Monday 31 March 2014

కాంగ్రెసుని ద్వేషించటం నా జన్మ హక్కు?! (బాల గంగాధర తిలక్)

               ఈ మద్యనే వెండితెర మీద నుంచి జనం మీదకి హఠాతుగా దూకిన ఒక యువ నేత తన పార్టీని కూడా విలీనం చెయ్యమన్న వ్యంగ్యానికి కినిసి "అదేమయినా గంగా అన్నిట్నీ కలపడానికి?" అని ఈసడించాడు.గంగ లాగా కాకపోయినా ఈ దేశపు రాజకీయాల్ని సుదీర్ఘకాలం పాటు తన చుట్టూ తిప్పుకుని ప్రస్తుతం అవసాన దశలో ఉన్నట్టు కనిపిస్తున్న ఆ పార్టీ చరిత్ర చాలా చిత్రమైనది.అది పుట్టినప్పటి నుంచీ నేటివరకూ ఈ దేశంలోని ప్రతి రాజకీయ వేత్తా తన రాజకీయ జీవితంలో యేదో ఒక దశలో కాంగ్రెసు స్పర్శ(Congress Touch) తగిలిన వాడే!


               1885 డిసెంబర్ 28 న ఒక విదేశీయుడి చేత తమ ప్రభుత్వానికి దేశం లోని తమకు స్నేహశీలురయిన మేధావుల నండి తమకు కావలసిన సహకారమును, తమ ప్రభుత్వానికి సాధికారికతను తెచ్చుకొనుటకు |Allan Octavian Hume| అను బ్రిటిష్ అధికారి నేతృత్వమున |Indian national Congress| అను ఒక సంస్థ స్థాపించబడినది.ఇది ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామము తరవాత అధికారం |బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ| నుండి |బ్రిటిష్ సామ్రాజ్యం| కు దఖలు పర్చటం అను ప్రక్రియకు సహాయ పడటం కోసం చెయ్యబడిన యేర్పాటు. అప్పటి నుండి భారత దేశం  ఉత్తర దేశంలో "రాజ్" అనే ముద్దు పేరు తోనూ తెలుగు వాళ్ళు "కుంఫిణీ దొరల పాలన" అని డాబుసరి పేరుతోనూ పిల్చుకునే అధికారికమైన పరాధీన స్థితిలోకి వెళ్ళిపోయింది.


               తొలి దశలో కాంగ్రెసు పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వ సహాయ సహకారాల తోనే మనుగడ సాగించింది.దాని ప్రతిపాదన లోనే ప్రజలలో తమ పట్ల గల వ్యతిరేకత భౌతిక ప్రతిఘటన స్థాయికి వెళ్ళకుండా |సేఫ్టీ వాల్వ్|గా ఉపయోగ పడటం అనే ఉద్దేశం ఉంది.యేమైతేనేం, ప్రతిపాదన చేసిన తొలి రోజుల నుంచీ అక్కడా ఇక్కడా యెన్నో విమర్శలూ సందేహాలూ యెదురయినా అన్నింటినీ దాటుకుని 1885 డిసెంబర్ 28న బొంబాయి నగరంలో గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో ఉమేష్ చంద్ర బెనర్జీ అద్యక్షతన 72 మంది ప్రతినిధులతో భారత జాతీయ కాంగ్రెసుని అతను ప్రారంభించాడు. అప్పటి పరిస్థితిలో ఒక భారతీయుడు పార్టీ స్థాపించే ప్రతిపాదన చెయ్యడం, స్థాపించడం అనేది వూహించలేని కాల మది.కాబట్టి యేటికి యెదురీదలేని పరిస్థితిలో అప్పటి మేధావులు అలా సర్దుకుపోవటం సమంజసమే.

                అప్పట్లోనే సయ్యద్ అహ్మద్ ఖాన్ లాంటి ముస్లిం విద్యావేత్తలు కాంగ్రెసులో అందరూ హిదువులే ఉండటాన్ని చూసి కొంత అనుమాన దృష్టి తోనే చూశారు. హిందువుల్లో కూడా మతాధిపతులూ ఛాందసులూ కాంగ్రెసు విదేశీ సంస్కృతిని సమర్ధించే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి దూరంగానే ఉండిపోయారు. అసలు సామాన్యులకి కాంగ్రెసు అనే ఒక సంస్థ ఉందనేది కూడా అది పుట్టిన చాలా కాలం వరకూ తెలియదు.అప్పటి కాంగ్రెసు కూడా సామాన్యుల సమస్యలయిన పేదరిక నిర్మూలన, ప్రజారోగ్య సమ్రక్షణ మరియు సామాజిక సంస్కరణలు లాంటి వాటికి దూరంగానే ఉంది.ఒక విహంగ దృష్టితో చూస్తే అప్పటి కాంగ్రెసు ధనవంతులయిన ఆంగ్ల ప్రభుత్వ మిత్రులయిన |యెలైటిస్ట్| మేధావుల గుంపు, అంతే.

               తొలి దశలోని ఈ స్తబ్దత తిలక్ ప్రవేశంతో ఒక కుదుపుకు గురయింది.పూర్తి స్వాతంత్ర్యం అప్పటి వారి భావనలో లేదు. వాదనలు కూడా కాంగ్రెసు ప్రతినిధులకి చట్టాల రూపకల్పనలో మరింత యెక్కువ అవకాశం ఉండాలనే పరిమిత స్థాయిలోనే జరిగేవి. "స్వరాజ్యం నా జన్మహక్కు" అని నినదించిన మొదటి వ్యక్తి తిలక్. కేవలం నినాదంలా కాకుండా దాని పూర్తి అర్ధంతోనే ప్రతిపాదించాడు.|హోం రూల్| గురించి మాట్లాడిన యువ |మహమ్మదాలీ జిన్నా| కూడా ఇదే దశలో రంగ ప్రవేశం చేశాడు.

               కానీ తిలక్ గారి హవా యెక్కువ కాలం కొనసాగలేదు. మితవాదులయిన గోపాల కృష్న గోఖలే, ఫిరోజ్ షా మెహ్తా వంటి వారు ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చడాన్ని నిరసించి 1906లో పార్టీ నుంచి తిలక్ ని బహిష్కరించారు. సరిగ్గా అదే కాలంలో తిలక్ ఉద్యమాల్లో హిందువులకి మాత్రమే పరిచయమయిన పదజాలాన్ని ప్రవేశ పెట్టటం వల్ల ముస్లిములు సంఘటిత మయ్యారు.తిలక్ అనుకుని చేసింది కాకపోయినా దాని ఫలితంగా 1906లోనే |ఇంగ్లీషు వాళ్ళు స్పాన్సర్ చెయ్యగా| ముస్లిం లీగ్ స్థాపించబడింది.

               సందట్లో సడేమియా అన్నట్టు మొదటి ప్రపంచ యుధ్ధం వొచ్చి పడింది.దీంతో విభేదాలని పక్కన పెట్టి తిలక్, గొఖలే మొదలయిన వాళ్ళంతా మళ్ళీ కలిసి పోయి 1916లో లక్నో వేదిక ను చేసుకుని కొత్త ప్రతిపాదన చేశారు. అదే జిన్నా మరియూ అనీ బీసెంట్లు ప్రతిపాదించిన స్వరాజ్ కు మారు రూపమయిన హోం రూల్. తన రాజకీయ జీవితపు తొలి దశలో అంతటి స్వదేశాభిమానంతో మొదలయిన జిన్నా చివరి కొచ్చేసరికి దేశ విభజనకి కారణ మయ్యాడు?!

               తిలక్ ని వ్యతిరేకించిన మితవాదులు ముస్లిం లీగ్ ప్రమాదాన్ని గుర్తించటం వల్లనో లేక అతివాదుల వల్ల పార్టీ మీద పడిన మచ్చను తొలగించుకోవడానికో ముస్లిముల వైపు అతిగా వంగడంతో అది నచ్చని వాళ్ళు బయటికి వెళ్ళి పోయి 1914లో హిందూ మహా సభను యేర్పాటు చేశారు. 1910లో వీరందరూ అలహాబాదులో కలిసి పెరుగుతున్న ముస్లిం లీగ్ ప్రాబల్యం నుంచి తమను తాము కాపాడుకోవటం కోసం ఒక సంస్థ ఉండాలని సూత్రీకరించి 1914లో అమృతసర్ హరిద్వార్ లు కేంద్రాలుగా హిందూ మహా సభ రూపం ధరించిది.బనారస్ హిందూ విశ్వ విద్యాలయ స్థాపకుడయిన మదన్ మోహన్ మాలవ్యా, లాలా లజపతి రాయ్ దీనిలో ప్రముఖ పాత్ర వహించారు.


               ఇప్పటికీ దేశ రాజకీయాల్లో తమ ప్రభావాన్ని  చూపిస్తున్న ఆ రెండు ప్రతీప శక్తులూ కాంగ్రెసు వల్లనే ప్రభవించడం కాకతాళీయమా చారిత్రక అనివార్యతా అనేది దేవుడున్నాడా లేడా అనే దానికన్నా సంక్లిష్టమయిన ప్రశ్న?!కాంగ్రెసు రాజకీయ చరిత్ర తొలి దశలోని గందరగోళం ఒక కొలిక్కి వచ్చేసరికి -  యువతీ యువకుల మద్జ్యన జత కోసం యేర్పడే పోటీల్లో సాధారణంగా కనిపించే ప్రణయ త్రికోణం లాంటి ఒక రాజకీయ ప్రళయ త్రికోణం ఈ దేశపు రాజకీయ రంగస్థలం మీద ఆవిర్భవించేసింది.



               ఇదంతా నేను ఇక్కడ చెప్పినంత సరళంగా జరిగి పోలేదు.ఆంగ్ల ప్రభుత్వానికి సాయం చేసే సద్బుధ్ధి గల సాధు సజ్జనుల సంస్థలోకి దాన్ని కూల్చడానికి కంకణం గట్టుకున్న విద్రోహులు ప్రవేశించడం వల్ల యేర్పడిన ఆ గందరగోళాన్ని ఇప్పటి వాళ్ళకు అర్ధమయ్యేలా వివరించడం నా వల్ల కాకనే ఇంత క్లుప్తంగా ముగించేస్తున్నాను. కానీ ఒక వైపు ప్రభుభక్తీ మరోవైపు స్వేచ్చావాదం, ఒక వైపు తమలోని హిందూత్వపు ఆధిక్యతా భావాన్ని వొదులుకోలేకపోవడం అనే బలహీనత, మరోవైపు ముస్లిములని ఆకర్షించాల్సీన అవసరం అనే పరస్పర విరుధ్ధమయిన అంశాల్ని ఒకే సంస్థలో ఇమడ్చడానికి ప్రయత్నించారు.చచ్చీ చెడీ శాయంగల విన్నపములై అన్నట్లుగా పడుగు పేకలా యెవరూ నొచ్చుకోని విధంగా అందర్నీ కలిపేశారు. ఇప్పటికీ కాంగ్రెసు పార్టీలో వివిధ వర్గాలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరి మీద మరొకరు అధిపత్యం కోసం వ్యూహాలు పన్నుతూ కూడా కలిసే ఉండటం యెలా సాధ్యపడుతున్నదో మీకిప్పుడు అర్ధమయి ఉండాలి!

______________________________________________________
1    2    3    4    5    6

Monday 17 March 2014

తెలంగాణా మేధావుల్లోని మేధావిత్వపు శాతం యెంత?

         అజ్ఞానం  - దరిద్రం  కవల పిల్లలు.  అవి ఒకదాన్నిఒకటి అంటిపెట్టుకుని ఉంటాయి. ఒకటి  కొంటే ఒకటి ఉచితం  అనేటంతగా పెనవేసుకుని ఉంటాయి. డబ్బు ఎలా సంపాదించాలనేది తెలియని అజ్ఞానం వల్ల  దరిద్రం పట్టుకుంటుంది . దరిద్రం వల్ల మనస్సు సరిగ్గా పని చెయ్యక అజ్ఞానం పట్టుకుంటుంది. ప్రెషర్ కుక్కర్ అనే వస్తువు ఒకటి ఉoది. అది ఆడవాళ్ళు మాకది కావాలని అడిగితే తయారు చేసింది కాదు. అది ప్రజలు ఇవ్వాళ పడుతున్న బాధని తొలగించటానికి దాన్ని తయారు చేసిన వాడికి వచ్చిన ఆలోచన నుంచి తయారయింది.    ఆ ఆలోచన మంచి చేసేది గనక దానికి కొత్తగా మార్కెట్టుని అదే పుట్టించుకొవల్సి వచ్చింది.  మొదట ఆ ఆలోచన ఎవడికి వచ్చిందో వాడు కొంతకాలం మార్కెట్టుని యేలేస్తాడు. తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఆ మార్కెట్ లోకి ప్రవేశిస్తారు. ఇలా ప్రవేశిoచాలంటే అంతకు ముందున్న వాళ్ళు ఇచ్చే సౌకర్యాల  కన్నా తను ఎక్కువగా ఇస్తేనే మార్కెట్లో తను సరయిన స్థానాన్ని పొంద గల్గుతాడు.


        ఉద్యోగాల కయితే డిగ్రీలు కావాలి. పరీక్షలు రాయాలి. నానా రకాల తంటాలూ పడాలి. కానీ వ్యాపారం చెయ్యాలన్నా పరిశ్రమ పెట్టాలన్నా ఇవేమీ అక్ఖర్లేదు. కానీ ఏది తను బాగా అమ్మగలడో తన గురించి తనకు బాగా తెలియాలి. కొత్త వస్తువును తయారు చేసి దానికి కొత్తగా మార్కెట్ ని పుట్టించుకొవడమా, అప్పటికే ఉన్న వస్తువుని మరింత బాగా మెరుగు పరచి అమ్మడమా - ఏది తనకు చేతనయితే అది చెయ్యడానికి సిద్ధంగా ఉండాలి. మొదటి విడత లాభాలు వచ్చేవరకు అవసరమయ్యే  సంస్థాగతమయిన పెట్టుబడి ని తనే సమకోర్చుకోవాలి. ఒకసారి లాభాలు రావడం మొదలయితే తరవాత వ్యాపారాన్ని విస్తరించడానికి మోలధనాన్ని కదిలించకుండా లాభాల నుంచే పెట్టుబడినీ పొందాలి. ఇవన్నీ చెయ్యగలిగిన వాడే వ్యాపార పారిశ్రామిక రంగాల్లో వృద్దిలొకి వస్తాడు.  ఇది చెయ్యలేని మీ లాంటి నా లాంటి వాళ్ళు యేదో ఒక  ఉద్యోగం చూసుకుని బతికెయ్యాలి. అయితే ఈ రెంటికి కొన్ని ముఖ్యమయిన తేడా లున్నాయి. ఉద్యోగం లో భద్రత ఉంటుంది,  ్వ్యాపారంలోఉండదు. కానీ ఒక ఉన్నతోద్యోగి కూడా తన ముప్పయ్యేళ్ళ సర్వీసులో పొంద లేని ఆదాయం ఒక మధ్యస్థ అంతరువు లోని వ్యాపారి కేవలం అయిదు పది సంవత్సరాల లోనే పొంద గలడు.  వ్యక్తులకు ఉద్యోగాలు భద్రతా నిచ్చినా ప్రాంతాల వారీగా చూస్తే వ్యాపార పారిశ్రామిక రంగాల వల్లే లాభం ఉంటుంది. 



       హైదరాబాదు రాష్ట్ర ఆదాయంలో అధికశాతం ఆక్రమించ గల్గడానికి కారణ మిదే.  యాభయ్ అరవయ్ యేళ్ళపాటు ఇది మన రాష్ట్రం అని మన రాజధాని అని ఆత్మీయత ఫీల్ అయ్యి వ్యాపారాలలో ెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించి కేవలం ఒక్క నగరం నుంచే రాష్ట్ర ఆదాయం మొత్తంలో 47% ఉండేలాగ చేస్తే దానికి ఫలితం అక్కడి నుంచి వెళ్ళగొట్టబడటమా? హైదరాబాదు ఆదాయాన్ని ఖర్చుపెట్టటం గురించి ఉన్న సాంకేతికమయిన మెలికతో మొత్తం మాకే చెందుతుందంటున్నారు. ఇది న్యాయమేనా?పెట్టుబడులకు దగ్గ శాతాన్ని అడిగితే యెవరూ తప్పు పట్టరు, కానీ "రిప్ వాన్ వింకిల్" లాగా అరవయ్ యేళ్ళ పాటు పెట్టుబడులు పెట్టటంలో యే మాత్రమూ చొరవ చూపకుండా రాజ్యాంగం అనుమతించిన పధ్ధతుల్లో వ్యాపారం చేసిన వాళ్ళని దోపిడి దార్లుగా, అందుకు అవసరమయిన భూముల్ని కొనుగోలు చెయ్యటం భూ ఆక్రమణలు గా జమ చెయ్యటం యెంతవరకూ సబబు?


        అవి కబ్జా లయితే అతను తెలంగాణా వాడయిన ఆంధ్రా వాడయినా నేరాన్ని యెవరూ సమర్ధించరు.అలా కాక కొనటమే జరిగితే మీరు సాంకేతికంగా తెలంగాణాలో ఇతరులు భూమిని కొనగూడదనే నిషేధాన్ని సాకుగా అతన్ని దోషిని చెయ్యాలనుకుంటే మరి అమ్మిన తెలంగాణా వ్యక్తి సంగతేమిటి?తెలంగాణాలో భూముల, ఆస్తుల కొనుగోలు అమ్మకాల్ని పర్యవేక్షించే ఒక ప్రాంతీయ కమిటీ ఉంది.ఆ కమిటీ అనుమతి లేకుండా కొన్నారా?ఆ కమిటీ అనుమతి లేకుండా కొంటే యే వివాదమూ అక్కర్లేకుండానే అనుమతి లేని అమ్మకం చెల్లదు కదా? వారు అనుమతి ఇచ్చిన దాన్ని తప్పు పడితే మీ తెలంగాణా ప్రాంత నాయకులే అవినీతికి తెగబడ్డట్టు కాదా?అవినీతిలో అందరికీ భాగం ఉన్నప్పుడు ఒక ప్రాంతం వారు పులు గడిగిన ముత్యాలై మరొక ప్రాంతం వారు దోపిడీ దారు లెలా అవుతారు?

      దేశంలో యే ప్రాంతం వాడయినా యెక్కడయినా స్థిరనివాసం యేర్పరచుకోవచ్చు కదా(కష్మిర్ని మినహాయిస్తే), మరలాంటప్పుడు గుజరాతీ వార్నీ, ఇంకా  వార్నీ వీర్నీ అని లెక్కలు చెప్పి ఆదరిస్తున్నామనే వాళ్ళు,ఆంధ్రా ప్రాంతం నుంచి వొచ్చిన వాళ్ళకి మాత్రం ఆంగ్లేయులకి వాడినట్టుగా వలస వాదులు అని అనడం యెందువల్ల జరుగుతున్నది?

     కలిసుండడం వల్ల తెలంగాణా భాషకి అన్యాయం జరిగిందనీ కృష్ణా జిల్లా మాండలికాన్ని అధికార భాషగా చేస్తే భరించాల్సి వొచ్చిందనీ చెబుతున్నారు. అది నిజమేనా? నిజంగా కృష్ణా జిల్లా మాండలికం ఇలాగే ఉంటుందా? కృష్ణా జిల్లా మాండలికాన్నే గనక కుట్ర పూరితంగా పైకి తీసుకొస్తే ఒక్క తెలంగాణా వాదులేనా గుంటూరు జిల్లా వాళ్ళు, ఉభయ గోదావరి జిల్లాల వాళ్ళూ రాయల సీమ వాళ్ళూ గొడవ చెయ్యరా? యే ఇద్దరు రెండు వేర్వేరు జిల్లాల నుంచి వొచ్చ్చిన వాళ్ళు యెవడి భాషలో వాడు మాట్టాడుకుంటూ పోతే వ్యవహారం నడుస్తుందా? అందువల్ల అప్పటి వాళ్ళు మాండలిక వ్యవహారిక తెలుగు ని కాకుండా అందరూ అర్ధం చేసుకొగలిగే విధంగా భాషని సామాన్యీకరించారు? ఇప్పుడు బ్లాగుల్లో మనందరం వాడుతున్నదీ అదే, యే ప్రాంతీయ పదాలూ లేని అందరికీ అర్ధమయ్యే సామాన్య తెలుగు. ఇది కూడా తప్పేనా?

      ఆయా మాండలికాలకి ఆదరణని కల్పించడం అనేది ఆ భాషలో మంచి పాండిత్యం ఉన్నవాళ్ళు తమ రచనల్లో ఉపయోగించి మిగిలిన వారికీ పరిచయం చేస్తే మిగిలిన వారు అందులోని స్వారస్యాన్ని గ్రహించి మెచ్చుకుంటారు. తిక్కన గారు తన పదిహేను పర్వాల తెలుగు భారతంలో నెల్లూరు జిల్లా మాండలికపు సొంపుని వాడినట్టుగా శ్రీ శ్రీ గారు చెప్పగా విన్నాను. ఆ రకంగా నెల్లూరు జిల్లా మాండలికం తన పలుకుబడులతో సహా భారతేతిహాసంలో ఒక భాగం కాగలిగింది. దీన్ని యెవరయినా వ్యతిరేకించగలరా? మరో విధంగా యే ఒక్క భాష నయినా అధికారికంగా ప్రోత్సహిస్తే మిగిలిన వారు ఊరుకుంటారా?

       ఇక్కడ పదాల వాడకం గురించి తెలంగణా వాదులతో నాకెదురయిన ఒక చిత్రమయిన సన్నివేశాన్ని వివరిస్తాను. వాళ్ళు మాటిమాటికీ ఆంధ్రోళ్ళు అని వాడుతుండడం గురించి నేను అభ్యంతరం చెప్పాను యువవాణి బ్లాగులో. దానికి వారి ప్రతిస్పందన యేమిటో తెలుసా? "ఆంధ్రోళ్ళు అంటే తప్పు మాటా, నాకు తెలియదే?" అని అమాయకంగా అడగటం, పైగా మీ తెలుగుకో నమస్కారం" అని నన్ను వెటకారం చెయ్యటం. వారు ఒకసారి నా మొదటి టపాని చూసి ఆ తర్వాత నా తెలుగు భాషని గురించి యేదయినా మాట్లాడితే బాగుంటుందని అడుగుతున్నాను. అసలు సమస్య అది కాదు. తెలంగాణా వాదులు బుల్లెబ్బాయి అంటే మాకు తప్పు అన్నారు, అది వాళ్ళ దగ్గిర వాడకూడదు అంటే మనం ఒప్పుకోవాలి. కానీ మనకి ఆంధ్రోళ్ళు అనే మాట గురించి పట్టింపు ఉన్నా వాళ్ళు పట్టించుకోరు. వారి ఉద్దేశ్యం - వాళ్ళకి ఇష్టం లేని మాటలు మనం వాడకూదదు, వాళ్ళు వాడే మాటలకి మనం అభ్యంతరం చెప్పకూడదు.ఇదీ వారు భాషాపరంగా కోరుకునే సమానత కాబోలు!
________________________________________________________ 

Saturday 15 March 2014

పవనిజం ఇవ్వాళ్టి అవసరం?!

                    పవన్ చాలా బాగా మాట్లాడాడు.మొత్తం అన్ని వీడియోలూ విన్నా.విన్నానని యెందుకంటున్నానంటే చూసింది వీడియోనే అయినా రాసుకొచ్చింది చదవడమే కదా చూడ్డానికే ముంటుంది?మంచి ఆవేశం ఉంది. భాషలో చాలా పవర్ ఉంది. పవర్ స్టార్ కదా! ఇవ్వాళ జనం తెలుసుకోవలసిన విషయాల్లో చాలా వాటిని ప్రస్తావించాడు. అప్పటి అన్నగారిలాగా నసగటం గొణగటం యేమీ లేకుండా తను చెప్పదల్చుకున్న దాన్ని బల్ల గుద్ది చెప్పాడు.

                    ముఖ్యంగా తను హఠాత్తుగా వొచ్చి అందర్నీ వెనక్కి తోసేసి ముందుకెళ్ళిపోయి ముఖ్యమంత్రి అయిపోవాలనే దురాశతో మాత్రం లేడు. తలలో తింగరి అలోచన ల్లేవు,కాళ్ళు భూమి మీదనే ఉన్నాయి.అంతవరకూ అతన్ని తెలివయిన వాడిగానే లెక్కెయ్యొచ్చు.మనం కూడా అతన్నుంచి యెక్కువ ఆశించనక్కర్లెదు.

                    ఇవ్వాళ ఇటువైపున జగన్ అటువైపున కచరా చాలా ప్రమాదకరమయిన వ్యక్తులు. కచరా ని కంచె అయిలయ్య లాంటి మేధావులూ గద్దర్ లాంటి ప్రజా కళాకారులూ సమర్ధించటం లేదు. అతనిలో తెలంగాణా దొరతనపు అహంభావం ఉంది.అసలు తెలంగాణా వాడు కాదు, విజయనగరం వాడని తెదెపా వాళ్ళంటున్నారు.అది యెలా ఉన్నా అతని వ్యక్తిత్వంలో అహంభావం ఉంది.ఆ మూర్ఖత్వమే ద్వేషభాషకు కారణం. అతన్ని తెలంగాణాలో యెదుర్కోగలిగిన సత్తా ఉందనిపించింది. అతని ధోరణి కూడా కచరాతో ఢీ కొట్టడానికి నిశ్చయించుకున్నాడని తెలిసిపోయే విధంగానే ఉంది.

                    కాబట్టి ఇటు వైపున జగన్ని అటువైపున కచరాని తగ్గించి తెదెపా భాజపా లోక్సత్తా త్రయానికి కొంచెం వూపిరి పీల్చుకునే సహాయం మాత్రమే చెయ్యగలడు. అంతకు మించి భూనభోంతరాళాలు బద్దలు కొట్టగలడని నేను నమ్మటం లేదు. అది అతనికీ తెలుసు.

                    అతని మానిఫెస్టో యేమిటనేదాని గురించి నేను పట్టించుకోవటం లేదు.మానిఫెస్టోలూ అవీ అక్కర్లేదు కూడా. ఇప్పుడు మనం విద్యాధికులమే అయినప్పటికీ యే పార్టీ మానిఫెస్టో నయినా పూర్తిగా చదివి వోట్లు వేస్తున్నామా?రెండు వైపులా కొంచెం సొంత మెదడుతో ఆలోచించగలిగిన ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే.విలీనం మీది ఆశతో ఈ రాష్ట్రాన్ని విడగొట్టగూడని విధంగా - రెండు ప్రాంతాల్లో యెవరికీ ప్రయోజనం లేని భీబత్స కాండగా మార్చి -  విడగొట్టిన కాంగ్రెసు నామ రూపాల్లెకుండా పోవాలి.

                    ఇప్పుడు కాంగ్రెసు పార్టీ లోని ప్రతీ వాడు తెదెపా లోకి జంప్ అవుతున్నాడు. యెదిరి పక్షం నుంచి వచ్చే వాళ్ళని వొద్దనకుండా చేర్చుకోవటం వ్యూహాత్మకంగా మంచిదే గానీ అప్పుడు తెరాసాకి నలబై సీట్లిచ్చి దెబ్బ తిన్నట్టుగా ఇప్పుడు వీళ్ళందరికీ సీట్లిస్తే బాబు మళ్ళీ మట్టానికి మునిగి పోతాడు.

                    తెదెపాకి బలం క్యాడరే. నిన్నటి దాకా తిట్టిన వాళ్ళకి ఇవ్వాళ జండాలు మొయ్యాలంటే వాళ్ళు మనస్పూర్తిగా చెయ్యరు.ఆ పొరపాటు చెయ్యకుండా, అవసరమయిన చోట పవన్ సాయం తీసుకుంటూ మంచి వ్యూహంతో వెళ్తే రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రాగలడు.మిత్రపక్షాలుగా భాజపా లోక్ సత్తా యెటూ ఉండనే ఉన్నాయి.

                    ప్రస్తుతానికి పవన్ తనగురించి యేవేవో వూహించేసుకుని అతిగా పోకుండా ఈ మూడు పార్టీలకీ సహాయం చెయ్యడం ద్వారానే అతని ప్రవేశానికి సార్ధకత యేర్పడుతుంది.మరో విధంగా ప్రవర్తిస్తే శృంగభంగం తప్ప వొరిగేదేం ఉండదు.

Thursday 13 March 2014

ఇక ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక నూతన రాజకీయ ఆర్ధిక వ్యవస్థ కావాలి - 5

                    విభజన యెంత ఘోరంగా చేసింది ఆ క్రూరమయిన కాంగ్రెసు పార్టీ. విభజన ఫలితాల్ని రేపటి రోజున అనుభవించాల్సీన రెండు వర్గాల్లో యెవరి మాటా వినకుండా ఈ రోజున దక్షిణాది రాష్ట్రాల్లో కల్లా పరువయిన బరువయిన ఒక రాష్ట్రాన్ని - విభజన బిల్లులో విడిపోయిన తర్వాత పునర్నిర్మాణానికి అవసరమయిన నిధుల కేటాయింపు లేకుండా. పయిగా తను యేదో ఘనకార్యం చేసినట్టుగా దీన్ని చూపెట్టి వోట్లూ సీట్లూ ఇమ్మని అడగటానికి సాహసిస్తున్నదంటే తెలుగు వాళ్ళ మెదడు తక్కువ తనం మీద యెంత చిన్న చూపో కదా!

                   ఒకానొకప్పుడు విభజన జరగక మునుపు హైదరాబాదు గురించి అక్కడ ఆంధ్రా పెట్టుబడుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక వ్యక్తి, "బంజారా హిల్స్ లో 90% మంది సీమాంధ్రులు, పక్కనే స్లంస్ లో 90% మంది తెలంగాణా వాళ్ళు - ఇదేనా నువ్వు చెప్పే అభివృధ్ధి?" అని ఆవేశ పడిపోయారు? ఉద్యమ కాలం లోని ఆ ఆవేశం ఇప్పుడు పనికొస్తుందా?రాష్ట్రం యేర్పడగానే ఆ స్లంస్ అన్నీ మాయం చేసి వారిని ఉధ్ధరించి చూపగలమనే నమ్మకం ఉందా?నాకు లేదు!యెందుకంటే హైదరాబాదు తనొక్కటే ద్వీపకల్పంగా లేదు. అది ఒక రాష్ట్రంలో భాగం. ఇవ్వాల్టి రాజకీయ ఆర్ధిక విధానం అందుకు వెసులుబాటు నివ్వదు.ప్రతీ నగరాన్నుంచీ, ప్రాంతాన్నుంచీ రెవెన్యూ నంతా పోగు చెయ్యటం, కేంద్రం వరకూ పంపించటం చేసి మళ్ళీ కేంద్రం నుంచి ఇక్కడి వరకూ రెవెన్యూ తిరిగి వచ్చినప్పుడు  మాత్రమే ఆ ప్రాంతం అభివృధ్ధికి నోచుకుంటుంది.యెన్ని ఉదాహరణలు కావాలి? ఒక ప్రాంతం లో కొన్ని కోట్ల ఆదాయాన్ని తీసుకొచ్చే పరిశ్రమ ఉంటుంది. పక్కనే ఉన్న గ్రామాల్లో తాగునీటికే సమస్య!


            అందుకే నేను జిల్లాల స్థాయిలో తమ రెవెన్యూని తామే ఇక్కదే ఖర్చు చేసుకోగలిగే పూర్తి అధికారాలతో కూడిన ప్రాంతీయ ప్రభుత్వాలు యేర్పడటం గురించి పట్టుబడుతున్నది. ఇది నేను కొత్తగా చేస్తున్న ప్రతిపాదన కూడా కాదు. ఇప్పటికే పయిన నేను చెప్పిన విషయాలను పరిశీలించిన మేధావులు చాలా కాలం క్రితమే ఈ రెవెన్యూ పరమయిన స్వయంపాలన గురించి ప్రస్తావించి ఇదే పరిష్కారాన్ని సూచించారు.ఇప్పుడూ ఇకముందూ ఈ రాష్ట్రం నికరమయిన అభివృధ్ధిని జమ చేయాలంటే పూర్తి అధికార వికేంద్రీకరణ తప్పనిసరి.


                  ఈ వ్యాస పరంపరలో మోడో భాగంలో నేను భారత్ పూర్తి స్థాయిలో అగ్రరాజ్యంగా యెదగటానికి నాలుగు వీషయాల గురించి ప్రస్తావించాను.అవి:మొదటిది అధికార వికేంద్రీకరణ, రెండోది విద్యని మార్కెట్ కి అనుసంధానించటం, మూడవది వ్యవసాయాన్ని వ్యవస్థీకరించి లాభసాటిగా తీర్చిదిద్దటం,నాలుగోది మన సంస్కృతి మూలాల్ని పరాయీకరణకి గురి కాకుండా రక్షించుకోవటం.


             విద్యని మార్కెట్కి అనుసంధానించటం అనేది చాలా అవసరంగా జరగాల్సీన పని. మార్కెట్లో ఆల్రెడీ అడుగు పెట్టినా వెళ్ళాల్సినంతగా ముందుకు వెళ్ళలెక పోవటానికి మానవ వనరులే కారనమని మార్కెట్ విశ్లేషకులు యెన్నోసార్లు విశ్లేషించినా ఇంతవరకూ సమస్య యెవరికీ అర్ధం కావడమే లేదు. మార్కెట్ కి ఇవ్వాళ కావలసిన మానవ వనరులు గొడ్డు పని చేసే రోజు కూలీలు కాదు మార్కెట్ లో మన వాటాని పెంచగలిగే తెలివయిన కుర్రాళ్ళు! ఇవ్వాల్టి డిగ్రీ లన్నె ఉద్యోగాలకు మాత్రమే పనికొస్తాయి. మార్కెట్ సక్తులకి తలుపులు బార్లా తెరిచి పదేళ్ళయినా ఆ వైపులి అసలు చూపునే మళ్ళించడం లేదెవరూ.దానికి పై స్థాయిలో R&D చాలా జరగాలి. విద్యా వ్యవస్థలో సమూలమయిన మార్పులు తీసుకు రావాలి.


     వ్యవసాయాన్ని వ్యవస్థీకరించి లాభసాటిగా మార్చడం గురించి కొంచెం విడమర్చి చెప్తాను.వ్యవసాయానికి ఇవ్వాళ ఇస్తున్న ప్రోత్సాహకాలూ, విత్తనాల సరఫరాలూ, వ్యవసాయ ఋణాలు మాఫీ చెయ్యటం లాంటివన్నీ కేవలం తాత్కాలిక సర్దుబాట్లు మాత్రమే తప్ప దీర్ఘకాలికంగా ప్రయోజనాన్నిచ్చేవి కావు. అసలు వ్యాపారం కానీ పరిశ్రమలు కానీ వ్యవసాయం కన్నా యెందుకు లాభసాటిగా ఉన్నాయనుకుంటున్నారు మీరు?పెట్టుబడి, వనరుల్ని ఉపయోగించుకోవటం, తయారయిన సరుకుని మార్కెట్ కి తీసుకెళ్ళడం - వీలయితే మార్కెట్ని తనకనువుగా నడిపించుకుని అయినా లాభం తెచ్చుకోవడానికి ఒక వ్యవస్థ సపోర్ట్ గా ఉంది. వ్యవసాయం ఇన్ని ప్రోత్సాహకాలతోనూ దైవాధీనం మోటర్ సర్వీస్ లాగా నడుస్తున్నదే తప్ప వ్యవస్థీకృతం కాలేదు. వ్యవస్థీకృతం చెయ్యకుండా లాభసాటిగా తీర్చి దిద్దలేం!



                        వ్యవసాయానికి ముఖ్యమయిన అవసరాలు ప్రకృతిసిధ్ధమయినవి - గాలి, నీరు, వేడి.వీటిలో గాలినీ వేడినీ అస్సలు కంట్రోల్ చెయ్యలేం. నీటిని చెయ్యగలం. కానీ ఇవ్వాళ దేశమంతా వ్యవసాయం నదీ జలాల మీద ఆధార పడి నడుస్తున్నది.మనకున్న నదుల్ల్లో చాలా మటుకు వర్షాధారమయినవే. హిమానీ నదాలూ, జీవనదులూ కూడా దిగువకి వెళ్ళి సముద్రాన్ని చేరే లోపు బలహీన పడుతున్నవే.వీటికి అతివృష్టి, అనావృష్టి లాంటి వాటితో పాటు అంతర్రాష్ట్ర జల వివాదాలు కూడా తోడయి జల వనరుల పంపిణీ విధానం చాలా అస్తవ్యస్తంగా ఉంది.మొట్ట మొదటి సారిగా దీనికి ప్రత్యామ్నాయం చూపించింది మన తెలుగు వాడు - కె.యల్. రావు గారు. నదుల అనుసంధానం - వేసింది మాస్టర్ ప్లానే. ఆయన కేవలం ఆ కలని సాకారం చేసుకోవాలనే కాంగ్రెసులో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పాల్గొన్నారు.కానీ మనం జాతీయ స్థాయిలో ఆ పేరు ప్రస్తావనకి రాగా విన్నది ఈ మధ్యనే వాజపేయి గారి ద్వారానే. మొదటి నుంచీ దాని గురించి తెలుసుకున్న మేధావు లంతా ఇప్పటికీ అది మంచి ప్లానే అంటున్నారు.


               కానీ అది మొత్తం ఒకే ప్రాజెక్ట్ కాదు. దేశం మొత్తం మీద యెన్నో చోట్ల చేపట్టి వీటన్నిట్నీ కలుపుకుంటూ రావలసిన అనేక ప్రాజెక్టుల సమాహారం. ఇప్పటి రెవెన్యూ ఫ్లో పధ్ధతిలో అంటే ప్రతీ రూపయీ పైనుంచే రావాలనే పధ్ధతిలో దశల వారీగా చెయ్యాలంటే మొదలు పెట్టిన తర్వాత దశాబ్దాలే కాదు శతాబ్దాలే పట్టవచ్చు.నేను చెప్పాది యేంటంటే - వాటిల్లో కల్లా అతి పెద్ద ప్రాజెక్టు పట్టే కాలాన్ని లిమిట్ గా పెట్టుకుని అన్నీ ఒకేసారి మొదలెట్టి ఆ నిర్ణీత కాలం లోపే అన్ని నిర్మాణాలూ ఒకేసారి పూర్తి చెయ్యగలగాలి.ఒక పోలిక చెప్తాను. చిత్రగ్రీవుడనే కపోత రాజు వలలో చిక్కుకుని దాన్నించి తప్పించుకోవడానికి చెప్పిన ఉపాయమేమిటి? పిట్టకధతో పోలిక తెచ్చినా నదుల అనుసంధానం అలా చేస్తే తప్ప ఇప్పటి పధ్ధతిలో అంచెలంచెల మోక్షము అనే పధ్ధతిలో మాత్రం యెప్పటికీ మోక్షణం రాదని నా అభిప్రాయం.అలా చెయ్యాలంటే ప్లాన్ లేఔట్ ని బట్టి యే ప్రాంతంలో ఆ ప్రాజెక్టు కు సంబంధించిన యే భాగం వస్తుందో అక్కడి కక్కడ జరగటం ద్వారా సమయం, ధనం పొదుపు అవుతాయి.అదీ యెప్పుడు? దేశంలో అన్ని చోట్లా ప్రాంతాలకి తమ రెవెన్యూని తమ వద్దనే ఉంచుకోగలిగిన స్వయం ప్రతిపత్తి ఉన్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది.

                 సాంస్కృతికంగా కూడా పరాయీకరణకి గురి కాకుండా కాపాడేది తన ప్రాంతం పట్ల మమకారం మాత్రమే.తన ప్రాంతం చరిత్ర యేమిటో తెలుసుకుని అందులో గర్వించదగిన విషయాల పట్ల ఉండే అభిమానమే అతన్ని ప్రత్యేకంగా తన ఉనికిని గుర్తుంచుకుని ఆ వారసత్వం పట్ల ఉండే ఉత్సాహం అనితర సాధ్యమయిన కార్యాల్ని చేసే విధంగా ప్రోత్సహిస్తుంది, తన ప్రత్యేకతని నిలబెట్తుకునే విధంగా తీర్చి దిద్దుతుంది.కానీ ఇప్పటికీ చరిత్ర అంటే యెక్కడో ఉన్న హరప్పా మొహంజదారో శిధిలాల గురించి తప్ప మన చుట్టూ ఉన్న వాట్నే గుర్తించ లేక పోతున్నాం.ప్రాంతీయ ప్రభుత్వాలు తమ అధికారంలో ఉన్న వనరుల్ని ఉపయోగించుకుని ఇప్పటీ కన్నా మరింతగా స్థానిక చరిత్రల్ని వెలికి తియ్యగలవు. వాటి వల్లనే జరుతుందనే మూర్ఖత్వం లేదు గానీ యెక్కడి స్థానిక చరిత్ర ఆ ప్రాంతాన్ని ఇష్టపడే అక్కడి వారి ఉత్సాహం వల్ల మరింతగా వెలుగు లోకి వస్తుంది. 



భరత వాక్యం:అన్ని రకాల రాజ్యాంగ నిబంధనలతో ఇప్పుడున్న దానికన్నా అధికార వికేంద్రీకరణ అనే లక్ష్యాన్ని సాధించుకోవటం తప్పని సరి. ఇదే మంచి మోడల్ అనే అభిప్రాయం లేదు. ఇప్పుడున్న నిర్మితి లోనే ఇవ్వాళ మనం ఆపలేని నిస్సహాయతతో తలవంచేసిన దరిద్రాలకి మూలం ఉంది. ఈ నిర్మాణాన్ని ఇలాగే ఉంచితే మళ్ళీ మళ్ళీ ఇలాంటి సమస్యలే తల యెత్తుతాయి కాబట్టి యెప్పటి కయినా అధికార వికేంద్రీకరణ అనేది తప్పదు.రాజకీయ పరమయిన వికేంద్రీకరణ కన్నా ఆర్ధిక పరమయిన వికేంద్రీకరణ చాలా ముఖ్యం.
-----------------------------------------------------------------------------------------------------------------
1 2 3 4 5

Sunday 9 March 2014

ఇక ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక నూతన రాజకీయ ఆర్ధిక వ్యవస్థ కావాలి - 4

లక్ష్యం:ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కంద్రీకృతంగా ఉన్న రాజకీయ వ్యవస్థని వికేంద్రీకరించి జిల్లా స్థాయికి కుదించి పూర్తి అధికారాలతో ప్రాంతీయ వ్యవస్థలకి అప్పగించటం.


సూచన: ఇదివరలో జిల్లాలకి స్వయం ప్రతిపత్తి కోసం జిల్లా ప్రజా పరిషత్తుల్ని యేర్పాటు చేసి చాలా కాలం నుంచి యెన్నికలు జరుపుతూ ప్రజా ప్రతిధులు యెన్నికయి తమ అధికారిక స్థానాలలో హోదాని అనుభవిస్తున్నా వారికి అధికారాల్ని మాత్రం కట్టబెట్టలేదు. అప్పుడు ప్రతిష్టంభన రావటానికి కారణం బహుశా అప్పటికే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలకి అధికారాలు పూర్తిగా నిర్వచించబడి ఉండటం వల్ల ఈ మూడో అంతరువుకి యే స్థాయిలో అధికారాల్ని బదలాయించాలి అనేది కావచ్చు. మూడో అంతరువులోని ప్రభుత్వానికి యే అధికారాన్ని యెంత మేరకు బదలాయిస్తే అంత మేరకు పై స్థాయిలో ఉన్న వ్యవస్థలకి ఆ అధికారాల్లో కోత పడాల్సి ఉంటుంది మరి. కానీ నేనిప్పుడు ఒక స్థాయిలో కాదు మొత్తం రాష్ట్ర స్థాయిలోని అన్ని అధికారాల్నీ ప్రాంతీయ ప్రభుత్వాలకి అప్పగించేసి రాష్ట్ర స్థాయిలోని అంతరువుని మాయం చేసెయ్య మంటున్నాను. అంటే ఇప్పుడు ఒక చోటనే ఉన్న ప్రభుత్వం స్థానంలో 13 పూర్తి అధికారాలతో ఉండే చిన్న చిన్న ప్రభుత్వాల్ని యేర్పాటు చెయ్యమనేది నా ఉద్దేశం.

పధ్ధతి:


1. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో డాక్యుమెంటేషన్ కి ఉపయోగ పడుతున్న సెక్రటేరియట్ లో కలగాపులగంగా ఉన్న జిల్లాలకి సంబంధించిన అన్ని శాఖలు మరియు విధినిర్వహణలకి సంబంధించిన భిన్నమయిన విషయాలన్నింటినీ జిల్లాల వారీగా వేరు చేసి జిల్లా కేంద్రాలకి పంపటం.
2. క్రింది స్థాయిలోని ప్రాంతీయ ప్రభుత్వాలకి తమ అధికారాల్ని కట్టబెట్టటానికి తనను తను రధ్ధు చేసుకునే తీర్మానాన్ని శాసన సభ చెయ్యటం.


ఖర్చు:


1. దస్త్రాల్ని వేరు చేసి సర్ది పంపించటానికి కొంత ఖర్చు అవుతుంది గానీ అది నామమాత్రమే. 
2. ఇప్పటికే జిల్లా ప్రజా పరిషత్తులు యేర్పడి ఉన్నాయి కాబట్టి కొత్తగా ఆ యంత్రాగాన్ని యేర్పాటు చెయ్యటానికి ఖర్చు ఉండదు.
3. ప్రాంతీయ స్థాయిలో సభా నిర్వహణకి ఇప్పుడున్న భవనాలూ యేర్పాట్లూ చాలక పోవచ్చు.ప్రస్తుతం యేవో చిన్న చిన్న ఆఫీసుల్లాంటివి ఉండి ఉంటాయి.కానీ పూర్తి స్థాయి శాసన సభా సమావేశాల మాదిరి వ్యవహారాలకి తగిన యేర్పాట్లు అవసరమవుతాయి.


లాభాలు:


1. ఇప్పుడు 290 మందికి పైన ఉన్న శాసన సభ్యులు బిల్లుల పైన చర్చించటానికి రాష్ట్రం నలుమూలల నుంచి వారిని ఒకచొటికి రప్పించటానికి చాలా ఖర్చవుతున్నది.
2. ఈ ఇబ్బంది వల్లనే సంవత్సరానికి కొన్ని రోజులు మాత్రమే సభ సమావేశ మవుతున్నది.
3. ఆ కొద్ది రోజుల్లో చర్చించటం కుదరని వాట్ని ఆర్డినెన్సులుగా తెస్తున్నారు.
4. ప్రతీ ఆర్డినెన్సూ అది ముగిసి పోయే కాలంలోపు సభలో అనుమతి రాకపోతే ఆ బిల్లు మురిగిపోతుంది.



ప్రాంతీయ ప్రభుత్వాల్లో ఈ బలహీనతలు అసలు ఉండవు.


1. సభ్యులు సమావేశానికి చేరుకోవటానికి పట్టే కాలమూ దూరమూ గణనీయంగా తగ్గుతుంది గనక సమావేశాలకి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది.
2. సమావేశాలు కూడా ఇన్ని రోజులకే అని పరిమితం చెయ్యాల్సిన ఇబ్బంది ఉండదు.యెప్పుడు అవసరమయితే అప్పుడు ఒక రోజు ముందు తెలియపర్చినా సభ్యులు సకాలంలో సభకి హాజరు కాగలరు.
3. సమయాభావం సమస్య లేకపోవటం వలన ప్రతి బిల్లూ సమగ్రమయిన చర్చ ద్వారా పూర్తి సౌష్టవంతో రూపు దిద్దుకుంటుంది.
4. యే ఒక్క బిల్లూ మురిగిపోయే ప్రసక్తి ఉండదు.


                    అన్ని అధికారాల్నీ పూర్తిగా బదలాయించమంటున్నాను గనక యే ఒక్క ప్రత్యేకమయిన అధికారం గురించీ విడివిడిగా చెప్పటం లేదు గానీ రెవెన్యూ అధికారాల్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి.రెవెన్యూ అధికారాల్లో వ్యవస్థీకృతంగా యేమీ చెయ్యనక్కర్లేదు. యెందుకంటే ప్రతి జిల్లాకీ ఆర్ధిక ప్రణాళికా సంఘాలు(District Planning Commission) యేర్పడి ఉన్నాయి. మొత్తం ఆర్ధిక పరమయిన అన్ని వ్యవహారాలూ జిల్లా ఆధారంగానే జరుగుతున్నాయి.కానీ రెవెన్యూ ఫ్లో అనే దాంట్లో చాలా కిరికిరి జరుగుతున్నది.

                    ఇప్పుడు రెవెన్యూ ఫ్లో అనేది యెలా జరుగుతున్నది? ఆర్ధిక పరమయిన అన్ని విషయాలకీ జిల్లాయే ప్రధానంగా ఉంది కాబట్టి జిల్లా నుంచి వచ్చే రెవెన్యూ అంచనా లన్నీ అందరికీ తెలిసినవే. ఒక జిల్లా నుంచి వచ్చే రెవెన్యూ ఇప్పుడెలా కదుల్తున్నది. ఆ రెవెన్యూ మొదట రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయబడుతున్నది.మొత్తం అన్ని జిల్లాల నుంచీ పోగు పడిన రెవెన్యూ లో కొంత పక్కకి తీసి కేంద్రానికి పంపిస్తున్నారు. కేంద్రం మొత్తం అన్ని రాష్ట్రాల నుంచీ వొచ్చిన రెవెన్యూని కొంత పక్కకి తీసి ఆ మిగిలిన దాన్ని కింది వైపుకి రాష్ట్రాలకి పంపిస్తున్నది. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకి పంపిణీ చేస్తున్నది. అంటే ఒక జిల్లా నుంచి వెళ్ళిన ఆదాయం మళ్ళీ ఆ జిల్లాకి చేరటానికి మూడంచెలు పైకి మూడంచెలు కిందికి మొత్తం ఆరు అంచెలు దాటుకుని రావాల్సి వస్తుంది.

                    రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయి జాతీయ ప్రభుత్వమూ ప్రాంతీయ ప్రభుత్వమూ అనే రెండు అంచెలే ఉంటే మధ్యలో పక్కకి తీసి పెట్టే వేష్టేజి తగ్గుతుంది.కానీ నేను కొత్తగా ప్రతిపాదిస్తున్నది ఒకటుంది.ప్రతి జిల్లాకీ తన రెవెన్యూ మీద తనకి పూర్తి అధికారం ఉండాలి.రాష్ట్రం అనే మధ్య అంతరువు రద్దు అయిపోయినా మొత్తం రెవెన్యూ అంతా ముందు కేంద్రానికి పంపించి మళ్ళీ అది తిరిగి వచ్చే వరకూ యెదురు చూడటం కన్నా తన ఆదాయంతో బాటూ తన అవసరాలూ స్పష్టంగా తెలుసు గనక వాటికి అవసరమయినంత ఇక్కడే ఉంచేసుకుని అదనంగా ఉన్న రెవెన్యూని మాత్రమే పైకి పంపించగలిగే విధంగా ఉండాలి.

                    ఇది చాలా అవసరం. యెందుకంటే ఇప్పుడు దాదాపుగా అన్ని ప్రాజెక్టులకీ సకాలంలో పూర్తి కాకపోవడం అనే ఇబ్బంది ఈ రెవెన్యూ ఫ్లో నెమ్మదిగా కదలటం వల్లనె యెదురవుతున్నది. కొన్ని ప్రాజెక్టులకి అంచనా వ్యయానికీ నిర్మాణ వ్యయానికీ గుండె గుభేలు మనిపించేటంత తేడా రావటం, మొదలు పెట్టేటప్పుడు ఇంత కాలంలో పూర్తవుతుందనుకున్న అంచనాని దాటి సుదీర్ఘ కాలం డేకటం ఈ రెవెన్యూ ఫ్లో లో ఉన్న మందకొడి తనం వల్లనే కదా!అన్ని పనులూ జిల్లా యంత్రాంగం ద్వారానే జరుగుతున్నాయి- చెయ్యడానికి చిత్తశుధ్ధి ఉన్నవాళ్ళు  యెంత వేగంగా అయినా చెయ్యగలరు, కానీ పని మొదలు పెట్టటాని కవసరమయిన నిధులూ, పని పూర్తయ్యాక చెల్లించాల్సిన బిల్లుల చెల్లింపులకీ అవసరమయిన రెవెన్యూ మాత్రం ఇంత సుదీర్ఘమయిన ప్రయాణం చేస్తుంటే పనులు సత్వరంగా యెలా జరుగుతాయి?

పార్లమెంటు సభ్యుల సమన్వయ సంఘం:రాష్ట్రం స్థాయిలో ప్రభుత్వాన్ని పూర్తిగా రద్దు చేస్తే రాష్ట్ర స్థాయిలో వీటి నన్నిట్నీ కలిపి ఉంచటానికి ఒక వ్యవస్థ ఉండాలి కదా?. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే ఈ మోడల్లో తనని తను రద్దు చేసుకుంటున్నప్పుడు ఈ జిల్లాల సమాహారం మిగతా రాష్ట్రాలతో యెలా వ్యవహరించాలి? ఇప్పుడున్న అంతర్రాష్ట్ర జల ఒప్పందాల లాంటి వాటిని యెవరు చూడాలి?

                    దానికి నేను పార్లమెంటు సభ్యుల్ని ఉపయోగించుకోవచ్చునని సూచిస్తున్నాను.ప్రతి జిల్లాకీ మినిమం ఇద్దరు చొప్పున పార్లమేంటు సభ్యులు ఉండాలి. ఈ పార్లమేంటు సభ్యులు రాష్ట్ర స్థాయిలో తమ జిల్లాలకి ప్రాతినిధ్యం వహించేలాగా ఒక సమన్వయ సంఘంలాగా యేర్పడి మొత్తం అన్ని జిల్లాల సమాహారమయిన రాష్ట్ర పరిధి లోని అంశాలకు బాధ్యత వహించాలి.జిల్లాకి సంబంధించి క్షేత్ర స్థాయిలో జరిగే వ్యవహారాలకి సంబంధించిన శాసనాధికారం తో కూడిన పరిపాలన ఒక చోటా ఈ జిల్లాని బాహ్య ప్రపంచంతో అనుసంధానించే బాధ్యతా యుతమయిన వ్యవస్థ ఒక చోటా ఉంటుంది. యేదీ కేంద్రీకృతం కాదు.

                    ఇప్పుడు ఒక పార్లమెంటు స్థానానికి యెన్నికయిన వ్యక్తికి తన పార్లమెంటరీ నియోజక వర్గంతో మాత్రమే అనుబంధం ఉంటుండగా ఈ కొత్త అమరికలో ప్రతీ పార్లమెంటు సభ్యుడికీ మొత్తం రాష్ట్ర మంతటితో అనుబంధం యేర్పడుతుంది. అధికస్య అధికం ఫలం!రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపించే రెవెన్యూని ఈ పార్లమెంటు సభ్యుల ద్వారా నడిపించితే మరొక ముఖ్యమయిన పని కూడా జరిపించుకోవచ్చు. ఇప్పుడు కేంద్రం ఈ రెవెన్యూ నంతా పైకి తీసుకోవటం దేని కోసం? కొన్ని చోట్ల యెక్కువ ఆదాయం ఉంటే దాన్ని  ఒక చోటికి కలిపి తరుగు లో ఉన్న ప్రాంతాలకి సహాయంగా అందించటం కోసమే కదా! అయితే సమన్వయ సంఘంలో ఉన్న పార్లమెంటు సభ్యులకి యెలాగూ తమ జిల్లాలకి సంబంధించి పైకి పంపే రెవెన్యూ మీద అధికారం ఉంచితే ఇక్కడే అది చెయ్యొచ్చు. రెవెన్యూ పరంగా తరుగు లో ఉన్న జిల్లా సభ్యుడు యెక్కువ రెవెన్యూని కేంద్రాని పంపగల జిల్లా వారిని ఈ స్థాయిలో అడగవచ్చు, ఇక్కడే ఆ యేర్పాటు చేశాక మిగిలిన రెవెన్యూనే కేంద్రానికి పంపవచ్చు. మరొక రెండు దశల కాలహరణం తప్పుతుంది. వ్యక్తుల మధ్యన స్నేహ సంబంధాలు యెలా అయితే వాళ్ళ మధ్యన జరీగె చొరవతో కూడిన అదాన ప్రదానాలతో వికసిస్తాయో ప్రాంతాల మధ్యన కూడా ఇలాంటి అదాన ప్రదానాలు ఉంటేనే జాతుల మధ్యన ఐక్యత కూడా బలపడుతుంది.ముందు కేంద్రానికి పంపించి అక్కడి నుంచి ఇది జరగటంలో యాంత్రికత ఉంటే ఈ విధంగా చెయ్యడంలో మానవీయత ఉంటుంది.


           సహజంగా ప్రజా జీవితంలో యెదగాలనుకునే నాయకుల్లో వ్యక్తిగతమయిన ప్రవర్తనని బట్టీ వారి పని తీరుని బట్టీ రెండు రకాలుగా ఉండటాన్ని పరిశీలించాను - క్షేత్రస్థాయిలో సామాన్యులతో కూడా కలివిడిగా ఉంటూ పనులు సకాలంలో పూర్తవడానికీ ఆ పనుల్లో క్వాలిటీ ఉండటానికీ కారణ మయ్యేవాళ్ళు కొందరు కాగా హుందాగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండి సమస్యల్ని పరిష్కరించటం, గొడవల్ని సర్దుబాటు చేసి ఇరుసులో కందెనలా ఉపయోగపడే వాళ్ళు మరి కొందరు. అవినీతి పరుల్ని నేను పట్టించుకోవటం లేదు.ముందు ముందు కూడా ప్రస్తావనకే తీసుకు రాను. యెందుకంటే ఇప్పటి ఈ వ్యవస్థలోనే అవినీతిని కట్టడి చెయ్యటం గురించి బాగా ఆలోచించి యే నియమ నిబంధనల్ని యేర్పాటు చేశారో ఆచరణ లోకి వచ్చేసరికి అవే అవినీతి పరులకి మరింత సులువయిన దార్లుగా మారాయి. వేతన శర్మలు!

               ఒక నిజాయితీ పరుడయిన వ్యక్తి ఇప్పటికన్నా చురుకుగా పని చేసి ప్రజలకి మరింత ప్రయోజనం కలిగించే అర్ధవంతమయిన రాజకీయ చట్రాన్ని రూపొందిస్తే చాలు.ఆ రోజున అక్కడ అవినీతి జరుగుతుందేమో ఇక్కడ అవినీతి జరుగుతుందేమో అని హడావుడి పడుతున్నప్పుడు నాలాంటి వాడెవడయినా ఉంటే ఒకటే అడిగే వాడు, "అక్కడికి అవినీతి పరుల్ని యెవరయినా పంపిస్తే గదా వాడు అక్కడి కెళ్ళి అవినీతి చేశేది, అక్కడికి అవినీతి పరుణ్ణి పంపించకుండా ఉంటే సరిపోతుంది గదా" అని. ఆ వేతన శర్మల్ని వొదిలేస్తే నేను ప్రతిపాదించే వ్యవస్థలో మొదటి రకం వాళ్ళు జిల్లా ప్రజా పరిషత్తుల్లో కుదురుకోవచ్చు. రెండో రకం వాళ్ళు సమన్వయ సంఘంలో ఉంటే జిల్లాని మిగతా జిల్లాలతో అనుసంధానించటంలోనూ అన్ని జిల్లాల్నీ ఒక రాష్ట్రంగా పట్టి ఉంచటంలోనూ వారిలోని ఉదార గుణం మంచి ఫలితాల నిస్తుంది. తమ జిల్లాని కేంద్రంతో అనుసంధానించటం, మిగులు రెవెన్యూకి సంబంధించిన ఆదాన ప్రదానాలకి సంబంధించిన బాధ్యతలూ కీలక మయినవే.



                కేంద్రీకృతంగా ఉండే ఒక ప్రభుత్వానికి బదులు 13 ప్రభుత్వాల్ని యేర్పరుస్తున్నప్పుడు రాజధాని గురించి బుర్రలు బద్దలు కొట్తుకునే అవసరం లేదు. సమన్వయ సంఘం కార్య కలాపాలకి శాశ్వత నివాసంగా ఉపయోగ పడుతుంది, అంతే.

సూచన:పార్లమెంటు సభ్యులు ఒకోసారి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటే సమన్వయ సంఘంలో కూడా అతడు కొనసాగడం కష్టం. అందుకే జిల్లాకి మినిమం ఇద్దరు పార్లమెంటు సబ్యులు ఉండాలన్నది. కొంచెం పెద్ద జిల్లా అయితే అంతకన్నా యెక్కువమంది కూడా ఉండొచ్చు.కానీ యెంత చిన్న జిల్లా కయినా మినిమం ఇద్దరు ఉండాలి. జిల్లాకి సంబంధించిన పార్లమెంటు సభ్యుల్లో యెవరో ఒకరిని కానీ అందర్నీ కానీ ప్రాంతీయ ప్రభుత్వ సమావేశాలకు అధికారికంగా హాజరయ్యే విధంగా గౌరవ సభ్యత్వం ఇస్తే ఈ రెండు వ్యవస్థలూ ఒకదాని కొకటి చక్కగా అతుక్కుని ఉంటాయి.

ఫలశ్రుతి: స్థూలంగా ఇవీ నా ప్రతిపాదనలు. దీని వల్ల వచ్చే గుణాత్మకమయిన మార్పు అవినీతిని బాగా తగ్గించవచ్చు. అధికారంలో ఉండి పనులు శీఘ్రంగా జరిపించాల్సిన బాధ్యతా యుతమయిన వ్యక్తులు పర్యవేక్షించాల్సిన పరిధి తగ్గుతుంది. రాష్ట్రం మొత్తం మీద ఉన్న అసంఖ్యాకమయిన వాటిని పర్యవేక్షించటం కన్నా ఒక జిల్లా స్థాయి లోని కొన్ని పనుల్ని మాత్రమే పర్యవేక్షించటం చాలా తేలిక. ఒక నిజాయితీ పరుడయిన వ్యక్తి అధికారంలో ఉంటే ఈ వెసులుబాటుతో గట్టి నిఘా ద్వారా అవినీతిని ఖచ్చితంగా తగ్గించగలడు.ప్రభుత్వం మీద ప్రజలకీ మంచి పట్టు ఉంటుంది. ప్రతి రోజూ తమకు దగ్గరగా తిరిగే వాళ్ళని ప్రజలు కూడా దగ్గర్నించి గమనించటం ద్వారా నాయకుల్ని ప్రజలు కూడా కట్టడిచెయ్యగలరు.

                    అనవసరమయిన వ్యవస్థల్ని మాత్రం పూర్తిగా మాయం చేసెయ్యాలి.వజ్రం యెందుకంత దృడంగా ఉంటుంది? ఫిజిక్స్ లో పదార్ధాల స్థిరత్వానికి సంబంధించి ఒక తమాషా అయిన విశేషం ఉంది. అణువులు వాటిలో అవి కలిసి ఉండటానికి తక్కువ శక్తితో బంధించుకోగలిగి ఉంటే వాటికి స్థిరత్వం యెక్కువ ఉంటుంది. వాటితో అవి కనెక్ట్ అవటానికి తక్కువ శక్తి అవసరమయితే వాట్ని బద్దలు కొట్టటానికి బయటి నుంచి మనం యెక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. ప్రభుత్వానికి కూడా అదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పుడున్న మిత్ యేమిటంటే యంత్రాంగం యెక్కువ ఉంటే యెక్కువ ప్రయోజనం కలుగుతుందని. 

                    సమర్ధవంతంగా పనిచేస్తే ఇప్పుడున్న యంత్రాంగంలో అయిదో వంతుకు తగ్గినా ఇప్పటి కన్నా పనులు తొందరగానే జరుగుతాయి.చాణక్యుడు రాజధర్మంగా చెప్పింది ఒకే ఒక్కటి - ప్రజల్ని ధర్మబధ్ధంగా జీవించటానికి ఉత్సాహవంతుల్ని చెయ్యటం. దానికి చెయ్యాల్సిన పన్లు కూడా రెండే - ప్రజలకి న్యాయమయిన మార్గంలో సంపాదించుకోవటానికి దారి చూపించటం,అన్యాయ వర్తుల్ని శిక్షించటం. పీవీ నరసింహా రావు గారు అధికారికంగా లైసెన్స్ రాజ్ ని యెత్తేసినా అనధికారికంగా లాబీల ద్వారా అందరూ అన్నిటికీ పోటీ పడలేని రహస్య మార్గాల్లో జరుగుతూనే ఉంది మరో రకమయిన పర్మిట్ల వ్యవహారం. ఒకడేమో నెలకి వెయ్యి రూపాయలిస్తానంటాడు, ఇంకొకడేమో మీరు కూర్చున్న చోటు నుంచి కదలక్కర్లేదు, నేనే మీ ఇంటికొస్తాను ముద్దలు కలిపి నోట్లో పెడతానంటాడు.న్యాయంగా సంపాదించుకునే దారి చూపించి దొంగవెధవల్ని కంట్రోల్ చేస్తే వాడి కష్టం మీద వాడే బతుకుతాడు కదా?! 

                    ఇప్పటి రాజకీయ యంత్రాంగం పిరమిడ్ లాగా పైన ఉన్న కొద్ది మంది కేంద్రీకృత మయిన అధికారంతో కింది అంతరువుల్ని క్రూరంగా శాసించుతున్నారు.దానికి బదులుగా ఈ నూతన విధానం క్షేత్ర స్థాయిలో బలంగా ఉండి పైకి విస్తరిస్తూ -  యెదిగే చెట్టు లాగా ఉంటుంది.నేను ఇప్పటికిప్పుడు త్వరగా చెయ్యాల్సిన నాలుగింటిని గురించి చెప్పాను కదా, వాటిలో విద్యని మార్కెట్ కి అనుసంధానించటం తప్పించి మిగతా రెండింటికీ ఈ  నూతన వ్యవస్థ పునాదిగా ఉంటుంది. ఆ వివరాలు మరుసటి టపాలో.


ఒక మంచి వార్త:నేను ఇక్కడి వరకూ పోష్టుని రాత్రి పూర్తి చేశాను. కానీ ఇది నిజంగా మార్పుని తేగలదా అని సందేహంగా అనిపించింది. అయినా స్థూలంగా మన మాట మనం చెబితే చర్చ ద్వారా మరింత మెరుగు పర్చుకోవచ్చు కదా అని నాకు నేనే సర్ది చెప్పుకున్నా. అయితే ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూశాను. రాష్ట్ర పునర్నిర్మాణానికి నిజంగా ఉపయోగ పడాల్సిన వ్యాపార పారిశ్రామిక వర్గాల వారు కూడా ఇలాంటి ప్రతిపాదనలే చేశారు.

వారు చెప్పింది సంక్షిప్తంగా ఇది:ప్రతి రెండు జిల్లాల్నీ ఒక క్లస్టర్ గా అభివృధ్ధి చేయడం వల్ల త్వరిత గతిన మేలయిన అభివ్ర్ధ్ధి సాధించగలుతాం. వ్యవసాయం అభివృధ్ధి చెందితే వ్యవసాయాధారితమయిన పరిశ్రమలు యేర్పడి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. భూ వినియోగాన్ని హేతుబధ్ధం చేయాలే తప్ప పరిశ్రమల ముసుగులో రియల్టర్ల దందాను అనుమతించకూడదు.


               ఒక వారం క్రితమనుకుంటాను తెలంగాణాకు సంబంధించిన మేధావులు కూడా ఒక పత్రికా సమావేశంలో సరిగ్గా ఈ క్లస్టర్ల ప్రస్తావననే తెచ్చారు. ఆ రకంగా చూస్తే నేను చేసిన ప్రతిపాదన అంతకంటే మెరుగ్గానే ఉన్నట్టుగా ఉంది. ఇప్పటి పధ్ధతిలో యేర్పడే క్లస్టర్ల కన్నా ప్రతి జిల్లాకీ తమను తామే అభివృధ్ధి చేసుకునే పూర్తి అధికారం ఇవ్వ మంటున్నాను నేను.

                    అక్కడ తమ అభిప్రాయాలు చెప్పిన వారంతా లాబీయింగుల ద్వారా పైకొచ్చిన వారు కాకుండా చక్కని రాజమార్గంలో సంపద పెంచే ఋజు ప్రవర్తన గల వ్యక్తులు కావడంతో వారు కూడా ఇలాంటి చట్రాన్నే కొరుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.
-----------------------------------------------------------------------------------------------------------------
1 2 3 4 5

Wednesday 5 March 2014

ఇక ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక నూతన రాజకీయ ఆర్ధిక వ్యవస్థ కావాలి - 3

                    అసలు సాంకేతికపరమయిన విషయానికి వెళ్ళబోయే ముందు కొన్ని విహంగ వీక్షణలు చేద్దామనుకుంటున్నాను.మనకి యెన్ని రకాల అస్తిత్వాలు ఉన్నాయి?ఒక అంతరువులో భారతీయుడిగా, ఒక అంతరువులో తెలుగువాడిగా, ఒక అంతరువులో ఆంధ్రా వాడిగా - ఇన్ని రకాల అంతరువులు ఉన్నప్పుడు అతని సార్వకాలికమయిన గుర్తింపు యేమిటి?ఒక మనిషి తన చుట్టూ ఉన్న సమాజంలో కలవాలి అనుకున్నప్పుడే అస్తిత్వానికి సంబంధించిన ఆలోచన కలుగుతుంది. ఒకే ఒక మనిషి - సంతానాన్ని పెంచటానికి కావలసిన సహచరి కూడా లేకుండా - ఈ భూమి మొత్తానికి ఒకే ఒక మనిషి ఉంటే అతనికి అస్తిత్వానికి సంబంధించిన విచికిత్స అనవసరం. ఇవ్వాళ డబ్బు అని మనం పిలుచుకునే మారక విలువతో కూడా పని లేదు.యేక్ నిరంజన్:-) సబ్ కా మాలిక్ యేక్:-)

                    వేరే వాళ్ళతో కలిసినప్పుడే అతనికి ఇంతమందిలో ఉన్నా నేను ఫలానా అని చెప్పుకుని నా ప్రత్యేకత ఇదీ అని గర్వించటానికి పనికొచ్చేదిగా ఉండే ఒక వాస్తవికమయిన ప్రాతిపదిక చాలా అవసరం.ఇవ్వాళ ఆర్ధిక సరళీకరణ ప్రపంచాన్ని కుదించేస్తున్నప్పుడు దాని వల్ల అనివార్యంగా వొచ్చిపడే పరాయీకరణను తట్టుకోవాలంటే ప్రతి మనిషీ తన అస్తితాన్ని నిర్ధారించుకోవటం తప్పనిసరి.

                    రష్యన్ విప్లవ రధసారధి కామ్రేడ్ లెనిన్ విప్లవ ప్రభుత్వం యేర్పాటు చేసె తొలి రోజుల్లోనే ఒక అద్వ్హుతం చేసాడు!అప్పుదు రష్యా అంతా జార్ ప్రభువుల పాలనలో  మగ్గిపోయి ఉంది. దేశమంతా దివాళాలో ఉంది.మరొకడయితే వెంఠనే కమ్యునిష్తు సాంప్రదాయాల్ని రుద్దేద్దాం, మన తడాఖా చూపిద్దాం అని రెచ్చిపోయేవాడు. కానీ లెనిన్ అలా చెయ్యలేదు, 'సమానంగా పంచాలంటే ముందు పళ్ళెంలోకి యెంతో కొంత రావాలి కదా' అనే ఉద్దేశంతో ఒక అయిదేళ్ళ పాటు పెట్టుబడి దారీ పధ్ధతినే ఫాలో అవుదాం అని మొదలెట్టాడు.సరిగ్గా అయిదేళ్ళు పూర్తి కాగానే ఇక చాలు అని అన్నాడు. అంత పెద్ద భూభాగాన్ని అలా మంత్రదండంతో శాసించినట్టుగా మరే రాజ్యాధినేతా శాసించలేకపోయాడు. అతనికి అంత ప్రాభవం రావటానికి కారణం ఒకటే. ప్లానింగ్!యెంత అమోఘమయిన ప్లానింగ్ అంటే రహస్య జీవితం గడుపుతున్నప్పుడే అతను రేపు అధికారంలోకి వస్తే యేమి చెయ్యాలో అప్పుడే ప్రణాలికలు రాశేసి ఉంచుకున్నాడు.స్వతంత్రం యేర్పడిన వెంటనే అతను చేసిన ప్రతిపాదనల్లో అతి ముఖ్యమయినది - 'జాతుల స్వయం నిర్ణయాధికారం' అనే ప్రకటన.అంటే సెర్బియన్లు, బోత్స్నియన్లు అనే రకరకాల జాతులకి సంబంధిచిన ప్రజలంతా యేకాండ శిలలాగా ఒకే ముక్కగా ఉండాల్సిన అవసరం లేకుండా యెవరి ప్రాంతాన్ని వారు పరిపాలించుకోగలిగే స్వేచ్చని బేషరతుగా ఇచ్చేశాడు!ఆ ఉదారత్వమే అతనికి ప్రజల్లో అతని మాట పట్ల గౌరవాన్ని పెంచింది. ఫలితం వాళ్ళందరూ మేం మీ నాయకత్వం లోనే కలిసే ఉంటాం అని ముందుకి రావటం.

                    ఇవ్వాళ ప్రపంచ రాజకీయ రంగంలో జరుగుతున్న మార్పులు భారత్ మరింత పలుకుబడిని పెంచుకుని అగ్రరాజ్య హోదాని సొంతం చేసుకోవటానికి కొన్ని అడుగులే ఉన్నాయనిపించే దూరంలో ఉంది. యేనాడయినా ఒక అమెరికన్ ప్రెసిదెంట్ స్వయంగా మీ మార్కెట్లో మాకు చోటివ్వండి అని బతిమాలతాడని ముందుగా యెవరయినా వూహించగలిగారా? ఆ సన్నివేశం యాదృచ్చికంగా జరిగింది  కాదు.కానీ ఆ నాలుగడుగులూ పడాలంటే ఇప్పటి లాగా బధ్ధకంతో నిదానంగా కదిలితే ఉదరదు.చాలా వాటిల్లో తొందర పడి చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి.మొదటిది అధికార వికేంద్రీకరణ, రెండోది విద్యని మార్కెట్ కి అనుసంధానించటం, మూడవది వ్యవసాయాన్ని వ్యవస్థీకరించి లాభసాటిగా తీర్చిదిద్దటం,నాలుగోది మన సంస్కృతి మూలాల్ని పరాయీకరణకి గురి కాకుండా రక్షించుకోవటం.

                    ఈ నాలుగింటిలో యే ఒక్కదాన్నీ నిర్లక్ష్యం చెయ్యకూడదు.ప్రాధాన్యతా క్రమం కూడా అదే. ఇంతకీ మన ఆస్తిత్వాన్ని నిర్ధారించే అంతరువు యేది?నా దృష్టిలో జిల్లా యే! యెందుకంటే ప్రజోపయోగ కరమై ప్రజా పాలనకి సంబంధించిన అన్ని అంశాలూ జిల్లా తోనే అనుసంధానించబడి ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వం లోక్ సభ సభ్యులతో నడిచినా, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సభ్యులతో నడిచినా వాళ్ళందరూ విషయ సేకరణ నుంచీ కార్యక్రమ నిర్వహణ వరకూ ఆధార పడుతున్నది జిల్లా యంత్రాంగం మీదనే.అటు జరిపీ ఇటు జరిపీ యెలా సర్దారో తెలియదు గానే ఇవ్వాళ ఆంధ్రా, రాయల సీమ మరియు తెలంగాణా ల్లో ప్రతి జిల్లాకీ ఒక ప్రత్యేకమయిన సంస్కృతి కొట్టొచ్చినట్టుగా తెలుస్తుంది చూడండి.ప్రతీ జిల్లాకీ కట్టే బట్ట దగ్గిర్నించీ మాటల్లో వినబడే పలుకుబడుల వరకూ ఒక గంట సేపు కలిసి తిరిగితే "వీదు ఈ జిల్లా వాడు" అని గుర్తు పట్టగలిగేటంత ప్రత్యేకంగా ఉన్నాయి. కాబట్టి నేను ఆ జిల్లాలనే క్షేత్ర స్థాయిలో ప్రజలు తమ ప్రాంతాన్ని తాము బాగు చేసుకోవటానికి వీలయ్యే ఈ నూతన రాజకీయ విధానానికి పునాదిగా తీసుకుంటున్నాను.ముందరి భాగాల్లో ఇక సాంకేతిక పరమయిన విషయాలు చర్చించాలి కాబట్టి తరవాతి వ్యాసానికి విరామం కొంచెం యెక్కువ కావచ్చు.

జై గారు కొరుకుంటున్నట్టు ఒక ఖచ్చితమయిన -Implimentation Plan- ఉండేలాగా చూస్తాను.
-----------------------------------------------------------------------------------------------------------------
1 2 3 4 5

Tuesday 4 March 2014

ఇక ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక నూతన రాజకీయ ఆర్ధిక వ్యవస్థ కావాలి - 2

                     మొదట్లో నేను నా భావాల్ని కామెంట్లుగా వేశానని చెప్పాను గదా. అప్పుడు తెలంగాణా వారు కొంత పట్టించుకున్నారు గానీ రాష్ట్రాన్ని విడగొట్టనక్కర్లేని ఈ మోడల్ని సమైక్యవాదులు మాత్రం అసలు పట్టించుకోలేదు. యేమయితేనేం ఈ రోజు తెలుగు వాళ్ళు రెండు రాష్ట్రాలలో ఉన్నారు. కానీ అంతా కొత్తగా మొదలెడుతున్న ఈ దశలోనే ఒక కొత్త రాజకీయ చట్రాన్ని కూడా యేర్పరచుకుంటే బాగుంటుందని నా అబిలాష. చిన్నపిల్లలు నడక దగ్గిర్నించి భాష వరకూ తొందరగా నేర్చుకోవటానికి కారణం కూడా కొత్తదాన్ని సాధిస్తున్నామనే హుషారు ఉండటమే కదా! అదే విధంగా ఈ కొత్త ఆరంభంలో ఇప్పటి వరకూ సమస్యగా తయారయిన పాత చట్రాన్ని కూలదోసి కొత్తగా మొదలెట్టటం మరింత శోభాయమానమయిన భవిష్యత్తుని తెస్తుంది కదా!. పైగా ఇది ఫలితమిస్తుందో లేదో తెలియని ప్రయోగం కూడా కాదు. అనుసరిస్తే తప్పకుండా ఫలితమిచ్చే గ్యారెంటీ ఉన్న పరిష్కారమే.

నేను మొదట్లో యెత్తి చూపిన పాయింట్లు ఇవి:

1. ఒక సమస్యకి పరిష్కారం అనుకున్నది కొత్త సమస్యల్ని సృష్టించేదిగా ఉంటే, కొంతకాలం తర్వాత మళ్ళీ సమస్య మొదటికొస్తుందేమో అనిపించేటట్లు ఉంటే అది నిజమైన పరిష్కారం అనిపించుకుంటుందా? ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ప్రతిపాదన మొదలవ్వగానే గుర్ఖాలాండు గొడవ మొదలు పెట్టింది. మిగతా వాళ్ళు కూదా నేడో రేపో మొదలు పెదతారు.నిజంగా విభజన వల్లనే వెనుకబాటుతనం పోతుందా? ఇప్పటికి ఉత్తరాదిన విడిపొయిన రాష్ట్రాలలో అలాంటి గుణాత్మకమైన మార్పులు జరిగాయా?

2. మొత్తం సమస్యని మొదటి నుంచీ చివరి వరకూ రాగద్వేషాల కతీతంగా చూస్తే అటు తెలంగాణా వాదులూ ఇటు సమైక్య వాదులూ చేస్తున్న పొరపాటు ఒకటి కనిపిస్తున్నది. సమస్యకి మూలం యేమిటో ఇద్దరిలో యెవరూ పసిగట్ట లేదు. ఒక సమస్యని మూలాన్ని వెదక్కుండా పైకి కనబడే చిహ్నాల్ని మాత్రమే చూసి మూలం దగ్గిర ఒక్క దెబ్బతో పడిపొయే విషవృక్షాన్ని ఆకుల మీద యెన్ని దెబ్బలేసినా లాభమేముంది?

3. తెలంగాణా వాదులకి తప్పనిసరిగా జవాబు చెప్పాల్సిన ప్రశ్న ఒకటి వేస్తున్నా.ఇవ్వాళ మా వెనకబాటుతనానికి ఆంధ్రోళ్ళు కారణం, ఇన్నేళ్ళుగా మమ్మల్ని నిర్లక్ష్యం చేసారు గనక విడిపోవటమే సరైనదంటున్నారు. విడిపొయిన ఒక నాలుగేళ్ళ తర్వాత ఒక మూడు జిల్లాలు మాత్రమే ముందుకెళ్ళి మిగతావి ఇంకా వెనకబడి ఉంటే, వాళ్ళు ఇలాంటి వాదన తోనే మాకు వేరే రాష్త్రం కావాలని అడిగితే వెంటనే అప్పటి మీ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇచ్చేస్తారా?

4. అలా సాగదీస్తూ పోతే యెక్కడాగుతుంది? విడిపోవడం ద్వారానే బాగుపడగలగటం నిజమైతే ప్రతి జిల్లా ఒక రాష్ట్రంగా విదిపోవాల్సి ఉంటుంది.నిజంగానే రాష్ట్రం విడిపోకుండానే మీకు కావలసిన స్వయం పరిపాలన అనేది సాగించుకోలేని విషయమేనా? ఇవ్వాళ పరిపాలనకి సంబంధించిన చట్రం యెలా ఉంది?కేంద్రంలో పార్లమెంటూ రాష్ట్రాలలో అసెంబ్లీలూ ఉద్దరిస్తున్న ఘనకార్యమేమిటి? కేవలం కాగితాల మీదకి శాసనాల్ని యెక్కించటం. వాళ్ళు నిజంగా పనులు చెయ్యటానికి జిల్లా స్థాయి యంత్రాంగం మీదే ఆధార పడుతున్నారు.యెందుకంటే జిల్లాలకి భౌగోళికమైన,రాజకీయపరమైన మరియు సాంస్కృతికమైన సరిహద్దులు ఖచ్చితంగా వివాద రహితంగా యేర్పాటయి ఉన్నాయి.పనులు చెయ్యటానికి కావలసిన యంత్రాంగమంతా అక్కడ బలంగా ఉంది.

5. ఆ జిల్లాలకి రాజకీయపరమైన స్వయం పరిపాలన ఇవ్వడం కొసమే జిల్లా ప్రజా పరిషత్తులనే వ్యవస్థని ప్రతిపాదించారు. వాటికి యెన్నికలు జరుగుతున్నాయి,కార్యాలయాల్ని సమకూర్చారు, చాలా హడావుడి చేసారు - అఖరికి ఇవ్వల్సిన శాసనాధికారం మాత్రం ఇవ్వకుందా చేటపెయ్యల్లాగా వాటిని నిలబెట్టినందువల్ల ఆ యెన్నికలకయ్యే ఖర్చంతా వృధా అయిపోతున్నది. అవి అసమర్ఢులకి రాజకీయ పునరావాస కేంద్రాలు గా మిగిలిపొయినాయి.

6. తెలంగాణా వాదులు ఆ పది జిల్లల కోసమూ, సమైక్య వాదులు ఆ హైదరాబాదు ఒక్కదాని కొసమూ గాకుండా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి కోసం ఉమ్మడిగా పోరాడితే మొత్థం 23 జిల్లాల వాళ్ళూ బాగుపదతారు కదా! అధికార వికేంద్రీకరణ కోసమనే ఒక వ్యవస్థని ప్రతిపాదించి కూడా దాన్ని పూర్తిగా యెందుకు అమలు చెయ్యలేదో తెలుసా?అధికారం కేంద్రీకృతమవడం వల్ల లాభపడే వాళ్ళు ఆ అధికారాన్ని వికేంద్రీకరిస్తే తమ లాభం గూబల్లోకి వొస్తుందని తెలియదం వల్ల అలా వికేంద్రీకరణని తొక్కి పట్టి ఉంచారు.రెండు రాష్ట్రాలు గా విడిపోతే ఇలాంటి అధికార కేంద్రం దగ్గిర గుమిగూడి సొంతానికి దండుకునే వాళ్ళు మాత్రమే బాగుపడతారు.

7. అవినీతి మచ్చ లేని వాళ్ళూ మంత్రులు గా కొందరు మంచి పేరు తెచ్చుకున్న మంచి వాళ్ళూ తమ జీవితానుభవాల్ని గురించి చెబుతూ వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లు గా ఉన్నప్పటి అనుభవాల్ని యెకరువు పెట్టగా నేను చదివాను.అనుభవాలు అంటే పని చేసిన అనుభవాలు కాదు - జిల్లా అంతా కలయ దిరిగి యెమి చెయ్యాలో తెలిసి కూదా పని చెయ్యటానికి అధికారాలు లేని దరిద్రాన్ని గుర్తు చేసుకోవటమే. మంత్రిగా ఉన్నప్పటి అధికారాలు అప్పుడే ఉంటే యెంతో కాలం కలిసొచ్చేదనే నిట్టూర్పులే.ఇవ్వాళ ఇంకొ దరిద్రం కూడా కనబడుతూ వినబడుతూ ఉంది. వెనకబడిన జిల్లాల వాళ్ళు రాష్త్ర ప్రభుత్వాల్ని మేము కాస్త బాగుపడాలి బాబూ మా జిల్లా నించి ఒకరిని మంత్రిని చెయ్యండని దేబిరించటం.అంటే ఒక జిల్లా బాగుపడాలంటే ఆ జిల్లా వాడు మంత్రివర్గంలో ఉండాలన్నమాట. అంటే మొత్తం ర్రాష్త్ర పరిధి లో అలోచించాల్సిన మంత్రి తన సొంత జిల్లాని గురించి మాత్రమే అలొచించటం అనేది అందరికీ న్యాయమే అనిపిస్తున్నదన్నమాట.

8. ఆ దరిద్రాలకీ ఈ శషభిషలకీ  మూలం ఒక్కటే ననేది నాకు అనిపిస్తున్నది. జటిలమైన సమస్యలకి కూడ లోతెరిగి చూడకుందా  దీర్ఘకాలిక పరిష్కారాలకి కాకుండా అప్పటికి నెత్తిన పడ్డ పెంటని వొదిలించుకుంటే చాలనే విధంగా అలోచించటమే.తెలంగాణా వాదుల కోరిక ప్రజలు సుఖపడే స్వయం పరిపాలన అయితే అది రాష్త్రంగా విడిఫొయినా జిల్లాలకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్లనే జరుగుతుంది. జిల్లాలకు పూర్తి అధికారాలిచ్చి అన్ని జిల్లాలనీ స్వయం పోషకంగా చెయ్యడం విడిపోకుండానే చేసుకొవచ్చ్చు.కాదు మాకు వేరే అధికార కేంద్రం కావలసిందే తింటే తింటారు తిననియ్యుండ్రి మావాళ్ళేగా మేమేమీ అనం అంటే నేనేమీ చెప్పలేను. ఒకసారి నేనే ఆ జవాబును వారినుంచి పొంది ఉన్నాను:-)

                    నా మనసులో ఉన్న అసలైన భవిష్యత్తు చిత్రపటం యేమిటంటే "జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వమూ ప్రాంతీయ స్థాయిలో జిల్లా ప్రభుత్వాలూ" మాత్రమే ఉండి అవి డైరెక్టు కాంటాక్టులో ఉండాలని. అసలు రాష్ట్రాలే అంతర్ధానమై పొవాలని. జిల్లాలకి అరకొర అధికారాలిచ్చి రాష్ట్రాలనే అంతరువులు అలాగే ఉంటే అవి మళ్ళీ ఇప్ప్పటి దళారి పనులే చేస్తాయి.

                     అప్పటి వార్తాపత్రికల్లో చదివిన గుర్తు. అంతా సిధ్ధం చేసి ఆఖరి దశలో అధికారాల బదలాయింపు దగ్గిర వాయిదా వేసేసి ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉంచేశారు.దానిలో ఉన్న లోపాల్ని సవరించి మరింత ప్రయోజనకరంగా ఉండే రూపానికి తీసుకు రావటమే నా ఈ వ్యాస పరంపర ప్రధాన లక్ష్యం. ఈ మోడల్ని లోపరహితంగా తయారు చేసుకుని ఫాలో అవగలిగీతే యే ప్రాంతం వాళ్ళు వారి ప్రాంతాల లోని బౌగోళిక వనరుల మీద పూర్తి అధికారాన్ని కలిగి ఉంటారు గాబట్టి ప్రస్తుతం ఉన్న రాజకీయ చట్రం కన్నా అది ఖచ్చితంగా మెరుగ్గానే ఉంటుంది.
-----------------------------------------------------------------------------------------------------------------
1 2 3 4 5

Monday 3 March 2014

యే గాడిద వెనక యెక్కినా యేముంది

సీ||   యే గాడిద వెనక యెక్కినా యేముంది
         తన్నులు తప్పవు! కడుపు చించు

         కొని పడు యాష్టయే గాని సుఖ సుఖాన

         ఉండనివ్వరు. అందరందరు తమ

         వైభవాల కొరకు, వ్యవహారములు చక్క

         బెట్టుకొనుటకే భ్రమలను చూపి

         అధికార పీఠముల కెగబాకెడి తుఛ్ఛు

         లే తప్ప కానరారేమి సాధు

తే||   సజ్జనుల రక్ష జేసెడి సాహసులు?అ

         దేమి ఆదికాలమున చేసినట్టు
         అందరికి దేవిభాగమును పంచెడి సక
         లజన హృదయాధి నాధు డొక్కడును లేడు?!
(03/03/2014)
-----------------------------------------------------------------------------------------------------------------
శ్లో|| సంగచ్చద్వం సంవదద్వం
       సంవో మనాసి జానతాం
       దేవీభాగం యధా పూర్వే
       సంజా నానా ఉపాసతే!

ఋగ్వేదం లోని ఈ మంత్రం యొక్క సారాంశ మిది -



"కలిసి నడుద్దాం.కలిసి మాట్లాడుకుందాం.కలిసి మెలిసి ఒకరి మనస్సు లొకరం తెలుసుకుందాం.మన పూర్వులు దేవీభాగాన్న్ని యెలా పంచుకునేవారో అలాంటి జ్ఞానాన్ని ఉపాసింధుదాం!"

దేవీభాగం అంటే - పసిపిల్లలకూ, దంతాలు లేని వృద్ధులకూ మెత్తని మాంసం మొదట ఇవ్వాలి.తర్వాత దౌహృదులకి - రెందు హృదయాలు ఉండే గర్భవతులకి రెట్టింపు మాంసం ఇవ్వాలి.అలా వారందరికీ పంచగా మిగిలిన మాంసాన్ని యువతీ యువకులకీ, జవసత్వాలు గలిగి సంపద పెంచే ఇతరులకీ పెట్టాలి.


ఈ మంత్రం వల్ల - ఆనాటి సాంఘిక వ్యవస్థ తీరు తెన్నులు తెలుస్తున్నాయి."ఓపిన కొద్దీ పని.అవసరం కొద్దీ అనుభవం" అనే ఆదర్శవంతమయిన సామ్యవాదానికి ఆనాటి మానవుడు యెంత దగ్గిరగా వెళ్ళాడో అర్ధం చేసుకోవచ్చు.

Saturday 1 March 2014

ఇక ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక నూతన రాజకీయ ఆర్ధిక వ్యవస్థ కావాలి - 1

                    నేను ఇదివరలో - అంటే బ్లాగుల్లో మొదటిసారిగా కామెంట్లు వెయ్యటం మొదలు పెట్టిన ఆ రోజుల్లో తెలంగాణా ఉద్యమం గురించి - రాష్త్ర విభజన కన్నా అధికార వికేంద్రీకరణ వల్లనే మరింత మేలు జరుగుతుందని -  ప్రతిపాదించాను.కానీ అప్పటికే ఉద్యమం చివరి దశకి వచ్చేసినందువల్ల సరయిన ప్రతిస్పందన రాలేదు. నేను కూడా మరీ అంత గట్టిగా దాని గురించి గట్టిగా ప్రయత్నించలేదు.

                   ఇప్పుడు చారిత్రకంగా ఆంధ్ర ప్రదేశ్ ఒక సంధి కాలం లో ఉన్నట్టు లెక్క.తెలంగాణా ప్రాంతం రాజధానితో కలిసి విడిపోగా మిగిలిన మాతృ రాష్ట్రం వ్యవహారం కోసం సీమాంధ్ర అని అంటున్నా అధికారికంగా ఈ రాష్ట్రం అధికారికంగా తన పాత పేరుతోనే ఉంది.పేరులో సీమను కలపనంత మాత్రాన సీమవాసులను చిన్నబుచ్చినట్టు కాదుగా!తెలంగాణా వారు యేవైతే విడిపోవటానికి కారణాలుగా చెప్పారో(వెనుకబాటు తనం, సాంస్కృతికమయిన అవహేళన, రాజకీయ ప్రాధాన్యత లేకపోవటం) అన్నింటిలోనూ తెలంగాణా వారికన్నా బలమయిన ప్రాతిపదిక ఉన్నా విభజనను వ్యతిరేకించటం లోనూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ప్రయత్నం విఫలమైనా అందులో ముందున్నది సీమ వాసులే.


                    ఉద్యమ కాలంలో ద్వేష భాషని ప్రచారంలోకి తెచ్చిన కొందరు పైత్యకారి వ్యక్తులు మద్రాసు నుంచి తన్నించుకుని వచ్చారని హీనంగా మాట్లాడి, అంతతో ఆగకుండా విభజన పూర్తయి యెవరి బాగును వారు కాంక్షించుకుంటూ హుందాగా ఉండాల్సిన ఈ సమయంలో కూడా - నిన్న తమిళుల చేత మద్రాసు నుంచి తన్నించుకున్నారు, ఇవ్వాళ  మాతో హైదరాబాదు నుంచి గెంటించుకుంటున్నారు, రేపు రాయల సీమ వాళ్ళు మిమ్మల్ని తన్నటానికి సిధ్ధంగా ఉన్నారు - అనే వెక్కిరింతల్ని వొదుల్తున్నారు. ఆ మాటల్ని నిజం చేసేటట్టుగానే ఉన్నాయి ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ నాయకుల విపరీత చేష్టలు.


                    ఇన్నేళ్ళుగా అందరిదీ అనుకున్న బలమయిన రాజధాని దూరమయింది.మొదట కావలసింది ఒక బలమయిన రాజధాని. ఇక్కడ బలమయిన అంటే ఇవ్వాళ హైదరాబాదు లాగా అని కాదు. అప్పటి వాళ్ళు దాన్ని అంతగా పెంచటం వల్లనే ఇవ్వాళ ఈ విపత్కర పరిస్థ్తి యెదురయింది. ఒక్క నగరానికి మాత్రమే అంతగా వాపు లాంటి బలుపుని పెంచకుండా రాష్ట్రంలోని అన్ని నగరాల్నీ సమానంగా పెంచి ఉంటే యెంత బాగుండేది?


                    ఇప్పుడు మళ్ళీ కొత్త రాజధానిని యే ప్రముఖ నగరంలో ఉంచాలనే దాని మీద రాజకీయ నాయకుల నుంచి ప్రచార మాధ్యమాల వరకూ కొత్త హంగామాకు తెర తీశారు.రాజధానికి యేం కావాలి? మొత్తం అన్ని పరిశ్రమలూ అక్కదే కేంద్రీకరించాలా, అన్ని రకాల చెత్త పనులూ అక్కడే చెయ్యాలా?రాజధాని అనేది షోకేసులో బొమ్మా గొప్పగా అలంకరించి అందరికీ చూపించి మెప్పు పొందటానికి?అధికారిక వ్యవహారాల్ని నడిపించే యంత్రాంగం ఉంటే చాలును గద!


                    యెప్పటికయినా మనకు కావలసింది హైదరాబాదు లాంటి తెల్ల యేనుగు కాదు.వీలయినంత తక్కువ హంగులతో కేవలం ప్రభుత్వం నడవటానికి అవసరమయిన వ్యవస్థలు సర్దుకోగలిగీతే చాలు. యెంత త్వరగా రాజధాని సమకూడీతే అంత త్వరగా మనవాళ్ళని మన దగ్గిరకి రప్పించుకోవచ్చు. సాంకేతికంగా మన వాళ్ళు యెంత కాలం హైదరాబాదులో కొనసాగీతే అంత కాలం వారికి పన్నులు కడుతూ ఆ రాష్ట్రానికి అంత కాలం మేలు చేయ్యటమే తప్ప మనకి మేలు జరగదు.వీలయినంత తొందరగా మన వాళ్ళని మన రాష్ట్రంలోకి రప్పించుకోవాలి.మామూలుగా అయితే ఇది - అంటే యే రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలోనే యెదగాలనటం తప్పే, కానీ విభజన అనంతరం మనం రెవెన్యూ లోటులో ఉంటాం. అందువల్ల మొదట మనం మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవటం ముఖ్యం. తర్వాత ఇప్పట్లాగే యెక్కడికయినా పరుగులు పెట్టొచ్చు.


            ఆఖరికి చేపల పెంపకం కేంద్రాలనీ, సునామీ అధ్యయన కేంద్రాన్నీ కూడా హైదరాబాదు లోనే యేర్పాటు చేసి, విశాఖ లోని వాతావరణ కేంద్రాన్ని కూడా హైదరాబాదుకే తరలించాలని చూడటం లాంటి పిచ్చి పనులనే మళ్ళీ కొత్త రాజధానిలో కూడా చెయ్యాలా? ఇప్పుడు మొత్తం 13 జిల్లాలలోని అన్ని ప్రముఖ నగరాల్నీ బలంగా చెయ్యాల్సి ఉండగా మళ్ళీ బలమయిన రాజధాని అనే పేరుతో అదే దుర్నాటకాన్ని యెందుకు నడిపిస్తున్నారు?ప్రచార సాధనాల్ని పోషించటానికి కాకపోతే?


                 యెటు తిరిగీ ఇప్పుడు జరిగిన దాన్నుంచి గుణపాఠం నేర్చుకుని ఉంటే, పరిశ్రమల్నీ వ్యాపారాల్నీ కేవలం రాజధాని లోనే ఉంచకుండా మిగిలిన అన్ని నగరాలకీ వికేంద్రీకరించాలన్న సద్బుద్ది ఇంకా యేర్పడనందువల్లనే ఇలా ఒకో నగరం పేరుతో ఒకో వర్గం వారు లాబీయింగులకి తయారవ్వడం జరుగుతున్నది. దీనిని వెంటనే ఆపి వీలున్నంత తొందరగా రాష్ట్రానికి అన్ని కనీస హంగులతో దృఢమయిన రాజఢానిని యేర్పరుచుకోవాలి.ప్రస్తుతమున్న రెవెన్యూ లోటుని అధిగమించి వీలున్నంత తొందరగా మిగులు రాష్ట్రంగా తయారవ్వాలి.


          ఆకాశంబు నందుండి, శంభుని శిరంబందుండి, శీతాద్రి సుశ్లోకంబయిన హిమాద్రి నుండి -  పవనాంధో లోకమున్ జేరె గంగా కూలంకష:పెక్కు భంగులు వివేక బ్రష్ట సంపాతముల్ అనే పద్యానికి ఉదాహరణగా అనంత కాలాల వరకూ నిలబడాలనుకుంటున్నారా యేంటి  ఆంధ్రా వాళ్ళు?!
-----------------------------------------------------------------------------------------------------------------
1 2 3 4 5

హిందూ ధర్మాన్ని పాషండ మతంలా మార్చేస్తున్న త్రిదండి చిన జియ్యర్ అనే మూర్ఖుణ్ణి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరిమి కొట్టాలి.

శ్రీరామనవమి పేరు ఎత్తగానే ప్రతివారి మనసు పులకించి పోతుంది . కానీ భద్రాచలంలో జరుగుతున్న కళ్యాణం లోని నామ , గోత్ర , ప్రవరలు వింటుంటే మనసు ఎంతో...