళ్ళు చేసిన కుట్ర వల్లనే నెహ్రూకీ కేంద్రానికీ ఉద్యమ తీవ్రత తెలియక పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చెయ్యాల్సి వచ్చిందనేది నా అనుమానం.

చివరి ప్రయత్నం కింద పొట్టి శ్రీరాములు గారు మద్రాసులోని మహర్షి బులుసు సాంబమూర్తి గారి స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్షకు ఉపక్రమించారు.1952 డిసెంబర్ 16 తెల్లవారు ఝామున పొట్టి శ్రీరాములు  గారి మరణంతో  ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికి చీరాల,విజయనగరం,విశాఖపట్నం,విజయవాడ,రాజమండ్రి,ఏలూరు,భీమవరం,గుంటూరు,తెనాలి,ఒంగోలు,నెల్లూరు వంటి అనేక ప్రముఖ నగరాలలో పెద్ద ఎత్తున విధ్వంసకరమైన సంఘటనలు జరిగాయి.నాలుగు రోజుల పాటు ఆంధ్ర ప్రాంతం అట్టుడికి పోయి మద్రాసు నగరం కూడా స్తంభించి పోయింది.ఆఖరికి 1952 డిసెంబర్ 19 తేదీన దేశ ప్రధాని నెహ్రూ మద్రాసు నుంచి విడదీసి ఒక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అయిన K.N.Wanchoo అధ్యక్షతన ఆంధ్ర రాష్ట్రం యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించే ఒక కమిటీ వేశారు.

నిజానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల నినాదం ఆనాడు లేదు గానీ బెంగాలు విభజన కాలం నుంచీ తెలుగువాళ్ళందరూ కలిసి ఒక రాష్ట్రం అవ్వాలనే మాట అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉండేది.అయితే, ఒక గట్టి ఆవేశం మాత్రం 1913 సంవత్సరం నాడు జరిగిన బాపట్ల ఆంధ్రమహాసభలో పుట్టింది.అప్పటి చరిత్రను రాగద్వేషాలు లేని నిండుమనస్సుతో పరిశీలించి చూస్తున్న నాకు మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగువాళ్ళు విడిపోవటం అనవసరం అనే అనిపిస్తున్నది.

అసలు చెన్నపట్నం అనే పేరు వచ్చిందే చెన్నప్ప అనే తెలుగువాడి వల్ల. ఈస్టిండియా కంపెనీకి హక్కుభుక్తం ఇచ్చిన వెంకటాద్రి నాయుడు కూడా మన తలుగువాడు.అప్పటి చెన్నపట్నం కూవం నదికి ఉత్తరాన ఉండేది. అందులో కూడా ఉత్తరం వైపు రెండో మూడో వీధులు తప్ప మిగిలిన మొత్తం తెలుగు మయం!అయితే, ఈస్టిండియా కంపెనీ సెయింట్ ధామస్ కొండని సైనిక స్థావరం చేసుకోవడం వల్ల కోట మొదలు కొండ వరకు ఇరుపక్కల ఉన్న గ్రామాలను కలిపే వరసలో ట్రిప్లికేన్, మైలాపూర్ వచ్చి కలిశాయి.దానితో తమిళుల సంఖ్య కొంత పెరిగింది. దానికి తోడు చెన్నపట్నం నుంచి మొదట దక్షిణ జిల్లాలకే రైలుమార్గం పడింది.ఇంగ్లీషు చదువులు చదివిన దక్షిణాది తమిళులు రైలు సౌకర్యాన్ని ఉపయోగించుకుని చెన్నపట్నం వచ్చి స్థిరపడటం మొదలయ్యాక తమిళుల సంఖ్య మరింత పెరిగింది.ఇదే సమయంలో తెలుగు ప్రాంతాలతో మూలవాసీ అనుబంధం ఉన్న భూస్వాములూ జమీందారులూ ఆస్తుల్నీ భవనాల్నీ అమ్మేసుకుని సొంత వూళ్ళకి వెళ్ళడం తమిళుల సంఖ్యను ఇంకొంత పెంచింది.

అయినప్పటికీ చెన్నరాష్ట్రంలోనూ చెన్నపట్నంలోనూ నూటికి ఇరవై అయిదు శాతం తెలుగువాళ్ళే ఉండేవాళ్ళు - 1937 నాటికి కూడా దక్షిణాది జిల్లాల్లో నూటికి పదిహేను శాతం తెలుగువాళ్ళే!పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కోస్తా జిల్లాలలోనూ రాయలసీమ జిల్లాలలోనూ ఉన్న ఆంధ్రులు కాస్త బతక నేర్చిన తెలివిని చూపించి వుంటే చెన్నరాష్ట్రం మీద అధికారం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన తెలుగువారికే శాశ్వతం అయి వుండేది.

భాషా ప్రయుక్ర రాష్ట్రాల వాదన కూడా అంత బలమైనది కాదు, ప్రజలతో మమేకమై ప్రజల కోసమే అధికారం కోరుకునే పూసపాటి రాజావారూ ప్రకాశం పంతులుగారూ పాలితులు ఎవరనేది చూడకుండా అందరికీ న్యాయం చేసి అందరి అభిమానం పొందగలిగారు.కాబట్టి తమిళుల నుంచి విడిపోతే తప్ప తెలుగువాళ్ళు బాగుపడరు అనేది అబద్ధం - అని నా వూహ.ఎవరి వూహలు ఎట్లా వుంటేనేమి వాదం మొగ్గ తొడిగింది, వికసించింది, నలుదిశలా ప్రబలింది, ప్రకాశం వంటివారు కూడా ప్రవాహం వెంట నడిచారు, అవతరించిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

అలా 1953 అక్టోబర్ 01 అవిభక్త మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం కర్నూలును రాజధానిని చేసుకుని (09)ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి ముఖ్యమంత్రిత్వంలో కొలువు దీరింది. ప్రకాశం పంతులు గారు కాంగ్రెసు పార్టీ తరపున 1953 అక్టోబర్ 01 మొదలు 1954 నవంబర్ 15 వరకు ముఖ్యమంత్రి అయ్యారు.

తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్ర ఇతరుల్ని కూడా ఉత్తేజపరిచి అనేక రాష్ట్రాలు భాష పేరున పునర్వ్యవస్థీకరించబడినాయి.అప్పటి ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలూ కోస్తాంధ్రకు చెందిన తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలూ రాయలసీమకు చెందిన చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలూ ఉండేవి.కర్నూలు రాజధానిగా తొలి ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగానే ప్రకాశం తనదైన శైలిలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ఆదర్శప్రాయం. రాష్ట్ర అవతరణ మొదటి వార్షికోత్సవం సందర్భంగా రెండు వేల మంది ఖైదీలకు క్షమాభిక్ష, తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టులకు రూపకల్పన, వాటి నిర్మాణానికి ప్రణాళిక, విజయవాడ కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణం ప్రకటన - ఇలా ఎన్నోముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు.అయితే కమ్యూనిస్టులు టంగుటూరు ప్రకాశం పాలనను వ్యతిరేకించి మద్దతును ఉపసంహరించుకుంటూ పధ్నాలుగు నెలలకే అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఆయన ప్రభుత్వం కూలిపోయింది.

అవిశ్వాస తీర్మానం చాలా హాస్యాస్పదమైన పద్ధతిలో జరిగింది.టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్రలో పేర్కొన్న దాని ప్రకారం మొదటి సారి పెట్టిన తీర్మానం వీగిపోతే పెట్టినవాళ్ళు నాలిక్కరుచుకుని మళ్ళీ రెండోసారి పెట్టించుకుని ఓడించేశారు - ప్రకాశం గారు "మన ప్రభుత్వం పడిపోవటమంటూ జరిగితే మన స్పీకరు గారి తప్పుడు రూలింగుల వల్లే పడిపోతుంది!" అని జోకేసి నట్టు ఒకచోట చదివాను, అలాగే జరిగింది.అప్పటి నాయకులు అందరూ ప్రజల ముందు దేశభక్తీ త్యాగమూ నిరాడంబరతా వంటి వాటికి నిలువెత్తు రూపాల వలె కనిపిస్తూ కలిసి మెలిసి పోరాడుతున్నట్టు కనిపించినప్పటికీ ఉద్యమాలను విజయవంతం చెయ్యడంలోనూ పార్టీ కార్యక్రమాలకు రూపకల్పన చెయ్యడంలోనూ కొందరు నాయకులలో కీర్తి కాంక్షలూ వ్యక్తిగత స్పర్ధలూ ముఠాతత్వాలూ కనిపిస్తూ ఉండేవి.పోరాటం కొనసాగుతున్నప్పుడు జైళ్ళకి వెళ్ళే సమయాల్లో కళా వెంకట్రావు, నీలం సంజీవరెడ్డి వంటివాళ్ళు ఒక గ్రూపుగా వుండి వృద్ధుడూ అగ్రస్థానంలో నిలబడి పోరాడుతున్న యోధుడూ అయిన ప్రకాశం పంతులు గారికి సౌకర్యాలు అమర్చి సహాయం చెయ్యటానికి బదులు ఆయన కోరుకున్న గదులు దక్కకుండా తమ వంతు రాజకీయం చేస్తూ ఉండేవాళ్ళు.అప్పట్లో ఆంధ్రా సర్క్యులర్ విషయంలో ముఠా చేసిన నీచమయిన రాజకీయం తెలిస్తే 2020లో మనం చూస్తున్న దిగజారుడు రాజకీయాలకి పునాది వేసిన ఇలాంటి అధమాధమ రాక్షసగణం గౌరవనీయులుగా చెలామణీ కావడమే పైరు పచ్చల నల్లరేవడి మాగాణమూ కష్టం చెయ్యడంలో అలుపెరగని ఆంధ్రజనమూ ఇప్పటికీ వెనకబడి ఉండటానికి కారణమనే పచ్చినిజం బోధపడి మనమీద మనకే జాలి వేస్తుంది!

ప్రకాశం పంతులు గారు తన పదవీ విరమణ ప్రసంగంలో "ఈరోజు మార్చి 25 తేదీ.ఇంకొక అయిదు రోజులకు 1947 మార్చి 30 వస్తుంది.అప్పటికి ఒక సంవత్సరం క్రింద, అంటే 1946 మార్చి 30 ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక గౌరవ సభ్యుడు చెన్నరాష్ట్రంలో గల రాజకీయ పరిస్థితులను గురించి అధిష్ఠానవర్గంలో ఉన్నతస్థానం వహించిన ఒకరితో చెప్పడానికి వెళ్ళారు.వెళ్ళవలసిందని ఆయనను ఎవరూ పంపించలేదు.స్వయంప్రతినిధిగా వెళ్ళారు.అధిష్ఠానవర్గం వారితో చెన్న రాష్ట్రం తిండి కరువుతో బట్ట కరువుతో గడ్డు స్థితిలో ఉన్నదనీ సరైన నాయకుణ్ణి ఎన్నుకోకపోతే రాష్ట్రం ధ్వంసమైపోతుందనీ వారు చెప్పారు.ఇంతేకాక మరొక విషయం కూడా చెప్పారు.పోటీ పడుతున్న ముగ్గురు నాయకులలో నన్ను తప్పించి తక్కిన ఇద్దరూ చేతులు కలుపుకునే లాగున అధిష్ఠానవర్గం వారు చేయవలసిందని కూడా చెప్పారు.మంత్రివర్గంలో నాకు ఎదురుగా ఇప్పుడు కూచున్న ఒకరు* వెంటనే, అక్కడినుంచి తనపై వేసుకున్న దౌత్యం సఫలమైందని రాజాజీకి ఒక ఉత్తరం కూడా వ్రాశారు." అన్నచోట ఆయన "ఒకరు*" అని ప్రస్తావించినది బెజవాడ గోపాల రెడ్డి గారినే.

ప్రకాశం గారు విడుదల చేసినట్టు భ్రమ పుట్టించి ఆయన్ని ఆంధ్ర రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తొలగించి పదవిని చేపట్టడం కోసం గాంధీ స్వయాన ఉద్వేగపడి ఎంతో ఆలోచించి చేసిన "క్విట్ ఇండియా" తీర్మానం గురించి Sabotage లాంటి తీవ్రమైన పదజాలం వాడి దాన్ని వ్యతిరేకించమని ఒక సర్క్యులర్ తయారు చెయ్యటం, అధ్యక్షులైన ప్రకాశం గారికి తెలీకుండా కమిటీ మీటింగు ఏర్పాటు చెయ్యాలనుకోవటం, నాకు నోటీసు ఇవ్వలేదేమని తెన్నేటి విశ్వనాధం లాంటివాళ్ళు అడిగితే అది ఇన్ఫార్మల్ మీటింగు అనటం, మినిట్సు పుస్తకంతో సంబంధం లేని వేరే కాగితాల మీద ప్రొసీడింగ్సు వ్రాయడం, వాటిలోనూ ఇన్స్ట్రక్షన్స్ విషయమై ఎలాంటి తీర్మానం జరగనప్పటికీ కాంగ్రెస్ కమిటీ లెటర్హెడ్డుల పైన రోనియో కాపీలు తీయించి అధికారికమైన సర్క్యులర్ కింద చెలామణి చెయ్యటం, విధిలేక ప్రకాశం గారు ఆంధ్రా సర్క్యులర్ అనేదానిని ఆంధ్రా ప్రావిన్షియల్ కమిటీ ఏనాడూ జారీ చెయ్యలేదని వ్రాసినప్పుడు తాను గాంధీగారికి విధేయుడననీ సత్యం తప్పనివాడిననీ చెప్పి "ప్రకాశం గారు బందరు మీటింగు ప్రొసీడింగ్సుకి సంతకం పెట్టారా లేదా" అని గొంతు పెంచి కేకలు వెయ్యటం - ఇవన్నీ కళా వెంకట్రావు గారిలాంటివాళ్ళు పదవీ వ్యామోహంతో అసత్యమనే వాహనం పైన కొందరు వ్యక్తులు ఎంత దూరం వెళ్ళగలరో ఆనాడు మొదలు ఈనాడు వరకు ప్రతి తరంలోనూ మనకు కనబడుతున్న వారి లాంటి అనేకమందిని గురించి వారికి వారే చూపించుకున్న నిదర్శనం!

పదవులను కోరుకోవటం తప్పు కాదు.కానీ, ఎన్నుకున్న మార్గం సరైనది కాకపోతే తమ చుట్టు ఉన్న అమాయకుల్ని చెడగొట్టటంతో పాటు తమ సొంత రాజకీయ జీవితం కూడా అప్రదిష్ట పాలు అవుతుంది. వెధవ పన్లు చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియనిది ఏమిటంటే, ఆనాటినుంచీ ఈనాటివరకూ గల అలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటున్న" ప్రజలెప్పుడూ పిచ్చిముండాకొడుకులే!కొన్నాళ్ళు అల్లరి చేసి వాళ్ళే మర్చిపోతారు - మన చాణక్యం, మన మేధస్సు, మన చాతుర్యం మన దగ్గిర ఉన్నంతకాలం మనని ఎవడూ పీకలేడు. పేరుదేముంది, మనం కొట్టేసిన దాంట్లోంచి కొంత భట్రాజు పన్లు చేసే కవులకీ కళాకారులకీ విదిలించి చప్పట్లు కొట్టించుకుంటూ ఫొటోలు తీయించుకుంటే చాలు!మనకేంటి?" అనే రకపు ఆత్మస్తుతితో కూడిన స్వయంతృప్తిని అనుభవించడం తప్ప నిజమైన చరిత్ర వీళ్ళని ఆంధ్ర కేసరి కాలి గోటి సరసన కూడా నిలబెట్టలేదు - పిచ్చికుక్క చచ్చింది, పాటిదిబ్బమీద పారేశారు అన్నట్టు వాళ్ళు పోయిన మర్నాటినుంచి వాళ్ళని తల్చుకుంటున్న వాళ్ళు లేరు!

ప్రకాశం గారి ప్రభుత్వం కూలిపోయాక రాష్ట్రంలో కొన్ని నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగిన తర్వాత 1955 ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి.167 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.అందులో 29 నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించేవారు. అంటే, మొత్తం 196 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయన్నమాట. ఎన్నికల్లో 581 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.రాష్ట్రంలో 01.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా 60.14 శాతం పోలింగ్ నమోదైంది.సీపీఐ, కాంగ్రెస్లు ప్రధానంగా పోటీపడ్డాయి.కాంగ్రెస్ 142 స్థానాల్లో పోటీ చేసి 119 చోట్ల గెలుపొందింది.170 మంది స్వతంత్రులు బరిలో నిలవగా 22 మంది విజయం సాధించారు.జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీ 45 చోట్ల అభ్యర్థులను నిలపగా 13 మంది గెలుపొందారు.అత్యల్పంగా 34 ఓట్ల (0.11 శాతం) తేడాతో పీపీ షేక్ మొహమ్మద్ నిజామి మీద పీఎస్పీ అభ్యర్థి జి.బూసన్న గెలుపొందారు.నిజామీకి 12,973 ఓట్లు పడగా, బూసన్నకు 13,007 ఓట్లు పోలయ్యాయి.చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి టీఎన్ వెంకటసుబ్బయ్య పోటీ చేశారు.సర్వేపల్లి నుంచి పోటీ చేసి గెలిచిన (10)బెజవాడ గోపాల రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.

నిజానికి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల పదవీకాలం 1960 వరకే కొనసాగాలి.కానీ, 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల పదవీ కాలం 1962 వరకు ఉండడంతో ఆంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేల పదవీకాలం రెండేళ్లు పొడిగించారు.

1953లో మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయేనాటికి నిజాం సంస్థానంలో ఉన్న తెలుగు ప్రజలు 1948 సెప్టెంబర్ 17 నాటికే తన పరిపాలనలో ఉన్న ప్రాంతాన్ని అయితే పాకిస్తానులో కలపాలనీ లేదంటే స్వతంత్రదేశంగా ఉండాలనీ అనుకుంటున్న నిజాము పరిపాలన నుంచి విడివడి స్వతంత్ర భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పరచుకుని ఉన్నారు.

నిజానికి తెలంగాణ ప్రజల సంస్కృతి ఒక రకమైన అమాయకత్వం, అంతులేని బోళాతనం, మితిమీరిన తిరుగుబాటు ధోరణి కలగలిసిన సంక్లిష్టతను కలిగి ఉండటం వల్ల ప్రాంతపు రాజకీయ నాయకులు చాలామంది తెలంగాణ ప్రజల్ని తమ సొంత ప్రాభవాల కోసం ఇష్టారీతిన ఒకప్పుడు వాడుకున్నారు, ఇప్పటికీ వాడుకుంటున్నారు, ఎప్పటికీ వాడుకుంటూనే ఉంటారు.ఇతరులకి అన్యాయం చెయ్యని వారినీ తమకు అన్యాయం చేస్తే సహించలేనివారినీ రెచ్చగొట్టటం చాలా తేలిక - మరీ ముఖ్యం ఎదటివారు చెప్పే మాటలలోని నిజానిజాల్ని తరచి చూడలేని అమాయకుల్ని "ఫలానా వాళ్ళు మిమ్మల్ని అణిచేస్తున్నారు కాబట్టే మీరు వృద్ధిలోకి రాలేకపోతున్నారు!వాళ్ళని చంపేస్తేనో తన్ని తగిలేస్తేనో తప్ప మీరు బాగుపడరు - ఇది నిజం. " అని చాడీలు చెప్పి వేరేవాళ్ళ మీదకి వాళ్ళని రెచ్చగొట్టటం చాలా తేలిక!

2014 నాటి తెలంగాణ ఉద్యమ వీరులు ఆనాటి తెలంగాణ యొక్క రెండు విలీనాలకీ భారత దేశపు ప్రభుత్వానికీ ఆంధ్ర ప్రాంతపు నాయకులకీ దురుద్దేశాలు అంటగడుతున్నారు గానీ జరిగిన చరిత్రని జరిగినట్టు చూస్తూ రెండు సన్నివేశాల్లోని తెలంగాణ నాయకులు ఆనాడు ఎలా స్పందించారు ఎలా ప్రవర్తించారు అని చూస్తే చాలు ఈనాటి తెలంగాణ నాయకులు చేస్తున్న ఆరోపణలు అబద్ధం అని తెలుస్తుంది.ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి చెప్పాలంటే, ఈనాటి తెలంగాణ ఉద్యమ వీరులు ఆనాటి తెలంగాణ యొక్క రెండు విలీనాలకీ భారత ప్రభుత్వానికీ ఆంధ్ర ప్రాంతపు నాయకులకీ దురుద్దేశాలు అంటగట్టడం తమ వెనకటి తరం తెలంగాణ ప్రాంతపు నాయకుల్ని అవమానించడమే అవుతుంది!

తెలంగాణ ప్రాంతం భారతదేశంలో హైదరబాదు రాష్ట్రంగా కలిసిపోవడం అనేది ప్రశాంతమైన వాతావరణంలో జరగలేదు.అటువైపునుంచి నిజాము అయితే పాకిస్తానులో కలవాలి లేకపోతే స్వతంత్రదేశం అయిపోవాలని పట్టుదల చూపిస్తున్నాడు.సైనికచర్య జరిగే సమయానికి అతను ఒక దేశానికి కావలసిన అన్ని హంగుల్నీ సమకూర్చుకుని తన రాయబారుల్ని అన్ని ముస్లిం దేశాలకీ ఐక్యరాజ్యసమితికీ పంపించి ఉన్నాడు ప్రత్యేక దేశపు గుర్తింపు తెచ్చుకోవడం కోసం.సైనిక చర్య కొంత ఆలశ్యమై అతని ప్రయత్నాలు సఫలం అయి వుంటే పరిస్థితి ఎలా వుండేది?

నిజాము అంతకుముందునుంచి తనను పాకిస్తానులో కలవమని ఒత్తిడి పెడుతున్న ఖాసిం రజ్వీని ఇప్పుడు భారత దేశంలో కలిసిపోవాలని అనుకుంటున్న సామాన్య ప్రజల మీదకీ ప్రజల్ని అతని కబంధ హస్తాల నుంచి విముక్తం చెయ్యాలనుకుంటున్న భారత ప్రభుత్వం మీదకీ వదిలాడు!Sunderlal Committee ఆనాటి సెప్టెంబర్ 1948 జరిగిన సైనిక చర్య గురించి "as a very reasonable & modest estimate...the total number of deaths in the state...somewhere between 30,000 & 40,000" అని చెప్పడమూ నిజమే, కొందరు నిజాయితీపరులైన పరిశీలకులు మృతుల సంఖ్య 2,00,000 కన్న ఎక్కువే ఉండొచ్చునని అంచనాలు కట్టడమూ నిజమే - కానీ ఆనాడు భారత సైన్యం పోరాడాల్సిందీ పోరాడిందీ యూనిఫాం ఉన్న నిజాం  సైన్యం ఒక్కదానితోనే కాదు, ప్రజల్లో కలిసిపోయి తిరుగుతున్న రజాకార్లతో కూడా అనేది తెలుసుకుంటే గానీ భీబత్సం నూటికి నూరు శాతం భారత ప్రభుత్వం వల్ల జరిగింది కాదని అర్ధం అవుతుంది.ఇప్పటికీ ఆనాటి విలీనాన్ని వ్యతిరేకించే వారిలో ఖాసిం రజ్వీ పెట్టిన పార్టీని పేరు మార్చి కొనసాగిస్తున్న ఒవైసీ కుటుంబం పట్ల అనుకూలత ఉన్నదనేది వాస్తవం!

ఆనాటి కేంద్ర ప్రభుత్వం కూడా జవహర్ లాల్ నాయకత్వంలో ఉండటం వల్ల చేసిన పొరపాట్లు పరిస్థితిని మరింత దిగజార్చాయి. వ్యక్తి అయితే తన రాజ్యాన్ని దేశంలో కలపనని భీష్మించుకుని యుద్ధం చేశాడో వ్యక్తికి గవర్నరు హోదా ఇచ్చి సత్కరించడం ధూర్తుణ్ణి వ్యతిరేకించి దేశంలో కలిసిన ప్రజల్ని అవమానించడం కాదా!ఖాసిం రజ్వీ ధాష్టికానికి తలొగ్గి అతని మూర్ఖత్వానికి తోడు తన పేరాశ కూడా తోడై రెచ్చిపోవటమే తప్ప ఆదినుంచీ బలాబలాలు నిజాముకు ప్రతికూలమే - సెప్టెంబర్ 13 మొదలు సెప్టెంబర్ 17 వరకు జరిగిన అయిదు రోజుల దాడిలో రజాకారులే కొంత భీబత్సం చెయ్యగలిగారు గానీ నిజాము గారి డబ్బా డకోటా విమానాలు గానీ బుడ్డా గడ్డాల సైన్యం గానీ కనీసపు ఎదురు దాడి కూడా చెయ్యలేకపోయాయి.

సెప్టెంబర్ 17 తనే కబురు చేసి తన ముందుకి రప్పించుకున్న K.M. Munshi గారితో జరిగిన సమావేశంలో "The vultures have resigned. I don't know what to do" అని రజాకార్ల దౌష్ట్యాల నన్నిట్నీ ఖాసిం రజ్వీ మీదకి తోసేస్తూ తనలో తను గొణుక్కుని 1948 సెప్టెంబర్ 23 రేడియోలో “In November last [1947], a small group which had organized a quasi-military organization surrounded the homes of my Prime Minister, the Nawab of Chhatari, in whose wisdom I had complete confidence, and of Sir Walter Monkton, my constitutional Adviser, by duress compelled the Nawab and other trusted ministers to resign and forced the Laik Ali Ministry on me. This group headed by Kasim Razvi had no stake in the country or any record of service behind it.By methods reminiscent of Hitlerite Germany it took possession of the State, spread terror ... and rendered me completely helpless.” అని ప్రకటించడంతో తెలంగాణ ప్రాంతపు చరిత్ర ఒక గొప్ప మలుపు తీసుకుంది.

1950 జనవరి  26 నిజాముకు ఇచ్చిన రాజ్ ప్రముఖ్ హోదా 1956 అక్టోబర్  31 వరకు కొనసాగింది.హైద్రాబాద్ సంస్థానం స్వాధీనం కాగానే మొదట 1950 జనవరి 26 M.K.Vellodiని ముఖ్యమంత్రిగా నియమించారు.అయితే, 1952 ఎన్నికల్లో కాంగ్రెసు నెగ్గి బూర్గుల రామకృష్ణా రావు గారు ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి అయ్యారు.ఇదే 1952లో ఇతర ప్రాంతాల వారికే కీలకమైన ఉద్యోగాలు దక్కడం మీద వ్యతిరేకత పెరిగి ముల్కి ఉద్యమం ఉధృతమైంది.అయితే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన Reorganisation of the Indian States కమిటీ 1956లో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలోనూ కలపాలని సూచించింది.

తెలంగాణలోని కొందరికి నిజాము పాలనలో మ్రగ్గిన వెనుకబాటు తనం వల్ల తెలంగాణ ప్రజలు మద్రాసు రాష్ట్రపు ఆధునికత విద్య వల్ల ముందుకు చొచ్చుకుపోయే కోస్తాంధ్ర ప్రజలతో పోటీ పడి నెగ్గలేరని అనిపించింది.అందువల్ల కమిటీ ఇతరుల విషయంలో వలె గాక “One of the principal causes of opposition of Vishalandhra also seems to be the apprehension felt by the educationally backward people of Telangana that they may be swamped and exploited by the more advanced people of the coastal areas” అని చెప్పి రెండు రాష్ట్రాల ప్రజల విచక్షణకు వదిలేసింది.

ఆనాటి తెలంగాణ సమాజం ఒక గందరగోళాన్ని ఎదుర్కొంటూ ఉన్నదనేది వాస్తవం.పోలీసు చర్య అనేది సహజంగానే వివాదాస్పదమైన పేరు.అక్కడ ఉన్నది భారత సైన్యం అయినప్పటికీ పేరు చెప్తే అంతర్జాతీయ రాజకీయాల ప్రకారం భారత దేశం నిజాము యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవడం కోసం చేసిన యుద్ధం అవుతుంది.నిజాము కూడా ఖాసిం రజ్వీ ఒత్తిడి వల్ల రజాకార్లని స్వేచ్చగా వదిలేశాడు తప్పితే సొంతంగా అతనికి భారతదేశంతో యుద్ధం చెయ్యాలని ఉన్నట్టు తోచడం లేదు. ఇటువైపున ప్రజల్లో చాలామంది అప్పటికే నిజాము ప్రవేశపెట్టిన ఉర్దూకీ వాళ్ళ పరిపాలనా పద్ధతులకీ అలవాటు పడిపోయినట్టు కూడా తెలుస్తున్నది.పైన పోలీసు చర్యలో పాల్గొన్న ఆంధ్ర అధికారులు తెలంగాణ ప్రజలతో వ్యవహరించిన తీరు కూడా చాలా దుర్మార్గంగా ఉండటంతో వీళ్ళిద్దర్నీ కేవలం భాష పేరున కలపడం సాధ్యమా అనిపించే వాదనలు తలెత్తాయి.

ఇక్కడ మనం పట్టించుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం ఉంది.వ్రాసిన తేదీ, సమయం తెలియడం లేదు గానీ బూర్గుల రామకృష్ణా రావు గారు అప్పటి భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షుడైన U N Dhebar గారికి "I may however, add one thing that in case Telangana is kept a separate unit there is no harm in having common aspects of the administration common" అని తెలంగాణను అంటే అప్పటి హైదరాబాదు రాష్ట్రాన్ని ఆంధ్రతో కలపకపోయినప్పటికీ కలిపితే ఒనగూరుతాయని అంటున్న ప్రయోజనాలను సాధించవచ్చనే తన సొంత అభిప్రాయాన్ని చెప్తూ ఒక ఉత్తరం వ్రాశారు.ఇందులో మళ్ళీ ఇరు వర్గాల వాదనలనూ ఎందుకు ఉటంకించారో అర్ధం కావడం లేదు నాకు.ఆయనకి కలయిక పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు తన వాదనకి సమర్ధనలను మాత్రం చెప్తే సరిపోతుంది.మరి, కలయికకు అనుకూలమైన వాదనలను కూడా ఇక్కడ ప్రస్తావించడం దేనికి?

మొదలు పెట్టటమే తెలంగాణలో చాలామంది హైదరాబాదును యధాతధం కొనసాగించాలని బలంగా కోరుకుంటున్నారు అంటూ మొదలుపెట్టి "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలిపేశారు కాబట్టి ఒప్పుకోవలసి వస్తుందని అనేశారు. "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలపడానికి లేని విముఖత "హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో" కలపడానికి ఎందుకు వచ్చింది? "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలిపేశాక "హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో" మాత్రం కలపొద్దు అనడం న్యాయమేనా!

బూర్గుల రామకృష్ణారావు గారు విశాలాంధ్ర అనేది కమ్యునిష్టుల నినాదం కాబట్టి తమ అధ్వర్యంలో జరిగిన రైతాంగ పోరాటపు విజయాన్ని రాష్ట్రమంతటికీ విస్తరింపజెయ్యడం కోసం కమ్యునిష్టులు వేసిన పాచిక అని అర్ధం చేసుకున్నారని అనిపిస్తుంది నాకు.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక సూత్రమైన Cultural Integration అనేదాన్ని కూడా emotional approach మాత్రమే అని తీసి పారేస్తున్న బూర్గుల రామకృష్ణారావు గారు విలీనాన్ని వ్యతిరేకిస్తే సరిపోయేదానికి I shall now briefly summarise the pros and cons of the situation అని ఉత్తరం వ్రాయడం అనవసరం అనిపిస్తున్నది నాకు.భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన మౌలిక సూత్రమైన Cultural Integration అనేదాన్ని కూడా emotional approach మాత్రమే అని తీసి పారేస్తున్న బూర్గుల రామకృష్ణారావు గారు తెలంగాణ వారికున్న ఆంధ్రలో విలీనం పట్ల వ్యతిరేకత దగ్గిర కొచ్చేసరికి There is no agitation of a strong character in Andhra on this subject while there is a strong agitation in Telangana not to merge with Andhra అనటం చాలా దుర్మార్గం అనిపించింది నాకు.ఆంధ్ర ప్రాంతపు నాయకులు ప్రతిపాదించిన తెలుగువాళ్ళు ఒక్కటిగా ఉండటం అనేది మాత్రమే ఆయనకివూహల్లో బాగుండి వాస్తవంలో సాధ్యం కానిదిగానూ తెలంగాణ ప్రాంతపు నాయకులు ప్రతిపాదించిన ఉర్దూ సానుకూలతతో కూడిన మాతృభాష పట్ల వ్యతిరేకత ఏమోబౌతిక పునాది ఉన్న శాస్త్రీయమైనదిగానూ కనపడటంలో కేవలం 175 ఏళ్ళ కింద మొదలైన తమ పరాయీకరణను ప్రేమించుకునే మితిమీరిన స్వానురాగం తప్ప ఎటువంటి ఆదర్శమూ లేదని అనిపిస్తున్నది నాకు.

Telanganites feel that apart from being Telugus they have built up their own way of life during the last 175 years అనే భావంతో ఉన్న బూర్గుల రామకృష్ణారావు గారి మూడు నాలుగు పాయింట్లు కమ్యూనిష్టులు చేసిన రైతాంగ పోరాటానికి టార్గెట్ అయిన నిజాము పెంచి పోషించిన ఉర్దూ భాషాధిక్యత నిండిన మిశ్రమ సంస్కృతి మీద వారికి గల ప్రీతిని చూపిస్తుంది.కమ్యూనిష్టుల్నీ కమ్యూనలిస్టుల్నీ ఒకే గాటన కట్టేసి కమ్యూనిష్టులు మిగిలిన చోట్ల చేసినట్టే ఇక్కడా చేస్తున్నారు అని అర్ధం వచ్చేలా as in similar cases in other parts of India అని సెటైరు కూడా వేసి వాళ్ళే విశాలాంధ్రను కోరుకుంటున్నారనీ అదొక రాజకీయ క్రీడయే తప్ప వాళ్ళలో ప్రజల పట్ల నిజాయితీ లేదనీ తేల్చి చెప్పిన బూర్గుల రామకృష్ణా రావు గారు 175 సంవత్సరాల క్రిందట తాము వేరు దారి తీసుకోవడం గురించి గర్వించడం సహజమే కదా - ఇతరుల ఆదర్శాల్ని అసంబద్ధం, అశాస్త్రీయం అనేసి తమ పరాయీకరణను మాత్రం ఆదర్శం, ఔన్నత్యం అని చెప్పుకోవడం ఎంత విచిత్రం!

లేఖలో ఉన్న సందిగ్ధత Shri U.N.Dhebar బోరు కొట్టించి ఎవరికీ చెప్పలేదో చెప్పినా ఎవరూ పట్టించుకోలేదో బూర్గుల రామకృష్ణా రావు గారు లేఖలో పంపుతానన్న తదుపరి సుదీర్ఘ నివేదికని పంపించారో లేదో తెలియడం లేదు గానీ లేఖ వ్రాసిన కొన్ని నెలలకే, 1955 డిశెంబర్ 03 హైదరాబాద్ శాసనసభలో ఆంధ్రతో కలయిక గురించి వోటింగు పెట్టినప్పుడు మొత్తం 174 మంది శాసనసభ్యులలో 147 మంది వోటింగులో పాల్గొన్నారు.వీరిలో 103 మంది కలయికకు అనుకూలం, 16 మంది తటస్థం, 29 మంది వ్యతిరేకం అయ్యారు.మొత్తం తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు 94 మంది - వీరిలో 36 మంది కమ్యూనిష్టులు, 40 మంది కాంగెసు వాళ్ళు, 11 మంది సొషలిష్టులు.వీళ్ళందరిలో ఆంధ్రలో తెలంగాణ విలీనానికి 59 మంది అనుకూలం 25 మంది ప్రతికూలం.ఇందులో ఆంధ్ర ప్రాంతపు నాయకుల ప్రమేయం గానీ ప్రభావం గానీ ఏమీ లేదు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పేరుతో ప్రజల్ని ఉత్తేజపరిచి నిజామును బలహీనం చేసిన కమ్యూనిష్టులకే తెలంగాణ ప్రజల్లో  పలుకుబడి ఎక్కువ గనక హైదరాబాద్ శాసనసభలో వారి మాటయే నెగ్గింది!

అయితే, బూర్గుల రామకృష్ణా రావు గారికీ ఇతర తెలంగాణ మేధావులకూ ఉన్న సందేహాలను ఆంధ్ర ప్రాంతపు నాయకులు కూడా పట్టించుకున్నారు.అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి 1956 జూలై 19 ఒక ఒప్పందానికి వచ్చారు.దీనినే పెద్దమనుషుల ఒప్పందం అన్నారు.న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు 1956 ఫిబ్రవరి 20 అని కె.వి.రంగారడ్డి గారు తన స్వీయచరిత్రలో రాశారు.తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి. నరసింగరావు ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న సంతకాలు చేశారు.ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:01).కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి.తెలంగాణ ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి.02).తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.03).సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.04).ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగం లోను ఉర్దూ వినియోగం కొనసాగాలి.05).రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి. ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి.06). ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణా అభివృద్ధి మండలికి ఉండాలి. మండలి సభ్యులు తెలంగాణా ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.07).తెలంగాణాలో మధ్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.08).తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసించి ఉండాలని నిబంధన రూపొందించాలి.09).కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి. ఒప్పందం తరువాత తెలంగాణా నాయకులలో ఉన్న సందేహాలు తొలగి, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

అలా మద్రాసు రాష్ట్రం నుంచి 1953లో చీలిన ఆంధ్ర రాష్ట్రమూ నిజాము రాజ్యం మీద తిరగబడి 1948లో జరిగిన పోలీసు చర్యతో భారతదేశంలో కలిసిన హైదరాబాద్ రాష్ట్రమూ ఒక్కటై 1956 నవంబర్ 01 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.దీనికి (11)నీలం సంజీవరెడ్డి గారు 1956 నవంబర్ 01 మొదలు 1960 జనవరి 11 వరకు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు.సంజీవరెడ్డి గారు ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రపు ప్రకాశం పంతులు గారి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.

1960లో భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అధ్యక్ష స్థానం కోసం రాజీనామా చేసిన నీలం సంజీవరెడ్డి గారి స్థానంలో మాల కులానికి చెందిన (12)దామోదరం సంజీవయ్య గారు 1960 జనవరి 11 మొదలు 1962 మార్చి 12 వరకు రెండేళ్ళపాటు ముఖ్యమంత్రి అయ్యారు.మళ్ళీ 1962 మార్చి 12 నుంచి రెండవ విడత ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన (13)నీలం సంజీవరెడ్డి గారు Bus Routes Nationalisation case విషయంలో సుప్రీం కోర్టు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలతో 1964 ఫిబ్రవరి 20 ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్యాల్సి వచ్చింది.

నీలం సంజీవరెడ్డి గారి రెండవ విడత ముఖ్యమంత్రిత్వం తర్వాత 1964 ఫిబ్రవరి 21 మొదలు 1971 సెప్టెంబర్ 30 వరకు (14)కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు.తన కూటనీతి విశారదతో అప్పటికి ముక్కలు చెక్కలై కొనవూపిరితో ఉన్న కాంగ్రెసుకు జవజీవాలు కల్పించడమూ దూరదృష్టితో రాష్ట్రం యొక్క ఆర్ధిక వ్యవస్థని బలోపేతం చెయ్యడమూ మంచి అయితే తన మితిమీరిన కీర్తికాంక్షతో 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కారణభూతుడు కావడమూ 370 మంది విద్యార్ధుల చావులూ 70,000 అరెస్టులూ 3,266 లాఠీ చార్జిలూ 20,000 మంది క్షతగాత్రులూ 1840 మందిని గాయాల పాలు చేసిన తుపాకీ కాల్పులూ 1870 సార్లు జరిగిన భాష్పవాయు ప్రయోగాలతో నిండిన చెడు పదవిని దూరం చేసింది.

అప్పట్లో కమ్యూనిష్టు భావాలు ఉండి సమకాలపు రాజకీయ నాయకుల మీద వ్యంగ్యాలను తన పాత్రలలో ఇమిడ్చే అలవాటు ఉన్న సినిమా నటుడు నాగభూషణం "నా పెళ్ళాం పక్కింటివాడితో లేచిపోయిన దానికన్న పదవి పోవడం మూలంగానే ఎక్కువ ఏడుపు తన్నుకొస్తుందయ్యా!" అనే డైలాగును వాడటానికి మూలం ఈయనే అని చెప్తారు - గొప్పవారి గుట్టుమట్లు వారి కారు డ్రైవర్ల కెరుక!

కాసు బ్రహ్మానంద రెడ్డి గారు దిగిపోగానే 1971 సెప్టెంబర్ 30 మొదలు 1973 జనవరి 10 వరకు (15)పాములపర్తి వెంకట నరసింహా రావు గారు ముఖ్యమంత్రి అయ్యారు.అప్పుడు రగిలిన జై ఆంధ్ర ఉద్యమం వల్ల రాష్ట్రపతి పాలన విధించాక శ్రీమతి ఇందిరా గాంధీ ఈయన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి తన సలహాదారును చేసుకున్నారు. అప్పటి నుంచి శ్రీమతి ఇందిరా గాంధీ ఆజీవపర్యంతం తీసుకున్న అనేకమైన కీలక నిర్ణయాల వెనక నరసింహా రావు గారి ముద్ర కనబడుతూనే ఉంటుంది.శ్రీమతి ఇందిరాగాంధీ నరసింహారావు గార్ని నిర్ణయాల్ని కాపీ పేస్టు చేసేటంత అసమర్ధురాలు కాదు గానీ నరసింహారావు గారి సూచనల్ని అర్ధం చేసుకుని ఆచరణలోకి తీసుకురావడం వల్లనే శ్రీమతి ఇందిరా గాంధీ ఇంటా బయటా ఎన్నో సంచలన విజయాలను నమోదు చెయ్యగలిగారనేది వాస్తవం.అంటే, కేంద్రానికి వెళ్ళి షాడో ప్రైమ్మినిష్టర్ అనిపించుకోగలిగిన నరసింహారావు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎందుకు ఫెయిలయ్యాడో అర్ధం కావడం లేదూ!నరసింహా రావు గారు వ్రాసిన Insider అనే పేర్లు మార్చిన ఆత్మకధలోని Mahendranath అనే పాత్ర నీలం సంజీవరెడ్డి గారిదీ అతని శత్రువైన Chaudhury అనే పాత్ర కాసు బ్రహ్మానంద రెడ్డి గారిదీ అని జరిగిన చరిత్రనీ కధలోని సంఘటనల్నీ పోల్చి చూసిన ప్రతి ఒక్కరికీ తెలిసిపోతూనే ఉంటుంది.నవలలో నరసింహా రావు గారు ప్రత్యేకించి ప్రస్తావించనప్పటికీ ఆయన్ని పదవినించి తప్పించడానికి ఉపయోగపడిన ఆనాటి జై ఆంధ్ర ఉద్యమానికి ఇద్దరు రెడ్ల ఆధిపత్య రాజకీయాలు కారణం అయి ఉంటాయని అనుకుంటున్నాను నేను.

నరసింహా రావు గారి తర్వాత 1973 డిసెంబర్ 10 మొదలు 1978 మార్చి 06 వరకు ముఖ్యమంత్రిత్వం నిర్వహించిన (16)జలగం వెంగళ రావు గారు తెలంగాణ ప్రాంతానికి కాకతీయ యూనివర్సిటీ, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి నాగార్జున యూనివర్సిటీ, రాయలసీమ ప్రాంతానికి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ సాధించి తీసుకొచ్చి 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు ఏర్పాటు చేసి 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్నీ 1972 నాటి జై ఆంధ్ర ఉద్యమాన్నీ కొంత చల్లబరిచారు.

వెంగళ రావు గారి తర్వాత 1978 మార్చి 06 మొదలు 1980 అక్టోబర్ 11 వరకు మొదటి విడత ముఖ్యమంత్రిత్వం నిర్వహించిన (17)మర్రి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలోనే 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచింది. మర్రి చెన్నారెడ్డి గారు 1956లో ఆంధ్రా తెలంగాణా కలయికని వ్యతిరేకించారు.బాగానే ఉంది, అతనికి కలయికపట్ల వ్యతిరేకత ఉన్నందువల్ల దోషం ఏమీ లేదు.కానీ, పెద్దమనుషుల ఒప్పందంలో తనూ భాగస్వామి అయ్యారు.తన డిమాండ్లు చెప్పారు.

తర్వాత జరిగిన చరిత్ర ప్రకారం  వికారాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై 1957–62 మధ్యన Public Accounts Committeeలో పనిచేశారు.రెండుసార్లు Estimates Committeeకి చైర్మనుగా పనిచేశారు.Andhra Pradesh Regional (Telangana) Development Committeeకి చైర్మనుగా పని చేశారు.1962లో తండూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యాక మొదట Planning, Panchayat Raj శాఖలతోనూ పిదప Finance, Commercial Taxes, Industries శాఖలతోనూ మంత్రి పదవిని అలంకరించారు.మళ్ళీ 1967 నాడు కూడా శాసనసభకు ఎన్నికై Finance, Education, Commercial Taxes శాఖలతో మంత్రిత్వం అనుభవించారు.అప్పుడు రాష్ట్ర మంత్రిత్వం నుంచి తప్పుకుని కేంద్రంలో 1967–68 మధ్యన Steel, Mines, Metals శాఖలతో మంత్రిత్వం సంపాదించాడు. అన్నీ చేసి తీరా ఏప్రిల్ 1968 రాజీనామా చేసి వెంటనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు!

మహా ఘనత వహించిన మర్రి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమపు నీచత్వాన్ని తెలుసుకోవటానికి కొంచెం చరిత్ర చాలదూ!తను మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద తనే తిరగబడటం ఏమిటో అందులోని మోసం ఏమిటో ఇప్పటికీ తెలుసుకోలేని తెలంగాణ ప్రాంతపు మేధావుల అజ్ఞానం మీద నాకు జాలి వేస్తుంది.వాళ్ళ ఆజ్ఞానంతో ఇన్నేళ్ళూ వాళ్ళని వాళ్ళు సర్వనాశనం చేసుకున్నది చాలక వాళ్ళకన్న పదింతలు తెలివైనవాళ్ళైన ఆంధ్ర ప్రాంతపు ప్రజల్ని కూడా సర్వనాశనం చేశారు!

దేశం మొత్తం మీద ఎలా ఎన్నికలు జరుగుతాయో తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ అలాగే జరుగుతాయి కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యుల్ని తెలంగాణ వోటర్లే ఎన్నుకుంటారు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యుల్ని ఆంధ్రా వోటర్లే ఎన్నుకుంటారు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!

1968 నాటి చెన్నారెడ్డి గారూ 2001 నాటి కేసీయార్ గారూ ఒకేలాంటి కబుర్లు చెప్పారు, రెండుసార్లూ తెలంగాణ ప్రజలూ మేధావులూ ఒకే రకం పిచ్చితనాన్ని ప్రదర్శించారు,పైన ఆంధ్ర ప్రాంతపు నాయకుల్ని దొంగలనీ దోపిడీదార్లనీ తిడుతున్నారు.

చెన్నారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి జరిగిన ఘోరమైన అన్యాయాన్ని సరిదిద్దాలంటూ సమయంలో ప్రభుత్వంలోనే ఉండి అదీ అత్యంత కీలకమైన శాఖలను నిర్వహిస్తూ అన్యాయంలో భాగస్వామియైన చెన్నారెడ్డియే ఉద్యమించడం ఏమిటో, ఆనాటి డొంకతిరుగుడు బెదిరింపు తతంగాన్ని పట్టుకుని ఇవ్వాళ కొందరు తెలంగాణ ప్రజలూ మేధావులూ మాది 1968 నాటి నుంచి రగులుతున్న స్వాతంత్య్ర కాంక్ష అని బట్టలు చింపుకోవడం ఏమిటో - అస్సలు కామన్ సెన్సు కూడా ఉండదా!

అయిదేళ్ళ ఆర్భాటం తర్వాత 1973 నాటికి అనవసరపు విభజన ఇష్టం లేని శ్రీమతి ఇందిరా గాంధీ కలగజేసుకుని ఆరు సూత్రాల ఫార్ములా ప్రకటించి రాజీ చేశాక జరిగిన లోపాయకారీ ఒప్పందం ప్రకారం మర్రి చెన్నారెడ్డి గారు మొదట ఉత్తర ప్రదేశ్ గవర్నర్ పదవినీ వెంగళ రావు గారి తర్వాత 1978 నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిత్వాన్నీ దక్కించుకున్నారు.అయితే, 1980 అక్టోబర్ 11 నాటికి మర్రి చెన్నారెడ్డి గారి మొదటి విడత ముఖ్యమంత్రిత్వం ముగిసిపోయింది.

నిజానికి వెంగళ రావు గారి తర్వాత 1978 మార్చి 06 మొదలు 1980 అక్టోబర్ 11 వరకు మొదటి విడత ముఖ్యమంత్రిత్వం నిర్వహించిన మర్రి చెన్నారెడ్డి గారి నిష్క్రమణం అంత గంభీరమైనది కాదు, ఇల్లరికం సినిమాలోని "ఇల్లరికంలో ఉన్న మజా అది అనుభవించితే తెలియునులే" పాటలో "చీ ఛా,చీ ఛా అన్న చిరాకు పడక దులపరించుకు పోయేవాడికి భలేఛాన్సులే" అన్న చరణానికి నిలువెత్తు రూపమైన భారత జాతీయ కాంగ్రెసు పార్టీ యొక్క సంస్కృతీ వైభవాన్ని ఆవిష్కరించే ట్రాజికో క్యామిక్ హర్రర్ సైన్మ స్టోరీ!

అప్పటి వరకు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి మీద ప్రతిపక్షాలు అవినీతి ఆరోపణలు చెయ్యటమే చూసిన సమస్త ప్రజానీకానికి సొంత పార్టీ వాళ్ళు ప్రతిపక్షం కన్న పూనకాలు తెచ్చేసుకుని వూగిపోవడం చూసి మతిపోయింది - తమ పార్టీ నాయకుడి అవినీతి గబ్బు మొత్తాన్ని బజార్న పెట్టి ఉతకడం మొదలెట్టారు, హవ్వ!ముఖ్యమంత్రి ఏరి కోరి ఏర్పాటు చేసుకున్న 26 మంది మంత్రుల్లో 14 మంది ప్రధాని గనక వూఁ అంటే మంత్రివర్గం నుంచి తప్పుకుంటామని బెదిరిస్తూ ఉత్తరాలు కూడా రాసిచ్చారు - అయ్యో అయ్యో అయ్యయ్యో!"పడె పడె అన్న సవితి తప్ప పడ్డ సవితి లేదని" అన్నట్టు హైదరాబాదులో ఉన్న ముఖ్యమంత్రి అవినీతి నచ్చకపోతే హైదరాబాదులోనే ఉన్న వీళ్ళు బైటికి రావటానికి ఢిల్లీలో ఉన్న మేడం వూఁ అనాల్సిన పనేమిటండీ, ఇసిత్రం గాకపోతేనూ!అక్కడే ఉంది తంటా, మ్యాడమ్ము మార్చిన సీయమ్ము మినిస్ట్రీలో గూడా అచ్చొచ్చిన పోర్టుఫోలియో తమకే ఇస్తారని గ్యారెంటీ ఉంటేనే బైటికి వస్తామని వాళ్ళ ఉత్తరం వెనక ఉన్న కండీసను - అద్గదీ కాంగిరేసు మార్కు పాలిటిక్సు అంటే!

మంత్రుల ఉత్తరాలు 130 మంది అసమ్మతి వాద శాసనసభ్యుల ఉత్తరాలతో కలిసి ఢిల్లీకి చేరాయి.అధిష్ఠానం అనబడే కేంద్ర కాంగ్రెసు కమిటీ కూడా మాంఛి జబర్దస్తు కమెడియనే - "వీళ్ళు వేసిన ఎత్తు బానే ఉంది, మరి పెద్ద రెడ్డి గారు ఏం ఎత్తు వేస్తాడో సూద్దారి!ఎవరు బాగా ఆడితే వాళ్ళనే గెలిపిద్దాం - మనకి నేప్పి దేనికి?" అని ఎదురు చూస్తన్నాది!రెడ్డిగారు కూడా రసికుడే - వాళ్ళు పోష్టులో ఉత్తరాలు మాత్రమే పంపిస్తే, Andhra Pradesh Expressకి ప్రత్యేక బోగీల్ని తగిలించి  మరీ అందులో కూరి 160 మంది శాసనసభ్యుల్ని పంపించాడు.

అన్ని వాదాల కన్న శక్తివంతమైనదీ అన్ని వాదాల కన్న భయంకరమైనదీ అయిన అన్ని వాదముల మూలపుటమ్మ అసమ్మతి వాదం ఇంకాస్త మొండికెత్తి  డిప్యూటీ స్పీకరు చేత కూడా రాజీనామా ఇప్పించి అందరూ కలిసి పార్టీని వదిలి పోవడానికి సిద్ధపడ్డారు - అబ్బే, తూఛ్, ఉత్తినే!అసలుకి రెడ్డిగారి మీద సినబాబు సంజయ్ వంకర సూపు సూట్టమే  సమస్యకి మూలం అనుకుని పిచ్చిరెడ్డిగారు తన చాణక్యం కొద్దీ Sanjay Automobile Academy సంస్థకి Rs 20 million, Sanjay Institute of Medical Sciences సంస్థకి Rs 240 million ,Sanjay Institute of Medical Sciences సంస్థకి Rs 240 million చొప్పున ఇచ్చి ప్రసన్నం చేసుకోవాలని అనుకున్నాడు.

ఒక తాడుని ఇవతలి వాళ్ళు లాగే కొద్దీ అవతలి వాళ్ళు తెంచుతున్నారో అదే తాడుని అవతలి వాళ్ళు తెంచేకొద్దీ ఇవతలి వాళ్ళు లాగుతున్నారో లాగేవాళ్ళూ తెంచేవాళ్ళూ ఇద్దరూ జెమాజెట్టీ సమవుజ్జీలే అయి తాడు తెగకుండానూ విడకుండానూ పీటముడి పడిపోయి ఒకటే తికమక కసమస మకతిక అయి చచ్చింది -  శాంతియుత పరిష్కారం తోచి చావనివ్వని గందరగోళం!ఎప్పుడూ లేంది పెద్ద రెడ్డిగారు సినబాబుకి ఐసు పెట్టటాన్ని గూడా అసమ్మతి వాదులు దూదేకినట్టు ఏకిపారేస్తున్నారు. "అబ్బో, అబ్బబ్బో, ఓలమ్మో, గైరమ్మో - ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది రోయ్!" అన్నట్టు "arrogance, corruption, maladministration, ruination of the party image!” అని ఇంగ్లీషులోనూచేసింది అవినీతి!మళ్ళీ దాన్ని కప్పి పుచ్చుకోవటానికి దేముడిలాంటి సినబాబునీ సెడగొట్టటమా - అమ్మా ఆయ్!" అని అశ్శరభ తశ్శరభ లెవెల్లో శివాలెత్తి పోతున్నారు.వీళ్ళ గొడవకి రాష్ట్రం పరిస్థితి ఎట్లా తయ్యారయ్యిందంటే 256/295 బ్రూట్ మెజారిటీ తెచ్చుకున్న పార్టీ నడుపుతున్న ప్రభుత్వం పక్షవాతపు రోగిలా తన్నుకుంటుంటే ప్రజలు చేష్టలు దక్కి చూస్తున్నారు.

ఎట్టకేలకు, చిట్టచివరికి, కట్టకడపటికి తెలివి తెచ్చుకుని  కాంగ్రెసు పార్టీ అధిష్టాన వర్గం మర్రి చెన్నారెడ్డి గారిని తొలగించి ఇందిరాగాంధీ మంత్రివర్గంలో కేంద్ర కార్మిక శాఖామంత్రిగా పనిచేస్తున్న అంజయ్య గారిని 1980 అక్టోబర్ 11 ముఖ్యమంత్రిగా నియమించింది.

"అసలీ పిచ్చిపన్లు దేనికి?ఆంధ్ర కాంగ్రెసు నాయకులకి మర్రి చెన్నా రెడ్డి నచ్చనప్పుడు వీళ్ళలో వీళ్ళే ఒక చోట కూర్చుని ఉన్నవాళ్ళలో సర్వజనామోదయోగ్యుణ్ణి ఎన్నుకుంటే సరిపోతుంది గదా!" అని మీలో ఎంతమందికి డౌటు వచ్చింది?డౌటు రాలేదంటే పైనుంచి ఇక్కడి వరకు చదివినది బుర్రకి ఎక్కినట్టు - రైఠో, ముందుకి వెళ్ళండి!డౌటు వచ్చినవాళ్ళు మాత్రం నేను పీకే ప్రైవేటు క్లాసు విన్నాకనే ముందుకు వెళ్దురు గాని, కాస్తాగండి!

రాష్ట్ర నాయకులు సొంత నిర్ణయం తీసుకోవడం అంటే ఎంత ప్రమాదం?వీళ్ళు ముక్తకంఠంతో వీళ్ళలోనే ఓకణ్ణి "నువ్వే కావాలి!నువ్వే రావాలి!నీకాల్మొక్తం, నువ్వే మా దేముడు" అని ఒప్పుకుని కుక్కిన పేనుల్లా పడి వుండాలంటే ఒక్కడూ అంతులేని ప్రజాభిమానం ఉండి తన ఒక్క చేతి మీద ప్రభుత్వం ఏర్పరచటానికి కావల్సిన సీట్లలో కనీసం సగం సీట్లని గెలిపించి పార్టీని అధికారంలోకి తీసుకు రావాలి!అంత దమ్మున్న వాడు అధిష్ఠానం చెప్పినట్టు వినడు. పైన, తనకున్న ప్రజాభిమానాన్ని మరింత పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని మరిన్ని నిధుల కోసం పీడిస్తాడు!మరి, దేశం మొత్తాన్ని నెట్టుకు రావలసిన కేంద్రప్రభుత్వం ఒక్కడికి పెద్ద పీట వెయ్యడం చూసి మిగిలిన వాళ్ళు కూడా పీడిస్తే, అప్పుడు ఏం చెయ్యాలి?

అందుకే, ఇప్పుడు బీజెపీ కూడా సొంత పార్టీ బైటి పార్టీ అని చూడకుండా దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అధినేతల్నీ "నువ్వు తోక ఝాడిస్తే నీ ఎగస్పార్టీ వాణ్ణి పవరులోకి తీసుకొస్తా, టేక్ కేర్, గమ్మునుండు!" అని టామ్ అండ్ జెర్రీ ఆటలు ఆడుతూ ఏడిపిస్తున్నది.పీకించుకున్న క్లాసు చాలు. పాయింటు గుర్తుంచుకుని ఇక ముందుకు వెళ్ళండి.

మర్రి చెన్నారెడ్డి గారి మొదటి విడత ముఖ్యమంత్రిత్వం ముగిసిపోయిన తర్వాత 1980 అక్టోబర్ 11 మొదలు 1982 ఫిబ్రవరి 24 వరకు పరిపాలించిన (18)టంగుటూరి అంజయ్య గారిది అతి సామాన్య స్థితి నుంచి అసామాన్య స్థితికి ఎదిగి ముఠాతత్వపు రెడ్డి కులస్థుల దెబ్బకి అవమాన భారంతో నిష్క్రమించిన విషాదం.ఇటీవల 2019 ఎన్నికలలో నరేంద్ర మోదీ దళితుడైన ఉమ్మడి ఏపీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్యను రాజీవ్ ఘోరంగా అవమానించారని విమర్శించినప్పుడు అంజయ్య మనవడు, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ సెక్రెటరీ అభిషేక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అంజయ్యను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదేపదేదళితుడుఅని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అభిషేక్ రెడ్డి తెలిపారు.

వాస్తవానికి అంజయ్య అసలు పేరు రామకృష్ణారెడ్డి అని, దళితుడు కాదని పలుమార్లు వివరణ ఇచ్చినా ప్రధాని ఇలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. "రాఁవరాజో,కాఁవరాజో నాకేటి దెల్సు- ఎప్పుడూ ఓసోట డూటీ ఎయ్యవు గంద!" అని ముత్యాలముగ్గు అలోవలోలో కాంట్రాక్టరు మీద ఒక డాన్సింగళ్ విసుక్కునే సీను గుర్తుందా?అట్టా వుంది ఈళ్ళ యవ్వారం!ఆయన పాటికి ఆయన మొదట్నించీ నాపేరు "రామకృష్ణారెడ్డి" అని చెప్పి అలా పిలిపించుకుంటే కన్ఫ్యూజను ఉండేది కాదు గంద.

పార్టీలో సొంత వర్గమంటూ లేని అంజయ్య గారు వివిధ వర్గాలవారికి మంత్రివర్గంలో పదువులు ఇవ్వాల్సి వచ్చింది. క్రమంలోనే ఆయన 61 మంది మంత్రులతో భారీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గాన్ని జంబో జెట్ విమానం లాంటి మంత్రివర్గమని పిలిచేవారు.అంజయ్య గారు ముఖ్యమంత్రి కాగానే చేసిన ముఖ్యమైన పనులలో పంచాయితీ రాజ్ సంస్థలకు ఎన్నికలు జరిపించటం ఒకటి.అలాగే రాష్ట్రాభివృద్ధి కోసం కొన్ని మంచి కార్యక్రమాలను కూడా మొదలు పెట్టారు.ముఖ్యమంత్రిగా కేవలం 16 నెలలపాటు కొనసాగినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు గడించారు.

ఈయన ముఖ్యమంత్రిత్వంలోనే Dr.యె.సం.రాజశేఖర రెడ్డి,నా.చంద్రబాబు నాయుడు అనే ఇద్దరు హేమామేమీలు రాజకీయ రంగస్థలం మీద ఆరంగేట్రం చేశారు. అప్పటికి చంద్రబాబు నాయుడు వయస్సు 28, రాజశేఖర రెడ్డి వయస్సు 29.తర్వాత కాలంలో బద్ధశత్రువులైన వీరిద్దరూ అప్పటి కాలంలో ప్రాణ స్నేహితులు.అప్పటి వెండి తెర ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు రాజకీయ రంగ ప్రవేశానికి పునాదులు పడింది కూడా అప్పుడే.కాంగ్రెసు తరపున రాజ్యసభకు పంపిస్తారనే వార్త చక్కర్లు కొట్టింది.అయితే, ఇదే అంజయ్య గారికి రాజీవ్ గాంధీ నుంచి ఎదురైన అవమానాన్ని ఈనాడు పత్రిక సంచలనం చెయ్యడంతో పునాదిమీద రామారావు కాంగ్రెసుకు శత్రువై వచ్చాడు!

పత్రికల్లోనూ జ్ఞాపికల్లోనూ కధనాన్ని చదివిన నాకు రాజీవ్ గాంధీ ప్రవర్తన కూడా మరీ ఇంత వివాదాస్పదం చెయ్యాల్సింది కాదనిపిస్తుంది.అతను వచ్చింది అధికారిక కార్యక్రమానికి కాదు.అతను AICC జనరల్ సెక్రెటరీ కాబట్టి పార్టీ పనుల మీద వచ్చి ఉంటాడు.అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వంలో లేని వ్యక్తికి ముఖ్యమంత్రితో సహా వచ్చి స్వాగత సత్కారాలు చెయ్యడం మరోలా వివాదాస్పదం అయి వుండేదనేది వాస్తవం.పైకి వివాదాస్పదమై కనిపిస్తున్న అతి మామూలు సంఘటన వల్ల అంత భీబత్సమైన గొడవ జరిగి అంజయ్య గారి పదవి పోవడానికి పార్టీ లోపల ఉన్న ముఠాతత్వపు రెడ్డి కులస్థుల తెరచాటు రాజకీయమే ముఖ్యమైన కారణమని అనిపిస్తున్నది నాకు.

స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి కాంగ్రెసు పార్టీ చరిత్రలో ఇలాంటివి ఎన్నో జరిగాయని తెలియని కుర్ర సన్నాసి రాజీవ్ గాంధీ ఇక్కడ చేసిన హడావిడి చాలక ఢిల్లీ వెళ్ళగానే తల్లికి చాడీలు చెప్పాడు.వెంటనే ఆమె అంజయ్య గారిని తొలగించి భవనం వెంకట్రామి రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసింది.అంజయ్య గారి వింత పరిస్థితి చూడండి - రేపటి రోజున ముఖ్యమంత్రి పదవి వస్తుందని వచ్చినప్పుడూ తెలియదు,రేపటి రోజున ముఖ్యమంత్రి పదవి పోతుందని పోయినప్పుడూ తెలియదు!"Whatever one may say against him, his remarkable simplicity endeared him to the people" అని అంజయ్య గారి మంత్రివర్గ సహచరుడు అన్నది అక్షరాల నిజం.విషయం తెలిసి ఆయన రాజీనామా చెయ్యడానికి ముందు రోజు అభిమానంతో ఆయన్ని చూడటానికి వచ్చినవాళ్ళు 30,000 మంది!

అంజయ్య గారి తర్వాత వచ్చిన (19)భవనం వెంకట్రామి రెడ్డిగారు 1982 ఫిబ్రవరి 24 మొదలు 1982 సెప్టెంబర్ 20 వరకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఈయన తర్వాత మొదటి విడత ముఖ్యమంత్రిగా వచ్చిన (20)కోట్ల విజయ భాస్కర రెడ్డిగారు కూడా 1982 సెప్టెంబర్ 20 మొదలు 1983 జనవరి 09 వరకు మాత్రమే ఉన్నారు.

అప్పటి వరకు ముఖ్యమంత్రులైన రెడ్లు మామూలు పదవీలాలసులు అయితే కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు మొట్ట మొదటి ఫ్యాక్షనిష్టు నేపధ్యం ఉన్న ముఖ్యమంత్రి.బహుశః, ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి అయిన శుభతరుణాన అమరలోకం చేరిన పాళెగాండ్ర వంశీయులు అక్కడ రంభాదిదివ్యరమణులు గుండెలదిరి దడుచుకు చచ్చేలా అట్టహాసాలు చేస్తూ పండగ చేసుకుని ఉంటారు కాబోలు!

Dr.Balagopal వంటి సీనియర్ రాజకీయ విశ్లేషకులు రాయలసీమ ఫ్యాక్షనిజం పుట్టుక, పెరుగుదల వంటి విషయాలను గురించి చాలా పరిశోధన చేశారు. తమను పోషించి రక్షించే యజమానుల పట్ల నిర్నిబంధమైన కృతజ్ఞతా విశ్వాసమూ వంటి ఉన్నత లక్షణాలను ప్రదర్శించడం, తనచే పోషించబడి రక్షించబడే విధేయుల పట్ల నిర్నిబంధమైన వాత్సల్యమూ అనురాగమూ వంటి ఉన్నత లక్షణాలను ప్రదర్శించడం మధ్య యుగాల నాటి భూస్వామ్య సంస్కృతికి చెందిన యజమాని-సేవక వర్గాల మధ్య ఉండే ప్రధాన లక్షణం.

రాయల సీమ అంటే రాయలేలిన సీమ అని అర్ధం.నీలకంఠ శాస్త్రి వంటి చారిత్రక పరిశోధకులు తేల్చి చెప్పిన దాని ప్రకారం పాళెగాళ్ళ వ్యవస్థ రాయల కాలంలో రూపు దిద్దుకున్నదే.విస్తారమైన సామ్రాజ్యాన్ని తనొక్కడే పరిపాలించలేని ప్రతి చక్రవర్తీ సామంతులను ఏర్పాటు చేసుకున్నాడు.అయితే, సామత రాజుల వ్యవస్థ కన్న రాయలు ఏర్పాటు చేసిన పాళెగాండ్ర వ్యవస్థ కొంచెం భిన్నమైనది.సైన్యం మొత్తాన్ని ఒక్క చోటనే కేంద్రీకరిస్తే తన సొంత ఖర్చులతో పోషించాల్సి వస్తుంది కాబట్టి సైన్యాన్ని విభజించి వాళ్ళ సొంత పోషణ వాళ్ళే చేసుకుని చక్రచర్తికి సైన్యసహాయం అవసరమైనప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి వచ్చి మళ్ళీ సైనికశిక్షణ కొనసాగించడం, అంతే!సామంతులకు స్వంత విచక్షణను ఉపయోగించి శాసనాలను చేసే హక్కులు కూడా ఉంటాయి.పాలెగాళ్ళకు చక్రవర్తి లేక ప్రభువు చేసిన శాసనాలను అమలు చేస్తూ శాంతి భద్రతలను కాపాడే బాధ్యతలు మాత్రమే ఉంటాయి.

రాయల విస్తరణ ప్రస్తుత ఆంధ్రప్రాంతం,రాయలసీమలతో ఆగక తమిళనాడు వైపుకు కూడా సాగినప్పుడు అక్కడ కూడా వీరి స్థావరాలు ఏర్పడ్డాయి.ఒక్క రాయల సామ్రాజ్యమే కాక అన్ని రకాల రాజవంశాలూ అంతరించి పోవడంతో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఏర్పడే నాటికి పాలనా పరమైన శిక్షణ లేకపోవడంతో పాళెగాళ్ళ సంస్థానాలు చాలా అనాగరికమైన సంస్కృతిలో ఉండేవి.1880 నాడు సీడెడ్ పేరుతో నిజాము నుంచి కర్నూలు, కడప, అనంతపూరు, బళ్ళారి జిల్లాల్ని తీసుకున్నప్పుడు మొత్తం 80 మంది పాళెగాళ్ళూ 30,000 మంది అనుచరుల వంటి సైనికులూ ఉన్నారు.వీళ్ళని కంట్రోల్ చేసి పరిపాలనని ఒక గాటికి తెచ్చేటప్పటికి Thomas Munroe దొరగారికి చుక్కలు కనిపించాయి.ఇప్పటి మార్కాపూరు డివిజనులోకి వచ్చే అప్పటి కర్నూలు జిల్లాలోనే 22 మంది పాలెగాళ్ళు తిష్ఠ వేసుకుని కూర్చున్నారు. కోటకొండ, దేవనకొండ, కప్పట్రాళ్ళ, అవుకు, కోవెలకుంట్ల గ్రామాలన్నీ వాళ్ళ ఉక్కు పిడికిలిలో ఉండేవి.మన్రో దొరగారు చాలామంది పాళెగాళ్ళని దారిలోకి తెచ్చాడు.అయితే, అతను వ్యక్తుల్ని మాత్రమే అణిచేశాడు గానీ పాళెగాళ్ళ వ్యవస్థని భగ్నం చెయ్యలేదు కాబట్టి వాళ్ళ సంస్కృతి మారలేదు.ఆనాటి అణిచివేయబడుతున్న దశలోని పాళెగాళ్ళలో ఒకడైన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డికే ఈనాడు తొలి స్వాతంత్య్ర వీరుడని గురింపు ఇచ్చి అతడ్ని దేశభక్తికి ప్రతీకని చేస్తున్నారు - అజ్ఞానం కాకపోతే ఏమిటిది?

ఇంగ్లీషువాళ్ళు తొలినాటి గెజెట్లలో 'murders occur frequently in Kurnool district. Reasons for these murders were either personal vengences or disputes relating to land. Mostly land disputes lead to serious lootings. Kovellakuntla is famous for these types of tensions.' అని రాసుకున్నారు.అప్పటి కలహాలు చాలామటుకు ఆస్తి వివాదం, అక్రమ సంబంధం, ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి పెళ్ళాడటం వంటి వాటి చుట్టూరానే తిరుగుతూ ఉండేవి.అప్పటి పాలెగాళ్ళు మాత్రమే కాదు వాళ్ళు రూపం మార్చుకుని కనబడుతున్న ఇప్పటి ఫ్యాక్షనిష్టులు కూడా సొంత అహాల కోసం పోట్లాటలూ యుద్ధాలూ చేసేటప్పుడు శత్రువుల పట్ల క్రూరంగా ఉండేవాళ్ళు తప్పించి ఇతర సందర్భాల్లో నమ్రతనీ మర్యాదనీ గౌరవాన్నీ వాత్సల్యాన్నీ ప్రదర్శించేవాళ్ళు - అప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు "చా!వీళ్ళు ఫ్యాక్షనిస్టు లేంటి?" అనుకుంటారు, నిజం!అప్పటి వాళ్ళలో ఒక రకమైన పిచ్చితనం కూడా ఉండేది. వైభవాన్ని కొనసాగించడం కోసం విపరీతమైన ఖర్చులు చేస్తూ అప్పులపాలై చితికిపోయిన ఫ్యాక్షనిస్టు కుటుంబాలు కూడా ఉన్నాయి.స్వతంత్రం వచ్చాక కాంగ్రెసు పార్టీ వాళ్ళకి నాగరికత నేర్పి కొత్త కొత్త ఉపాధుల్ని కల్పించి కొంచెం వృద్ధిలోకి తెచ్చింది.

ఎన్నికల వ్యవస్థ వాళ్ళకి మంచి ఉనాదిని కల్పించిందని చెప్పాలి.ఇంగ్లీషు వాళ్ళ కాలం నుంచే జిల్లా బోర్డు ఎన్నికలు వీళ్ళకి వృద్ధిలోకి రావడానికి మంచి అవకాశాల్ని కల్పించాయి.పార్టీలూ జెండాలూ ఎజెండాలూ మ్యానిఫెస్టోలూ శుద్ధ వేస్ట్ - నిలబడింది ఎవరెవరు, వాళ్ళ సైనికశక్తి ఎంత అన్నదే గెలుపును నిర్ణయిస్తుంది.1938 తాలూకా బోర్డు ఎన్నికలు కాంగ్రెసు పార్టీకి చెందిన కంబాలపాడు ఈడిగ మాదన్న గారు,జస్టిస్ పార్టీకి చెందిన కోట్ల విజయ భాస్కర రెడ్డి గారి పెదనాన్న చిన్న సుబ్బా రెడ్డి గార్ల మధ్యన జరిగాయి.ఆ ఎన్నికలో చిన్న సుబ్బా రెడ్డి గారు ఓడిపోయారు.ఒకవేళ, చిన్న సుబ్బా రెడ్డి గారు కాంగ్రెసు తరపున పోటీ చేసి కం.ఈ.మాదన్న గారు జస్టిస్ పార్టీ తరపున పోటీ చేస్తే కూడా ఫలితంలో మార్పు వుండేది కాదు.

ప్రతి చెడులోనూ కొంత మంచి ఉంటుంది, ప్రతి మంచిలోనూ కొంత చెడు ఉంటుంది, నూటికి నూరు శాతం మంచి గానీ నూటికి నూరు శాతం చెడు గానీ ఉండవు అన్నట్టు భూసంస్కరణలు వీళ్ళు భూముల్ని వదిలి ఎన్నికలనే తమ ప్రధాన ఆదాయ వనరుల కింద మార్చుకునేలా చేశాయి.

సారాయి వ్యాపారం వీళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైన అనుబంధ పరిశ్రమ కావడం వల్లనే ఆనాడు మొదలు ఈనాడు వరకు మద్యనిషేధం అమలు జరగటం లేదు.1983లో రామారావు నేతృత్వంలో తెలుగు దేశం అధికారంలోకి వచ్చేవరకు కర్నూలు జిల్లాలోని తాటి చెట్లూ సారా బట్టీలూ లిక్కర్ షాపులూ కం.ఈ.మాదన్న గారి కుటుంబ సభ్యుల అజమాయిషీ కింద వుండేవి. ఎక్కడైనను బావ కానీ వంగతోట దగ్గిర మాత్రము కాదన్నట్టు సారాయి పరిశ్రమని జోన్ల వారీ పంచుకోవడంలో రాయలసీమ ఫ్యాక్షనిష్టులు అందరూ ఎంతో ఐకమత్యాన్నీ సౌహృదాల్నీ చూపిస్తూ ఉంటారు.ఆళ్ళగడ్డకి చెందిన భూమా నాగి రెడ్డి గారి గంగుల ప్రతాప రెడ్డి గార్ల కుటుంబాలు తమ ప్రాంతం మీద అధిపత్యాన్ని వాళ్ళలో వాళ్ళు పంచుకుంటూ పంపకాల ఒప్పందాల్లో తేడా వస్తే వాళ్ళలో వాళ్ళు ఒకళ్ళ నొకళ్ళు చంపుకుంటున్నప్పటికీ కొత్తవాళ్ళు అధిపత్యం కోసం పోటీ పడదల్చుకున్నప్పుడు మాత్రం ఆ కొత్తవాళ్ళని పోటీనుంచి తప్పించడానికి ఆప్తమిత్రుల మాదిరి కలిసి పోతారు.

ఫ్యాక్షనిస్టులు ఎక్కడ అడుగు పెడితే అక్కడి పంచ భూతాల మీద వాళ్ళకి అధిపత్యం రావల్సిందే - అక్కడ సృష్టించబడుతున్న సంపద మొత్తం మొదట వాళ్ళ పాదాల చెంతకి చేరాల్సిందే.ఫ్యాక్షనిష్టులూ వాళ్ళ లాయలిస్టులూ వాళ్ళకి సరిపడినంత పంచుకున్నాకనే మిగిలింది తక్కిన వాళ్ళకి విదిలిస్తారు!వీళ్ళకి ఇష్టమైన ఆదాయ మార్గాలు - a).Civil Contracts, b).Industrial Resources, c).Forest Wealth, d).Elections, e).Arrak Market.ప్రభుత్వాధినేతలు ప్రజల సౌభాగ్యం కోసం అని చెప్పి ప్రకటించే ప్రతి పధకమూ నిజానికి వీళ్ళ సౌభాగ్యం కోసమే ఉపయోగపడుతున్నాయి.

Roads, Canals, Banks, Co-operative Societies, Development Programmes, Welfare Schemesకి సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదించుతున్న ప్రతి కార్యక్రమంలోనూ భాగస్వాములు వీరే అవుతారు.పెద్ద స్థాయి లాభం తెచ్చిపెట్టే కార్యక్రమాల్ని ఫ్యాక్షనిస్టులు అమలు చేస్తారు,మధ్య స్థాయి లాభం తెచ్చిపెట్టే కాంట్రాక్టుల్ని లాయలిస్టులు తీసుకుంటారు,చిల్లర ప్రాజెక్టుల్ని ఇతరులకి ఇస్తారు.ఫ్యాక్షనిష్టుల అధిపత్యం అమలయ్యే ప్రాంతంలో bank loans, house pattas వంటివి ఇవ్వడం గానీ government schemes వల్ల అమరే సౌకర్యాలు గానీ మొదట వీళ్ళకి లొంగి ఉండేవాళ్ళకి మాత్రమే దక్కుతాయి.Revenue administration మొదలు అన్ని governmental departments వీళ్ళ అధీనంలోనే ఉంటాయి.Contracts కోసం factionists మధ్య conflict వచ్చినప్పుడు capital దగ్గిర పలుకుబడి ఉన్న factionist పరపతి గెలుపును నిర్ణయిస్తుంది.కాంగ్రెసు అధిష్ఠానం ముఖ్యమంత్రుల్ని మార్చడం వెనక ఉన్నది ప్రస్తుతం state capital దగ్గిర పలుకుబడి ఉన్న factionist వల్ల నష్టపోతున్న అవతలివైపు ఫ్యాక్షనిష్టులు country capital దగ్గిర పెంచుకున్న పరపతియే!

ఒక ప్రాజెక్టును ప్రభుత్వ రంగం బలమైన స్థితిలో ఉన్నప్పుడు అధికారులే పర్యవేక్షించడం జరిగితే అప్పుడు అధికారులు కొల్లగొట్టేస్తారు.ఒకవేళ, అన్ని ప్రాజెక్టుల్లో అధికారులు కొల్లగొట్టనప్పటికీ ఫ్యాక్షనిస్టులు రంగంలోకి దిగి అధికారుల మీద బురద జల్లేస్తారు.ఇక ప్రాజెక్టుని ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వదల్చుకుంటే public tenders పిలుస్తారు.అయితే, పాటించిన పద్ధతి ఎంత పారదర్శకం అయినప్పటికీ ప్రాజెక్టులు మాత్రం ఫ్యాక్షనిష్టులకే వెళతాయి.మొదట ఇతర్లని అసలు టెండర్లు వెయ్యనివ్వరు.ఫ్యాక్షనిష్టులూ లాయలిస్టులూ కానివాళ్ళకి రెండే రెండు దార్లు - తమకు దక్కిన టెండర్లని తక్కువ రేటుకి అమ్ముకుపోవడం, ఫ్యాక్షనిస్టులకి  fct-Tax కట్టి బతికిపోవడం.తమకు లాభాలను తెచ్చిపెట్టగల స్థాయికి ప్రాజెక్టు విలువని పెంచడమూ సీల్డ్ కవరులోని అంకెల్ని వీరికి చేరవెయ్యడమూ ప్రభుత్వంలోకి చేరుకున్న లాయలిస్టుల పవిత్ర కర్తవ్యం.K.C. Canal, L.L.C. Canal contracts, S.R.B.C. contracts, Telugu Ganga tenders వంటివి మొదట చిన్న ప్రాజెక్టుల మాదిరి ప్రతిపాదించబడి పిదప పెద్ద ప్రాజెక్టుల కింద రూపు దాల్చడం వీరి లీలా వినోదమే!

మొండికి తిరిగి టెండర్లు వెయ్యదల్చుకున్న బయటివాళ్ళని లేపెయ్యడం దగ్గిర్నుంచి అభ్యంతరం చెప్పిన అధికారుల్ని లేపెయ్యడం వరకు గల భీబత్సరస ప్రధానమైన కార్యక్రమాల్ని దేవుడు వారికి విధించిన పవిత్ర కర్తవ్యం అన్నంత నిబద్ధతతో నిర్వహిస్తారు.సృష్టిలో రాజ్యపాలన అనేది మొదలైనప్పటినుంచీ పితృ పుత్ర బంధు మిత్ర సపరివార సమేతం ఇటువంటి కార్యక్రమాలలో నిమగ్నమై గురుశిష్య పరంపరతో కొనసాగుతున్న ఇలాంటి మహనీయులనే జాత్యహంకారం తలకెక్కిన బ్రాహ్మణాధములు అసురులని పేరు పెట్టి నిందించి వారు అమరులని అనుకున్న వారి చేత చంపిస్తూ పురాణ కధలను వ్రాశారు.

quarry-based industry అనేది guns and gangs లేనివాడు అడుగు పెట్టటానికే వీల్లేని జీమూతం.కర్నూలు జిల్లాలోని చర్లపల్లి చుట్టుపక్కల ఆరు వందల ఎకరాల ప్రభుత్వ భూమిలో Slab-stone mines ఉన్నాయి.వాస్తవానికి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్కడ త్రవ్వకాలు జరపకూడదు.కానీ, ఎలాంటి అనుమతులూ లేని చల్లా రామకృష్ణా రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎప్పటినుంచో అక్కడ మైనింగ్ వ్యాపారం చేస్తూనే ఉన్నారు.నల్లమల అడవులకు చెందిన  ముచ్చుమర్రి, ఆత్మకూరు, ఆళ్ళగడ్డ, వెలుగోడు ప్రాంతాల నుంచి ఎర్ర చందనం,టేకు,మద్ది, జిట్ట రేగు అనే అత్యంత ఖరీదైన కలప టన్నుల కొద్దీ సంగ్లింగ్ జరుగుతూనే ఉంది.

తుపాకీ లైసెన్సు పొందడం ఒకప్పుడు దాదాపు అసాధ్యం.కానీ, ఇప్పుడు సుసాధ్యం.ఇదివర్లో నాటు బాంబులు ఎక్కువ వాడేవాళ్ళు.సీమవాసులు వాళ్ళలో వాళ్ళే జోకులు కూడా వేసుకునేవాళ్ళు - "రాయలసీమలో కూరగాయల కన్న నాటుబాంబులు చవక!" అని.కానీ, 2010 నాటికి ఫ్యాక్షనిష్టులు ప్రభుత్వాధినేతలు కావడంతో తుపాకులూ ఇతర ఆధునికమైన ఆయుధాలకు లైసెన్సులు పొందడం సులువైపోయింది.

మొదట ఒక ఫ్యాక్షనిష్టు గారి లాయలిస్టులు మరొక ఫ్యాక్షనిష్టు గారిని గానీ ఆ ఫ్యాక్షనిష్టు గారి లాయలిష్టుల్ని గానీ చంపుతారు.అటువైపువాళ్ళు శవయాత్రలో వీళ్ళ పేర్లని చెప్తూ శపధాలు చేస్తారు.వెంటనే ఇటువైపువాళ్ళు దాన్ని ఆధారం చేసుకుని ఆత్మరక్షణ కోసం అప్లికేషన్ పెట్టుకుంటారు.వీళ్ళ ఫ్యాక్షనిష్టు గారు శాసనసభ్యుడి స్థానంలో గానీ మంత్రి స్థానంలో గానీ ఉన్నట్లయితే వీళ్ళకి రికమెండ్ చేస్తారు.లైసెన్సు చిటికెలో వచ్చేస్తుంది.ఇప్పుడు అటువైపువాళ్ళు దీన్ని ఆధారం చేసుకుని ఆత్మరక్షణ కోసం అప్లికేషన్ పెట్టుకుంటారు.వాళ్ళ ఫ్యాక్షనిష్టు గారు శాసనసభ్యుడి స్థానంలో గానీ మంత్రి స్థానంలో గానీ ఉన్నట్లయితే వాళ్ళకి రికమెండ్ చేస్తారు.వాళ్ళకీ లైసెన్సు చిటికెలో వచ్చేస్తుంది.

చాలా కాలం నుంచి పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, జిల్లా ప్రజా పరిషత్, అసెంబ్లీ, లోక్ సభ వరకు గల ప్రజా ప్రతినిధుల్లో నూటికి అరవై శాతం మంది ఫ్యాక్షనిష్టులే - లాయలిష్టులు మాత్రం కింది స్థాయిలో చంపడానికీ చావడానికే పనికొస్తారు తప్ప వారిని పై స్థాయికి రానివ్వరు.పత్తికొండకి చెందిన కోట్ల విజయ భాస్కర రెడ్డి గారి కుటుంబానికీ కొడుమూరుకి చెందిన కం.ఈ.కృష్ణమూర్తి గారి కుటుంబానికీ గల వైరం పురాణ ప్రసిద్ధం. ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి గంగుల ప్రతాప రెడ్డి గారి కుటుంబీకులూ భూమా నాగి రెడ్డి గారి కుటుంబీకులూ మకుటం లేని మహారాజులు.పాణ్యం ప్రాంతం మొత్తం కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, చల్లా రామ కృష్ణా రెడ్డి గార్ల సొంత ఆస్తి.ఇక నందికొట్కూరుకు వస్తే బైరెడ్డి రాజశేఖర రెడ్డి, మద్దూరి సుబ్బా రెడ్డి గార్ల కుటుంబ సభ్యులు గీచిన గీటు దాటిన వాడు ప్రాణాలతో ఉండదు.ఆత్మకూరు నియోజకవర్గం బుడ్డా వెంగళ రెడ్డి, కేదారనాథ రెడ్డి గార్ల కుటుంబ సభ్యుల చెప్పుల కింద అణిగి మణిగి పడివున్న తేలు.

వీరి వ్యాపార సంవిధానం ఎలా ఉంటుందో దృశ్యరూపంలో చూడాలని ఉందా?నిన్న గాక మొన్న కరోనా పేరుతో నిమ్మగడ్డ రమేష్ గారు ఆపేసిన ఎన్నికల్లో పేరు రూఢి కాని అధికార పార్టీ వారు సాధించిన ఏకగ్రీవాలు ఫ్యాక్షనిష్టుల సహజమైన సృజనాత్మకతయే తప్ప మున్నెన్నడూ కనీ వినీ ఎరుగని నూతన విధానం ఏమీ కాదు!

అలాంటి ఫ్యాక్షనిస్టు నేపధ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు ఫ్యాక్షనిస్టు మనస్తత్వం లేని మంచి మనిషి.ముఖ్యమంత్రి కావడం కోసం శాసనసభకు ఎన్నిక కావడానికి తన కుటుంబపు లాయలిస్టుల్ని వాడుకున్నారు - నిజమే!తను దిగిపోయిన లోక్ సభ స్థానానికి తన కొడుకును పంపించుకోవడానికి తన కుటుంబపు లాయలిస్టుల్ని వాడుకున్నారు - అదీ నిజమే!అంతకు మించి పగలూ ప్రతీకారాలూ పెట్టుకుని చేయించే హత్యలూ నేరాల వంటివాటికి దూరంగా ఉన్నారు.కాంగ్రెస్ అధిష్ఠానం కూడా అప్పటికే రామారావు విజృంభణ వెన్నులో చలి పుట్టించి అప్పుడు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఇతర్లని పక్కన పెట్టి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారిని ఎన్నుకున్నది.ఆశ్చర్యం ఏమిటంటే,తర్వాత రామారావు భళారే మేల్భళారే అనిపించేటట్టు ప్రదర్శించుకున్న "మధ్యాన్న భోజన పధకం","రెండు రూపాయలకి కిలో బియ్యం పధకం" అనేవి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు మొదట ప్రారంభించారు.కాకపోతే కాంగ్రెసు అధిష్ఠానం తన సంప్రదాయం ప్రకారం కోట్ల విజయ భాస్కర రెడ్డి గారిని ప్రోత్సహించినంత నిజాయితీగా నిత్య అసమ్మతి వాదుల్ని కూడా ప్రోత్సహించడంతో వాళ్ళు చేసిన అల్లరిలో వీటి గురించి ప్రజలకి తెలియలేదు, అంతే!ఫలితం, గంప లాభం చిల్లి తీసినట్టు రామారావుని నిలువరించడం కోసం బరిలో దించిన కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు రామారావుకి అఖండ విజయాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి సమర్పించారు.

అలా అంజయ్య గారికి తల్లీ కొడుకులు చేసిన అవమానమూ ఆది నుంచీ బొమ్మల్ని మార్చినట్టు ముఖ్యమంత్రుల్ని మార్చటమూ ప్రతి ఒక్కరిలోనూ కాంగ్రెసు పార్టీ పట్ల అసహ్యాన్ని పెంచింది.దానితో ఆంధ్రుల వెండితెర కృష్ణుడు నందమూరి తారక రామారావు "ఆంధ్రుల ఆత్మగౌరవం!"," కేంద్రం సవతి తల్లి ప్రేమ!" వంటి నినాదాలతో రాజకీయ రంగంలోకి మెరుపులా దూసుకొచ్చి పార్టీ పెట్టిన ఆరు నెలల లోపే అధికారంలోకి వచ్చాడు!

రామారావు మొదట పార్టీ పెట్టినప్పుడు రాజకీయ రంగంలో ఇంత స్థాయి విజయం సాధిస్తాడని చాలామంది నమ్మలేదు.అయితే, సక్సెస్ కోసం సినిమా రంగంలోనూ రాజకీయాలు నడుస్తున్న కాలంలో అప్పటికే మోనాపలీ సాధించిన నాగేశ్వర్రావుతో పోటీ పడి ప్రొడ్యూసర్లలోనూ టెక్నీషియన్లలోనూ తనకంటూ ఒక గ్రూపును ఏర్పాటు చేసుకుని ఎదిగిన సినిమా ఫీల్డులోని రాజకీయాల అనుభవం ఇక్కడ ఇలా ఉపయోగపడింది కాబోలు!సినిమా రంగంలో కొనసాగడానికి ఎప్పటికప్పుడు కొత్త హిట్ ఇవ్వడం అనేది ముఖ్యం అయినట్టు రాజకీయ రంగంలో కొనసాగడానికి ఎప్పటికప్పుడు కొత్త సెన్సేషన్ పుట్టించి మీడియా ఫోకస్ తన మీదకి రప్పించుకోవడం అనేది ముఖ్యం - ఇది తెలియకనే కళా వెంకట్రావు, బెజవాడ గోపాల రెడ్డి లాంటివాళ్ళు రాజాజీ, ప్రకాశం స్థాయిలో పేరు తెచ్చుకోలేకనూ పేరు పట్ల కక్కుర్తి ఆపుకోలేకనూ తమ కోడిమెదడుకు తోచిన చెత్త పనులు చేసి అభాసు పాలయ్యారు!

రామారావు ప్రచారశైలిలోనూ అభ్యర్ధుల ఎన్నికలోనూ కొత్త పుంతలు తొక్కాడు - జనం ఇతర్ల సినిమాల్ని చూడ్డం మానేసి తన సినిమాయే చూడాలంటే తన సినిమాలో వెరైటీ ఉండాలి కదా!పాత కారుకి ముస్తాబు చేసి చైతన్య రధం అని పేరు పెట్టాడు.The Laughing Policeman ట్యూనుని కొంచెం మార్చి వివాహ భోజనంబు పాటని కూర్చి హిట్ చేసినట్టు అసలు ఐడియా యంజీయారు నుంచి కాపీ కొట్టి సొంత అయిడియా చేర్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం రాబట్టాడు.రెడ్డి కులస్థుల అవినీతి సామ్రాజ్యం అయిపోయిన కాంగ్రెసుకి భిన్నమైన రీతిలో కనపడాలని అన్ని కులాల నుంచీ అవినీతి చరిత్ర లేని మంచిపేరున్న వాళ్ళని పార్టీలోకి తీసుకుని కీలకమైన పాత్ర ఇచ్చి గౌరవించాడు. మధ్యనే భౌతికంగా కీర్తిశేషుడైన కోడెల శివప్రసాద రావు గారు  మొదలు మధ్యనే రాజకీయంగా కీర్తిశేషుడైన ముద్రగడ పద్మనాభం గారి వరకు చూస్తే కేవలం రామారావు ప్రమేయం/ఆహ్వానం వల్లనే రాజకీయాల్లోకి వచ్చి  ప్రఖ్యాతులైన మంచివాళ్ళు చాలామందే ఉన్నారు.

అలా అప్పుడున్న 294 సీట్లకి 202 సీట్లు తెచ్చుకుని ఆనాటి 1983 జనవరి 09 (21)నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదకొండవ ముఖ్యమంత్రి అయ్యాడు.తను మొదటిసారి ప్రతికక్షుల్ని "కుక్క మూతి పిందెలు!" అని అన్నప్పుడు ప్రచురించిన పత్రికాధిపతులూ చదివిన పాఠకోత్తములూ ఉలిక్కి పడ్డారు.అయితే, తిడుతున్నది అప్పటికే అవినీతితో పుచ్చిపోయిన కాంగ్రెసు నాయకులను కాబట్టి ప్రజల నుంచి అనుకూల స్పందన రావడంతో తరహా భాషకి అలవాటు పడిపోయారు.అయితే, తర్వాతి తరం వాళ్ళు రామారావు తరహా సభ్యతాయుతమైన వ్యంగ్యాలను వాడాల్సిన చోట తమ సొంత కుసంస్కారం కలిపి బూతులకి లంకించుకోవటంతో కొందరు సున్నిత మనస్కులు కుక్కమూతిపిందెలకి ఆద్యుడైన రామారావునే అమ్మనాకొడుకులకీ బాధ్యుణ్ణి చేసేశారు - తప్పు కదా పాపం!

రామారావు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సినిమాటిక్ మెలోడ్రామాతో కూడిన ఆంగికాభినయాన్ని వదలలేదుప్రత్యర్ధులు డ్రామారావు అని హాస్యోక్తులు ఆడుతున్నప్పటికీ పట్టించుకొలేదు."చెమటోడ్చి" అనే పదం రాగానే బొటనవ్రేలితో నుదురును రుద్దుకోవటం,"పట్టుదల" అనే పదం రాగానే పిడికిలి బిగించి చూపించటం, "ఢిల్లీ/కేంద్రం" అనే పదం రాగానే తల పైకెత్తి పైకప్పు వైపుకు చూడటం లాంటివి అతి అనిపించినప్పటికీ రామారావు యొక్క నాటకీయ ప్రసంగాల వల్ల ఒక ప్రయోజనం సమకూరింది.

అదివరకు కాంగ్రెసువాళ్ళు కూడా కొన్ని మంచిపనులు చేసి అఘోరించినప్పటికీ బిల్లుల్ని పాస్ చెయ్యటమూ అమలును అధికార్లకి అప్పజెప్పటమూ తప్ప ప్రజలకి వాటి గురించి తెలియజెప్పేవాళ్ళు కాదు.అందువల్ల చదువుకున్న వాళ్ళూ చట్టాలు ఉన్నాయని తెలిసిన వాళ్ళూ ఉపయోగించుకుని బాగుపడేవాళ్ళు, చదువు రానివాళ్ళూ ప్రభుత్వం తమకు కల్పించిన సౌకర్యాలను గురించి తెలుసుకోలేనివాళ్ళూ మోసపోయేవాళ్ళు.అదే రామారావు కిలో రెండు రూపాయలకి బియ్యం ఇచ్చే పధకం దగ్గిర్నించి తను పెట్టిన ప్రతి పధకం గురించీ ఒక బహిరంగ సభ పెట్టి "అంకితం, పునరంకితం" అని హావభావాలను ఆంగికాభినయంతో రంగరించి అదరగొట్టెయ్యడం కొందరికి నవ్వు తెప్పించేలా ఉన్నప్పటికీ ప్రతి సామాన్యుడికీ ప్రభుత్వం తమకు ఇస్తున్నదాన్ని గురించి తెలుసుకుని ఇవ్వకపోతే గద్దించి అడిగే దమ్మూ తెలివీ వచ్చాయి.

రామారావు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచేసరికి రాజకీయానుభవం లేని రామారావుకి ట్రైనింగ్ ఇచ్చి స్టెపినీ టైరులా వాడుకుంటూ తను ముందుండి నడిపిస్తూ చక్రం తిప్పుదామనుకుని కాంగ్రెసుపార్టీ నుంచి బయటికొచ్చి రామారావుతో కలిసిన నాదెండ్ల భాస్కర రావు గారు రామారావు చూపిస్తున్న సొంత తెలివికీ ప్రజల తీర్పుకీ మొదట బిత్తర పోయి తర్వాత తేరుకుని గోతి కాడి నక్కలా సమయం కోసం ఎదురు చూస్తూ కాచుకుని రామారావు బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళిన అవకాశం చూసుకుని రామారావు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తన నాయకత్వాన్ని సమర్ధిస్తున్న శాసనసభ్యుల లిస్టుతో వెళ్ళి గవర్నర్ రాం లాల్ గారిని కలిశారు. ఆయన కూడా సంతృప్తి పడిపోయి వెంటనే రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి (22)నాదెండ్ల భాస్కర రావు గారిని ముఖ్యమంత్రి పదవిలో నియమించారు.ఇది 1984 ఆగస్టు 16న జరిగింది.

అప్పటి రాజకీయ వాతావరణాన్నీ రాజ్యాంగ నిబంధనల్నీ లెక్కించి చూస్తే ఇక రామారావు కాలగర్భంలో కలిసిపోవడం తప్ప చరిత్ర మరో విధమైన మలుపు తీసుకునే అవకాశం లేదు.కానీ, రామారావు ఏటికి ఎదురీది అయినా సరే మళ్ళీ పదవిని దక్కించుకోవాలని అనుకోవడం వల్ల చరిత్ర ఒక అనూహ్యమైన మలుపును తీసుకుంది.

బైపాస్ సర్జరీ పూర్తి కాగానే ఆగమేఘాల మీద రాష్ట్రంలోకి వచ్చిపడి తనను సపోర్టు చేస్తున్న శాసన సభ్యుల్ని గవర్నరు ముందుకి తీసుకెళ్ళి చూపించాడు.అయినప్పటికీ రాం లాల్ గారు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.రామారావు మళ్ళీ చైతన్యరధం ఎక్కి సుడిగాలి పర్యటనతో విజృంభించాడు.దీనితో పాటు సందట్లో సడేమియా అన్నట్టు రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు తమ దగ్గిరున్న శాసనసభ్యులు భాస్కర్రావు వైపుకు వెళ్ళకుండా చెయ్యటానికి ఒక కొత్త రకం ఎత్తు వేశాడు - వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు ఎత్తుకెళ్ళి ఒక హోటల్లో ఉంచటం అప్పుడు వింత అనిపించింది గానీ తర్వాత నుంచి రకమయిన ఇబ్బంది వచ్చినప్పుడు ప్రతి పార్టీ అదే పద్ధతి ఫాలో అవుతున్నది. బహుశః నెల తర్వాత గతి లేక (23)రామారావును తిరిగి ముఖ్యమంత్రిని చెయ్యటానికి రామ్ లాల్ గార్ని తప్పించాల్సి రావటం చంద్రబాబు దాచేసిన శాసనసబ్యుల్ని కొనుగోలు చెయ్యటం కుదరకనే కాబోలు!అది 1984 సెప్టెంబర్ 16న జరిగింది.

ఫెయిలయిన నాదెండ్ల భాస్కర్రావు గారి తిరుగుబాటు NTR మనస్సులో జాగ్రత్తనూ తెలివినీ పంచటానికి బదులు అంతకు ముందరి ఆత్మవిశ్వాసం అహంభావం కింద మారింది.అంతకు ముందరి "కుక్కమూతిపిందెలు" తరహా భాష పదునెక్కింది.సంవత్సరం తిరక్కుండానే తనమీద తిరుగుబాటు చేసి భాస్కర్రావు పంచన చేరిన అవినీతిపరుల్ని వదిలించుకునే నెపం మీద 1985 నాడు తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ఎన్నికలకు వెళ్ళాడు.మళ్ళీ 202 సీట్లు గెలుచుకున్నప్పటికీ వోట్ల శాతం కొంచెం తగ్గింది.

తను స్వయాన "The election was called to teach a lesson to the defectors. The Telugu Desam was formed not with the intention of capturing power but to promote moral and ethical conduct in political and public life. We have got the people's mandate once again to complete the unfinished tasks." అని చెప్పుకున్నాడు గనక ఎన్నికల ఫలితాలను కొంచెం సూక్ష్మ పరిశీలన చేస్తే బాగుంటుంది కదా!కొన్ని కాంగ్రెసు కంచుకోటల్ని కైవసం చేసుకుంది.1983 ఎన్నికల్లో కాంగ్రెసుకి తెలంగాణ నుంచి 44 సీట్లు వస్తే ఈసారి 13 సీట్లు మాత్రమే వచ్చాయి.1983లో 38 స్థానాలను మాత్రమే సాధించిన తెలుగుదేశం ఇప్పుడు 59 సీట్లని సాధించింది.

ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరిల నుంచి 74 సీట్లకి 67 సీట్లని బంపర్ మెజార్టీతో గెల్చింది.అయితే, దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుల నుంచి కొంత వ్యతిరేకత ఎదురైంది - 60 సీట్లకి 1983 నాటి 50 సీట్లకి 11 తగ్గి 39 సీట్లు వచ్చాయి.రాయలసీమలోనూ 53 సీట్లకి 1983 నాటి 40 సీట్లకి 03 తగ్గి 37 సీట్లు వచ్చాయి.

"The selection of candidates was not done carefully enough and we lost narrowly in several constituencies for want of luck" అని కా.బ్రహ్మానంద రెడ్డి గారూ "We have not been able to convincingly explain the weakness in the policies and programmes of the Telugu Desam" అని కొ.రోశయ్య గారూ "The voters have shown for the third time in two years that the Telugu Desam is the people's party" అని రామారావూ అనటాన్ని బట్టి అప్పటి పరాజయాన్ని కాంగ్రెసు నాయకులు తీసుకున్నంత తెలివితోనూ హుందాగానూ అప్పటి విజయాన్ని రామారావు తీసుకోలేకపోయాడనిపిస్తున్నది నాకు.తెలుగుదేశానికి కమ్మ కులస్థుల పార్టీ అనే ముద్ర పడటం సమయంలోనే మొదలైంది.అప్పుడు కాంగ్రెసుకు పడిన వోట్ల డెమోగ్రఫీని గమనిస్తే ఇతర కులాల వోట్లు కాంగ్రెసు వైపుకి వెళ్తున్నాయనేది అర్ధం అవుతుంది.భాజపా వంటి కొత్త మిత్రపక్షాలు కలవడం వల్ల అప్పుడు తెదెపాకు ఈ ప్రమాద సూచనలు ప్రముఖం కాలేదు.

1985 మార్చి 09 ప్రమాణ స్వీకారం చేసిన పెద్ద మనిషి ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెసు తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉందని గ్రహించి కులముద్రను తొలగించుకునే మంచి పరిపాలన మీద దృష్టిని పెట్టడం మాని భాస్కర్రావు తిరుగుబాటు చేసినప్పుడు జాతీయ స్థాయిలో తనకు లభించిన ఆదరణను ఎక్కువ చేసుకుని మే 28 నాటికే భారత దేశం పార్టీ గురించి ఆలోచన బయట పెట్టాడు.అతనిప్పటికీ తను ఇదివరకు నటించి అప్పుడు రిలీజయిన సినిమా హిట్టా ఫట్టా అనేది మాత్రమే చూసుకుని అప్పటికే సంతకం పెట్టిన కొత్త సినిమా షూటింగుల్లో నిమగ్నమైపోయే సినిమానటుడి మనస్తత్వం నుంచి బయటికి రాలేదు - బ్రహ్మర్షి విశ్వామిత్ర లాంటి చెత్త సినిమా తియ్యడం కోసం ప్రభుత్వ కార్యక్రమాలను కూడా షూటింగ్ స్పాట్ నుంచే నడిపిస్తూ అంత హడావిడి ఎందుకు చేశాడో ఇప్పటికీ అర్ధం కాదు నాకు!

స్వీయ లోపమ్ము లెరుంగుట మాని తన విజయాలకు తన సొంత తెలివినీ దేవుడి దయనీ తన పరాజయాలకు తన దురదృష్టాన్నీ శత్రు పార్టీల కుట్రనీ కారణం అని ఒక రాజకీయ నాయకుడు క్షణం అనుకుంటాడో క్షణం నుంచే అతను ప్రజలతో సంబంధం లేని పదవీ వ్యామోహపు రాజకీయాలు చేస్తున్న అధికార బధిరాంధక మదోన్మత్తుడు అయిపోయాడన్నది తధ్యం!అందుకే, 1978 నాడు 175 సీట్లతో కాంగ్రెసు పార్టీని గెలిపించిన మర్రి చెన్నారెడ్డి గారు మళ్ళీ దశాబ్దం తర్వాత 1989 నాడు పోటీ చేసిన 297 సీట్లకి 181 సీట్లను గెల్చుకుని,"People are the masters.They can say anything they choose to anyone" అని విజయామృత దరహాసం చేస్తుంటే తెలుగు దేశం పోటీ చేసిన 241 సీట్లకి 74 సీట్లు మాత్రమే గెల్చుకుని రామారావు అశ్రుసిక్త నయనాలతో "Lord Krishna said do your duty and don't worry about the results.I have served the people and respect their verdict" అని వేదాంతం చెప్పాల్సి వచ్చింది.

అప్పటి విశ్లేషకులు చాలామంది చాలా రకాల విశ్లేషణలు చేశారు.ఎక్కువమంది రామారావు ఒంటెత్తు పోకడల పట్లనూ వింతైన ప్రవర్తన పట్లనూ ప్రజలకి మొహం మొత్తడం గురించి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు."1988, 89లో జరిగిన రాజకీయ పరిణామాలు, టీడీపీ సర్కారు వేసిన తప్పటడుగులు, విజయవాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు హత్యతో ఆయన సామాజికవర్గంలో తెలుగుదేశంపై పెల్లుబికిన వ్యతిరేకత, 1989 ఆరంభంలో ఒకేసారి తన మంత్రివర్గంలోని సభ్యులందరితో ఎన్టీఆర్ రాజీనామా చేయించడం వంటి అనేక కారణాలు టీడీపీ ఓటమికి దోహదంచేశాయి.ఎన్టీఆర్ 1985లో మరోసారి సీఎం అయ్యాక మూడో అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గుట్టు చప్పుడు కాకుండా తెలుగుదేశంలో చేరారు. ఆయనకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఎన్టీఆర్ ఇచ్చారు. అయితే చట్ట సభలోనూ సభ్యత్వం లేని చంద్రబాబుకు కొత్తగా ఏర్పాటు చేసిన కర్షక పరిషత్ చైర్మన్ పదవి అప్పగించారు. నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా ఎన్టీఆర్కు, టీడీపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించింది.తర్వాత ఒకేసారి మంత్రులందరినీ తొలగించినప్పుడు టీడీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం ప్రయత్నం చేసిన సీనియర్ నేతలు ముద్రగడ పద్మనాభం, వసంత నాగేశ్వరరావు, కుందూరు జానారెడ్డి, కేఈ కృష్టమూర్తి వేర్వేరు సమయాల్లో పార్టీ నుంచి బయటికొచ్చి తెలుగునాడు అనే కొత్త పార్టీ ప్రారంభించారు. చివరికి ఎన్నికల ముందు వారంతా కాంగ్రెస్లో చేరారు.ఇంత జరిగినా పేద, బడుగు వర్గాల్లో ఎన్టీఆర్కు జనాకర్షణ శక్తి తగ్గలేదనీ, తెలుగుదేశమే మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా మంది అంచనావేశారు. కాని, ఏడేళ్ల తెలుగుదేశం పాలనపై జనం వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి కాంగ్రెస్కే అధికారం కట్టబెట్లారు." అని 2018 నవంబర్ 01 సాక్షి దినపత్రిక విశ్లేషించింది.

ఇది పైపైన తరచి చూస్తే ప్రతి ఒక్కరికీ కనబడిన అంశాలను ఒక్క చోట కూర్చిన విశ్లేషణ.ఆవిర్భావం నాడూ పునః ప్రతిష్థాపన నాడూ ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని రామారావు నిలబెట్టుకోలేకపోవడం అనేది నూరు శాతం వాస్తవం.అయితే, రామారావు ప్రజలకు సమర్ధవంతమైన పరిపాలన అందించి ఉంటే పైన చెప్పినవి ఏవీ ఆతనికి అంత దయనీయమైన ఓటమిని తెచ్చిపెట్టేటంత బలమైన కారణాలు అయ్యేవి కావు.

ప్రజలకు సేవ చెయ్యాలనే చిత్తశుద్ధికి కొదవ లేకపోయినప్పటికీ రామారావు ఎందుకు ఫెయిలయ్యాడనే కోణాన్ని అంతమంది విశ్లేషకులలో ఒక్కరూ పట్టించుకోలేదు. అందువల్లనే ఇప్పటికీ ఇన్ని సహజ వనరులున్న ఆంధ్ర రాష్ట్రమూ ఇంత శ్రమైకజీవనతత్వం గల ఆంధ్ర ప్రజలూ ఎందుకు అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటున్నారనే ప్రశ్నకి జవాబు దొరకడం లేదు.

ఒకసారి చరిత్రలో ముందుకీ వెనక్కీ వెళ్ళి చూస్తే ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒక్కరే ప్రజలకు సమర్ధవంతమయిన పరిపాలన అందించడంలో నూటికి నూరు శాతం విజయవంతమై కనబడుతున్నారు నాకు.చాలామంది మేధావులు కూడా ఒక వ్యక్తి పరిపాలనలో విజయవంతం కావడానికి అనుభవం ముఖ్యమైనదని అనుకుంటున్నారు కానీ అది చాలా పొరపాటు. మొదటి సారి ముఖ్యమంత్రి పదవికి పోటీ పడి గాంధీ ప్రమేయంతో వెనక్కి తగ్గి రాజాజీకి ముఖ్యమంత్రిత్వాన్ని వదులుకున్న సమయంలో ప్రకాశం గారికి కూడా ముఖ్యమంత్రి పదవి కొత్తయే కదా!అయితే, ఆయన మున్సిపల్ స్థాయి నుంచీ రాజకీయాల్లో అనుభవం ఉన్నవాడే.అప్పటినుంచీ చూసినప్పటికీ ఒక వ్యక్తి ఒక పదవికి మొదటిసారి పోటీ పడుతున్నప్పుడు అనుభవం అనేది ఎలా కొలబద్ద అవుతుంది?

ముఖ్యమంత్రి వంటి కీలకమైన స్థానంలో ఉండి ప్రజల సర్వతోముఖమైన అభివృద్ధినీ సమున్నతమైన భవిష్యత్తునీ అందించడానికి ఒక వ్యక్తిలో ఉండాల్సిన రెండు ముఖ్యమైన లక్షణాలు తనలోనూ ఇతరులలోనూ అవినీతిని సహించని ధృఢ సంకల్పమూ ఆర్ధిక రంగ నిర్వహణ పట్ల శాస్త్రీయమైన పరిజ్ఞానమూ ఉండి తీరాలి - రెంటిలో ఒక్కటి లోపించినప్పటికీ వ్యక్తి వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదు గాక ఉండదు.

ప్రకాశం పంతులు గారు స్వతహాగా లాయరు కాబట్టి  ఆయన చేసిన చట్టాల్లో ఒక్కటీ కోర్టుల ముందుకు వెళ్ళలేదు.నైతికత విషయంలో ఆయన బద్ధ శత్రువులు కూడా వంక పెట్టలేకపోయారనేది తెలిసిన విషయమే.కానీ ప్రకాశం పంతులు గారిలో అందరికీ తెలియని ఒక కోణమే ఆయన్ని రెవెన్యూ మంత్రిత్వంలోనూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రపు ప్రధానమంత్రిత్వంలోనూ నూతన ఆంధ్ర రాష్ట్రపు ముఖ్యమంత్రిత్వంలోనూ అద్భుత విజయాలు సాధించడానికి కారణం అయ్యింది.అదే ఆయన కున్న ఆర్ధిక శాస్త్ర పరిజ్ఞానం - జైళ్ళలో మిగిలిన వాళ్ళు పురాణకాలక్షేపం చెయ్యటమో లోకాభిరామాయణం చెప్పటమో చేస్తూ వుంటే ప్రకాశం గారు ఆర్ధిక శాస్త్రానికి సంబంధించిన అనేక గ్రంధాలు చదివి అర్ధం చేసుకుని  "ప్రపంచ ఆర్ధిక విధానము(Monetary system of the world),భారతీయ ఆర్ధిక విధానము(Indian Monetary system)" అనే రెండు పుస్తకాలు రాశారు.అంటే ప్రకాశం పంతులు గారు నైతికత, శాస్త్రీయత అనే రెండు రెక్కలు దాల్చిన వైనతేయుడు గనుకనే ఆయన ప్రజాపాలన అనే రంగస్థలం మీద క్షీరసాగర మధనం చేసి హాలాహలం తను స్వీకరించి అమృతాన్ని ప్రజలకు ఇవ్వగలిగాడు!

రామారావు నైతికత అనే ఒంటిరెక్కతో ఎగరాలని చూడటంతో ఆర్ధికం దెబ్బతిని ప్రజలకి నెప్పి తెలిసి మూడో కన్ను తెరిచారు.రామారావుకి ఆర్ధికశాస్త్రం తెలిసే అవకాశం లేదు, కానీ నిజాయితీ పరులైన ఆర్ధిక వేత్తల సలహాలు తీసుకోవచ్చు కదా!అతని ఆర్ధిక శాస్త్ర పరిజ్ఞానం మొత్తం అతని సినిమా రంగపు స్వంత అనుభవం మీద ఆధారపడింది. బహుశః, తను కిలో రెండు రూపాయలకి బియ్యం ఇచ్చేస్తే ప్రజలు కడుపు నిండా తిని తను సినిమా ఫీల్డులో బతికినట్టు కష్టపడి బతికితే చాలు రాష్ట్రం మొత్తం ముందుకెళ్ళిపోతుందని అనుకునేవాడు కాబోలు!

అతని స్వానురాగం నిర్మాణాత్మకమైన ఆత్మవిమర్శని అలవాటు చెయ్యకపోవడంతో ఆర్ధికశాస్త్రపరిజ్ఞానశూన్యత అనే అంతశ్శత్రువుని కాంగ్రెసు అనే బాహ్యశత్రువుకి ప్రత్యారోపణ చేసేసుకుని కాంగ్రెసుని భూస్థాపితం చేసే కొత్త లక్ష్యంతో జాతీయ రాజకీయాల మీద దృష్టి పెట్టాడు.రామారావూ చంద్రబాబూ అంత సుదీర్ఘ కాలం పాటు జాతీయ రాజకీయాల పేరుతో హడావిడి చేసి సొంతానికి గానీ రాష్ట్రానికి గానీ ఏమి సాధించారో అర్ధం కావడం లేదు నాకు.

ఎందుకంటే, 1994లో మళ్ళీ రామారావు గెలవడంలో అతని జాతీయ స్థాయి మిత్రపక్షాల సహకారం కన్న మళ్ళీ మర్రి చెన్నారెడ్డి గారు 1989 డిసెంబర్ 03 మొదలు 1990 డిసెంబర్ 17 వరకు ఒక సంవత్సరమూ నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు 1990 డిసెంబర్ 17 మొదలు 1992 అక్టోబర్ 09 వరకు రెండు సంవత్సరాలూ కోట్ల విజయభాస్కర రెడ్డి గారు 1992 అక్టోబర్ 09 మొదలు 1994 డిసెంబర్ 12 వరకు రెండు సంవత్సరాలూ చూపించిన ముఠాతత్వపు రెడ్ల కులపిచ్చియే కారణమైనప్పుడు సమయాన్ని ఇక్కడే వుండి తన పార్టీకి అప్పుడప్పుడే అంటుతున్న కులముద్రను తొలగించుకుని తనను తను ప్రజలకు మరింత దగ్గర చేసుకుని వుంటే ఎంత బావుండేది!

ఇక జన్మకి గెలవలేమనుకున్న రామారావు మీద ఒక దశాబ్దం తర్వాత అఖండ విజయం సాధించి 1989 డిసెంబర్ 03 ముఖ్యమంత్రి పదవి చేపట్టిన (24)మర్రి చెన్నారెడ్డి గారి రెండవ విడత ముఖ్యమంత్రిత్వం సంవత్సరం తిరక్కుండానే ముగిసిపోయింది.1984లో రామారావుకు వైద్యం కోసం విదేశం వెళ్ళిన సమయంలో జరిగిన జగన్నాటకమే చెన్నారెడ్డి గారికీ repeat అయ్యింది!రామారావు రద్దు చేసిన కరణాల వ్యవస్థని ఆయన గారు పునరుద్ధరించడం అసమ్మతి వాదుల చతిలోని బ్రహ్మాస్త్రం."The taluk office and the village officer are like cogs in the wheel that Rama Rao had got rid of to win the sympathy of the rural poor. By reviving both we are helping him, it was almost as if Chenna Reddy wanted to give the state back on a platter to the Telugu Desam" అని అప్పుడు Congress(I) MP అయిన యె.సం.రాజశేఖర రెడ్డి గారు వ్యాఖానించారు.తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు పోనుపోను అసమ్మతి పెరిగి అస్థిరత అయిపోయి అలా 1990 డిసెంబర్ 17 మర్రి చెన్నారెడ్డి గారు చాలా చాలా చాలా భారమైన హృదయకాలేయమస్తిష్కంతో నిష్క్రమించారు.

మర్రి చెన్నారెడ్డి గారు చనిపోయాక పర్సా వెంకటేశ్వర రావు అనే రచయిత తను వ్రాసిన జ్ఞాపికలో "Marri Chenna Reddy was an eternal rebel in Andhra politics. He never toed any line, be it a party or a leader. He dared his cautious peers, and did not hesitate to antagonise them though he never had permanent enemies. He held positions of power on his own terms, and lost them too for the same reasons." అని అన్నారు.ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు పొగడ్తల్లో కూడా పదవీ రాజకీయపు పైరవీల సుత్తి తప్ప చక్కని మంచి మాటకి నోచుకోలేదు, పాపం!

మర్రి చెన్నారెడ్డి గారి రెండవ విడత ముఖ్యమంత్రిత్వం తర్వాత 1990 డిసెంబర్ 17 ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన (25)నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారి పరిపాలన రెండో యేడు పూర్తి చేసుకోబోయే శుభతరుణంలో హైకోర్టు capitation fee colleges controversy విషయంలో విచారణ జరుగుతున్నప్పుడు nepotism and favouritism గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.అక్కడికీ మొండివాడైన ధనార్జన/జనార్ధన రెడ్డి గారు అంత చిన్న దానికి తను దిగిపోవాల్సిన అవసరం లేదనీ సుప్రీం కోర్టుకు వెళ్తాననీ వాదించారు.ఎవరూ అడక్కుండానే తన మీద విశ్వాసం ప్రకటిస్తున్నట్టు 123 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకుని  కసబియాంకా/ఖడేసాహెబులా నిలబడి పోరాడాలని నిశ్చయించుకున్నారు.కానీ "విధి బలీయం - అనుల్లంఘనీయం!" అన్నట్టు indecisive అని అందరూ అనుకునే అప్పటి ప్రధాని పీవీజీ కూడా బడ్జెట్ సెషన్ అంతమయ్యే లోపు దిగిపొమ్మని decisive ultimatum జారీ చెయ్యడంతో అలా 1992 అక్టోబర్ 09 తనకు ప్రియాతిప్రియమైన ముఖ్యమంత్రి పదవిని విడవలేక విడవలేక విడవలేక చాలా చాలా చాలా భారమైన హృదయకాలేయమస్తిష్కంతో నిష్క్రమించారు!

నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారి తర్వాత (26)కోట్ల విజయభాస్కర రెడ్డి గారు రామారావుని నిలువరించడం కోసం రెండవ విడత ముఖ్యమంత్రిత్వం స్వీకరించి 1992 అక్టోబర్ 09 మొదలు 1994 డిసెంబర్ 12 వరకు పరిపాలించారు.కాకపోతే కాంగ్రెసు అధిష్ఠానం తన సంప్రదాయం ప్రకారం కోట్ల విజయ భాస్కర రెడ్డి గారిని ప్రోత్సహించినంత నిజాయితీగా నిత్య అసమ్మతి వాదుల్ని కూడా ప్రోత్సహించడంతో గంప లాభం చిల్లి తీసినట్టు రామారావుని నిలువరించడం కోసం బరిలో దించిన కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు రామారావుకి అఖండ విజయాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి సమర్పించారు.

"మళ్ళీ వచ్చెను మధుమాసం మా గండిపేట పార్టీకి!" అని ఆనంద తరంగాల మీద తేలియాడుతూ 1994 డిసెంబర్ 12 ముఖ్యమంత్రి అయిన (27)రామారావు 1995 సెప్టెంబర్ 01 అనూహ్యమైన రీతిలో అల్లుడు కొట్టిన దెబ్బకి గింగిరాలు తిరిగి చరిత్ర శిధిలాల్లోకి జారుకుని అనామకుడై పోయాడు!

"My policies are based on the demands of the people. They have reposed faith in me because they feel that I am striving to live up to their aspirations." అని 1995 ఆగస్ట్ 16 తన జీవితచరిత్రను ఆవిష్కరిస్తున్న సన్నివేశంలో ప్రకటించిన రామారావు రెండు వారాలు గడిచేసరికి ముఖ్యమంత్రి పీఠం నుంచీ "నాతోనే పుట్టింది, నాతోనే పోతుంది!" అని చెప్పుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచీ తొలగించబడటం ఎంత విషాదమో జరిగిన సన్నివేశాలు అంత నాటకీయత నిండినవి కావటం మరీ విచిత్రం!

ఒక ప్రాంతీయ పార్టీ లోపల జరిగిన తిరుగుబాటు అప్పటి కాలపు ఆంధ్ర ప్రాంతపు ప్రజల రాజకీయ సామాజిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది గానీ సీనియర్ విశ్లేషకులు ఎవరూ ఒక దశాబ్దం క్రితం నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటు చేసినప్పుడు అప్పటికి కొత్తదయిన ప్లాను వేసి పార్టీ వ్యవస్థాపకుడి ప్రతిష్ఠని కాపాడిన వ్యక్తియే ఒక దశాబ్దం తర్వాత అదే ప్లానుని పార్టీ వ్యవస్థాపకుడి ప్రతిష్ఠని దిగజార్చడానికి ఉపయోగించుకున్న చిత్రమైన సన్నివేశం వెనక ఉన్న కొన్ని చీకటి కోణాల్ని అసలు చూడనే లేదు.అక్కడ పరస్పరం సంఘర్షించుకున్న ప్రతీప శక్తులలో లక్ష్మీ పార్వతి స్త్రీ కావడం వల్ల పురుషాధిక్య సమాజం చంద్రబాబు వైపున నిలబడి ఆమె ఓటమిని ఆస్వాదించిందా! "రాజకీయ రంగంలో ఏదీ అనుకోకుండా జరగదు, అనుకోకుండా జరిగినట్టు అనిపించే సంఘటనల వెనక కూడా ఒక గట్టి ప్రణాళిక ఉంటుంది" అనేది ప్రఖ్యాత రాజకీయ వేత్త ఫెర్డినాండ్ డిలానో రూజ్వెల్ట్ గారి అభిప్రాయం.ప్రపంచ రాజకీయ చరిత్రలో అభిప్రాయం నూటికి నూరు సార్లు నిరూపితమయ్యింది.మరి, చంద్రబాబు లక్ష్మీపార్వతిని ఒక బలిపశువును చేసినట్టు కనిపిస్తూ రామారావు మీద చేసిన తిరుగుబాటు వెనక ఉన్న ప్రణాళిక ఏమిటి?

అది తేటతెల్లం కావాలంటే దశాబ్ద కాలంలో రామారావు, చంద్రబాబు, లక్ష్మీపార్వతి అనే ముగ్గురిలో ఒక్కొక్కరూ చేసిన రాజకీయ, మానసిక ప్రయాణం ఎలా ఉందో చూడాలి.రామారావు కాషాయం కట్టడానికీ గాంధీ గోచిపాతను ధరించడానికీ చెప్పిన కారణాలను బట్టే వాళ్ళలో వాస్తవికత లోపించిందని చెప్పవచ్చును.దేశంలో నూటికి తొంభై శాతం మంది గోచిపాతరాయుళ్ళు ఉన్నారు కాబట్టి నేనూ గోచిపాతరాయుడిలా ఉంటాననడం ఎంత తెలివి తక్కువ వాగుడో ఎక్కడో ఎవడో ఎవర్నో రేప్ చేస్తే తనకి విరక్తి పుట్టిందనడం అంతే తెలివి తక్కువ వాగుడు, కదా!పవిత్రమైన మనస్సు కోసం అని చెప్పుకున్నప్పటికీ శుభ్రమైన తెలుపు రంగు కూడా పవిత్రతనీ ప్రశాంతతనీ సూచిస్తుంది.మీరు గమనించారో లేదో గానీ ఆయన గారు కట్టింది కాషాయమే గానీ ధోవతి అంచుల్ని మడిచి జేబులోకి కుక్కడం మాత్రం గిరీశం లాంటివాళ్ళు వేశ్యావాటికలకి వెళ్ళేటప్పుడు కట్టే పద్ధతి - పంచెకట్టుతో కలిపి మణికట్టున మల్లెపూల దండని ముడిచిన పురుషుణ్ణి పట్టుకునిఎక్కడికి వెళ్తున్నా”వని అడిగినోడు పిచ్చోడి కింద లెక్క!మీరు నమ్మరు గానీ దాని అర్ధం తెలిసిన మొదటి రోజుల్లోనే కాషాయం ఎన్నాళ్ళో ఉండదని అనిపించింది నాకు, అలాగే జరిగింది!

లక్ష్మీపార్వతిని పెళ్ళి చేసుకున్నాక ధోవతి స్టైలు మారింది, రంగు మారింది -  స్వానురాగం తారాస్థాయికి చేరింది.ఒకసారి విలేఖరుల సమావేశంలో తదుపరి ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక గురించి "అప్పుడు మీరు నా మగతనం చూస్తారు" అనేశాడు - అభ్యర్ధుల ఎంపికలో మగతనం, ఆడతనం ఏమిటండీ!సినిమాల్లో ఉన్నప్పుడు వేషాలు వెయ్యడం వల్ల తను రాముణ్ణనీ కృష్ణుణ్ణనీ అనుకున్నట్టు రాజకీయాల్లోకి వచ్చాక వేషం వెయ్యలేదు గానీ తనే కల్కిని అనుకునేవాడు - ట.

ఇక చంద్రబాబు, పార్టీలో చేరిన తదాది రామారావులా బహిరంగ వేదికల మీద ప్రసంగాలు దంచడం కాక సంస్థాగతమైన విషయాలను చూసుకుంటూ రామారావుకి తలనొప్పులు తగ్గించాడు.ఇవి రెండూ భిన్నమైన మనస్థితిని ప్రదర్శించాల్సిన అంశాలు కావడం వల్ల ఒకే మనిషి నిర్వహించడం చాలా కష్టం - సినిమాకి నిర్మాత, దర్శకుడిలా రామారావు, చంద్రబాబు సర్దుకుపోయారు.కార్యకర్తల అంకితభావం వల్లనే తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లని తట్టుకుని నిలబడగలిగిందనేది వాస్తవం.దానికి చంద్రబాబు సంస్థాగతనిర్మాణదక్షతయే ముఖ్య కారణం.నాదెండ్ల భాస్కర్రావు గారి తిరుగుబాటు సంక్షోభంలో చంద్రబాబు అలా ఎమెల్యేలని దాచేసి ఉండకపోతే రామారావు కష్టం మొత్తం వృధా అయిపోయి ఉండేది. తర్వాత అధికారం పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రామారావు సభకు రానని మొండికెత్తడం వల్ల ప్రతిపక్ష నాయకుడి పాత్రను నిర్వహించడమూ రామారావుకు సినిమాలు తీస్తూ జాతీయ స్థాయి నాయకులను కలిసే వెసులుబాటును కల్పించడమూ అదే సమయంలో కార్యకర్తల్నీ నాయకుల్నీ ఉత్సాహవంతుల్ని చెయ్యడమూ నాటికీ నేటికీ మరే నాయకుడూ అంత గొప్ప స్థాయిలో చెయ్యలేదు!

లక్ష్మీపార్వతి అనే మహిళ యొక్క ఉత్ధాన పతనాలను గురించి తెలియాలంటే మాలతీ చందూర్ గారు పాత కెరటాలు శీర్షికన పరిచయం చేసిన ఒక ఇంగ్లీషు నవల చదవాలి. కధలోని నాయిక కధ మొదలయ్యేసరికి ఒక వృద్ధుడైన ధనవంతుడికి సపర్యలు చెయ్యడానికి నియోగించబడుతుంది.కొంత కాలానికి వృద్ధుడు చనిపోతాడు.వృద్ధుడి ఆస్తి ఆమెకు ధారాదత్తం అవుతుంది.అయితే, ఆమె అక్కణ్ణించి దుకాణం ఎత్తేసి వేరే చోటకి వెళ్ళి తనను తాను ఆనాటి ఉన్నత కులాల్లో ఒక కులీన కుటుంబానికి చెందిన డచెస్ అని చెప్పుకుని బతుకుతూ వుంటుంది.ఆమె ఎందుకలా చేసిందో రచయిత చెప్తాడు.తన పుట్టుకకి సంబంధించిన న్యూనతనీ దరిద్రాన్నీ వాటికి సంబంధించిన ఆనవాళ్ళని చెరిపేసుకుని పూర్తి కులీన కుటుంబపు స్త్రీ అయిపోవాలని ఆమె ఆలోచన.ఆలోచన మంచిదే కదా!మనిషిలో వెకిలితనం లేదు, ప్రవర్తన హుందాగానే ఉంటుంది, వేషభాషల్లో మర్యాద ఉట్టి పడుతూ ఉంది - అన్ని అర్హతలూ ఉన్న ఆమె ఉన్నత స్థానాన్ని ఆశించడంలో తప్పేముంది?తప్పు లేదు,కదా!అందుకోసం ఇప్పుడు ఒక కులీన కుటుంబపు పురుషుడిని మెప్పించేలా తనను తాను మార్చేసుకుని లక్ష్యాన్ని సాధించేసింది.అయితే, అతని తరపు నుంచి ఒక చిన్న చిక్కు ఉంది.అతనికి అప్పటికే పెళ్ళయింది,అతని భార్య మానసిక రోగంతో బాధ పడుతూ వుంది.మొదటి భార్య నుంచి రావలసిన విడాకుల ప్రక్రియ పూర్తి కావడమో మరొకటో ఇబ్బంది ఉండి పెళ్ళి మాత్రం వాయిదా పడుతుంది.ఈలోపు కధానాయికకి తన పాత జీవితాన్ని గుర్తు చేస్తూ "నువ్వెవరో నాకు తెలుసు,నీ కాబోయే భర్తకి నీ సంగతి చెబుతాను" అంటూ ఒక వ్యక్తి ఫోన్లు చేస్తున్నాడు.తెలివైనది గనక మొత్తానికి అతన్ని మంచి చేసుకుని లావాదేవీలు సరి చూసుకోవటానికి ఒక సంకేత స్థలం ఏర్పాటు చేసుకుంటుంది.తీరా అక్కడికి వెళ్ళాక అతను తనవైపు వస్తున్న సమయంలో దాచుకున్న రివాల్వర్ తీసి అతన్ని కాల్చేస్తుంది - అతను "వొద్దు, కాల్చకు, నేను!" అంటూనే ఉన్నాడు.అది ఆమె కాబోయే భర్త గొంతు.ఇంతకీ జరిగింది ఏమిటంటే అతని పిచ్చి భార్య తన పిచ్చి ధోరణిలో మగ గొంతుతో చేసిన హడావిడియే తప్ప ఆమెకి ఈమె గతం గురించి ఏమీ తెలియదు.ఆమె కాబోయే భర్తకి కొద్ది నిమిషాల ముందే ఫోన్లు చేస్తున్నది తన భార్యే అని తెలిసి కధానాయికకి చెప్పడానికి వస్తున్నాడు. ఒక్క బుల్లెట్ పేల్చకుండా వుంటే కధానాయిక బతుకు ఎలా వుండేదో గానీ ఇప్పుడు తను పెళ్ళి చేసుకోవాలనుకున్న వాణ్ణి హత్య చేసిన నేరానికి జేవితఖైదు శిక్ష పడింది! కధ నేను చదివేటప్పటికి యుక్తవయస్సులో ఉన్నాను.చదివినది పైపైన చేసిన పరిచయం కాబట్టి అటువంటి వాళ్ళు నిజజీవితంలో తారస పడతారంటే నమ్మలేకపోయాను అప్పట్లో.కాని ఇప్పుడు - రచయిత పేరు గుర్తు లేదు గానీ మొదలు,ఎదుగుదల,తుది అనే అన్ని దశల్లోనూ ఎన్ని పొలికలు చూపించాడు?తన చుట్టు ఉన్న సమాజం అతనికి చూపించిన దృశ్యాలనే అతను మనకి చూపించినట్టు లేదూ!

లక్ష్మీ పార్వతి గురించి ఆమె మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు గారు చెప్పినదే ప్రామాణికం."తప్పంతా నీది అంటే రాక్షసత్వం, తప్పు నీది కొంత నాది కొంత అంటే మానవత్వం, తప్పంతా నాదే అంటే దైవత్వం" అనే పెద్దాయన మాట ఈనాటి సమాజానికి ఒక గుణపాఠం!’ఒక ఆడది తన భర్తకి సొంతం కానప్పుడు వేరే వాడికి ఎలా సొంతం అవుతుంది?లక్ష్మీపార్వతి కేవలం డబ్బు కోసమే NTR దగ్గరకు వెళ్ళింది.మొగుడు and కొడుకు ఉన్నాడు. అయినా "పెండ్లి చేసుకుంటావా?" అని NTR అడగటం, "సరే!" అని లక్ష్మిపార్వతి పెండ్లి చేసుకోవడం - ఇద్దరిదీ తప్పే!NTR గొప్పోడు గొప్పోడు అంటారు.పెళ్లి ఐన భర్త ఉన్న దాన్ని  “వచ్చేయి నా దగ్గరికి” అన్నాడు. ఆయన దేవుడు గొప్పోడు.ఎవడు NTR సినిమా తీసినా సరే ఎంతో సంస్కారం కలిగిన పెద్ద మనిషికి జరిగిన అన్యాయాన్ని ఆవేదనను చూపించకపోతే తెలుగు సమాజాన్ని మోసం చేసినట్టే.’ - ఇవి నా మాటలు కావు, రామారావు లక్ష్మీపార్వతిని పెళ్ళిచేసుకోవడానికి సంబంధించి వీరగంధం వెంకట సుబ్బారావు గారు చెప్పిన నిజమైన చరిత్ర తెలిసిన వాళ్ళ అభిప్రాయాలుజనవాక్యం!

దండలు మార్చుకునే నాటికి లక్ష్మీపార్వతి తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకోలేదన్న నిజాన్ని బట్టి రాముడి వేషాలు వేసి నిజజీవితంలో కూడా రాముణ్ణి అనుకరించిన రామారావు పరపత్నిని చేపట్టి రావణుడి పాత్రని కూడా అనుకరించాడు - సంప్రదాయ విరుద్ధమైన పనులు చెయ్యడంలో కూడా సినిమాట్రిక్సు డ్రమటిక్సు ప్రభావం ఉండాల్సిందేనా!

1995 ఆగస్టు కల్లా రామారావు తన రెండవ భార్యకు పార్టీ పగ్గాలు అప్పగించాలని అనుకుంటున్నట్టు అందరికీ అనుమానం వచ్చేసింది.ఎవరు ఎవర్ని కెలికితే ఎవరు పిచ్చెక్కిపోయారో తెలియదు గానీ అప్పటి వాళ్ళిద్దరి ఆలోచనలూ చాలా వింతైన శైలిలో ఉండేవని తెలుస్తుంది.మొదటి ప్లాను, లక్ష్మీపార్వతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గానూ రామారావు భారతదేశానికి ప్రధానమంత్రిగానూ అద్భుతమైన పరిపాలన అందించి ఆచంద్రతారార్కం లక్ష్మీనారాయణులూ పార్వతీపరమేశ్వరుల తర్వాత మూడో ఆదిదంపతుల మాదిరి పూజలు అందుకోవాలనీ అందుకోగలమనీ అనుకునేవాళ్ళు - !రెండవ ప్లాను, రామారావు ఎటూ విశ్వామిత్రుడి వేషం వేసేసి విశ్వామిత్రుడు అయిపోయాడు కాబట్టి రామారావుకీ లక్ష్మీపార్వతికీ పిల్లలు పుడితే మూడో తరాని కల్లా వాళ్ళ ఇంట్లో బుజ్జి భరతుడు పుట్టేసి వాడు ఏదో ఒక నాడు భారతదేశానికి చక్రవర్తి అయి తీరుతాడని అనుకునేవాళ్ళు - !నేను వ్యంగ్యాలు విసుర్తున్నానని అనుకోకండి, రామారావుకి స్పెర్మ్ కౌంట్ పెరగడానికి మందులు వాడటమూ తను రీక్యానలైజేషన్ చేయించుని అబార్షన్ల పాలవటమూ సాక్షాత్తూ ననదమూరి లక్షమీ పారవతి గారే ఒప్పుకున్న నిజాలు.

చంద్రబాబుని మొదట విశాఖ పట్నం Dolphin Hotel దగ్గిర కలిసింది(చంద్రబాబుకి మొదట విశాఖ పట్నం Dolphin Hotel దగ్గిర దొరికింది) 20 మంది ఎమ్మెల్యేలు.“The MLAs told him that the mood among the TDP MLAs was anti-NTR and almost all of them would support Naidu if he took over. Naidu then dashed to Hyderabad and began contacting the TDP MLAs. They arrived in Hyderabad to meet Naidu, who lodged himself in Viceroy Hotel facing the Secretariat. By the time NTR got wind of what was happening, there were 150 MLAs inside the hotel,” అనేది అప్పటి కధలోని ఒక పాత్రధారి యొక్క స్వానుభవ కధనం.“A reporter told us over phone that N T Rama Rao had written to the governor recommending dissolution of the Assembly. None of us were prepared for polls within a year and a half of getting elected.” అని తర్వాత జరిగిన కధని అప్పుడు Viceroy Hotel లోపల ఉన్న Dr S A Khaleel Basha గారు చెప్పారు.ఇది రామారావు సహజ స్వభావమైన అహంభావంతో కూడిన మొండితనం వల్ల వేసిన అత్యంత ప్రమాదకరమైన ఎత్తుగడ!

చెయ్యకూడని వెధవపని చేసేశాక వచ్చి బతిమిలాడుకోవడం అనే పిచ్చిపని ఇప్పుడే చేసి ఉంటే వీళ్ళు కూడా కొంత గొడవ చేసి తమకు లాభం అనుకున్న సంధి ప్రతిపాదనలతో సర్దుకు పోయేవాళ్ళు.కానీ, 1985లో తనకు ద్రోహం చేసిన భాస్కర్రావు మనుషుల్ని సభనుంచి తరిమి కొట్టడానికి వేసిన ఎత్తుగడనే రామారావు 1995లో తమమీద వేస్తున్నాడని తెలిసేసరికి వాళ్ళకి రామారావుతో రాజీ పడటం కూడా తమ ప్రసుత ఉనికికీ రాజకీయ భవిష్యత్తుకీ చాలా ప్రమాదం అనిపించింది.దాంతో, విధి లేక రామారావు వైస్రాయ్ హోటలు బయట చైతన్య రధం మీద నుంచుని చేసిన విజ్ఞప్తులకి వేరు గతి లేక తిరస్కరించి చంద్రబాబు వైపునే ఉండిపోవాల్సి వచ్చింది.తను అంతసేపు బ్రతిమిలాడుతూ ఎదురు చూస్తున్నప్పటికీ ఒక్కడు కూడా బయటికి రాకపోవటం చూశాక వెనక్కి తగ్గాల్సిన రామారావు తన ముఖం చూసినప్ప్పుడు పశ్చాతాప పడతారని ఆశపడి సభలో సెప్టెంబర్ 07 confidence-motion పెట్టినప్పుడు పదే పదే "I am the leader of the Telugu Desam Legislature Party (TDLP) and the president of the party" అని విజ్ఞప్తి చేసినప్పటికీ రామారావుకి 28/219 వోట్లు మాత్రమే వచ్చాయి.అలా రామారావు రాజకీయ జీవితం ప్రజానాయకుడి పాత్రతో మొదలై ప్రతి నాయకుడి పాత్రతో ముగిసిపోయింది!

బలాబలాలను చూస్తే లక్ష్మీపార్వతి, చంద్రబాబు నాయుడు అనే ఇద్దరు ప్రత్యర్ధులలో భార్య అయిన లక్షీపార్వతియే ఆధిక్యతలో ఉన్నప్పటికీ రామారావు తీసుకున్న సభను రద్దు చేసి తక్షణం ఎన్నికలకు వెళ్ళాలనుకున్న వ్యూహాత్మక తప్పిదం కనిపిస్తున్నప్పటికీ అంతిమవిజేత చంద్రబాబు కావడం వెనుక నేను మొదట ప్రస్తావించిన పురుషాధిక్య సమాజం అనే అంశంతో పాటు పా.వెం.నరసింహా రావు గారు మొదలుపెట్టి మన్మోహన్ సింగ్ గారు కొనసాగించిన New World Order(NWO) Econimics కూడా ఒక ముఖ్యమైన కారణం.NWO సిద్ధాంతకర్తల మనస్తత్వం efficiencyకి ప్రాధాన్యత ఇస్తుంది తప్ప equityని పట్టించుకోదు.NWO సిద్ధాంతకర్తలకి కావాల్సింది అదే అని తెలిసి అన్నాడో అధాటున చంద్రబాబు తనను తను CEO of Andhra Pradesh అని పిలుచుకోవడం తెలిసి వాళ్ళు ఇతన్ని ఎన్నుకున్నారో తెలియదు గానీ ఆనాటి ఆంధ్రుల రాజకీయ ఆర్ధిక సామాజిక సంస్కృతియే చంద్రబాబుకి విజయాన్ని తెచ్చిపెట్టి cook, cleaner, maid and ‘keep’ అనే పదాలకు ప్రాతినిధ్యం వహించిన లక్ష్మీపార్వతిని అనామకురాల్ని చేసింది.

అలా నందమూరి తారక రామారావు తర్వాత 1995 సెప్టెంబర్ 01 మొదలు 2004 మే 13 వరకు (28)నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.ప్రకాశం పంతులు గారి తర్వాత ఆర్ధిక శాస్త్రం యొక్క శక్తిని తెలుసుకున్నది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే!ప్రకాశం పంతులు గారిలా స్వయాన ఆర్ధికశాస్త్రం చదవలేదు గానీ విషయ పరిజ్ఞానం ఉన్న అధికారులను ఉపయోగించుకుని సరైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చి రామారావు తెలివి తక్కువ నిర్ణయాల వల్ల కుదేలయిన ఆర్ధిక రంగం కొంత తెరిపిన పడింది.

ఇందియనిగ్రహం, ఋజువర్తన, స్థితప్రజ్ఞత, నాయకత్వ లక్షణం, పరిపాలనా దక్షత వంటి ఉన్నత గుణాలు కొందరికి జన్మతిధిని బట్టి సహజంగా రావచ్చు, కొందరికి కుటుంబ వాతావరణాన్ని బట్టి నేర్చుకుంటే రావచ్చు - కానీ చంద్రబాబు గారి మొదటి విడత పాలననీ రెండో విడత పాలననీ పోల్చి చూస్తే కొందరికి ఉన్నత గుణాలు ఖర్మ కొద్దీ నెత్తిన పడ్డాయన్నట్టు కూడా రావచ్చునని అనిపిస్తుంది!

పార్టీ అంతర్గత విషయాల్లో తప్పులు చేసినప్పటికీ ప్రజాబాహుళ్యం యొక్క అభిమానాన్ని చూరగొన్న దైవసమానుడైన వ్యక్తిని రహస్యకుట్రతో పడగొట్టి అధికారం చేజిక్కించుకున్న వ్యక్తి అలసత్వం చూపించి అభివృద్ధిని చూపించడంలో అపజయం పాలైతే ప్రజలు అంతకు పదింతలు శిక్ష వేస్తారనేది తెలిసిన వాడు గనక 1999 వరకు ఒళ్ళు దగ్గిర పెట్టుకుని పని చేశాడు.ఒకసారి శోష వచ్చి పడిపోయిన దృశ్యం కూడా దినపత్రికలలో చూసినట్టు గుర్తుంది నాకు.1996 ఫిబ్రవరిలో మొదలు పెట్టిన "జన్మభూమి" మంచి కార్యక్రమమే.ఇందులో స్థానిక పరిపాలనకు సంబంధించిన అంశాలలో ప్రజలని ఇన్వాల్వ్ చెయ్యడం చక్కటి ఆలోచన.1997వ సంవత్సరంలో మొదలు పెట్టిన "పచ్చదనం-పరిశుభ్రత" కూడా మంచి కార్యక్రమమే.ముఖ్యమైన అన్ని ఉత్పత్తి రంగాలకీ "self help groups(SHG)" ఏర్పాటు చేసి ప్రోత్సహించడం కూడా బాగుంది.రైతు బజారు, డ్వాక్రా అనేవి కూడా మంచి ఐడియాలే.వీటన్నిటి హడావిడి వల్ల 1999 నాటి ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి 185/294 అసెంబ్లీ స్థానాలూ 29/42 లోక్ సభ స్థానాలతో కూడిన అద్భుత విజయాన్ని ఇచ్చాయి.

అయితే, ఇంత అద్భుతమైన విజయం తర్వాత బహుశా ఓటమి భయం తగ్గి ఖర్మ కొద్దీ నెత్తిన పడ్డాయన్నట్టు అతుక్కున్న నాయకత్వ లక్షణం, పరిపాలనా దక్షత వంటి ఉన్నత గుణాలు వూడిపోయాయి కాబోలు 2004 నాటి ఎన్నికలు 47/294 అసెంబ్లీ సీట్లనీ 05/42 లోక్ సభ సీట్లనీ మాత్రమే ఇచ్చేసరికి అశ్శరభ తశ్శరభ అంటూ తను నిద్రపోకుండా అధికారుల్నీ నిద్రపోనివ్వకుండా పడిన కష్టం సాంతం బూడిదలో పోసిన పన్నీరు చందం అయిపోయింది - 2019 నాటి లాగే 2004 నాడు కూడా అభిమానులు "నువ్వు వోడిపోవటం ఏంటయ్యా!" అని ఘొల్లుమన్నారు.

1995-1996ల నాడు మూసివేతకి దగ్గరైన సింగరేణి కాలరీస్ సంస్థని లాభాల బాట పట్టించి దాని పరువు నిలబెట్టాడు!స్వర్ణాంధ్ర ప్రదేశ్ అన్నాడు!మొట్ట మొదటి సారి తన స్వంత ప్రజ్ఞని మాత్రమే చూపించి కేంద్రం పూచీకత్తు లేని Rs 2,200 Cr ఋణాన్ని World Bank నుంచి తెచ్చాడు!1992-1994 నాటికి నష్టాల్లోనూ లోటులోనూ ప్రావీణ్యాత్లోనూ అధమ స్థాయికి చేరి కునారిల్లుతున్న Andhra Pradesh State Electricity Board (APSEB) సంస్థని కేవలం అయిదేళ్ళు గడిచేసరికి cost and quality విషయాల్లో world class స్థాయికి చేర్చాడు!1998 నవంబర్ నాడు అటల్ బిహారీ వాజపేయి చేతుల మీద HITEC Cityకి అంకురార్పణ చేసి పెంచి పెద్ద చేసి ఇప్పటికీ హైదరాబాద్ నగరానికి సాటిలేని landmark కింద నిలబెట్టాడు!1999లో హైదరాబాదు నగరానికి Pharma City/Genome Valley అనే మరొక అద్భుతాన్ని అందించాడు!2001లో "ఈసేవ-మీసేవ" అన్నాడు!2003లో అప్పటి వరకు విడి విడి రవాణా వ్యవస్థలైన రైళ్ళనీ బస్సుల్నీ కలుపుతూ హైదరాబాదు నగరానికి multi-modal transport system (MMTS) విధానం ఏర్పాటు చేశాడు!ఇన్ని సంచలన విజయాలు సాధించినప్పటికీ అంత దయనీయమైన ఓటమి ఎందుకు ప్రాప్తించింది?

ఒకసారి ఎన్నికల ఫలితాల విహంగ వీక్షణ చేసి చూస్తే తెలుగుదేశం అధ్యక్షుడు ప్రజల ఆకాంక్షలకీ తన అపురూప విజయాలకీ పొంతన లేకపోవడాన్ని గమనించే ప్రయత్నం చెయ్యకపోవడం అనేది ఎంత తప్పో తెలుస్తుంది.

అప్పటికే తెలంగాణ ఉద్యమ నాయకత్వం వహిస్తూ వ్యూహనిర్మాణ చాతుర్యంలో ఘటికుడని పేరు  తెచ్చుకున్న Telangana Rashtra Samithi (TRS) అధ్యక్షుడు "The people of the state will give him a guaranteed gift - a well deserved rest." అని బల్లగుద్ది చెప్పేశాడు.మరి, అధికారంలో ఉండి తను  తెల్సుకోలేక పోవడం ఏమిటి?భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఉభయ భారత కమ్యూనిష్టు పార్టీలు, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ముగ్గురు శత్రువులు కలిసినప్పుడు గెలుపు నల్లేరు మీద బండి నడక అని ఎలా అనుకున్నారు?తెలుగు దేశం 267 సీట్లకి పోటీ చేసి 47 సీట్లు తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి 54 సీట్లకి పోటీ చేసి 26 సీట్లు గెల్చుకుంది.అంటే తెలంగాణ ఉద్యమం యొక్క బలాన్ని అంచనా వేసి దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చెయ్యలేదని తెలుస్తున్నది కదా!2001 పంచాయితీ ఎన్నికల నాడు TDP-BJP కలిసి పోటీ చేసి పోలయిన వోట్లలో 39.6% తెచ్చుకున్నాయి.అప్పుడు విడిగా పోటీ చేసిన కాంగ్రెస్సూ తెరాసా పార్టీలకి వచ్చిన మొత్తం వోట్ల శాతం 52.88 అయ్యింది.దీనికి తోడు నక్సల్స్ ప్రాబల్యం కూడా పెరిగింది.

ఇవన్నీ పైకి కనబడుతున్న కారణాలు:ఆంధ్రప్రదేశ్ వ్యావసాయిక రాష్ట్రం కావడమూ నిజమే, సమాజంలోనూ ప్రజల మనస్తత్వంలోనూ urban-rural divide ఉన్న మాట కూడా నిజమే, చంద్రబాబు నాయుడు గారు “too many farmers were producing too little foodgrains and they must seek more productive employment” అని అనుకోవడమూ నిజమే, తన చిరకాల ప్రతర్ధి రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొంచెం మార్చి చెప్పి చంద్రబాబు నాయుడు గారికి రైతు శత్రువు ముద్ర వేసి ప్రజల్ని తనకు అనుకూలం చేసుకోవడమూ నిజమే - కానీ అప్పటి తెలుగుదేశం వోటమికి కనిపించని నాలుగో సింహం లాంటి అసలైన కారణం చాపకింద నీరులాంటి ఒక అవినీతి పూరితమైన అనధికారిక ప్రభుత్వం!

ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు నైతికత, శాస్త్రీయత అనే రెండు రెక్కలు దాల్చిన వైనతేయుడు గనుక ఆయన ప్రజాపాలన అనే రంగస్థలం మీద క్షీరసాగర మధనం చేసి హాలాహలం తను స్వీకరించి అమృతాన్ని ప్రజలకు పంచి ఇవ్వగలిగారు. రామారావు నైతికత అనే ఒంటిరెక్కతో ఎగరాలని చూడటంతో ఆర్ధికం దెబ్బతిని ప్రజలకి నెప్పి తెలిసి మూడో కన్ను తెరిచారు.చంద్రబాబు శాస్త్రీయత అనే ఒంటిరెక్కతో ఎగరాలని చూడటంతో హార్ధికం దెబ్బతిని ప్రజలకి నెప్పి తెలిసి మూడో కన్ను తెరిచారు.

ప్రత్యర్ధులు ఎన్ని కేసులు వేసినప్పటికీ అదే ప్రత్యర్ధులు ప్రభుత్వంలో ఉండి కూడా నిరూపించలేకపోవడం చేత చంద్రబాబు నాయుడు గారు నిప్పు అయితే కావచ్చు గానీ చుట్టూ ఉన్న మంత్రులూ పెద్దలలో చాలామంది నిప్పులు కాదు.ఆ కోటరీ బృందం జరుగుతున్న అభివృద్ధి వల్ల పుట్టిన సంపదని జల్లెడ పట్టేశారు.ప్రజలు, ముఖ్యం ఆంధ్ర ప్రజలు చాలామంది రాజకీయ నాయకులూ కొంతమంది రాజకీయ విశ్లేషకులూ అనుకుంటున్నట్టు అమాయకులు కారు - పై స్థాయిలో జరుగుతున్న హడావిడికీ తమ దగ్గరకి వస్తున్న చిల్లరకీ తేడా పసి కట్టేశారు!

అటువైపున కాంగ్రెసు పార్టీలో తన ఒకప్పటి ఆప్తమిత్రుడు రాజశేఖరరెడ్డి శరవేగాన ఎదుగుతున్నాడు.మర్రి చెన్నారెడ్డి గారు మొదటిసారి రామారావుని ఓడించినప్పుడే తను ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డాడు.అప్పుడు మొదలు ఇప్పటి వరకు కాంగ్రెసు అధిష్ఠానం బొమ్మల్ని మార్చినట్టు ముఖ్యమంత్రుల్ని మార్చాల్సి రావడం వెనక ఉన్నది ఎవరనుకుంటున్నారు మీరు?1989 - 1994 మధ్య హైదరాబాదు మతకలహాలతో అగ్నిగుండమై రగలడం వెనక ఉన్నది కూడా ఈ నిత్య అసమ్మతి వాదియే!

"కడప నుంచి వచ్చిన మాబోటి కాలేజి కుర్రాళ్ళకి ideologyల గురించి పెద్ద పట్టింపు ఉండేది కాదు.ఎలెక్షన్ల టైములో ఎవరికి తీరిక ఉంటే వాళ్ళు YSR గ్రూపుతో కలిసి జీపులెక్కి ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు.నేను కూడా రెండు మూడు సార్లు వెళ్ళాను.తిండికి బిర్యానీ మందుకి ఫారిన్ సరుకూ అన్నీ ఉండేవి.ప్రచారంతో పాటు రిగ్గింగు పని కూడా ఉండేది.ఒకానొక బూతులో అన్నీ YSR వైపు పడితే అనుమానం వచ్చి disqualify అయ్యే ప్రమాదం ఉందని చెప్పి ఒక 25 వోట్లు BJPకి వేసి సొంత బులపాటం కొంత తీర్చుకున్నాను.కులాసా కబుర్ల టైములో వాళ్ళ వీరకృత్యాలు తెలుస్తూ ఉండేవి.కిల్లింగ్ డ్యూటీ మాత్రమే దళితులది, రింగ్ లీడర్లు అందరూ రెడ్లు - అది అన్యాయం అని కూడా అనిపించని స్థాయిలో వాళ్ళ అమాయకత్వం ఉండేది.రోడ్డు పక్కన టీస్టాల్ దగ్గిర కూచుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఒకసారి వాళ్ళలో ఇద్దరు అంతకు ముందు జరిగిన ఒక మతకలహంలో చెరో ముగ్గుర్నీ చంపిన సంగతుల్ని చెప్పారు.కడప నుంచి లారీల కొద్దీ వచ్చి నాలుగైదు గంటల్లో చెయ్యాల్సిన భీబత్సం చేసేసి మళ్ళీ అదే లారీల్లో జారుకోవడం. వాళ్ళు కోట దాటాక హీరో పోజు పెట్టి 'శాంతి భద్రతల్ని కాపాడలేని ముఖ్యమంత్రి!' పేరున అల్లరి మొదలెట్టి ఢిల్లీ యాత్ర చేసి ముఖ్యమంత్రి పదవిని తనకు ఇమ్మని బేరం పెట్టటం - ఇదీ నిత్య అసమ్మతి వాది యొక్క ఫ్యాక్షనిష్టు వ్యూహం!

అతని ప్రమేయం ఉందని లోపాయకారీగా అందరికీ తెలుసు.కానీ, రుజువు లేవీ?సీనియర్లు అప్పటికి కాటికి కాళ్ళు చాపుకుని కూర్చుంటే లేవలేక నుంచుంటే కూర్చోలేక ఇవ్వాళో రేపో పక్కకి తప్పుకునే స్థితిలో పార్టీలోనూ ప్రజల్లోనూ అభిమానం పెంచుకుంటున్న యువకాంగ్రెసునేత మీద విచారణకు ఆదేశించితే అది పూర్తయేవరకు బతికి ఉంటారన్న గ్యారెంటీ లేదు కదా!వేరేవాడు వాడికి దురద పుట్టి ఆదేశించిన విచారణకి బాధ్యత తీసుకునే ఉదారులు ఎవరున్నారు - అదీ కాంగ్రెసులో!

పులిమీద పుట్రలా 1992 డిసెంబర్ 06 వచ్చింది - ఇంకేముంది, రాజారెడ్డి హుటాహుటిన వచ్చిపడి తన సొంత పనులను కూడా చక్కబెట్టుకున్నాడు.మా బంధువుల్లో ఒక పెద్దాయన, అరవైల్లో ఉన్నాడు - వాళ్ళ mining business మీద కేసులు పెట్టి గెల్చినందుకు ఇప్పుడు చాన్సు దొరకడంతో ఆయన్ని చితక్కొట్టేశారు! జనార్ధన రెడ్డి మతకలహాల వల్లనే దిగిపోయాడు.అప్పుడు కూడా రాజశేఖరరెడ్డి ఢిల్లీ యాత్ర చేసి ముఖ్యమంత్రి పదవిని తనకు ఇమ్మని బేరం పెడితే పీవీజీ ఇంతటి భీబత్సవాదిని ఆంధ్ర ప్రజల మీదకి అచ్చోసిన ఆంబోతులా వదలటం ఇష్టం లేక కోట్ల విజయ భాస్కర రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు.అప్పుడు రాజశేఖరరెడ్డికి వచ్చిన కోపం పత్రికల్లోకి కూడా ఎక్కింది.YSR మనుషులకి ఎంత ధైర్యం అంటే ఒకసారి కోట్ల విజయ భాస్కర రెడ్డి పీవీ నరసింహా రావుతో కలిసి కడప వెళితే ఒకరు దేశ ప్రధానమంత్రి ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా చూడక దేశ ప్రధానమంత్రిని పట్టుకుని నానా మాటలూ అని వీణ్ణి తీసేసి మావోణ్ణి కుర్చీ ఎక్కించమని గోల చేస్తూ ముఖ్యమంత్రి మీదకి చెప్పు విసిరారు.

అంది వచ్చిన అవకాశం అందలం ఎక్కిస్తుందని అనిపిస్తే పులిలా దూకి లటక్కన పట్టెయ్యడంలో రాజశేఖరరెడ్డిని మించినవాళ్ళు లేరు.తెలుగుదేశం పాలనలో విజయవాడ కాపు నాయకుడు వంగవీటి మోహన రంగా హత్యకు గురయ్యాడు.అంతే, అప్పటి వరకు రాయల సీమ బయట పెద్ద పరిచయం లేని స్థితి నుంచి రాష్ట్రంలోని నలుమూలలా ఉన్న కాపులకి రక్షకుడి కింద మారిపోయాడు.కోస్తా జిల్లాల దళిత క్రైస్తవ సమూహం రాజశేఖరరెడ్డిని యేసు క్రీస్తుకి ఒక మెట్టు దిగువన నిలబెట్టేసింది.

1994 నాడు NTR రెండో సారి అధికారంలోకి వచ్చేటప్పటికి రాజశేఖరరెడ్డి కొంచెం మెత్తబడిపోయాడు.నలభయిల్లోకి వచ్చి పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళని సెటిల్ చెయ్యటం, నిత్య అసమ్మతి గోల మాని ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు పెంచుకోవటం, పొలిటికల్ ఇమేజి కోసం ఫ్యాక్షనిజానికి దూరం కావడం - రాజశేఖరరెడ్డిలో ఒకలాంటి ట్రాన్సిషన్ నడుస్తుంది.అటు రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక రకమైన ట్రాన్సిషన్ నడుస్తుంది.IT మోజు సీమలోకి కూడా పాకింది.రాజశేఖరరెడ్డికి తెలిసిన చాలామంది లాయలిస్టులు తమ పిల్లల్ని IT jobs వైపుకి తరుముతున్నారు.ఒక పెళ్ళికి కడప వెళ్ళి నేనూ local factionist politicians బదులు NRI Reddy boys హీరో వర్షిప్ తెచ్చుకుంటూ అదర గొట్టట్టెయ్యటం చూశాను.

చంద్రబాబు రామారావును పడగొట్టి ముఖ్యమంత్రి కావడంతో సినిమా నటుడిగా NTR మీద ఉన్న అభిమానంతోనూ చంద్రబాబు పాతుకు పోతే తను ఇక జన్మలో ముఖ్యమంత్రి కావడం కల్ల అనే భయంతోనూ చురుకు తెచ్చుకున్నాడు." అనేది రాజశేఖరరెడ్డి గారిని చాలా దగ్గర్నుంచి చూసిన ఒక Reddy BJP fan చెప్పిన కధ.

చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలను పసికట్టిన కాంగ్రెసులోని నిత్య అసమ్మతి వాది యె.సం.రాజశేఖర రెడ్డి గారు 2003 ఏప్రిల్ 09న పాదయాత్ర అని పిలుచుకునే "ప్రజా ప్రస్థాన యాత్ర" అనే సుదీర్ఘ ప్రయాణం మొదలు పెట్టారు - రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ నుంచి మొదలై రంగా రెడ్డి, మెదక్, నిజామాబద్, కరీమ్నగర్, వరంగల్, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం తదాది 11 జిల్లాలను దాటుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద 2003 జూన్ 15న ఆగింది, మొత్తం నడిచినది 1,475 Kms!చంద్రబాబు నాయుడు గారు తనకు అచ్చొస్తాయనుకున్న అన్ని విజయాల్నీ భయంకరమైన అపజయాల కింద ముద్ర వేసి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేరనుకున్న ఉచిత వరాలను ప్రకటించేశారు.మీదు మిక్కిలి ఎన్నికల వేళకు భారతీయ జాతీయ కాంగ్రెసు పార్టీ, భారత జాతీయ కమ్యూనిష్టు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ముగ్గురు శత్రువులు కలిశారు.అభిమానులూ ప్రచార కర్తలూ రాజశేఖరరెడ్డి గారిలోని ఫ్యాక్షనిస్టుని సూపర్ మాస్ హీరో కింద మార్చేశారు.ప్రజలు నమ్మేశారు.ఓట్లను గుద్దేశారు.

అలా చంద్రబాబు నాయుడు గారిని ఓడించిన (29) యె.సం.రాజశేఖర రెడ్డి గారు 2004 మే 14 మొదలు 2009 సెప్టెంబర్ 02 వరకు ముఖ్యమంత్రి అయ్యారు.2009 ఎన్నికల్లో కూడా కాంగ్రెసు పార్టీని గెలిపించి 2009 మే 22 మొదలు 2009 సెప్టెంబర్ 02 వరకు రెండవ విడత ముఖ్యమంత్రి అయ్యారు.

మొదటి రోజైన 2004 మే 14నే free electricity for farmers ప్రాజెక్టును మొదలు పెట్టారు.కానీ, తర్వాత ఆర్ధిక మంత్రి రోశయ్య గారు గట్టి వ్యతిరేకతను వ్యక్తం చెయ్యడంతో ఆగిపోయింది.బీదలకు ఆరోగ్య భీమా ఇవ్వడానికి ఉద్దేశించిన ఆరోగ్య శ్రీ మధ్యలో కొంతకాలం దానికి అవినీతి రోగం వచ్చిందనే విమర్శలు వచ్చినప్పటికీ రాజశేఖరరెడ్డి గారి చిత్తశుద్ధి వల్ల మెరుగుపడి ఆయనకి ఎనలేని కీర్తి ప్రతిష్ఠల్ని తెచ్చిపెట్టింది.Indian IT sectorకి బిల్ గేట్స్ వంటి poster boy అయిన Satyam కంపెనీ అధినేత conceptualise చేసిన అంబులెన్స్ సర్వీసును adopt చేసుకుని మంచిపేరు తెచ్చుకున్నారు.పావలా వడ్డీ పధకం అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన డ్వాక్రా పధకానికి మరింత బలం చేకూర్చి గ్రామీణ మహిళలకి ఎక్కువగానే ఉపయోగపడింది.ఇందిరమ్మ ఇళ్ళ పధకం ఆర్భాటంగా మొదలై తర్వాత తర్వాత వివాదాస్పదం అయ్యి తర్వాత తర్వాత బలహీనం అయ్యింది.జలయజ్ఞం అని ప్రకటించినది ధనయజ్ఞం అయిపోయింది - Right to Information Act ప్రకారం ప్రభుత్వం నుంచి రాబట్టిన డాక్యుమెంట్ల ప్రకారమే టెండర్ల దశనుంచి పూర్తయిన పనులకు చెల్లించిన పేమెంట్ల వరకు గల అన్ని దశలలోనూ రాయలసీమ ఫ్యాక్షనిస్టు ముద్ర ధగద్ధగాయమానమై కనిపించింది.

“I don't want to become another Chandrababu Naidu” అని ప్రకటించి తొలినాళ్ళలో ఇప్పుడు కొడుకు చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన సమస్తాన్నీ ధ్వంసం చేద్దామని అనుకున్నారు గానీ అలా చేస్తే తను మంచిపేరు తెచ్చుకోవాలని ప్రవేశ పెట్టిన పధకాలకి కూడా చిల్లి పడుతుందని తెలిసి ఆ ప్రయత్నం విరమించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పెట్టుబడులను కానీ అమర్చి పెట్టిన సౌకర్యాలను గానీ disturb చెయ్యలేదు సరిగదా సత్యం నుంచి యాంబులెన్సుల పధకాన్ని lift చేసినట్టు చంద్రబాబు నాయుడు గారి పధకాల్ని modify చేసి వాడేసుకున్నారు. యె.సం.రాజశేఖర రెడ్డి గారు గ్రేటర్ రింగ్ రోడ్డు తప్ప రాష్ట్రానికి గానీ హైదరాబాదుకి గానీ చేర్చిన కొత్త చేర్పులు లేవు.

రాజశేఖరరెడ్డి గారి పరిపాలనలో ప్రపంచ స్థాయి సంచాలనానికి కారణమైనది సత్యం ఫ్రాడ్ కేసు.రామలింగరాజు Satyam అనే IT కంపెనీ పెట్టి కొద్దికాలంలోనే వటవృక్షమై ఎదిగాడు.కానీ 2008 డిసెంబర్ 16న వాళ్ళబ్బాయి ముచ్చటపడి Satyam అన్న పేరుని తిరగేసి పేరు పెట్టిన Maytas కంపెనీ గురించిన ఒక వార్తతో రామలింగరాజు అదృష్టం కూడా తిరగబడింది.మొదట వీలున్నంత వరకు నిరపరాధి అనిపించుకోవాలని తపన పడి పిదప తనకు తనే నేరం ఒప్పుకుని జైలు పాలయ్యాడు.In the Satyam – Maytas Fraud case, Ramalinga Raju and his family have siphoned off an incredible amount of Rs 2,743 crore అనేది CBI మాట.

సత్యం రామలింగ రాజు ఇరుక్కుపోయిన నేరాలు:(01).Satyam had inflated non-existent cash of Rs 5040 crore.(02).Satyam had also understated liability of Rs 1,230 crores and over stated debt by Rs 490 crores.(03).Ramalinga Raju and the promoters of Satyam had floated 327 front companies and published inflated financials.(04).Satyam had taken a loan of Rs 1230 crore loan from the front companies which are not even accounted in the books.(05).Satyam had also taken unaccounted loan of Rs 1493.84 crore from banks.(06).Satyam had executed projects in the name of seven non-existent companies.

సత్యం రామలింగ రాజు అసలు చేసింది ఏమిటి?Rather like item numbers in Indian films, Satyam’s fancy numbers were aimed at sexing up the company and making it more attractive for investors!

మొత్తం స్కాములో Maytas ప్రమేయం ఏంటి?మొత్తం కేసులో అసలు విషయం రామలింగ రాజు చెప్పడానికి ఇష్టం లేక తను జైలుకు వెళ్ళే పద్ధతిలోకి కేసును తిప్పేశాడు. ఆ దారిలో ముందుకెళ్తే తను బయట పడతాడు గానీ కొడుకు ఇరుక్కుంటాడు.ఎందుకంటే, రామలింగ రాజు కొడుకు ఈ డబ్బుని మదుపు పెట్టింది వాపుని చూపించి బలుపులా  మోతెక్కించడానికి రాజశేఖరరెడ్డి గారి మిత్రబృందం చూపించిన ఎండమావిలో.అచ్చు ఎండమావిలానే రామలింగ రాజు కొడుకు పెట్టుబడి పెట్టేవరకు బంగారులేడిలా కనబడిన ప్రాజెక్టు పెట్టుబడి పెట్టి ఇరుక్కు పోయాక రాజశేఖరరెడ్డి గారి మిత్రబృందం పెంచిన ధరలు ఢమాల్న పడిపోయి తండ్రి కంపెనీల నుంచి తీసుకున్న అప్పుల్ని తిరిగి చెల్లించలేక పోయాడు.దాంతో సత్యం కంపెనీకి అప్పులు ఇచ్చినవాళ్ళు  తీర్చమని ఒత్తిడి చేస్తున్నారు. Maytas తన కొత్త ప్రాజెక్టులో లాభాలు గడించి ఉంటే Satyam ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చేవి, అప్పుడు Satyam తన అప్పులవాళ్ళకి చెల్లించేసి వూపిరి పీల్చుకునేది.కేసులో విచారణ ముందుకు వెళ్తే ఇది బయటపడుతుందని తెలిశాక విధి లేక కేసును ఇప్పుడు కనిపిస్తున్న రూపానికి మార్చి జైలు కెళ్ళాడు. తెలిసో తెలియకో ఫ్యాక్షనిష్టులు తమకోసం ఏర్పాటు చేసుకున్న చీమల పుట్టలో బయటివాడు వేలెడితే అట్లానే ఉంటుంది!

మా ఫ్రెండొకడు సత్యంలో పని చేశాడు - "మా రాజుగారు మమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు!" అంటాడు.తన ఉద్యోగుల్ని అంత కంటికి రెప్పలా కాచుకున్న ఒకే ఒక కడు చక్కని ప్రైవేట్ కంపెనీ రెక్కలు కాలిన సంపాతిలా ఒక్కసారి కుప్పకూలిపోవటం ఎంత విషాదం!ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్న fraudster మనస్తత్వం ఉన్నవాడు ఆదాయం మొత్తం తనొక్కడే అనుభవించాలని అనుకుంటాడు గానీ ఎంత తక్కువ ఇచ్చినప్పటికీ కళ్ళకద్దుకుని పనిచేసే వాళ్ళు కో అని పిలిస్తే కోటిమంది వచ్చేలా IT craze ఉన్న కాలంలో ఉద్యోగుల కోసం అంత ఎక్కువ ఎందుకు ఖర్చు పెడతాడు, మీరే చెప్పండి!

ఫ్యాక్షన్ హత్యల విషయానికి వస్తే 2005 జనవరి 24న జరిగిన పరిటాల రవీంద్ర హత్య చాలా ప్రముఖమైనది.అనంతపురం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి అతి సమీపాన బాంబులు పేల్చి హడావిడి సృష్టించి అతనికి దగ్గిరకి వెళ్ళి కాల్చేశారు.రవీంద్ర అక్కడి కక్కడే చచ్చిపోయాడు.ఇతను సుద్దపూస కాదు.2011 జనవరి 04న భాను కిరణ్ చేతిలో చచ్చిపోయిన గంగుల సూర్యనారాయణ రెడ్డి అనబడు మద్దెలచెరువు సూరి కుటుంబానికీ పరిటాల రవీంద్ర కుటుంబానికీ పాత కక్షలు ఉన్నాయి.టీవీలో బాంబు పెట్టి సూరి కుటుంబాన్ని చంపించాడనే కేసు పరిటాల రవీంద్ర మీద వుంది.చేసుకున్న వారికి చేసుకున్నంత అని వూరికే అన్లేదు.

ప్రతి చెడులోనూ కొంత మంచి ఉంటుంది, ప్రతి మంచిలోనూ కొంత చెడు ఉంటుంది, నూటికి నూరు శాతం మంచి గానీ నూటికి నూరు శాతం చెడు గానీ ఉండవు అన్నట్టు కాంగ్రెసు మీద ధ్వజమెత్తి స్థాపించిన తెలుగుదేశం అగ్రకులాలను మరీ ముఖ్యం రాయలసీమ రెడ్డి ఫ్యాక్షనిష్టులను మాత్రమే ప్రోత్సహించే కాంగ్రెసు అలవాటుకు విరుద్ధమైన నిమ్న కులాలను ప్రోత్సహించడం ఫ్యాక్షనిజాన్ని పదింతలు పెంచింది.

అంతకుముందు కాంగ్రెసులోని ఫ్యాక్షనిష్టు నేతలకి పార్టీ రాష్ట్ర శాఖ తమ శత్రువర్గానికి ప్రాధాన్యం ఇస్తే ఢిల్లీలో ఉన్న పార్టీ పెద్దల దగ్గర బలప్రదర్శన చెయ్యడం ఒక్కటే దారి అయితే తెలుగుదేశం వచ్చాక కాంగ్రెసుని వదిలి తెలుగుదేశంలోకి వెళ్ళడం అనే మరో దారి దొరికింది.తెలుగుదేశం ప్రోత్సాహం వల్ల ప్రజాజీవితంలోకి వచ్చిన కొత్త నిమ్నకులాల నేతలు ఆత్మరక్షణ కోసమనే పేరుతో రాయలసీమ రెడ్డి ఫ్యాక్షనిష్టుల్ని అనుకరించారు.

రామారావులా నైతికత అనే ఒంటిరెక్కతో ఎగరాలని చూసి ఆర్ధికం దెబ్బతిని ప్రజలకి నెప్పి తెలిసే పద్ధతిలోనూ చంద్రబాబులా శాస్త్రీయత అనే ఒంటిరెక్కతో ఎగరాలని చూసి హార్ధికం దెబ్బతిని ప్రజలకి నెప్పి తెలిసే పద్ధతిలోనూ పరిపాలన ఉండటం వల్ల ఫ్యాక్షనిష్టుల పునాది అయిన లాయలిస్టుల సంఖ్య పెరిగింది.అలా కాక ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారి లాంటి నైతికత,శాస్త్రీయత అనే రెండు రెక్కలు దాల్చిన వైనతేయుడు గనుక ప్రజాపాలన అనే రంగస్థలం మీద నిలదొక్కుకుని ఉండి క్షీరసాగర మధనం చేసి హాలాహలం తను స్వీకరించి అమృతాన్ని ప్రజలకు పంచి ఇవ్వగలిగితే ఫ్యాక్షనిజం అతి తక్కువ కాలంలోనే అంతమైపోయి ఉండేది!

ఇతర నేరాలకు సంబంధించి చూస్తే 2007 డిసెంబర్ 27 ఆయెషా మిరాన్ అనే ముస్లిం బాలిక మానభంగానికీ హత్యకీ గురయిన సంఘటన పరమ భయానకమైనది.నేరం జరిగిన పద్ధతి పెద్ద కరుణామృతము జాలువారు నవనీత మనస్కుడు కానక్కర లేదు,కనీసపు మానవత్వం ఉన్నవాడు సైతం సాటి మనిషి ఒకడు అలా చెయ్యగలడని వూహించలేనంత కిరాతకమైనది!అయితే, నేరస్తుడి కన్న క్రూరమైన మనస్తత్వం ఉన్న పోలీసువ్యవస్థలోని పెద్దలూ, న్యాయవ్యవస్థలోని పెద్దలూ ప్రభుత్వం యొక్క రాజముద్ర నిత్యం కళ్ళముందు చూపించి చెప్తున్న "సత్యమేవ జయతే" అన్న కనీసపు బాధ్యతను విస్మరించి కేసును ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులు తిప్పి 2008 నాటికి సత్యంబాబు అనే వ్యక్తిని పట్టుకొచ్చి కోర్టుముందు నిలబెట్టారు.అప్పుడు Vijayawada women's special sessions court వారు 376 of IPC ప్రకారం మాంభంగానికీ 302 of IPC ప్రకారం హత్యకీ కలిపి పదేళ్ళు కఠిన కారాగార వాస శిక్ష వేశారు.కానీ, 2017 మార్చి  31Hyderabad High Court సత్యంబాబు నిరపరాధి అని ప్రకటిస్తూ తీర్పు ఇచ్చింది - ఎనిమిదేళ్ళ పాటు ఒక నిరపరాధిని జైలులో ఉంచినందుకు compensation ఇవ్వమని ప్రభుత్వాన్ని ఆదేశించింది!

సత్యం బాబు నిర్దోషి అనీ అసలు దోషి రాజశేఖరరెడ్డి గారి ప్రభుత్వంలో Deputy Chief Minister అయిన కోనేరు రంగారావు గారి బంధువనీ ఆయేషా తలిదండ్రులు మొదటినుంచి చెప్తూనే ఉన్నప్పటికీ ఒక మొబైల్ ఫోను చొరీ కేసులో తమకు దొరికిన సత్యంబాబుని నిర్దోషి అని తెలిసి కూడా నేరస్థుడి కింద ఫిరాయించేసిన పోలీసుల్ని ఏమనాలి?తెలిసి తెలిసీ అన్యాయమైన తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్ని ఏం చెయ్యాలి!ఒకసారి ఆయేషా తల్లి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారిని కలిసి న్యాయం చెయ్యమని కాళ్ళమీద పడి వేడుకుంటే కాళ్ళతోనే పక్కకి విదిల్చి వెళ్ళిపోయారట మండు వేసవిలో వర్షాల్ని కురిపించగలిగిన మహత్యాలు గల దేవుడి లాంటి ముఖ్యమంత్రి గారు!

2008లో రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు Krishna Nagar ప్రాంతంలోని 475 square yards వైశాల్యం గల స్థలంలో ఒక ఇల్లు కట్టుకున్నారు.2010లో నీరజా రావు అనే ఒక మహిళ ఆ స్థలం తన తండ్రి పేరున రిజిస్టర్ అయిన భూమి అనీ రవీంద్రనాథ్ రెడ్డి గారిది కాదనీ ఆరోపిస్తూ న్యాయపోరాటం చేపట్టింది.ఆమె ప్రాణభయాన్ని కూడా జయించి తన క్షేమం కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ గడిపి ఆఖరికి 2013 నాటికి కోర్టు తీర్పు ప్రకారం రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు Krishna Nagar ప్రాంతంలోని 475 square yards వైశాల్యం గల స్థలంలో కట్టిన అక్రమ కట్టడాన్ని GHMC అధికారుల చేతనే కూల్చివేయించి మీసం మెలేసింది!

ఆటలో అరటిపండు లాంటి ఒక చిత్రమైన సన్నివేశం ఏమిటంటే, న్యాయపోరాటం మొదలు పెట్టే ముందు 2010 ఫిబ్రవరి 16న రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి కడుపున పుట్టిన వంశోద్ధారకుడూ కులభాస్కరుడూ అయిన జగన్మోహన రెడ్డిగారిని కలిసిందట!బహుశః, జగన్మోహాన్ రెడ్డి గారు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ బహిరంగ వేదికల మీద "బీదాసాదల కోసం బ్రాణమిస్తా"ననీ "అషహాయులను ఆడుకోవడానికి ముఖ్యమంత్రిని సైతం నడిరోడ్డు మీద నిలబెట్టి షూట్ చెయ్యడానికి వెనుకాడబో"ననీ "మాట తప్ప"ననీ "మడమ తిప్ప"ననీ చెప్పిన గంబీరమైన అసత్యాలని నిజమనుకుని నమ్మేసింది కాబోలు!ఆమె ఈయన మీద ఎంతో నమ్మకం పెట్టుకుని వారంలో పనైపోతుందని ధీమాగా ఉంటే ఆయన గారు చిన్నపిల్లాడి కన్న అమాయకమైన మొహంతో "officials had done whatever they can" అనేశారట!జగన్మోహాన్ రెడ్డి గారు ఆ విషయంలో ఇక కల్పించుకోడని తెలిసిన GHMCకి అప్పటి Additional commissioner అయిన Dhananjaya Reddy గారు "do whatever you can" అని నీరజా రావుని చాలెంజి చేశారట.

ఇవన్నీ రహస్యమైన సన్నివేశాలు కావు, బహిరంగమైనవే - అందరికీ ఇవి జరిగాయని తెలిసేటంత సంచలనం పుట్టింది.కోర్టు నీరజా రావుకి అనుకూలమైన తీర్పు ఇవ్వడానికి కారణం ఆమె ఎవర్నీ మోసం చెయ్యలేదు, ప్రభుత్వం ఇచ్చిన అధికారికమైన పత్రాలనే ఆమె చూపించింది.మరి, తను చేసింది తప్పని రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారికి తెలియదా!రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు తప్పు చేశారని రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి కన్నబిడ్డ జగన్మోహాన్ రెడ్డి గారికి తెలియదా!నీరజా రావు జగన్మోహాన్ రెడ్డి గారిని ఎందుకు కలిసింది?రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి సోదరులుం గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారు చేసింది తప్పని తెలిసిన రాజశేఖర రెడ్డి గారి భార్య విజయమ్మ గారి కన్నబిడ్డ జగన్మోహాన్ రెడ్డి గారు తను చొరవ తీసుకుని ఆమెకి న్యాయం చేస్తాడని కదా!తన బంధువు వల్ల అన్యాయానికి గురై తన దగ్గిరకి వచ్చిన ఒక ఒంటరి ఆడదానికి న్యాయం చెయ్యడం కోసం బంధుప్రీతిని పక్కన పెట్టి ఆమెకి న్యాయం జరిపించలేని అసమర్ధుడు కొన్ని కోట్లమందికి ముప్పయ్యేళ్ళ పాటు న్యాయం చెయ్యగల సమర్ధుడనని తనెట్లా నమ్మాడు, ఇతర్ల నెందుకు నమ్మించాడు?

వీటన్నిటి కంటె రాజశేఖర రెడ్డి గారు కాన్స్టాంటినోపుల్ తర్వాత అంతటి హద్దులెరుగని స్థాయిలో క్రైస్తవ మతవ్యాప్తి చేసిన మొదటి ప్రభుత్వాధినేత, ఆధునిక సెక్యులరిస్టు సిద్ధాంతం అమలులోకి వచ్చిన తర్వాత సెక్యులర్ చట్రాన్ని బద్దలు కొట్టి మరీ క్రైస్తవ మతవ్యాప్తి చేసిన మొదటి ప్రభుత్వాధినేత అన్న ఖ్యాతిని గడించారు.2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు నదురూ బెదురూ లేని స్థాయిలో క్రైస్తవీకరణని ప్రోత్సహించారు.అప్పటివరకు హిందూ ముఖ్యమంత్రుల కాలంలో అణిగిమణిగి పడివున్న పాస్టర్లు క్రైస్తవుడైన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వ్యాపించే వేగాన్ని పెంచారు - వాళ్ళ బైబిలు చెప్తున్న "దేవుడి రాజ్యం" అనేదాన్ని రాజశేఖర రెడ్డి గారి పాలనకి మారుపేరు చేసేశారు.పిచ్చి హిందువులు వాళ్ళు రామరాజ్యం గురించి చెప్తున్నారనుకుని మోసపోయారు.

2006 August నెలలో GO MS. No: 21 విడుదల చేసి Rs. 80, 000/- ప్రభుత్వ ధనాన్ని చర్చిల మరమ్మతుల కోసం ఖర్చు చేశారు.Deccan Chronicle తన 2006 August 23నాటి సంచికలో "CM Reddy okays public money for churches" అనే వార్త వేసింది కూడాను.ఇదే ఆజ్ఞలో కొత్త చర్చిలు కట్టుకోవాలనుకునే వారికి ఒక్కో చర్చికీ 1.5 lakhs కేటాయించాలనే ఆదేశం కూడా ఉంది.ప్రభుత్వానికి అవసరమైన నిధుల కోసం సుమారు Rs.20,000 crores విలువ గల 7000 ఎకరాల విస్తీర్ణం ఉన్న హిందూ ఆలయ భూముల్ని అమ్మేశారు.వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడమే కాక కొన్నింటిని పాస్టర్లు ఆక్రమించుకుంటున్నప్పటికీ చూసీ చూడనట్టు ఉండిపోయారు.ఒక్క 2004 నుంచి 2009 మధ్య వేల సంఖ్యలో కొత్త చర్చిలు కట్టేశారు.ప్రతి ఏడుగురు క్రైస్తవులకీ ఒక చర్చి ఉండాలనే లెక్క చొప్పున 1,48,000 చర్చిలు తయారయ్యాయి!మరి, హిందూ ఆలయాలు?ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్నప్పటికీ అప్పటికి ప్రతి 350 మంది హిందువులకీ ఒక ఆలయం చొప్పున కట్టినట్టు 1,90,000 మాత్రమే ఉన్నాయి.

చర్చి నిర్మాణం కోసం ఉద్దేశించిన నిబంధనలు చూస్తే ఎక్కడ పడితే అక్కడ చర్చిని నిర్మించటం అంత సులభమైన వ్యవహారం కాదని అనిపిస్తుంది.

️ ఏ చర్చి అయితే నిర్మిస్తున్నారో దాని తాలూకు వివరాలు ప్రభుత్వానికి సమర్పించాలి.

️ నిర్మించదలచిన చర్చి కోసం ముందుగా ఒక కమిటీ వేయాలి..

ఆ కమిటీలో ఈ క్రింది వారు సభ్యులుగా ఉండాలి 👇👇

👉 ఎంపీడీవో/మున్సిపల్ కమిషనర్ - చర్చి కమిటీ అధ్యక్షుడు.

👉 మున్సిపల్ ఇంజనీరు - కమిటీ సభ్యుడు.

👉చర్చి పాస్టర్ - కమిటీ సభ్యుడు.

👉ఆ చర్చి కమిటీలో మరో ఇతర ప్రభుత్వ అధికారి సభ్యుడిగా ఉండాలి.

️ కమిటీ ఏర్పాటు అయ్యాక కలెక్టర్ అనుమతి కోసం ఈ క్రింది పత్రాలు సమర్పించాలి.

️ఆ చర్చి పేరు, చిరునామా

️ఆ చర్చి పాస్టర్ పేరు, చిరునామా

️ ఆ చర్చి కమిటీ సభ్యుల వివరాలు

️ ఆ చర్చి నిర్మాణం జరపదలచిన స్థలం తప్పనిసరిగా ఆ చర్చి పేరిట రిజిస్టర్ అవ్వాలి.

(ఒకవేళ ఆలా రిజిస్టర్ అవ్వకపోతే అందుకు కారణాలు స్పష్టంగా పేర్కొనాలి.)

️లోకల్ మున్సిపాలిటీ అప్రూవ్ చేసిన ఆ చర్చి నిర్మాణం యొక్క ప్లాన్

️ లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా తయారుచేసిన ఆ చర్చి నిర్మాణం యొక్క ఖర్చుల estimation

️ ఆ estimation కాపీ మీద ఆ మండల మున్సిపల్ ఇంజనీరు సంతకం

️ ఆ చర్చి యొక్క సొసైటీ రిజిస్ట్రేషన్ కాపీ

️ తమకు విదేశీ నిధులు రావట్లేదంటూ ఆ చర్చి పాస్టర్ తన లెటర్ హెడ్ మీద రాసిచ్చిన డిక్లరేషన్

️ ఒకవేళ ప్రభుత్వం నుండి ఈ నిర్మాణానికి గత 05 ఏళ్లలో ఏవైనా నిధులు వచ్చి ఉంటే ఆ వివరాలు

️చర్చీ నిర్మాణం జరిగే గ్రామం యొక్క మొత్తం జనాభా

️ చర్చి నిర్మాణం జరిగే గ్రామంలోని క్రైస్తవ జనాభా, అప్పటికే ఉన్న ఇతర చర్చీల వివరాలు

ఈ డాక్యుమెంట్లతో పాటు ముఖ్యమైనది చుట్టుప్రక్కల నివసించే వారి నుండి No_Objection సర్టిఫికెట్.అన్నీ ఉండి ఈ ఒక్క సర్టిఫికెట్ లేకపోయినా చర్చికి అనుమతి రాదు.ఇంత తతంగం ఉన్నప్పటికీ పుట్టగొడుగుల్లా కొత్త చర్చిలు పుట్టుకొస్తున్నాయంటే ప్రభుత్వాధినేతలు ప్రోత్సహించడం వల్లనే కదా!ఇంకో వైపున 30,000 హిందూ ఆలయాల నుంచి ఎంతో ఎక్కువ స్థాయిలో ఆదాయం వస్తున్నప్పటికీ దేవాదాయ చట్టాలలో వాటి ఆదాయం నుంచి వాటి పోషణకు తిరిగి ఇవ్వాలని నిబంధనలు ఉన్నప్పటికీ అది జరగలేదు.అంటే, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హిందూ మతాన్ని తగ్గించి క్రైస్తవ మతాన్ని పెంచాలనుకున్నట్టు అర్ధం కావడం లేదూ! వీటన్నింటి వల్ల 2001 నాడు 1.5% ఉన్న క్రైస్తవ జనసంఖ్య అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 నుంచి 12% పెరిగితే పాస్టర్లు 35% పెరిగినట్టు చెప్పుకున్నారు.

ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనే తేడా లేకుండా ఈ తరం తెలుగువాళ్ళలోని మేధావులు అందరూ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న religious polarization వల్ల జరగబోయే ప్రమాదాన్నీ తెలంగాణా ఏర్పాటులోని మత ప్రాతిపదికనూ గుర్తించడంలో ఎందుకు విఫలమయ్యారో అర్ధం కావడం లేదు నాకు.ఇటీవలి వరకు నాకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేసిన క్రైస్తవ మత ప్రచారం గురించి ఎక్కువ వివరాలు తెలియదు. నేను వేరొక వ్యాసం కోసం పరిశోధన చేస్తున్నప్పుడు "2001 నాడు 1.5% ఉన్న క్రైస్తవ జనసంఖ్య అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వ లెక్కల ప్రకారం 10 నుంచి 12% పెరిగితే పాస్టర్లు 35% పెరిగినట్టు చెప్పుకున్నారు" అనేది తెలిసిన వెంటనే చర్చిల సంఖ్య తెలంగాణ వైపుకన్న ఆంధ్ర వైపునే ఎక్కువున్నాయని గుర్తొచ్చి "హిందువులు ఎక్కువున్న తెలంగాణను విడదీస్తే ఆంధ్రప్రాంతంలోని క్రైస్తవుల సంఖ్య ఆమాంతం రెండింతలు పైకి లేస్తుంది!" అనేది తళుక్కున మెరిసింది నాకు.మరి, ఎన్నికల్లో గెలుపు కోసం కులాల వారీ సీట్లు కేటాయించడం కోసం ఏ ప్రాంతంలో ఏ కులంవాళ్ళు ఎంతమంది ఉన్నారని కాకి లెక్కలు వేసుకుంటున్నవాళ్ళకి ఇది తెలియకపోవడం విచిత్రం కాదూ!ఇలాంటివి ఇతర దేశాల్లోనూ మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయని తెలియకనూ తెలిసినా ఇక్కడ జరిగేనా పెట్టేనా అని భరోసాతోనూ నిర్లక్ష్యం చేశారని నా నమ్మకం.

వాస్తవానికి తెలంగాణ ఏర్పాటుకు దారి తీసిన ఆంధ్రప్రదేశ్ విభజన వెనక ఉన్నది మతపరమైన కారణమే!"ఒక వోటు, రెండు రాష్ట్రాలు!" అనే నినాదంతో అనుకుంటాను 1997లో మొదట BJP రాష్ట్ర శాఖ తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసింది.2000వ సంవత్సరంలో తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు Telangana Congress Legislators Forum అనే సంస్థను స్థాపించి దాని తరపున తమ పార్టీ అధ్యక్షురాలైన శ్రీమతి సోనియా గాంధీకి ఒక విజ్ఞాపన పత్రం సమర్పించారు.2001 ఏప్రిల్ 27Kalvakuntla Chandrashekar Rao (KCR) గారు Deputy Speaker స్థానానికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి Telangana Rashtra Samithi (TRS) అనే సంస్థని స్థాపించారు.

అయితే, స్వతంత్ర తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 1997లో మొదట తెలంగాణ ఏర్పాటు కోసం తీర్మానం చేసిన BJPకి చెవుల్లో పువ్వులు పెట్టి 2000వ సంవత్సరంలో తెలంగాణ కోసం సంకల్పించిన కాంగ్రెసుకు సుంతీ చేసి 2001 మొదలు 2014 వరకు అంత భీకరమైన పోరాటం చేసిన TRSకి అత్తెసరు మెజార్టీ ఇవ్వడం వెనక ఉన్న రహస్యం ఏమిటి?2014లో కూడా లాభసాటి కాని దాని కోసం ఒకరు 1997లోనూ ఇంకొకరు 2000లోనూ మరొకరు 2001లోనూ ఎందుకు ప్రయత్నం చేశారు?తెలంగాణ ప్రజలలో ఉన్న ఆకాంక్షలను నెరవేర్చటానికే అసమర్ధులైన వీళ్ళు తెలంగాణ ప్రజలలో లేని ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చటానికి అంత సమర్ధత ఎట్లా చూపించగలిగారు?

కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి  రాజకీయ ప్రయాణం కాంగ్రెసులోనే మొదలైంది.మెదక్కు శాఖలో చేరారు.ఎప్పుడు చేరారో కూడా తెలియడం లేదు. కాంగ్రెసులో ఉండి 1983 వరకు ఏమి గోగునార కట్టలు పీకినారో తెలియడం లేదు గానీ 1983లో రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీలో చేరి అనంతుల మదన్ మోహన్ మీద పోటీ చేసి ఓడిపోయారు.అయితే, తర్వాత కొంచెం కష్టపడి ముందుకెళ్ళి 1987 మొదలు 1988 వరకు రామారావు మంత్రివర్గంలో Drought & Relief శాఖతో మంత్రి అయ్యారు.1990లో Medak, Nizamabad, Adilabad జిల్లాలకు తెలుగుదేశం పార్టీకి కన్వీనర్ అయ్యారు.1996లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో Transport minister అయ్యారు.2000 మొదలు 2001 వరకు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకి deputy speaker అయ్యారు.2001 April 27Deputy Speaker స్థానానికీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేసి Telangana Rashtra Samithi (TRS) అనే సంస్థని స్థాపించారు.

మహా ఘనత వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమపు నీచత్వాన్ని తెలుసుకోవటానికి ఈ కొంచెం చరిత్ర చాలదూ!తను మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద తనే తిరగబడటం ఏమిటో అందులోని మోసం ఏమిటో ఇప్పటికీ తెలుసుకోలేని తెలంగాణ ప్రాంతపు మేధావుల అజ్ఞానం మీద నాకు జాలి వేస్తుంది.వాళ్ళ ఆజ్ఞానంతో ఇన్నేళ్ళూ వాళ్ళని వాళ్ళు సర్వనాశనం చేసుకున్నది చాలక వాళ్ళకన్న పదింతలు తెలివైనవాళ్ళైన ఆంధ్ర ప్రాంతపు ప్రజల్ని కూడా సర్వనాశనం చేశారు!

దేశం మొత్తం మీద ఎలా ఎన్నికలు జరుగుతాయో తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ అలాగే జరుగుతాయి కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యుల్ని తెలంగాణ వోటర్లే ఎన్నుకుంటారు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యుల్ని ఆంధ్రా వోటర్లే ఎన్నుకుంటారు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!

1968 నాటి చెన్నారెడ్డి గారూ 2001 నాటి కేసీయార్ గారూ ఒకేలాంటి కబుర్లు చెప్పారు, రెండుసార్లూ తెలంగాణ ప్రజలూ మేధావులూ ఒకే రకం పిచ్చితనాన్ని ప్రదర్శించారు,పైన ఆంధ్ర ప్రాంతపు నాయకుల్ని దొంగలనీ దోపిడీదార్లనీ తిడుతున్నారు.

కల్వకుంట్ల చంద్రశేఖర రావు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి జరిగిన ఘోరమైన అన్యాయాన్ని సరిదిద్దాలంటూ ఆ సమయంలో ప్రభుత్వంలోనే ఉండి అదీ అత్యంత కీలకమైన శాఖలను నిర్వహిస్తూ ఆ అన్యాయంలో భాగస్వామియైన కల్వకుంట్ల చంద్రశేఖర రావుయే ఉద్యమించడం ఏమిటో, అలాంటి డొంకతిరుగుడు బెదిరింపు తతంగాన్ని పట్టుకుని ఇవ్వాళ కొందరు తెలంగాణ ప్రజలూ మేధావులూ మాది 1968 నాటి నుంచి రగులుతున్న స్వాతంత్య్ర కాంక్ష అని బట్టలు చింపుకోవడం ఏమిటో - అస్సలు కామన్ సెన్సు కూడా ఉండదా!

2009 డిసెంబర్ 20 నాడు Muslim Forum for Telangana (MFT) అనే సంస్థ తెలంగాణ కోసం డిమాందు చేస్తే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు "Pseudo propaganda against Telangana Muslims" అని దాన్ని కొట్టి పారేశారు.అయినప్పటికీ అది బలం పెంచుకుంటూనే ఉంది.ఇప్పటికీ కొందరు రాజశేఖరరెడ్డి గారు బతికుంటే రాష్ట్రం విడిపోయి వుండేది కాదని అనుకుంటారు గానీ రాజశేఖరరెడ్డి గారు అణిచెయ్యాలనుకున్నదీ అణిచేసిందీ కేసీయారునే తప్ప తెలంగాణ ఉద్యమాన్ని కాదు.

మిగిలిన అన్ని విషయాల్లోనూ శ్రీమతి సోనియా గాంధీ దగ్గిర తన మాటనే నెగ్గించుకోగలిగిన రాజశేఖర రెడ్డి గారు మరి చంద్రశేఖర రావు గారు శ్రీమతి సోనియాగాంధీ గారిని కలవటాన్నీ పార్టీ నాశనం అవుతుందని చెప్పినా వినిపించుకోకుండా సోనియా అతనికి తెలంగాణ ఏర్పాటుకు అంత ధారాళంగా వాగ్దానం ఇవ్వటాన్నీ ఎందుకు ఆపలేకపోయారు.అప్పటి వరకు జరుగుతున్న వాటిల్లో ఏ ఒక్క సన్నివేశాన్నీ ఆపలేని రాజశేఖర రెడ్డి గారు బతికుంటే ఒక రెండు సంవత్సరాల తర్వాతో అయిదు సంవత్సరాల తర్వాతో తెలంగాణ ఏర్పాటుని ఆపగలిగేవారని ఎట్లా నమ్ముతున్నారు?

అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం నుంచి అధికారం గుంజుకోవటానికి రాజశేఖర రెడ్డి గారు వేసిన అనేకమైన ఎత్తుగడలలో ప్రమాదకరమైనవి రెండు - నక్సలైట్లతో పొత్తు కలపటం,తెరాసతో కత్తు కలపటం!నక్సలైట్లని ఔరంగజేబు శివాజీని పట్టి బంధించడానికి ఎత్తు వేసిన రీతిలో చర్చలకి పిలిచి అరెస్టు చేసి అణిచేశాడు.కానీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు మాత్రం రాజశేఖర రెడ్డి గారికి అందనంత ఎత్తులో ఉన్నారు, శ్రీమతి సోనియా గాంధీకి చాలామంది కాంగ్రెసు వాళ్ళకన్న ప్రీతిపాత్రు లయ్యారు. అది ఎలా సాధ్యం!

ఇక్కడే అసలు మెలిక ఉంది.రాజశేఖరరెడ్డి గారు రాష్ట్ర విభజనకి బద్ధ వ్యతిరేకి.తెరాసతో పొత్తు అస్సలు ఇష్టం లేదు.కేవలం అధిష్ఠానం ఒత్తిడి మేరకు మాత్రమే ఒప్పుకున్నారు.బయటివాడైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి తెలంగాణ ఏర్పాటుకు వాగ్దానం ఇచ్చే విషయంలో తన ఒక్క చేతి మీద పార్టీని గెలిపించగలిగిన రాజశేఖర రెడ్డి గారి వంటి సొంత పార్టీ నాయకుడి బలమైన వ్యతిరేకతను కూడా కాంగ్రెసు అధిష్ఠానం లెక్కచెయ్యలేదు - ఎంత విచిత్రం!

రాజశేఖరరెడ్డి గారు 2009 సెప్టెంబర్ 02న హెలికాప్టరు ప్రమాదం జరిగి చనిపోగానే 2009 సెప్టెంబర్ 03 మొదలు 2010 నవంబర్ 24 వరకు (30)కొణిజేటి రోశయ్య గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.2004 నాటి ఎన్నికల్లో ప్రచారసభల్లో పాల్గొని రాజకీయ రంగప్రవేశం చేసిన రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహాన్ రెడ్డి గారు 2009లో కడప నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడు అయ్యారు.తండ్రి చనిపోయిన మరుక్షణమే తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు.మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టుకున్నప్పటికీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రెటరీ ఇతనెంత పట్టుదలతో శ్రమించాడో వారంత పట్టుదలతో తిరస్కరించేశారు.

మరొకరైతే నీరసించిపోయేవారే, కానీ తండ్రిని మించిన పోరాట పటిమ గల ఇతను కేవలం ఆరునెలలకే మెరుపులాంటి ఐడియాతో "తండ్రి మరణవార్త విని ఆయన మీద అభిమానంతో ప్రాణాలు విడిచిన వారి కుటుంబాలను" పరామర్శించి ఓదార్చే మిషన రాష్ట్రంలో పర్యటించి ప్రజల్లో చాలా మంచిపేరును తెచ్చుకున్నాడు.నిజానికి ఈ యాత్ర తండ్రి చేసిన పాదయాత్రకు నకలు లాంటిది - అంగికం, వాచికం కూడా తండ్రిని పోలి వుండేటట్టు బాణీని మార్చడంతో సెంటిమెంటు వరదలై కురిసింది!ఆ ఉత్సాహంతో 2010 నవంబర్ 29న కాంగ్రెసుతో ఇక కుదరదని తెగదెంపులు చేసుకుని 2010 డిసెంబర్ 07YSR Congress Party అనే కొత్త పార్టీ ప్రారంభించబోతున్నానని ప్రకటించాడు.

అనారోగ్య కారణాలతో రోశయ్య గారు తప్పుకున్నాక 2010 నవంబర్ 25 మొదలు 2014 మార్చి 01 వరకు (31)నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికి ఏర్పాట్లు పూర్తయ్యి రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు YSR Congress Party అనే కొత్త పార్టీని ప్రారంభించేశారు.పార్టీ పేరులో ఒక తమాషా వుంది - ఇంగ్లీసు పొడి అక్షరాల్లో తండ్రి పేరు కనిపిస్తుంది గానీ తెలుగులో "యువజన శ్రామిక రైతు కాంగ్రెస్", దీన్ని ఇంగ్లీషు లిపిలో రాస్తే మటుకు Y(uvajana) S(raamika) R(aitu) అవుతుంది.అన్నట్టుగానే అన్ని సన్నాహలూ పూర్తి చేసుకుని 2011 మార్చిలో పార్టీని స్థాపించి తర్వాతి ఎన్నికల్లో కడప మొత్తాన్ని తన గుప్పిటిలోకి తెచ్చేసుకున్నారు.

అయితే, అదే 2011 ఆగస్టు 10న మాజీ మంత్రి P Shankar Rao రాష్ట్ర హైకోర్టులో అతని మీద CBI విచారణ కోసం పిటిషన్ వేశాడు - అభియోగం జగన్మోహన్ రెడ్డి గారు 2004-2009 మధ్య కాలంలో తండ్రి యొక్క ముఖమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల ప్రజాధనాన్ని హారతి కర్పూరం చేశాడని.ఆగస్టు 17FIR దాఖలు అయ్యింది - ప్రస్తుతం 13 కేసులు మాత్రమే ఉన్నాయని అంటున్నారు గానీ అవి కొన్ని ఒకేలాంటి కేసుల్ని కలిపి నమోదు చేసిన చార్జిషీట్ల సంఖ్య. 120-B (criminal conspiracy), 420 (cheating), 409 (criminal breach of trust) and 477A (falsification of accounts) సెక్షన్ల కింద 74 కేసులు నమోదు అయ్యాయి.Section 13 of the Prevention of Corruption Act అనేది కొసరు కేసు.

2012 మార్చి 31CBI మొదటి చార్జిషీటు దాఖలు చేసింది - ఇందులోనే జగన్మోహన్ రెడ్డి గారు A1గానూ విజయసాయి రెడ్డి గారు A2గానూ బిరుదులు పొందారు, సహనిందితులు 13 మంది.ఏప్రిల్ 03న రెండవ చార్జిషీటు, మే 07న మూడవ చార్జిషీటు వేసింది CBI - అన్నింటిలోనూ వారిద్దరే A1, A2లు.మే 08Sakshi daily, Sakshi television channel, Janani Infra కంపెనీల ఆస్తుల్ని సీజ్ చేసింది.మే 09 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సాక్షి పత్రిక మరియు చానెలుకు వ్యాపార ప్రకటనలు ఆగిపోయాయి.హైకోర్టు మే 23న జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.మే 23CBI జగన్మోహాన్ రెడ్డి గారికి మే 25 లోపు తనముందు హాజరవ్వాలని సమన్లు పంపించింది.మే 25న విచారణ ప్రారంభించిన CBI మే 27న అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించింది.

జగన్మోహాన్ రెడ్డి గారి అభిమానులు "రావాలి జగనన్న!కావాలి జగనన్న! టటంటం,టటంటం." అని పిచ్చ పాటలు పాడుకోవటానికీ విషయాన్ని బట్టి దాదాపు ప్రతి రాజకీయ నాయకుణ్ణీ తప్పుంటే విమర్శించి ఒప్పుంటే సమర్ధించి నూటికి తొంబై తొమ్మిది శాతం Credibilityని maintain చేస్తున్న నన్ను పట్టుకుని "నువ్వు జగన్ని తిట్టినంత ఘాటుగా చంద్రబాబుని తిట్టట్లేదు గాబట్టి నువ్వు బాబు ఫ్యానువే" అంటూ నామీద పడి యాడవటానికీ తప్ప ఇంకెందుకూ పనికిరాని బుర్రతక్కువసన్నాసులు.జగన్మోహాన్ రెడ్డి గారి అరెస్టు జరిగిన పద్ధతిని గమనించిన ప్రతి ఒక్కరూ యధాలాపం అనుకుని పట్టించుకోని కొన్ని ముఖ్యమైన సంఘటనల్ని ఒక వరసక్రమంలో పేర్చి వాటిలోని అసంబద్ధతని గమనించినప్పుడు ఆశ్చర్యం వేసింది నాకు.

01).2011 ఆగస్టు 10న మాజీ మంత్రి P Shankar Rao రాష్ట్ర హైకోర్టులో జగన్మోహాన్ రెడ్డి గారి మీద CBI విచారణ కోసం పిటిషన్ వేశాడు,

02).2012 మార్చి 31CBI మొదటి చార్జిషీటు దాఖలు చేసింది,మే 25న విచారణ ప్రారంభించిన CBI మే 27న అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించింది - అప్పటి జగన్మోహాన్ రెడ్డి గారి కారాగార వాసం అతను బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని విచారణ కోసం కోర్టు తన ఆతిధ్యంలో ఉంచుకోవడం లాంటిది మాత్రమే,

03).జగన్మోహాన్ రెడ్డి గారి ఆర్ధిక కార్యకలాపాలకి ప్రోత్సాహం ఇచ్చారని CBI చార్జిషీట్లలో పేర్లు ఉన్న గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ వంటివారు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ ఉన్నారు,

04).తమ పార్టీని నష్టపెట్టిన జగన్మోహాన్ రెడ్డి గారి మీద అంత కసిబూని కేసులు పెట్టి జైలుకి పంపించిన కాంగ్రెసు ప్రభుత్వం జైలులో పడ్డాక జగన్మోహాన్ రెడ్డి గారిని పండక్కి అత్తారింటికి వచ్చిన కొత్తల్లుడిలా చూసింది,

05).2013 సెప్టెంబర్ 23న పదహారు నెలల ఏకాంతవాసం తర్వాత CBI కోర్టు అతనికి నిబంధనలతో కూడిన బెయిలును మంజూరు చేసింది.

06).CBI కోర్టు యొక్క సాంకేతిక పరిభాషలో అతను దోషి అని కానీ నిర్దోషి అని కానీ నిరూపణ కాలేదు - ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి CBI కోర్టు యొక్క ప్రత్యక్ష విచారణ పూర్తి కాలేదు.

అప్పటి జగన్మోహాన్ రెడ్డి గారి కారాగార వాసం CBI కోర్టు జగన్మోహాన్ రెడ్డి గారు బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని భావించి విచారణ కోసం కోర్టు తన ఆతిధ్యంలో ఉంచుకోవడం అయినప్పుడు జగన్మోహాన్ రెడ్డి గారి ఆర్ధిక కార్యకలాపాలకి ప్రోత్సాహం ఇచ్చారని CBI చార్జిషీట్లలో పేర్లు ఉన్న గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ వంటి వాళ్ళు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉండటం తప్పు కదా!

ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి చేత తప్పుడు పనులు చేయించితే ఇద్దరి స్థాయీ ఒకటే కావచ్చు గానీ ఒక వ్యక్తి ప్రభుత్వం చేత తప్పుడు పనులు చేయించితే అప్పుడు కూడా ఇద్దరి స్థాయీ ఒకటే అనడం ఎట్లా కుదురుతుంది?జగన్మోహాన్ రెడ్డి గారి మీద చేసిన నేరారోపణ తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని  ప్రజాధనం కొల్లగొట్టాడని అయినప్పుడు అందరు ప్రజలకీ ధన మాన ప్రాణాలకు సమానమైన రక్షణ ఇస్తామని ప్రమాణం చేసిన మంత్రులూ ప్రభుత్వాధికారులూ ముఖ్యమంత్రి కొడుకు కాదు అసలు ఒక అనామకుడికి అలాంటి సహాయాలు చేసినప్పటికీ వాళ్ళే కదా అసలు నేరస్థులు!అసలు A1 స్థాయి అప్పుడు ప్రభుత్వంలో ఉండి అంత తీవ్ర స్థాయిలో ప్రజాద్రోహనేరం చేసిన గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ గార్లకి ఇవ్వాలి, అవునా?CBIకి గానీ ఆ తతంగాన్ని గమనిస్తున్న మేధావులకు గానీ ఇంత చిన్న ధర్మసూక్షం ఇప్పటికీ అర్ధం కావడం లేదంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావడం లేదు నాకు.

ఒక్క జగన్మోహాన్ రెడ్డి గారిని మాత్రమే జైలుకి పంపించి గీతా రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, ధర్మాన ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణ లాంటివాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లా ప్రభుత్వంలో ఎందుకు ఉంచారో ఎవరు జవాబు చెప్తారు?మాజీ CBI జేడీ లక్ష్మీనారాయణ గారిని అడగాలి - జవాబు చెప్తారో లేదో!

నేను ఎత్తి చూపించిన పాయింట్లు జగన్మోహాన్ రెడ్డి గారు కానీ జగన్మోహాన్ రెడ్డి గారి అభిమానులు కానీ పట్టించుకుని న్యాయపోరాటం చేసి ఉంటే ఇంత కాలం జగన్మోహాన్ రెడ్డి గారు రెంటికి చెడ్డ రేవడిలా అంత యాతన పడి ఉండేవారు కాదు.

మన కసికొద్దీ మనం చిప్పకూడు అనుకున్నప్పటికీ ఇలాంటి వాళ్ళకి కారాగారంలో కూడా వైభవాలకి తక్కువేం ఉండదు లెండి!న్యాయవ్యవస్థ కూడా కొన్ని చిత్రమైన అసమానతలను పాటిస్తున్నది.నేరాలలోనూ విభజన ఉన్నది - సివిల్, క్రిమినల్ చట్టాలు వేరు.నేరస్వభావాన్ని బట్టీ నేరం యొక్క తీవ్రతను బట్టీ శిక్షలలో కూడా అంతరాలు ఉంటాయి.న్యాయవాదుల్లోనూ న్యాయమూర్తుల్లోనూ మానవసహజమైన దౌర్బల్యాలు ఉన్నాయి, ఉంటాయి.అసలు జగన్ అప్పటికి విచారణ పూర్తయిన నేరస్థుడు కాదు.అప్పటి జగన్ కారాగార వాసం అతను బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని విచారణ కోసం కోర్టు తన ఆతిధ్యంలో ఉంచుకోవడం లాంటిది మాత్రమే - కాబట్టి ఆహార్య భోజన విహార నియమాలు వర్తించవు కాబోలు!ఆ సమయంలో కూడా నాగార్జున జైలుకి వెళ్ళి కలవడం లాంటి వార్తల వల్ల ఫోకస్ రింగ్ అతని మీద పడుతూనే ఉంది.కొందరు సీనియర్ జర్నలిస్టులు చెప్పినదాన్ని బట్టి సినిమా రంగంలో జగన్ బీనామీ సంస్థ అయిన R R Creations నుంచి తనకు రావల్సిన బకాయిల కోసం నాగార్జున వెళ్ళినట్టు తెలుస్తున్నది.అంతే కాదు, కాంగ్రెసు నుంచీ తెలుగుదేశం నుంచీ డజనుకు పైన శాసనసభ్యులు అతన్ని కలిశారు - తెదెపా నాయకులు అతను చంచల్ గూడ జైలుని తన పార్టీ ఆఫీసు కింద మార్చడానికి అధికార పార్టీ సహాయం చేస్తున్నదని ఆరోపించారు కూడాను.

జగన్మోహాన్ రెడ్డి గారిని అరెస్టు చేసినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన సంక్లిష్టస్థితినీ పదహారు నెలల తర్వాత జగన్మోహాన్ రెడ్డి గారికి బెయిలు ఇచ్చినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన సంక్లిష్టస్థితినీ మాత్రమే గమనించితే కాంగ్రెసు పార్టీలోని పెద్దలు తమకు ఎదురు తిరిగినందుకు అణిచివేసి తమ దారికి తెచ్చుకోవకోవడానికి ఆ కేసులు పెట్టినట్టు అనిపిస్తుంది.అతను ఆ ఫ్రాడ్ చెయ్యలేదని కాదు నేననేది, కానీ నేను అర్ధం చేసుకున్నంత మేరకు అప్పుడు కేసు వేసింది దోషి అని నిర్ధారించి శిక్ష వేసే ఉద్దేశంతో కాదు - అతన్ని దోషి అని నిర్ధారించి శిక్ష వేసే ఉద్దేశం ఎవరికీ లేదు, CBI కోర్టుతో సహా ఆ ఉద్దేశం ఎవరికీ లేదు!

జగన్మోహాన్ రెడ్డి గారిని అరెస్టు చేసినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన స్థితినీ పదహారు నెలల తర్వాత జగన్మోహాన్ రెడ్డి గారికి బెయిలు ఇచ్చినప్పుడు రాష్ట్రం ఉన్న రాజకీయపరమైన స్థితినీ మాత్రమే కాక జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే మారిపోయిన రాజకీయపరమైన స్థితినీ కలిపి గమనించితే రాష్ట్ర విభజన తెలంగాణ ఏర్పాటు చేసి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ప్రయోజనం చేకూర్చటానికి గాక నేను ప్రతిపాదించిన "హిందువులు ఎక్కువున్న తెలంగాణను విడదీస్తే ఆంధ్రప్రాంతంలోని క్రైస్తవుల సంఖ్య ఆమాంతం రెండింతలు పైకి లేస్తుంది!" అనే సిద్ధాంతం ప్రకారం పెరిగిన క్రైస్తవ వోట్లతో క్రైస్తవుడైన జగన్మోహాన్ రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యడానికి జరిగిన కుట్ర అనేది తెలుస్తుంది.

అసలు, CBI కోర్టు ఆర్ధిక ఉగ్రవాది అని జాతీయ దినపత్రికలు కోడై కూసిన జగన్మోహాన్ రెడ్డి గారికి అన్ని వెసులుబాట్లు ఎందుకు ఇచ్చింది?2012 మే 27న అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించిన CBI పదహారు నెలల ఏకాంతవాసం తర్వాత 2013 సెప్టెంబర్ 23న ఎందుకు నిబంధనలతో కూడిన బెయిలును మంజూరు చేసింది?ఆ రోజున బెయిలు మీద విడుదలైన జగన్మోహన రెడ్డి గారు 2013 అక్టోబర్ 26Hyderabad నగరంలోని Lal Bahadur Shastri stadium వద్ద లక్ష మంది హాజరైన బహిరంగ సభలో అప్పటి వరకు తన తండ్రి అభీష్టం అంటూ రాష్ట్రాన్ని కలిపి ఉంచటానికి పోరాడుతున్న పాత లక్ష్యానికి తూట్లు పొడుస్తూ “Bifurcation is a very important issue for everyone in the state, so we have to go ahead” అని ప్రకటించిన వెంటనే తెలంగాణ ఏర్పాటు శరవేగాన ముందుకు సాగడం ఆశ్చర్యంగా లేదూ!

ఒక్క ఆశ్చర్యమే కాదు, 2009లో కేసీయార్ గారు సెలైన్ డ్రిప్పు పెట్టుకుని చేసిన నిరాహార దీక్షకీ గడ్డం పెంచేసిన కేసీయార్ దొంగ మూలుగులకీ కేసీయార్ ఇంకో గంటకో అరగంటకో చచ్చేలా ఉన్నరన్నంత బిల్డప్ ఇచ్చి తెలంగాణ ఇవ్వడం ఖాయం అని ప్రకటించాక కూడా ఇన్నేళ్ళు ముందుకు కదలని విభజన జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాక అంత తక్కువ కాలంలోనే రాష్ట్ర శాసనసభ తీర్మానం అవసరం లేని ఆర్టికిల్ మూడు తెర మీదకి రావడం, సభలో మార్షల్స్ తగినంతమంది లేనట్టు పార్లమెంటు సభ్యులే మార్షల్ డ్యూటీ చేస్తూ ఎత్తిన చేతుల్లో ఎన్ని yaeకి లేచాయో ఎన్ని naeకి లేచాయో లెక్క తెలియని గంద్రగోళం మధ్యన మీరా నాయరు గారు అన్నిట్నీ yaeకి ఫిరాయించేసుకోవడంతో విభజన చట్టం పాసయిపోవడం, రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు రావడం,తెలంగాణకి తనూ ఆంధ్రలో జగనూ ముఖ్యమంత్రులు అవుతారని కేసీయార్ గారు జోస్యం చెప్పడం, తెలంగాణలో కేసీయారూ ఆంధ్రలో చంద్రబాబూ ముఖ్యమంత్రులు కావడం ఆగమేగాల మీద జరిగిపోవడం విచిత్రం కూడాను!

ఇప్పుడు, ఒకసారి 1997 మొదలు 2014 వరకు జరిగిన అన్ని సన్నివేశాల్నీ ఒక వరసలో పేర్చి మొదటిసారి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనబడు తెలంగాణ యేర్పాటు కోసం జరిగాయనుకుంటే ఒకదానికొకటి పొంతన లేనట్టు కనిపించేవి కాస్త రూటు మార్చి క్రైస్తవుడైన జగన్మోహాన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యడానికి జరిగాయనుకుంటే ఒకదానికొకటి అతుక్కుని ఉన్నట్టు కనిపిస్తాయి కదూ!ఒకే ఒక్కటి మిస్సయ్యింది?"జగన్మోహన్ రెడ్డిని ఆ కేసు వేసి బయట ఉంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని చెప్పి అరెస్టు చేసి జైలుకి పంపించకపోతే ఏమవుతుంది?జగన్ జైలుకి వెళ్ళడానికీ తెలంగాణ ఏర్పడడానికీ కాదనీ లేదనీ అనడానికి వీల్లేనంత బలీయమైన సంబంధం ఏంటి?" అని అడుగుతారు మీరు - నాకు తెలుసు.భలేవారండీ మీరు!అతను గనక తన రాయలసీమ ముఠాతత్వపు ఫ్యాక్షనిష్టు-లాయలిస్టు రెడ్లమందని తీసుకొచ్చి ఎలా విడగొడతారో చూస్తానని అడ్డుపడితే కేసీయారు లాంటి అర్భకుడికి రాష్ట్రాన్ని విడగొట్టటం సాధ్యమా?

2013 సెప్టెంబర్ 23న ఇచ్చిన కండిషనల్ బెయిలును ఇన్నేళ్ళ పాటు పొడిగించటం CBI కోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి కాదూ!ఏది ఏమైనప్పటికీ జగన్మోహన రెడ్డి గారు 2014 నాటి ఎన్నికల సమయానికి ఇక నేనే ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని అనుకుని పొంగిపోతున్న స్థితి నుంచి ఎన్నికల తర్వాత ఆంధ్ర వోటర్లు కొట్టిన దెబ్బకి తలదిరిగి ముద్ద నోట్లోకి వచ్చినంత పనయ్యి తట్టుకుని నిలబడి అయిదేళ్ళ తర్వాత అనుకున్నదాన్ని సాధించిన రిదంతో కూడిన విధం తల్చుకున్నకొద్దీ "ఆడు మగాడ్రా బుజ్జీ!" అనెయ్యాలనిపిస్తుందండీ!

సృష్టిలో మనకు అర్ధం కానిది మాయావినోదం అనిపించితే అది అర్ధం ఐనప్పుడు లీలావినోదం అనిపిస్తుంది.తెలంగాణ ఆవిర్భావ చరిత్ర కూడా అంతే!1887లో తన అన్న అలెగ్జాండర్ అప్పటి జార్ ప్రభుత్వాన్ని ఎదిరించి చనిపోయినప్పుడు తను అన్నలా కాక జార్ ప్రభువును గలిచి తీరాలని సంకల్పం చెప్పుకుని కేవలం 30 యేళ్ళ తర్వాత 1917కి అంత దుష్కరమైన లక్ష్యాన్ని సాధించిన కామ్రేడ్ లెనిన్ ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు - "politics is nothing but concentrated economics" అని.అది నిజం.ఆ వెలుగులో చూస్తే తప్ప తెలంగాణ ఆవిర్భావ చరిత్ర అర్ధం కాదు.

2014 మార్చి 01 నాటికి తెలంగాణ బిల్లు పాసైపోయి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఐపోయారు.అదృష్టం కొద్దీ ఆ పదవిలో ఉండటం వల్ల తిట్టడం బాగుండదని ఆగిపోయాను గానీ బండబూతులు తిట్టి కచ్చి తీర్చుకోవాలనిపించే స్థాయి వెధవాయిత్వం ఉంది ఆ మనిషిలో - భూమి మీద వున్న సమస్తమైన వాహినీ వారి పెద్దమనుషులలో నెంబర్ వన్!లేకపోతే, అసలే తెలంగాణ వాళ్ళు " మీతో కలిసి ఉండటం వల్ల మాకు అన్యాయం జరిగింది!" అని అంత గొడవ చేస్తున్నప్పుడు "మీకు నిధులు ఇవ్వను, నీ దిక్కున్న చోట చెప్పుకో ఫో!" అనటం ఏంటి?

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను రాష్ట్ర విభజన తప్పనిసరి అని నమ్మించడానికి తన వంతు నాటకం తను ఆడాడు తప్పిస్తే అతనికి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే దురద లేనే లేదు.ఆగరం సుబ్బరాయలు రెడ్డియార్ గారినుంచి మొదలుపెట్టి ఇంత సుదీర్ఘమైన రాజకీయ చరిత్రను చూసిన మనం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించాల్సిన అవసరం లేదు.కల్వకుంట్ల చంద్రశేఖర రావు తదాది ఆంధ్ర ద్వేష పండిత ప్రకాండులను సైతం మనం ద్వేషించాల్సిన అవసరం లేదు."జాతుల్సెప్పుట, సేవసేయుట, మృషల్‌ సంధించు, టన్యాయ విఖ్యాతిం బొందుట, కొండెకా డవుట, హింసారంభకుం డౌట, మిథ్యాతాత్పర్యము లాడు టన్నియుఁ బరద్రవ్యంబు నాశించి - యీ శ్రీ తానెన్నియుగంబు లుండఁగలదో శ్రీకాళహస్తీశ్వరా!" అనేది గుర్తుంచుకుని మనం అటువంటి పనులు చెయ్యకూడదు, మనస్సును నిగ్రహించుకోవాలి.

అలా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ మాగాణం విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలలో 102/175 స్థానాలను గెల్చుకున్న తెలుగుదేశం పార్టీ తరపున 2014 జూన్ 08 మొదలు 2019 మే 29 వరకు (32)నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర దేశపు ముఖ్యమంత్రి అయ్యారు.తెలంగాణ ఏర్పాటు ఉద్యమ కాలంలో ప్రతి క్షణం కేసీయారు  మొదలు వీధి స్థాయి తెరాసా కార్యకర్త వరకు ఆంధ్రలో తమ మిత్రబాంధవసచివుడైన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యడం కోసం ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి "తెలంగాణ ద్రోహి!","ఆంధ్రప్రదేశ్ విభజనకు మూలకారణం" అని తిట్టీ తిట్టీ ఎన్ని పోస్ట్ హైప్నటిక్ సజెషన్లు ఇచ్చినప్పటికీ ఆంధ్ర వోటర్లు వాళ్ళ రాక్షసమాయల్ని పసికట్టి కీలకమైన ఎన్నికలో అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

Deccan Chronicle అనే వార్తా సంస్థ ఎన్నికలకి ముందు Aaraa పేరున ప్రజాభిప్రాయ సేకరణ చేసి తెలుగుదేశం పార్టీకి 120-130 సీట్లు వస్తాయనీ యుశ్రారై కాంగ్రెసు పార్టీకి 60-70 సీట్లు వస్తాయనీ భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి 0-5 సీట్లు వస్తాయనీ ప్రకటించితే ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీకి 102/175 సీట్లు యుశ్రారై కాంగ్రెసు పార్టీకి 67/175 సీట్లు భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి 0/175 సీట్లు వచ్చాయి.సర్వేల అంచనాలు నిజం కావడం అనేది అదృష్టం, కాకతాళీయత, ఔచిత్యం లాంటి అనేక కారణాల మీద ఆధారపడి ఉంటుందనేది నిజమే గానీ ఇక్కడ నిజం కావడానికి అందరూ అనుకున్నది ఒకటే - "విభజన బిల్లులోని లోపాల వల్ల విభజన తర్వాత ఆంధ్ర నిలదొక్కుకోవడానికి అవినీతి పరుడు గాక అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది" అనేది ఆంధ్రను గురించి న్యాయమైన ఆలోచన చేసిన అందరి మనస్సులలోనూ ఉంది.

ఇందియనిగ్రహం, ఋజువర్తన, స్థితప్రజ్ఞత, నాయకత్వ లక్షణం, పరిపాలనా దక్షత వంటి ఉన్నత గుణాలు కొందరికి జన్మతిధిని బట్టి సహజంగా రావచ్చు,కొందరికి కుటుంబ వాతావరణాన్ని బట్టి నేర్చుకుంటే రావచ్చు - కానీ చంద్రబాబు గారి మొదటి విడత పాలననీ రెండో విడత పాలననీ పోల్చి చూస్తే కొందరికి ఉన్నత గుణాలు ఖర్మ కొద్దీ నెత్తిన పడ్డాయన్నట్టు కూడా రావచ్చునని అనిపిస్తుంది!

అమరావతికి, 2015 అక్టోబర్ 22న భారత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో శంకుస్థాపన జరిగింది.అప్పుడే అమరావతిని ప్రపంచ స్థాయి నగరం కింద తీర్చిదిద్దాలనే తన సంకల్పాన్ని వివరిస్తే అతిధులు ఆనందించి ఆశీస్సులు ఇచ్చారు. ఏప్రిల్ 2016 నాటికి చంద్రబాబు అమరావతి పక్కనున్న వెలగపూడి నుంచే పరిపాలన మొదలుపెట్టాడు.మార్చి ఇరవయ్యేడుకల్లా లెజిస్లేచర్ అసెంబ్లీ భవనం పూర్తయ్యింది.అక్టోబరు నాటికి ఉన్నతాధికారులు తమ శాఖలలో కూర్చుని కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు.కేవలం ఒక్క సంవత్సరంలోనే ముఖ్యమంత్రీ ఇతర మంత్రులూ, నిక్కచ్చిగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భౌతికపరమైన శరీరం అనదగ్గ అన్ని మంత్రిత్వ శాఖలూ వెలగపూడిలో కనిపిస్తున్నాయి.అప్పటికే హైకోర్టు నిర్మాణం కూడా పూర్తయ్యింది.

అయితే ఇది ప్రపంచస్థాయి రాజధాని కాదు కదా, ఈ తాత్కాలిక నిర్మాణాలని చూపిచటం మోసం చెయ్యటమే కదా అనేవాళ్ళకి ఒకటే జవాబు - ఒక మధ్యతరగతి కుటుంబీకుడు రిటైరయ్యాక తన కలల భవంతిని నిర్మించుకోవాలంటే శంఖుస్థాపాన చేసిన వెంటనే గృహ ప్రవేశం చెయ్యలేడు కదా, మరి ఆలోపు అతను ఆరుబయట ఉండలేడు కదా, తను కట్టుకోబోయే ఇంటికి దగ్గిర్లో ఒక అద్దె ఇంటిని తీసుకుని సర్దుకుపోవడం లేదా!

ఈ తాత్కాలిక నిర్మాణాలను ఇలా ఉంచితే అసలైన రాజధానిని నిర్మించడాన్ని ascendas అనే సింగపూర్ సంస్థకి అప్పగించారు.ఇది అర్బన్ డెవలప్మెంట్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న సంస్థ.ఆరు నుంచి ఏడు సంవత్సరాలలో పూర్తి స్థాయి అమరావతి నగర నిర్మాణం కోసం టార్గెట్ పెట్టారు.ఆలస్యం జరిగితే కంపెనీ మనకి నష్టపరిహారం ఇచ్చే క్లాజు కూడా చేర్చారు.వీళ్ళు వచ్చి నిర్మాణాలు మొదలుపెట్టారు.చాలా వేగంగానే పనిచేస్తున్నారు.అమరావతి అనే ప్రాజెక్టు విలువ 33,000 కోట్లు.HUDCO సంస్థ 7500 కోట్లు పెట్టుబడి పెట్టింది.ప్రపంచ బ్యాంకు కూడా తన వంతు సహాయం కింద 300 మిలియన్ల USD పెట్టుబడి పెట్టింది.కేంద్రం కూడా ముందుకు వచ్చి 2500 కోట్ల వరకు నిధులు కేటాయించింది, అందులో 1500 కోట్లు గ్రాంటు కింద విడుదల కూడా చేసింది.ఇక రాష్ట్రప్రభుత్వం తన వంతు 500 కోట్లను ఇందులో పెట్టింది.ఇది జమాఖర్చుల వివరం అయితే ఆకారం ఎలా ఉంటుందో చూస్తే ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఇంత అద్భుతమైన రాజధాని నగరం ఇంకెక్కడా లేదనిపించేటట్టు ప్లాన్ చేశారు.అమరావతి అనేది ఒక నగరం కాదు, తొమ్మిది నగరాలతో కూడిన మహేంద్రనగరం!

ఇప్పటివరకు రాజధానులను నిర్మించినవారిలో ఎవరికీ ఇలాంటి వూహయే రాలేదంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు - పూర్తయిన అమరావతిలో నివసించడానికి ఎంతో అదృష్టం కావాలని అనిపిస్తుంది ఇందులో ఇమిడ్చిన అంశాలను చూస్తే! ఇరుగువాళ్ళ పొరుగువాళ్ళ అక్కడివాళ్ళ ఇక్కడివాళ్ళ ఈర్ష్యాదృష్టులు తగిలి అంత గొప్ప నగరంలో నివసించే అదృష్టం ఆంధ్రులకు లేకనే చంద్రబాబు నాయుడు గారు వోడిపోయి జగన్మోహన రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారేమో అనిపిస్తున్నది నాకు!

Sports City, Media City, Health City, Justice City, Finance City, Tourism City, Knowledge City, Electronics City వంటి స్వయం నిర్ణయాత్మక శక్తి కలిగినవి, మొత్తం రాష్ట్రానికి తేజస్సునీ ఓజస్సునీ రాజసాన్నీ గర్వాన్నీ ఇవ్వగలిగినవి, దేవసభలోని ఐరావతాలతో మాత్రమే పోల్చగలిగినవి - వికసిత మానవాత్మలు నిత్యం ప్రఫుల్ల వదనాలతో సంచరించే కల్పవృక్షాలు అవి!ఆరోగ్యం అనగానే గుర్తొచ్చే మెడికల్ కాలేజిలు, అన్ని రకాల సౌకర్యాలూ ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్, పిలవగానే "కుయ్యి కుయ్యి"మంటూ వచ్చే ambulance సౌకర్యాలు - అన్నింటినీ ఒకచోట చేరిస్తే సాధారణం నుంచి అత్యవసర వైద్యసేవల్ని ఎంత త్వరగా అందించవచ్చునో వూహించుకోండి.

ఇవన్నీ పక్కాగా జరగాలి కాబట్టి Norman Fostar అనే సంస్థనీ Haffez Contractor అనే సంస్థనీ NRDC అనే సంస్థనీ సంప్రదించి ఒప్పందాలు కుదుర్చుకుని పనులు అప్పగించారు.వీటిలో వేటిలోనూ A1, A2 స్థాయి నేరచరిత్ర ఉన్నవారు లేకపోవడం వల్లనే ప్రస్తుత ప్రభుత్వానికి ఆయా కంపెనీల పట్ల అంత వ్యతిరేకత వస్తున్నదేమో మరి!ఇక అమరావతి రైల్వే స్టేషనును గుంటూరు, తెనాలి, విజయవాడ  వంటి ప్రముఖమైన రైల్వే స్టేషన్లకు అనుసంధానించే ప్రాజెక్టు కూడా మొదలైంది - దీనికయ్యే ఖర్చు పదివేల కోట్లు, సెంట్రల్ గవర్నమెంటుతో మాట్లాడి ఒప్పించి పనులు మొదలు పెట్టారు.

కేవలం ప్రభుత్వ భవనాలు మాత్రమే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ బ్రాంచీల్ని ఇక్కడ తెరిచాయి.వీటిలో ప్రముఖమైన వాటిని మాత్రమే నేను చెప్తున్నాను.మొత్తం చెప్పాలంటే చాలా చెప్పాల్సి వస్తుంది.Pi Data centre - ఇది ఆయియా ఖండంలోనే నాల్గవ ర్యాంకులో ఉన్న అతి పెద్ద ఫెసిలిటీ సెంటర్ - అమరావతిలో తమ సంస్థను పెట్టడానికి వాళ్ళు 600 కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధపడ్డారు!HCL - భారతదేశంలో అతి పెద్ద కంప్యూటర్ సంబంధిత సేవలు అందిస్తున్న కంపెనీ - అమరావతిలో క్యాంపస్ పెట్టడానికి భూమిని కొన్నారు!BRS Medicity - 1.8 మిలియన్ డాలర్లు అమరావతిలో తమ సంస్థను పెట్టడానికి కేటాయించుకున్నారు, ప్రభుత్వం స్థలం ఇచ్చింది, పనులు చేస్తూ కొనసాగుతున్నారు!ఇదీ 2014 నుంచి 2019 మధ్య అయిదేళ్ళలో ప్రపంచ స్థాయి గల ప్రముఖ వాణిజ్య సంస్థలు అమరావతిని ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని అని గురించి చూపిస్తున్న నమ్మకంతో కూడిన అభిమానం.

ఇప్పుడు అమరావతి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అంటగడుతున్న ఇన్సైడర్ ట్రేడింగ్ రాజశేఖర రెడ్డి గారి అధ్వర్యంలో ఔటర్ రింగు రోడ్డు నిర్మాణ సమయంలోనే జరిగింది.ఇప్పుడు అది నగరానికీ ప్రజలకీ ఊయోగపడటం మంచిదే గానీ దాని రూపకల్పన మాత్రం కాంగ్రెసువాళ్ళ సొంతలాభం కోసమే జరిగింది.అప్పట్లో అక్కడ ఉన్న భూములన్నీ కాంగ్రెసువాళ్ళవే, కొందరు ఇన్సైడర్ క్వూప్ నుంచి స్కూప్ లాగేసి అప్పటికప్పుడు తక్కువ రేటు ఉన్నప్పుడు కొనెయ్యడం వల్ల కూడా అక్కడికి వచ్చి ఉండొచ్చును కూడా.ఆ ప్లాను వల్ల వాళ్ళు రెండు విధాల లాభపడ్డారు.కొందరు నిర్మాణం కోసం భూములు ఇచ్చి ప్రభుత్వంతో ఎక్కువ రేటు వేయించుకుంటే మరి కొందరు ఇతర్లకి అమ్ముకున్నారు. బహుశః అప్పుడు వారు చూపించిన ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రతిభని ఎవరూ గుర్తించలేదనే బెంగతో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి దాన్ని ఆపాదిస్తే నాబోటివాడు వెతికి పట్టుకొచ్చి అందరికీ చూపించినప్పుడు తమ కష్టానికి తగిన గుర్తింపు దక్కుతుందని ఆశపడుతున్నారు కాబోలు!

చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తూనే పోలవరం పనుల్ని వారానికోసారి సమీక్షిస్తూ శరవేగాన నడిపించారు.అది పూర్తవడానికి చాలాకాలం పడుతుంది కాబట్టి మొదట పట్టిసీమని రికార్డు టైంలో పూర్తి చేసి రాయలసీమకి అందించారు.నిలవలో వచ్చిన రాష్ట్రం కాదు.అక్షరాల 73, 856 కోట్ల అప్పుతో విడిపోయింది.ప్రత్యేక హోదా ఇవ్వలేదు.తనే పూనుకుని ప్యాకేజీ తయారు చేస్తే బాబు-జైట్లీ-ప్లాను అని పేరు తగిలించుకున్నారు గానీ దాని ప్రకారం నిధులు ఇవ్వటానికి మాత్రం రోజుకోసారి యేడ్చి చచ్చారు, వాళ్ళ బాబుగాడి ముల్లె యేదో వాళ్ళ సొంత జేబుల్లోనుంచి తీసి ఇస్తున్నట్టు పూటకోసారి లెక్కలు అడిగారు.

2014 నుంచి 2019 మధ్య అయిదేళ్ళలోనే SRM University, VIT AP,AMITY UNiversity,Amriita University వంటి ప్రముఖ విద్యాసంస్థలు వచ్చాయి,స్థలాలు కొనుక్కున్నాయి, భవనాలు కట్టుకున్నాయి, పిల్లలకు పాఠాలు చెప్పడం కూడా మొదలుపెట్టాయి.ఇంక అమరావతి అనంతపూర్ హైవే, దీన్ని క్రాస్ చేస్తూ కడప కర్నూలును కలుపుతూ వెళ్ళే ఫీడర్ వే - విల్లునుంచి ఎక్కుపెట్టిన బాణంలా ఉండి 16వ జాతీయ రహదారితో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ నగరాలను కలిపేస్తున్న పనులు మొదలయ్యాయి.ఇది హైదరబాదులోని ఔటర్ రింగు రోడ్డుకి బాబు లాంటిది!

అయితే, ఇంత అద్భుతమైన విజయం తర్వాత బహుశా ఓటమి భయం తగ్గి ఖర్మ కొద్దీ నెత్తిన పడ్డాయన్నట్టు అతుక్కున్న నాయకత్వ లక్షణం, పరిపాలనా దక్షత వంటి ఉన్నత గుణాలు వూడిపోయాయి కాబోలు 2019 నాటి ఎన్నికలు 23/175 అసెంబ్లీ సీట్లనీ 03/25 లోక్ సభ సీట్లనీ మాత్రమే ఇచ్చేసరికి అశ్శరభ తశ్శరభ అంటూ తను నిద్రపోకుండా అధికారుల్నీ నిద్రపోనివ్వకుండా పడిన కష్టం సాంతం బూడిదలో పోసిన పన్నీరు చందం అయిపోయింది - 2004 నాటి లాగే 2019 నాడు కూడా అభిమానులు "నువ్వు వోడిపోవటం ఏంటయ్యా!" అని ఘొల్లుమన్నారు.

అప్పటికే పొరుగు రాష్ట్రం నుంచి అక్కడి ఎన్నికల్లో తనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినందుకు పగబట్టిన Telangana Rashtra Samithi (TRS) అధ్యక్షుడు "The people of the state will give him a guaranteed gift - a well deserved rest." అని బల్లగుద్ది చెప్పేశాడు.మరి, ఇక్కడ అధికారంలో ఉండి తన ప్రతికూలతలను తను తెల్సుకోలేక పోవడం ఏమిటి?భారతీయ జనతా పార్టీ, యుశ్రారై కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ముగ్గురు శత్రువులు కలిసినప్పుడు గెలుపు నల్లేరు మీద బండి నడక అని ఎలా అనుకున్నారు?

చంద్రబాబు నాయుడు గారికీ తెలుగుదేశం అభిమానులకీ అర్ధం కావడం లేదేమో గానీ 2004, 2019 ఎన్నికల ముందువెనుకలను పరిశీలించి చూస్తే అప్పుడూ ఇప్పుడూ జరిగిన మోసం ఏమిటో అర్ధం అయింది నాకు.

యె.సం.రాజశేఖర రెడ్డి గారు 2003 ఏప్రిల్ 09న పాదయాత్ర అని పిలుచుకునే "ప్రజా ప్రస్థాన యాత్ర" అనే సుదీర్ఘ ప్రయాణం మొదలు పెట్టారు - రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ నుంచి మొదలై రంగా రెడ్డి, మెదక్, నిజామాబద్, కరీమ్నగర్, వరంగల్, ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం తదాది 11 జిల్లాలను దాటుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద 2003 జూన్ 15న ఆగింది, మొత్తం నడిచినది 1,475 Kms!చంద్రబాబు నాయుడు గారు తనకు అచ్చొస్తాయనుకున్న అన్ని విజయాల్నీ భయంకరమైన అపజయాల కింద ముద్ర వేసి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేరనుకున్న ఉచిత వరాలను ప్రకటించేశారు.మీదు మిక్కిలి ఎన్నికల వేళకు భారతీయ జాతీయ కాంగ్రెసు పార్టీ, భారత్ జాతీయ కమ్యూనిష్టు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ముగ్గురు శత్రువులు కలిశారు.అభిమానులూ ప్రచార కర్తలూ రాజశేఖరరెడ్డి గారిలోని ఫ్యాక్షనిస్టుని సూపర్ మాస్ హీరో కింద మార్చేశారు.ప్రజలు నమ్మేశారు.ఓట్లను గుద్దేశారు.

యె.సం.జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 06న పాదయాత్ర అని పిలుచుకునే "ప్రజా సంకల్ప యాత్ర" అనే సుదీర్ఘ ప్రయాణం మొదలు పెట్టారు - కడప జిల్లాలోని YSR Ghat నుంచి మొదలై 341 రోజులపాటు 124 బహిరంగ సభలతో 55 సామాజిక ముఖాముఖిలతో మొత్తం 178 నియోజక వర్గాలలో 130 నియోజకవర్గాలను చుట్టుకుని శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద 2019 జనవరి 09న ఆగింది, మొత్తం నడిచినది 3,648 Kms.చంద్రబాబు తనకు అచ్చొస్తాయనుకున్న అన్ని విజయాల్నీ అపజయాల కింద ముద్ర వేసి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వలేరనుకున్న ఉచిత వరాలను ప్రకటించేశారు.మీదు మిక్కిలి ఎన్నికల వేళకు భారతీయ జనతా పార్టీ, యుశ్రారై కాంగ్రెసు పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనే ముగ్గురు శత్రువులు కలిశారు.అభిమానులూ ప్రచార కర్తలూ జగన్మోహన్ రెడ్డి గారిలోని ఫ్యాక్షనిస్టుని సూపర్ మాస్ హీరో కింద మార్చేశారు.ప్రజలు నమ్మేశారు.ఓట్లను గుద్దేశారు.

అప్పుడూ ఇప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ తను ఓడిపోవటం ఆసంభవమని అనుకుంటున్న తనను ఒకే రకం శత్రు కూటమి ఏర్పడి ఓకే రకం ప్రచార వ్యూహం అనుసరించి అంత దయనీయమైన ఓటమికి గురి చేశాక కూడా తనను రెండు సార్లు ఓడించిన కీలకం ఏమిటో తెలుసుకోలేని చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ఎలా గెలుస్తారు?రెండవసారి అదే రకం శత్రు కూటమి ఏర్పడి అదే రకం ప్రచార వ్యూహం అనుసరిస్తున్నప్పుడు కనిపెట్టలేని అమాయకులు వైకాపా చెప్పిన అబద్ధాల్ని నమ్మి మోసపోయారని ఆంధ్ర వోటర్లని నిదించడం దేనికి?

ఈ రెండు ఎన్నికల్లో తప్ప ఆంధ్ర ప్రాంతపు వోటర్లు ప్రతి ఎన్నికలోనూ తమ విశిష్టతను చూపిస్తూనే వచ్చారు.ఒకప్పుడు ఎమర్జన్సీ తర్వాత దేశం మొత్తం శ్రీమతి ఇందిరా గాంధీని అసహ్యించుకుని ఓడించిన వేళ ఆంధ్ర వోటర్లు 41/42 పార్లమెంటు సీట్లు ఇవ్వడం చూసి ఇలాగే నవ్వారు.కానీ, నవ్విన నాపచేను పండిన మాదిరి ఆమెను ఓడించిన అర్భకులు ముసలం పుట్టిన యదుకులం మాదిరి వారిలో వారు కలహించుకుని అంతరించి పోయారు.శ్రీమతి ఇందిరా గాంధీ నేలను తాకి లపక్కన అతుక్కుపోయిన మట్టిముద్దలా కాక స్ప్రింగు బిగించిన రబ్బరు బంతిలా అంతకు ముందు కన్న పదింతల ఎత్తుకు లేచి ఆంధ్ర వోటర్ల పరువు నిలబెట్టింది.ప్రజలు వోట్లు వేస్తే తప్ప ఒక్క సీటు కూడా గెలవలేని అర్భకపు రాజకీయ పార్టీలు ప్రజలతో వోట్లు ఎలా వేయించుకోవాలో తెలుసుకుని అలా వేయించుకుని గెలవాలే తప్ప తమకు వోట్లు వెయ్యలేదని ప్రజల్ని అమాయకులనీ అజ్ఞానులనీ మూర్ఖులనీ మందబుద్ధులనీ విమర్శించకూడదు - తెలుగుదేశం అభిమానులు కాస్త సంయమనం పాటించాలి.

ఇవన్నీ పైకి కనబడుతున్న కారణాలు:ఆంధ్రప్రదేశ్ విభజన కుట్ర పూరితం కావడమూ నిజమే,చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే స్వప్నాన్ని పూర్తి రూపంలో చూపించలేకపోవడమూ నిజమే,దాన్ని తన చిరకాల ప్రతర్ధి జగన్మోహన రెడ్డి గారు వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారికి అబద్ధాల కోరు ముద్ర వేసి ప్రజల్ని నవరత్నాల ఉచితాలతో సమ్మోహనం చేసితనకు అనుకూలం చేసుకోవడమూ నిజమే - కానీ ఇప్పటి తెలుగుదేశం వోటమికి కనిపించని నాలుగో సింహం లాంటి అసలైన కారణం చాపకింద నీరులాంటి ఒక అవినీతి పూరితమైన అనధికారిక ప్రభుత్వం!

ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారు నైతికత, శాస్త్రీయత అనే రెండు రెక్కలు దాల్చిన వైనతేయుడు గనుక ఆయన ప్రజాపాలన అనే రంగస్థలం మీద క్షీరసాగర మధనం చేసి హాలాహలం తను స్వీకరించి అమృతాన్ని ప్రజలకు పంచి ఇవ్వగలిగారు. రామారావు నైతికత అనే ఒంటిరెక్కతో ఎగరాలని చూడటంతో ఆర్ధికం దెబ్బతిని ప్రజలకి నెప్పి తెలిసి మూడో కన్ను తెరిచారు.చంద్రబాబు శాస్త్రీయత అనే ఒంటిరెక్కతో ఎగరాలని చూడటంతో హార్ధికం దెబ్బతిని ప్రజలకి నెప్పి తెలిసి మూడో కన్ను తెరిచారు.

ప్రత్యర్ధులు ఎన్ని కేసులు వేసినప్పటికీ అదే ప్రత్యర్ధులు ప్రభుత్వంలో ఉండి కూడా నిరూపించలేకపోవడం చేత చంద్రబాబు నాయుడు గారు నిప్పు అయితే కావచ్చు గానీ చుట్టూ ఉన్న మంత్రులూ పెద్దలలో చాలామంది నిప్పులు కాదు.ఆ కోటరీ బృందం జరుగుతున్న అభివృద్ధి వల్ల పుట్టిన సంపదని జల్లెడ పట్టేశారు.ప్రజలు, ముఖ్యం ఆంధ్ర ప్రజలు చాలామంది రాజకీయ నాయకులూ కొంతమంది రాజకీయ విశ్లేషకులూ అనుకుంటున్నట్టు అమాయకులు కారు - పై స్థాయిలో జరుగుతున్న హడావిడికీ తమ దగ్గరకి వస్తున్న చిల్లరకీ తేడా పసి కట్టేశారు!

చంద్రబాబు నాయుడు గారి తర్వాత 2019 మే 30న ముఖ్యమంత్రి అయిన (33)జగన్మోహన రెడ్డి గారు నేటి 2020 ఆగస్టు 05 నాటికి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.యె.సం.జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలోని పులివెందుల గ్రామంలోని  యె.సం.రాజశేఖర రెడ్డి, యె.సం.విజయమ్మ దంపతులకు 1972 డిసెంబర్ 21న పుట్టారు.హైదరాబాద్ పబ్లిక్ స్కూలు జగన్మోహన రెడ్డి గారి మొదటి పాఠశాల.నిజాం కాలేజిలో B.Com చదివారు.1886 ఆగస్టు 28న భారతీ రెడ్డి గారిని పెళ్ళి చేసుకున్నారు.ఇద్దరు ఆడపిల్లలు.జగన్మోహన రెడ్డి గారు Church of South India(Diocese of Rayalaseema) సభ్యత్వంతో పులివెందుల CSI-Town Churchకి హాజరవుతూ ఉంటారు.

జగన్మోహన రెడ్డి గారు 2004 నాటి ఎన్నికల్లో ప్రచారసభల్లో పాల్గొని రాజకీయ రంగప్రవేశం చేశారు.2009లో కడప నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యు డయ్యారు.తండ్రి చనిపోయిన మరుక్షణమే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు.మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టుకున్నప్పటికీ పార్టీ అధ్యక్షురాలైన సోనియా గాంధీ, పార్టీ జనరల్ సెక్రెటరీ అయిన ఆమె తనయుడు రాహుల్ గాంధీ ఇతనెంత పట్టుదలతో శ్రమించాడో వారంత పట్టుదలతో తిరస్కరించేశారు.

తిరస్కరించడంలో అధిష్ఠానం తప్పు ఎంత మాత్రం లేదు.అప్పటికి జగన్మోహాన్ రెడ్డి గారి వయస్సు 37 మాత్రమే.ఇంత చిన్న వయస్సు వాడు ఎకాఎకిన ముఖ్యమంత్రి అయిపోయి తనకన్న వయస్సులోనూ అనుభవంలోనూ మిన్నయిన వారిమీద అధిపత్యం చెలాయించడం మర్యాద కాదు గద!నీలం సంజీవ రెడ్డి గారి నుంచి కోట్ల విజయ భాస్కర రెడ్డి గారి వరకు దాదాపు అందరూ తమ యవ్వన కాలంలోనూ నడి వయస్సులోనూ రాజకీయాలలోకి వచ్చినవారే.అయినా సరే, పార్టీ అప్పగించిన బాధ్యతల్ని సక్రమమైన రీతిలో నెరవేరుస్తూ  దీర్ఘ కాలం పాటు సీనియర్ నాయకుల ముఖ్యమంత్రిత్వంలో మంత్రి పదవుల్ని తీసుకుని అనుభవం గడించి ఎప్పటికో ముఖ్యమంత్రులు కాగలిగారు.కొన్ని దశాబ్దాల తరబడి ఏ పదవిలోనూ లేని పార్టీ పనుల్లోనే బతికిన వయోవృద్ధులు కూడా ఉన్నారు.

అలాంటిది లేడికి లేచిందే పరుగన్నట్టు పార్టీలో చేరిన నాలుగేళ్ళకే ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుపట్టటం అన్యాయం,అక్రమం,అమర్యాద కాదూ!పోనీ, వయసు హుషారు కాబట్టి ముచ్చట పడ్డాడని అనుకోవటానికీ వీల్లేదు.ముఖ్యమంత్రి పదవే కావాలని మంకుపట్టు పట్టాడు, ఇవ్వకపోయేసరికి పార్టీనుంచే బయటికి పోయాడు.పోటీగా పార్టీ పెట్టి కాంగెసు పార్టీని నష్టపెట్టాడు.ఎందుకంత మంకుపట్టు?ఎందుకింత పిచ్చితనం?తన ముఖ్యమంత్రిత్వాన్ని మెజార్టీ సభ్యులు కోరుకుంటున్నారే అనుకోండి,అధిష్ఠానం కుదరదని అన్నప్పుడు రాజీపడి రోశయ్య గారి ముఖ్యమంత్రిత్వంలో కీలకమైన శాఖని తీసుకుని అనుభవం గడించి అప్పుడు తన పనితనం చూపించి తన ముఖ్యమంత్రిత్వం వల్ల పార్టీకి వచ్చే లాభాల్ని చూపించి మరోసారి ప్రయత్నించాలని ఎందుకు అనుకోలేకపోయాడు?తన తండ్రి సైతం ముప్పయ్యో యేటి నుంచే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నప్పటికీ తనలా పోట్లాడి బైటికి పోక పార్టీలోనే ఉండి నిత్య అసమ్మతి వాదిలా ప్రయత్నించి ప్రయత్నించి ఆఖరికి యాభై దాటాకనే గోల్ కొట్టగలిగాడు - మరి ఇతని కేమైంది?

అవును, తండ్రి కూడా సీనియర్ల ముఖ్యమంత్రిత్వంలో కీలకమైన శాఖని తీసుకుని అనుభవం గడించి అప్పుడు తన పనితనం చూపించి తన ముఖ్యమంత్రిత్వం వల్ల పార్టీకి వచ్చే లాభాల్ని చూపించి మరోసారి ప్రయత్నించాలని ఎందుకు అనుకోలేకపోయాడు?ఇస్తే ముఖ్యమంత్రిత్వం తీసుకోవాలి, ఇవ్వకపోతే నక్కలు బొక్కలు వెదికినట్టు సీనియర్ల మీద అవినీతి ఆరోపణల్ని చేసి పార్టీ పరువుని నడిబజార్న పడేసి పైరవీ ఆటలు ఆడుకోవాలని ఎందుకు అనుకున్నాడు?

అసలు వాళ్ళిద్దరే కాదు, politically motivated devout Christians(see Kanche Ailayya, Kadiri Krishna etc.) ఎవరూ క్రైస్తవేతరులు తమకన్న పైన ఉండి తమమీద అధికారం చెలాయించడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోరు.బహుశః, వ్యక్తిగత జీవితంలో తన కూతురు హిందూ బ్రాహ్మణ కుటుంబంలోకి కోడలై వెళ్ళడాన్ని ఒప్పుకోలేక అటువైపునుంచి ఇటువైపుకి బలవంతపు మతమార్పిడిని ప్రోత్సహించి అల్లుణ్ణి తమవైపుకి రప్పించుకున్న క్రైస్తవ మత దురహంకారమే రాజశేఖర రెడ్డి గారిని వ్యష్ఠిగత జీవితంలో హిందువుల ఆరాధ్య దైవమైన ఏడుకొండల స్వామిని అవమానించేలా పురికొల్పింది కాబోలు!బహుశః, వ్యక్తిగత జీవితంలో బైబిలు తప్ప ఇంకేదీ పవిత్ర గ్రంధం లేదని నమ్ముతున్న క్రైస్తవ మత దురహంకారమే జగన్మోహన రెడ్డి గారిని వ్యష్ఠిగత జీవితంలో భారత రాజ్యాంగాన్నీ న్యాయస్థానాల తీర్పుల్నీ రాజ్యాంగబద్ధమైన సంస్థల్నీ ధిక్కరించేలా పురికొల్పుతున్నది కాబోలు!

ఇప్పుడిక ఆంధ్రలో ఎవరు అధికారంలోకి రావాలన్నా ఈశాన్య రాష్ట్రాల మాదిరి మ్యానిఫెస్టోలో బైబిలు రాజ్యం తెస్తామని రాసుకోవాల్సిందే, ప్రస్తుతానికి అది కొంచెం అతి అనిపించినప్పటికీ ఇప్పటికే ఆంధ్రలో పాస్టర్లకు ఇష్టం లేని వ్యక్తి ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి దాపరించిందనేది నిజం - ప్రత్యేక హోదా అడగటం తప్ప తమకు మరోరకమైన హాని ఏదీ చెయ్యని మిత్రపక్షమైన తెదెపా మీద నిష్కారణమైన ద్వేషాన్ని ప్రదర్శించి ఒక క్రైస్తవ మతోన్మాదిని ఆంధ్ర ప్రజల నెత్తి మీద దించిన రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు తమ దూరదృష్టిలేమి వల్ల ఆంధ్రలో నేడు జరుగుతున్న ఆర్ధిక విధ్వంసానికీ రేపు జరగబోయే ఆధ్యాత్మిక భ్రష్టత్వానికీ బాధ్యత వహించాలి!అధికారంలోకి రాకముందు వంగి వంగి కాళ్ళకి దణ్ణాలు పెట్టి వాళ్ళ ఎగోని బాగానే దువ్వారు గానీ ప్రస్తుతం జగన్ యొక్క బలం భాజాపాను దాటి చాలా పై స్థాయికి విస్తరించి ఉంది.స్వయాన కోర్టుల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూస్తూ కూడా 70 సార్లకి పైన అంత సాహసం ఎట్లా చెయ్యగలుగుతున్నాడు?రంగుల కేసులో అయితే, కోర్టు ధికార నేరం కింద ప్రభుత్వమే బర్తరఫ్ అయ్యే ఛాన్సు ఉన్నప్పటికీ కించిత్తు చలనం లేకపోవడం చూస్తుంటే తను కూడా బర్తరఫ్ చేయించుకోవడానికే కోర్టులతో ఢీ కొడుతున్నట్టు అనిపించడం లేదూ!

కొందరు తెలుగుదేశం అభిమానులైన విశ్లేషకులు అనుకుంటున్నట్టు జగన్మోహన్ రెడ్డిగారు చేస్తున్నవి అనాలోచిత చర్యలు కావు, వాటి వెనకాల గొప్ప వ్యూహనిర్మాణ చాతుర్యం ఉంది - ఎవరూ నన్నేమీ చెయ్యలేరనే ధైర్యంతో చేస్తున్నారు.తమ వైపునుంచి ఎంత బలమైన కారణంతో చేసినప్పటికీ రాష్ట్ర స్థాయి భాజపా నాయకులు 2019లో జగన్మోహన్ రెడ్డిగారు అధికారంలోకి వచ్చేలా చేసిన తప్పుకి ఫలితం యేమిటంటే, కోర్టుల నుంచి వచ్చిన ఒత్తిడితో సహా ఎంత బలమైన కారణం ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన మరుక్షణం ఆంధ్రలో రక్తపుటేరులు పారడం ఖాయం - పాస్టరు విజయ కుమార్ దగ్గిర్నుంచి వాటికన్ పోపు వరకు ప్రపంచ క్రైస్తవ సమూహం అతని వెనక నిలబడి తీరుతుంది!

రాజశేఖర రెడ్డి గారికన్న భిన్నమైన శైలిలో జగన్మోహన్ రెడ్డిగారి క్రైస్తవీకరణ ఉంటుంది.ప్రస్తుతం జరుగుతున్నది కాంగ్రెసు పార్టీ పెంచిన రెడ్డి కుల నాయకులకు పోటీగా రామారావు మొదలు చంద్రబాబు నాయుడు గారి వరకు పెంచిన నిమ్న కులాల నుంచి పైకెదిగిన బలమైన నాయకుల్ని తుదముట్టించడం.తర్వాత ఇతర ప్రాంతాల నుంచి లాక్కున్న అస్సైండ్ భూముల్నీ బీజేపీ సహకారంతో రాజధాని రైతుల నుంచి లాక్కున్న భూముల్నీ మొదట రాయలసీమలోని తమ లాయలిస్టులకి పందేరం చేస్తారు.తర్వాత వీళ్ళ ట్రైనింగుతో ఎక్కడికక్కడ తమకు లాయలిస్టులను ఏర్పాటు చేసుకుంటారు.ఈ రెండవ దశ పూర్తయ్యాక అప్పుడు మొదలుపెడతారు మధ్యయుగాల నాటి క్రూసేడ్ల తరహా మతమార్పిడి తతంగాన్ని.రాజశేఖర రెడ్డి గారు అయిదేళ్ళ పాటు అంత బహిరంగ మతమార్పిడి చేస్తుంటే ఆపలేనివాళ్ళు అప్పుడు ఆపగలుగుతారనుకోవడం మూర్ఖత్వమే!

మతాంతరీకరణ వరకు వెళ్ళనక్కర లేదు, జగన్మోహన్ రెడ్డిగారి పరిపాలనా శైలిలో కూడా క్రైస్తవ మత ప్రభావమే కనిపిస్తుంది - "తిట్టిన పెద్ద మనిషి బాగానే ఉన్నాడు. తిట్లు తిన్న పెద్దమనిషీ బాగానే ఉన్నాడు. నడుమ వాళ్ళు నలిగి చచ్చారు!" అని మన పాత తరం వాళ్ళు ఒక సామెత పుట్టించారు.అప్పుడెప్పుడో ఇద్దరు సినిమా హీరోల ఫ్యాన్లు ముష్టా ముష్టి బాహాబాహి కచాకచి తన్నుకున్నారు.తన్నుకున్న వాళ్ళూ ఎక్కువ మందే, అందులో దెబ్బలు తిన్నవాళ్ళూ ఎక్కువమందే. అలా క్షతగాత్రులైన వాళ్ళు  ఎముకల ఆస్పత్రుల దగ్గిర్నుంచి మొదలు పెట్టి దాదాపు అన్ని వైద్య విభాగాలకీ ఆదాయం కూడా పెంచారు.అప్పుడు కొందరు జ్ఞానులు ఈ సామెతని మళ్ళీ బైటికి తీసి అందరికీ వినోదం కలిగించారు.అసలు క్యామెడీ ఏంటంటే ఆ సామెతని నిజం చేస్తూ వీళ్ళు ఏ ఇద్దరు హీరోల కోసం కొట్టుకు చచ్చారో ఆ హీరోలు ఒకళ్ళ భుజాల మీద ఒకళ్ళు చేతులేసుకుని నవ్వుతూ ఉన్న ఫొటోల్ని చూపించి "ఒరేయి పిచ్చోళ్ళూ!మేం చూడండ్రా ఏలా ఉన్నామో - మాకోసం మీరు కొట్టుకు చావడం ఏంట్రా?" అని అర్ధం వచ్చేలా స్టేటుమెంట్లు ఇచ్చారు!

ఇవ్వాళ పేరు రూఢి కాని పార్టీని మోస్తున్న పిచ్చోళ్ళ గోల కూడా అలానే ఉంది.ఎక్కడో ఎవడో తన కష్టాలకి ఆత్మగౌరవంతో కూడిన ఒక నిర్ణయం తీసుకుని తన పని తను చేసుకు పోతున్నాడు.ఎక్కడో ఎవడో అది చూసి తన మనసు కష్టపెట్టుకుని తనకు తోచిన సాయం చేశాడు.వీళ్ళకి కూడా మానవత్వం ఉందని నిరూపించుకోవాలనుకుంటే అతనికే ఇంకొంచెం అదనపు సాయం చెయ్యాలి.అతనికి ఇక చాలనిపిస్తే ఇంకొకరికి అంతకన్న ఎక్కువ సాయం చేసి జబ్బలు చరుచుకుని పెయిడ్ ఆర్టిస్టులకి డబ్బులిచ్చి చప్పట్లు కొట్టించుకోవచ్చు.ఏమీ తప్పు లేదు.వీటిలో బయటివాళ్ళు తప్పు పట్టే పని ఒక్కటి కూడా లేదు.అయితే గియితే, సాయం చేసిన వ్యక్తికి పేరుపిచ్చి అంటగట్టటం లాంటివి చేసినా పర్లేదు గానీ సాయం అందుకున్న బీదవాణ్ణి కుళ్ళబొడవటం ఎంత నీచమైన పని!

అసలు తమకు మానవత్వం ఉందని నిరూపించుకోవాలనే దురద లేకపోతే నోరు మూసుకుని కూర్చోవచ్చు, పనిగట్టుకుని తమ దానవత్వాన్ని చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది?ఇది “నా సృష్టిలోని సమస్తజనులూ నన్ను మాత్రమే కొలవాలి, నా రాజ్యంలోని ప్రజలు ఇతర రాజుల వైపుకు ఆకర్షితులు కాకూడదు” అనే యహోవా వాణిని నమ్ముతున్న క్రైస్తవ గొర్రెల ధోరణి తప్ప మరొకటి కాదు, అవునా?

కొందరు పేరురూఢికాని పార్టీ వారినుంచి ఇప్పుడు చేస్తున్న తప్పులకు పశ్చాత్తాపాన్ని ఆశిస్తున్నారు - ఎంత పిచ్చితనం వారిది!ఇదివరకు చేసిన పనులకి లేని పశ్చాతాపం ఇప్పుడు చేస్తున్న పనులకు ఎట్లా వస్తుంది?మనం మన గురించి "బరికి ఇటువైపున ఉన్న మనం మంచివాళ్ళం, మనని కష్టపెడుతున్న బరికి అటువైపున ఉన్నవాళ్ళే చెడ్డవాళ్ళు" అని అనుకుంటున్నట్టే వాళ్ళు వాళ్ళ గురించి "బరికి ఇటువైపున ఉన్న మనం మంచివాళ్ళం, మనని కష్టపెడుతున్న బరికి అటువైపున ఉన్నవాళ్ళే చెడ్డవాళ్ళు" అని అనుకుంటారు.

రాజాజీ మొదలు జగన్మోహన రెడ్డి వరకు సమస్యల్ని సృష్టించే మూసలోనివారు.పూసపాటి రాజావారు మొదలు ప్రకాశం పంతులు గారి వరకు సమస్యల్ని పరిష్కరించే మూసలోనివారు.రాజాజీ లాంటివాళ్ళు బతికినంత కాలం శిఖరాగ్రం కోరుకుని, అర్హతలు పెంచుకుని రాజమార్గంలో చేరుకోవడానికి బదులు తప్పుడు ఎత్తులు వేసి అభాసు పాలవుతూ, వాళ్ళనీ వీళ్ళనీ పదవులు అడుక్కుంటూ దేక్కుంటూ పాక్కుంటూ కోరుకున్న శిఖరాగ్రం చేరుకున్న ముచ్చట తీరకముందే తనలాంటి పక్కవాడు లాగిపారేస్తే ఉలిక్కిపడి బేజారై మళ్ళీ శిఖరాగ్రం చేరలేని బెంగతో కచ్చితో కుళ్ళుతూ బతికారు.చావు ముంచుకొచ్చిన వేళ కూడా "కనియెదవో బిడ్డల,నిఁక మనియెదవో తొంటికంటె,మనుమల మాటల్ వినియెదవో,యిచ్చెద రమ్మనియెదవో దానములకు నవనీసురులన్" అని విదురుడు మందలించినప్పుడు ధృతరాష్ట్రుడికి కలిగిన పాటి జ్ఞానం కూడా లేక "నేనింకా బతకాలి!నేనింకా బతకాలి!" అని గింజుకుంటూ చచ్చారు.

మరి ప్రకాశం పంతులు గారిలాంటివాళ్ళ పరిస్థితి ఎలా వుంది?బ్రతికినంత కాలం అంధాంధ తమసాల మధ్య తిరుగాడుతున్న దివాంధ సమూహం తేరిపాఱ చూడలేని సహస్రరవిప్రభాసమానమైన దివ్యతేజస్సులు వెదజల్లుతూ బతికారు!మృత్యుదేవత సైతం మర్మమెరిగిన ముత్తయిదువ పూజాపుష్పాన్ని తుంచినట్టు అనాయాసమరణం అనే మర్యాదను వారిపట్ల చూపించింది.కన్నతల్లి తన బిడ్డని చెయ్యిపట్టి నడిపించుకుని తీసుకెళ్ళినట్టు అప్రస్తుత వీరవరేణ్యుల కోసం ప్రత్యేకించిన వైతరిణి కానరాని మార్గాన సుఖప్రయాణం చేయించి వైకుంఠ సదనం వద్ద దిగవిడిచి వచ్చింది!

ప్రాణభీతితోనూ లాభప్రీతితోనూ స్వానురాగంతోనూ కొందరు అల్ప చేతస్కులు పొగడకూడని వాళ్ళని పొగుడుతారు గాని ధర్మానికీ చరిత్రకీ వైతాళికులకీ వలపక్షం లేదు! ప్రస్తుతం ఆంధ్ర ప్రజల్ని సర్వనాశనం వైపుకు నడిపిస్తున్న రాయలసీమ ఫ్యాక్షనిష్టుల్ని అణిచివేసి సామాజిక పురోగతికి అవసరమైన శాంతిని స్థాపించడానికి రెండే రెండు దారులు ఉన్నాయి.

మొదటిది ఆంధ్రప్రాంతంలో ఫ్యాక్షనిజాన్ని అణిచి వెయ్యాలని అనుకుంటున్న అగ్ర స్థాయి, మధ్య స్థాయి నాయకులు కలిసి రాయలసీమ నుంచి విడిపోయి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమించాలి.ఇందువల్ల పేరు లేని పార్టీ వాళ్ళు ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో తగినంతమంది లాయలిస్టులు లేకపోవడం వల్ల తక్షణం వెనక్కి వెళ్ళిపోయి రాయలసీమకు మాత్రమే కుంచించుకు పోతారు.అప్పుడు ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించి ఫ్యాక్షనిజం వైపుకి వెళ్తారని అనిపించే లాయలిష్టులని ఎడ్యుకేట్ చేసి ఇతరమైన ఉపాధుల వైపుకి మళ్ళించితే చాలు ఒక్క హత్య కూడా చెయ్యలేని స్థితికి ఫ్యాక్షనిష్టులు బలహీనమైపోవడం తధ్యం!

దీనికి తెలంగాణ కోసం చేసినట్టు అన్నేళ్ళ పాటు ఉద్యమం చెయ్యాల్సిన పని లేదు, వాళ్ళకోసం పనికొచ్చిన ఆర్టికిల్ మూడు మనకోసం కూడా పనికొస్తుంది.గట్టి ప్రయత్నం గనక ఒకటి రెండేళ్ళు చేస్తే ఫ్యాక్షనిస్టుల భీబత్సం లేని ఆంధ్ర రాష్ట్రం అవతరించి ఒడిదుడుకులు లేని ప్రగతి వైపుకి తొలి అడుగులు వేస్తుంది, నిజం!

రెండవది ఫ్యాక్షనిష్టులకు వోటు వెయ్యడం వల్ల వచ్చే ప్రమాదాలను బోధించి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రతి వోటరునూ  చైతన్యవంతం చెయ్యాలి.తమను పోషించి రక్షించే ఫ్యాక్షనిష్టుల పట్ల నిర్నిబంధమైన కృతజ్ఞతా విశ్వాసమూ వంటి ఉన్నత లక్షణాలను ప్రదర్శించడం, తనచే పోషించబడి రక్షించబడే లాయలిష్టుల పట్ల నిర్నిబంధమైన వాత్సల్యమూ అనురాగమూ వంటి ఉన్నత లక్షణాలను ప్రదర్శించకపోవడం నవీన యుగాల నాటి భూస్వామ్య సంస్కృతికి చెందిన ఫ్యాక్షనిష్టు-లాయలిష్టు వర్గాల మధ్య ఉండే ప్రధాన లక్షణం.లాయలిస్టులు వెంట లేనిదే ఫ్యాక్షనిష్టులు ఒక్క అడుగు కూడా వెయ్యలేరు,లాయలిస్టుల సాయం లేనిదే ఫ్యాక్షనిష్టులు ఒక్క హత్య కూడా చెయ్యలేరు.లాయలిస్టులై ఫ్యాక్షనిష్టుల వద్ద కుక్కల వలె పడి ఉండటం వల్ల నష్టపోతున్నామని తెలుసుకోగలిగిన వ్యక్తులు తెలివిడి పెరిగిన తర్వాత లాయలిస్టుల వలె కొనసాగడం కష్టమై పోతుంది.

2009 నుంచి ఎన్నికల చట్టం వోటర్లకు "None of the Above(NOTA)"  అనే సౌకర్యాన్ని కల్పించింది.ఒక నియోజకవర్గంలోని ఒక వోటరుకి అభ్యర్ధులలోని ఏ ఒక్కరికీ తన వోటును అందుకునే అర్హత లేనప్పుడు నోటాకి వోటు వెయ్యవచ్చును.ఎన్నికల చట్టం "even if a majority of votes were cast for NOTA, the candidate with the largest vote share would still be the winner." అని స్పష్టం చెయ్యడం వల్ల ప్రస్తుతానికి దీనివలన ప్రయోజనం పరిమితమే గానీ వోటర్లు "ఇటువంటి అబ్యర్ధుల్ని నిలబెట్టి మాకు కోపం తెప్పించకండి!" అని తమ అభిప్రాయాన్ని చెప్పడం మేరకు తీసుకుంటే పోను పోను ఫలితం కనిపించవచ్చు.

కొన్ని చోట్ల మాత్రం ఎన్నికల ఫలితాల్ని వూహించని రీతిలో మార్చేసి అదృష్టం కలిసొస్తే పిచ్చుక లాంటి తను గరుడ పక్షి వలె అద్భుతాల్ని సృష్టించగలనని నిరూపించుకునేసింది!South Gwalior Constituency నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన Narayan Singh Kushwah అనే అవినీతిపరుడు 121 వోట్ల తేడాతో వోడిపోయాడు.నోటాకి 1550 వోట్లు పడ్డాయి.ఒకవేళ నోటా అనేది లేనట్లయితే విధి లేకనో గతి లేకనో ఆ వోటర్లు అతనికే వేసి ఉండేవాళ్ళు అనుకుంటే, ఇప్పుడు అలా జరగలేదు కదా!

కాబట్టి మొదట ప్రతి ఒక్కరూ "నాకు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారిలాంటి ముఖ్యమంత్రి కావాలి!" అనే వాక్యాన్ని వేదమంత్రంలా అనుక్షణం జపించాలి. పిదప ఎన్నికలు వచ్చినప్పుడు అలాంటి అభ్యర్ధికి మాత్రమే వోటు వెయ్యాలి. అలాంటి అభ్యర్ధి లేనప్పుడు నోటాకే మీవోటు వెయ్యాలి.అప్పుడు మనకి సమస్యల్ని పరిష్కరించే సమర్ధత ఉన్న ముఖ్యమంత్రి వస్తాడు.

ఒకవేళ రాకపోతే?మీ ఖర్మ, అనుభవించండి!

కేన్సర్ చికిత్స గురించి చాగంటి వెంకట్ గారి పరిశోధన సత్ఫలితాలను ఇచ్చింది - ఇది వేద విజయం!

2024 జనవరి  03 న   ఈనాడు   దినపత్రికలో  " కాంతితో   క్యాన్సర్   ఖతం " అని   ఒక   వార్త   పబ్లిష్   అయ్యింది . ఆ   వార్తని   యధాతధం...